
సాక్షి, అమరావతి: హజ్, జెరూసలేం యాత్రికులకు రాష్ట్రప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని పెంచుతూ మంగళవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ అయ్యాయి. హజ్ యాత్రకు వెళ్లేవారిలో మూడు లక్షల రూపాయల లోపు వార్షికాదాయం ఉన్నవారికి రూ. 60 వేలు, మూడు లక్షలు పైబడి వార్షికాదాయం ఉన్న వారికి రూ. 30 వేలు చొప్పున ప్రభుత్వం సహాయంగా అందజేయనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి మొహద్ ఇలియాస్ రిజ్వి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
హజ్ యాత్రకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేవారు ముందుగా ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలను పూర్తిగా చదవాలని, నిర్ధారిత ఫార్మాట్లో ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. జెరూసలేం, ఇతర బైబిల్ సంబంధిత యాత్రాస్థలాల సందర్శనార్థం వెళ్లే వారికి.. మూడు లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి ప్రస్తుతం అందిస్తున్న రూ. 40 వేల సహాయాన్ని రూ. 60 వేలకు, మూడు లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి ప్రస్తుతం ఇస్తున్న రూ. 20 వేలను రూ. 30 వేలకు పెంచుతున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ వేరొక ఉత్తర్వులో పేర్కొంది.