
రైతులకు ద్రోహం చేస్తున్న బాబు
- వైఎస్ఆర్సీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలతో రైతుల జీవితాల్లో అంధకారం నెలకొంటోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం చేతకాక రుణ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.
ఆదివారం అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం వ్యవసాయానికి మాత్రమే 7 శాతం వడ్డీకి రుణాలు ఇస్తోందన్నారు. గడువులోగా సక్రమంగా రుణాలు చెల్లిస్తే 4 శాతమే వడ్డీ వసూలు చేస్తోందన్నారు. ఏపీలో 82 లక్షల కుటుంబాలు రుణాలు తీసుకుంటే, అందులో 40 లక్షల కుటుంబాలు మాత్రమే వ్యవసాయానికి రుణాలు తీసుకున్నాయని, తక్కిన వారంతా వ్యవసాయం కోసం రుణాలు తీసుకోలేదని సీఎం చేసిన వ్యాఖ్యలతో రైతులకు కొత్త చిక్కులు తలెత్తుతున్నాయన్నారు.
అంతటితో ఆగకుండా 22 లక్షల కుటుంబాలే రుణమాఫీకి అర్హత సాధించాయని ప్రభుత్వం తేల్చిందని వివరించారు. పైగా జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 32 లక్షల రైతు కుటుంబాలే ఉంటే, 82 లక్షల మందికి ఎలా రుణాలు ఇచ్చారని చంద్రబాబు ప్రశ్నించి బ్యాంకర్లను చిక్కుల్లో పడేశారన్నారు. ప్రభుత్వమే ఇలా వ్యాఖ్యలు చేస్తే ఇకపై కేంద్రం రైతులకు 7శాతం వడ్డీ రుణాలు రద్దుచేసే ప్రమాదముందన్నారు.
బాబు చెబుతున్న స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా కొత్త చిక్కులు తెచ్చిపెడుతోం దని ‘అనంత’ విమర్శించారు. రైతులు తీసుకున్న రుణా ల్లో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే ప్రభుత్వం రుణాలు చెల్లిస్తామంటోందన్నారు. వారి లెక్క ప్రకారం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కంటే ఎక్కువ రుణాలు తీసుకున్న రైతులూ అనర్హులే అన్నారు. రాయలసీమలో ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతుల శ్రేయస్సుతోపాటు బ్యాంకర్లు పెట్టుబడి కోసం రుణాలు ఇచ్చారన్నారు.
అయితే అధికంగా రుణాలు తీసుకున్నందుకు రైతులను దొంగలుగా, బ్యాంకర్లను దోషులుగా బాబు చిత్రీకరిం చారన్నారు. ఈ ప్రభావం పంటలబీమాపై కూడా పడుతుందన్నారు. రుణమాఫీ సంగతి దేవుడెరుగు... చంద్రబాబు వ్యాఖ్యలు భవిష్యత్తులో రైతులను నట్టేటముం చేందుకు తోడ్పడుతున్నాయని మండిపడ్డారు.