
సాక్షి, అమరావతి: అమెరికాలోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనిపిస్తోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్ న్యూజెర్సీలో జరిగిన ఎన్నారై టీడీపీ సమావేశంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.
మంత్రి అమెరికా పర్యటన వివరాలను ఆయన కార్యాలయం ఆదివారం మీడియాకు విడుదల చేసింది. కార్యకర్తల సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ ‘మీ ఉత్సాహం చూస్తుంటే అమెరికాలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనిపిస్తోంది’అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. 67 ఏళ్ల వయస్సులో 24 ఏళ్ల కుర్రాడిలా ముఖ్యమంత్రి పని చేస్తున్నారన్నారు. అందుకే ప్రపంచంలోని ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని తెలిపారు.