ప్రైవేటు బస్సులపై కొరడా | strictly checking on private buses | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బస్సులపై కొరడా

Published Fri, Nov 1 2013 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM

strictly checking  on private buses

సాక్షి, సంగారెడ్డి:  మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమై 45 మంది ప్రయాణికులు మృతి చెందిన ఘటన నేపథ్యంలో రవాణా శాఖ మేల్కొంది. గురువారం ఉదయం 04 - 08 గంటల మధ్య రవాణా శాఖ అధికారులు జిల్లాలో ప్రైవేటు బస్సులపై అకస్మిక దాడులు జరిపారు. జహీరాబాద్, చిరాగ్‌పల్లి, కంది చెక్‌పోస్టుల వద్ద బస్సులను నిలిపి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. రవాణా పర్మిట్లు, ఇన్స్యూరెన్స్, ప్రయాణికుల సంఖ్య, డ్రైవర్ లెసైన్స్ తదితర  అంశాలను పరిశీలించారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ మమతా ప్రసాద్ నేతృత్వంలో 15 మంది మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ దాడుల్లో పాల్గొన్నారు. సుమారు 70 బస్సులను తనిఖీ చేశారు. అధికారుల కన్నుగప్పి తనిఖీలను తప్పించుకోవడానికి జహీరాబాద్ చెక్‌పోస్టు మీద నుంచి కాక చిరాగ్‌పల్లి మీదుగా ఎక్కువగా ప్రైవేటు బస్సులు వెళ్తుంటాయి.

ఈ నేపథ్యంలో ఇక్కడ జరిపిన సోదాల్లో పరిమితికి మించిన ప్రయాణికులతో ముంబయి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న అక్బర్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సును అధికారులు సీజ్ చేశారు. ప్రయాణీకులను పటాన్‌చెరువద్ద దింపేసి ఆ బస్సును సంగారెడ్డి మండలం కందిలోని డీటీసీ కార్యాలయానికి తరలించారు. బస్సు సీటింగ్ సామర్థ్యం డ్రైవర్‌తో సహా 37 ఉండగా మరో 5 మంది ప్రయాణీకులను అధికంగా కలిగి ఉన్నట్లు తనిఖీల్లో గుర్తించారు. ప్రయాణికుల వివరాలను సైతం రిజిస్టర్‌లో నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో బస్సు యజమానిపై క్రిమినల్ కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. డ్రైవర్ యూనిఫాం వేసుకోకపోవడం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడం లాంటి స్వల్ప ఉల్లంఘనలతో పట్టుబడిన మరో రెండు బస్సులపై జరిమానాలు విధించి వదిలేశారు. ఇకపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తామని డీటీసీ మమతా ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement