ఎంసెట్‌కు ప్రైవేటు కాలేజీల ఎసరు! | Private colleges eamcet Council | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌కు ప్రైవేటు కాలేజీల ఎసరు!

Published Wed, May 28 2014 1:13 AM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM

Private colleges eamcet Council

ప్రత్యేక ఉమ్మడి పరీక్ష నిర్వహణకు కసరత్తు

హైదరాబాద్: ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏకంగా ఎంసెట్‌కు ఎసరు పెట్టాయి. అంతేకాదు ఐసెట్, ఈసెట్ వంటి ఉమ్మడి ప్రవేశ పరీక్షల ఉనికినీ ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి. మేనేజ్‌మెంట్ కోటా సీట్లనే కాదు ఇకపై కన్వీనర్ కోటానూ ఇష్టారాజ్యంగా భర్తీ చేసుకునేందుకు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. ఇందుకు ఎంసెట్ స్థానంలో ‘ప్రైవేటు’గా ఉమ్మడి ప్రవేశ పరీక్షకు తెరలేపాయి. ప్రస్తుతం ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం మైనారిటీ కాలేజీలు ప్రత్యేక ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నాయి. ఈ విధానాన్నే ఇకపై అన్ని ప్రైవేట్ కాలేజీలూ పాటించనున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇందుకు ప్రభుత్వ వర్గాలు కూడా ఆమోదం తెలిపాయి. ఈ మేరకు మంగళవారం జరిగిన ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్‌సీ) సమావేశంలో అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడటమే తరువాయి. ఆ వెంటనే ఈ విధానం అమల్లోకి రానుంది. దీంతో కన్వీనర్ కోటా సీట్లను కూడా ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా భర్తీ చేసుకునేందుకు వీలు చిక్కుతుంది. ఇప్పటికే 50కిపైగా ప్రైవేట్ కాలేజీలు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించుకునేందుకు అంగీకార పత్రాలు అందజేయగా మరిన్ని కాలేజీలు ఇదే బాటలో ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం 715 ఇంజనీరింగ్ కాలేజీల్లో 650కిపైగా ప్రైవేటు కాలేజీలే ఉన్నాయి.

వాటిల్లో కన్వీనర్ కోటాలోని 70 శాతం సీట్లను ప్రస్తుతం ఎంసెట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మేనేజ్‌మెంట్ కోటా సీట్లు మాత్రం జేఈఈ మెయిన్స్ మెరిట్, ఎంసెట్ మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తున్నారు. అప్పటికీ సీట్లు నిండకపోతే ఇంటర్ మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తున్నారు. అయితే గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్‌లో అడ్మిషన్లు ఇచ్చేందుకు మైనారిటీ కాలేజీలకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో నాన్ మైనారిటీ కాలేజీలు కూడా ఇదే విధానం కోసం పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మంగళవారం జరిగిన ఏఎఫ్‌ఆర్‌సీ సమావేశంలో కన్వీనర్ కోటాలోని 70 శాతం సీట్లనూ యాజమాన్యాల కన్సార్షియం నిర్విహ ంచే ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేసుకునేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు.

నియంత్రణ గాలికే..

ప్రైవేటు కాలేజీలే సొంతంగా ప్రవేశ పరీక్ష నిర్వహించుకుని ప్రవేశాలు చేపడితే నియంత్రణ కొరవడుతుందనే వాదనలు ఉన్నాయి. ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో ప్రత్యేకంగా నియమించే కన్వీనర్ ద్వారా పకడ్బందీగా ఎంసెట్ పరీక్ష నిర్వహించి, సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలో కేంద్రీకృత విధానంలో 70 శాతం కోటా సీట్లకు పక్కాగా ప్రవేశాలు చేపడుతున్నప్పటికీ కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు కాలేజీలు నిర్వహించే పరీక్షకు శాస్త్రీయత ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రశ్నపత్రాలు లీకయ్యే అవకాశం ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేట్ విద్యా సంస్థలు తమకు నచ్చిన వారికి, డబ్బు ఎక్కువ ఇచ్చే వారికి ప్రశ్నలు లీక్ చేసి పరీక్ష నిర్వహించే ప్రమాదం ఉంటుందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ఎంసెట్ కోసం రూపొందించిన ప్రశ్నపత్రాల సెట్లలో ఇటీవల వినియోగించని సెట్‌ను తీసుకొని పరీక్ష నిర్వహించాలని మంగళవారం నాటి సమావేశంలో అధికారులు సూచించినా యాజమాన్యా లు అందుకు అంగీకరించలేదని సమాచారం. తమకు సమయమిస్తే 15 రోజుల్లో పరీక్ష నిర్వహించుకుంటామని పేర్కొన్నట్లు తెలిసింది. కాగా, యాజమాన్యాలు ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టేందుకు కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిందని ప్రైవేటు యాజమాన్యాలు చెబుతున్నాయి. ఏఎఫ్‌ఆర్‌సీ కూడా గతంలోనే ఈ నిర్ణయం తీసుకుందని, ఇపుడు కొత్తగా తీసుకున్నదేమీ కాదని పేర్కొంటున్నాయి. దీంతో ఈసారి ప్రైవేట్ కాలేజీలకు ప్రత్యేక పరీక్ష విధానం పక్కాగా అమల్లోకి వచ్చే అవకాశముంది.
 
విశ్వసనీయతను పెంచుకోవాలి

ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అందుకే ప్రత్యేక పరీక్ష విధానాన్ని అమలు చేయాల్సి వస్తోంది. అయితే వారు ఎలా చేస్తారన్నది చూడాలి. ముందుగా వారి విశ్వసనీయతను పెంపొందించుకోవాల్సి ఉంటుంది. చూస్తేగాని అర్థంకాదు. వారికి ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశాలు చేసుకోవాలనే ఆలోచన ఉంది. ఎన్ని కాలేజీలు పరీక్షకు సిద్ధం అవుతాయనేది తేలాల్సి ఉంది. కన్వీనర్ కోటా సీటు వస్తుందనే నమ్మకం ఉన్న విద్యార్థులు ప్రభుత్వ సెట్స్ రాస్తారు . - ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్
 
ఇక ప్రభుత్వ కాలేజీలకే ఎంసెట్!

ఈ విధానం పక్కాగా అమల్లోకి వస్తే ప్రభుత్వ కాలేజీల్లో సీట్ల కోసమే ఎంసెట్ తదితర సెట్స్ రాయాల్సి వస్తుంది. ఇది ప్రమాదకర పరిస్థితే. అయితే అది విజయవంతం కాకపోవచ్చు. మేనేజ్‌మెంట్ కోటా భర్తీకి కూడా ప్రత్యేక పరీక్షకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక పరీక్ష ద్వారా ఆ కాలేజీల్లో చేరితే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం సాధ్యంకాకపోవచ్చు.
 ప్రొఫెసర్ ఎంవీ రమణారావు, ఎంసెట్ కన్వీనర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement