
చంద్రబాబును చిత్తుగా ఓడించండి
- అన్న ఎన్టీఆర్ కల నెరవేర్చాలి...
- విజయం వైఎస్సార్ సీపీదే
- ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కవు
- గతంలోనూ అదే జరిగింది...
- మా అధినేత జగనే ప్రధాన ఆకర్షణ
- గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని)
గుడివాడ, న్యూస్లైన్ : చంద్రబాబు ఆధీనంలోని తెలుగుదేశంను చిత్తుచిత్తుగా ఓడించాలని ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ ఆనాడే పిలుపునిచ్చారని గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ గుడివాడ నియోజకవర్గ కన్వీనర్ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) స్పష్టం చేశారు. గుడివాడ పట్టణంలో గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. నాని మాట్లాడుతూ మహా నేత వైఎస్.రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో ప్రతి గడప లబ్ధిపొందిందని చెప్పారు.
అన్న ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని, పదవిని లాక్కున్న సమయంలోనే ‘ఈద్రోహులు ఉన్న టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించండని’ ఈ రాష్ట్ర ప్రజలకు, ఆయన అభిమానులకు అన్న ఎన్టీఆర్ పిలుపునిచ్చిన విషయాన్ని ఎవరూ మరచిపోలేదని తెలిపారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, షర్మిళ, వైఎస్.విజయమ్మ ప్రచారంతో పార్టీ విజయపథాన దూసుకుపోవడం ఖాయమని చెప్పారు.
కంచుకోట అంటే ఇదేనా?...
గుడివాడ టీడీపీలో బలమైన నాయకులు ఉన్నంత కాలం ఆ పార్టీ కంచుకోటగా ఉందని, నేడు ఆపరిస్థితి లేదని వివరించారు. గతంలో ఎన్టీఆర్కు 6,200 ఓట్లు మాత్రమే మెజార్టీ రావటంతో ఆయన మనస్తాపం చెంది హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహించారని గుర్తుచేశారు. గుడివాడ నియోజకవర్గంలో ఉన్న నందివాడ మండలంలో నేటి వరకు జెడ్పీసీటీ, ఎంపీపీ స్థానాలు టీడీపీ గెలవలేదని గుర్తుచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక గుడివాడ మున్సిపాల్టీలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీనే గెలిచిందని చెప్పారు. కంచుకోట అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.
గతంలో ఈ నియోజకవర్గంలో పీఆర్పీ తరఫున పోటీ చేసి చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించండని రావి వెంకటేశ్వరరావు ప్రచారం చేసిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదన్నారు. బందరు పార్లమెంటు, గుడివాడ వైఎస్సార్సీ పీ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాల అమలు సాధ్యమని అన్నారు. పార్టీ నేతలు యలవర్తి శ్రీనివాసరావు, దుక్కిపాటి శశిభూషణ్, మరీదు కృష్ణమూర్తి, మండలి హనుమంతరావు పాల్గొన్నారు.