రాజా కుటుంబీకుడికి అరుదైన అవకాశం | I have the rare opportunity | Sakshi

రాజా కుటుంబీకుడికి అరుదైన అవకాశం

Jun 1 2014 2:14 AM | Updated on Sep 2 2017 8:08 AM

క్రికెట్‌తో పాటు పోలో తదితర క్రీడల్లో వెంకటగిరి సంస్థానం అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. ప్రధానంగా క్రికెట్‌లో వెంకటగిరి పేరు గతంలోనే మార్మోగింది.

వెంకటగిరి రాజా కుటుంబీకుడు వెలుగోటి వెంకటసత్యప్రసాదకృష్ణ యాచేంద్రకు అరుదైన అవకాశం లభించింది. బంగ్లాదేశ్‌లో పర్యటించే భారత క్రికెట్ జట్టుకు మేనేజర్‌గా బీసీసీఐ నియమించింది. సత్యప్రసాద్ యాచేంద్రగా ప్రాచుర్యం పొందిన ఆయన రంజీ క్రికెట్‌లో లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్‌గా రాణించి మంచి క్రీడాకారుడిగా గుర్తింపుపొందారు. ప్రస్తుతం సౌత్‌జోన్ సెలక్షన్ కమిటీ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. 2008లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
 
 సత్యప్రసాద్ యాచేంద్ర ఇంటర్మీడియట్ విద్యను పుట్టపర్తిలోని బృందావనంలో పూర్తి చేశారు. చెన్నైలో ఎంకాం చదివే సమయంలో క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుని అటుగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన భారత జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించే స్థాయికి చేరుకున్నారు. తమ రాజా కుటుంబీకుడికి అరుదైన అవకాశం లభించడంపై వెంకటగిరి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.          
 
 న్యూస్‌లైన్, వెంకటగిరి : క్రికెట్‌తో పాటు పోలో తదితర క్రీడల్లో వెంకటగిరి సంస్థానం అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. ప్రధానంగా క్రికెట్‌లో వెంకటగిరి పేరు గతంలోనే మార్మోగింది. ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్‌గా దివంగత వెంకటగిరి రాజా వీవీవీఆర్‌కే యాచేంద్ర వ్యవహరించారు. ఇక రాజకుటుంబంలో నేటి తరానికి చెందిన సత్యప్రసాద్ యాచేంద్రతోపాటు 50వ దశకంలో వెలుగోటి గోపాలకృష్ణ యాచేంద్ర రంజీ క్రీడాకారులుగా రాణించారు. వెంకటగిరి సంస్థాన క్రికెట్‌క్లబ్, వెంకటగిరి క్రికెట్ క్లబ్ అనే రెండు క్లబ్‌లను అప్పట్లోనే రాజాలు ఏర్పాటు చేశారు. ఈ క్లబ్‌ల ద్వారా పలువురు క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఎంతోమంది క్రీడాకారులను వెలుగులోకి తీసుకొస్తున్నారు.  పట్టణంలో తారక రామా క్రీడాప్రాంగణం రూపొందించారు. కాగా వెంకటగిరి క్రికెట్ క్లబ్‌కు ప్రస్తుత అధ్యక్షుడిగా సత్యప్రసాద్  యాచేంద్ర కొనసాగుతుండడం విశేషం.  
 
 హర్షణీయం: అనంతరామయ్య, కోచ్  
 - సూరి స్టేడియం పర్యవేక్షకుడు
 వెంకటగిరి సంస్థానం కుచెందిన సత్యప్రసాద్ యాచేంద్ర భారతజట్టు మేనేజర్‌గా నియమితులవడం ఆనందంగా ఉంది. రాజాల కృషితో వెంకటగిరికి చెందిన నేటితరం విద్యార్థులు క్రికెట్ క్రీడలో రాణిస్తున్నారు. రాజాలు వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement