భూమికోసం..భుక్తికోసం...పీడిత ప్రజల విముక్తికోసం..నైజాం నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరులు త్యాగాలను స్మరిస్తూ మంగళవారం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నారు.
జిల్లావ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవం
Published Wed, Sep 18 2013 4:57 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM
ఖమ్మం, న్యూస్లైన్: భూమికోసం..భుక్తికోసం...పీడిత ప్రజల విముక్తికోసం..నైజాం నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరులు త్యాగాలను స్మరిస్తూ మంగళవారం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నారు. టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ, తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలు, తెలంగాణ జెండాలను ఆవిష్కరించారు. పలుచోట్ల ర్యాలీలు, మానవహారాలు, సభలు సమావేశాలు నిర్వహించారు. నాటి వీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. సాయుధపోరాట యోధుల స్థూపాల వద్ద నివాళి అర్పించారు. వారి త్యాగాల ఫలితంగా సాధించిన హక్కులను గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ ఆధ్వర్యంలో పలుచోట్ల ఆందోళనలు నిర్వహించారు. ఖమ్మంలో ఆందోళన చేస్తున్న ఆ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, దాని అనుబంధ సంఘం పీడీఎస్యూ విమోచన దినాన్ని తెలంగాణ విద్రోహదినంగా పాటించాయి. కమ్యూనిస్టు ఉద్యమాలను అణచివేసేందుకు నాటి నెహ్రూ ప్రభుత్వం పన్నిన కుట్రగా అభివర్ణించాయి.
ఖమ్మంలో డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వనమా వెంకటేశ్వరరావు జాతీయజెండాను ఎగురవేశారు. కేంద్ర మంత్రి బలరాంనాయక్, ఉపసభాపతి మల్లుభట్టి విక్రమార్క పాల్గొన్నారు. జేఏసీ చైర్మన్ కనకాచారి, కూరపాటి రంగరాజు కలెక్టరేట్ ఎదుట జాతీయపతాకం, తెలంగాణ జెండాను ఆవిష్కరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడారు. టీఆర్ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు జెండా ఎగురవేశారు. విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్రెడ్డి సహా పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
పాల్వంచలో వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ సమన్వయకర్త ఎడవల్లి కృష్ణ పార్టీ కార్యాలయం వద్ద జాతీయజెండాను ఎగురవేశారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వీరులకు నివాళులర్పించారు. తెలంగాణ విద్యుత్ జేఏసీ కార్యాలయం వద్ద జాతీయ పతాకం ఎగిరింది. బీజేపీ నాయకులు తహశీల్దార్ కార్యాలయంపై జాతీయజెండాను ఎగురవేశారు.
కొత్తగూడెంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో స్థానిక సెవెన్హిల్స్ ఏరియాలో జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఆర్ఎస్, ఆర్టీసీ, కార్మిక సంఘాలు స్థానిక బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద జాతీయజెండాను ఆవిష్కరించాయి. టీఎన్జీవో కార్యాలయం వద్ద ఆ సంఘం నాయకులు జెండాను ఆవిష్కరించారు. మేదరబస్తీలో టీజేఏసీ జెండాను ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెం సూపర్బజార్ నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.
వైరాలో స్వాతంత్య్ర సమరయోధులను రాజకీయ జేఎసీ ఆధ్వర్యంలో సన్మానించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టాలని పీడీఎస్యూ సదస్సు నిర్వహించింది. జూలురుపాడులో వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీఆర్ఎస్, జనతాదళ్ (ఎస్) సంయుక్త ఆధ్వర్యంలో రెండు ప్రధాన కూడళ్లలో జాతీయ జెండాలను ఎగురవేశారు. కారేపల్లిలో రాజకీయ జేఏసీ, విద్యార్థి జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణకు విమోచనమా.. విద్రోహమా అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.
మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండల కేంద్రంలో ఉన్న రింగ్సెంటర్లో తెలంగాణ, జాతీయ జెండాలను ఎగురవేశారు. చింతకాని మండలం నాగులవంచలో వంకాయలపాటి సీతయ్య మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు సత్యనారాయణ గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించార. ముదిగొండ సీపీఐ కార్యాలయంలో తెలంగాణ పోరాటయోధుడు యరమనేని వెంకటనర్సయ్య చిత్రపటానికి సీపీఐ మండల కార్యద ర్శి రావులపాటి శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇల్లెందు జగదాంబ సెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మహత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, జాతీయ, టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. పలు ప్రభుత్వ కార్యాలయాల పైన జాతీయ జెండాలను ఆవిష్కరించారు. బయ్యారం, గార్ల, కామేపల్లి, టేకులపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్, జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఎన్డీ విద్రోహదినంగా పాటించింది.
సత్తుపల్లిలో టీజేఏసీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐలు వేర్వేరుగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించాయి. స్థానిక రింగ్సెంటర్, రెవెన్యూ గెస్ట్ హౌస్ వద్ద జెండాలను ఎగురవేశారు. వైఎస్ఆర్సీపీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మట్టా దయానంద్, టీజేఏసీ మండల కన్వీనర్ చిత్తలూరి ప్రసాద్, వీఆర్వోల సంఘం అధ్యక్షులు సీహెచ్ కృష్ణ, పీసీసీ జాయింట్ సెక్రటరీ కోటూరి మానవతారాయ్, సీపీఐ జిల్లా కౌన్సెల్ సభ్యులు తాటి వెంకటేశ్వరరావు, బీజేపీ సత్తుపల్లి మండల ప్రధాన కార్యదర్శి కల్లూరి సుబ్బారెడ్డి తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఎగురవేశారు. మణుగూరు మండలంలో జేఏసీ, టీబీజీకెఎస్, టీఆర్ఎస్, న్యూడెమోక్రసీ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో జాతీయజెండాను ఆవిష్కరించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కర్త పాయం వెంకటేశ్వర్లు జెండా ఎగురవేశారు.
భద్రాచలంలో టీజేఏసీ, బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ సబ్కలెక్టర్ కార్యాలయ ఏఓకు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ మైనార్టీస్ ఎంప్లాయీస్ యూనియన్, సీపీఐ, సీపీఎం, వ్యవసాయ కార్మికసంఘాల ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు.
పాలేరు నియోజకవర్గం ఖమ్మంరూరల్ మం డలం నాయుడుపేట బైపాస్రోడ్డు వద్ద పొలిటికల్ జేఏసీ జిల్లా చైర్మన్ కూరపాటి రంగరాజు జాతీయ, తెలంగాణ జెండాలను ఎగురవేశారు. అక్కడి బైపాస్రోడ్డు చౌరస్తాకు తెలంగాణ చౌరస్తాగా నామకరణం చేశారు. కస్తూ ర్భా విద్యార్థినులు మానహారం నిర్వహిం చారు. తిరుమలాయపాల మండల కేంద్రంలో టీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బత్తుల సోమయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. నేలకొండపల్లి మండల ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు.
అశ్వారావుపేటలో టీఆర్ఎస్, టీజేఏసీ, వ్యవసాయ కళాశాల విద్యార్థులు జాతీయ, తెలంగాణ జెండాలను ఎగురవేశారు. దమ్మపేటలో టీజేఏసీ, సీపీఎం ఆధ్వర్యంలో, చండ్రగొండలో టీఆర్ఎస్, ముల్కలపల్లి మండలం సుబ్బనపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
Advertisement
Advertisement