
బద్ధకం వదలండి
- యువతకు తనికెళ్ల భరణి పిలుపు
యండమూరి నాకు పెద్ద శత్రువు. నాటకంలో, రచనలో ఆయనతో నేను నిత్యం పోటీ పడేవాడిని. ఒక విధంగా చెప్పాలంటే అతనిపై కక్షతోనే నేను రచయితనయ్యాను. చివరకు యండమూరి దర్శకత్వంలో వచ్చిన చిత్రానికి కొన్ని డైలాగులు రాసే అవకాశం కలిగింది. ఈరోజు అతని పుస్తకాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నాను.
ఏయూ క్యాంపస్: యువత బద్ధకం వీడి కార్యోన్ము ఖులు కావాలని ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం ఏయూ లో జరిగిన యండమూరి వీరేంద్రనాథ్ ‘లోయ లోంచి శిఖరానికి..’ పుస్తకావిష్కరణ సభలో ఆయన ప్రసంగించా రు. భరణి మాటల తూటాలు... ఇటు తల్లి దండ్రులను, అటు విద్యార్థులను ఆలోచింపజేశాయి.
మేలుకొలుపు
నేను తప్ప మా ఇంటిలో అందరూ గోల్డ్ మెడలిస్ట్లే. కళాశాల చదువు అయిపోయాక తెలుసుకున్నాను నేను బాగా చదవలేదని. ‘ఆలస్యంగా లేచి పైకొచ్చిన వాడిని నేను చూడలేదు’ అనే కొటేషన్ నన్ను ఎంతగానో మార్చివేసింది. ఉదయాన్నే నిద్ర లేవడాన్ని అలవాటుగా చేసుకుంటే ఎంతో సమయం మనకు కలసి వస్తుంది. దయచేసి దీనిని ఆచరించి చూడండి.
గీతాసారం వ్యక్తిత్వ వికాస కేంద్రం
భగవద్గీత అరవయ్యో ఏట చదవాల్సిన గ్రంథమనుకోవడం పొరపాటు. ఇది కచ్చితంగా 16వ ఏట పఠించాల్సినది. మన భారతీయ హైందవ మూలం నుంచి ఉద్భవించిన భగవద్గీత ఎన్నో వ్యక్తిత్వ వికాస సూత్రాలకు కేంద్రంగా నిలుస్తుంది. ఎవరో కాలం చేసినపుడు వినాల్సినదిగా భావించడం ఎంతమాత్రం భావ్యం కాదు.
అమ్మా నాన్నలను మరవొద్దు
తల్లిదండ్రులు పిల్లలతో స్నేహితులుగా మెలగాలి. మగ, ఆడ పిల్లలను సమానంగా చూడాలి. వివక్ష ఉండటం సరికాదు. ప్రొడక్టివ్గా, యూజ్ఫుల్గా బతకడానికి ప్రయత్నించండి. పదో తరగతి వరకు చెప్పులు లేకుండానే తిరిగాను. మధ్యతరగతి కుటుంబ కష్టాలు బాగా తెలిసిన వాడిని. అమ్మా అన్నం తిన్నావా అని ఒక్క రోజు అడగండి చాలు. వేరొకరికి పెట్టడానికి పుట్టిందే అమ్మ అనే విషయం మరువకండి. మన కోసం రాత్రింబవళ్లు పనిచేసే నాన్న కష్టం తెలుసుకుని చదివి ఉన్నతంగా రాణించండి.