అవాక్కయ్యారు..! | Shocked | Sakshi
Sakshi News home page

అవాక్కయ్యారు..!

Aug 17 2015 2:35 AM | Updated on Sep 29 2018 6:00 PM

అవాక్కయ్యారు..! - Sakshi

అవాక్కయ్యారు..!

డ్వాక్రా గ్రూపు సభ్యులు మరోసారి మోసపోయారు. ఇసుక రీచ్‌ల్లో వచ్చిన ఆదాయాన్ని సభ్యులకు పంచి

డ్వాక్రా మహిళలకు అత్తెసరుగా ఇసుక ఆదాయం
రుణ మాఫీ తరహాలోనే పంపిణీ ఉందంటూ పెదవి విరుపు
 
 సాక్షి ప్రతినిధి, గుంటూరు : డ్వాక్రా గ్రూపు సభ్యులు మరోసారి మోసపోయారు. ఇసుక రీచ్‌ల్లో వచ్చిన ఆదాయాన్ని సభ్యులకు పంచి వారి అభ్యున్నతికి కృషి చేస్తామని ప్రతీ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేసుకొంటున్నారు. దానికనుగుణంగా తమకు భారీ ఆదాయం వస్తుందని సభ్యులు ఆశపడ్డారు. రీచ్‌ల్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలను చూసి, ప్రభుత్వం పంచనున్న ఆదాయాన్ని ఊహించుకుని ఊహల్లో విహరించారు. వీటికి భిన్నంగా సంవత్సర కాలానికి రూ.800 లోపే ఆదాయం లభించడంతో సభ్యులు బిత్తరపోతున్నారు. డ్వాక్రా రుణాల రద్దు హామీ తరహాలోనే రీచ్‌ల్లోని ఆదాయం పంపిణీ ఉందని సభ్యులు పెదవి విరుస్తున్నారు.

 జిల్లాలో కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లోని తొమ్మిది రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, తెనాలి నియోజకవర్గాల్లో ఈ రీచ్‌లు కొనసాగుతున్నాయి. కొన్ని రీచ్‌లు సంవత్సరం క్రితం  మరి కొన్ని ఐదారు నెలల కిందట ప్రారంభమయ్యాయి.  సంవత్సరం క్రితం ప్రారంభమైన రీచ్‌ల్లో ప్రభుత్వానికి లభించిన ఆదాయం నుంచి డ్వాక్రా గ్రూపులకు కొంత మొత్తాన్ని కేటాయించారు. దీన్ని లెక్క చూస్తే ఒక్కో సభ్యునికి నామమాత్రంగానే ఆదాయం సమకూరుతోంది.

 డ్వాక్రా గ్రూపులకు లభించిన ఆదాయ వివరాలు ...
     తాడేపల్లి మండలం ఉండవల్లి రీచ్‌లో సంవత్సరకాలంగా డ్వాక్రా గ్రూపు సభ్యులు పనిచేస్తున్నారు. జూలై నెలాఖరునాటికి 2.40 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయించగా రూ. 15.60 కోట్లు ఆదాయం లభించింది. ఒక్కో క్యూబిక్‌మీటరుకు రూ.5 చొప్పున డ్వాక్రా గ్రూపు సభ్యులకు రూ.12 లక్షల ఆదాయాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఉండవల్లి గ్రామంలోని 720 గ్రూపులకు చెందిన 1740 మంది సభ్యులు ప్రభుత్వం కేటాయించిన ఆదాయాన్ని పంచుకుంటే ఒకొక్కరికి రూ.690లు లభించనుంది.

     అమరావతి మండలం మునగోడు ఇసుక రీచ్ నవంబరు నుంచి కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1.60లక్షల క్యూబిక్ మీటర్లు విక్రయించారు. సభ్యులకు ఒక్కో క్యూబిక్ మీటర్‌కు 5 రూపాయల చొప్పున డ్వాక్రా గ్రూపు సభ్యులకు రూ.8 లక్షల ఆదాయం లభించనుంది. 500 సభ్యులు మునగోడు గ్రూపులో ఉంటే, ఒకొక్కరికి రూ.1600 ఆదాయం లభించనుంది.

     అచ్చంపేట మండలం కస్తల గ్రామంలో 38 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. ఇక్కడి రీచ్‌లో నవంబరు నుంచి తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన 2.43 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఈ రీచ్‌లో తవ్వారు. క్యూబిక్ మీటరుకు రూ.5 చొప్పున రూ.12.15 లక్షల ఆదాయాన్ని గ్రూపులకు కేటయించారు.

     కోనూరు గ్రామంలో 72 డ్వాక్రా సంఘాలున్నాయి. 2.49 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వడానికి అనుమతి ఉండగా 1.90 క్యూబిక్‌మీటర్ల ఇసుక తవ్వకాలు పూర్తిచేశారు. క్యూబిక్‌మీటరుకు రూ.5 చొప్పున రూ. 9.5 లక్షలు అదాయం గ్రూపునకు లభిస్తే, ఒక్కో సభ్యునికి రూ.1319 ఆదాయం లభించనుంది.

 ఇసుక రీచ్‌ల నుంచి తమకు నామమాత్రంగానే ఆదాయం లభిస్తోందని, వాహనాల రద్దీ, పొల్యూషన్ సమస్యలు తమను వెన్నాడుతుంటే ప్రభుత్వం మాత్రం కోట్లాది రూపాయాల ఆదాయాన్ని పొందుతోందని, రీచ్‌లు ఉన్న ప్రాంతాల గ్రూపులకు ప్రాధాన్యత ఇచ్చి లాభం శాతం పెంచాలని సభ్యులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement