
ఇరకాటంలో మిర్చి రైతు
లెసైన్సులు రెన్యువల్ కాకుండానే కమీషన్ ఏజెంట్ల వ్యాపారం
గుంటూరు యార్డుకు జమ కాని లక్షలాది రూపాయలు
సాక్షి, గుంటూరు: గుంటూరు మిర్చియార్డులో మొత్తం 582 మంది కమీషన్ ఏజెంట్లు లెసైన్సులు కలిగి ఉన్నారు. ఇందులో 193 మంది ఏజెంట్ల లై సెన్సుల కాలపరిమితి 2013 మార్చి 31తో ముగిసింది. వీరందరూ ఐదేళ్లకు ఒకేసారి లెసైన్సు ఫీజు చెల్లించి రెన్యువల్ చేయించుకోవాలి. అయితే కమీషన్ ఏజెంట్ల భాగస్వామ్య బదిలీల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం రెన్యువల్స్ను నిలిపివేసింది. ఇందుకు బాధ్యు లుగా పేర్కొంటూ 11 మంది మార్కెటింగ్ సూపర్వైజర్లను కూడా సస్పెండ్ చేసింది. ఆ తరువాత యార్డు అధికారులు జనవరి రెండో వారంలో 16వ తేదీ నుంచి ఆ 193 మంది జరిపే మిర్చి వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. సంకట స్థితిలో పడిన కమీషన్ ఏజెంట్లు తమ వ్యాపారాలకు ఎటువంటి ఇబ్బందులు కలుగజేయవద్దంటూ ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్నారు. దీన్ని గుర్తించిన మార్కెటింగ్శాఖ అధికారులు నెల రోజుల పాటు వ్యాపారానికి అనుమతి ఇచ్చారు.
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. అయితే లెసైన్సు రెన్యువల్ చేసుకోని కమీషన్ ఏజెంట్లకు మిర్చిని విక్రయించే విషయంలో కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. లెసైన్సులు రెన్యువల్ జరగని కమీషన్ ఏజెంట్ల వద్ద మిర్చిని విక్రయిస్తే భోజన టోకెన్లు ఇస్తారో, లేదోనన్న అనుమానం కూడా కొందరు రైతుల్లో ఉంది. రెన్యువల్ లేని వ్యాపారుల వద్ద కూడా రశీదు పుస్తకాలు ఉండటం, బిల్లులు, హమాలత్ పట్టీలు రాయడం మామూలుగానే జరుగుతుంది. కాకపోతే మార్కెటింగ్ శాఖకు లెసైన్సుల ఫీజు కింద లక్షలాది రూపాయలు జమ కాకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. మార్కెట్యార్డు చరిత్రలో ఈ విధంగా ఎప్పుడూ జరగలేదు.
రైతులకు ఇబ్బంది ఉండకూడదనే...
వాస్తవంగా లెసైన్సులు రెన్యువల్ చేయించుకున్నాకనే కమీషన్ ఏజెంట్లు యార్డులో వ్యాపారాలను కొనసాగించాలనీ, రైతులకు ఇబ్బంది కలగ కూడదన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం నెల రోజుల పాటు వీరికి అనుమతి ఇచ్చినట్లు మిర్చియార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి నరహరి తెలిపారు. లెసైన్సుల రెన్యువల్ విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు.