పాఠకుల కోరిన పుస్తకాలను గ్రామాల్లోని గ్రంథాలయాలకు అందించేందుకు జిల్లా గ్రంథాలయ సంస్థ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.
కర్నూలు(కల్చరల్), న్యూస్లైన్: పాఠకుల కోరిన పుస్తకాలను గ్రామాల్లోని గ్రంథాలయాలకు అందించేందుకు జిల్లా గ్రంథాలయ సంస్థ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. మారుమూల పల్లెల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ అభ్యర్థులు ఖరీదైన మెటీరియల్ కొనలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారి కోసం జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రస్తుతం ఆన్లైన్లో ఆన్డిమాండ్ అనే పుస్తక సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించింది.
జిల్లాలోని ఏ ప్రాంతం నుంచైనా కంప్యూటర్ ద్వారా ఆన్లైన్లో అవసరమైన రెఫరెన్స్ పుస్తకాల పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం http://public libraries.ap.nic.in అనే వెబ్సైట్ను ప్రారంభించామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేగిరెడ్డి వెంకటరమణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వెబ్సైట్లోని ప్రొఫార్మాలో పాఠకులు తమకు అవసరమైన పోటీ పరీక్షల పుస్తకాలు, రెఫరెన్స పుస్తకాల వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ఆయా పుస్తకాలను మండల కేంద్రాల్లోని శాఖా గ్రంథాలయాలకు ఎప్పటికప్పుడు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. పాఠకులు, పోటీ పరీక్షల అభ్యర్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.