హైదరాబాద్ మొదటి నుంచి తెలంగాణలో అంతర్భాగమేనని టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు.
హైదరాబాద్/నిజామాబాద్,న్యూస్లైన్: హైదరాబాద్ మొద టి నుంచి తెలంగాణలో అంతర్భాగమేనని టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. సోమవారం హైదారబాద్లోని జేఎన్టీయూహెచ్ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థివిభాగం ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ కార్యక్రమంలో, నిజామాబాద్లో జరిగిన టీఎన్జీవోల రణభేరిలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తే ఇన్నేళ్ల ఉద్యమానికి అర్థంలేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ను వదులుకునే ప్రసక్తేలేదన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టకుండా కాలయాపన చేయడం వెనుక పాలక, ప్రతిపక్షాల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసి 50రోజులు గడుస్తున్నా ఒక అడుగుకూడా కేంద్రం ముందుకు పోలేదన్నారు.
దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. కేంద్రం ఏ మాత్రం వెనుకడుగు వేసినా, హైదరాబాద్ను యూటీ అన్నా యుద్ధం తప్పదని హెచ్చరించారు. ఈనెల 29న హైదరాబాద్లో జరుపతల పెట్టిన సకల జనుల భేరీని విజయవంతం చేయడానికి అన్ని జిల్లాలలో సభలు నిర్వహిస్తున్నామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్బాబు ఒక్కటేనన్నారు. చంద్రబాబు తయారు చేసిన స్క్రిప్ట్ను ఆశోక్బాబు అమలు పరుస్తారని విమర్శించారు. ఏపీఎన్జీవోల సభలకు సర్కారే కొమ్ము కాస్తోందని, నిర్వహణ ఖర్చు భరిస్తోందని, సీమాంధ్ర ఉద్యోగులకు బిర్యానీ, మినరల్వాటర్ ప్యాకెట్లు పంచి పెడుతోందనీ ఆరోపించారు.