
ఏవోబీ కటాఫ్ ఏరియాలో కూంబింగ్కు వెళ్తున్న పోలీసు బలగాలు
విశాఖపట్నం, సీలేరు: మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు అగ్ర నేతల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. ఈ విషయం విశాఖ ఏజెన్సీ ఆంధ్రా, ఒడిశా, చత్తీస్గఢ్ మా వోయిస్టు పార్టీలో ఇపుడు పెద్ద చర్చాంశనీయమైంది. మావోయిస్టు పార్టీని ఒంటిచేత్తో నడిపిస్తూ ఎక్కడికక్కడ వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్ను తూ ఏవోబీలో మావోయిస్టు పార్టీని ముందుకు నడిపిస్తున్న ఆ పార్టీ అగ్రనేతలుగా పేరుగాంచిన చలపతి, అరుణ, నవీన్ పోలీసుశాఖకు ప్రస్తుతం కీలకమయ్యారు. వారిని ఎలాగైనా పట్టుకోవాలనే లక్ష్యంతో మూడు రాష్ట్రాల పోలీసుశాఖ ఉన్నతాధికారులు, వందలాది మంది బలగాలు ఏవోబీ కటాఫ్ ఏరియాలో జల్లెడ పడుతున్నారు. కూంబింగ్ను ముమ్మరం చేశారు.
వారి జాడ కోసం అణువణువూ గాలింపు చర్యలు చేపడుతున్నారు. మావోయిస్టు అగ్రనేత కుడుముల రవి ఏడాదిన్నర కిందట మృతి చెందిన నాటి నుంచి నిన్నటి వరకు అగ్రనేతలను ఎన్కౌంటర్ చేసి హతమార్చాయి. రాంగుడ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ ఉద్యమం కాస్త సన్నగిల్లిందని పోలీసులు భావించారు. అయితే అక్కడికి కొద్ది రోజుల్లోనే ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపారు. ఆ సంఘటన తీరని మచ్చగా పోలీసుశాఖ మీద పడింది. ఆ సంఘటనలో పైముగ్గురు కీలకపాత్ర పోషించారని, పక్కా వ్యూహం పన్ని ఇద్దరు ప్రజా ప్రతినిధులను హతమార్చారని ఇంటెలిజెన్స్ ద్వారా పోలీసుశాఖకు సమాచారం ఉంది. అప్పటి నుంచి ఆ ముగ్గురిపైనే బలగాలు దృష్టిసారించాయి. ఎలాగైనా వారిని పట్టుకోవాలని రేయింబవళ్లు అడవుల్లో జల్లెడ పడుతున్నారు.
ఇదిలా ఉండగా గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి ఘటనలు జరగకుండా నిరంతరం కూంబింగ్ నిర్వహించారు. అప్పటి నుంచి కటాఫ్ ఏరియాలో కూంబింగ్ను కొనసాగిస్తున్నారు. ఆంధ్రా నుంచి గ్రేహౌండ్స్, స్పెçషల్ పార్టీ, సీఆర్పీఎఫ్, ఒడిశా నుంచి ప్రత్యేక బలగాలతో ముగ్గురు అగ్రనేతల కోసం గాలించని ప్రదేశం, తిరగని అడవి లేదు. అయితే ఈ మధ్య కాలంలో ఆ ముగ్గురు మావోయిస్టులు ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో దగ్గరి గ్రామాల్లో సంచరిస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ క్రమంలోనే మొన్నటిìకి మొన్న కొయ్యూరు సరిహద్దు ఒడిశా ప్రాంతమైన పాడువాలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో కిడారిని చంపిన మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారని ఒడి శా పోలీసుశాఖ ప్రకటించింది. పోలీసుశాఖకు తలనొప్పిగా మారిన చలపతి, అరుణ, నవీన్లను ఎలాగైనా పట్టుకోవాలని పోలీసుశాఖ కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే ఏవోబీలో కొద్ది రోజులుగా ప్రత్యేక పోలీసు బలగాలు పక్కా వ్యూహంతో కూంబింగ్ చేపడుతున్నాయి.