బాసరలో ఎస్పీ ఆరా | sp enquires in basara about murder case | Sakshi
Sakshi News home page

బాసరలో ఎస్పీ ఆరా

Published Mon, Aug 19 2013 4:37 AM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM

sp enquires in basara about murder case

 ముథోల్/బాసర, న్యూస్‌లైన్ : బాసరలో ముగ్గురు హత్యకు గురైన సంఘటన స్థలాన్ని ఆదివారం ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి పరిశీలించారు. వ్యాపారి ఇంట్లో జరిగిన ఘాతుకం తెలుసుకునేందుకు భైంసా డీఎస్పీ దేవిదాస్ నాగులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. వ్యాపారి అశోక్ దంపతుల హతమార్చిన స్థలాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ద్వారం వద్ద పొడవాటి కట్టెను స్వాధీనం చేసుకున్నారు. కట్టెతో తలపై మోది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కట్టెకు ఒక వైపున రక్తపు మరకలు ఉన్నాయి. అనంతరం ఒకటవ అంతస్తులోకి వెళ్లి ఎస్పీ అక్కడ పనిచేసే వారితో పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
 
 రక్షణ కల్పించండి..
 శారదానగర్‌కు వచ్చిన ఎస్పీ త్రిపాఠిని రక్షణ కల్పించాలంటూ కాలనీవాసులు విన్నవించుకున్నారు. ఇలాంటి సంఘటనలతో తమకు ఏమి తోచడం లేదని వారంతా గోడు వెళ్లబోసుకున్నారు. కాలనీలో ఉండేవారంతా ఐక్యంగా ఉండాలని పోలీసుల సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. కాలనీలో ఐక్యంగా ఉంటూ పోలీసులకు సహకరించాలన్నారు. అనంతరం బాసర పోలీసు స్టేషన్‌కు చేరుకుని పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
 
 ట్రిపుల్ ఐటీ సందర్శన..
 జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి బాసర ట్రిపుల్ ఐటిని సందర్శించారు. కళాశాలలో ర్యాగింగ్‌లాంటివి జరగకుండా కళాజాత ప్రదర్శనలతో విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని డీఎస్పీ దేవిదాస్ నాగులను ఆదేశించారు. ఈ సందర్భంగా బాసరలో చదివే విద్యార్థులు ట్రిపుల్‌ఐటిలో పోలీసు ఔట్ పోస్టింగ్ ఏర్పాటు చేయించాలని ఎస్పీని కోరారు. ట్రిపుల్ ఐటీలో చదివే విద్యార్థులకు పోలీసుల సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఈ విషయం పై దృష్టిపెడతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement