writer
-
నాకు నచ్చిన పాత్ర విమల
నచ్చటం అనేది నిరపేక్ష అంశం కాదు. ప్రత్యేకించి సాహిత్య పాత్రలు నచ్చటం– అవి చదివిన కాలం నాటి మన వయసు, ఆలోచనా స్థాయి, భావుకత్వ శక్తి వీటన్నిటిని బట్టి ఉంటుంది. అందువల్ల ఒకసారి నచ్చింది అలాగే ఉండిపోతుంది అనుకొనటానికి లేదు. ఒకొకసారి యూటర్న్ కూడా తీసుకోవచ్చు. లేదా గుణాత్మకంగా పరిణామామూ చెందవచ్చు. నా సాహిత్య సహవాసం ఆరోతరగతి నుండి వారపత్రికలలో సీరియల్గా వచ్చే స్త్రీల నవలలు చదవటంతో మొదలైంది (1966 –67). ఆ వరుసలో రంగనాయకమ్మ స్వీట్ హోమ్ (Sweet Home) నవలలోని విమల పాత్ర నాకు చాలా నచ్చింది. పన్నెండు పదమూడేళ్ల వయసులో విమల నాకెందుకు నచ్చింది? ఇళ్లల్లో కనబడే దాంపత్య సంబంధాల్లోని గంభీర ముద్రను, ఒద్దికను చెరిపేస్తూ భర్తతో అల్లరిగా, చిలిపిగా, చనువుగా ప్రవర్తించే ఆ పాత్ర విశిష్ట వ్యక్తిత్వం నన్ను ఆకర్షించిందా? అప్పటికి నేను చదివిన నవలల్లోని స్త్రీ పాత్రలకు భిన్నంగా తాను లోపల ఏమి అనుకొంటున్నదో దానిని ఎవరేమనుకొంటారో అని లోలోపల అణిచేసుకోకుండా బయటకు అనగల ధీరత్వం వలన విమల నాకు అపురూపంగా అనిపించిందా? ఆ క్రమంలో తాను స్త్రీ, భార్యే అయినా ప్రత్యేకవ్యక్తిని అన్న నిరంతర చైతన్యంతో జీవించటం వల్ల నాకు నచ్చిందా? ఏమో !? నాకవన్నీ ఆ రోజుకు ఇంత స్పష్టంగా తెలుసునని చెప్పలేను. కానీ ఆ నవల చదువుతూ సమ న్యాయానికి, సహజీవన సౌందర్యానికి సంబంధించిన అవ్యక్త అనురాగం ఏదో నా లోలోపల ఊపిరి పోసుకొంటుంటే విమల ప్రేమలో పడిపోయానన్నది వాస్తవం. ఆ తరువాత ఎన్నిసార్లు ఆ నవల (Novel) చదివానో లెక్కలేదు. విమల ఎందుకు నచ్చిందో ఆ కారణాలు రోజురోజుకీ మరింత విశదం అవుతూ వస్తున్నాయి. స్త్రీకి సహజ లక్షణాలుగా సమాజం నిర్దేశిస్తున్న విలువలను తిరస్కరించటం విమలను ప్రత్యేకంగా నిలబెడుతుంది. శాంతం, సహనం స్త్రీ«ధర్మాలు అనే బోధలు ఆమె సహించలేదు. పతివ్రతలుగా జీవించటం, మరణించటం స్త్రీకి ఆదర్శం చేసిన వ్యవస్థపై ఆమెకు కోపం. స్త్రీకి భర్త పట్ల అనురాగం స్వచ్ఛందంగా సహజ మానవీయ సంబంధాల నుండి కలగవలసినదే కానీ పై నుండి నిర్బంధం వల్ల కాదు అన్నది ఆమె నిశ్చితాభిప్రాయం. భర్త కోసం తాను ఇష్టంగా ఇంటి పని ఎంతైనా చేయవచ్చు కానీ, ఇంటి పని స్త్రీలదే అంటే మాత్రం విమల ఒప్పుకోదు. వంటిల్లు మగవాడిది కూడా అని చెప్పగలిగిన సమాన హక్కుల చైతన్యం ఆమెది. ఆమె సంస్కరణ కుటుంబానికి పరిమితమైనదే. కానీ కుటుంబంలో భార్యాభర్తల సంబంధాలలో ప్రజాస్వామీకీకరణను కలగనగలిగిన ఆధునిక మధ్యతరగతి యువతిగా విమల నాకు నచ్చిందనుకొంటాను. కుటుంబానికి అవతల నాకు అంతగా నచ్చిన మరొక స్త్రీ పాత్ర మధురవాణి. -
Marathi Language Day: దేశంలో ‘థర్డ్ లాంగ్వేజ్’
మరాఠీ భాషా దినోత్సవాన్ని(Marathi Language Day) ప్రతీయేటా ఫిబ్రవరి 27న జరుపుకుంటారు. ప్రముఖ మరాఠీ కవి విష్ణువామన్ శివాడ్కర్(Vishnuvaman Sivadkar) జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. విష్ణువామన్ శివాడ్కర్ను ‘కుసుమాగ్రజ’ అని కూడా అంటారు. ఈ రోజున మరాఠీ సాహిత్యానికున్న గొప్పదనాన్ని గుర్తిస్తూ, మరాఠీ భాషా రచయితలను సన్మానిస్తుంటారు.మరాఠీ భాష ఆధునిక ఇండో- ఆర్యన్ భాషలలో అత్యంత పురాతనమైనదిగా గుర్తింపు పొందింది. క్రీస్తు శకం 900 నుంచి మరాఠీ భాష మనుగడలో ఉంది. 1999లో కుసుమాగ్రజ మరణానంతరం ప్రభుత్వం ‘మరాఠీ అధికారిక భాషా గౌరవ దినోత్సవం’ను ఆయనకు గుర్తుగా నిర్వహిస్తూ వస్తోంది. అలాగే ఈరోజు మరాఠీ భాషా సాహిత్యంలో విశేష కృషి చేసినవారిని సన్మానిస్తుంటారు. మరాఠీ భాషా దినోత్సవం సందర్భంగా ఈ భాషకున్న కొన్ని ప్రత్యేకతలను తెలుసుకుందాం.మరాఠీ ప్రత్యేకతలు1. హిందీ, బెంగాలీ తరువాత దేశంలో అత్యధికులు మాట్లాడే భాష మరాఠీ. మరాఠీ భాషను తొమ్మిది కోట్లమంది మాట్లాడుతుంటారు.2. మరాఠీలో మొత్తం 42 రకాల యాసలు ఉన్నాయి. ఇవి ఆయా ప్రాంతాలను అనుసరించి మారుతుంటాయి.3. మరాఠీని కూడా దేవనాగరి లిపి(Devanagari script)లో రాస్తారు. మరాఠీకి లిపి ఉంది. దీనిని మోదీ లిపి అని అంటారు.4. మరాఠీ లిపిని గుర్తిస్తూ పోస్టల్ శాఖ(Postal Department) ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది.5. 11వ శతాబ్ధంలో మరాఠీ భాషలో తొలి గ్రంథం వెలువడింది.6. మరాఠీ భాషకు ప్రత్యేక వ్యాకరణం కూడా ఉంది. మరాఠీ భాషను మహారాష్ట్రీ, మరహట్టీ అని కూడా పిలిచేవారు.ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా తొలి ప్రదర్శన.. ‘ఐ లవ్యూ’ అంటూ.. -
Tangirala Venkata Subbarao తొలితరం జానపథికుడు
జానపద సాహిత్యం కోసం అనంతమైన కృషి చేసినవారు తంగిరాల వెంకట సుబ్బారావు. ఆ సాహిత్యాన్ని సేకరించి, విశ్లేషించి, వేలాది పుటల గ్రంథాలను వెలుగులోనికి తీసుకొచ్చారు. ‘తెలుగు వీరగాథా కవిత్వం’పై పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా అందుకొన్నారు. తెలుగులోని వీరగాథా వైశిష్ట్యాన్ని లోకానికి చాటడంలోతంగిరాల సఫలీకృతులైనారు. ఈ సిద్ధాంత గ్రంథంలో వీరగాథల పుట్టుపూర్వోత్త రాలు, వీరగాథా విభజన, శక్తి కథాచక్రం, పలనాటి వీర కథా చక్రం, కాటమరాజు కథాచక్రం, బొబ్బిలి వరుస కథలు, పదాలు, జంగం కథలు, లఘు వీర గాథలు, వీర గాథానుకరణాలు, వీరగాథలో రసం, భాష, ఛందస్సు, వీరగాథల వైశిష్ట్యం వంటి పరిశోధనా విషయాలను కూలంకషంగా చర్చించి వివరించారు. తంగిరాల ‘రేనాటి సూర్యచంద్రులు’ అనే పెద్ద పుస్త కాన్ని ప్రచురించారు. ఇందులో భారతదేశంలో మొదటి స్వాతంత్య్ర పోరాట వీరుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరగాథల్ని సవివరంగా పరిశీలించి తెలుగు వారికి అందించారు. అలాగే రేనాటి సూర్య చంద్రులు రెండవ సంపుటాన్ని ప్రచురించి అందులో రాయలసీమ దాన కర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి సాహిత్యాన్ని విడమరచి చెప్పారు. చదవండి: Aga Khan : ప్రముఖ ఆధ్యాత్మికనేత, దాత ఆగా ఖాన్ కన్నుమూత‘చైతన్య కవిత’ అనే పత్రికను స్థాపించి ఎన్నో ఏళ్ళు దానికి సంపాదకుడిగా పని చేశారు. ‘శ్రీకృష్ణ కర్ణామృతం’ గ్రంథానికి కూడా సంపాదకత్వం వహించారు. రంగ నాథ రామాయణం, సుమతి శతకాలను తంగిరాలతో కలిసి కొంతమంది ఆంగ్లంలోకి అనువదించారు. ‘అంకమ్మ కథలు’ పేరుతో శక్తి కథాచక్రాన్ని ప్రచురించారు. వంద లాది పరిశోధనా వ్యాసాలను రచించారు.తంగిరాల చేసిన సేవలకు గాను 2025 జన వరి 4న ఆయనకు ‘అజో విభోకందాళం ఫౌండేషన్ జీవిత సాఫల్య పురస్కారం’ పొందారు. ఇది జరిగిన ఇరవై ఒకటో రోజే (జనవరి 25) ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగులో జానపద సాహిత్యం ఉన్నన్నినాళ్లూ ఆచార్య తంగిరాల జీవించే ఉంటారు.– ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి ‘ ఏపీ తెలుగు అకాడమీ మాజీ సంచాలకుడు -
చదువు, వైద్యంపై వైఎస్ జగన్ కృషి గొప్పది: రచయిత హర్ష్ మందర్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తన పాదయాత్ర ద్వారా ప్రజల అవసరాలేంటో తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు ప్రముఖ రచయిత హర్ష్ మందర్. అలాగే, ప్రజల కనీస అవసరాలైన చదువు, ఆరోగ్యం, రవాణా, ఉపాధి వంటి అంశాలపై వైఎస్ జగన్ కృషి ఎంతో గొప్పదని కొనియాడారు.హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ కోసం ప్రముఖ రచయిత హర్ష్ మందర్ సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా హర్ష్ మందర్ సాక్షితో మాట్లాడుతూ.. ‘బడుగు బలహీన వర్గాల విషయంలో సమాజంలోని ప్రతీ వ్యక్తి సానుకూల దృక్పథంతో ఉండాలి. వారి ఉన్నతికి కృషి చేయాలి. ఈ మాట ఆదర్శంగా అనిపించవచ్చు. కార్యాచరణకు చాలా దూరమనీ అనిపించవచ్చు. అలాగని నేను చెప్పడం మానను. చెబుతూ ఉంటేనే ఆలోచన వస్తుంది. అది ఏదో ఒక రోజు కార్యాచరణవైపు నడిపిస్తుంది. ఆ దశకు చేరుకునే వరకు చెబుతూనే ఉంటాను.పాలకులకు కూడా అట్టడుగు వర్గాల వారి పట్ల ఆ సానుకూల దృక్పథం ఉండాలి. దాన్ని సంక్షేమం, అభివృద్ధి రూపంలో చూపించాలి. ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. ప్రజల కనీస అవసరాలైన చదువు, ఆరోగ్యం, రవాణా, ఉపాధి లాంటివాటి పట్ల దృష్టి పెట్టాలి. చిత్తశుద్ధితో పనిచేయాలి. వీటి విషయంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆలోచన, విజన్ చాలా గొప్పవి. వైఎస్ జగన్ తన పాదయాత్ర ద్వారా ప్రజల అవసరాలేంటో తెలుసుకున్నారు. వాటిని తాను ఎంత వరకు నెరవేర్చగలరో కసరత్తు చేశారు. చదువు, ఆరోగ్యం విషయాల్లో వాటిని అమలు చేశారు. ఆ రంగాల్లో ఆయన చేసిన కృషి అభినందించదగినది. ఈ విషయంలో ఆయన ఇతర రాష్ట్రాలకూ మార్గదర్శకంగా నిలిచారని చెప్పవచ్చు అని ప్రశంసించారు. -
కోలో కోలోయన్న కోలో..
జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత్రి వింజమూరి అనసూయాదేవి జీవితం ఎంతటి స్ఫూర్తిమంతమైనదో డాక్యుమెంటరీగా తీసి, ‘హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్’లో ప్రదర్శించారు ఆమె కుమార్తె సీతారత్నాకర్. ‘అసమాన అనసూయ’ ను తెరపై చూసిన నాటి తరమే కాదు, నేటి నవతరమూ కళ్లప్పగించి చూస్తూనే ఉంది. ఈ సందర్భంగా తల్లి తన జీవితంలో నింపిన స్ఫూర్తిని సీతారత్నాకర్ పంచుకున్నారు.మారుమూల పల్లెల్లో దాగి ఉన్న జానపద గేయాలకు సభా గాన మర్యాద కలిగించి సంగీత జగత్తులో ఉన్నతస్థానాన్ని కలిగించిన తొలి గాయని వింజమూరి అనసూయాదేవి. జానపద గేయాలకు కర్నాటక బాణీలో స్వర రచన చేసిన తొలి స్వరకర్త. విశ్వ విద్యాలయాలలో శాస్త్రీయ సంగీతాన్ని పాఠ్యాంశంగా చేర్పించిన అసమాన గాయని. దక్షిణ భారతదేశంలో తొలి మహిళా సంగీత దర్శకురాలు. ఆమె ఒక అద్భుతం. ఆమెను తలుచుకుంటున్నారు కుమార్తె సీతారత్నాకర్.పాట పాడింది... బాధ్యతలూ నెరవేర్చిందిఅమ్మానాన్నలకు మేం ఐదుగురం సంతానం. అమ్మకు సంగీతం అంటేప్రాణం. స్కూల్ లేని రోజుల్లో అమ్మ తనతోపాటు మమ్మల్నీ కచేరీలకు తీసుకెళ్లేది. ఎక్కడకు వెళ్లినా తల్లిగా తన బాధ్యతలను నెరవేరుస్తూనే కళను కూడా సాకారం చేసుకున్నారు. నేనూ, మా అక్క భరతనాట్యం నేర్చుకొని దేశ విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చాం. అక్కకు పెళ్లయ్యి అమెరికా వెళ్లడం, నాకు పెళ్లవడంతో నృత్యం ఆగిపోయింది. దూరదర్శన్లో ఉద్యోగం వచ్చింది. మేం మొదటి నుంచి చెన్నైలో ఉండేవాళ్లం. అలా చెన్నై, ఢిల్లీ దూరదర్శన్లో 37 ఏళ్లు వర్క్ చేశాను. ఎంతో మంది కళాకారులను, యాక్టివిస్ట్లను దూరదర్శన్కి పరిచయం చేశాను. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు నలుగురూ అమెరికాలో స్థిరపడ్డారు. అమ్మ ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కువ సమయం తనతో గడిపే అవకాశం లభించేంది. అమ్మకు జానపద గేయాల గురించి తెలుసు కాబట్టి కాకినాడకు తీసుకెళ్లి, అక్కడి పల్లె పాటల మీద ఓ కార్యక్రమాన్ని చేశాం. అదొక మధురానుభూతి నాకు. నేను చేసిన ప్రోగ్రామ్స్ చూసేది. సూచనలు ఇచ్చేది. ‘ఇంకా ఏదైనా చేయాలి’ అంటూ గాయనిగా స్వరాలను కూర్చుతూనే ఉండేది. రచనలు చేస్తూనే ఉండేది. భావగీతాలు, జానపద గేయాలు ఈ రెండు పుస్తకాలు ఆమె 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా విడుదలయ్యాయి. ఆ తర్వాత జానపద సంగీతంపై ఏడు పుస్తకాలను విడుదల చేశారు. ఇవి కాకుండా నేనూ–నా రచనలు, గతానికి స్వాగతం అనే పుస్తకాలు, 95వ పుట్టిన రోజు సందర్భంగా ‘అసమాన అనసూయ’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు.యజ్ఞంలా అనిపించింది...నిరంతర కృషియే అమ్మను అసమానంగా ఈ రోజు నిలబెట్టింది. అమ్మ మరణించాక ఆమెకు సంబంధించిన ఫుటేజీ అంతా ఒకసారి చూడటం మొదలుపెట్టాను. మరికొంత మా వాళ్ల నుంచి సేకరించాను. అదంతా చూడటానికే నాకు రోజుల సమయం పట్టింది. ఆవిడ వీడియోలు చూస్తున్నప్పుడు ‘నా పాటలు ఆగిపోకూడదు...’ వంటి మాటలు విన్నాను. దీంతో అమ్మకు సంబంధించిన డాక్యుమెంటరీ ఎలాగైనా తీసుకురావాలని ప్రయత్నించాను. ఎక్కడ నుంచి మొదలుపెట్టాలి.. అని చాలా ఆలోచించేదాన్ని. ఫుటేజీలో ఆమె దినచర్యతోపాటు, జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలన్నీ చేర్చుకుంటూ, ప్రముఖుల సభా విశేషాలు, పుస్తకప్రారంభోత్సవాలు, కుటుంబ సభ్యుల నుంచి కామెంట్స్ జత చేసి ఒక రూపం తీసుకువచ్చాను. ఈ సమయంలో అమ్మ నా వెంటే ఉంటూ నాకు సూచనలు చేస్తున్నట్టు అనిపించేది. డాక్యుమెంటరీ పూర్తవ్వడానికి మూడేళ్ల సమయం పట్టింది. అమ్మ ఘనత అలనాటి వారికే తెలుసు అనుకున్నాను. కానీ, నేటి తరం కూడా అమ్మ డాక్యుమెంటరీ చూడటం, ఆమె గొప్పతనం గురించి ప్రస్తావిస్తుంటే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది’ అంటూ తన తల్లితో తనకున్న అనుబంధాన్ని తెలిపారు సీతా రత్నాకర్. – నిర్మలారెడ్డి -
సినీ రచయిత చిన్నికృష్ణ కుటుంబంలో విషాదం
సినీ ప్రముఖ రచయిత చిన్నికృష్ణ ఇంట తీవ్ర విషాదం జరిగింది. ఆయన తల్లి సుశీల (75) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు. చిన్నికృష్ణ స్వగ్రామం తెనాలిలో నేడు అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతి మదర్స్డే నాడు ఆయన తన తల్లి గురించి చాలా ఎమోషనల్గా కవితలు రాశారు. ఎన్ని జన్మలైనా నీకే జన్మించాలని ఉందంటూ తన తల్లి గురించి చెప్పే వారు. సుశీల మరణంతో సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. గంగోత్రి,బద్రినాథ్,నరసింహనాయుడు,ఇంద్ర వంటి చిత్రాలకు ఆయన కథ అందించారు. -
నయనతార డాక్యుమెంటరీ.. ఎవరికీ ఉపయోగం లేదన్న ప్రముఖ రచయిత!
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ డాక్యుమెంటరీ విడుదల తర్వాత వివాదం మొదలైన సంగతి తెలిసిందే. తన సినిమాలో మూడు సెకన్ల క్లిప్ను అనుమతి లేకుండా వాడారని హీరో ధనుశ్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానంలో విచారణ జరగనుంది.ఇదిలా ఉండగా నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్ డాక్యుమెంటరీపై ప్రముఖ బాలీవుడ్ నవలా రచయిత్రి శోభా దే మండిపడ్డారు. తాను నయనతార డాక్యుమెంటరీని చూశానని.. కానీ అందులో స్ఫూర్తిదాయకమైన అంశాలు ఏమీ లేవన్నారు. ప్రోమోలు చూసే వరకు నయనతార గురించి నాకు పూర్తిగా తెలియదని.. అందుకే ధైర్యం చేసి 45 నిమిషాల డాక్యుమెంటరీ చూసినట్లు తెలిపారు.(ఇది చదవండి: నయన్- ధనుశ్ వివాదం.. ఆ విషయం తెలిసి షాకయ్యా: రాధిక శరత్ కుమార్)అయితే వివాహం లాంటి వ్యక్తిగత విషయాలను డబ్బుల కోసం ఇలా డాక్యుమెంటరీ రూపొందించడం సరికాదని ఆమె విమర్శించారు. ఇందులో ఎలాంటి సందేశం లేదని అన్నారు. ఆమెను చూసి మరికొందరు సినీ తారలు డబ్బుల కోసం ఇదే పద్ధతిని పాటిస్తారేమో అంటూ విమర్శలు చేశారు. అయితే కొంతమంది శోభా దే వ్యాఖ్యలను సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.కాగా.. నయనతార రూపొందించిన ఈ డాక్యుమెంటరీ కేవలం తన వ్యక్తిగత, కెరీర్, వివాహం ఆధారంగా తీసుకొచ్చారు. విఘ్నేష్ శివన్తో ఆమె వివాహం గురించి ప్రధానంగా చూపించారు. ఈ డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ ధాన్ సెట్స్ ఫుటేజీని ఉపయోగించినందుకు రూ.10 కోట్లు చెల్లించాలంటూ ధనుష్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Shobhaa De (@shobhaade) -
పొరలు ఒలిచే రచయిత
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాది గెలుచుకోవడం ద్వారా ఆ గౌరవం పొందిన తొలి ఆసియా రచయిత్రిగా నిలిచింది దక్షిణ కొరియాకు చెందిన హాన్ కాంగ్ (సరైన ఉచ్చారణ: హన్ గాన్ ). ప్రతి ఏడాదీ జరిగినట్టుగానే ఈసారీ అందరి అంచనాలు తలకిందులైనాయి. చైనా రచయిత్రి కాన్ షుయె, ఆస్ట్రేలియా రచయిత జెరాల్డ్ మర్నేన్, జపాన్ రచయిత హరూకి మురకామి నుంచి భారత మూలాలున్న సల్మాన్ రష్దీ వరకు ఎవరిని వరించొచ్చనే విషయంలో బెట్టింగ్స్ నడిచాయి. కానీ ‘చారిత్రక విషాదాలను ప్రతిఘటించే, మానవ దుర్బలత్వాన్ని ఎత్తి చూపే తీక్షణమైన కవితాత్మక వచనానికి’గానూ హాన్ కాంగ్కు ఈ పురస్కారాన్ని ప్రకటించింది స్వీడిష్ అకాడెమీ. 2016లో తన కొరియన్ ఆంగ్లానువాద నవల ‘ద వెజిటేరియన్ ’కు ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రెజ్’ గెలుచుకున్న హాన్ కాంగ్ ఆ పురస్కారం పొందిన తొలి కొరియన్ రచయిత కూడా కావడం విశేషం.దక్షిణ కొరియా ప్రసిద్ధ రచయిత హాన్ సుయెంగ్–వొన్ కూతురిగా 1970లో జన్మించిన హాన్ కాంగ్ సాహిత్య ప్రయాణం– మనుషుల్ని మనుషులే పీక్కు తినే ఈ సమాజంలో దానికి విరుగుడు ఏమిటనే శోధనతో మొదలైంది. ‘మనుషులు మొక్కలు కావాల్సిందని నా నమ్మకం’ అంటాడు 28 ఏళ్లకే క్షయ వ్యాధితో మరణించినప్పటికీ కొరియన్ సాహిత్య రంగం మీద ప్రబలమైన ముద్రవేసిన యీ సంగ్. అదొక నిరసన! ప్రస్తుతం సుమారు ఐదు కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియా చరిత్రలో మాయని మచ్చలైన జపాన్ దురాక్రమణ (1910–45), కొరియన్ యుద్ధం(1950–53) తర్వాత, అలాంటిదే– సైనిక పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన విద్యార్థుల తిరుగుబాటు (1980)ను అణచివేసే క్రమంలో జరిగిన ‘మే 18’ ఘటన. కాంగ్కు తొమ్మిదేళ్లున్నప్పడు ఆమె జన్మించిన గ్వాంగ్జు పట్టణం నుంచి వాళ్ల కుటుంబం సియోల్కు వెళ్లిపోయింది. సరిగ్గా నాలుగు నెలల తర్వాత అక్కడ వేలాది విద్యార్థులు, పౌరులు చనిపోయారు. తనకు ప్రత్యక్షంగా అనుభవం లేని ఈ ఘోరాలను పెద్దయ్యాక తెలుసుకునే క్రమంలో అంతులేని పశ్చాత్తాపానికి గురైంది కాంగ్. వాళ్ల కుటుంబం బతికుండటానికీ, ఇంకో కుటుంబం లేకుండాపోవడానికీ కారణమే లేదు. ఒక చిన్న నిర్ణయం వాళ్ల గతిని మార్చింది. గ్వాంగ్జు, ఆష్విట్స్, బోస్నియా– ప్రపంచమంతటా ఇదే హింస. అయితే, గాయాల పాలైనవారికి రక్తం ఇవ్వడం కోసం తమ భద్రతకు కూడా వెరవకుండా వేలాది మంది ఆసుపత్రుల ముందు వరుసలు కట్టిన ఫొటోలు కాంగ్లో ఉద్వేగాన్ని పుట్టించాయి. వర్తమానం గతాన్ని కాపాడుతుందా? బతికున్నవాళ్లు పోయినవాళ్లను కాపాడగలరా? ‘దొరక్కపోయినా జవాబుల కోసం రచయితలు వెతకడం మానరు’. ఎంతటి క్రౌర్యానికైనా మనిషి వెనుదీయడు; అదే సమయంలో, ‘రైల్వే ట్రాక్ మీద పడిపోయిన పసికందును కాపాడటానికి తన ప్రాణాలను సైతం లెక్కించడు’. మనిషిలోని ఈ రెండు ముఖాల ప్రహేళికను చిత్రిస్తూ ‘హ్యూమన్ యాక్ట్స్’ నవల రాసింది కాంగ్. రచనల్లో రాజకీయ ప్రకటనలు చేయాల్సిన అవసరం లేకుండా– మనిషిలోని అంతులేని క్రూరత్వాన్నీ, దాని మరుగునే ఉన్న మృదుత్వాన్నీ తవ్వి తీసింది.పుట్టిన రెండు గంటలకే చనిపోయి తన తల్లిదండ్రులు ఎన్నటికీ బయటపడలేని దుఃఖానికి కారణమైన తను ఎన్నడూ చూడని తన ‘అక్క’ హాన్ కాంగ్కు ఓ పుండులా మిగిలిపోయింది. ‘గాయం అనేది మాన్చుకోవాల్సిందో, బయటపడాల్సిందో కాదు; దాన్ని ఆలింగనం చేసుకోవాలి’ అంటుందామె. కాలం వల్ల, మరణం వల్ల, ఇతర విషాదాల వల్ల మనుషులు ఇతరులతో సంభాషించే శక్తిని కోల్పోతారు. అంధత్వం వల్ల రాయగలిగే, చదవగలిగే సామర్థ్యాన్ని కోల్పోయిన ఒక ప్రాచీన–గ్రీçకు బోధకుడు, తీవ్ర కుటుంబ విషాదాల వల్ల నోరు లేకుండాపోయిన ఆయన విద్యార్థిని పరస్పరం సమాచారాన్ని పంచుకోవడానికి చేరుకునే గౌరవపూరిత సామీప్యతను చిత్రించడానికి ‘గ్రీక్ లెసన్ ్స’ నవల రాసింది కాంగ్. మనిషికీ మనిషికీ మధ్య ఉండాల్సిన ‘నిరంతర మృదు స్పర్శ’ను నొక్కి చెప్పింది. తద్వారా భాషా సూక్ష్మతనూ, గెలుచుకోగలిగే జీవన సౌందర్యాన్నీ పట్టిచూపింది.హాన్ కాంగ్ ఎంత వేగంగా టైప్ చేయగలదంటే, ‘నమ్మండి నమ్మకపోండి’ లాంటి టీవీ షోలో పాల్గొనమని ఆమె మిత్రులు నవ్వుతూ అనేంతగా! ఆమె రచనల్లోని ధారకు సరితూగేట్టుగా టైప్ చేసే క్రమంలో పుట్టిన నొప్పులకు కొన్నాళ్లు వేళ్లు కదపలేని పరిస్థితి వచ్చింది. మణికట్టు నొప్పి వల్ల పెన్నుతోనూ రాయలేదు. కొంతకాలం పెన్నును తిరగేసి పట్టుకుని ఒక్కో అక్షరాన్ని నొక్కుతూ టైప్ చేసేది. కవయిత్రిగా మొదలైన కాంగ్కు సంగీతమూ తెలుసు. పాటలు రాసి, తానే స్వరపరిచి, ముందు వద్దనుకున్నా ఆ తర్వాత ఆ మొత్తం పాడి ఒక పది పాటల సీడీ విడుదల చేసింది. ఆమె రచనల్లోనూ ఈ సంగీతం మిళితమై ఉంటుంది. 1993లో మొదలైన కాంగ్ మూడు దశాబ్దాల సాహిత్య ప్రయాణంలో నవలలు, నవలికలు, కథలు, కవితలు, వ్యాసాలు రాసింది. ఎన్నో పురస్కారాలను అందుకుంది. తరచూ వేధించే తీవ్రమైన తలనొప్పులు తనను అణకువగా ఉంచడంలో సాయపడుతున్నాయంటుంది. ఆమెకు ఒక కొడుకు. నోబెల్ వార్త తెలిసినప్పుడు అతడితో కలిసి కాఫీ తాగుతోందట. 2114 సంవత్సరంలో ప్రచురించనున్న ‘ఫ్యూచర్ లైబ్రరీ ప్రాజెక్ట్’ కోసం ‘డియర్ సన్, మై బిలవ్డ్’ సమర్పించిందామె. అందులో ఏం రాసివుంటుంది? మనిషి హింసను ఎదుర్కొనే సున్నిత ప్రతీకారం మరింత మానవీయతను చూపడమేనని మరోసారి నొక్కి చెప్పివుంటుందా! -
ఆదిపురుష్ వల్ల ఎంతో ఏడ్చా..: రచయిత
సినిమా బాగుందంటే జనాలు నెత్తినపెట్టుకుంటారు. అదే తేడా వచ్చిందంటే మాత్రం తీవ్రంగా విమర్శిస్తారు. ప్రభాస్ ఆదిపురుష్ విషయంలో ఇది నిరూపితమైంది కూడా! ఈ సినిమాలోని క్యారెక్టర్ల లుక్స్పై, దాన్ని డిజైన్ చేసినవారిపై, డైరెక్టర్పై, రచయితపై ఆగ్రహంతో విరుచుకుపడ్డారు.ఏదీ శాశ్వతం కాదుఅలా ఈ ట్రోలింగ్ నుంచి కోలుకోవడానికి చాలా సమయమే పట్టిందంటున్నాడు గేయ, సంభాషణల రచయిత మనోజ్ ముంతషీర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకున్నాను. ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. అలాగే ఈరోజు మంచి అనిపించింది కాస్తా రేపటికి చెడుగా అనిపించవచ్చు. లేదా ఈరోజు చెడు అనుకుందే రేపు మంచిగా అనిపించనూవచ్చు.ట్రోలింగ్ చూసి ఏడ్చా..ఆదిపురుష్ సమయంలో వచ్చిన ట్రోలింగ్ చూసి ఏడ్చాను. కానీ కుంగిపోలేదు. తిరిగి నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇందుకోసం పగలూరాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నాను. బాలీవుడ్ విషయానికి వస్తే ఇదొక మార్కెట్. ఇక్కడ ఎలాంటి నియమనిబంధనలు ఉండవు. కేవలం లాభం ఒక్కటే ఆశిస్తారు. నాతో వారికేదైనా లాభం ఉందనిపిస్తే నాదగ్గరకు వస్తారు. అలా ఇప్పుడు నన్ను మళ్లీ సంప్రదిస్తున్నారు అని మనోజ్ చెప్పుకొచ్చాడు.చదవండి: టిన్ అండ్ టీనా మూవీ రివ్యూ -
సినీగేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత
లక్డీకాపూల్ (హైదరాబాద్)/ సిరిసిల్ల కల్చరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, సినీగేయ రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 76 ఏళ్లు. లలిత గీతాల రచయితగా, టెలివిజన్ ధారావాహికల దర్శకుడిగా, గేయ రచయితగా, వివిధ డాక్యుమెంటరీలు, ఆడియో ఆల్బమ్స్ రూపకర్తగా ఆయన ప్రసిద్ధి చెందారు. తెలుగు సినీ పరిశ్రమలో రచయితల సంఘానికి ఆయన విశిష్ట సేవలందించారు. నంది పురస్కారాల కమిటీ చైర్మన్గా పనిచేశారు. కాగా, అమెరికా నుంచి ఆయన కుమారుడు రావాల్సి ఉండటంతో కృష్ణ భౌతికకాయాన్ని నిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. కృష్ణ మరణ వార్త గురించి తెలిసి పలువురు కవులు, కళాకారులు, రచయితలు నిమ్స్కు వచ్చి నివాళులర్పించారు. తెలంగాణ బీసీ కమిషన్ తొలి చైర్మన్ బి.ఎస్.రాములు సంతాపం తెలిపారు. రెండు రోజుల క్రితమే జీవన సాఫల్య పురస్కారంరెండు రోజుల క్రితమే తెలుగు సినీ రచయితల సంఘం వడ్డేపల్లి కృష్ణను జీవన సాఫల్య పురస్కారంతో సత్క రించింది. అమెరికాలో ఆటా సభల్లో పాల్గొనడానికి వెళ్లి న ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో జూలై 16న హైద రాబాద్ వచ్చి ఆసుపత్రిలో చేరారు. నెల రోజులు ఆసు పత్రిలోనే ఉండి నాలుగు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యా రు. మళ్లీ ఇబ్బంది అనిపించడంతో మరోసారి నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. వడ్డేపల్లి కృష్ణ సిరిసిల్లలో చేనేత కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్ నాగోల్లో స్థిరపడ్డారు. తొలుత తపాలా శాఖలో ఉద్యోగం చేశారు. వందేళ్లలో వెలువడిన పది వేల లలిత గీతాలను పరిశీలించి పీహెచ్డీ పూర్తి చేశారు. పిల్ల జమీందార్, భైరవద్వీపం, పెద్దరికం తదితర చిత్రాలకు రాసిన పాటలకు ఆయనకు మంచి పేరు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరు వాత జయ జయహే తెలంగాణ నృత్య రూపకం రచించా రు. కృష్ణ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. -
టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ రచయిత మృతి!
టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూశారు. హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. సి నారాయణ రెడ్డి మెచ్చిన రచయితల్లో ఒకరైన కృష్ణ పది వేల లలిత గీతాలను పరిశీలించి పీహెచ్డీ పూర్తి చేశారు.పిల్ల జమీందార్, పెద్దరికం, భైరవ ద్వీపం, సోగ్గాడే చిన్ని నాయనా లాంచి హిట్ సినిమాలకు గీత రచయితగా పనిచేసిన వడ్డేపల్లి కృష్ణ రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. లావణ్య విత్ లవ్బాయ్స్ అనే సినిమాను ఆయన డైరెక్షన్లో తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన ఎక్కడికి వెళ్తుందో మనసు చిత్రంలో సాయికుమార్ హీరోగా నటించారు. అంతే కాకుండా గతేడాది సూపర్ హిట్గా నిలిచిన బలగం సినిమాలో కూడా నటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జయ జయహే తెలంగాణ పాటతో ఆయన పేరు మార్మోగిపోయింది.సి.నారాయణరెడ్డిగారి రచనలంటే ప్రాణం.. ఆయన స్ఫూర్తితోనే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టానని గతంలో ఆయన వెల్లడించారు. ఆయన తన మొదటి పాట భానుమతి దర్శకత్వం వహించిన ‘రచయిత్రి’ సినిమా కోసం రాశారు. కానీ ఆ సినిమా ఆలస్యంగా విడుదల కావడంతో ‘పిల్ల జమీందార్’ మొదటి సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. దాదాపు ఇప్పటివరకూ మొత్తం 200 పాటలకు పైగా రాశారు. లలిత సంగీత సాహిత్యంలో వచ్చిన మార్పుల మీద పరిశోధన చేసి, ఉస్మానియా నుంచి పీహెచ్డీ పట్టా కూడా అందుకున్నారు.అవార్డులు1992లో బాలల మీద రాసిన ‘చిరుగజ్జెలు’ అనే గేయానికిగాను బాల సాహిత్య పురస్కారం అందుకున్నారు. ఈ గేయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం పూణెలోని బాలభారతి స్కూల్లో నాలుగో తరగతిలో తెలుగు వాచకంలో ఓ పాఠ్యాంశంగా చేర్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా రాసిన జయహే, జయహే తెలంగాణ నృత్యరూపకానికి సాహిత్యం అందించారు. వివేకానంద విజయం, విశ్వకల్యాణం నృత్యరూపకాలు కూడా నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆయన రచించిన ‘విశ్వకల్యాణం’ బెంగాలీ భాషలోకి కూడా అనువాదమైంది. అమెరికాలో ప్రతి ఏటా నిర్వహించే ఆటా, తానా సభలకు వరుసగా స్వాగత సంగీత నృత్యరూపకాలు అందించారు. -
గులాబీ మాటల రచయిత నరసింగరావు కన్నుమూత
సీనియర్ రచయిత నడిమింటి నరసింగరావు (72) ఇక లేరు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘గులాబీ’, రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలోని ‘అనగనగా ఒకరోజు’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్స్తో పాటు ‘పాత బస్తీ, ఊరికి మొనగాడు, కుచ్చికుచ్చి కూనమ్మా’ ... ఇలా దాదాపు యాభై సినిమాలకు నరసింగరావు మాటల రచయితగా చేశారు. సినిమాల్లోకి రాకముందు తెలుగు నాటకరంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ‘బొమ్మలాట, రైలుబండి’ వంటి నాటకాలు రాశారు. అలాగే ‘తెనాలి రామకృష్ణ, అంతరంగాలు, లేడీ డిటెక్టివ్, వండర్ బాయ్’ ఇలా దాదాపు యాభై సీరియల్స్కు ఆయన మాటలు రాశారు. రచయితగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు, సన్మానాలు ఎన్నో అందుకున్నారు. కాగా ‘ఆదిత్య 369’కి సీక్వెల్గా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించాలనుకున్న చిత్రం స్క్రిప్ట్ వర్క్లో పాలుపంచుకున్నారు. నరసింగరావుకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన మృతికి తెలుగు సినీ రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణతో పాటు పలువురు చిత్రరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
సిబ్లింగ్ రైటర్స్..! రచయితలుగా రాణిస్తున్న అక్కా, తమ్ముళ్లు..
వారిది ఓ మధ్యతరగతి కుటుంబం.. ఇద్దరూ అక్కా, తమ్ముళ్లు.. చిన్నప్పటి నుంచీ ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నారు.. వారి ముందుతరాల్లో ఎవరికీ పుస్తకాలు రాయడమనే మాటే తెలియదు.. అసలు వాటిని చదవడమే గగనమైన కుటుంబం నుంచి వచ్చారు.. అనూహ్యంగా ఇద్దరికీ తెలుగుపై మమకారం పెరిగింది. సాధారణంగా బీటెక్ చదువుకున్న వారిలో చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తూ కాలం గడిపేస్తుంటారు. కానీ వీరిద్దరూ అందుకు భిన్నం. అక్క ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుకోగా.. తమ్ముడేమో విశాఖలోని గీతమ్ యూనివర్సిటీలో బీటెక్ చదివాడు. కానీ వీరిద్దరూ భాషలో పట్టు సాధించి పుస్తకాలు రాస్తూ తమకు తోచినంతలో తెలుగుకు సేవ చేస్తున్నారు. అక్కా, తమ్ముళ్లు ప్రవళిక, ప్రవర్ష్ జర్నీ ఒక్కసారి చూద్దాం.. – సాక్షి, సిటీబ్యూరోతెలుగులో రాయాలనే ఆకాంక్ష అయితే ఉంది.. కాకపోతే పుస్తకాలు రాయడం ఇంట్లో ఎవరికీ అలవాటు లేదు. దీంతో వినూత్నమైన ఆలోచన వారి మదిలో మెదిలింది. 2017లో ‘కరపత్ర’ పేరుతో అవసరం ఉన్న వారికి లేఖలు రాయడం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు విషయంలో మహేశ్పోలోజు అనే మరోరచయిత వీరిద్దరికీ తోడయ్యాడు. వీరు ముగ్గురూ కలసి దాదాపు వెయ్యికి పైగా ఉత్తరాలు రాసిచ్చారు. లేఖలు అందుకున్న వారు అభినందనలతో ముంచెత్తడంతో రచయిత కావాలనే తృష్ణ వారిలో మరింత పెరిగింది.ఛాయాదేవి చెత్త కథలు..ప్రవళిక తొలిసారిగా 2017 సమయంలోనే ‘ఛాయాదేవి చెత్త కథలు’ పేరుతో తన తొలి పుస్తకాన్ని తీసుకొచి్చంది. అక్కను స్ఫూర్తిగా తీసుకుని ప్రవర్ష కూడా తన తొలి పుస్తకాన్ని ‘కథనై.. కవితనై’ పేరుతో వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రవళిక మరో పుస్తకాన్ని ఇప్పటికే పూర్తి చేయగా, ప్రవర్ష్ ‘అభినిర్యాణం’ పేరుతో రెండో పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరించారు.అసిస్టెంట్ డైరెక్టర్గా..ప్రవర్ష్ మూడేళ్లు ఓ ఐటీ కంపెనీలో జాబ్ చేశాడు. కానీ తనకు అస్సలు సంతృప్తినివ్వలేదు. ఇక తనకు ఇష్టమైన రంగంలో రాణించాలని నిర్ణయించుకుని ఆ జాబ్ మానేసి పుస్తకాలు రాయడం ప్రారంభించాడు. పుస్తక రచయిత మాత్రమే కాదు.. అటు సినిమాలకు పాటలు రాయడం హాబీగా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఓ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. -
తనికెళ్ల భరణికి డాక్టరేట్
ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణికి వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. తనికెళ్ల భరణి దాదాపు 800లకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 52 సినిమాలకు మాటలు అందించారాయన.‘సముద్రం’ సినిమాకి ఉత్తమ విలన్గా, ‘నువ్వు నేను’ చిత్రానికి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ‘గ్రహణం’ చిత్రంతో ఉత్తమ నటునిగా, ‘మిథునం’ సినిమాకిగాను ఉత్తమ రచయిత–ఉత్తమ దర్శకునిగా నంది అవార్డులు అందుకున్నారాయన. ఇక ఆగస్ట్ 3న వరంగల్లో జరిగే యూనివర్సిటీ స్నాతకోత్సవంలో తనికెళ్ల భరణికి డాక్టరేట్ను ప్రదానం చేయనున్నారు. -
వర్చువల్ కచ్చడాలు
‘ఒక తల్లి, ముగ్గురు డాడీలు’ యూ ట్యూబ్ ఓపెన్ చెయ్యగానే ఒక చానల్ పెట్టిన థంబ్ నెయిల్ కనపడింది. వ్యూస్ పెంచుకోవడానికి యూట్యూబ్ చానల్స్తో పాటు చిన్నా పెద్ద పత్రికల డిజిటల్ విభాగాలు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి. ‘మతి పోగొట్టే, రచ్చరచ్చ చేసే, పడీపడీ నవ్వే, చూడగానే షాకయ్యే’ ఎన్నో థంబ్ నెయిల్స్ చూస్తూనే ఉన్నాము. కానీ ఆడవాళ్ళ విషయంలో... ముఖ్యంగా పోరాట కులాల నుంచి వచ్చిన ఆడవాళ్ళ విషయంలో ఈ చూపుడు వేళ్ళు మరిన్ని వంకర్లు తిరుగుతాయి. ‘ఆడదాన్ని అడ్డం పెట్టుకుని యుద్ధం చేస్తావా?’ అంటుంది ఫ్యూడల్ సమాజం. పౌరుషమైన విషయాలు మగవారికే కనుక వారు పురుషులయ్యారు. సమాజమూ రాజకీయాలు వగైరాలన్నీ మగవారి టెరిటరీగా ఉన్నంతకాలం ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగడం తప్పన్నది ఒక అనాగరిక విలువ. ఆ మేరకు స్త్రీలు యుద్ధాలు చేయని సుకుమారులుగా, మాటంటే బడబడా కన్నీరు కార్చే సున్నిత మనస్కులుగా తయారు చేయబడ్డారు. ఇక ఇపుడు అలా లేరు. స్త్రీలు అన్నీ మాట్లాడగలరు. ముక్కూ చెవులూ కోసి పంపినందుకు సంబరపడిన మన మొహాలకేసి జాలిగా చూసి, ‘ప్రేమించడం తప్పా?’ అంటుంది ఆధునిక శూర్పణఖ. ‘పేడితో యుద్ధం చెయ్యనని’ ఆయుధం విసర్జించిన విలువిద్యకారుని ప్రశ్నించింది శిఖండి. ‘భీష్మా! నాతో పోరాడు’ అని సవాల్ చేసినట్లు కూడా రాసింది ఒక రచయిత్రి. స్త్రీలు తమ యుద్ధాలు తామే చేస్తున్నా వారి లైంగిక వ్యక్తిత్వం మగవారి సొత్తుగానే ఉంది. సామాజిక మాధ్యమాల విస్తృతి వల్ల ఈ స్థితి కొత్తరూపం తీసుకుంటోంది. రాజకీయ నాయకులుగా, రాజకీయ కుటుంబీకులుగా, ఉన్నతోద్యోగులుగా, కళాకారులుగా ఇంకా ఎన్నో రంగాలలో స్త్రీలు బాహాట శీలపరీక్షలకు గురవుతున్నారు. చేతిలో ఫోనో, ఛానలో ఉన్న చాలామంది అగ్నిగుండాలకి సమిధలు తయారు చేస్తున్నారు. ‘ఫలానా స్త్రీ ఎవరితో శారీరక సంబంధంలో ఉందీ, ఆమె బిడ్డకి ఎంతమంది డాడీలు, ఆమెకి ఎంతమంది మగాళ్లతో సంబంధాలు ఉన్నాయి, ఆమె ఏ రోజు ఎవరితో ఏ హోటల్లో ఉందీ’ వంటి లక్షోపలక్షల ప్రశ్నలు సమాజాన్ని ఉద్ధరించడం కోసం మీడియా వేస్తూ ఉంటుంది. అంతేకాదు అటువంటి స్త్రీలకి ఎటువంటి శిక్షలు విధించాలో కూడా రచ్చబండలు, బతుకు జట్కాబండులతో పాటు పిల్లా పిచుకా యూట్యూబర్లు, పెద్ద మీడియా సంస్థల, రాజకీయ పార్టీల డిజిటల్ విభాగాలు నిర్ణయిస్తాయి. ‘కామాంధురాలి కళ్ళు పీకాలి’, ‘పరాయి మగాడితో కులికిన స్త్రీని గుడ్డలూడదీసి కొట్టాలి’, ‘అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమెని చెట్టుకు కట్టేసి తన్నాలి’ వంటి అనేక శిక్షలను సజెస్టివ్గా చెప్పడంతో పాటు, ఆ యా శిక్షలను అభినయించి చూపగల ధీరులు వారు. స్త్రీ పురుష శారీరక సంబంధాలు వ్యక్తిగతం. వాటిని చర్చించడానికి కొద్దిమందికి మాత్రమే హక్కు ఉంది. అటువంటి వివాదాల్లోని వ్యక్తులు, ఆ యా సంబంధాలలోని అవకాశవాదాన్ని, మోసాన్ని, హింసని గుర్తించి తీర్పు ఇచ్చే న్యాయవ్యవస్థ లేదా ఆ ఇరువురి సమ్మతంతో ప్రయత్నించే మధ్యవర్తులకి మాత్రమే ఆ హక్కు ఉంది. అంతే తప్ప ఎవరు పడితే వారు, వారి సంబంధాలలోకి తొంగి చూసి, చకచకా అడుగులు వేసి వ్యాఖ్యానించడం కుసంస్కారం. తమ రక్తం పంచుకు పుట్టినవారికే ఆస్తి ఇవ్వడం కోసం, బయలాజికల్ తండ్రులుగా తమ స్థితిని నిర్ధారించుకోవడం కోసం స్త్రీ మొలకు ఇనుప కచ్చడాలు బిగించి, తాళాలు వేసిన ఘనత పితృస్వామ్య సమాజానిది. ఇపుడు మీడియా, సోషల్ మీడియా సామాజిక, రాజకీయ రంగాలలో ఉన్న స్త్రీలకు అటువంటి వర్చువల్ కచ్చడాలు బిగించే ప్రయత్నం చేస్తున్నాయి.డియర్ మీడియా– సోషల్ మీడియా! అవినీతిని వెలికి తీయడమే మీ అత్యున్నత లక్ష్యం అయినపుడు అవినీతే ప్రమాణం కావాలి తప్ప ఎవరి వ్యక్తిగతాలయినా మీకెందుకు! వేల కోట్ల సంపన్నుల మీద పెద్దచూపు, పీడిత వర్గాల వ్యక్తిత్వం మీద చిన్నచూపుతో ఉన్న విషయానికి వంద మసాలా దినుసులు కలిపి వార్తలను వండి వడ్డించే హక్కు మీకుందా? ఒక స్త్రీ ఎంతమందితో తిరిగితే, ఎవరితో ఏ సంబంధంలో ఉంటే, ఎవరితో బిడ్డని కంటే మీకేమిటి నొప్పి? స్త్రీలుగా, పోరాట కులాల స్త్రీలుగా, పౌరులుగా, మనుషులుగా మాకు ఉండే హక్కుల పట్ల ఎలానూ అక్కర లేదు. ఏ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని పసిబిడ్డల పట్ల మానవ సహజమైన తడి కూడా మీకు లేదు. ‘తల్లి వాస్తవం, తండ్రి నమ్మకం’ అన్న నానుడి పాతదే కానీ దాని నిజార్థాన్ని, ‘పిల్లలు మన ద్వారా వస్తారు తప్ప మనకోసం రారు’ అన్న ఖలీల్ గిబ్రన్ తాత్వికార్థాన్ని గ్రహించగలిగితే స్త్రీ పురుష సంబంధాల పట్ల మీ చూపు మారుతుంది. ఒక బిడ్డకు ఎంతమంది డాడీలు అంటూ చర్చ చేసిన ప్రతి మీడియా సంస్థా ఈ రోజు స్త్రీల, బాలల హక్కులను ఉల్లంఘించాయి. వ్యూస్ కోసం ఎంతకైనా తెగించే మిమ్మల్ని చూస్తుంటే, మా శరీరాల చుట్టూ కెమెరాలు బిగించినట్లు, రాబందుల మైకుల చప్పుడు మా తలల మీదుగా వీస్తున్నట్లు ఉంది. దయ చేసి ఆపండి!కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త కార్యదర్శి, ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక, ఏపీmalleswari.kn2008@gmail.com -
రైలు ఎక్కబోయి జారిపడి.. 'జబర్దస్త్' రైటర్ మృతి
కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు శుక్రవారం రైలు ఎక్కుతూ కాలుజారి కింద పడి ప్రముఖ కామెడీ షో 'జబర్దస్త్' స్క్రిప్ట్ రైటర్, సహాయ నటుడు మృతి చెందాడు. ఆర్పీఎఫ్, రైల్వే ప్రయాణికుల కథనం ప్రకారం.. చుంచుపల్లి మండలంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మేదర మహ్మదీన్ హైదరాబాద్ వెళ్లేందుకు తెల్లవారుజామున భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్కు వచ్చాడు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఈ లాజిక్ ఎలా మిస్సవుతున్నారు?)కాకతీయ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కుతుండగా కాలు జారి ప్లాట్ఫాంకు, రైలుకు మధ్య ఇరుక్కుపోయాడు. అప్పటికే రైలు కదులుతుండగా ప్లాట్ఫాం, రైలు మధ్య శరీరం మూడు, నాలుగు సార్లు తిరిగింది. గమనించిన ఆర్పీఎఫ్ పోలీసులు అతని చేతులు పట్టుకుని పైకి లాగారు. దీంతో మహ్మదీన్ పైకి లేచి నడుచుకుంటూ తనకు ఏమి కాలేదని పేర్కొన్నాడు. అయినా ఆర్పీఎఫ్ పోలీసులు 108 వాహనంలో కొత్తగూడెం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఖమ్మం తరలిస్తుండగా మృతి చెందాడు. కాగా మహ్మదీన్ ప్లాట్ఫాం, రైలుకు మధ్య నలిగిపోయి అతని శరీరంలోని అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు నిర్ధారించారు. శరీరంపై మాత్రం నామమాత్రపు గాయాలే ఉన్నాయి. ప్లాట్ఫాం నుంచి 108 వాహనం వరకు, ఆస్పత్రిలో కూడా నడుచుకుంటూ తిరిగిన వ్యక్తి మృతి చెందడం విస్మయానికి గురిచేసింది. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?) -
రచయితగా మారిన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్!
అల్లరి నరేష్ చిత్రం సుడిగాడు సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన శ్రీ వసంత్. టాలీవుడ్లో పలు సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. తాజాగా విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా సినిమాకు శ్రీ వసంత్ సాంగ్స్, మాటలు రాశారు. నిధిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 14న థియేటర్లలో రిలీజైంది. విజయ్ సేతుపతి నటించిన 50వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహారాజ ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్గా ప్రేక్షకులను అలరిస్తోంది.ఒక మంచి సినిమాకు మాటలు, పాటలు రాయడం సంతోషాన్ని కలిగిస్తుందని శ్రీ వసంత్ తెలిపారు.మహారాజ సినిమాలోని "అమ్మ నీకే నాన్నయ్యనా" అంటూ సాగే పాటలు శ్రీ వసంత్ స్వరాలు పాపులర్ అయ్యాయి. అజనీస్ లోకనాధ్ సంగీతం పాటకు మరో బిగ్ అడ్వాంటేజ్. దీంతో మహారాజ సినిమాకు విడుదలైన రోజే మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అలాగే మహారాజా సినిమాకు రివ్యూస్లోనూ మాటలు, పాటల గురించి కూడా పాజిటివ్గా రాసుకొచ్చారు. శ్రీ వసంత్ స్వీయ డబ్బింగ్ కంపెనీ పోస్ట్ ప్రో మీడియా వర్క్స్లో మాహారాజ సినిమా డబ్బింగ్ పూర్తి చేశారు. -
గ్రామ రాజ్యం బీసీల పరం కావాలి!
తెలంగాణ పల్లెల్లో నేటికినీ కొనసాగుతున్న ఆధిపత్య వర్గాల పెత్తందారీతనాలు నామరూపాలు లేకుండా పోవాలంటే స్థానిక రాజ్యాలు (సంస్థలు) బహుజన వర్గాల చేతుల్లోకి రావాలి. స్థానిక రాజ్యాలైన గ్రామపంచాయతీ, మండల పరిషత్తు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్, కో ఆపరేటివ్ సొసైటీలు, డీసీసీబీలు, డీసీఎంఎస్లు, స్కూలు కమిటీలు, గ్రామ అభివృద్ధి కమిటీలలోకి పెద్దసంఖ్యలో చదువుకున్న బహుజన యువకులు రావాలి.అంటే బీసీ యువత పెద్దఎత్తున స్థానిక గ్రామీణ రాజకీయ రంగంలోకి రావాలి. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి స్థానిక పాలనలో రాజ్యాంగబద్ధంగా ఉన్న రిజర్వేషన్ల స్థానాల్లోకి చదువుకున్న దళిత, గిరిజన, ఆదివాసీ, మైనారిటీ తెగలకు చెందిన యువత రావాలి. ఈ పని జరిగినప్పుడే గ్రామాలలో సామాజిక మార్పులు సాధ్యమవుతాయి.తరతరాలుగా బీసీ వర్గాలకు చెందినవాళ్ళు ఎంబీసీలు, సంచార, అర్థసంచార జాతులు, ఉత్పత్తి కులాలకు చెందినవాళ్ళు సంపద సృష్టికర్తలుగా ఉన్నారు. కానీ రాజకీయ రంగంలోకి మాత్రం రాలేదు. సమాజంలో సగానికిపైగా ఉన్న ఉత్పత్తి కులాలకు చెందినవారి భాగస్వామ్యం స్థానిక సంస్థల్లో లేకపోవడం వల్ల ఆ వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. అత్యధిక జనాభా కలిగిన వెనుకబడిన కులాల సమస్యల పరిష్కారాలు ఆ యా కులాలవారు రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నప్పుడే సాధ్యమవుతుంది.తరతరాలుగా విన్నపాలు, విజ్ఞప్తులు పట్టుకుని గ్రామ పంచాయతీలు, మండల, జడ్పీ కార్యాలయాలు, కలెక్టరేట్ల దగ్గర నుంచి సచివాలయాల వరకు చెప్పులరిగేలా తిరిగిన బహుజన కులాలవాళ్ళు తమ సమస్యల పరిష్కారానికి తామే స్థానిక రాజ్యాల నాయకులు కావటం చాలా మార్పులకు దారితీస్తుంది. ఇది బీసీలకు రాజకీయ న్యాయంగా మాత్రమే కాకుండా మొత్తంగా సామాజిక పరివర్తనగా చూడాలి.గ్రామాలు దేశానికి ఊపిరైతే ఆ గ్రామాలకు ఉత్పత్తి కులాలు, ఉత్పత్తి శక్తులే ప్రాణాలు. బీసీల్లో చదువుకున్న కొత్తతరం తనకున్న పరిశోధనాత్మక ఆలోచనలను గ్రామాభివృద్ధిపై పెడితే ఊహించని అద్భుత ఫలిలాలు వస్తాయి. గ్రామం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తన చుట్టూ ఉన్న సహజ వనరులను ఉపయోగించుకుని సంపద సృష్టించే కేంద్రంగా మారుతుంది. కులవృత్తులు నేడు కునారిల్లుతున్నాయి. అవి అత్యాధునిక రూపం దాల్చితేనే నేటి ప్రపంచానికి అవసరమైన సంపదలను అందించే కేంద్రంగా గ్రామాలను తయారుచేయడం సాధ్యమవుతుంది. ఇదంతా జరగాలంటే స్థానిక సంస్థలపై బహుజనుల అధికారం నెలకొనాలి.జనాభాలో బీసీల సంఖ్యను బట్టి దామాషా ప్రకారం అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలి. ఆ యా బీసీ కులాలవారు అన్ని రంగాల్లో శిరసెత్తుకుని నిలిచేందుకు తమ అస్తిత్వ ఉద్యమాలను కొనసాగించక తప్పదు. దీన్ని కులకోణంగా తప్పుడు విశ్లేషణలు చేసి బడుగుల చైతన్యాన్ని పక్కదారి పట్టించే పనిని ఆధిపత్య వర్గాలు విస్తృతంగా చేస్తూ ఉన్నాయి. కులగణన చేయాలని అస్తిత్వ కోణం నుంచి అడుగుతుంటే అడ్డుతగులుతూ కులగణన చేస్తే దేశ సమగ్రత దెబ్బతింటుదన్న వాదనలు తీసుకువస్తున్నారు.బీసీలు సంపూర్ణ రాజకీయ సాధికారత సాధించకుండా సమాజ వికాసం సంపూర్ణం కాదు. ఈ విషయాన్ని మరుగున పరుస్తూ బీసీల అస్తిత్వమే లేకుండా చేసేందుకు ఆధిపత్య వర్గాలు పనిచేయటం కొత్తేమీ కాదు. బడుగులకు విద్యా, ఉద్యోగ విషయాలలో రిజర్వేషన్లు ఇచ్చేందుకు మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేసే సమయంలో ఆధిపత్య వర్గాలు సృష్టించిన అలజడులు అన్నీ ఇన్నీ కావు. అన్ని పార్టీలలోని ఆధిపత్యవర్గాలు తెరవెనుకనుంచి చేసిన కుట్రలన్నీ చరిత్రలో పదిలంగా రికార్డయ్యే ఉన్నాయి.ఇపుడు బీసీల కులగణన చేయమంటే సమాజం కులాల పేరున విడిపోయి అల్లకల్లోలం అవుతుందన్న వాదనలు ఆధిపత్య వర్గాలు ముందుకు తెస్తున్నాయి. తెలంగాణ ప్రజలు స్వీయరాజకీయ అస్తిత్వం కోణం నుంచి 14 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం నిర్వహించి రాష్ట్ర సాధనలో విజయం సాధించి ప్రపంచ అస్తిత్వ ఉద్యమాలలో నిలిచారు. స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజలు ఇపుడు బహుజన స్వీయరాజకీయ అస్తిత్వాన్ని సాధించుకోవాలి. ఇది సాధించినప్పుడే స్వరాష్ట్రం సాధించుకున్న లక్ష్యం పరిపూర్ణమవుతుంది.ఈ దిశలోనే స్థానిక సంస్థల్లో బీసీలకు తమ జనాభా ఎంతో అంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. 2023 ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ను కాంగ్రెస్ విడుదల చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తానని వాగ్దానం చేసింది. జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సందర్భంగా బడుగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.రాహుల్ గాంధీ, కులగణన చేస్తామని దేశమంతా చెబుతున్నారు. కులగణన చేసి స్థానిక సంస్థల్లో ‘మేమెంతో మా వాటా అంత రిజర్వేషన్లు ఇవ్వాల’నీ, ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బీసీలు బెర్రగీసి అడుగుతున్నారు. ఈ విషయంలో బీసీలపై కాంగ్రెస్కు ఉన్నది అసలు ప్రేమా లేక ఓట్ల కోసం చేసిన వాగ్దానమా బట్టబయలు కావల్సి ఉంది. ఏం జరుగబోతుందోనని 2 కోట్ల మంది బీసీలు ఎదురు చూస్తున్నారు.– అభిప్రాయం: జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త కవి, రచయిత -
ఆంగ్ల ఆధ్యాత్మికవాది
ఒక మనిషి ఇంత రాయగలడా అని ఆశ్చర్యానికి గురిచేసే రచయిత జి.కె. చెస్టర్టన్. ఇరవయ్యో శతాబ్దపు ఈ సుప్రసిద్ధ ఆంగ్ల రచయితకు ఇది 150వ జయంతి సంవత్సరం. 1874 మే 29న లండన్లో జన్మించిన గిల్బర్ట్ కీత్ చెస్టర్టన్ నవలలు, కథలు, నాటికలు, కవితలు, సాహిత్య విమర్శ, కళా విమర్శ, చరిత్ర, వ్యాసాలతో సుమారు 80 పుస్తకాలను వెలువరించారు. ‘నెపోలియన్ ఆఫ్ నాటింగ్ హిల్’, ‘ద మ్యాన్ హూ వజ్ థర్స్డే’ ఆయన గొప్ప నవలలు. ‘ది ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్’ పత్రికకు ఏకంగా 30 ఏళ్లపాటు; ‘డైలీ న్యూస్’కు 13 ఏళ్లపాటు వీక్లీ కాలమ్స్ రాశారు. మొత్తంగా సుమారు 4,000 వ్యాసాలు! ఆరడుగుల నాలుగు అంగుళాల ఎత్తు, 130 కిలోల బరువుండే ఈ భారీకాయుడు స్టేషన్లలో కూడా రాసేవారు. రాతలో ఎంతగా మునిగిపోయేవాడంటే, ప్రతిసారీ ఎక్కాల్సిన రైలును మిస్సయ్యేవారు. పలు కార్యక్రమాల్లో తలమునకలుగా ఉంటూ, తర్వాత ఏం చేయాలో మరిచిపోయేవారు. ఒకసారైతే, ‘హార్బరో మార్కెట్లో ఉన్నాను. నేనెక్కడ ఉండాల్సింది?’ అని భార్యకు టెలిగ్రామ్ పంపారు. భర్త అన్ని వ్యవహారాలనూ చూసుకునే ఫ్రాన్సెస్ ‘ఇంటికి వచ్చెయ్యండి’ అని జవాబిచ్చారు.‘ఆయన ప్రతిదాని గురించి ఎంతో కొంత, అలాగే దాన్ని అందరికంటే మెరుగ్గా చెప్పారు’ అంటారు చెస్టర్టన్ భావజాలాన్ని ప్రచారం చేయడానికి నెలకొల్పిన ‘అమెరికన్ చెస్టర్టన్ సొసైటీ’ సహవ్యవస్థాపకుడు డేల్ అహ్లిక్విస్ట్. క్రైస్తవ మతంలోని థీమ్స్, సింబాలిజం చెస్టర్టన్ రచనల్లో ఎక్కువగా కనబడతాయి. క్రైస్తవంలోని ప్రేమ, కారుణ్యం వైపు ఎందరినో ఆయన ఆకర్షించారు. నాస్తికుడైన బ్రిటిష్ రచయిత సి.ఎస్.లూయిస్ను తిరిగి క్రైస్తవుడిగా మారేట్టుగా చెస్టర్టన్ రచనలే ప్రభావం చూపాయి. సతతం విశ్వాసిగా మసలుకోవడమే కాక, ఎంతోమందిని విశ్వాసం వైపు మళ్లించడం, శత్రువులను కూడా ద్వేషించకపోవడం వంటి అంశాలను చూపుతూ చెస్టర్టన్ బీటిఫికేషన్కు యోగ్యమైన కారణాలున్నాయని వాదిస్తారు క్యాథలిక్ రచయిత జోసెఫ్ పియర్సీ. భిన్న భావజాలానికి చెందిన జార్జ్ బెర్నార్డ్ షా, హెచ్.జి.వెల్స్, బెర్ట్రాండ్ రసెల్ లాంటి రచయితలతో విభేదిస్తూ చెస్టర్టన్ తీవ్రమైన వాదాలు జరిపేవారు. అయినా వాళ్ల స్నేహం చెడలేదు. శత్రువును కూడా ప్రేమించమనే భావనే ఆయన్ని అలా మసలుకునేట్టు చేసింది. ఆయన ఈ ప్రేమగుణంలోంచి పుట్టిందే ప్రీస్ట్ డిటెక్టివ్ ‘ఫాదర్ బ్రౌన్’ పాత్ర. శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా కేసులను పరిశీలించే షెర్లాక్ హోమ్స్లా కాకుండా అనుమానం, ఆధ్యాత్మిక అవగాహనల ఊతంతో నేరస్థుల మనసుల్లోకి చొచ్చుకెళ్లి వారిని పట్టుకుంటాడు ఫాదర్ బ్రౌన్. చెస్టర్టన్ పారిశ్రామికీకరణను వ్యతిరేకించారు. ధార్మిక జీవితాన్ని ప్రవచించారు. ఐరిష్ జాతీయోద్యమానికి ఊతమిచ్చారు. ఐరిష్ ప్రజలు ఇంగ్లిష్వారికి భిన్నమైనవారనీ, వారు తమవైన సంప్రదాయాలను కాపాడుకుంటూ తమ సొంత దేశంలో సొంత విధానంలో స్వతంత్ర పాలనకు అర్హులనీ వాదించారు. అయితే, ఆయన్ని ఇరవయ్యో శతాబ్దపు విలువైన థింకర్గా పరిగణించడానికి ఒక కారణం– ‘డిస్ట్రిబ్యూటిజం’ (పంపిణీవాదం)ను ఆయన ఎత్తుకున్న తీరు! చెస్టర్టన్ సోదరుడు సీసిల్, అతడి స్నేహితుడు హిలైర్ బెల్లోక్ ‘డిస్ట్రిబ్యూటిజం’ ఆర్థిక తత్వాన్ని వృద్ధి చేశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో సీసిల్ చనిపోయాక చెస్టర్టన్ దీనికి ప్రధాన ప్రచారకర్తగా మారడమే కాక, ప్రధానంగా ఈ భావధార ప్రచారం కోసం ‘జీకేస్ వీక్లీ’ నడిపారు. నియంత్రణ లేని క్యాపిటలిజం, సోషలిజాలకు భిన్నమైన మూడో పంథాగా ఉంటూ, ఆస్తులు, రాజకీయాధికారాల పంపిణీ జరగాలంటుంది ఈ వాదం. ‘మూడు ఎకరాలు – ఆవు’ అనేది వీరి స్లోగన్.సూత్రప్రాయంగా జాతీయవాదానికి చెస్టర్టన్ వ్యతిరేకి కాకపోయినా, తన మూలాలను విస్మరించే జాతీయవాదానికి అర్థం లేదంటారు. అందుకే భారత జాతీయోద్యమాన్ని ‘అది భారతీయమూ కాదు, అంత జాతీయమూ కాదు’ అని నిరసించారు. 1909లో ‘ది ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్’లో చెస్టర్టన్ రాసిన ఒక వ్యాసం మహాత్మా గాంధీ మీద ‘పిడుగుపాటు’లా పడింది. వెంటనే దానికి చిన్న పరిచయం రాస్తూ ‘ఇండియన్ ఒపీనియన్’లో పునర్ముద్రింపజేశారు. ‘వాళ్ల దేశానికి మన పార్లమెంట్ కావాలి, మన జ్యుడీషియరీ కావాలి, మన పత్రికలు కావాలి, మన సైన్స్ కావాలి. భారత జాతీయవాదులు ఇవన్నీ కోరుకోవడమంటే వాళ్లు ఇంగ్లిష్వారిలా ఉండాలనుకుంటున్నారు’ అన్నారు చెస్టర్టన్. అది సహేతుకమని గాంధీజీ బలపరుస్తూ, ‘స్వతంత్రంగా ఉండాలంటే ఇండియా తనకు తానుగా ఉండాలి, బ్రిటన్లా మారకూడదు. అదే పనిగా అనుకరిస్తే మన దేశం హిందుస్థాన్ కాదు, ఇంగ్లిషిస్థాన్ అవుతుంది’ అని రాశారు.విస్తృతిలో, భావధారలో తెలుగు సాహిత్య శిఖరం విశ్వనాథను కొంతవరకూ స్ఫురింపజేసే చెస్టర్టన్కు రావాల్సినంత కీర్తి రాలేదన్నది కొందరి వాదన. ఇరవయ్యో శతాబ్దపు గొప్ప రచయిత, ఆలోచనాపరుడు అయినా చెస్టర్టన్ విస్మరణకు గురికావడానికి ఆయన అన్ని రకాలుగా రాయడమే కారణమన్నది దీనికి వివరణ. ‘ఒక్కమాటలో రచయితలు ఫలానా వర్గంలోకి ఇట్టే ఒదగకపోతే వాళ్లు చీలికల్లోంచి కిందికి జారిపోయే ప్రమాదం ఉంది’ అంటారు అహ్లిక్విస్ట్. అయినా ఆయన్ని తలకెత్తుకునేవాళ్లు ఉంటూనే ఉన్నారు. చెస్టర్టన్ను ఎడ్గార్ అలెన్ పోతో పోల్చారు బోర్హెస్. ‘చెస్టర్టన్కు ప్రపంచం తగినంత కృతజ్ఞత చూపలే’దని అన్నారు జార్జ్ బెర్నార్డ్ షా. అయితే జాన్ పైపర్ వ్యాఖ్యానం చెస్టర్టన్కు తగిన నివాళి: ‘చెస్టర్టన్ కోసం నేను దేవుడికి కృతజ్ఞత చెబుతాను’ అన్నారాయన. -
కేంద్రంపై యూకే రచయిత నిటాషా సంచలన ఆరోపణలు
లండన్: భారత సంతతికి చెందిన యూకే ప్రొఫెసర్, రచయిత నిటాషా కౌల్కు భారత ప్రభుత్వం ఎంట్రీ నిరాకరించింది. కర్ణాటక ప్రభుత్వ ఆహ్వానం మేరకు బెంగళూరు ఎయిర్పోర్టులో దిగిన తనను ఇమిగ్రేషన్ సిబ్బంది అడ్డుకున్నారని ఆమె తెలిపారు. అనంతరం తిరిగి తనను లండన్ పంపేశారని, అడిగితే నీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదని చెప్పారన్నారు. ఈ విషయాలన్నింటిని ఆమె తాజాగా ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. ‘‘ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలు’ అనే అంశంపై మాట్లాడేందుకు కర్ణాటక ప్రభత్వం నన్ను ఆహ్వానించింది. కానీ కేంద్ర ప్రభుత్వం నన్ను ఎయిర్పోర్టులోనే ఆపేసి తిరిగి లండన్ పంపించివేసింది. నా వద్ద అవసరమైన డాక్యుమెంట్లన్నీ ఉన్నాయి. గతంలో ఆర్ఎస్ఎస్పై విమర్శలు చేసినందుకే నన్ను వెనక్కిపంపుతున్నట్లు అధికారులు అనధికారికంగా నాతో చెప్పారు. లండన్ నుంచి 24 గంటల పాటు ప్రయాణించి బెంగళూరు వస్తే మళ్లీ 24 గంటలు అటు ఇటు తిప్పి నన్ను ఎయిర్పోర్టులోనే ఉంచారు. కనీసం ఆహారం, మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. పడుకోవడానికి కొద్దిగా స్థలం చూపించారు. అక్కడ కూడా కనీసం దిండు ఇవ్వలేదు. సీసీ కెమరా పర్యవేక్షణలో ఉంచారు. నేను ఎన్నోసార్లు భారత్ వచ్చాను. నాకు దేశంలోకి అనుమతి లేనట్లు కనీసం ముందుగా కూడా చెప్పలేదు. కర్ణాటక ప్రభుత్వమే నాకు టికెట్లు ఇచ్చింది’అని కౌల్ ఎక్స్లో తెలిపారు. ఇదీ చదవండి.. భారత సంతతి కంప్యూటర్ ఇంజినీర్కు ప్రతిష్టాత్మక అవార్డు -
ఫస్ట్–రేట్ రచయిత
సెకండ్–రేట్ రచయితల్లో తాను మొదటి వరుసలో ఉంటానని చెప్పుకొన్నాడట సోమర్సెట్ మామ్. ఆయన దృష్టిలో బాల్జాక్, డికెన్ ్స, టాల్స్టాయ్, దోస్తోవ్స్కీ ప్రపంచం చూసిన నలుగురు గొప్ప నవలాకారులు. పాఠకులను సాహిత్యం వైపు ఆకర్షించడమే కొందరు రచయితల విలువైన కాంట్రిబ్యూషన్ అవుతుంది. ఇక్కడ కూడా మామ్ మొదటి వరుసలో ఉంటారు. ఆంగ్ల అనువాద కథలతో పరిచయం ఉండే తెలుగు పాఠకులకు దాదాపుగా తగిలే మొదటిపేరు విలియమ్ సోమర్సెట్ మామ్. అత్యధిక కాపీల అమ్మకం, అత్యంత పేరు, అత్యధిక సంపాదనలతో చాలా విధాలుగా ఒక కమర్షియల్ రచయిత కూడా కలలు కనలేని జీవితాన్ని మామ్ అనుభవించాడు. హాలీవుడ్ సినిమాలకు పనిచేశాడు, దేశదేశాలు తిరిగాడు, అత్యంత ప్రముఖులతో విలాసవంతమైన టూర్లు, డిన్నర్లల్లో పాల్గొన్నాడు. తన గురించి మామ్ ఏమని చెప్పుకొన్నా, ఆయన ‘ద మూన్ అండ్ సిక్స్పెన్ ్స’, ‘ద పేంటెడ్ వీల్’, ‘కేక్స్ అండ్ ఎయిల్’, ‘ద రేజర్స్ ఎడ్జ్’ గొప్ప నవలలుగా పేరొందాయి. ఇక మామ్ మాస్టర్పీస్గా చెప్పే ‘ఆఫ్ హ్యూమన్ బాండేజ్’ ప్రపంచ గొప్ప నవలల్లో ఒకటిగా నిలిచిపోయింది. నూటికి పైగా కథలు, పదులకొద్దీ నాటకాలు, నవలలు... ఎంత విస్తృతంగా రాశాడో అంత ఆదరణ పొందిన మామ్కు ఇది నూటా యాభయ్యో జయంతి సంవత్సరం. మామ్ జీవితంలోనూ ఒక రచనకు కావాల్సినంత డ్రామా, కన్నీళ్లు, కష్టాలు, ట్విస్టులు ఉన్నాయి. గొప్ప ఆంగ్ల రచయితల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఆంగ్లాన్ని చిన్నతనంలో సాటి విద్యార్థులు హేళన చేసేవారు. కారణం, జన్మకు ఆంగ్లేయుడు అయినా, పుట్టింది ఫ్రెంచ్ గడ్డ మీద. అలా ఫ్రెంచ్ ఆయన మొదటి భాష అయింది. ఫ్రెంచ్ గడ్డ మీద పుట్టిన అందరూ ఫ్రెంచ్వాళ్లే అవుతారనీ, తప్పక మిలిటరీలో చేరాల్సిందేననీ శాసనం వచ్చినప్పుడు ఆ స్థానీయతను తప్పించుకోవడానికి మామ్ కుటుంబం ఫ్రాన్ ్సలోని బ్రిటిష్ దౌత్య కార్యాలయాన్ని ఆశ్రయించింది. అందులోనే మామ్కు జన్మనిచ్చింది(1874 జనవరి 25) వాళ్ల తల్లి. అలా బ్రిటన్ ఎంబసీలో జన్మించడం వల్ల మామ్ బ్రిటనీయత స్థిరపడిపోయింది. వాళ్ల గ్రేట్–అంకుల్ గుర్తుగా పెట్టిన సోమర్సెట్ అనే మధ్యపేరు ఆయనకు నచ్చలేదు. ఇంట్లో విల్లీ అని పిలిచేవాళ్లు. మామ్కు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడే తల్లి క్షయవ్యాధితో చనిపోయింది. ఆ లోటు ఆయనకు ఎప్పుడూ తీరలేదు. ‘అది ఎప్పడూ పూర్తిగా మానని గాయం’గానే ఉండిపోయింది. వృద్ధుడయ్యాక కూడా తల్లి ఫొటోను మంచం పక్కనే ఉంచుకునేవాడు. ఆ తర్వాత రెండేళ్లకే తండ్రి చనిపోవడం మరో దెబ్బ. అప్పుడు బ్రిటన్ లోని చిన్నాన్న దగ్గరికి వచ్చాడు. ఆ కొత్త ఇల్లు, వాతావరణం బాగున్నప్పటికీ, తల్లిదండ్రులు లేని చింత, కొత్త సమాజంలో కలవలేకపోవడం, సిగ్గరి కావడం వంటి కారణాల వల్ల ఇట్టే మాట్లాడేవాడు కాదు. అది క్రమంగా నత్తిగా మారి జీవితాంతం ఆయనతో ఉండిపోయింది. తాత, తండ్రి న్యాయవాదులు అయినప్పటికీ మామ్ ఆ బాటలోకి పోకపోవడానికి ఈ నత్తి కూడా ఒక కారణం. డాక్టర్ కాబోయి యాక్టర్ అవడంలా కాకుండా, నిజంగానే డాక్టరీ చదివినా దాని జోలికి పోకుండా రంగస్థలంలో ప్రాక్టీస్ చేశాడు మామ్. నాటకాలతో ముందు ప్రజాదరణ పొందినా తర్వాత నవలలు, కథల మీద మాత్రమే దృష్టిసారించాలని నిశ్చయించుకున్నాడు. ఒక చదవదగ్గ కథకు మెటీరియల్ రాకపోతే తానెవరి సమక్షంలోనూ గంటసేపు కూడా గడపనని అనేవాడు. ఆయనకు ఏదైనా కథావస్తువే. దానికి తగినట్టే ఆయన జీవితం కూడా అనుభవాల పుట్ట. యువకుడిగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ సీక్రెట్ ఇంటెలిజెన్ ్స సర్వీస్ కోసం కొన్నాళ్లు స్విట్జర్లాండ్లో గూఢచారిగా పనిచేశాడు. ఫ్రెంచ్ నాటక రచయిత అన్నది అప్పుడు ఆయన కవర్. తర్వాత, రష్యాలోనూ బోల్షివిక్కులకు వ్యతిరేకంగా, జర్మన్ నిఘా నెట్వర్క్ మీద సమాచారాన్ని పంపాడు. మెన్షివిక్కులకు మద్దతు ఇవ్వాలన్నది బ్రిటన్ ఆలోచన. జర్మనీలో చదువుకున్నందువల్ల మామ్కు జర్మన్ వచ్చు. ఈసారి అమెరికా పబ్లిషర్ అనేది కవర్. అయితే ఈ అనుభవాలను రచనలుగా తెచ్చాడుగానీ అధికార రహస్యాల చట్టాన్ని ఇవి ఉల్లంఘిస్తుండటంతో చాలావాటిని కాల్చేశాడు. అయినా గూఢచర్య కథలు రాసిన తొలి గూఢచార రచయిత మామ్ అయ్యాడు. జేమ్స్ బాండ్ సిరీస్ రాయడానికి ఇయాన్ ఫ్లెమింగ్కు ప్రేరణగా నిలిచాడు. కానీ గూఢచర్యంలో పనిరోజులు ఒకేవిధంగా ఉండి విసుగు పుట్టిస్తాయనీ, చాలా రోజులు నిరర్థకమనీ వ్యాఖ్యానించాడు. ఇటీవల వచ్చిన మలయాళ సినిమా ‘కాదల్’లో హోమోసెక్సువల్ అయినప్పటికీ హీరోకు ఒక కూతురు ఉంటుంది. దాంపత్య బంధపు ఒత్తిడి అది. మామ్ కూడా లైంగిక ధోరణి రీత్యా హోమోసెక్సువల్. పదేళ్ల వివాహ బంధంతో ఆయనకు ఒక కూతురు. కానీ తర్వాత వివాహం నుంచి విముక్తం అయ్యి స్నేహితులతో స్వేచ్ఛాజీవితం గడిపాడు. తల్లి దూరమవడం మొదలు తన జీవితంలోని అపసవ్యతలన్నింటి కారణంగా, జీవితాంతం దేవుడి మీద అవిశ్వాసిగా ఉన్న మామ్ తన ఆత్మకథాత్మక నవలను చివరి దశలో చదువుకున్నా కన్నీళ్లు కార్చకుండా పూర్తిచేసేవాడు కాదు. ఇంకేది కలిపినా డిజైన్ పాడవుతుందని తెలిసినప్పుడు ఆర్టిస్ట్ ఇక దాన్ని వదిలేసినట్టుగా, తాను రచయితగా సంతృప్తికర దశలో ఉన్నప్పుడే జీవితాన్ని చాలించాలని మామ్ ఆశపడ్డాడు. అన్నింటి విషయంలో జరిగినట్టుగానే ప్రకృతికి ఆయన విషయంలో వేరే లెక్ఖుంది. కోరుకున్న ముప్పై సంవత్సరాల తర్వాత, అన్ని వృద్ధాప్యపు సమస్యలతో పాటు 91 ఏళ్ల నిండుతనం కూడా ఇచ్చిగానీ ఆయన్ని సాగనంపలేదు. -
టాలీవుడ్ అగ్ర నిర్మాతపై అసభ్యకర కామెంట్స్.. ప్రముఖ సినీ రచయితపై కేసు.!
సినీ మాటల రచయిత రాజసింహపై కేసు నమోదైంది. ప్రముఖ నిర్మాత కూచిబొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కథల విషయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన వివాదమే కారణమని తెలుస్తోంది. రాజాసింహ తన కుటుంబ సభ్యులకు అసభ్యకరమైన, బెదిరింపు సందేశాలు పంపిస్తున్నట్లు వివేకానంద ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టను అగౌరవపర్చేలా సామాజిక మాధ్యమాల్లోనూ సందేశాలు పెట్టాడని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా దర్శకుడు రాఘవేంద్రరావు, వైవీఎస్ చౌదరి, ఠాగూర్ మధు లాంటి వారిని సైతం దూషిస్తూ సందే శాలు పెట్టాడని కూచిబొట్ల గురువారం పోలీసులను ఆశ్రయించారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు. అసలు రాజాసింహ ఎవరు? ఇదిలా ఉండగా.. రాజసింహ తడినాడ దాదాపు 60 సినిమాలకు పైగా రచయితగా పనిచేశాడు. అల్లు అర్జున్ నటించిన ‘రుద్రమదేవి’ సినిమాకి డైలాగ్ రైటర్గా పని చేశారు. ఆ సినిమాలో అల్లు అర్జున్ పోషించిన ‘గోన గన్నా రెడ్డి’ పాత్రకి రాజసింహ రాసిన డైలాగులకి చాలా మంచి గుర్తింపు వచ్చింది. అదే క్రేజ్తో దర్శకుడిగా మారిన రాజసింహ.. యంగ్ హీరో సందీప్ కిషన్తో 'ఒక అమ్మాయి తప్ప' అనే సినిమా చేశాడు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో రాజసింహకి సినిమా అవకాశాలు తగ్గాయి. అయితే పర్సనల్ లైఫ్లో ఇబ్బందుల కారణంగా రాజసింహ గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పటినుంచి రాజసింహ బయట పెద్దగా కనిపించడం లేదు. -
అయోధ్యలో శ్రీరాముణ్ణి కీర్తించనున్న దివ్యాంగ కవి
ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ముందుగానే అయోధ్యలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈనెల 14న అయోధ్యలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి దివ్యాంగ కవి అక్బర్ తాజ్ను జగద్గురు సంత్ రామభద్రాచార్య ఆహ్వానించారు. అక్బర్ తాజ్ మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలోని హప్లా-దీప్లా గ్రామానికి చెందిన దివ్యాంగ కవి. ఆయన కవితలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా అక్బర్ తాజ్ శ్రీరాముని గుణగణాలను కీర్తిస్తూ పలు రచనలు చేశారు. శ్రీరాముడు అందరికీ చెందినవాడని అక్బర్ తాజ్ చెబుతుంటారు. 44 ఏళ్ల అక్బర్ తాజ్ దృష్టిలోపంతో బాధపడుతున్నారు. బ్రెయిలీ లిపిని కూడా అక్బర్ తాజ్ నేర్చుకోలేదు. అయినప్పటికీ అక్బర్ తాజ్ తన మనసులోని భావాలను ఇతరుల చేత రాయిస్తుంటారు. ఆయన దేశవ్యాప్తంగా పలు వేదికలపై తన హిందీ, ఉర్దూ రచనలను వినిపించారు. రామునిపై ఆయన చేసిన రచనలు ఆయనకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. జనవరి 22న రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు తనను ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని అక్బర్ తెలిపారు. -
Tanuja Chandra: చీకటి వెలుగుల దారుల్లో...
కథలు ఆకాశం నుంచి నేలకు దిగి రావు. ఈ నేలలో అనేక కథలు దాగున్నాయి. వాటి జాడలు వెదుక్కుంటూ వెళ్లడమే సృజనకారుల పని. బంధువులను వెదుక్కుంటూ ఉత్తర్ప్రదేశ్లోని మారుమూల గ్రామాలకు వెళ్లిన రైటర్, డైరెక్టర్ తనూజ చంద్ర తనకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకుంది. మహిళలు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలపై డాక్యుమెంటరీలు తీయాలని నిర్ణయించుకుంది... తనూజ చంద్ర తల్లి కామ్నా చంద్ర రైటర్, సోదరుడు విక్రమ్ చంద్ర రైటర్, సోదరి అనుపమ చోప్రా ఫిల్మ్ క్రిటిక్. రెండు ముక్కల్లో చెప్పుకోవాలంటే ఇంటి నిండా సృజనాత్మక వాతావరణం కొలువై ఉండేది. టీవీ సిరీస్ జమీన్ ఆస్మాన్(1996)తో డైరెక్టర్గా వినోదరంగంలోకి అడుగుపెట్టింది తనూజ. మహేష్భట్ ‘జఖ్మ్’ సినిమాకు స్క్రీన్ప్లే రాసి మంచి పేరు తెచ్చుకుంది. సంజయ్ దత్, కాజోల్ జంటగా నటించిన ‘దుష్మన్’ సినిమాతో బాలీవుడ్లో డైరెక్టర్గా తొలి అడుగు వేసింది. ‘నేను కమర్షియల్ డైరెక్టర్ని మాత్రమే’ అనే ధోరణిలో కాకుండా మహిళల జీవితానికి సంబంధించిన సమస్త కోణాలను సినిమా, ఓటీటీ మాధ్యమాలపై ఆవిష్కరిస్తోంది తనూజ. ‘ఊహాల్లో నుంచి మహిళలకు సంబంధించిన కథలను అల్లడం కంటే వారి దగ్గరకు వెళ్లి మాట్లాడితే నిజమైన కథలు వస్తాయి’ అంటున్న తనూజ స్క్రిప్ట్ మేకింగ్ కోసం రైటింగ్ రూమ్కు మాత్రమే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఎంతోమంది మహిళలతో మాట్లాడింది. ఆ క్రమంలో తనకు ఏదైనా ఆలోచన వస్తే అది స్క్రిప్ట్గా రూపొందుతుంది. వెండితెరపై రాణిస్తున్న వారు షార్ట్ ఫిల్మ్స్పై పెద్దగా దృష్టి పెట్టరు. తనూజకు మాత్రం ఎలాంటి పట్టింపులు లేవు. పెద్ద డైరెక్టర్గా పేరు వచ్చిన తరువాత కూడా రొమాంటిక్ డ్రామా షార్ట్ ఫిల్మ్ ‘సిల్వత్’ తీసింది. ‘ఏ మాన్సూన్ డేట్’ అనే షార్ట్ ఫిల్మ్కు కూడా విశ్లేషకుల నుంచి ప్రశంసలు లభించాయి. అయిదు సంవత్సరాల క్రితం ఉత్తర్ప్రదేశ్లోని లహ్ర అనే గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లింది తనూజ. అక్కడ తనకు ఇద్దరు మేనత్తలు ఉన్నారు. ఇద్దరూ భర్తను కోల్పోయి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఆంటీ రాధ సరదా మనిషి. శాంతస్వభావి. ఎంత పెద్ద కష్టానికైనా అడ్జస్టైపోతుంది. సుధా ఆంటీ మాత్రం రాధ ఆంటీకి పూర్తి భిన్నం. ఒకరకంగా చెప్పాలంటే ఫైర్బ్రాండ్. చాలా స్క్రిక్ట్. పర్ఫెక్షన్కు ప్రాధాన్యత ఇస్తుంది. ఎక్కడ తేడా వచ్చినా గొడవకు దిగుతుంది. ఒకరి వయసు 93. మరొకరి వయసు 83. వేరు వేరు ప్రపంచాలకు చెందిన ఇద్దరికీ తమ మనస్తత్వాల మూలంగా ఎప్పుడూ గొడవలు రాలేదు. వీరి జీవితాన్ని గురించి లోతుగా తెలుసుకున్న తరువాత ‘ఆంటీ సుధా ఆంటీ రాధ’కు శ్రీకారం చుట్టింది తనూజ. నలభై ఎనిమిది నిమిషాల ఈ డాక్యుమెంటరీలో హాయిగా నవ్వుకునే సన్నివేశాలే కాదు కంట తడి పెట్టించే సన్నివేశాలు కూడా ఉన్నాయి. ‘సాధారణ ప్రజలు అనే మాట వింటుంటాం. అయితే వారి జీవితాలలోకి తొంగి చూస్తే అసాధారణ సన్నివేశాలు, సాహసాలు కనిపిస్తాయి’ అంటున్న తనూజకు ఇది తొలి డాక్యుమెంటరీ ఫిల్మ్. కట్ చేస్తే... ‘వెడ్డింగ్.కాన్’ అనే సరికొత్త డాక్యుమెంటరీ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తనూజ. పెళ్లి చేసుకుంటానని ఎంతోమంది మహిళలకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు కాజేశాడు ప్రజిత్. రకరకాల మారుపేర్లతో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా మోసాలకు పాల్పడేవాడు. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, పశ్చిమబెంగాల్...మొదలైన రాష్ట్రాల్లో ఎంతోమంది మహిళలను మోసం చేశాడు. థానేలోని ధోకాలీ ప్రాంతానికి చెందిన ఒక బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో ప్రజిత్ మోసం వెలుగులోకి వచ్చింది. థానే పోలీసులు ప్రజిత్ను అరెస్ట్ చేశారు. ‘వెడ్డింగ్.కాన్’ డాక్యుమెంటరీ ప్రజిత్లాంటి ఎంతోమంది మోసగాళ్ల మోసాలకు అద్దం పడుతుంది. ‘మ్యాట్రిమోనియల్ మోసాల ద్వారా నష్టపోయిన మహిళలు ఎందరో ఉన్నారు. అయితే చాలామంది పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడానికి ఇష్టపడడం లేదు. దీనికి కారణం తాము తప్పు చేశాం అనే భావన. నలుగురు నవ్వుతారేమో అనుకోవడం. ఇది నన్ను చాలా బాధ పెట్టింది’ అంటుంది తనూజ చంద్ర. అయితే ‘వెడ్డింగ్.కాన్’ బాధిత మహిళలకు ధైర్యాన్ని ఇస్తుంది, న్యాయం కోసం పోరాటం చేసే స్ఫూర్తిని అందిస్తుంది అనడంలో సందేహం లేదు. గమనాన్ని మార్చింది బంధువులను వెదుక్కుంటూ ఉత్తర్ప్రదేశ్లోని మారుమూల గ్రామాలకు వెళ్లినప్పుడు సాధారణ జీవితాల్లోని అసాధారణ దృశ్యాలు కనిపించాయి. ఎంతో మంది మహిళలతో మాట్లాడిన తరువాత...మహిళల గురించి ఓటీటీ మాధ్యమం ద్వారా సీరియస్గా చెప్పాల్సిన కథలు ఎన్నో ఉన్నాయి అనిపించింది. ఆంటీ సుధా ఆంటి రాధ నా గమనాన్ని మార్చింది అని చెప్పవచ్చు. – తనూజ చంద్ర, రైటర్, డైరెక్టర్ -
Chandrika Tandon: తేజో చంద్రిక
ఆరోజు... ‘అలాగే’ అని తల ఆడించి ఉంటే ‘పవర్ఫుల్ ఉమన్’గా ప్రపంచవ్యాప్తంగా చంద్రిక పేరు తెచ్చుకునేది కాదు. ‘ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ఈ ఊళ్లో ఒక్కరోజు కూడా ఉండలేను’ అని భయపడి ఉండే ఉద్యోగజీవితంలోకి వచ్చేది కాదు. తనను తాను నిరూపించుకునేది కాదు. ‘లాయర్ కావాలనుకున్నాను. ఈ ఉద్యోగం ఏమిటి’ అని నిట్టూర్చి ఉంటే చంద్రిక కొత్త శిఖరాలు అధిరోహించేది కాదు. ‘ఉద్యోగ జీవితానికే టైమ్ లేదు. ఇక సంగీతానికి స్థానం ఎక్కడ’ అని సర్దుకుపోయి ఉంటే సంగీత ప్రపంచంలో తనదైన పేరు తెచ్చుకునేది కాదు. ప్రపంచ గుర్తింపు పొందిన బిజినెస్ లీడర్, గ్రామీ–నామినేట్ ఆర్టిస్ట్గా, దాతగా ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తుంది చంద్రిక.... ‘అవసరం లేదు’ ఒక మాటలో తేల్చేసింది అమ్మ. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీలో చేరాలనుకుంటున్న చంద్రికకు ఆ మాట శరాఘాతం అయింది. ‘ఆ కాలేజీలో తక్కువమంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. అంతా అబ్బాయిలే’ అన్నది అమ్మ. చంద్రిక చాలా సేపు అమ్మతో వాదించినా ఫలితం కనిపించలేదు. ఇంట్లోనే నిరాహార దీక్ష చేసింది. దీంతో చంద్రిక మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదవడానికి తల్లి ఒప్పుకోక తప్పింది కాదు. మూడు సంవత్సరాల కాలేజీ జీవితం చంద్రిక జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. సంగీతప్రపంచంతో అనుబంధానికి, సింగర్గా పేరు తెచ్చుకోవడానికి కారణం అయింది. డిగ్రీలో చేరడమే కష్టం అనుకున్న చంద్రిక ఆ తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ చేరడం పెద్ద విజయం. నిజానికి చంద్రికకు బిజినెస్ ప్రపంచంపై పెద్దగా ఆసక్తి లేదు. తాతలాగే లాయర్ కావాలనుకుంది. అయితే ప్రొఫెసర్ స్వామినాథన్ సూచన మేరకు బిజినెస్ స్కూల్లో చేరింది. మొదటి కొన్నిరోజులు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే సొంత ఊరు దాటి అంత దూరం రావడం అదే మొదటిసారి. ఆ ఒంటరితనానికి దూరం కావడానికి సంగీతానికి దగ్గరైంది. చంద్రిక తొలి ఉద్యోగం సిటీబ్యాంక్లో. బ్యాంకర్ కావాలని కలలో కూడా అనుకోని చంద్రికకు ఇది వింతగా అనిపించింది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం లెబనాన్లోని బీరుట్ వెళ్లింది. యుద్ధానికి సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో అక్కడకు వెళ్లింది. అక్కడ అయిదు నెలల పాటు ఉంది. సిటీబ్యాంక్ తరువాత వేరే సంస్థల నుంచి చంద్రికకు అవకాశాలు రావడం మొదలైంది. అలా అమెరికాలోకి అడుగు పెట్టింది. ఉద్యోగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు ఇష్టమైన సంగీతప్రపంచాన్ని మాత్రం చంద్రిక విడిచి బయటికి రాలేదు. ఎన్నో ఆల్బమ్స్ ద్వారా సక్సెస్ఫుల్ మ్యూజిషియన్గా తనను తాను నిరూపించుకుంది. సెకండ్ ఆల్బమ్ ‘సోల్ కాల్’ గ్రామీ అవార్డ్–బెస్ట్ కాంటెంపరరీ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో నామినేట్ అయింది. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ మకెంజీకి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ పార్ట్నర్గా అరుదైన ఘనత సాధించింది. అడ్వైజరీ సంస్థ ‘టాండన్ క్యాపిటల్స్ అసోసియేషన్స్’ ప్రారంభించి సూపర్ సక్సెస్ అయింది. ఈ ప్రయాణంలో చంద్రికకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. కుటుంబజీవితం, వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకోవడం కూడా అందులో ఒకటి. అయితే ప్రతి సవాలును అధిగమిస్తూ ముందుకు వెళ్లింది. సవాలు ముందుకు వచ్చినా, ఒత్తిడి తలలో దూరినా తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం సంగీతం. పాటలు వినడం, పాడడం తనకు ఎంతో ఇష్టం. అదే తన బలం. తాజాగా ‘అమ్మూస్ ట్రెజరర్స్’ ఆల్బమ్తో ముందుకు వచ్చింది చంద్రిక. ఇది పిల్లలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఆల్బమ్. -
బిగ్బాస్ 7: సడన్గా హౌస్లో నుంచి వెళ్లిపోయిన కంటెస్టెంట్!
బిగ్బాస్ షో.. లోనికి వెళ్లడమే కంటెస్టెంట్ల చేతిలో ఉంటుంది. బయటకు రావడమనేది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. వారి ఆట నచ్చినంతవరకు కంటెస్టెంట్లను ముందుకు నడిపిస్తూ ఉంటారు. నచ్చని మరుక్షణం ఓట్లు వేయడం మానేసి ఎలిమినేట్ చేస్తారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం బిగ్బాస్ స్వయంగా కంటెస్టెంట్లను అవతలకు పంపించి వేస్తూ ఉంటాడు. ఒక షో.. రెండు ఇళ్లు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, హౌస్లో ఉండలేకపోతున్నామని పోరు పెడితే ఉన్నపళంగా గేట్లు ఎత్తి వెళ్లిపోమంటాడు. ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. తాజాగా తమిళ బిగ్బాస్ 7వ సీజన్లోనూ ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ 1వ తేదీన తమిళ బిగ్బాస్ 7 ప్రారంభమైంది. ఈ షోలో రెండు హౌస్లు ఉన్నాయి. ఒకటి పెద్దది, రెండవది చిన్న ఇల్లు. నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లను చిన్న ఇంట్లో పెట్టి వారితో పనులు చేయిస్తారు. చిన్న ఇంట్లో ఉన్నవారు ఏ టాస్కుల్లోనూ పాల్గొనడానికి వీల్లేదు. ఆరోగ్యం సహకరించడం లేదంటూ.. రచయిత, నటుడు బావ చెల్లదురై గతవారం నామినేషన్లో ఉండటంతో తనకు కూడా వంట చేయడం, క్లీనింగ్ వంటి పనులు తప్పలేదు. ఈ క్రమంలో ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. ఇదే విషయాన్ని బిగ్బాస్కు చెప్తూ తనను పంపించేయమని వేడుకున్నాడు చెల్లదురై. తన శారీరక, మానసిక ఆరోగ్యం బాగోలేదని, ఇంట్లో నుంచి వెళ్లిపోతానని మొర పెట్టుకున్నాడు. తండ్రిలా చూసుకున్నారు, కానీ.. బాగా ఆలోచించుకుని సమాధానం చెప్పమని బిగ్బాస్ అన్నప్పటికీ తాను వెళ్లిపోవాలన్న మాటకే కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నాడు. 'నేను ఇక్కడ ఇండలేను. ఇంకా ఆలోచించడానికేం లేదు. కంటెస్టెంట్లు నన్ను తండ్రిలా చూసుకున్నారు. కానీ నాకు ఆరోగ్యం సహకరించడం లేదు. ప్లీజ్, వెళ్లిపోతాను' అని అభ్యర్థించాడు. దీంతో బిగ్బాస్ తన కోరిక మేరకు బావ చెల్లదురైని ఇంటి నుంచి పంపించేశాడు. Bava Chelladurai walks out of the show.#BiggBossTamil7 pic.twitter.com/FmVG8sdHM4 — Bigg Boss Follower (@BBFollower7) October 9, 2023 చదవండి: బతుకమ్మ ఆడిన హీరోయిన్స్.. నెట్టింట వీడియో వైరల్ -
డేటింగ్లో స్టార్ హీరోయిన్.. ముచ్చటగా మూడోసారి!
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆమె ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2010లో టీన్ పట్టి సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్రద్ధా.. లవ్ కా ది ఎండ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2013లో విడుదలైన ఆషికి- 2 చిత్రంలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ కూడా లభించింది. శ్రద్దా సినిమాల్లో నటించడంతో పాటు మంచి సింగర్ కూడా. తన సినిమాల్లో చాలా పాటలు పాడింది. (ఇది చదవండి: ప్రతి తండ్రికి ఈ పాట అంకితం: మహేశ్ బాబు ప్రశంసలు) అయితే తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరలవుతోంది. గతంలో ఆషికి-2 నటుడు ఆదిత్య రాయ్కపూర్తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చూసి.. ఆఫ్ స్క్రీన్లోనూ రిలేషన్లో ఉన్నారని అప్పట్లో టాక్ వినిపించింది. ఆ తర్వాత ప్రముఖ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో చెట్టాపట్టాలేసుకుని పలు పార్టీలకు హాజరైంది. ఆ సమయంలో శ్రద్దా కపూర్పై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. తాజాగా శ్రద్ధా కపూర్ అతనితో డేటింగ్లో ఉందన్న వార్త బీటౌన్లో హాట్టాపిక్గా మారింది. తు జూతీ మైన్ మక్కర్' చిత్రానికి సహ రచయితగా పనిచేసిన రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ డేటింగ్ చేస్తోందని బీ టౌన్ టాక్. అయితే ఈ రూమర్స్పై ఇప్పటివరకు అధికారికంగా ఎవరూ స్పందించలేదు. అయితే ఈ జోడీ రిలేషన్లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు. నెటిజన్స్ సైతం న్యూ లవ్ బర్డ్స్ ఇన్ బాలీవుడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో శ్రద్ధా కపూర్కు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'నా భార్య అర్థం చేసుకుంటది.. నువ్వు నా మాట విను'.. ప్రశాంత్పై శివాజీ ఎమోషనల్!) కాగా.. తూ ఝూతీ మైన్ మక్కర్ చిత్రం 2023లో విడుదలైంది. లవ్ ఫిల్మ్స్, టి-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించిన ఈ సినిమాకు లవ్ రంజన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, శ్రద్ధా కపూర్, డింపుల్ కపాడియా, అనుభవ్ సింగ్ బస్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. అమర్ అక్బర్ ఆంథోనీ రచయిత కన్నుమూత!
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ రచయిత ప్రయాగ్ రాజ్ మరణించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం బాంద్రాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఆదిత్య వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వయసు 88 కాగా.. అమితాబ్ బచ్చన్ బ్లాక్ బస్టర్ హిట్స్ అమర్ అక్బర్ ఆంథోనీ, నసీబ్, కూలీ చిత్రాలకు పనిచేశారు. ఆయన మృతిపట్ల అమితాబ్తో పాటు అనిల్ కపూర్ సంతాపం ప్రకటించారు. అమితాూబ్ బచ్చన్ నసీబ్, సుహాగ్, కూలీ, మర్డ్ చిత్రాలకు కథను అందించిన ప్రయాగ్ రాజ్.. రచయితగా 100కి పైగా చిత్రాలకు పనిచేశారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!) రాజేష్ ఖన్నా రోటీ, ధర్మేంద్ర-జీతేంద్రల ధరమ్ వీర్, అమర్ అక్బర్ ఆంథోనీ చిత్రాలకు స్క్రీన్ప్లేకు సహకారం అందించడమే కాకుండా బచ్చన్, రజనీకాంత్, కమల్ హాసన్ నటించిన "గెరఫ్తార్" కూడా ఆయనే రాశారు. రచయితగా అతని చివరి చిత్రం దివంగత ఎస్ రామనాథన్ దర్శకత్వం వహించిన "జమానత్". అయితే ఈ చిత్రం విడుదల కాలేదు. కాగా.. ఆదివారం ఉదయం దాదర్లోని శివాజీ పార్క్ శ్మశానవాటికలో రాజ్ అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరై నివాళులర్పించారు. I'm truly saddened by the loss of the late Prayag Raj. Working with him on "Hifazat" was a privilege. May his soul rest in peace.🙏🏻 pic.twitter.com/Al4RP7poFb — Anil Kapoor (@AnilKapoor) September 24, 2023 Sorry to hear about the passing away of writer director actor Prayag Raj. RIP pic.twitter.com/OZN2P7xQeH — Azmi Shabana (@AzmiShabana) September 23, 2023 -
ఐదేళ్ల ప్రాయం నుంచే సంగీతంలో శిక్షణ.. స్టార్ సింగర్గా గుర్తింపు
అమ్మమ్మ నోటి నుంచి భక్తి భావనతో వినిపించే కీర్తనలు, గురుద్వారాలో విన్న కీర్తనలు బనత్ నోటి నుంచి తీయగా వినిపించేవి. బనత్ కౌర్ బగ్గాకు చిన్నప్పటి నుంచే సంగీతంతో చక్కని స్నేహం ఉంది. స్కూల్ ఫంక్షన్లలో, ఫ్యామిలీ ఫంక్షన్లలో తన పాట తప్పకుండా ఉండాల్సిందే. అయిదు సంవత్సరాల వయసులోనే హార్మోనియం వాయించి శ్రోతలను అబ్బురపరిచింది. లా స్టూడెంట్గా ఉన్నప్పుడు డెబ్యూ సింగిల్ ‘మూన్’ వచ్చింది. పంజాబీ నేపథ్యం ఉన్న బనత్ హిందీ, పంజాబీ పాటలకు తనదైన మెరుపు ఇస్తుంది. సింగర్–సాంగ్ రైటర్గా పేరు తెచ్చుకున్న బనత్ కౌర్ బగ్గా పాప్ అండ్ రాక్, నియో క్లాసికల్ అండ్ ఫోక్లో మంచి పేరు తెచ్చుకుంది. తీరికవేళల్లో చక్కటి కవిత్వాన్ని ఆస్వాదించడం తనకు ఇష్టం. కొన్నిసార్లు మ్యూజిక్ కంటే కవిత్వ పంక్తులు రాసుకోవడం అంటేనే ఇష్టం. పిల్లల కోసం ముంబైలో ‘క్లాస్రూమ్’ పేరుతో మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేసింది బనత్ కౌర్ బగ్గా. -
జర్నలిస్టు రచయిత
ప్రపంచంలోని గొప్ప రచయితల్లో కొంతమంది వృత్తిరీత్యా జర్నలిస్టులుగా పనిచేశారు. ఒక రచయిత జర్నలిస్టు అయితే తన రోజువారీ ‘స్టోరీ’లకు కథనబలాన్ని ఇవ్వగలడు. కానీ తమలోని రచయితనూ, జర్నలిస్టునూ వేరుగా ఉంచుకోవడానికే చాలామంది ప్రయత్నించారు. అనివార్యంగా ఆ రెండు పాత్రలూ కలిసిపోయే సందర్భాలు రావొచ్చు. అయితే, పూర్తి స్పృహతో తనలోని రచయితతో జర్నలిస్టును మేళవించినవాడు ట్రూమన్ కపోటి. ఆ మేళన ఫలితంగా నాన్–ఫిక్షన్ నవల ఉద్భవించింది. సాహిత్యానికి ఒక కొత్త ప్రక్రియను ‘పరిచయం’ చేసిన ట్రూమన్ కపోటి (30 సెప్టెంబర్ 1924 – 25 ఆగస్ట్ 1984) శతజయంతి సంవత్సరానికి ప్రారంభం ఇది. యూఎస్లోని లూసియానా రాష్ట్రంలో జన్మించిన ట్రూమన్ కపోటీ ఐదేళ్లప్పుడే బడికి నిఘంటువు మోసుకెళ్లేవాడు. ఎనిమిదేళ్ల వయసులోనే రచయిత అవుతాననుకున్నాడు. చాలామందికి జీవితం సగం ముగిసేదాకా తమకు ఏం కావాలో తెలీదు. కానీ తాను ఆ కోవలోకి చెందని ప్రత్యేక జీవినని కపోటికి తెలుసు. ‘ద న్యూయార్కర్’ సహా ఇతర పత్రికలకు పనిచేస్తూనే, కథలు రాశాడు. ఇరవైల్లోకి వచ్చేనాటికే ఆయన సెలబ్రిటీ. ‘ఆధునిక సాహిత్యపు ఆశాదీపం’ అని మెచ్చుకున్నాడు సోమర్సెట్ మామ్. ‘బ్రేక్ఫాస్ట్ ఎట్ టిఫనీస్’ (1958) నవలికతో కపోటి పేరు మార్మోగిపోయింది. రోజూ కనబడే చంద్రుడు కొన్నాళ్లుగా వార్తల్లో ఉన్నాడు. 1959లో రష్యా చంద్రుడి మీద దిగింది. అదే ఏడాది అమెరికాలో పెరోల్లో ఉన్న ఇద్దరు నేరస్థులు కాన్సాస్లోని ఒక ధనిక రైతును దోచుకోవడానికి పథకం వేశారు. ఇంట్లోకి ప్రవేశించి, యజమాని, ఆయన భార్య, వాళ్ల ఇద్దరు కౌమార కూతుళ్లను బంధించారు. తీరా నగదు రూపంలో ఏమీ దొరకదు. కేవలం సాక్ష్యంగా మిగిలిపోతారని నలుగురినీ హత్య చేశారు. అది అమెరికాలో పెను సంచలనం సృష్టించిన నేరవార్తల్లో ఒకటి. దాని ఆధారంగా ఆరేళ్ల పరిశోధన అనంతరం ‘ఇన్ కోల్డ్ బ్లడ్’ (1965) రాశాడు కపోటి. దీనికి వాడిన కథనాత్మక పాత్రికేయ టెక్నిక్ను ‘నాన్ఫిక్షన్ నవల’ అన్నాడు. జర్నలిజం, కథనం కలిసి కొత్త కళారూపానికి దారి తీయగలదని భావించాడు. సృష్టించే సామర్థ్యం ఉన్నప్పుడు, వాస్తవ కథనం కోసం శ్రమ పడటం దేనికి అన్న వైఖరి కొందరు రచయితల్లో ఉంటుంది. సీరియస్ రచయితల కళాత్మక స్థాయికి జర్నలిజం తగనిది అన్న అభిప్రాయమూ ఉండకపోదు. ఇదంతా కాదన్నా, ఒక మనిషి వ్యక్తిత్వాన్ని వడగట్టి రచనలోకి తేవడం అంటే చాలా రకాలుగా సిద్ధపడాలి. ‘బ్రేక్ఫాస్ట్ ఎట్ టిఫనీస్’ తన క్యారెక్టర్నే పెట్టి రాశాడని ఒకావిడ 8 లక్షల డాలర్లకు తెచ్చిన (విఫల) దావాను ఎదుర్కొన్న చేదు అనుభవం అప్పటికే కపోటికి ఉంది. పైగా, ఎంత నిజజీవిత కథనానికైనా ఊహాశక్తి లేకపోతే ప్రాణం పోయలేము. ‘లిటెరరీ ఫొటోగ్రాఫర్’లా సూక్ష్మాంశాలను మనసులోకి ఎక్కించుకోవాలి. ‘హ్యూమన్ టేప్ రికార్డర్’లా మారాలి. మరి విషయ సేకరణ ఎట్లా? తలుపులు తట్టడం సరే, వాళ్ల మనసులను మీటడం ఎలా? కపోటి ముందు ఆ ప్రాంతానికి వెళ్లి, అక్కడ కొన్నాళ్లు ఉన్నాడు. ఒక ఇంటర్వ్యూలా మాట్లాడితే అసౌకర్యం కాబట్టి, టేప్ రికార్డర్లు ఉపయోగించలేదు. వెళ్లేముందు ఒక సాధన చేశాడు: స్నేహితుడు ఓ పుస్తకంలోని పేజీలను చదివి వినిపిస్తాడు. దాన్ని కపోటి విని, తిరిగి రాసేవాడు. ‘దాదాపు 95 శాతం కచ్చితత్వం’ సాధించాడు. ఇన్ని చేసినా వార్తా కథనాలకు కాలం చెల్లిపోయే ప్రమాదం ఎక్కువ. వాస్తవ ఘటన ఒక తార్కిక ముగింపునకు వస్తే తప్ప రచనను ముగించలేం. ఈ సందర్భంలో తార్కిక ముగింపు అంటే, నేరస్థుల ఉరిశిక్ష అమలు కావడమే. రచయిత ఆ క్షణం కోసం ఎదురుచూడాలి. ‘ఇది హింస,’ అంటాడు కపోటి. ఆఖరికి 6,000 పేజీల నోట్సుతో– హంతకులు, బాధితులు, గ్రామీణ సమాజపు మనుషులు– మూడు కోణాల్లో చిత్రించిన 340 పేజీల ‘ఇన్ కోల్డ్ బ్లడ్’ తక్షణ బెస్ట్ సెల్లర్గా, కపోటి అత్యుత్తమ రచనగా సాహిత్య చరిత్రలో నిలిచిపోయింది. నాన్–ఫిక్షన్ నవల అనే ప్రక్రియను తాను పరిచయం చేయడం అనడం కంటే, అప్పటికే ఉన్నదాన్ని తాను అత్యున్నత స్థితికి తీసుకెళ్లానని మాత్రమే అనేవాడు కపోటి. చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో, బంధువుల ఇంట్లో పెరిగాడు కపోటి. ఎప్పుడూ వ్యాకులతతో ఉండేవాడు. ఆయన ఒంటరితనంలో స్నేహపు సెలయేరు పొరుగున ఉండే హార్పర్ లీ. అనంతర కాలంలో ‘టు కిల్ ఎ మాకింగ్బర్డ్’ నవలా రచయిత్రి. అందులోని ‘డిల్’ పాత్రను ఆమె కపోటి నమూనాగా తీర్చిదిద్దారు. కపోటి రచన ‘అదర్ వాయిసెస్, అదర్ రూమ్స్’లో ఇడాబెల్ పాత్రకు లీ ప్రేరణగా నిలిచారు. వారి బాల్య స్నేహం చివరిదాకా కొనసాగింది. ‘ఇన్ కోల్డ్ బ్లడ్’ క్షేత్రస్థాయి పరిశోధనలో లీ సహాయం చేశారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలు సాధించడంలో. హోమోసెక్సువల్ అని ప్రకటించుకున్న కపోటి, దాని తాలూకు తిరస్కరణను ఎదుర్కొన్నాడు. ఆ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. తన జీవితాన్ని పునర్నిర్మించుకునే అవకాశమే ఉంటే, వ్యాకులత లేకుండా చూసుకుంటానన్నాడు. ‘ఒక కథను ఎంత సహజంగా చెప్పవచ్చో ఆ రూపాన్ని రచయిత కనుక్కున్నాడనేదానికి పరీక్ష ఏమిటంటే– ఆ కథ చదివాక, నువ్వు దాన్ని ఇంకోలా ఊహించగలుగుతున్నావా లేక అది నీ ఊహను నెమ్మదించేలా చేసి, అదే సంపూర్ణమూ, అంతిమమూ అనిపిస్తోందా? ఒక నారింజ ఫలాన్ని ప్రకృతి సరిగ్గా ఎలా చేసిందో అలా’ అన్నాడు కపోటి. సాహిత్య జీవితం గురించి సరేగానీ, అరవై ఏళ్లు నిండకుండానే కన్నుమూసిన కపోటి జీవితం సంపూర్ణ ఫలమేనా అంటే చెప్పడం కష్టం! -
సాంగ్ రైటర్ కమ్ సింగర్..స్ఫూర్తినిచ్చే పాటలతో అలరిస్తుంది!
టీనేజ్లో న్యూయార్క్కు వెళ్లిన రవీనా అరోరా సింగర్, సాంగ్ రైటర్గా మంచి పేరు తెచ్చుకుంది ‘స్వీట్ టైమ్’ ‘టెంప్టేషన్’ ‘హానీ’ పాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక లైవ్ షోలలో పాశ్చాత్య ప్రేక్షకులను హిందీ సాంగ్స్తో అలరిస్తుంటుంది. స్టేజీ మీద ఉన్నట్టుండీ...‘వుయ్ ఆర్ గోయింగ్ టు సింగ్ ఇన్ హిందీ నౌ’ అని ప్రకటిస్తుంది. ఆడిటోరియమ్ కేకలతో నిండిపోతున్న సమయంలో ‘ఏక్, దో, తీన్, చార్, చలోనా, మేరె సాత్’ అంటూ హిందీ పాట అందుకుంటుంది. 60,70లలోని హిందీ చిత్రాల పాటలను పాడుతూ కూడా ఈతరం కుర్రకారును ఆకట్టుకుంటుంది. ‘సంగీతంలో భిన్న ధోరణులను అన్వేషించడం ఇష్టం’ అంటున్న అరోరాకు లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలా స్వరం ఇష్టం. భావగర్భితమైన పాట ఇష్టం. రవీనా పాటలు ‘ఆహా, ఒహో’లకు పరిమితమైన పసందైన పాటలు కాదు. ఎన్నో సామాజిక సమస్యలు ఆమె పాటలో భాగమై ఉంటాయి. ‘ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా, తమను తాము ప్రేమించుకునేలా, తమను తాము స్పష్టంగా అర్థం చేసుకునేలా, ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేలా నా పాట ఉండాలనుకుంటాను’ అంటోంది రవీనా అరోరా. (చదవండి: దర్శకురాలు కావాలనుకుంది..కానీ తండ్రి హఠాన్మరణం ఆమెను) -
అరుదైన పత్రికా రచయిత తుర్లపాటి కుటుంబరావు
సాక్షి: జర్నలిజంలో పది, ఇరవై ఏళ్లపాటు కొనసాగడమే కష్టం. అలాగే జర్నలిస్టుగా జీవితం ఆరంభించి, కన్ను మూసే వరకు అదే వృత్తిలో ఉంటూ పత్రికలలో వ్యాసాలు రాయడం దాదాపు అసాధ్యం. అందరికీ ఆ అవకాశం లభించదు. అలాంటిది తుర్ల పాటి కుటుంబరావు డెబ్భై ఏళ్లపాటు జర్నలిస్టుగా కొనసాగగలిగారు. ఏభై ఏళ్లపాటు ‘వార్తలలో వ్యక్తి’ పేరుతో ఒక శీర్షిక నిర్వహించగలగడం గొప్ప విషయం. ఒక వ్యాస శీర్షికను ఏభై ఏళ్లు నడపమంటే తేలికైన పని కాదు. కాని తుర్లపాటి వల్ల అది సాధ్యపడింది. ఆంధ్రజ్యోతి, ఆ తర్వాత ‘వార్త’ దినపత్రికలలో ‘వార్తలలోని వ్యక్తి’ కాలమ్ను నిర్వహించేవారు. ఇంత సుదీర్ఘ కాలం జర్నలిస్టుగా ఉండి ఒక సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేకపోవడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. పాత్రికేయుడిగానే కాకుండా, ‘ఉపన్యాస కేసరి’ అని పిలిపించుకున్న ఏకైక జర్నలిస్ట్ తుర్ల పాటి. 18 వేల ప్రసంగాలు చేసి గిన్నిస్ బుక్ రికార్డులలోకి ఎక్కారు. అదే సమయంలో పలు పుస్తకాలు రచించారు. ‘జాతి నిర్మాతలు’, ‘1857 విప్లవ వీరులు’ వంటి పలు పుస్తకాలు వీరు రచించినవే. ఆంధ్ర యూనివర్శిటీ నుంచి ‘కళా ప్రపూర్ణ’, ‘ముట్నూరి కృష్ణారావు అవార్డు', ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావు చేతుల మీదుగా ‘నేషనల్ సిటిజన్స్ అవార్డు’, అమెరికాలోని బయోగ్రాఫికల్ సంస్థ వారి ‘ఇంటర్నేషనల్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ వంటి అవార్డులు దక్కాయి. తుర్లపాటి కుటుంబరావు 1933 ఆగస్టు పదో తేదీన జన్మించారు. కృష్ణా జిల్లా గన్నవరం, విజయవాడల్లో చదువుకున్నారు. 14 ఏళ్ల వయసులోనే పత్రికా రంగంలోకి రావడం ఒక ప్రత్యేకత. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుకు చెందిన ‘ప్రజా పత్రిక’లో ఆయన చేరి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. 1959లో ఆంధ్రజ్యోతి దిన పత్రికలో సహాయ సంపాదకుడిగా ఆరంభమైన ఆయన జర్నలిస్ట్ ప్రస్థానం జీవితాంతం కొనసాగింది. 18 మంది ముఖ్య మంత్రులతో ఆయనకు సంబంధాలు, మంచి పరిచయాలు ఉండేవి. అలాగే సినీ రంగంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు తదితరులకు ఈయనంటే ఇష్టం. వారి గురించిన వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా రాశారు. వారికి బిరుదులు ఇచ్చి విజయవాడలో సత్కార, సన్మాన కార్యక్రమాలు నిర్వహించేవారు. ఉదాహరణకు ఏఎన్నార్కు ‘నట సామ్రాట్’ అనే బిరుదును ఖాయం చేసి ప్రదానం చేసింది ఈయనే. ‘నంది’ అవార్డులను సినిమావారికి ప్రవేశపెట్టాలని కోరుతూ, అవి వచ్చేందుకు తుర్లపాటి విశేష కృషి చేశారు. జాతీయ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడిగా, జ్యోతిచిత్ర సినిమా పత్రిక సంపాదకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. రాజకీయ, సినీ రంగం రెండిటిలోనూ ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించగలగడం అందరికీ కుదరదు. సాహిత్య, సంగీతాభిలాషి అయిన ఆయన అభ్యుదయవాది కూడా. ప్రముఖ కూచిపూడి నర్తకి కృష్ణకుమారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. రాష్ట్ర స్థాయి నేతలతోనే కాదు... పలువురు జాతీయ స్థాయి నాయకులతో కూడా ఆయన సంబంధాలు, ఉత్తరప్రత్యుత్తరాలు నెరపేవారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, అంబేడ్కర్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వంటివారితో తరచు ఇంటరాక్ట్ అయ్యేవారు. ఇక ఇంది రాగాంధీ, మొరార్జీ దేశాయ్, జగ్జీవన్ రామ్, రాజీవ్ గాంధీ వంటి వారు ఏపీకి వచ్చినప్పుడు, వారి ఉపన్యాసాలకు అనువాదకులుగా ఉండేవారు. నెహ్రూపై ఉన్న అభిమానంతో ఆయన తన కుమారుడికి ఆ పేరే పెట్టుకోవడం విశేషం. ప్రేమ వివాహానికి గుర్తుగా కుటుంబ రావు తమ కుమార్తెకు ‘ప్రేమ జ్యోతి’ అని పేరు పెట్టారు. చతురోక్తులతో ప్రసంగాలు చేయడం ఆయన విశిష్టత. ఆయా సందర్భాలను బట్టి ఆయా ప్రముఖుల చరిత్రను, వర్తమానాన్ని కలిపి, జీవిత విశేషాలతో ఆ కాలమ్ రాసి పాఠకులను ఆకట్టుకునేవారు. ఇన్ని గొప్పదనాలు ఉన్నవి కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది. తెలుగు జర్న లిస్టులలో ఆ గౌరవం పొందింది ఈయన ఒక్కరే కావడం విశేషం. వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ (నేడు తుర్లపాటి కుటుంబరావు జయంతి) -
అనన్య సామాన్య స్వతంత్రం
అనన్య బిర్లాకు చెందిన సూక్ష్మరుణ కంపెనీ (ఎంఎఫ్ఐ) స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ దేశంలో రెండో అతి పెద్ద ‘ఎంఎఫ్ఐ’గా గుర్తింపు పొందనుంది. ఎంటర్ప్రెన్యూర్గా గెలుపు జెండా ఎగరేసిన అనన్య బిర్లా సింగర్, రైటర్, యాక్టర్, సోషల్ యాక్టివిస్ట్... ఏకంగా అయిదు సింగిల్స్లో డబుల్ ప్లాటినమ్ స్టేటస్ను సొంతం చేసుకుంది. అనన్య గానప్రతిభ గురించి చెప్పుకోవడానికి ఇదొక మచ్చుతునక మాత్రమే. ‘లెట్ దేర్ బి లవ్’ ‘ఎవ్రీ బడీ లాస్ట్’ పాటలతో అమెరికన్ నేషనల్ టాప్ 40 పాప్ రేడియో షో జాబితాలో చోటు సాధించిన ఫస్ట్ ఇండియన్ ఆర్టిస్ట్గా ఘనత సాధించింది. అనన్యకు చిన్నవయసు నుంచే సంగీతం అంటే ఇష్టం. పదకొండు సంవత్సరాల వయసులో సంతూర్ ప్లే చేయడం నేర్చుకుంది. ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్ కోసం ‘యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్’లో చేరిన అనన్య డిగ్రీ పూర్తి కాకుండానే చదువు మానేసింది. యూనివర్శిటీలో చదువు సంగతి ఎలా ఉన్నా సంగీతంలో మాత్రం ఎటు చూసినా అనన్య పేరు వినిపించేది. పాడడంతో పాటు కవితలు, పాటలు కూడా రాసేది. గిటార్ ప్లే చేయడం నేర్చుకుంది. ‘లివిన్ ది లైఫ్’ తన డెబ్యూ సింగిల్. యూట్యూబ్లో 14 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. మ్యూజిక్ చార్ట్స్లో టాప్లో నిలిచింది. కునాల్ కోహ్లీ స్పై థ్రిల్లర్ ‘శ్లోక్’లో నటిగా ఆకట్టుకుంది. ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు సంగీత, సాహిత్య కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేది అనన్య. ఆందోళన, కుంగుబాటుతో సతమతం అవుతున్న యువత కోసం స్టూడెంట్ హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన తరువాత మానసిక సమస్యలతో బాధపడే వారికి సహాయం అందించడానికి ‘ఎంపవర్’ అనే సంస్థను ఏర్పాటు చేసింది. కోవిడ్ సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి 24“7 ఫ్రీ హెల్ప్లైన్ను ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్లైన్ ద్వారా వేలాది మంది ప్రజలకు మేలు జరిగింది. అమెరికాకు చెందిన ప్రసిద్ధ మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘నేషనల్ అలయెన్స్ ఆన్ మెంటల్ ఇల్నెస్’ అంబాసిడర్గా నియమితురాలైంది. ‘అనన్య బిర్లా ఫౌండేషన్’తో సేవాకార్యక్రమా లను విస్తృతం చేసింది. సంగీతం అంటే అపారమైన అనురక్తి ఉన్న అనన్య వ్యాపారరంగంలో తొలి అడుగు వేసినప్పుడు... ‘అనన్య లోకం వేరు. ఆమె ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించడం కష్టం’ అనే గుసగుసలు వినిపించాయి. అప్పటి వరకు అనన్య పేరు పక్కన సంగీతానికి సంబంధించిన విశేషణాలు కనిపించేవి. తరువాత స్వతంత్ర మైక్రోఫిన్, ఫౌండర్ అనేది ఆమె పేరు పక్కన కనిపించడం మొదలైంది. గ్రామీణ ప్రాంతాలలో మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి ‘స్వతంత్ర’ను ఏర్పాటు చేశారు. తన నాయకత్వ లక్షణాలతో ‘స్వతంత్ర’ను అగ్రగామిగా నిలిపింది అనన్య. బెస్ట్ స్టార్టప్లకు ఇచ్చే ‘గోల్డ్ అవార్డ్’ను గెలుచుకుంది. 2016లో గ్లోబల్ లగ్జరీ ఇ–కామర్స్ ప్లాట్ఫామ్ ఇకై ఏషియాకు సీయీవోగా బాధ్యతలు చేపట్టింది. ఫోర్బ్స్ ఆసియాస్ ఉమెన్ జాబితాలో అనన్య పేరు చోటు చేసుకుంది. ‘స్వతంత్ర’ వ్యవస్థాకురాలిగా అనన్య ఆఫీస్ గదికే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో పర్యటించేది. ఇండోర్లో ఒక పేదింటి మహిళ ‘స్వతంత్ర’ సహకారంతో ఇల్లు కట్టుకోగలిగింది. ఆమెతో మాట్లాడినప్పుడు అనన్యకు ఎంతో సంతోషంగా అనిపించింది. అనన్య అపురూప విజయాలు చూసినప్పుడు ‘ఏ పని చేసే వాళ్లు ఆ పని చేస్తే మంచిది’ ‘రెండు పడవల మీద కాలు వద్దు’ లాంటి మాటలు, సామెతలు బిత్తర పోతాయి. పనిమీద అనురక్తి, అంకితభావం ఉంటే ఒక రంగానికి చెందిన వారు మరో రంగంలో విజయం సాధించవచ్చు అని చెప్పడానికి అనన్య బిర్లాలాంటి వాళ్లు పెద్ద ఉదాహరణ. పెద్దింటి అమ్మాయి పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా కూతురు అయిన అనన్య బిర్లా బాల్యం నియమ నిబంధనలు, రక్షణ వలయాల మ«ధ్య గడిచింది. చిన్నప్పుడే అనన్యకు బాడీగార్డ్ ఉండేవాడు. మిగతా అమ్మాయిల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఆడుకోవడానికి లేదు. ఈ రూల్స్తో తనకు ఊపిరి ఆడేది కాదు. ఒత్తిడికి గురయ్యేది. ఇంత ఒత్తిడిలోనూ తనదైన కలలు కనేది. ‘అసలు నేనేమిటి?’ అనే ప్రశ్నకు ఆమెకు సంగీతంలో జవాబు దొరికింది. సంగీతం తనలోని ఒంటరితనాన్ని పోగొట్టడమే కాదు ఆత్మబలాన్ని ఇచ్చింది. ‘పెద్దింటి అమ్మాయి’ అనే పేరు కంటే స్వేచ్ఛాప్రపంచాన్నే అనన్య ఇష్టపడేది. ‘పెద్ద యూనివర్శిటీలో పెద్ద చదువు చదవాలి. పెద్దింటి కుటుంబానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి... ఇలా నా గురించి అనుకునేవారు. అయితే నా ఆలోచనలు దీనికి భిన్నంగా ఉండేవి. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచేది. అయితే తల్లిదండ్రులు మాత్రం నాకు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉన్నారు. నా అభిప్రాయాలకు విలువ ఇచ్చారు’ అంటుంది అనన్య. -
గుంత ఉంటేనే మంచిది!
మొగులు మీద చక్కలు ఎల్లినయి. వాడకట్టుల దీపాలు ఎల్గినయి. ట్రాఫిక్తోని తొవ్వలు మెస్ల రాకుంటున్నయి. జెనంతోని సిన్మ తేటర్లు చీమల పుట్ట లెక్కున్నయి. పొద్దు మీకింది. ఇంటికి పోబుద్ది గాని సర్కార్ జీతగాల్లు హోటల్ల గూసోని ముచ్చట బెడ్తున్నరు. గుడికాడ బిచ్చపోల్లు బిచ్చమడుక్కుంటున్నరు. ఒక్కపారే సిటీ బస్సులు సొల్పుత బోతున్నయి. ఎప్పటి తీర్గనే చౌరస్త కాడ్కి బోయిన. గాడ రవి పాన్ డబ్బ ఉన్నది. గది మా దోస్తుల అడ్డ. గాడ పాన్లు దినెటోల్లు పాన్లు దింటరు. సిగిలేట్లు దాగెటోల్లు సిగిలేట్లు దాగుతరు. పాన్ డబ్బకు జెర్రంత దూరంల ఛాయ్ బండి ఉన్నది. గాడ ఛాయ్ దాగెటోల్లు పాన్లు, సిగిలేట్ల కోసం పాన్ డబ్బ కాడ్కి వొస్తుంటరు. పొద్దు మీకంగనే మా దోస్తులు పాన్ డబ్బ కాడ జమైతరు. సిగిలేట్లు దాక్కుంట, పాన్లు దినుకుంట ముచ్చట బెడుతుంటరు. గా దాని మీద గీ దాని మీద అనకుంట అన్నిటి మీద గాల్లు ముచ్చట బెడుతుంటరు. గని ఎక్వ రాజకీయాల మీదనే మాట్లాడు తుంటరు. రాజకీయాల మీద మాట్లాడుకుంట నువ్వెంత అంటె నువ్వెంత అనుకుంట మాటలతోనే కొట్లాడుతుంటరు. గా దినం నేను బోక ముందు గాల్లు ఏం మాట్లాడుకుండ్రో నా కెర్క లేదు. గని నేను బోయినంక గాల్లు గీ తీర్గ ముచ్చట బెట్టిండ్రు. ‘‘మా వాడకట్టుల గుంత బడ్డది’’ అని యాద్గిరి అన్నడు. ‘‘గుంత బడ్తె ఏమైంది?’’ అని సత్నారి అడిగిండు. ‘‘గుంతల బడి మోటర్ సైకిల్లు, స్కూటర్లు కరాబ్ గాబట్టినయి.’’ ‘‘జెనంకు ఏం గాలేదా?’’ ‘‘ఎవలన్న గుంతల బడ్తె కాల్లు, చేతులు ఇర్గబట్టినయి. వాన బడెతల్కె గా గుంత నీల్లతోని నిండింది.’’ ‘‘నీల్ల తోని నిండితె ఏమైంది?’’ ‘‘గుంత నీల్లతోని నిండ బట్కె దోమలొచ్చినయి. గవ్వి మమ్ములను కుట్టి కుట్టి సంపబట్టినయి.’’ ‘‘గుంతను పూడ్పిచ్చెతంద్కు మీరు కోషిస్ జెయ్యలేదా?’’ ‘‘ఎందుకు జెయ్యలేదు. చేసినం.’’ ‘‘ఏం జేసిండ్రు?’’ ‘‘సక్కగ మా ఎమ్మెల్యె తాన్కి బోయినం.’’ ‘‘పోయి ఏం జెప్పిండ్రు?’’ ‘‘మా వాడకట్టుల గుంతబడ్డది. గా దాంట్ల ఎవలన్న బడితె కాల్లు చేతులు ఇర్గుతున్నయి. గుంతను పూడ్పియ్యండ్రి అని అన్నం.’’ ‘‘గాయిన ఏమన్నడు?’’ ‘‘కాల్లు చేతులు ఇర్గితె ఏం జేస్తున్నరు అని అడిగిండు.’’ ‘‘మీరేం జెప్పిండ్రు?’’ ‘‘డాక్టర్ తాన్కి బోయి పట్టి గట్టిచ్చుకుంటున్నం అని జెప్పినం.’’ ‘‘చెప్తె గాయినేమన్నడు?’’ ‘‘పట్టిగట్టినందుకు డాక్టర్కు ఫీజు ఇస్తున్నారా లేదా అని అడిగిండు.’’ ‘‘మీరేమన్నరు?’’ ‘‘ఇస్తున్నం అని జెప్పినం.’’ ‘‘గాయినేమన్నడు?’’ ‘‘మీరు ఫీజు ఇయ్య బట్కె డాక్టర్ బత్కుతున్నడు అని గాయిన అన్నడు.’’ ‘‘గుంతల బడె బట్కె మోటర్ సైకిల్లు, స్కూటర్లు కరాబైతున్నయని మా ఎమ్మెల్యెకు జెప్పినం.’’ ‘‘చెప్తె గాయినేమన్నడు?’’ ‘‘స్కూటర్లు కరాబైతె ఏం జేస్తరు అని గాయిన అడిగిండు.’’ ‘‘సక్కగ మెకానిక్ తాన్కి బోతం అని జెప్పినం.’’ ‘‘మెకానిక్ తాన్కి బోయి స్కూటర్లు, మోటర్ సైకిల్లు బాగ జేపిచ్చుకొని ఏం జేస్తరు?’’ ‘‘బాగ జేసినందుకు మెకానిక్కు రూపాయలిస్తం.’’ ‘‘మీరు రూపాయలియ్యబట్కెనే మెకానిక్ బత్కుతున్నాడు.’’ ‘‘వాన బడె బట్కె గుంత నీల్లతోని నిండింది.’’ ‘‘నీల్లతోని నిండితె ఏమైతది?’’ ‘‘దోమలొచ్చినయి. గవ్వి మమ్ములను కుట్టి కుట్టి సంపు తున్నయి. దోమలు కుట్టె బట్కె రోగాలొస్తున్నయి.’’ ‘‘రోగాలొస్తె మీరేం జేస్తున్నరు?’’ ‘‘డాక్టర్ల తాన్కి బోతున్నం.’’ ‘‘డాక్టర్లు మీకు ఇలాజ్ జేస్తున్నరు. ఇలాజ్ జేసినందుకు గాల్లకు ఫీజు ఇస్తున్నరు. గాల్లు మీకు మందులు రాస్తున్నరు. మందుల దుక్నంల మీరు మందులు గొంటున్నరు. మీరు ఫీజు ఇయ్యబట్కె డాక్టర్లు, మందులు గొన బట్కె మందుల దుక్నపోల్లు బత్కుతున్నరు. గుంత జెయ్య బట్కె మెకానిక్లు, డాక్టర్లు, మందుల దుక్నపోల్లు బత్కుతున్నరు. గుంతను పూడ్పిస్తె గింత మంది పొట్ట గొట్టినట్లు గాదా?’’ అని మా ఎమ్మెల్యె అడిగిండు: ‘గుంతలు లేని వాడకట్టులల్ల గుంతలు తోడ్పిస్తమని జెప్పిండు.’ అని యాద్గిరి అన్నడు. ‘‘మొన్న కేటీఆర్ పుట్టిన దినాన కొంతమంది టమాటలు పంచి పెట్టిండ్రు.’’ ‘‘టమాటలు పంచి పెట్టుడు అంటె బంగారంను పంచి పెట్టుడే.’’ ‘‘దమ్ముంటె కాంగ్రెస్ గాల్ల సీఎం క్యాండిడేట్ ఎవలో ముందుగాలే జెప్పాలె అని కేసీఆర్ అన్నడు.’’ ‘‘దమ్ముంటె బీఆర్ఎస్ సిట్టింగ్లందర్కి ఎమ్మెల్యె టికిట్ ఇయ్యాలని రేవంత్ రెడ్డి అన్నడు.’’ గీ తీర్గ మా దోస్తులు ముచ్చట బెట్టిండ్రు. తెలిదేవర భానుమూర్తి, రచయిత సీనియర్ జర్నలిస్ట్ - 99591 50491 -
రచన ఏదైనా ప్రశ్నించడమే లక్ష్యం!
జావేద్ అఖ్తర్ ప్రతిభా వంతమయిన కవి, వక్త, స్క్రీన్ ప్లే రచయిత. సూటిగా తన భావాల్ని ఎలాంటి వెరపూ, బెదురూ లేకుండా ప్రక టిస్తున్న సామాజిక గొంతుక ఆయనది. ఇవ్వాళ మన దేశంలో అత్యంత ప్రభావవంతమైన స్వతంత్ర లౌకిక స్వరం, జావేద్ అఖ్తర్. భావుకుడు, ప్రగతిశీల వాది అయిన జావేద్ అఖ్తర్ ఏడు తరాల సాహిత్య చైతన్యమున్న కుటుంబంలో జన్మించారు. తన కవిత్వం మత తత్వానికి, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా రాశారు. జాతీయ సమైక్యత, స్త్రీల హక్కుల కోసం మాట్లా డారు, రాశారు. తప్పు దోవ పట్టిన యువతను ద్దేశించి జావేద్ రాసిన గీతాన్ని 1995లో కేంద్ర మానవ వనరుల శాఖ యువతకోసం ‘జాతీయ గీతం’గా ప్రకటించింది. గ్వాలియర్లో పుట్టిన జావేద్ లక్నో అలీగఢ్, భోపాల్లలో ఎదిగారు. బాంబే చేరిన తర్వాత ఆయన పరిధి బాగా విస్తారమయింది. జావేద్ తన మిత్రుడు సలీం ఖాన్తో కలిసి రాసిన స్క్రీన్ ప్లేలు 70వ దశకం మధ్య నుండి ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. దాంతో వారికి మొట్ట మొదటి విజయ వంతమయిన సినిమా రాసే అవకాశం వచ్చింది. ‘హాథీ మేరె సాథీ’. అది సూపర్ హిట్ కావడంతో ఆ జంట హిందీ సినీ రంగంలో హాట్ కేక్గా మారింది. ‘సీతా ఔర్ గీతా’ చిత్రానికి పనిచేసే సమయంలో జావేద్కు ‘హనీ ఇరానీ’తో అయిన పరిచయం పెళ్లిదాకా వెళ్ళింది. వారిద్దరికీ జోయా, ఫర్హాన్లు జన్మించారు. 1979లో తన మొదటి కవిత రాశారు జావేద్. ఇంచుమించు అదే కాలంలో ‘షబానా ఆజ్మీ’తో పరిచయం సాన్నిహిత్యంగా మారింది. 1995లో ఆయన మొట్ట మొదటి కవితా సంకలనం ‘తర్కశ్’ వెలువడింది. మొదటి సంకలనమే కవిత్వాభిమా నుల నుంచీ, విమర్శకుల నుంచీ ప్రశంసను అందు కుంది. అంతేకాదు మన దేశంలో మొదటి ఆడియో బుక్గా కూడా ప్రాచుర్యం పొందింది. 1983లో హనీ ఇరానీ, జావేద్ విడిపోయారు. కానీ స్నేహంగానే ఉన్నారు. సలీం–జావేద్ జంటగా ‘అందాజ్’, ‘యాదోంకీ బారాత్’, ‘జంజీర్’, ‘దీవార్’, ‘షోలే’, ‘డాన్’, ‘త్రిశూల్’ లాంటి సూపర్ డూపర్ హిట్ సిని మాలకు స్క్రిప్టు రాశారు. వాళ్ళు రాసిన 24 సినిమా స్క్రిప్టుల్లో 20 హిట్లు. ఆ తర్వాత ఆ జంట విడి పోయింది. 1981లో సలీం, జావేద్ల జంట విడి పోయాక జావేద్ అఖ్తర్ చాలా సినిమాలకు స్క్రిప్ట్ రచన చేశారు. వాటిల్లో ‘సాగర్’, ‘మిస్టర్ ఇండియా’, ‘బెతాబ్’, ‘లక్ష్య’ లాంటి విజయవంత మయిన సినిమాలు ఉన్నాయి. తర్వాత జావేద్ అఖ్తర్ ఫిలిం గీతాలవైపు కదిలారు. అలాగే గొప్ప కవితలూ రాశారు. ఆయన రాసిన కవితలు, గజల్స్ సూటిగా మనసుకు హత్తు కుంటాయి. ‘లావా’ కవితా సంపుటి 2012లో వెలువడింది. దీనికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. ఈ రెండు సంకలనాల్లోంచి ఎంపిక చేసిన కవితల సమాహారమే ‘ఇన్ ఆదర్ వర్డ్స్.’ అందులో ఆయన కాలాన్ని గురించి.. కాలమంటే ఏమిటి, /అలుపూ విరామమూ లేకుండా /సాగిపోతున్నది /అదట్లా ప్రయాణించ కుండా ఉండి వుంటే అదెక్కడుండేది / ఎక్కడో ఒక చోట ఉండేది కదా... అంటూ గొప్ప తాత్వికతతో రాశారు. ఆయన కవిత్వమంతా ఆయన ఆత్మ నుండి ఒక ప్రవాహంలా సాగుతుంది. హృదయపు లోతుల నుండి పెల్లుబుకుతుంది. వర్తమాన అవ్యవస్థ గురించి తనకోపమూ, తన తాత్వికత, వేదన, దుఃఖం, ప్రశ్న–జవాబు ఇట్లా అనేకానేక స్థితులు ఆవిష్కరించారు. ఇందులో వర్తమాన మత ఛాందసవాదం గురించి ఖండిస్తూ రాశారు, మాట్లా డారు. ఇక పార్లమెంట్ సభ్యుడిగా ముందుండి మేధో హక్కుల గురించి, కాపీ రైట్ చట్టం గురించీ పోరాడి సాధించారు. ప్రశ్నించడమే తన తత్వమని అనేక సందర్భాల్లో నిరూపించారు. వ్యాసకర్త సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత (జావేద్ అఖ్తర్కు నేడు సినారె పురస్కార ప్రదానం) -
కవి రాజేశంకు సినారె పురస్కారం!
మంచిర్యాల: మండలంలోని ఆవుడం గ్రామానికి చెందిన ప్రముఖ కవి, విమర్శకుడు, జిల్లా రచయితల వేదిక అధ్యక్షుడు తోకల రాజేశం డాక్టర్ సీ.నారాయణరెడ్డి రాష్ట్ర స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 30న జడ్చర్లలో జరిగే కార్యక్రమంలో మహాకవి సినారె కళాపీఠం పురస్కారం ప్రదానం చేస్తారు. పద్య, వచన, కవిత్వంతోపాటు సాహిత్య విమర్శ రంగంలోనూ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు కళాపీఠం అధ్యక్షుడు మల్లెకేడి రాములు, సమన్వయకర్త డాక్టర్ పోరెడ్డి రంగయ్య ప్రకటించారు. రాజేశం 2006లో తెలుగు బాల శతకం, 2010లో చమట చుక్కలు, 2013లో పాతాళగరిగే, 2017లో అడవిదీపాలు, మంచిర్యాల జి ల్లా సాహిత్య చరిత్ర అనే గ్రంథాలను ముద్రించారు. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. -
ప్రముఖ రచయిత శ్రీరమణ కన్నుమూత
మణికొండ: ప్రముఖ కథకుడు, వ్యంగ్య వ్యాసరచయిత, సినిమాగా వచ్చిన మిథునం కథా రచయిత, సీనియర్ జర్నలిస్టు శ్రీరమణ (71) బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్ ఫ్లోటిల్లా గెటెడ్ కమ్యూనిటీలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య జానకి, ఇద్దరు కుమారులు చైత్ర, వంశీకృష్ణ ఉన్నారు. ఆయన అంత్యక్రియలు గురువారం మహాప్రస్థానంలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.1952 సెపె్టంబర్ 21న ఏపీలోని గుంటూరు జిల్లా వేమూరు మండలం వరహాపురం అగ్రహారంలో అనసూయ, సుబ్బారావు దంపతులకు జని్మంచిన శ్రీరమణ అసలుపేరు కామరాజ రామారావు. కానీ ఆయన రచయిత శ్రీరమణగానే అందరికీసుపరిచితం.ఏపీ సీఎం జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ శ్రీరమణ మృతిపట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన రాసిన కథలు మానవత్వం, విలువలతో కూడి ఉంటాయని జగన్ గుర్తుచేసుకున్నారు. -
నిశ్శబ్దంగా ఉంటే ఆయనేం శ్రీరమణ? ..ఒక్కసారిగా గిర్రున కన్నీళ్లు..
నేను పదవతరగతిలో ఉన్నప్పుడో, ఇంటర్ మీడియట్ లో ఉన్నప్పుడో సరిగా గుర్తు లేదు కానీ ఆంధ్రజ్యోతి లో ఓక పుస్తక ప్రకటన వచ్చింది . నవోదయ పబ్లిషర్స్ వారిది. "శ్రీ రమణ రంగుల రాట్నం. చమత్కారాలు, మిరియాలు, అల్లం బెల్లం, మురబ్బాలూ" అని. అప్పటికి నాకు శ్రీరమణ ఎవరో తెలీదు. ముళ్ళపూడి వెంకట రమణే శ్రీరమణ అని అనుకునేవాడిని. నాకు బాపుగారు తెలుసు. బాపు గారు ఏ రమణకి బొమ్మవేసినా ఆ రమణ శ్రీముళ్ళపూడి రమణే అయి ఉంటారని ఒక లెక్క తెలుసు. నాకు ఆ పత్రికా ప్రకటనలోని అల్లం బెల్లం మురబ్బాలు కావాలి అనిపించింది. మా రఘుగాడి ధన సహకారంతో అనుకుంటా ఆ పుస్తకాన్ని పోస్ట్ లో తెప్పించుకున్నాను. అట్ట పైన, అట్ట లోపలా అంతటా ఎంత బావుంటుందో ఆ పుస్తకం. రమణ గారి రాతల చమత్కారం, బాపు గారి బొమ్మల మహధ్భాగ్యం. రీచర్చీ కాలర్లు, చేయి జారిన అదృష్టరేఖలు, కథలూ-కజ్జికాయలు, మెంతికూర చింతామణి, ఉత్తరగ్రహణం, మూడు ప్రింట్లు ఆరు ఆటలూ, విద్యాలయాల్లో పిడకల వేట, కిటికీ పక్క సీటు, పొట్టలో చుక్క, కార్తీకంలో కవిత్వ సమారాధన, గళ్ళ నుడికట్టు చీర ఇట్లా ఒకటా రెండా ఎన్నెన్నో శీర్షికల మకుటాలతో ఆ వ్యాసాలు చక్కిలిగింతల హాస్యాలు పలికాయి. మొన్నటికి మొన్న ఒకానొక రచయిత్రి గురించి అనుకుంటూ " ఈ రచయిత్రి పెట్టే చివరి సిరాచుక్క అంధ్ర సరస్వతి నొసట కస్తూరి చుక్క" అని ఎప్పుడు అవుతుందో కదా దేముడూ అని శ్రీరమణ భాషలో దండం పెట్టుకున్నా కూడా . పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో కొనుక్కున్న, చదువుకున్న శ్రీరమణ గారిని ఈ రోజుకూ చదువుకోవడం, వాటిని గుర్తుగా తలుచుకోవడం అనేది మన గొప్ప కాదు. శ్రీరమణ గారే అన్నట్టు "గింజకు జీవశక్తి ఉంటే అది ఎక్కడ పడేసినా పోదు" తెలుగు పాఠకుడికి బుర్ర ఉన్నంత కాలం అందులో జీవశక్తి ఉన్న గింజలు మాత్రమే బ్రతికి ఉంటాయి. శ్రీరమణ గారి నుడి ,ఆయన పలుకు అటువంటిది. అది పురాజన్మలో శ్రీ మహావిష్ణువు చేతి బంగారు మురుగు. కలం రూపం ధరించి, రమణ అనే కలం పేరు దాల్చి కొంతకాలం ఇక్కడికి వచ్చింది. ఈ రోజు అది వెనక్కి మరలి శ్రీహరి చేతినే చేరింది. నా ఇంటర్ మీడియట్ రోజులు, చదువు దినాలు గడిచి, అలా అలా నడిచి ఒకచోట వచ్చి నిలబడ్దాను. ఇదిగో ఇప్పుడు నేనున్న నా ఇంటి నుంచి రెండో మలుపు దగ్గర సరాసరి కాస్త డౌన్ దిగితే శ్రీరమణ గారి ఇల్లు. వారానికి రెండు మూడు సార్లు ఆయన్ని కలిసి బోలెడన్ని కబుర్లు గడిచేవి. ఫోన్ లో కాలక్షేపాలు నడిచేవి. వారి ఇంటికి వెళితే శ్రీమతి జానకి గారి కాఫీ ఆతిథ్యాలు. మా ఆవిడ ఎప్పుడయినా ఏదయినా పనిమీద ఊరికి వెడితే మొహమాటపడకుండా తమ ఇంటికి వచ్చి భోజనం చెయ్యమనేవారు. నేను ఓ యెస్, తప్పకుండా వస్తా అనేవాడ్ని, రాకుండా అలానే మొహమాటపడేవాడ్ని. కాస్త సాహిత్యం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా మా ఇంటికి వస్తే వారిని పిలుచుకుని మా మేనమామ గారి ఇంటికి వెళ్ళినంత చనువైన దర్జాతో ఆయన ఇంటికి తీసుకు వెళ్ళి కబుర్లు పెట్టించేవాడిని. ఆయనకు నేనంటే వాత్సల్యం ఉండేది. నా పుట్టినరోజు పండగ నాడు ఉదయాన్నే ఆయన కాళ్లకు దండం పెట్టుకుని వారి ఆశీస్సులు తీసుకునేవాడిని. నా తొలి పుస్తకం రాగానే దగ్గరి వారని, పెద్ద దిక్కని, ఆయన వద్దకు వెళ్ళి పుస్తకాన్ని అందించాను. ఆయన ఆ పుస్తకం సలక్షణీయతను ముచ్చటగా రెపరెపలాడించి, నా భుజం మీద చేయి వేసి బాపు గారు ఈ రోజు ఉండి, ఈ పుస్తకం చూసి ఉంటే ఎంత పొంగిపోయి ఉండేవారో తెలుసా? అని నా కళ్ళలో చిన్న తడిని తెప్పించారు. తెల్లవారుఝామున వాకింగ్ కని నాలుగు గంటలకు లేచి నడుస్తూ అక్కడ మలుపు తిరుగుతానా, నా కళ్ళు శ్రీరమణ గారి ఇంటి గేటుకు అంటుకు పోయి ఉంటాయి. ఎన్నిసార్లు బిగుతైన ఆ గేటు కిర్రుకిర్రులని పలకరించి ఉంటాను? ఆ ఇంట్లో ఒక కుక్క ఉండేది అది ఎవరు వచ్చినా తెగ అరుస్తూ గోల చేసేది. గత రెండు, రెండున్నర సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. కరోనా రోజుల్లో రమణ గారు వారి పెద్దబ్బాయి ఇంటికి వెళ్ళిపోయారు. నేను రోజూ ఉదయపు నడకలో ఆ ఇంటివైపు చూస్తాను. రమణ గారు వచ్చి ఉంటారేమోనని ఆశ. కలిసి బోల్డని కబుర్లు చెప్పుకోవచ్చని కోరిక. ఆయన ఆరోగ్యం చాలా కాలంగా బావుండటం లేదని కబురు తెలుసు నాకు.అయినా ఆయన దగ్గరికి వెళ్లలేక పోయా. ఎప్పుడు కలిసినా కూర్చుని మాట్లాడే ఆయనని మంచం మీద చూడ్డం నాకు ఇష్టం లేకుండా ఉండింది. రమణగారు నాతో ఒక పుస్తకం గురించి చెప్పేవారు దాని శీర్షిక " సింహాల మధ్య నేను" అని గొప్పగొప్ప వారి మధ్య గడిపిన ఒక వ్యక్తి జ్ఞాపకాల సమాహారం ఆ పుస్తకం. అట్లాంటి పుస్తకం నేను ఒకటి వ్రాస్తానండి. ఎంత గొప్పవారి మధ్య గడిపాననుకున్నారు నేను అని చెప్పుకుని పొంగిపోయేవారు ఆయన. శ్రీరమణ గారూ, నేనూ మీ వంటి ఒక సింహం సాన్నిహిత్యంలో గడిపాను సర్. మిమ్మల్ని గుహలో చూడటమే నాకు తెలుసు. మంచం మీద దుప్పటి కప్పుకున్న సింహన్ని ఈ కళ్ళతో చూడలేక పోయాను సర్. అందుకే ప్రతి రోజూ మీరు తిరిగి వచ్చే రోజుకోసం మీ ఇంటివైపు చూపులను అట్టిపెట్టేవాడ్ని. నేను చిన్నతనం రోజులనుంచి చదువుకున్న శ్రీరమణ గారిని 2002 ఆ ప్రాంతాల్లో ఆంధ్రజ్యోతిలో మొదటిసారిగా కలిసాను. మునుపు కాలంలో మూతపడ్డ ఆంధ్రజ్యోతిని అప్పుడు కొత్తగా మళ్ళీ మొదలెట్టారు. నాకు ఆ పత్రికలో శ్రీ రమణగారు ఉద్యోగం చేస్తూ ఉన్నారని తెలీదు. నేను కార్టూనిస్ట్ శంకర్ ని కలవడానికి అక్కడికి వెళ్ళాను. శంకర్ కూచునే దగ్గరలోనే రమణగారి సీటు. నేను ఆయన్ని చూస్తూనే ఆయన దగ్గరికి వెళ్ళి "మీరెవరో నాకు బాగా తెలుసు అనిపిస్తుంది. కాని తెలీదు, మీరు ఎవరు సార్" అని అడిగా. ఆయన నవ్వుతూ ఆయన ఎవరో చెప్పారు. నేను థ్రిల్ అయిపోయా, ఈయనేనా నా బాల్య స్నేహితుడు. ఈయన రచనలనేగా నవ్వులు నవ్వులుగా చదువుకున్నది . ఈ రోజు కళ్ళ ఎదురుగా నా ముందు ... ఆ రోజు కలిసిన మహూర్త బలం గొప్పది. ఇక ప్రతి రోజూ ఆయన్ని కలిసేవాడిని. అప్పుడు నా ఉద్యోగం ఆంధ్రప్రభలో పతంజలి గారితో, ఉదయం పూట ఆయనతో ఎన్నెన్ని కబుర్లు నవ్వులు గోల. సాయంత్రం కాగానే శ్రీరమణ గారి తో ముచట్లు. ఎట్లాంటి రోజులవి. ఎంత బంగారు సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు అవి ! వెలిగిన రోజులవి. ఒక సాయంత్రం శ్రీరమణ గారి కలిస్తే నవ్వుతూ అన్నారు కదా" మీ గురువు గారిని కాస్త మమ్మల్ని క్షమించి దయ చూడమనవచ్చు కదా మీరు" "ఏమీ సర్? ఏవయ్యింది," "నేనిలా అన్నానని మీరు ఆయనతో చెప్పండి చాలు" నేను మరుసటి రోజు పతంజలి గారిని కలిసి శ్రీరమణ గారు ఇలా అన్నారు, ఏమిటి సర్ విషయం అని అడిగా. "నిన్న ఒక ఎడిటోరియల్ వ్రాసాను మిత్రమా" అన్నారు పతంజలి గారు. అది తెచ్చుకుని చదివా. నాకు గుర్తున్నంతరకు దానిపేరు "ఒక చిరునవ్వు, ఒక వెక్కిరింత, ఒక లేమి" అటువంటి ఒక సాహితీ చురక వ్రాయలన్నా, దానిని పుచ్చుకుని సిగ మల్లెగా దరించాలన్నా, సరస్వతీ దేవి అద్దంలో తనను చూసుకుంటూ వ్వే వ్వే వ్వే అనుకొడమే. లేరిక అటువంటి సాహితీవేత్తలు. రారిక ఆ మత్తేభాలు, శార్దూలాలూ. బాపు రమణల గురించి కానీ , ఆ కాలం సాహితీ జనం గురించి కాని, ఎన్ని కబుర్లు, ఎన్ని విశేషాలు ఆయన దగ్గర ఉండేవో! ఫలానా కథ గురించి చెప్పాలన్నా, ఫలానా సాహితీ విశేషం గురించి ముచ్చటించాలన్నా, ఆనాటి సినిమా తెర వెనుక ముచట్ల వంటి అల్లం మురబ్బా ఘాటు నుండి శార్వరి నుండి శార్వరి దాక ఎన్ని విశేషాల లోతుల్లోకి మునకలు వేయించేవారో! శార్వరి నుండి అంటే నాకు గుర్తుకు వచ్చింది , రమణగారు మీరు నాకు విశ్వనాథ వారి నవల సెట్టు బాకి ఉన్నారు. మాట దక్కించుకోకుండా ఎలా వెల్లిపోయారు మీరు? మా ఇద్దరికి ఉన్న మరో పిచ్చి స్టేషనరీ. రంగు రంగు కాగితాలు పెన్నులు పెన్సిల్లు, క్లిప్పులు. తాను మదరాసు లో ఉన్నప్పుడు కొన్న సరంజామా గురించి చక్కగా వినిపించేవారు. ఆయనకు గుర్తు వచ్చినప్పుడల్లా నా పైలట్ ఎలాబో పెన్నును అడిగి తీసుకుని దాన్ని అలా ఇలా తిప్పి చూసేవారు. జాగ్రత్తగా ఉంచుకొండి దీన్ని, చాలా ఖరీదైన పెన్ను కదా ఇలా చొక్కా జేబుకు తగిలించుకు తిరగవద్దు, అని హెచ్చరించేవారు. పదేళ్ల క్రితమే దాని ధర పన్నెండు వేల రూపాయలు. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ. అన్నం పెట్టే విద్యకు సంబంధించిన టూల్స్ ని ఇలా భక్తి గా కొనుక్కునే నా గుణం పై ఆయనకు చాలా మక్కువగా అనిపించేది. మేము చివరిసారిగా కలవడానికి ముందు ఇంటికి పిలిచి ఒక మంచి తోలు బ్యాగు కానుకగా ఇచ్చారు. ’"నాకు దీని క్వాలిటీ బాగా నచ్చిందండి, రెండు తీసుకున్నా. నాకొకటి, మీకొకటి. ఇప్పుడు అవన్నీ తలుచుకున్న కొద్ది బాధగా ఉంటుంది. మనమేం పుణ్యం పెట్టి పుట్టాం ఇంత అభిమానం, ప్రేమ పొందడానికి. నేను స్కూటర్ కొన్న కొత్తలో కార్టూనిస్ట్ జయదేవ్ గారూ, నేనూ ఒక పత్రికలో కలిసి పని చేసేవాళ్లం. నాకు ఆయన్ని స్కూటర్ మీద ఎక్కించుకుని తిరగాలని చాలా కోరిగ్గా ఉండేది. ఆయనకు నా డ్రయివింగ్ మీద అపనమ్మకం కాబోలు. ఎపుడు రమ్మన్నా, మీరు పదండి అన్వర్, నేను మీ వెనుకే నడుచుకుంటూ వస్తా గా అని నవ్వేవాడు. నేను కారు కొనబోతున్న కొత్తలో కార్ల గురించి శ్రీరమణ కబుర్లు పెట్టేవాణ్ణి. ఆయనా చాలా విషయాలు చెప్పేవారు కార్ల గురించి , బెజవాడలో నవత డ్రయివింగ్ స్కూలు వారి గురించి, వారితో స్నేహం, బాపు గారు వ్రాసి ఇచ్చిన లోగో గురించి. సర్, నేను కారు కొన్నాకా నా కారు ఎక్కుతారా మనం కలిసి తిరుగుదామా అనేవాడ్ని, తప్పకుండా అండి అని ఆయనా భరోసా ఇచ్చారు. కానీ మేము ఇద్దరమూ వేరే కార్లు ఎక్కి తిరిగాము కానీ, మా కారు మాత్రం ఎక్కి తిరగలా. అది ఎందుకో కుదరలా. ఒకసారి ఒక ప్రయాణం ప్రపోజల్ పెట్టారు. ఏవండీ ఓడ ఎక్కి శ్రీలంక వెళ్లి వద్దామా? ప్రయాణం భలే బావుంటుంది. మీరు వస్తాను అంటే మీకు కూడా టికెట్ బుక్ చేపిస్తా అన్నారు . అయితే ఓడ కన్నా ముందే కరోనా వచ్చింది. ప్రయాణం మునకేసింది.ఆయన హాస్యమూ, చురకా రెండూ పదునైనవి దానికి ఎటువంటి మినహాయింపులు ఉండేవి కావు. ఫలానా ఆయన ఈయనకు బాగా దగ్గరివారు అనుకుంటామా ,ఆ దగ్గరి వారిపైన అయినా ఒక చురక వేయవలసి వస్తే వేయడమే కానీ మన పర అని ఏమి ఉండేవి కావు. బాపు గారి దగ్గర ఉండి ఉండి రమణ గారికి కూడా బొమ్మల లోతుపాతులు కొంతమేరకు తెలుసు . పిచ్చి బొమ్మ, వంకర, బొమ్మ, బొమ్మ తక్కువ బొమ్మ, మేధావి బొమ్మ ల మీద ఆయనకు బాగా చిన్న చూపు. ఇదంతా దొంగ బొమ్మల సంగతి. అలా అని ఆయనతో పికాసో గురించో, లక్ష్మాగౌడ్ గురించో, తోట వైకుంఠం గురించో మాట్లాడి చూడండి. పులకించి పోతూ చెబుతారు. ఒకసారి ఒక పత్రికాఫీసులో మేమిద్దరం కబుర్లు చెబుతూ కూచున్నామా, స్కానింగ్ డిపార్ట్మెంట్ నుండో , ఆర్ట్ డిపార్ట్మెంట్ నుండో ఒకాయన వచ్చి "సర్ ఆర్టిస్ట్ బొమ్మ వేసి ఇంటికి వెల్లిపోయారు, అయితే బొమ్మ ఏది పై భాగమో, ఏది కింది భాగమో అర్థం అవడం లేదు. మీరు కాస్త చెప్పండి అన్నారు. ఆయన ఆ బొమ్మని ఎత్తి పట్టుకుని " ఈ బొమ్మని ఇలాగే ఎడిట్ పేజీలో ఆర్టికల్ కి ఉపయోగించుకోండి, ఇదే బొమ్మని కుడివైపుకు తిప్పి ఎడిట్ పేజిలోనే ఆ చివర ఒక కవిత వస్తుంది కదా, దానికి వాడుకోండి. బొమ్మని ఎడమ వైపుకు తిప్పి పెట్టుకుని ఆదివారం అనుబంధంలో కథకు ఇలస్ట్రేషన్ గా పెట్టుకోండి. ఇక ఈ రోజు మన కార్టూనిస్ట్ రాకపోతే ఆ కార్టూన్ ప్లేస్ లో ఈ బొమ్మని తలకిందులు చేసి పెట్టుకుంటే సరిపోతుంది" మొహంలో కోపం, విసుగు, చిరాకు ఏమీ లేకుండా ఆయన అలా కూల్ గా చెబుతుంటే , మనం పేపరాఫీసు పైకప్పు ఎగిరి పోయేలా నవ్వుతూ ఉంటే ఏం మర్యాద? రమణ గారు ఒక రచయితకు ముందు మాట వ్రాస్తూ ఇలా అన్నారు" మనం ఒక పుస్తకం అచ్చుకి ఇస్తున్నాము అంటే దాని అర్థం , ఒక వెదురు పొదను సమూలంగా నాశనం చేస్తున్నామని . ఒక వెదురు పొద పచ్చగా బ్రతకాలా? లేదా మీ పుస్తకం బయటికి రావాలా అనేది మీ విజ్ఞత కే వదిలేస్తున్నా.చెప్పాగా, ఆయనకు నేనంటే వాత్సల్యం ఉండేది. లక్షల రూపాయల పనులని ఆయన నాకు ఇప్పించారు. ఆయన వ్రాసిన ఒక పుస్తకానికి నేను బొమ్మలు వేసి ఋణం కొద్దిగా మాత్రమే తీర్చుకున్నాను. ఆయన వెంకట సత్య స్టాలిన్ పుస్తకానికి బొమ్మలు వేద్దామని నాకు చాలా కోరిగ్గా ఉండేది. శ్రీరమణ గారికి ఉన్న అభిమానుల్లో ఒక పెద్ద అభిమాని చిత్రకారులు శ్రీ మోహన్ గారు. ముచ్చట పడి ఆయన వెంకట సత్య స్టాలిన్ కి బొమ్మలు వేస్తానని చెప్పి వేసి పెట్టారు. నిజానికి ఆ బొమ్మలు ఏమీ బాగో ఉండవు. ఆ దగ్గర శ్రీరమణ గారు హెల్ప్ లెస్. అయితే శ్రీ మోహన్ గారు, శ్రీరమణ గారు చిలకల పందిరి అని ఒక సూపర్ డూపర్ హిట్ శీర్షిక నడిపారు. ఆ రచన, ఆ బొమ్మలు బంగారం మరియూ తావే. మోహన్ గారన్నా, ఆయన వచనం అన్నా, ఆయన రేఖలు అన్నా శ్రీరమణగారికి కూడా చాలా ముచ్చట. ఆ మధ్య పాత పుస్తకాలు వెదుకుతుండగా ఆయన సోడా నాయుడు కథకి గోపి గారు వేసిన నలుపూ తెలుపు బొమ్మ నా కంటపడింది. ఎంత అందం . కథంత అందం ఆబొమ్మది. పత్రికాఫీసుల్లో పని చేసారు కదా ఆయనకు చాలా చాలామంది చిత్రకారులతో పరిచయం , చాలా దగ్గరితనం ఉండేది . అయితే ఆయన రచనలకు బాపు గారు తెచ్చిన అందం ఎవరూ తేలేదు, తేలేరు కూడా. వ్యక్తిగతంగా , వృత్తిగతంగా కూడా ఆయనకు ఇష్టమైన చిత్రకారులు బాపు కాకుండా మోహన్ గారు గిరిధర్ గౌడ్ గారు మాత్రమే నని నాకు తెలుసు. ఈ రోజు ఉదయం శ్రీరమణ గారిని చివరి చూపుగా పలకరించడానికి ప్లోటిల్లా అపార్ట్మెంట్ కి వెళ్ళాము నేను, కవి నాయుడు గారు. రమణ గారు అద్దాల పెట్టె లో పడుకుని ఉన్నారు. అలా మాటడకుండా, నిశ్శబ్దంగా ఉంటే ఆయనేం శ్రీరమణ? నా కంటి అద్దాల లోపల నీరు గిర్రున తిరిగింది, అద్దాలు తీసు కళ్ళు తుడుచుకునే పని చేయలేదు. ఆ గాజు పెట్టె లో నిలువెల్లా ఆయన నాకు కనపడుతున్నారు. ఏదో లోపం, ఏదో తప్పు జరిగింది, నేనేదో మరిచిపోయా. కొంత కాలం క్రితం ఒకసారి మా ఇద్దరి మాటల్లో మనం ఎవరి ఇంటికయినా వెడుతూ వారికి ఏమీ పట్టుకు వెడితే బావుంటుంది? మనం ఖర్చు పెట్టే రూపాయ ఎట్లా వృధా పోకుండా ఉండాలి? ఆ ఇంట్లో వాళ్లకు షుగర్ ఉంటే ఎలా? ఈ పూలు, బొకేలు అవీ పట్టుకు పోతారు కదా, పూలు ఎట్లాగూ వాడిపోతాయి కదా ,దానికి డబ్బులు దండగ కదా అని శ్రీరమణ గారితో మాటలు పెట్టుకున్నాను . దానికింత గొడవెందుకండి? ఏదయినా పట్టుకు వెళ్ళొచ్చు. ఆ ఇంట్లో వయసు పెద్ద వాళ్ళే ఉండి , వారికి షుగర్ ఉంటే మాత్రమేం? తీసుకు వెళ్ళిన స్వీట్లు వాళ్ళ ఇంట్లో పిల్లలు తింటారు, పిల్లలు లేకపోతే పక్కింటి వారికో, లేదా వారి పనివారికో పంచుతారు.పూల బొకేలు ఇస్తే డబ్బులు దండగ ఏమీ కాదు. పూల గుత్తిని చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందండి . వాంగో సన్ ప్లవర్స్ పెయింటింగ్ లాగా, దాని రంగులు, రెక్కలు చూస్తూ గడపవచ్చు కదా. అప్పుడు ఇంటికి ఇంటికి వచ్చిన వారెవరైనా ఎక్కడిది పూలగుత్తి, ఏమిటి విశేషం అని అడిగితే " మమ్మల్ని చూడ్డానికి ఇంటికి అన్వర్ గారు వచ్చి వెళ్లారు , మా కోసం పూలు పట్టుకు వచ్చారు" అని సంతోషంగా చెప్పుకుంటారు కదా. శ్రీరమణ గారు ఈ రోజు మీకొక పూల మాల తేవాల్సింది నేను. తేనందుకు మీరు ఫీల్ అయ్యేది ఏమీ లేదు. సింహాల మధ్య తిరిగి ఉండి కూడా నేను మర్యాద తెలీని శిష్యుడిగా మిగిలిపోలా! ఇపుడు ఏం చేసేది? బుద్ది లేని జన్మ. థూ! ఒకసారి నేను ఒక కథ చదివాను . వేలూరి శివరామశాస్త్రి గారిది. కథ పేరు 'తల్లి లేని పిల్ల"ఆ కథలో ఇలా ఉంటుంది "చిట్టెమ్మ మేకల మంద నడుమ కూచుంది . చుట్టూ పది పన్నెండు దుత్తలు, ఐదారుచెంబులూ. చిట్టెమ్మ కొడుకు రాఘువులు మేకపాలతో ఒక చిన్న గుంట అలికి దానిలోనూ, ఒక చిన్న రాతి తొట్టిలోనూ కుక్కలకూ, కుక్క పిల్లలకూ మేకపాలు పోస్తున్నాడు. రాఘువులు తండ్రి నాగాయ మంద చివర నించుని మేకలని పరీక్ష చేసి పళ్ళు కదిలిన వానికి క్షౌరం చేసి చక్రాంకితాలు వేశాడు. కొన్ని మేకల డెక్కల నడుమ ముళ్ళు లాగాడు. ఒక మేకవి కాలిమీది వెంట్రుకలు లిక్కితో కోసి నెత్తురు కంటచూసి- 'ఓరే నాయనా! ఉప్పుపెట్టి రుద్దు" అని పురమాయించాడు" నాగాయ తన కొడుకును పురమాయిస్తే పురమాయించాడు కానీ, నాకు అనుమానాలు, ఎందుకుని ఈ చక్రాంకితాలు, అదీనూ పళ్ళుకదిలినవాటికే ఎందుకు? లిక్కి దూసి మేక నెత్తురు పరీక్ష చెయ్యడం అదేవిటి? సరే ఉప్పు రాయడం ఎందుకో కాస్త అంచనాకు అందిందనుకో. ఎవరిని అడిగితే వీటికి సమాధానం దొరకాలి? అపుడు నాకు ప్రతి ప్రశ్నకు సమాధానంగా శ్రీరమణ గారు ఉండేవారు. మహానుభావుడు కేవలం ఆధునిక సాహిత్యాన్ని, ప్రాచీన వాగ్మయాన్ని చదువుకున్న మనిషే కాదు. జీవితాన్ని పరిశీలనగా చూసిన వాడు కూడా . పల్లెలో పుట్టి పెరిగినవాడు, అన్నీ తెలుసు. తెలిసిన వాటిని విప్పి చెప్పే హృదయం ఉంది. ఇలా ఉన్న హృదయాలన్ని మూసుకుపోయి ఇప్పుడు మనసు లేని మనస్సుల , మనుష్యుల మధ్య బ్రతకడం ఎంత కష్టమో, చికాకో సింహాల మధ్య తిరిగిన మీకు ఏమి తెలుస్తుంది ? చెప్పినా ఏమి అర్థమవుతుంది. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి దిన పత్రిక -
తప్పును అంగీకరిస్తున్నా.. దయచేసి క్షమించండి: ఆదిపురుష్ రైటర్
భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్’ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. రామాయణం ఇతీహాసం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతీసనన్ జానకిగా నటించారు. సాంకేతికపరంగా ఈ చిత్రం మెప్పించినా.. కంటెంట్ పరంగా మేకర్స్ చేసిన పొరపాట్లతో కొన్ని సన్నివేశాలు రామాయణానికి విరుద్ధంగా తీర్చిదిద్దారనే విమర్శలు వచ్చాయి. మరోవైపు పలు వివాదాలు కూడా ఈ చిత్రాన్ని చుట్టుముట్టాయి. అయితే తాజాగా ఈ చిత్ర డైలాగ్ రైటర్ మనోజ్ ముంతశిర్ క్షమాపణలు కోరారు. సోషల్ మీడియా వేదికగా తాము చేసిన తప్పును అంగీకరిస్తున్నట్లు పోస్ట్ చేశారు. (ఇది చదవండి: సరిగ్గా 127 ఏళ్ల క్రితం.. భారత్లో అడుగు పెట్టిన 'సినిమా' ) మనోజ్ ముంతశిర్ తన ఇన్స్టాలో రాస్తూ.. ' ఆదిపురుష్ సినిమా వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. అందువల్ల నా రెండు చేతులు జోడించి.. మీ అందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. ప్రభు బజరంగ్ బలి మమ్మల్ని ఐక్యంగా ఉంచి.. మన పవిత్రమైన సనాతన, గొప్ప దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించుగాక.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. జూన్ 16న థియేటర్లలోకి వచ్చిన ఆదిపురుష్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. విజువల ఎఫెక్ట్స్ మినహాయిస్తే.. ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అంతేకాకుండా ఈ చిత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. దీంతో రచయిత మనోజ్ ముంతశిర్ సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కోరారు. (ఇది చదవండి: 15 ఏళ్లలో 11వ సినిమా.. బెడ్ షేర్ చేసుకుని ఉండుంటే..: నటి) View this post on Instagram A post shared by Manoj Muntashir Shukla (@manojmuntashir) -
'ఆదిపురుష్' రైటర్కు బెదిరింపులు.. చంపేస్తామని!
'ఆదిపురుష్' మూవీ విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. సినిమా రిజల్ట్ ఏంటనేది పక్కనబెడితే.. రైటర్ మనోజ్ ముంతాషిర్ గత కొన్నిరోజుల నుంచి హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ఆయన్ని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ విషయం సినీ వర్గాలు, అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకీ అసలేం జరుగుతోంది? మాట మార్చడమే కారణమా? 'ఆదిపురుష్' సినిమాని రామాయణం ఆధారంగా తీశారు. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు. అయితే ఒరిజినల్ స్టోరీతో పోల్చి చూస్తే.. ఇందులో కొన్ని సీన్స్ కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకొందరు ట్రోల్స్ చేశారు. ఈ విషయమై తాజాగా స్పందించిన రైటర్ మనోజ్.. తాము తీసింది రామాయణం కాదని, కేవలం స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పుకొచ్చారు. Mumbai Police provides security to dialogue writer of #Adipurush, Manoj Muntashir after he sought a security cover citing a threat to his life. Police say that they are investigating the matter. (File photo) pic.twitter.com/1WiWiOhclo — ANI (@ANI) June 19, 2023 (ఇదీ చదవండి: రావణుడు లుక్పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. అందుకే ఇలా!) ఫ్యాన్స్ కి మండింది! అయితే 'ఆదిపురుష్' రిలీజ్ కి ముందు ఒకలా మాట్లాడిన రైటర్ మనోజ్.. థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత మాట మార్చడం అభిమానులకు నచ్చలేదు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ వరకు పర్వాలేదు గానీ ఓ వ్యక్తి మాత్రం చంపేస్తా అంటూ సదరు రైటర్ ఇంటికి లెటర్ పంపించాడు. దీంతో ఇతడు పోలీసులను ఆశ్రయించాడు. వాళ్లు ఇతడికి స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆ లేఖ ఎవరు పంపించారనేది దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పుకొచ్చారు. హద్దులు దాటుతున్న అభిమానం ఓ సినిమా నచ్చడం, నచ్చకపోవడం వ్యక్తిగత అభిప్రాయం. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని షేర్ చేయడం వరకు ఓకే. కానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం ఏదైనా సినిమాలో చిన్న సీన్ నచ్చకపోయినా సరే మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. 'ఆదిపురుష్' రైటర్ విషయంలోనూ జరిగిందిదే అనిపిస్తోంది. ఏదేమైనా సరే ఈ సోషల్ మీడియా వల్ల విపరీత పోకడలు కనిపిస్తుండటం భయం కలిగిస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి మాత్రం!) -
ఆదిపురుష్ రచయిత సంచలన కామెంట్స్
-
హనుమంతుడి నోట మాస్ డైలాగ్స్.. వివాదంపై స్పందించిన రచయిత
ఆదిపురుష్ విషయంలో అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి అనేలా ఉంది పరిస్థితి! ప్రభాస్ ఫ్యాన్స్, రామ భక్తులంతా సినిమా చూసి పండగ చేసుకుంటారనుకుంటే చాలామంది మెచ్చుకోలేక, నొచ్చుకోలేక సైలెంట్ అయిపోతున్నారు. అయితే కొందరు మాత్రం ఆదిపురుష్లో అక్కడక్కడా వచ్చే కొన్ని సన్నివేశాలను, డైలాగులను అస్సలు సహించలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా హనుమంతుడు చెప్పే సంభాషణలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీతాదేవిని వెతికేందుకు వెళ్లిన హనుమంతుడి తోకకు లంకలో మంట పెడతారు. ఆ సమయంలో హనుమాన్ ఇంద్రజిత్తుతో.. నా తోకకు కట్టిన గుడ్డ నీ బాబుది... దానికి రాసిన చమురు నీ బాబుది... నిప్పు కూడా నీ బాబుకే.. అన్నట్లుగా ఓ డైలాగ్ చెబుతాడు. హనుమాన్కు మరీ ఇంత మాస్ డైలాగ్లు అవసరమా? అని నెట్టింట చర్చ జరుగుతోంది. తాజాగా ఈ వివాదంపై ఆదిపురుష్ డైలాగ్ రచయిత మనోజ్ ముంతషీర్ స్పందించాడు. 'నావైపు నుంచి ఎటువంటి తప్పు లేదు. ఎంతో నిశితంగా ఆలోచించాకే హనుమంతుడి సంభాషణలు రాశాను. సినిమాలో చాలా పాత్రలున్నాయి. అందరూ ఒకేలా మాట్లాడరు కదా.. పాత్రల మధ్య వైవిధ్యం చూపించాలనే హనుమంతుడి భాషను సింపుల్గా ఉండేలా జాగ్రత్తపడ్డాను. లంకా దహనం సమయంలో హనుమంతుడి చెప్పే డైలాగ్ గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానీ మనందరికీ రామాయణం ఎలా తెలుసు? చిన్నప్పటి నుంచి కథలు కథలుగా చెప్తేనే కదా మనం తెలుసుకున్నాం. రామాయణంపై ఎన్నో గ్రంథాలు కూడా ఉన్నాయి. నేను పల్లెటూరి నుంచి వచ్చినవాడిని. నాకు మా నానమ్మ, అమ్మమ్మలు రామాయణ కథలను చాలా సింపుల్గా చెప్పేవారు. జానపద కళాకారులు కూడా హనుమంతుడి సంభాషణలను ఇలాగే చెప్పేవారు. దాన్నే నేను ఆదిపురుష్లో వాడాను. అంతే తప్ప, నేనేమీ కొత్తగా డైలాగ్ సృష్టించలేదు' అని వివరణ ఇచ్చాడు. చదవండి: ఆదిపురుష్ రిజల్ట్.. ఇలా జరిగిందేంటబ్బా. . ఈ తప్పుల వల్లే! -
నవ్వుల పువ్వుల దారిలో...
ఫ్యాషన్ బ్లాగర్గా ప్రయాణం మొదలుపెట్టింది దిల్లీకి చెందిన డాలీసింగ్. రైటర్, స్టైలిస్ట్, కంటెంట్ క్రియేటర్, ఎంటర్ప్రెన్యూర్గా విజయపథంలో దూసుకుపోతోంది. ‘మనలో ఉన్న శక్తి ఏమిటో మనం చేసే పనే చెబుతుంది’ అంటున్న 29 సంవత్సరాల డాలీసింగ్కు పనే బలం. ఆ బలమే తన విజయ రహస్యం... డాలీసింగ్ మాట్లాడితే చుట్టుపక్కల నవ్వుల పువ్వులు పూయాల్సిందే! ఆమె ఏం మాట్లాడినా సూటిగా ఉంటుంది. అదే సమయంలో ఫన్నీగా ఉంటుంది. ‘స్పిల్ ది సాస్’ అనే ఫ్యాషన్ బ్లాగ్తో ప్రయాణం మొదలు పెట్టింది. లైఫ్స్టైల్ పోర్టల్ ‘ఐ–దివ’ కోసం జూనియర్ రైటర్, స్టైలిస్ట్గా పనిచేసింది. ‘రాజు కీ మమ్మీ’ ఫన్నీ వీడియోలతో కంటెంట్ క్రియేషన్లోకి అడుగుపెట్టింది. ఈ వీడియోలు ఎంతో పాపులర్ అయ్యాయి. రోజువారి జీవితం నుంచే తన ఫన్నీ వీడియోలకు కావాల్సిన స్టఫ్ను ఎంపిక చేసుకునేది. ‘బయట ఏదైన ఆసక్తికరమైన దృశ్యం కంటపడితే నోట్ చేసుకునేదాన్ని. ఆ తరువాత డెవలప్ చేసేదాన్ని. మనలోని శక్తి ఏమిటో మన రచనల్లో తెలిసిపోతుంది. రచన చేయడం అనేది నాకు ఎంతో ఇష్టమైన పని. ఎప్పటికప్పుడూ కొత్త కొత్త క్యారెక్టర్లను సృష్టించడానికి ప్రయత్నిస్తాను. ఐ–దివలో పనిచేస్తున్నప్పుడు స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం అంటూ ఉండేది కాదు. ఒక టాపిక్ అనుకొని కెమెరా ముందుకు వచ్చి తోచినట్లుగా మాట్లాడడమే. ఆ తరువాత మాత్రం స్క్రిప్ట్ రాయడం మొదలైంది’ అంటుంది డాలీ సింగ్. కామెడీ అయినా సరే, ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కాల్పనిక హాస్యం కంటే నిజజీవిత సంఘటనల నుంచి తీసుకున్న కామెడీనే ఇష్టపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పంచ్లైన్స్ విషయంలో రకరకాలుగా ఎక్సర్సైజ్లు చేస్తుంటుంది డాలీ. ‘ప్రేక్షకులను మెప్పించడం అనేది ఫన్ అండ్ చాలెంజింగ్గా ఉంటుంది. రెండు మూడు నెలలకు ఒకసారి రీస్టార్ట్ కావాల్సిందే. కంటెంట్ క్రియేషన్లో అతి ముఖ్యమైనది ఎప్పుటికప్పుడు మనల్ని మనం పునరావిష్కరించుకోవడం’ అంటుంది డాలీ. తాము క్రియేట్ చేయాలనుకునేదానికీ, ప్రేక్షకులు ఇష్టపడుతున్న కంటెంట్కూ మధ్య కంటెంట్ క్రియేటర్ సమన్వయం సాధించాల్సి ఉంటుంది. మరి డాలీ సంగతి? ‘అనేకసార్లు నిరాశపడిన సందర్భాలు ఉన్నాయి. మొదట్లో... నేను క్రియేట్ చేసేది ప్రేక్షకులకు నచ్చేది కాదు. వారికి నచ్చేది నాకు నచ్చేది కాదు. దీంతో ప్రేక్షకుల అభిరుచికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మొదలుపెట్టాను’ అంటుంది డాలీ. కంటెంట్ క్రియేటర్లకు ఒత్తిడి అనేది సర్వసాధారణం. ‘ఒత్తిడిని పనిలో భాగంగానే భావించాను. దానినుంచి దూరం జరగడం అనేది కుదిరే పని కాదు. అయితే ఒత్తిడి ప్రభావం కంటెంట్పై పడకుండా జాగ్రత్త పడాలి’ అంటుంది డాలీ. ఫ్యాషన్ బ్లాగర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్గా గుర్తింపు పొందిన డాలీ అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్సీరిస్ ‘మోడ్రన్ లవ్ ముంబై’తో నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది. ‘నేను విజయం సాధించాను అనుకోవడం కంటే, ఇప్పుడే బయలుదేరాను అనుకుంటాను. అప్పుడే ఫ్రెష్గా ఆలోచించడానికి, మరిన్ని విజయాలు సాధించడానికి వీలవుతుంది’ అంటున్న డాలీసింగ్ ఒక షార్ట్ఫిల్మ్ కోసం స్క్రిప్ట్రెడీ చేసుకుంటోంది. అందులో తానే నటించనుంది. -
భావి ఫలం
పాత కథే. కానీ కొత్త విషయానికి ప్రారంభంగా పనికొస్తుంది. చావు దగ్గరపడిన ఓ ముసలాయన ఎంతో శ్రద్ధగా మొక్క నాటడాన్ని చూసిన బాటసారి నవ్వడం మనకు తెలుసు. అది ఎప్పటికి పెరిగేనూ, ఎప్పటికి కాసేనూ! ప్రతి పనినీ మన కోసమే చేయం. ముందు తరాలకు పనికొచ్చేట్టుగా చేస్తాం. అదే వాళ్ల పూర్వీకులుగా మనం ఇవ్వగలిగే కానుక! బాటసారిలో గౌరవం పెరిగేలా వృద్ధుడు ఇదే చెబుతాడు. సరిగ్గా ఇలాంటి భావనతోనే నార్వేలో ‘ఫ్యూచర్ లైబ్రరీ ప్రాజెక్ట్’ ప్రారంభమైంది. దీనికి శ్రీకారం చుట్టింది స్కాట్లాండ్కు చెందిన విజువల్ ఆర్టిస్ట్ కేటీ పేటర్సన్. ఈమె వయసు 41 ఏళ్లు. ఈ భవిష్యత్ గ్రంథాలయ ప్రాజెక్టు 2014లో ప్రారంభమైంది. వందేళ్ల పాటు అంటే 2114 వరకూ కొనసాగుతుంది. ఒక్కో ఏడాదికి ఒక్కో రచయిత తన సరికొత్త అముద్రిత రచనను ఈ గ్రంథాలయానికి బహూకరిస్తారు. మొదటి రచనగా 2014 సంవత్సరానికి మార్గరెట్ అట్వుడ్ (కెనడా) తన ‘స్క్రిబ్లర్ మూన్ ’ సమర్పించారు. 2015కు డేవిడ్ మిషెల్ (ఇంగ్లండ్) తన ‘ఫ్రమ్ మి ఫ్లోస్ వాట్ యు కాల్ టైమ్’ను ఇచ్చారు. 2016కు షివోన్ (ఐస్లాండ్), 2017కు ఏలిఫ్ షాఫక్ (టర్కీ) తమ రచనలు బహూకరించారు. 2018కి హాన్ కాంగ్ (దక్షిణ కొరియా), 2019కి కార్ల్ ఊవ్ నాస్గార్డ్ (నార్వే), 2020కి ఓసియన్ వువాంగ్ (వియత్నాం) ఇచ్చారు. ఈ రచనలన్నీ ఆంగ్లంలోనే ఉన్నాయని కాదు, అలా ఇవ్వాలని కూడా లేదు. సౌకర్యార్థం శీర్షికల వరకు ఆంగ్లంలో అనువదించి ఉంచారు. విశేషం ఏమంటే– ఇందులోకి చేరే ‘పుస్తకాలు’ ఏమిటో కేటీకి గానీ, ఈ లైబ్రరీని నిర్వహించడానికి నెలకొల్పిన ‘ద ఫ్యూచర్ లైబ్రరీ ట్రస్టు’కు గానీ తెలీదు. సాహిత్యానికి గానీ కవిత్వానికి గానీ అద్భుతమైన చేర్పు అయిన, భవిష్యత్ తరాల ఊహలను అందుకోగలిగే శక్తి సామర్థ్యాలున్న రచయితను ఆ సంవత్సరపు రచయితగా ఎంపిక చేసుకుంటారు. వారు అంగీకరించాక, అది రాయడానికి ఒక ఏడాదైనా పడితే, ఆ పూర్తయిన రాతపత్రిని నార్వేలో జరిపే ప్రత్యేక వేడుక ద్వారా స్వీకరిస్తారు. అందుకే 2021కి గానూ సిత్సి దాంగెరెంబ్గా(జింబాబ్వే) ‘నారిని అండ్ హర్ డాంకీ’ని 2022లో ఇచ్చారు. 2022 సంవత్సరానికి జుడిత్ షలన్ స్కీ (జర్మనీ) ఈ జూన్ లో అందజేస్తారు. ఆ రాతప్రతిని ప్రత్యేకమైన వస్త్రాల్లో చుట్టి, ఓస్లో ప్రజా గ్రంథాలయంలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన గదిలో ఉంచుతున్నారు. ఇవి వందేళ్ల తర్వాత ప్రచురితమవుతాయి. మరో విశేషం ఏమంటే, ఈ పుస్తకాలను అచ్చు వేయడానికే వెయ్యి చెట్లను ప్రత్యేకంగా అక్కడి నార్డ్మార్కా అటవీ ప్రాంతంలో పెంచుతున్నారు. ఈ వంద చేతిరాత ప్రతులను ఈ చెట్లతో తయారుచేసిన కాగితాలతో లిమిటెడ్–ఎడిషన్ గా ప్రచురిస్తారు. అందుకే దీన్ని ప్రపంచపు అత్యంత రహస్య గ్రంథాలయం అని గార్డియన్ పత్రిక అభివర్ణించింది. అయితే వందేళ్ల పాటు వీటిని చదవకుండా పాఠకులకు దూరంగా ఉంచుతున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి. వందేళ్ల నాటికి ఈ ప్రాజెక్టును ప్రారంభించిన వాళ్లుగానీ, దీనికి పుస్తకాలు సమర్పించిన చాలామంది రచయితలుగానీ ఉండరు. మార్గరెట్ అట్వుడ్ వయసు 83 ఏళ్లు. అంతెందుకు, ఈ ప్రాజెక్టు రచయితలుగా పరిగణనలోకి వచ్చిన టోమాస్ ట్రాన్స్ ట్రోమార్ (స్వీడన్ ), ఉంబెర్టో ఎకో (ఇటలీ) ఇప్పటికే మరణించారు కూడా. ‘‘అప్పటికి దీర్ఘకాలంగా నిశ్శబ్దంగా ఉన్న నా గొంతుక ఉన్నట్టుండి, ఒక వందేళ్ల తర్వాత మేల్కొంటుందన్న ఆలోచనే చిత్రంగా ఉంది. ఆ కంటెయినర్ లోంచి ఆ పుస్తకంలోని మొదటి పేజీ తెరిచే ఇప్పటికింకా శరీరంగా రూపుదిద్దుకోని ఆ చేతికి ఆ గొంతుక ఏం చెబుతుంది?’’ అని ఉద్విగ్నంగా మాట్లాడారు మార్గరెట్ అట్వుడ్. ‘‘భవిష్యత్తులో ఎప్పుడో చదువుతారని ఆశిస్తున్న ఒక రాతప్రతిని రాయడమనే ఆలోచనే ఒక ఉత్తరం రాసి నదిలో వేయడం లాంటిది. అది ఎటు పోతుందో మనకు తెలీదు, ఎవరు చదువుతారో తెలీదు– ఆ కాలప్రవాహాన్ని విశ్వసించడమే’’ అన్నారు ‘ద బాస్టర్డ్ ఆఫ్ ఇస్తాంబుల్’, ‘ద ఫార్టీ రూల్స్ ఆఫ్ లవ్’ లాంటి నవలలు రాసిన ఎలిఫ్ షఫాక్. ఆమె ఇచ్చిన ‘ద లాస్ట్ టాబూ’ కాల ప్రవాహంలో ఏ మలుపులు తీసుకుంటుందో! ‘‘నేనెట్లాగూ మరో వందేళ్లు ఉండను. నేను ప్రేమించేవాళ్లు కూడా ఉండరు. ఈ కనికరం లేని వాస్తవం నా జీవితంలోని అత్యంత ముఖ్యమైన విషయం గురించి ఆలోచించేట్టు చేసింది. నేనెందుకు రాస్తాను? నేను రాస్తున్నప్పుడు ఎవరితో సంభాషిస్తున్నాను? ఆ తర్వాత నేను ఒక ప్రపంచాన్ని ఊహించాను, అక్కడ నేను ప్రేమించేవాళ్లు ఎవరూ ఉండరు. కానీ ఆ ప్రపంచంలో నేను బతికి వుండగా కలిసిన నార్వేలోని చెట్లు ఇంకా ఉంటాయి. మనుషులకూ, చెట్లకూ మధ్య ఉన్న స్పష్టమైన ఈ అంతరం నన్ను తాకింది. ఈ ధ్యానం ఎంత తీవ్రమైనదంటే, మన నశించిపోయే జీవితాల అశాశ్వతత్వానికీ, విలువైన పెళుసుదనాల మన జీవితాలకూ నేరుగా కళ్లు తెరిపించింది’’ అంటారు దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్. ‘‘ఈ ఆలోచన అద్భుతం. ఇప్పటికింకా పుట్టని పాఠకులకు మన కాలం నుంచి వారి కాలానికి ఒక చిన్న పడవను పంపడమే ఇది’’ అన్నారు కార్ల్ ఓవ్ నాస్గార్డ్. ఇప్పుడు పెరుగుతున్న ఈ చెట్ల నుంచి కాయనున్న పుస్తకాలను ఆరగించడానికి ప్రపంచంలోని ఏ మూలల్లో మనుషులు జీవం పోసుకోనున్నారో! వందేళ్ల తర్వాత ఏం జరుగుతుందో చూడాలని ఇప్పుడే కుతూహలంగా లేదూ! -
రంగస్థలం ఏడు ప్రపంచాలు
అక్షరాల్లోని రచనలను రంగస్థలం మీదికి తీసుకురావడం తేలిక కాదు. ఎందుకంటే, రచన చదివేటప్పుడు పాఠకుల మదిలో ఎన్నో రంగస్థలాలు ఆవిష్కారం అవుతాయి. తమ ఊహలకు, రంగస్థలానికి చెలిమి ఏర్పడాలి. ఈ విషయంలో నాటక సమాజం ‘థియేటర్ నిషా’ విజయం సాధించింది. స్త్రీ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో రచనలు చేసింది ప్రసిద్ధ హిందీ రచయిత్రి గౌర్ పంత్ (శివానీ) ఇది ఆమె శతజయంతి సంవత్సరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని పంత్ కథలను నాటకంగా మలిచి ప్రదర్శిస్తోంది థియేటర్ నిషా... గుజరాత్లోని రాజ్కోట్లో జన్మించింది గౌర్ పంత్. పన్నెండు సంవత్సరాల వయసులో పంత్ తొలి కథ ఒక పిల్లల పత్రికలో ప్రచురిత మైంది. టాగూర్ ‘శాంతినికేతన్’లో చదువుకోవడం తనలోని సృజనను మెరుగుపెట్టుకోవడానికి కారణం అయింది. శివానీ కలం పేరుతో రాసిన ‘మై ముర్గా హూ’ కథకు ఎంతో పేరు వచ్చింది. ‘లాల్ హవేలి’ పేరుతో తొలి నవల రాసింది. ఆ తరువాత ఎన్నో కథలు, నవలలు రాసింది. అయితే ఆమె ఏది రాసినా స్త్రీ జీవితమే కేంద్రంగా ఉండేది. ఆ స్త్రీ తన కాల్పనిక ఊహాలోకం నుంచి దిగివచ్చిన స్త్రీ కాదు. తనకు పరిచయం ఉన్న స్త్రీలు, తాను చూసిన స్త్రీలు... ఇలా ఎందరో జీవితాల నుంచి ఎన్నో అద్భుతమైన పాత్రలు సృష్టించింది శివానీ. భర్త నుంచి హింసకు గురైన స్త్రీలు, అత్యాచార బాధితులు, కుటుంబ హింస బాధితులు, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నవారు... ఎంతోమంది బాధితులు ఆమె రచనల్లో కనిపిస్తారు. శివానీ కూతురు ఐరా పాండే తల్లి రాసిన కొన్ని కథలను ‘అపరాధి: ఉమెన్ వితౌట్ మెన్’ పేరుతో ఇంగ్లీష్లోకి తీసుకువచ్చింది. దీనికి రెండవ భాగం కూడా వచ్చింది. ‘అపరాధి’ రెండవ భాగంలోని కథలను థియేటర్ నిషా ‘బిన్ను’ పేరుతో నాటకీకరించింది. ఇందులో బిన్ను, నసీమ్, మిసెస్ ఘోష్, లలిత, పాగలియా, మధుబెన్తో పాటు ఒక తల్లి పాత్ర కూడా ఉంటుంది. ఏడుగురి జీవితాలు ఏడు ప్రపంచాలై కనిపిస్తాయి. బిన్ను నుంచి నసీమ్ వరకు ఎవరూ ఊహాల్లో పుట్టిన పాత్రలు కాదు. నిజజీవితంలోని మహిళలు. వారి జీవితాలను శివానీ దగ్గరి నుంచి చూసింది. ఒక్కో పాత్రకు ఒక్కో ప్రత్యేకత, శైలి, పోరాటరూపం ఉంటాయి. ‘ఏడు పాత్రలను కలిపి నాటకానికి బిన్ను అని ఎందుకు పేరు పెట్టారు?’ అని అడిగితే ప్లే డైరెక్టర్ బాలక్రిష్ణన్ ఇచ్చిన సమాధానం ఇది... ‘శివానీ రచనల్లో నాకు బాగా నచ్చిన పాత్ర బిన్ను. అందుకే ఆ పేరు పెట్టాను. బిన్ను ఎక్కడా, ఎవరికీ తలవంచదు. పురుషులను సవాలు చేస్తుంది. అడ్డంకుల ముళ్లచెట్లను నరికేస్తూ ముందుకు వెళుతుంది. ఆమె స్వరంలో ధిక్కారం, వ్యక్తిత్వంలో ఆత్మగౌరవం కనిపిస్తాయి’ కేరళ నాటకోత్సవాలలో భాగంగా థియేటర్ నిషా ప్రదర్శించిన ‘బిన్ను’ నాటకానికి అద్భుతమైన స్పందన లభించింది. ప్రేక్షకుల్లో శివానీ రచనలతో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవారితోపాటు ఎంతమాత్రం పరిచయం లేని వారు కూడా ఉన్నారు. అయితే అందరికీ నాటకం నచ్చింది. ‘శివానీ రచనల గురించి తెలియని ఈ తరానికి బిన్ను నాటకం చూస్తే రచయిత్రి దృక్పథం ఏమిటో అర్థమవుతుంది. శతజయంతి సంవత్సరంలో శివానీకి ఒక ఘనమైన నివాళిగా ఈ నాటకాన్ని చెప్పుకోవచ్చు’ అంటుంది సీమా అనే ప్రేక్షకురాలు. ‘బిన్ను’ నాటకంలో... -
70 డైలాగ్స్ రాసి ఇచ్చా.. సినిమాలు నీకేందుకయ్యా అన్నారు: పోసాని
టాలీవుడ్ విలక్షణ నటుల్లో పోసాని కృష్ణమురళిది ముందువరుసలో ఉంటారు. అభిమానుల గుండెల్లో అంతలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కమెడియన్గా, నటుడిగా, దర్శకనిర్మాతగా, రచయితగా సత్తా చాటిన ఆయన తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను ఈ సందర్భంగా వివరించారు. ఆయనకు రైటర్గా తొలి అవకాశమిచ్చింది పరుచూరి బ్రదర్స్ అని వెల్లడించారు. పోసాని మాట్లాడుతూ..' నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 37 ఏళ్లు. ఇప్పటివరకు నా కెరీర్లో ఏ ఒక్క మిస్టేక్ చేయలేదు. ఎవరి దగ్గరైనా చిన్న తప్పు కూడా లేదు. నేను నిర్మాతగా చేసినప్పుడు ఇండస్ట్రీలో పెట్టినంతా మంచి భోజనం ఎవరు పెట్టలే. భోజనానికి మహా అయితే రూ.5 లక్షలవుతుంది. కానీ నేను రూ.30 లక్షలు ఖర్చు పెట్టా. నా కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ఫస్ట్ సత్యానంద్ దగ్గరికి వెళ్లా. నాలుగేళ్ల తర్వాత రమ్మన్నారు. ఆ తర్వాత మద్రాస్లోనే పరుచూరి బ్రదర్స్ దగ్గరికి వెళ్లా. మా దగ్గర ఖాళీ లేవు పోమ్మన్నారు. ఆ తర్వాత నేను గేటు దగ్గర నిలబడి ఉండగా గోపాలకృష్ణ అంబాసిడర్ కారు వచ్చింది. ఏం వోయ్ రేపు మార్నింగ్ 5.30 కి రా అని అన్నారు. అయితే 5.30కి ముందే వెళ్లా.' అని అన్నారు. ఆ తర్వాత మాట్లాడుతూ..' వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ ఇద్దరు వచ్చారు. బాగా చదువుకున్నట్లున్నావ్ ఏదైనా జాబ్ చేసుకోవచ్చుగా అన్నారు వెంకటేశ్వరరావు. అప్పుడు బీఎన్ ప్రసాద్ నిర్మాత. వెంకటేశ్వరరావు నాకు కొన్ని డైలాగ్స్ రాయమని చెప్పారు. అది పేకాట పిచ్చోడు అనే పాత్రకు. ఆయన వచ్చేలోగా 70 డైలాగ్స్ రాశా. అవీ చూసి 50 డైలాగ్స్కి టిక్ పెట్టారు. అందులో దాదాపు 35 వరకు సినిమాలో వాడుకున్నారు. డైలాగ్స్ బాగా రాశావ్ అన్నారు వెంకటేశ్వరరావు. ఆ తర్వాత ఎంఫిల్ ఫస్ట్క్లాస్లో పాసయ్యా. పీహెచ్డీ కూడా చేశా. ఫస్ట్ నాకు సినిమాల మీద ప్రేమ లేదు. రైటర్గా ఫస్ట్ ఫిల్మ్ వచ్చేదాకా నాకు నమ్మకం లేదు.'అని అన్నారు. -
Shelma Sahayam: రెండు ప్రపంచాల మధ్య...
రెండు ప్రపంచాల మధ్య సంచరించే షెల్మకు... మొదటి ప్రపంచంలో కనిపించే సాంకేతిక అద్భుతాలు అంటే ఎంత ఇష్టమో రెండో ప్రపంచంలో కనిపించే కాల్పనిక కథలు అంతే ఇష్టం. సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ షెల్మ సహాయం రాసిన పుస్తకం ‘ది ల్యాండ్ ఆఫ్ అటరాక్సియా: జెనిసిస్’ గత నెల గోల్డెన్ బుక్ అవార్డ్(ఉరుగ్వే) గెలుచుకుంది. తాజాగా గ్లోబల్ పబ్లిషింగ్ హౌజ్, ఎక్స్సెల్లర్ ఎక్స్లెన్స్ ఇంటర్నేషనల్ అవార్డ్ (ఇండియా)కు ఎంపికైంది... చెన్నైలో... చిన్న వయసులోనే కలం పట్టింది షెల్మ. ప్రైమరీ స్కూల్లో గాంధీజీపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. షెల్మ ఈ పోటీలో పాల్గొంది. అయితే తనకు ఆ మహాత్ముడి గురించి పెద్దగా తెలియదు ‘రకరకాల ఆయుధాలు ఉపయోగించి, బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడారు’ అని రాసింది. ఇది గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ ఇబ్బందిగా ఉండడం మాట ఎలా ఉన్నా... ఆ వ్యాసరచనే తన తొలి రచన! అయితే ఆ తరువాత కాలంలో ఎన్నో పుస్తకాలు చదవడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవడంతోపాటు రచనలు చేయడంపై ఆసక్తి పెరిగింది. ‘నేను భవిష్యత్లో రచయిత్రిని కావాలనుకుంటున్నాను’ అని షెల్మ అన్నప్పుడు చాలాముంది ముఖం మీదే నవ్వారు. ‘ఇంజినీర్ కావాలనేది నా కల’ అన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే. ఇలాంటి సమయాల్లో బాబీ ఆంటీ తనకు ఎంతో శక్తి ఇచ్చేది. షెల్మ దృష్టిలో తాను పవర్ఫుల్ ఉమెన్. ‘వారు నీ గురించి ఏం అనుకుంటున్నారనేది ముఖ్యం కాదు. నీకు నీ మీద ఎంత నమ్మకం ఉందనేది ముఖ్యం’ అని చెప్పేది. ఆంటీ ఇచ్చిన ఆత్మవిశ్వాస బలంతో చిన్న చిన్న రచనలు చేసి ఇంట్లో వినిపించేది. తండ్రి మెర్సిలిన్బాబు, తల్లి మేరీ శాంతి, చెల్లెళ్లు స్నేహ, రీతూలు ప్రోత్సాహకంగా మాట్లాడేవారు. ‘నాకు డిప్రెషన్గా అనిపించినప్పుడు పేపర్, పెన్ను అందుకొని ఏదో ఒకటి రాస్తుంటాను. అప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది’ అంటున్న షెల్మ ‘ఎస్ఎస్ మెర్సె’ కలం పేరుతో ‘ది ల్యాండ్ ఆఫ్ ఆటరాక్సియా: జెనిసిస్’ అనే తొలి ఫాంటసీ థ్రిల్లింగ్ నవల రాసింది. దీనికి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. వీడియోగేమ్స్ ఇష్టపడే యువతరాన్ని కూడా ఈ నవల ఆకట్టుకుంది. తాను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు ఈ నవలకు బీజం పడింది. అయితే అక్షరాల్లో కాకుండా తన మనసులోనే రాసుకుంటూ వస్తోంది. ఎడిట్ చేసుకుంటూ వస్తుంది. తాను చిన్నప్పుడు విన్న ఎన్నో జానపదకథలు, చదివిన పుస్తకాలు ఈ పుస్తకం రాయడానికి స్ఫూర్తిని ఇచ్చాయి. తప్పిపోయిన తమ ఫ్రెండ్ సినన్ను వెదుక్కుంటూ కెప్టెన్ మెగెలాన్ అతని బృందం చేసిన ప్రయాణమే ఈ నవల. కెప్టెన్ బృందం చివరికి ఒక మాంత్రిక ప్రపంచంలోకి వెళుతుంది. అక్కడ వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది నవల సారాంశం. ‘ద ల్యాండ్ ఆఫ్ అటరాక్సియా’ ఇచ్చిన ఉత్సాహంతో షెల్మ సహాయం మరిన్ని రచనలు చేయాలనుకుంటోంది. -
కాపీ కొట్టారు.. ‘బలగం’ కథ నాదే
సాక్షి, హైదరాబాద్(పంజగుట్ట): దిల్ రాజు కుమార్తె నిర్మించిన బలగం సినిమా కథ తనదేనని, అయితే తన అనుమతి తీసుకోకుండానే తాను రాసిన కథతో సినిమా తీశారని, టైటిల్స్లో కనీసం తన పేరు కూడా వేయలేదని పాత్రికేయుడు గడ్డం సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తన తాత మరణాంతరం జరిగిన కార్యక్రమాల ఆధారంగా తాను 2011లో కథ రాసుకున్నానని, అది 2014 డిసెంబర్ 14న ఓ తెలుగు దినపత్రికలో‘పచ్చికి..’ పేరుతో ప్రచురితమైందన్నారు. కాగా ఇటీవల వచ్చిన బలగం చిత్రం తెలంగాణ యాసలో వచ్చిందని తెలిసి, రివ్యూ రాద్దామనే ఆలోచనతో ప్రీమియం షోకు వెళ్లగా సినిమా మొత్తం తన పచ్చికి కథే ఉండటం చూసి ఆశ్చర్యం వేసిందన్నారు. చదవండి: గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకున్న నటుడు, ఏడాదిగా.. -
ఆమె ప్రతి అక్షరం స్త్రీ పక్షం
తెలుగు సాహిత్యలోకం నుంచి రచయిత్రి కె.రామలక్ష్మి (92) వీడ్కోలు తీసుకున్నారు. రచయిత్రిగా, ఆరుద్ర సతీమణిగా, మద్రాసు (చెన్నై) నగరంలో తెలుగువారి ప్రతినిధిగా, నాటి సాహితీ సమూహాలలో కీలకమైన వ్యక్తిగా, సినిమా రంగంలో రచయిత్రిగా ఆమె సాగించిన యాత్ర సుదీర్ఘమైనది. ఆమె మరణంతో ఒక కాలపు తెలుగు సాహితీ చరిత్రకు మిగిలిన ఆఖరు సాక్షి లేకుండా పోయినట్టయ్యింది. ప్రముఖ రచయిత ఆరుద్ర సతీమణి కె.రామలక్ష్మి (92) కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శుక్రవారం హైదరాబాద్లోని ఆస్మాన్ఘడ్లో ఉన్న నివాసంలో తుదిశ్వాస విడిచారు. రామలక్ష్మి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా కోటనందూర్లో 1930 డిసెంబర్ 31న జన్మించారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో బీఏ పూర్తిచేశారు. ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్ర సాహిత్యం అభ్యసించారు. 1954లో ప్రముఖ కవి ఆరుద్రను వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు కుమార్తెలు. 1951 నుంచే రామలక్ష్మి రచనా ప్రస్థానం మొదలైంది. వివాహమైన తర్వాత ‘రామలక్ష్మి ఆరుద్ర’ కలం పేరుతో రచనలు చేశారు. మొత్తం 100 కు పైగా పుస్తకాలు రాశారు. ఆంధ్రపత్రికలో ఆమె సుదీర్ఘకాలం నిర్వహించిన ‘ప్రశ్న జవాబు’ శీర్షిక ప్రసిద్ధి చెందింది. విడదీసే రైలుబళ్లు, అవతలిగట్టు, మెరుపుతీగె, తొణికిన స్వర్గం, మానని గాయం, ఆణిముత్యం, పెళ్లి, ప్రేమించు ప్రేమకై, ఆడది, ఆశకు సంకెళ్లు, కరుణ కథ, లవంగి, ఆంధ్ర నాయకుడు, పాండురంగని ప్రతిజ్ఞ, నీదే నా హృదయం, అద్దం, ఒక జీవికి స్వేచ్ఛ వంటి కథా సంకలనాలను రామలక్ష్మి రచించారు. తెలుగు సాహిత్య రంగానికి చేసిన సేవలకుగాను ఆమెకు గృహలక్ష్మి, స్వర్ణకంకణం సహా పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. ఉత్తమ రచయిత్రిగా నంది అవార్డు... రామలక్ష్మి పలు సినిమాలకు కథలు అందించారు. 1975వ సంవత్సరంలో జీవనజ్యోతి సినిమా కథకు గాను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. కాసా సుబ్బారావు నిర్వహించిన స్వతంత్ర దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు. 1978లో ఉత్తమ జర్నలిస్టుగా రామానాయుడు అవార్డు అందుకున్నారు. పలు స్త్రీ సంక్షేమ సంఘాల్లో సేవలు అందించి మహిళల శ్రేయస్సు కోసం పాటుపడ్డారు. కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ రీజనల్ ప్యానెల్ సభ్యురాలిగా కూడా పనిచేశారు. రామలక్ష్మి ఆరుద్ర మృతిపట్ల పలువురు రచయితలు, సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. శుక్రవారం సాయంత్రమే ఎస్ఆర్నగర్ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను నిర్వహించారు. స్టెల్లా మేరీ స్టూడెంట్ స్వస్థలం కాకినాడ అయినా కె.రామలక్ష్మి చదువు చెన్నైలోనే సాగింది. స్టెల్లా మేరీ కాలేజీలో చదువుకుని ఇంగ్లిష్ భాషలో పట్టు సాధించారు. ‘ఐ యామ్ ఏ స్టెల్లామేరియన్’ అని గర్వంగా చెప్పుకునేవారు. కాలేజీలో ఒక కార్యక్రమానికి అతిథిగా హాజరైన ప్రఖ్యాత జర్నలిస్టు ఖాసా సుబ్బారావు ఇంగ్లిష్లో ఉపన్యాసం ఇచ్చిన కె.రామలక్ష్మిని చూసి పరీక్షలు అయిపోయాక తనని కలవమని చెప్పారు. ‘స్వతంత్ర’ పత్రికలో ఇంగ్లిష్ విభాగంలో పాత్రికేయురాలిగా ఉద్యోగం ఇచ్చారు. ‘తెలుగు స్వతంత్ర’కు ఎడిటర్గా ఉన్న ఖాసా సుబ్బారావు కోరిక మేరకు ‘నడుస్తున్న చరిత్ర’ కాలమ్ రాశారు రామలక్ష్మి. ఆమె ఇంటిలో ప్రతి సాయంత్రం సాహితీచర్చలు జరిగేవి. వాటికి ఆరుద్ర, శ్రీరంగం నారాయణబాబు, శ్రీశ్రీ తదితరులు హాజరయ్యేవారు. ఆరుద్ర, రామలక్ష్మి పరస్పరం ఇష్టపడి ఆ రోజుల్లో అంటే 1954ఏప్రిల్30న రిజిస్టర్డ్ మేరేజీ చేసుకున్నారు. ఈ పెళ్లికి దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి, శ్రీశ్రీ సాక్షి సంతకాలు చేశారు. శ్రీశ్రీ తన పెళ్లికి సాక్షి సంతకం చేయాలని ఆరుద్ర భావించడం వల్ల ఇది జరిగింది. శ్రీశ్రీ రామలక్ష్మిని ‘అత్తగారు’ అని సరదాగా పిలిచేవారు. అయితే శ్రీశ్రీ ధోరణిని రామలక్ష్మి చివరి వరకూ వ్యతిరేకిస్తూనే వచ్చారు. ఆరుద్రకు అండా దండా ఆరుద్ర సినిమా రంగంలో కృషి చేయడానికి, ‘సమగ్రాం«ధ్ర చరిత్ర’ పరిశోధన పూర్తి చేయడానికి రామలక్ష్మి అందించిన అండదండలే కారణం. వీరికి ఐదుగురు కుమార్తెలు విజయ, త్రివేణి, కవిత, లలిత, వాసంతి. వీరి పెంపకం, చదువు బాధ్యతలకోసం ఆరుద్ర సమయాన్ని తీసుకోకుండా ఆమే తన సమయమంతా వెచ్చించారు. ‘ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం కోసం విపరీతంగా సమయం ఇవ్వాలనుకునేవాడు. కాని ఇల్లు గడవాలి కదా. సినిమా రంగంలో పని చేస్తేనే డబ్బులు వస్తాయి. అందుకని నేనేమి అనకుండా గబగబా కొన్ని పాటలు రాసేసి ఆ డబ్బు అప్పజెప్పి మళ్లీ పరిశోధనలో పడేవాడు’ అన్నారు రామలక్ష్మి. ఆరుద్రకు అనారోగ్యం వస్తే నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో మాట్లాడి ప్రభుత్వ సహాయం అందేలా చూశారామె. ‘నేను మరణించినప్పుడు ఎటువంటి హంగామా చేయవద్దు’ అని ఆరుద్ర కోరడం వల్ల 1998లో ఆరుద్ర మరణించినప్పుడు కేవలం ముగ్గురు నలుగురు స్నేహితులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించి ఆ తర్వాతే మరణవార్తను లోకానికి తెలియచేశారు. ఇది సాహిత్య ప్రియులను బాధించినా రామలక్ష్మి ధోరణి అలాగే ఉండేది. సినిమా రచయిత్రి కె.రామలక్ష్మికి సినిమా రంగంలో అందరూ సుపరిచితులు స్నేహితులు. వారిలో భానుమతి రామకృష్ణ, జయలలిత, వాణిశ్రీ తదితరులు ఉన్నారు. కె.విశ్వనాథ్ తీసిన ‘జీవనజ్యోతి’ సినిమాకు రామలక్ష్మి కథను అందించారు. ఈ సినిమా నిజానికి వాణిశ్రీ కోసమే రాశారు. కె.రామలక్ష్మి రాశారని వాణిశ్రీ నటించారు. దీని నిర్మాణ సమయంలో విశ్వనాథ్కు, రామలక్ష్మికి వాదోపవాదాలు నడిచాయి. దాంతో కె.విశ్వనాథ్ విజయవాడలో జరిగిన శతదినోత్సవంలో ‘ఇకపై ఇతరులు రాసిన కథలతో నేను సినిమాలు తీయను’ అని ప్రకటించారు. రామలక్ష్మి రాసిన మరో సినిమా ‘గోరింటాకు’. అయితే దీని మీద ఆ రోజుల్లో వివాదం చెలరేగింది. దాసరి నారాయణరావు స్టోరీ డిపార్ట్మెంట్లో తెర వెనుక ఉండి పని చేసిన వారిలో రామలక్ష్మి కూడా ఒకరు. ఆమె 1970లలో సెన్సార్ బోర్డ్ మెంబర్గా పని చేశారు. స్త్రీ పక్షపాతి రామలక్ష్మి నిత్య జీవితంలోనే కాదు రచనా జీవితంలోనూ ఆధునికురాలు. ఛాందసాలు లేని జీవనం గడపాలని, భార్యాభర్తలు స్నేహమయ జీవనాన్ని అనుభవించాలని, స్త్రీలకు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని ఆ రోజుల్లోనే తన కథలలో చెప్పారామె. 1954లో ఆమె తన తొలి కథా సంపుటి ‘విడదీసే రైలుబళ్లు’ వెలువరించారు. ఈ సంపుటిలోని ‘చీలిన దారులు’ అనే కథలో ఒక జంట పెళ్లి చేసుకోకుండా సహజీవనం ప్రారంభిస్తారు. పెళ్లి ప్రేమను చంపేస్తుంది అని ఆ కథలో రాసి అప్పటికి తెలియని సహజీవనాన్ని ప్రతిపాదించారామె. ‘తొణికిన స్వప్నం’, ‘ఒక జీవికి స్వేచ్ఛ’, ‘అద్దం’ తదితరాలు ఆమె ఇతర కథా సంపుటాలు. భార్యాభర్తలు స్నేహితులుగా ఉండాలని సూచిస్తూ 1970లలో ఆమె రాసిన ‘పార్వతి కృష్ణమూర్తి కథలు’ పాఠకాదరణ పొందాయి. ఇందులో భార్య అరమరికలు లేకుండా భర్తతో తన అభిప్రాయాలను చెబుతుంది. స్నేహాన్ని, చొరవను ప్రదర్శిస్తుంది. భార్యంటే భర్త చెప్పినట్టుగా పడుండాలనే నాటి ధోరణికి ఈ పాత్ర పూర్తి భిన్నం. రామలక్ష్మి రాసిన కథల్లో ‘అదెక్కడ’ విశిష్టమైనది. ఆ కథలో ముఖ్యపాత్ర తన పేరు మర్చిపోతుంది. దాని కారణం భర్త, పిల్లలు అందరూ ‘అది’ అని పిలుస్తూ ఉండటమే. చివరకు ఆమె ఒకరోజు ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. భర్త ‘అదెక్కడ’ అని ఎందరిని అడిగినా కనిపించదు. పురుషుడు మోసం చేస్తే స్త్రీ సింగిల్ మదర్గా జీవించగలదనే సందేశం ఇస్తూ కథలు రాశారు. బేలగా ఉండే స్త్రీలను అలాంటి పాత్రలను రామలక్ష్మి హర్షించలేదు. స్త్రీలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా తమ జీవితాన్ని మలుచుకోవాలని కోరుతారు. ఆమె రచనలను ఈ తరానికి మళ్లీ చేరువ చేయాల్సి ఉంది. -
దిగ్గజ రచయిత ఆరుద్ర సతీమణి కె.రామలక్ష్మి కన్నుమూత
ప్రముఖ రచయిత ఆరుద్ర సతీమణి, రచయిత్రి కె.రామలక్ష్మి శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని మలక్పేటలో నివాసముంటున్న ఆమె వయోభారంతో కన్నుమూశారు. 1930 డిసెంబర్ 31న తూర్పు గోదావరి జిల్లాలోని కోటనందూరులో ఆమె జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో బీఏ పట్టా పుచ్చుకున్నారు. 1951 నుంచి రచనలు ప్రారంభించారు. ఆమె కలం నుంచి విడదీసే రైలుబళ్లు, మెరుపు తీగె, అవతలిగట్టు, ఆంధ్రనాయకుడు వంటి ఎన్నో రచనలు జాలువారాయి. 1954లో కవి ఆరుద్రతో రామలక్ష్మి వివాహం జరిగింది. ఆరుద్ర మోసగాళ్లకు మోసగాడు సినిమాకు కథ అందించగా ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. మీనా, దేవదాసు సినిమాలకు కూడా రచనాపరంగా ఆరుద్ర సహాయం చేశారు. కె.రామలక్ష్మి సెన్సార్ బోర్డ్ మెంబర్గానూ పని చేశారు. ఈ దంపతులు తెలుగు సాహితీరంగానికి ఎనలేని సేవ చేశారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. -
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ రచయిత కన్నుమూత
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే సింగర్ వాణీ జయరాం మృతి చెందగా.. తాజాగా మరో సినీ రచయిత, సెన్సార్ బోర్డ్ మెంబర్ యడవల్లి వెంకట లక్ష్మి నరసింహశాస్త్రి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. చిత్రసీమలో యడవల్లిగా పేరుగాంచారు. పలు తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలకు రచనలు చేశారాయన. నెల్లూరులో జన్మించిన యడవల్లి ఆయన స్వస్థలం నెల్లూరు కాగా.. విజయవాడలో స్థిరపడ్డారు. చిన్న వయసులోనే 'నక్షత్రాలు' పేరుతో వచన కవితా సంపుటిని వెలువరించారు. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన వచన కవితా సారథి కుందుర్తి ఆంజనేయులు, యడవల్లి కవితలను ప్రశంసించారు. ఈ పుస్తకాన్ని తన గురువు ఆరుద్రకి యడవల్లి అంకితం ఇచ్చారు. అలానే 'విరిగిన కొమ్మకు విరిసిన మల్లెలు' పేరుతో నవల రాశారు. విజయవాడలో రాధాకృష్ణమూర్తి అనే సినీ నిర్మాత ద్వారా చిత్రసీమలోకి యడవల్లి అడుగు పెట్టారు. మాదిరెడ్డి సులోచన రాసిన 'తరం మారింది' అనే నవలను అదే పేరుతో రాధాకృష్ణమూర్తి తీసిన సినిమాకు తగిన విధంగా భాషనూ, యాసనూ సమకూర్చడానికి యడవల్లి సాయం చేశారు. వెంకయ్య నాయుడు ప్రశంసలు తెలుగు సినిమాల్లో హాస్యం, తెలుగు సినీ దర్శక మాలిక - విజయ వీచిక, 'తెలుగు చిత్రాలలో ప్రగతి కిరణాలు' లాంటి పుస్తకాలను ఆయన రచించారు. పలు టీవీ సీరియల్కు కథలు - మాటలు సమకూర్చారు. వెంకయ్య నాయుడు భారత ఉప రాష్ట్రపతిగా సేవలు అందిస్తున్న సమయంలో తన రచనలను వారికి అందించి, అభినందనలు పొందారు. యడవల్లి ప్రస్తుతం కేంద్ర సెన్సార్ బోర్డ్ (సీబీఎఫ్సీ) సభ్యునిగా సేవలు అందిస్తున్నారు. ఆదివారం ఉదయం విజయవాడలో యడవల్లి అంత్యక్రియలు ముగిశాయి. -
హక్కుల రక్షణకు రచయిత కాపలాదారు కావాలి
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక హక్కుల రక్షణ, రాజ్యాంగ పరిరక్షణకు రచయితలు, కవులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు కాపలాదారుగా వ్యవహరించాలని ప్రముఖ కొంకణి రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత దామోదర్ మౌజో అన్నారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల కోసం సాహిత్య సృజన చేసే కవులు, రచయితలను హతమార్చడం పిరికిపందల చర్య అన్నారు. సత్యాన్ని ఎదుర్కోలేకనే కల్బుర్గి, దబోల్కర్, గౌరీలంకేష్ వంటి మేధావులను, రచయితలను హత్య చేశారని ఆరోపించారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ శుక్రవారం విద్యారణ్య స్కూల్లో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కవులు, రచయితలు ప్రజలను చైతన్యం చేశారన్నారు. తనకు రాజ్యాంగం పట్ల పూర్తి నమ్మకం ఉందన్నారు. జీవించే హక్కుతో సహా ప్రాథమిక హక్కులకు రక్షణ లేకపోవడం దారుణమన్నారు. మనుషులు ఏం తినాలో, ఏం తినకూడదో కూడా వాళ్లే నిర్ణయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీ జేఎన్యూ క్యాంటీన్లో మాంసాహారం వండకూడదని ఒక విద్యార్థి సంఘం హెచ్చరించడం దారుణమన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక ధోరణులను నిరసించాలన్నారు. అలాగే హక్కులను కాపాడుకోవాలని చెప్పారు. రచయితగా తాను సైతం తీవ్రమైన హెచ్చరికలు, ఒత్తిళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పారు. కొంకణి భాష కోసం సుదీర్ఘమైన ఉద్యమం... గోవా ప్రజలు తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పెద్ద ఉద్యమమే చేయాల్సి వచ్చిందన్నారు. మౌర్యుల కాలం నుంచి ఒక ఉనికిని కలిగి ఉన్న కొంకణి ప్రాంతం పోర్చుగీసు వారి రాకతో విచ్ఛిన్నమైందన్నారు. మతమార్పిడులు, సాహిత్య, సాంస్కృతిక మార్పిడులు తమ ఉనికిని ప్రమాదంలోకి నెట్టాయన్నారు. కొంకణిభాషకు లిపి లేకుండా పోయిందన్నారు. పోర్చుగీసు దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వలసి వెళ్లారని చెప్పారు. ఈ క్రమంలో కొంకణి మాతృభాషగా కలిగిన వారు ఆయా రాష్ట్రాల్లోని భాషల లిపినే కొంకణి లిపిగా మార్చుకున్నారన్నారు. గోవా స్వతంత్ర రాష్ట్రంగా అవతరించిన తర్వాత దేవనాగరి భాషను కొంకణి అధికార భాషగా గుర్తించేందుకు తాము సుదీర్ఘ ఉద్యమం చేపట్టినట్లు గుర్తు చేశారు. గోవాలోని మారుమూల పల్లెటూరుకు చెందిన తాను ప్రజల జీవితాలను, కష్టాలను, బాధలను దగ్గర నుంచి చూడడం వల్ల ప్రజల గాథలనే ఇతివృత్తంగా ఎంచుకుని రచనావ్యాసంగం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వేడుకలు వైవిధ్యం... హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ అధ్యక్షత వహించారు. జర్మనీ రాయబార కార్యాలయం ప్రతినిధి స్టీఫెన్ గ్రాబర్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్లు అమితాదేశాయ్, ప్రొఫెసర్ విజయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభిన్న భాషల సాహిత్యాన్ని ఒక వేదికకు తేవడం గొప్ప కార్యక్రమమని వక్తలు కొనియాడారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఒక వైవిధ్యభరితమైన వేడుక అని స్టీఫెన్ చెప్పారు. జర్మనీ భాషాసాహిత్యాలను, కళలను ఈ వేదికపైన ప్రదర్శించే చక్కటి అవకాశం లభించిందన్నారు. అలరించిన సాస్కృతిక ప్రదర్శనలు వేడుకల్లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పుస్తకప్రదర్శన, ఫుడ్ఫర్ థాట్, సేవ్ రాక్ ఫొటో ఎగ్జిబిషన్, స్టోరీ బాక్స్ వంటివి విశేషంగా ఆకట్టుకున్నాయి. -
గంజాయి స్మగ్లింగ్ చేశాను.. పోలీసులకు దొరక్కుండా బోర్డర్ దాటించా: కోన వెంకట్
ప్రముఖ రచయిత కోన వెంకట్కి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. నిన్నుకోరి, జై లవకుశ సహా ఎన్నో హిట్ సినిమాలకు ఆయన పనిచేశారు. ఓ వైపు రైటర్గా పనిచేస్తూనే, మరోవైపే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. కాలేజీ రోజుల్లో గంజాయి స్మగ్లింగ్ చేశానంటూ రివీల్ చేశారు. ''ఆర్థికసమస్యల వల్ల అప్పుల్లో కూరుకుపోయిన నా ఫ్రెండ్ ఒకడు దాన్నుంచి బయటపడేందుకు గంజాయి పండించాడు. ఆ మొత్తాన్ని గోవాకి తరలించి అప్పులన్నీ తీర్చేద్దామనుకున్నాడు. కానీ దారిలో పోలీసులకు దొరికిపోయాడు. ఇంక అంతా అయిపోందనుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. చావుబతుకుల్లో ఉన్నప్పుడు మాకు విషయం తెలిసి ఎలాగైనా వాడి అప్పులు తీర్చాలని డిసైడ్ అయ్యాం. మా నాన్న అప్పుడు డీఎస్పీ కావడంతో ఆయన కారులోనే గంజాయి అమ్మేందుకు గోవా వెళ్లాం. మహబూబ్నగర్, కర్ణాటక, గోవా ఇలా 3 చెక్ పోస్టులు పగడ్బందీగా దాటించి గంజాయి అమ్మి డబ్బులు తీసుకొచ్చాం. దాంతో నా స్నేహితుడి అప్పులన్నీ తీర్చేశాం. కానీ ఒకవేళ దొరికిపోతే మా పరిస్థితి ఏంటి అని చాలాసార్లు ఆలోచిస్తుంటాను. మా రియల్ లైఫ్లో జరిగిన ఈ స్టోరీనే సినిమాగా తీయాలని అనుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు.. స్నేహితుడికి సహాయం చేయడం మంచిదే కానీ ఇలా గంజాయి స్మగ్లింగ్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. -
ట్విటర్ కొత్త సీఈవోగా ఆమె! మస్క్కు థ్యాంక్స్, కానీ..
న్యూయార్క్: ట్విటర్ సీఈవోగా తప్పుకునేందుకు తాను సిద్ధమంటూ ప్రకటించి సంచలనానికి తెర తీశాడు ఎలన్ మస్క్. దీంతో ట్విటర్ బాస్గా బాధ్యతలు మూణ్ణాళ్ల ముచ్చటేనా? అనే ప్రశ్న, ఒకవేళ అదే నిజమైతే ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చా జోరందుకుంది. ఈలోపు తనను సీఈవోగా ఎంచుకున్నందుకు కృతజ్ఞతలంటూ ఒకావిడ చేసిన ట్వీట్.. ఈ ఎపిసోడ్లో ఊహించని ట్విస్ట్కు కారణమైంది. బెస్ కాల్బ్(35).. తనకు ట్విటర్ కొత్త సీఈవోగా అవకాశం ఇచ్చినందుకు ఎలన్ మస్క్కు కృతజ్ఞతలు చెబుతూ ఓ ట్వీట్ చేసింది. ఇప్పటివరకు తాము(ఎలన్ మస్క్) కలుసుకోనేలేదని, ఈ పరిణామం తనకు ఆశ్చర్యం కలిగిందని చెబుతూనే.. సీఈవో బాధ్యతలను తాను ఒక గౌరవంగా భావిస్తానని పోస్ట్ చేసింది. ఆపై వరుసగా ఐదు పోస్టులు చేశారామె. అంతేకాదు..ఆపై మొదటి రోజు బాధ్యతలు నిర్వర్తించానని, అద్భుతంగా ఉందని పోస్ట్ కూడా చేసింది. అయితే.. Can finally announce: I am humbled, honored, and frankly still in shock to be the new CEO of @twitter. Though we haven't always seen eye to eye (Edgelord memes! Verification fiasco! The "sink" joke being the full extent of his business plan!) I am thrilled @elonmusk took a chan— Bess Kalb (@bessbell) December 21, 2022 బెస్ కాల్బ్.. ఎవరో కాదు. పాపులర్ టీవీ షో ‘జిమ్మీ కుమ్మెల్’కు స్క్రిప్ట్ రైటర్. ఎమ్మీ అవార్డుకు సైతం నామినేట్ అయ్యారామె. హ్యూమర్తో కూడిన రైటింగ్కు ఆమె పెట్టింది పేరు. దీంతో ఆమె సరదాగా, వ్యంగ్యంగా అలా ట్వీట్లు చేసి ఉంటుందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు.. గతంలో ఆమె ఎలన్ మస్క్ను విమర్శించిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. Whether he has failed to rescue people from a cave and then called the actual rescuer a pedophile, sent CPAP machines to hospitals instead of direly needed ventilators, or spent $44 billion to ruin his reputation and legacy, @elonmusk has always been on the forefront of— Bess Kalb (@bessbell) December 21, 2022 ఇక కొత్త సీఈవో బాధ్యతలపైనా తొలుత సరదాగా స్పందించిన మస్క్.. ఆ తర్వాత సీరియస్గా సమాధానం ఇచ్చారు. తాము కేవలం సీఈవోగా గురించి వెతకడం లేదని.. బాధ్యతతో ట్విటర్ను నిలబెట్టే వ్యక్తి కోసం వెతుకుతున్నామని తెలిపారు. మరోవైపు ట్విటర్ కొత్త సీఈవో కోసం వేటలో ఆ సంస్థ ఉన్నట్లు అనధికార సమాచారం. I will resign as CEO as soon as I find someone foolish enough to take the job! After that, I will just run the software & servers teams. — Elon Musk (@elonmusk) December 21, 2022 -
Translator: తోడుదొంగ?
‘‘అనువాదకుడనేవాడు మూలరచయితకి తోడుదొంగ!’’ అన్నాడు హొర్హే గాంజాలిజ్ మోర్. అనువాదాలు చదువుకునేవాళ్ళలో చాలామందికి తెలిసిన విషయమే ఈ బహుముఖ ప్రజ్ఞావంతుడు చెప్తున్నాడు! అతను చెప్పని మాటొకటి వుంది– ఈ తోడుదొంగలు ఉమ్మడిగా దోచుకునేది పాఠకుల హృదయాలను!! అవును మరి, రచయితలన్నాకా అన్ని విషయాలూ విప్పిచెప్పేస్తారా? కాస్తా అర చాటుగానో, తెరచాటుగానో వాళ్ళు చెప్పే మాటల్లోని సారాంశాన్ని గ్రహించాల్సిన రసజ్ఞత వినే వాడిది. పోతే, రచయితలు – అనువాదకుల గురించి మోర్ చెప్పిన విషయం తెలుగుజాతికి బాగా తెలుసు. ఎందుకంటే, మన ‘‘ప్రామాణిక సాహిత్యం మొదలయిందే ఓ అనువాదంతో. వ్యాసుడనే కృష్ణ ద్వైపాయనుడు సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని ‘కవిత్రయం’ అనే నన్నయ, తిక్కన, ఎర్రన తెలిగించడంతోనే ప్రామాణిక సాహిత్య సృజన మొదలయిందని మన పెద్దలు చెప్పారుగా! కాకపోతే, భారతానువాదం పూర్తయ్యేసరికి పాఠకులకు దక్కేది మూలపాఠంలోని 21.5 శాతమేనని వాళ్లు చెప్పలేదు. తర్వాతి రోజుల్లో మరో పెద్దాయన ఆ లెక్కతీశాడు! అయినా, అనువాదమంటే ఆషామాషీ వ్యవహారమా? శ్రీనాథుడు ఆరేడువందల సంవత్సరాల కిందట అదేమాట అన్నాడు కదా! శబ్దాన్ని అనుసరించి–భావాన్ని ఉపలక్షించి – అభిప్రాయాన్ని గ్రహించి – రసాన్ని పోషించి–అలంకారాన్ని భూషించి – ఔచిత్యాన్ని ఆదరించి – అనౌచిత్యాన్ని పరి హరించి మరీ తాను అనువాదం సాగించానన్నాడా పండిత కవి. మనలో మనమాట – విద్వదౌషధం అనిపించుకున్న నైషధాన్ని తెనిగిస్తూ, ‘‘గమికర్మీకృత నైకనీవృతుడనై’’ అంటూ పదబంధాలకు పద బంధాలను ఎత్తుకొచ్చి మెత్తేసిన శ్రీనాథుడు చెప్పినట్లే చేసివుంటే, ‘‘మీ ‘డుమువులు’ మీరు తీసేసు కుని, మా నైషధం మాకు ఇచ్చెయ్యం’’డని సంస్కృత విద్వాంసులు ఎందుకంటారు? అయితే, కవిగా ఏం చేసినా, పండితుడిగా శ్రీనాథుడికి అనువాదం కేవలం భాషాంతరీకరణం మాత్రమే కాదని బాగా తెలుసు! ‘‘అనువాదం మాటలకే పరిమితమయిన వ్యవహారం కాదు సుమా! ఒకానొక సంస్కృతిని సంపూర్ణంగా బోధపరచడమే అనువాదమవుతుం’’దని మనకాలపు బహుముఖ ప్రజ్ఞావంతుడు యాంటనీ బర్జెస్ అదే మాట మనకర్థమయ్యేలా – ఆంగ్లంలో– అన్నాడు! ‘అనువాదమనే ప్రక్రియే లేకపోతే, మనం సరిహద్దులకే పరిమితమైపోతాం! అంచేత అను వాదకుడే నా కీలక సహచరుడు. అతగాడే, నన్ను విశాల విశ్వానికి పరిచయం చేస్తా’’డన్నాడు ఇటాలో కాల్వినో – పశ్చిమాంధ్ర భాషలో. (అనగా, ‘‘ఇటాలియన్లో’’ అని వివరించాలంటారా?) ప్రపంచానికి ఈ కొసన ఉన్న దక్షిణాంధ్ర ప్రాంతంలో, ఏడెనిమిది వందల సంవత్సరాల కిందట పుట్టిన ధూర్జటి రాసిన ‘‘శ్రీకాళహస్తీశ్వర శతకం’’ ఆంగ్లంలోకి అనువాదమయి, అనేక విదేశ భాషలకు పరిచయం కావడం చూస్తే కాల్వినో మాటలు ఎంత వాస్తవాలో బోధపడుతుంది! ఎక్కడో ఐరోపా ఖండం ఉత్తరాంచలంలో పొడుగ్గా వ్యాపించి వుండే దేశం నార్వే. అక్కడ పుట్టిన హెన్రిక్ ఇబ్సెన్, పందొమ్మిదో శతాబ్దిలోనే ప్రపంచమంతటా ఆధునిక నాటక కళను వ్యాపింపచేశాడంటే, అది అనువాదకుల సహాయంతోనే సాధ్యమయింది. అలాగే, పందొమ్మిదో శతాబ్దిలోనే ప్రపంచాన్నం తటినీ ప్రభావితం చేసిన మార్క్స్–ఎంగెల్స్ లాంటి అసాధారణ మేధావులనే ప్రభావితులను చేసినవాడు ఫ్రెంచ్ నవలారచయిత, నాటకకర్త ఆనరే ద బాల్జాక్. బాల్జాక్ రచనలు కూడా అను వాదకుల పుణ్య మానే అన్ని దేశాల్లోనూ భావవిప్లవాన్ని రగిలించగలిగాయి. ‘‘మాటలు ప్రపంచ మంతా పర్యటిస్తాయి; వాటికి అనువాదకులే చోదకు’’లంది ఆనా రుస్కోనీ. అది అక్షర సత్యం!! ఆమె స్వయంగా ఓ అనువాదకురాలు కావడం వల్లనే అంత చక్కగా చెప్పగలిగిందనిపిస్తుంది. ఇరవయ్యో శతాబ్దం ఉత్తరార్ధంలో చాలా దేశాల గురించిన సమాచారం దూరదేశాలకు సైతం వ్యాపించినందువల్ల ఉన్నదున్నట్లుగా అనువాదాలు చేసినా పాఠకుల ఆదరణకు పాత్రం కాగలుగు తున్నాయి. కానీ, అంతకుముందు – ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధానికి ముందు – చాలామంది అనువాదకులు అనువాదాలను అనుసృజనల రూపంలో చేయవలసివచ్చింది. కానీ, రచయితలు ఈ తరహా అనుసృజనలను మెచ్చలేదు. ‘‘మూలంలోని ఏ విషయమూ మార్చకుండానే, ఆ భాషలో చెప్పిందాన్ని అంతటినీ మరో భాషలోకి మార్చడమే అనువాద’’మని గ్యుంథర్ గ్రాస్ అన్నమాట రచయితలకు అనువాదకుల మీద ఉన్న ఫిర్యాదును ప్రతిధ్వనిస్తోంది. ఉదాహరణకు, ఆలివర్ గోల్డ్స్మిత్ నవల ‘‘ద వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్’’ను, కందుకూరి వీరేశలింగం కొంతవరకూ అనువాదమే చేశారు. కానీ, తన ప్రయత్నం సఫలం కాదనిపించి, ‘రాజశేఖర చరిత్రము’ పేరిట అనుసృజనగా వెలువరించారు. అది పాఠకుల సౌకర్యార్థం చేస్తున్న పనేనని ఆయన త్రికరణశుద్ధిగా నమ్మారు. ఆయన అనుసృజన ‘ద ఫార్చ్యూన్ వీల్’ పేరిట యథామూలంగా ఆంగ్లంలోకి అనువాదం కావడం ఓ విశేషం! సృజనాత్మక సాహిత్యం విషయంలో అనుసృజనలను –ఒక మేరకు– కవిత్వంలో ఏమైనా సహిస్తున్నారేమో కానీ, ఇతరత్రా ఈ ఆచారం అంతరించిందనే చెప్పాలి. చివరిగా ఒక్కమాట– ‘విద్వత్వంచ నృపత్వంచ న ఏవతుల్యే కదాచన– స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే!’ అని చిన్నప్పుడు మనమందరం చదువుకున్న ఓ సుభాషితం చెబుతోంది. ఈ ఏడాది శతజయంతి జరుపుకొంటున్న రాచమల్లు రామచంద్రారెడ్డి అలా అన్నిచోట్లా ఆరతు లందుకున్న విద్వాంసుడు. ఆయనకి మనమూ అర్పిద్దాం నీరాజనం! -
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ డైరెక్టర్, రైటర్ మదన్ కన్నుమూత
Director Madan.. టాలీవుడ్లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు మదన్ ఆకస్మిక మరణం పొందారు. అనారోగ్యం కారణంగా అపోలో ఆసుపత్రిలో చేరిన మదన్ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అయితే, మదన్ నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్కు గురైనట్టు సమాచారం. కాగా మదన్ స్వస్థలం మదనపల్లి. సినిమాల మీద ఆసక్తితో ఎస్.గోపాల్రెడ్డి దగ్గర అసిస్టెంట్ కెమెరామన్గా చేరారు. అలా మనసంతా నువ్వే సినిమాకు పని చేశారు. పెళ్లైన కొత్తలో మూవీతో దర్శకుడిగా మారారు. "ఆ నలుగురు" చిత్రంతో రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. -
సూపర్ స్టార్ కృష్ణ గురించి అప్పట్లో మహాకవి శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా?
సూపర్ స్టార్ కృష్ణ.. వెండితెరపై ఆయన పేరు చేరగని ముద్ర. సాహసాలకు, సంచనాలకు ఆయన కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆదిలోనే పాత్రలతో ప్రయోగాలు చేశారు. అప్పటి వరకు ఏ హీరో చేయని సాహసం చేసి జేమ్స్బాండ్ తరహాలో గుఢాచారి 116 సినిమాతో అద్భుతం చేశాడు. ఇక తొలి తెలుగు కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు సినిమాలో రికార్డులు క్రియేట్ చేశారు. హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచిన ఆయన కథ తెలుగు వెండితెరపై ఓ చరిత్రగా నిలిచింది. చదవండి: ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్ ఓ హీరోగానే కాదు వ్యక్తిగతంగా మంచి మనుసున్న చాటుకున్న నటుడు. కష్టకాలంలో నిర్మాతలను ఆదుకున్న గొప్ప హీరో. అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు. స్టార్ హీరోగా, మంచి మనసు చాటుకున్న వ్యక్తిగా సూపర్ స్టార్ సువర్ణాక్షరాలతో అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. అలాంటి ఆయన గురించి ప్రముఖ రచయిత, మహాకవి శ్రీశ్రీ గతంలో ఏమన్నారో తెలుసా. అప్పట్లోనే తనదైన రాతలతో కృష్ణ గొప్పతనాన్ని శ్రీశ్రీ చాటిచెప్పారు. ఓ సందర్భంలో కృష్ణ గురించి ప్రస్తావించిన ఓ పాత న్యూస్ పేపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు ‘‘నేను ఒక అక్షరం రాసినా దానికి విలువ కట్టి పారితోషికం ఇచ్చిన ఏకైక వ్యక్తి కృష్ణ’’ అని శ్రీశ్రీ అన్నారు. 1994లో ఓ ప్రముఖ పత్రికలో ఈ వ్యాఖ్యలు ప్రచురితం అయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు కృష్ణ గొప్పతనానికి, వ్యక్తిత్వానికి జోహార్లు చేస్తున్నారు. కాగా గుండెపోటు కారణంగా కృష్ణ మంగళవారం(నవంబర్ 15) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహన్ని అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఆయన అంతిమ యాత్ర మహప్రస్థానం వరకు సాగనుంది. -
30 రోజుల్లో రచయిత
సమాజంలో భౌతికంగా మనిషి ఎదగగలిగే ఎన్నో హోదాలున్నాయి. కానీ ‘రచయిత’ కావడం అనేది వేరే లెవెల్. రాయడం వల్ల వచ్చే ‘రిటర్నులు’ ఏమిటనేవి ఇదమిద్దంగా ఎవరూ చెప్పలేరు. అయినాకూడా కొందరు రాస్తూనేవుంటారు. రాయడం అనేది వారికి గాలి వీచినంత, పూవు పూచినంత, ప్రవాహం సాగినంత సహజం. రచయిత అనే ట్యాగ్ మనం ఊహించలేనంత పెద్దది. రచయిత అనగానే ఒక మేధావి, ఒక ఆలోచనాపరుడు, జీవితంలో అన్నీ చూసినవాడు అనే ఇమేజ్ కదలాడుతుంది. ఆటోమేటిగ్గా అది ఒక ప్రత్యేక గౌరవానికి కారణం అవుతుంది. అయితే రాసేవాళ్లకు కొన్ని సమస్యలు ఉన్నాయి. చదివేవాళ్లు తగ్గిపోయారు, పుస్తకాలు అమ్ముడు కావడం లేదు, అసలు ఎవరికైనా కాంప్లిమెంటరీ కాపీ ఇచ్చినా దాన్ని ఆసాంతం చదువుతారన్న ఆశ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత స్థితప్రజ్ఞుడైనా కొంత నిరాశ పడక తప్పదు. మరి ఇలాంటప్పుడు ఎవరైనా ఎందుకు రాయాలి? అసలు ఏ రచయితకైనా తన పుస్తకాన్ని పాఠకులు చదవాలి, పుస్తకం అమ్ముడు కావాలి అని అంత పట్టింపు ఎందుకు? అని ఎదురు ప్రశ్నిస్తారు దీపక్ విలాస్ పర్బత్. ‘వెల్ డన్! యు ఆర్ హైర్డ్’, ‘ఎ మాంక్ ఇన్ సూట్’ లాంటి రచనలు చేసిన దీపక్, అచ్చయ్యే పుస్తకాల్లో 60–70 శాతం చదవనివే ఉంటాయంటారు. అందుకే అమ్మడానికి బదులుగా ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వడం ద్వారా పుస్తకానికి వచ్చే ఆ వందో, రెండు వందలో ఖరీదు కంటే కూడా ఎక్కువ సంపాదించవచ్చని చెబుతారు. ‘‘ఒక మోటివేషనల్ స్పీకర్గా మనం ఒక కాలేజీకి వెళ్లి ప్రిన్సిపాల్కు ఏ విజిటింగ్ కార్డో, బ్రోషరో ఇస్తే– మనం అక్కడినుంచి వచ్చిన మరుక్షణం అది చెత్తబుట్టలో పడిపోవచ్చు. పైగా అలాంటివి ఎన్ని ఇచ్చినా మన గురించి వాళ్లకు ఒక సరైన అంచనా రాకపోవచ్చు. అదే ఒక పుస్తకం ఇస్తే? బ్రోషర్ కంటే తక్కువ ఖర్చుతో ప్రింటయ్యే పుస్తకం మన గురించిన అత్యుత్తమ పరిచయ పత్రం అవుతుంది. ఆయన చదవకపోవచ్చు, ఊరికే ర్యాకులో పెట్టేయొచ్చు; కానీ ఇచ్చివెళ్లినవాడు ఒక రచయిత అనే ఇమేజ్ పనిచేస్తుంది. ఆ సైకాలజీతోనే మనం ఆడుకోవాలి,’’ అంటారు. ఆ కారణంగానే పుస్తకాన్ని మీ ఎదుగుదలకు ఒక పెట్టుబడిగా వాడుకోండి అని సలహా ఇస్తారు కైలాశ్ సి.పింజానీ. ‘డేట్ యువర్ క్లైంట్స్’, ‘క్యాచ్ ద షార్క్’ లాంటి రచనలు చేసిన కైలాశ్... ఏ ఫీల్డ్ వాళ్లయినా ఎదగడానికి పుస్తకాన్ని ఒక ఆయుధంగా మలుచుకోవచ్చునంటారు. ‘‘ఉజ్జాయింపుగా సమాజంలో తొంభై తొమ్మిది శాతం మంది రచయితలు కాలేరు. కాబట్టి, ఆ రాయగలిగేవాళ్లు అమాంతం ఆ ఒక్క శాతం బ్రాకెట్లోకి వచ్చేస్తారు. ఆ గుర్తింపే మిమ్మల్ని ప్రత్యేకంగా ఉంచుతుంది. మీరు రాకెట్ అనుకుంటే, పుస్తకం మీకు రాకెట్ లాంచర్ అవుతుంది,’’ అని చెబుతూ అర్జెంటుగా ఒక పుస్తకం రాసేయమని సలహా ఇస్తారు. అంత అర్జెంటుగా ఎలా రాసేయడం? ముప్పై రోజుల్లో పుస్తకం ఎలా రాయాలో ఈ ఇరువురు సహచరులు ‘సూపర్ ఫాస్ట్ ఆథర్’ పేరుతో శిక్షణ ఇస్తుంటారు. ‘‘పుస్తకం నూటాయాభై పేజీలకు మించకూడదు. ఏ మనిషైనా రాయగలిగేవి మూడు ఏరియాలు: సొంతం జీవితంలోని డ్రామా, వృత్తిపరమైన అనుభవాలు, ప్రత్యేక ఇష్టాయిష్టాలు. పెద్దగా రీసెర్చ్ అవసరం లేని టాపిక్ ఎంచుకోండి. దాన్ని పది అధ్యాయాలుగా విభజించుకోండి. ప్రతి అధ్యాయానికీ పది ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోండి. ఒక ప్రశ్నను ఒక పేరాగా విస్తరించండి. దానికి జవాబును మూడు పేరాల్లో రాయండి. అంటే పది అధ్యాయాల్లో వంద ప్రశ్నలకు నాలుగు వందల పేరాలు అవుతాయి. రోజుకు ఐదు ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. ఇరవై రోజుల్లో వంద ప్రశ్నలు పూర్తవుతాయి. ఐదు రోజులు రీసెర్చ్కు వదిలేస్తే, ఇంకో ఐదురోజుల్లో మార్పులు చేర్పులు, కరెక్షన్స్ చేయండి. ముప్పయ్యో నాటికి ఫస్ట్ డ్రాఫ్ట్ రెడీ! ఎగ్జామ్ హాల్లో ఇచ్చే మూడు గంటల సమయంలో మనకు ఇష్టం లేని పాఠాల మీద ఎన్నో అడిషనల్ పేపర్లు రాసివుంటాం. అలాంటప్పుడు మనకు ఇష్టమైన టాపిక్ మీద రాయడం ఎంత సులభం?’’ అంటారు కైలాశ్. ఇలా మ్యాగీ నూడుల్స్లా వండే రచనలు ఎలా ఉంటాయో తెలీదు. బాగుండొచ్చు కూడా. అయితే కొందరు తెలుగు కవులు, రచయితలకు ఇవి కొత్త చిట్కాలు కాకపోవచ్చు. వాళ్లు ఇంతకంటే వేగంగా రాయగలరు; ఇంతకంటే బాగా ప్రమోట్ చేసుకోగలరు. తేడా అల్లా దీపక్, కైలాశ్ లాంటివాళ్లకు తమ విషయంలో ఒక పారదర్శకత ఉంది; మనవాళ్ల విషయంలో అదీ కనబడదు. కేవలం నెమ్మదిగా రాయడం వల్లే ఒక రచన గొప్పదైపోదు. తన రాత మీద రచయిత ఎంత ప్రాణం పెడతాడన్నది ముఖ్యం. ‘యుద్ధము–శాంతి’ మహానవలను టాల్స్టాయ్ తొమ్మిదిసార్లు తిరగరాశాడట. ‘కరమజోవ్ బ్రదర్స్’ చదువుతున్నప్పుడు దోస్తోవ్స్కీ ఒక ఆధ్యాత్మిక జ్వర పీడితుడిలా కనబడతాడు. వాక్యంలో పెట్టాల్సిన ఒక్క కామా గురించి కూడా ఆస్కార్ వైల్డ్ తల బద్దలుకొట్టుకునేవాడట. యావజ్జీవితం సాహిత్యమే ఊపిరిగా బతికాడు చలం. జీవితకాలం రాసిన మొత్తం కూడా గట్టిగా ఒక పుస్తకానికి మించనివాళ్లు ఉన్నారు. వాళ్లు నిజంగా రచయితలు. కానీ ఇప్పుడు పుంఖానుపుంఖంగా వస్తున్న పుస్తకాలు కొన్ని చెట్ల ప్రాణాలు తీయడానికి తప్ప పనికిరావు. కాబట్టి రాసేవాళ్లందరూ రచయితలు కారు. వచ్చిన ప్రతిదీ పుస్తకం కాదు. దాన్ని వేరు చేసుకోగలగడమే పాఠకుల విజ్ఞత. -
రష్దీ జీవించి ఉండడం ఆశ్చర్యమే
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్లో భారత రచయిత సల్మాన్ రష్దీని కత్తితో పొడిచాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు హదీ మతార్ తన దాడి వెనుక ఎవరి ప్రమేయం లేదని చెప్పాడు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని తెలిపాడు. రష్దీ చిత్తశుద్ధి లేని వ్యక్తి అని అందుకే అతనంటే తనకి నచ్చడని చెప్పాడు. తనంతట తానుగానే రష్దీని పొడిచానని వెల్లడించాడు. జైలు నుంచే న్యూయార్క్ పోస్ట్ వార్తాసంస్థకు వీడియో ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చాడు. రష్దీ ఇంకా ప్రాణాలతో ఉన్నారన్న విషయం తెలియగానే తాను చాలా ఆశ్చర్యపోయానని చెప్పాడు. రష్డీకి మెడపై 3 కత్తి పోట్లు, కడుపులో నాలుగుసార్లు, కుడి కన్ను, ఛాతీ, కుడి తొడపై కత్తి పోట్లు ఉన్నాయని ఆయనకి చికిత్స చేస్తున్న వైద్యులు వెల్లడించారు. రష్దీ రాసిన నవల ‘ది సటానిక్ వెర్సస్’లో తాను కొన్ని పేజీలే చదివానని, అంతా చదవలేదన్నారు. రష్దీపై ఫత్వా జారీ చేసిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమైనీ ఆదేశంతో ఈ దారుణానికి పాల్పడ్డావా? అన్న ప్రశ్నకు మతార్ సమాధానం ఇవ్వలేదు. అయతొల్లా అంటే తనకు గౌరవం ఉందని చెప్పాడు. -
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న షారుక్ ఖాన్ కుమారుడు
సాధారణంగా స్టార్ హీరోల వారసుడు అంటే హీరోగానే ఎంట్రీ ఇస్తుంటారు. కానీ దీనికి భిన్నంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారు ఆర్యన్ ఖాన్ మాత్రం రచయితగా అరంగేట్రం చేయబోతండటం విశేషం. తనకు హీరోగా నటించాలని లేదని, తెరవెనుక తన టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నాక అప్పుడు నటన గురించి ఆలోచిస్తానని ఆర్యన్ ఇదివరకే చాలాసార్లు చెప్పాడు. తాజాగా ఆయన ఓ కామెడీ వెబ్సిరీస్ కోసం కథ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఈ కథ ఉంటుందట. కాగా గతంలో డ్రగ్స్ కేసులో భాగంగా ఆర్యన్ జైలు జీవితాన్ని గడిపిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆర్యన్ సోదరి సుహానా ఖాన్ సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది. ‘ది అర్చీస్’ అనే వెబ్సిరీస్లో ఆమె నటిస్తుంది. -
అసమానతలపై ఎక్కుపెట్టిన బాణం!
‘‘ఆమె పతివ్రత, పవిత్రమైనది. ఆమె చెడిపోయింది... ఇలా చెప్పే శాస్త్రాలు పవిత్రులైన, అపవిత్రులైన పురుషుల గురించి ఎందుకు మాట్లాడవు? పురుషుల మనసులు బంగారంతో తయారయ్యాయా? పాపం వారిని తాకదా? శాస్త్రాలు స్త్రీల పాపాల్నే చిత్రించాయా?’’ అని మహాభారతంలో ద్రౌపది ప్రశ్నించినట్లు రచించిన ప్రతిభా రాయ్ తన ప్రశ్న ద్వారా ఆధునిక సమాజంలో కూడా స్త్రీ, పురుషులు అవలంబించాల్సిన విలువలపై కొనసాగుతున్న ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించారు. ఒడియాలో ఆధునిక సాహిత్యానికి రూపురేఖలు దిద్దిన ప్రతిభా రాయ్ రచనల్లో ‘యాజ్ఞసేని’ పురుషాధిక్య సమాజం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన గొప్ప నవల. ఈ నవలలో ద్రౌపది శ్రీకృష్ణుడికి రాసిన లేఖల్లో తన బాధలు, వేదనలు, పడిన హింస, త్యాగాలు, విశ్వాసాలు, ఆకాంక్షలు, నిస్పృహలను పంచుకుంటుంది. 1944 జనవరి 15న జగత్ సింగ్ పూర్ జిల్లాలోని అలబేలా కుగ్రామంలో జన్మించిన ప్రతిభా రాయ్ ఉన్నత విద్యాధికురాలు. ఒడిషాలోని బోండో జాతిపై పోస్ట్ డాక్టొరల్ పరిశోధన చేశారు. ఒక స్కూలు టీచర్గా జీవితాన్ని ప్రారంభించి ఒడిషాలోని వివిధ ప్రభుత్వ కళా శాలల్లో 30 ఏళ్ల పాటు బోధన చేశారు. తన రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ, మూర్తి దేవి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందారు. సాహిత్యంలో అత్యుత్తమమైన జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్న ఘనత అమెది. ఆధునికానంతర ఒడియా సాహిత్యంలో కథా కథన శిల్పంలో చేయితిరిగిన రచయిత్రి ఆమె. సమానత్వం, ప్రేమ, శాంతి, సమైక్యత అడుగడుగునా ఆమె రచనల్లో గోచరిస్తాయి. కుల, మత, లింగ వివక్షలు ఎక్కడా కన పడవు. సామాజిక న్యాయం కోసం పోరాడుతూ సమ కాలీన సామాజిక సమస్యలపై ఆమె చేసిన రచనలు అనేక సామాజిక సంస్కరణలకు దారితీశాయి. బర్సా బసంత బైశాఖ, పరిచయ, పుణ్యతోయ, అసబరి, నీలా తృష్ణ, శిలాపద్మ, ఉత్తర మార్గ, ఆదిభూమి, మహా మోహ, మగ్నమతి, మహారాణి పుత్ర వంటి నవలలతో ఆమె జన హృదయాల చేరువలోకి వెళ్లారు. అంతేగాక ఆమె దాదాపు 260 కథల్ని రచించారు. అవి 20 సంకలనాలుగా వెలువడ్డాయి. మధ్యతరగతి జీవితాలు, దాని సమస్యలు, వ్యక్తుల మనస్తత్వాలు, సామాజిక, రాజకీయ వ్యవస్థల స్థితిగతులు ఆమె కథల్లో ప్రతిబింబిస్తాయి. ప్రజల నమ్మకాలు, ఆచారాలు, వారి యాసలు, భాషలు, ప్రేమలు, పరిణయాలు, గ్రామీణ జీవన సౌందర్యం ఆమె రచనల్లో మనకు గోచరిస్తాయి. వీటన్నిటి మధ్యా ప్రతిభా రాయ్ తాత్విక దృక్పథం, బలమైన స్త్రీవాద చిత్తశుద్ధి, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సానుభూతితో అర్థం చేసుకోవడం కనిపిస్తుంది. ‘బర్సా బసంత బైశాఖ’ ఆమె తొలి నవల. శృంగా రాన్ని, ప్రేమను మార్కెట్లో వాణిజ్య వస్తువులుగా చూసే సమాజం పట్ల నిరసన వ్యక్తం చేసిన కళాత్మక రచన ఇది. రెండో నవల ‘పరిచయ’లో గ్రామీణ, పట్టణ జీవన శైలుల మధ్య సంఘర్షణను చిత్రించారు. యాజ్ఞసేని, శిలా పద్మ, ఉత్తర మార్గ, ఆదిభూమి నవలల్లో మానవ జాతి పరిణామం; స్త్రీలు, వారి సామాజిక అంశాలను స్పృశిం చారు. పురుష పాత్రల కంటే మహిళా పాత్రలు ఈ నవల్లో ఆధిపత్య పాత్రలుగా వ్యవహరిస్తాయి. ‘ఉత్తర మార్గ’ ఒక జాతీయవాద చారిత్రక నవల. ఆదిభూమి, మహామోహ, మగ్నమతి, మహారాణి పుత్ర అన్న నాలుగు నవలలను ఒడియా సాహిత్యంలో మహా నవలలుగా పరిగణిస్తారు. వచనంలో కావ్యాలు రాయడంలో ఆమెను మించిన వారు లేరని రాయ్ ఈ నవలల ద్వారా నిరూపించుకున్నారు. చారిత్రక వాస్తవాలను ఈ నవలలు మనముందుంచుతాయి. ‘ఆది భూమి’ కొద్దిగా భిన్నమైన నవల. ఆదిమ జాతి గిరిజనులైన బోండా జీవన శైలిని, కర్మకాండను ఈ నవలలో చిత్రించారు. ‘మహామోహ’ భారతీయ సాహిత్యంలోనే ఒక చెప్పు కోదగ్గ తాత్విక, కళాత్మక నవల. ఆధునికానంతర స్త్రీవాద ధోరణికి ఈ నవల అద్దంపడుతుంది. ఒక స్త్రీమూర్తి పూర్తి రూపాన్ని ఈ నవల బహిర్గతం చేస్తుంది. ‘మహారాణి పుత్ర’ ఒక ఆసక్తికరమైన చారిత్రక నవల. చరిత్రలోని ఘటనలను ఆమె నాటకీయంగా, మానవ సంఘర్షణలో భాగంగా చిత్రించారు. కియోంజార్ వలసవాద చరిత్రలో ప్రజా విప్లవం ఈ నవలలో మనకు ఆవిష్కృతమవుతుంది. 1979లో ఒడిషాలో బీభత్సం సృష్టించిన తుఫానుపై ఆమె ‘మగ్నమతి’ రాశారు. ఒక ప్రకృతి వైపరీత్యం బీభత్సం మాత్రమే కాదు, భూమాత ఆవేదన, సర్వ మానవ సౌభ్రాతృత్వం ఈ నవల ద్వారా చిత్రించారు. స్వతంత్ర భారతంలో జరిగిన పరిణామాలు, ప్రపంచీ కరణ ఫలితాలు కళాత్మకంగా ప్రదర్శించారు. సామాజిక, రాజకీయ అంశాలపై రచించిన ‘ఉత్తర మార్గ’ కూడా ఒక జాతీయవాద నవలే. సి. నారాయణ రెడ్డి ఆధునిక తెలుగు కవిత్వాన్ని కొన్ని దశాబ్దాల పాటు నిర్దేశించారు. సినారె, ప్రతిభా రాయ్ ఇద్దరూ అధ్యాపక రంగం నుంచి వచ్చిన వారే. ఇద్దరి సాహిత్య ప్రక్రియలు వేరైనా, తమ రచనల ద్వారా సమాజంలో చైతన్యాన్ని తెచ్చేందుకు ప్రయత్నించిన వారే. సినారెకు పద్మశ్రీ పురస్కారం 1972లోనూ, పద్మభూషణ్ 1992లోను లభించగా, ప్రతిభా రాయ్కి పద్మశ్రీ 2007 లోనూ, పద్మభూషణ్ 2022లోనూ లభించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, అటువంటి రచయిత్రికి మహా రచయితా, కవీ, విద్యాధికుడూ, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతా అయిన డాక్టర్ సి. నారాయణరెడ్డి (సినారె) జన్మదినం నాడు... ఆయన పేర నెలకొల్పిన జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయడం తెలుగు జాతికి గర్వకారణం. - ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు (జూలై 29న ఒడియా రచయిత్రి ప్రతిభా రాయ్కు సినారె జాతీయ పురస్కార ప్రదానం) -
‘జబర్దస్త్’ స్క్రిప్ట్ రైటర్గా గుర్తింపు.. విశాఖ జిల్లా కుర్రాడు.. ఊరమాస్
కొమ్మాది (భీమిలి)విశాఖపట్నం: ఒకప్పుడు హాస్యనటుడు షకలక శంకర్కు స్క్రిప్ట్ రైటర్గా పనిచేసిన అనుభవంతో సినిమాలవైపు అడుగులు వేస్తున్నాడు విశాఖ జిల్లా శ్రీహరిపురానికి చెందిన పోతిన రమేష్ జబర్దస్త్లో స్క్రిప్ట్ రైటర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ అనుభవంతో మొట్టమొదటిసారిగా హర్రర్ లవ్ స్టోరీ అటవీ సినిమాతో తన సినీ ప్రస్థానం ప్రారంభించి ప్రస్తుతం పలువురు ప్రముఖ కథానాయకులతో ఊరమాస్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చదవండి: నడిరోడ్డుపై హీరోయిన్ను జుట్టుపట్టుకుని కొట్టిన హీరో భార్య అంతే కాకుండా కథ, స్క్రీన్ప్లే తానే వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో సినీ పరిశ్రమవైపు అడుగులు వేస్తున్నానని, ఊరమాస్ సినిమా 90 శాతం విశాఖలో చిత్రీకరించానని చెప్పారు. విశాఖలో షూటింగ్కు అనుకూలమైన లొకేషన్లతో పాటు, అనేక మంది మంచి నటులు ఉన్నారని, సినీ పరిశ్రమ విశాఖ తరలి వస్తే ఎందరో నటులకు, టెక్నీషియన్స్కు మరింత ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రియల్ఎస్టేట్ మాఫియా, ప్రేమ అనే అంశాలతో తెరకెక్కిస్తున్న ఊరమాస్ సినిమా 5 భాషల్లో నిర్మిస్తున్నామని, ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి అయినట్లు ఆయన తెలిపారు. -
అక్షరమే ఆమె ఆరోగ్య బలం.. 82 ఏళ్ల వయస్సులో పుస్తకాలు రాయడం మొదలుపెట్టి
ఎనభై ఏళ్లు దాటిన తరువాత పుస్తకాలు చదవడానికే ఇబ్బంది పడతాం. కేరళకు చెందిన మారీస్ మాత్రం 82 ఏళ్ల వయసులో తొలి పుస్తకం రాసింది. ఇప్పుడు ఆమె వయసు 88. రాసిన పుస్తకాల సంఖ్య 12. అప్పుడెప్పుడో చిన్నప్పుడు కలం పట్టింది మారీస్. సందర్భం ఏమిటంటే, స్కూల్లో కవితల పోటీ నిర్వహించారు. అందులో తనకు బహుమతి వచ్చింది. ఇక ఆ ఉత్సాహంలో ఎన్నో కవితలు రాసింది. అయితే చదువుల ఒత్తిడి, ఆ తరువాత ఉద్యోగం కోసం సన్నాహం, తీరిక లేని ఉద్యోగ బాధ్యతలు, పెళ్లి, కుటుంబ బాధ్యతలు... తనను రచనలకు దూరం చేశాయి. కక్కనాడ్(కేరళ)లో ట్రెజరీ ఆఫీస్ సూపరిండెంట్గా పనిచేసింది మారీస్. వృత్తిరీత్యా ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే మారీస్ను రిటైరయ్యాక ఒక్కసారిగా శూన్యం ఆవరించింది. చురుకుదనం దూరం అయింది. ఆ సమయంలోనే తనను ఇంట్లో షెల్ఫ్లలోని పుస్తకాలు పలకరించాయి. అందులో చాలా పుస్తకాలు ‘టైమ్ దొరికితే చదవాలి’ అనుకున్నావే. ఆ టైమ్ తనకు ఇప్పుడు వచ్చింది. అలా అక్షరప్రయాణం మొదలైంది. షెల్ఫ్లోని పుస్తకాలన్ని ఖాళీ అయ్యాయి. కొత్త పుస్తకాలు వచ్చి చేరుతున్నాయి. ఫిక్షన్ నుంచి వ్వక్తిత్వ వికాసం వరకు ఎన్నో పుస్తకాలు చదివింది. ఆ పుస్తకాలు ఇచ్చిన స్ఫూర్తితో 82 ఏళ్ల వయసులో కలం పట్టింది మారీస్. ‘కడలింటే మక్కాల్’ పేరుతో తొలి పుస్తకం రాసింది. అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘ఈ వయసులోనూ ఎంత బాగా రాసిందో. మొదటి పుస్తకం అంటే ఎవరూ నమ్మరు’ అనేవాళ్లతో పాటు– ‘ఇక్కడితో మీ రచన ఆగిపోకూడదు. ఇంకా ఎన్నో పుస్తకాలు రావాలి’ అని ప్రోత్సహించిన వాళ్లు ఉన్నారు. వారి సలహాతో ఆమె తన కలానికి ఇక విశ్రాంతి ఇవ్వలేదు. ఇప్పుడు మారీస్ వయసు 88 సంవత్సరాలు. ఇప్పటి వరకు 12 పుస్తకాలు రాసింది. వాటిలో ఇంగ్లీష్లో రాసినవి కూడా ఉన్నాయి. కలం బలం ఉండాలేగానీ వస్తువుకు కొరతా? తన విస్తృతజీవిత అనుభవాలలో నుంచి రచనకు అవసరమైన ముడిసరుకును ఎంచుకుంది. వ్యక్తిగత జీవితం నుంచి ట్రెజరీ ఆఫీస్ వరకు ఎన్నెన్నో అనుభవాలు తన రచనల్లోకి వచ్చి పాఠకులను మెప్పించాయి. విశేషం ఏమిటంటే మారీస్ స్ఫూర్తితో మనవలు, మనవరాళ్లు కూడా కలం పట్టుకున్నారు. చిన్న చిన్న రచనలు చేస్తున్నారు. ఇంటినిండా ఓ సృజనాత్మక వాతావరణం ఏర్పడింది. ‘రచన అంటే అక్షరాలు కూర్చడం కాదు. అది ఒకలాంటి ధ్యానం’ అనే సత్యాన్ని నమ్మిన మారీస్ ఇప్పుడు పదమూడో పుస్తకం రాయడానికి సిద్ధం అయింది. ఆమె పుస్తకాలకు ఎందరో విద్యావేత్తలు, సృజనకారులు ముందుమాటలు రాశారు. వారిలో ప్రొఫెసర్ ఎంకే సను ఒకరు. ‘సృజనకు వయసు అడ్డుకాదని మరోసారి నిరూపించారు మారీస్. వేగంగా చదివించే శైలి ఆమె ప్రత్యేకం’ అంటున్నారు సను. చదవండి: Tanisa Dhingra: ఆమె మరణించీ... జీవిస్తోంది! కూతురి కోసం ఆ తల్లి.. -
ఘనంగా ‘స్త్రీ హృదయం’ పుస్తకావిష్కరణ
ప్రముఖ కవి, రచయిత, నటులు, సంగీతకారులు పెయ్యేటి రంగారావు కథల సంపుటి ‘స్త్రీ హృదయం’ను సామవేదం షణ్ముఖ శర్మ ఆవిష్కరించారు. ఆన్లైన్లో జూమ్ వేదికగా జూలై 16న ఆస్ట్రేలియా, అమెరికా, భారతదేశం నుంచి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్ష్మీ నరేంద్ర ప్రార్థనా గీతంతో శుభారంభం చేయగా, విజయ గొల్లపూడి ఆస్ట్రేలియా, అమెరికా, హాంకాంగ్, న్యూజిలాండ్, భారతదేశం నుండి ప్రముఖులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి సిడ్నీ నుంచి పోతుకూచి మూర్తి అధ్యక్షత వహించారు. ప్రారంభ ఉపన్యాసంలో వంశీ రామరాజు మాట్లాడుతూ..‘స్త్రీ హృదయ’ పెట్టడంలో ఇందులోని కథలకున్న ప్రాముఖ్యత తెలుస్తోందన్నారు. ‘పిల్లికి చెలగాటం కథ చదివానని, కథలో భావవ్యక్తీకరణ బాగుందన్నారు. ఇక్కడ స్థానికంగా తెలుగువారిని ప్రోత్సాహిస్తూ ఉంటానని, భావితరాలకి మన భాష, సంస్కృతి అందటం ముఖ్యమ’ని బ్లాక్ టౌన్ కౌన్సిలర్ లివింగ్ స్టన్ చెట్టిపల్లి అన్నారు. ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి మాట్లాడుతూ.. రచయిత స్త్రీ హృదయాన్ని లేత అరిటాకులో పెట్టి అందించారు. అంత సున్నితమైనది స్త్రీ హృదయం అన్నారు. రచయిత పెయ్యేటి రంగారావును ‘నవరస కథా సార్వభౌముడు’గా సినీగీత రచయిత భువనచంద్ర కొనియాడారు. సిడ్నీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు శోభ వెన్నెలకంటి కథా రచయితకు శుభాకాంక్షలు తెలియచేసారు. సామవేదం షణ్ముఖశర్మ ఆశీస్సులతో నూతన పతాక వేదిక ‘సకల కళాదర్శిని, సిడ్నీ ఆస్ట్రేలియా’ లోగోను ఈ సందర్భంగా విడుదల చేసారు. ఈ వేదిక నెలకొల్పటంలో ముఖ్యోద్దేశ్యం సకల కళలకు ఈ వేదిక నిలయంగా కళాకారులని ప్రోత్సహించడమని విజయ గొల్లపూడి అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందేశాన్ని శ్రీదేవి సోమంచి చదివి వినిపించారు. తెలుగు తియ్యదనంతో పాటు జీవిత సత్యాలను ‘స్త్రీ హృదయం’ పుస్తకంలో ఆవిష్కరించారని సామవేదం షణ్ముఖ శర్మ పేర్కొన్నారు. ఇంకా నూతనంగా వెలసిన ‘సకల కళాదర్శిన’ ద్వారా ఎన్నో మంచి పనులు జరగాలని ఆకాంక్షించారు. కాలిఫోర్నియా నుంచి డా. రవి జంధ్యాల, సినీ రచయిత దివాకర బాబు, హాస్య రచయిత వంగూరి చిట్టెన్ రాజు, ప్రముఖ సాహితీవేత్త సుధామ, నవలా రచయిత్రి గంటి భానుమతి, రచయిత్రి తమిరిశ జానకి, సిడ్నీ నుంచి విజయ చావలి, న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల, సోమంచి సుబ్భలక్ష్మి, శాక్రిమెంటో నుంచి తెలుగు వెలుగు మాసపత్రిక ప్రధాన సంపాదకులు వెంకట్ నాగం తదితరులు ఈ పుస్తకావిష్కరణలో పాలుపంచుకున్నారు. -
‘ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టుకుంటారు’
లబ్బీపేట(విజయవాడతూర్పు): రైటర్ పద్మభూషణ్ చిత్రయూనిట్ ఆదివారం సందడి చేసింది. ఆ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఎంజీరోడ్డులోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మూవీ బృందం పాటను రిలీజ్ చేశారు. అనంతరం హీరో సుహాస్ మాట్లాడుతూ రైటర్ పద్మభూషణ్ అందరినీ అలరిస్తుందని భావిస్తున్నామని చెప్పారు. ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని, షూటింగ్ మొత్తం విజయవాడలో తీశామని తెలిపారు. ఛాయ్ బిస్కట్స్ ప్రొడక్షన్స్ ద్వారా తాను చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యానన్నారు. చదవండి: ఎన్టీఆర్ 30: సెట్స్పైకి వచ్చేది అప్పుడే! ఇది ఒక డ్రామా చిత్రమని, సినిమా చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టుకుని బయటకు వెళ్తారన్నారు. మూవీ చూశాక వారం రోజులు మర్చిపోలేరని, ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. రైటర్ పద్మభూషణ్ సినిమా నాకు చాలా స్పెషల్ అని, తాను పుట్టి పెరిగిన విజయవాడలో షూటింగ్ జరిగిందన్నారు. తాను చదువుకున్న కాలేజీ, భవానీ ఐలాండ్, గాంధీ హిల్స్ ప్రతిచోటా షూటింగ్ చేశామన్నారు. హీరోయిన్ టీనాకల్పరాజ్ మాట్లాడుతూ తమ జీవితంలో జరిగిన విషయాలు లాగానే ఈ సినిమాలో సన్నివేశాలు ఉంటాయన్నారు. తనను దర్శకుడు బాగా ఎంకరేజ్ చేశారన్నారు. నిర్మాత శరత్ మాట్లాడుతూ ఆగస్టు నెలాఖరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు. చిత్ర నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదన్నారు. -
ప్రేమించే జీవితం..: వాయిదా వేసిన కలలు... నిజం చేసుకుంటున్న వేళ..
పురుషులతో పోల్చితే స్త్రీల కలలు ఎప్పుడూ వెనకబాటులోనే ఉంటాయి. కుటుంబ బాధ్యతల కారణంగా తమ కలలను చంపుకునో లేక వాయిదా వేసుకునో రోజులను వెళ్లదీసే మహిళల సంఖ్యే ఎక్కువ. అలాంటి ప్రపంచం నుంచి వచ్చినవారిలో ముక్తాసింగ్ ఒకరు. కలలను వాయిదా వేసుకుంటూ, మధ్య మధ్య వాటిని వదలకుండా బతికించుకునే ప్రయత్నం జీవితమంతా చేస్తూనే ఉన్న ముక్తాసింగ్ ఒక కళాకారిణి, రచయిత్రి. ఆరుపదుల వయసులో మోడలింగ్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ‘రిటైర్ అయ్యే వయసులో పని చేయడం గర్వంగా ఉంది’ అంటూ తన గురించి చెప్పే ముక్తాసింగ్ గురించి తెలుసుకుంటే తమ జీవితంలోనూ ఇవి ప్రేరణ నింపే విషయాలు అనుకోకుండా ఉండరు. గురుగ్రామ్లో ఉంటున్న ముక్తా ఈ 60 ఏళ్ల వయసులో మోడలింగ్ చేస్తూ, పెయింటింగ్స్ వేస్తూ తన కలలు ఇప్పుడెలా నిజం చేసుకుంటున్నారో గమనిస్తే... ‘మనలో చాలామంది వయసు పెరిగేకొద్దీ హుందాగా కనిపించాలని లేని భారమేదో మోస్తున్నట్టుగా ఉండాలనుకుంటాం. కానీ, ఉత్తమంగా ఉండాలని కోరుకుంటే మెరుగైన ఆరోగ్యం కోసం ప్రయత్నిస్తాం. ఫలితంగా జీవన ప్రమాణాలను పెంచుకుంటాం’ అంటారు ముక్తా. బాధ్యతల బరువు నుంచి.. ఫైటర్ పైలట్ని వివాహం చేసుకుంది ముక్తాసింగ్. అతని కెరియర్, ఆశయాలు, తరచూ బదిలీలు జరగడంతో ఆమె తన కలలను అణిచివేసుకుంది. పిల్లలు పుట్టడం, వారిని చూసుకోవడం, అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకోవడంలో ఏళ్లకేళ్లు గడిపేసింది. అన్ని దశల్లోనూ ఊపిరి సలపని బాధ్యతలు. నలుగురిని ఆలోచింపజేసే వ్యాసాలు రాయడం అంటే ఇష్టం. కానీ, చేయలేకపోయేది. అయినప్పటికీ ఎంతో కొంత తీరిక చేసుకుని వార్తాపత్రికలకు, మ్యాగజైన్ల కు వ్యాసాలు పంపేది. కానీ, పూర్తి సమయం తన కెరీర్కు కేటాయించలేకపోతున్నాను అని మధనపడేది. సంగీతం ఆంటే ఎనలేని ప్రేమ. పెయింటింగ్ చేయాలనే ఆలోచనతో సంగీత చిహ్నాలను కాన్వాస్పై చిత్రించేది. అప్పుడు చేయలేని పనులు ఈ వయసులో చేస్తోంది. అత్యంత ప్రజాదరణ పొందిన గాయనీగాయకుల ముఖచిత్రాలను చిత్రిస్తోంది. ఫ్రీలాన్సర్గా వార్తాపత్రిక లకు కథనాలు రాస్తుంది. ఆలోచింప జేసిన జీవనం వీటిన్నింటి ద్వారా ఏదైనా సొంతంగా చేయాలనే ఆలోచన ఎప్పుడూ ఉండేది. కానీ, నాడు బాధ్యతల నడుమ సరైన వేదికేదీ దొరకలేదు. దీంతోపాటు తన కలలను కనుల వెనుకే దాచేసుకొని కుటుంబాన్ని ముందుకు నడిపించింది. తనలో దాగున్న కళను నలుగురితో పంచుకోవడానికి ఓదార్పుగా ఇన్స్టాగ్రామ్ పేజీ దొరికింది. ఉన్న కొద్దిసమయంలో చేసే కళను పోస్ట్ చేయడం, నలుగురికి పరిచయం చేయాలని తపిస్తోంది. చాలాసార్లు తన తల్లి అనారోగ్యం ఆమెను ఆలోచింపజేసింది. దినచర్యపై శ్రద్ధ పెట్టడం చేసేది. ఫిట్నెస్ గురించి పట్టించుకునేది. పిల్లలు స్థిరపడ్డారు. అదేపనిగా కురుస్తున్న వాన కాస్త తెరిపి ఇచ్చినట్టు అనిపించింది. మార్చిన అవకాశం తెలిసినవారి పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ ఒక ఫ్యాషన్ డిజైనర్ పరిచయం అవడంతో ముక్తాసింగ్ జీవిత గమనమే మారిపోయింది. ఆ డిజైనర్ ముక్తాని తన డ్రెస్లకు మోడలింగ్ చేయమని కోరింది. ‘ఈ వయసులో మోడలింగ్ ఏంటి?’ అని చాలా మంది నిరుత్సాపూరితమైన మాటలు అన్నప్పటికీ పట్టుదలతో మోడలింగ్ అవకాశాన్ని ఎంచుకుంది. ఈ కొత్త ఇన్నింగ్స్తో ఆమె కుటుంబం కూడా సంతోషించింది. ఇదే రంగంలో ఇంకా మంచి అవకాశాలు ఆమెకోసం వస్తున్నాయి. ‘పదవీ విరమణ అంచున ఉన్నప్పుడు పని చేయడం గర్వంగా ఉంది’ అంటారు ముక్తా. వృద్ధాప్యాన్ని చాలా ఆకర్షణీయంగా అవకాశంగా మార్చుకున్న వ్యక్తుల చిత్రాలు కూడా తన సోషల్మీడియా పేజీ ద్వారా పోస్ట్ చేస్తుంది. వారిలో స్టీవ్ టైలర్, అగాథాక్రిస్టి, మహారాణి గాయత్రీదేవి, రవీంద్రనాథ్ ఠాగూర్..ల చిత్రాలు ఉన్నాయి. ‘ఎన్ని పనులున్నా ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టడం వల్ల నాకు మరో అవకాశం వచ్చింది. పెరిగే వయసును స్వీకరించాలి. అలాగే, మన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి మనదైన శైలిని చూపడమూ నేర్చుకోవాలి. మనమంటే ఏంటో కూడా నలుగురికి తెలియజేయాలి’ అని చెప్పే ముక్తా సింగ్ మాటలు రిటైర్మెంట్ దశలో ఉన్న అందరిలోనూ తప్పక ఆలోచనను కలిగిస్తాయి. -
మహిళా రచయిత్రి పై అత్యాచారం...డాన్ పేరుతో బెదిరింపులు..
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతమే లేదన్నట్లుగా నేరాలు జరుగుతున్నాయి. ఈ అఘాయిత్యాలకు పాల్పడే వాళ్లంతా సమాజంలో మంచి స్థానంలో ఉన్న ప్రముఖులు లేదా ప్రుముఖుల పిల్లలే కావడం బాధకరం. స్టార్ హీరోయిన్ దగ్గర నుంచి మంచి ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్న మహిళలందరూ ఏదో ఒక సందర్భంలో లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. కొంతమంది ప్రబుద్ధులు చట్టాలను సైతం లెక్కచేయకుండా మహిళలపై అయిత్యాలకు తెగబడుతున్నారు. అచ్చం అలానే ఇక్కడొక రచయిత్రి అత్యాచారానికి గురైంది. వివరాల్లోకెళ్తే....ముంబైలోని ఉంటున్న ఒక రచయిత్రి అత్యాచారానికి గురైంది. ముంబైలోని జుహు ప్రాంతంలో ఫైవ్స్టార్ హోటల్లో 35 ఏళ్ల రచయిత్రి పై 75 ఏళ్ల వ్యాపారవేత్త అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పైగా ఆ వ్యాపారవేత్త ఈ విషయాన్ని ఎవరికైన చెబితే చంపేస్తానంటూ డాన్ దావుద్ ఇబ్రహీం పేరుతో బెదిరించాడు. దీంతో ఇక ఆమె చేసేదిలేక ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐతే సదరు నిందితుడు బాధిత మహిళ వద్ద రూ.2 కోట్లు రుణం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆమె పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా... నిందితు డాన్ పేరుతో బెదిరించడమే కాకుండా చంపేస్తానని బెదిరించాడని పోలీసులకు తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: చంపి.. బొందపెట్టారు: అమెజాన్ అడవుల్లో వీడిన మిస్టరీ.. బొల్సోనారో బలుపు వ్యాఖ్యలు) -
నీ సినిమా తీయాలంటే.. నా కోరిక తీర్చాలి!
సాక్షి,హైదరాబాద్: నగరానికి చెందిన ఓ కథా రచయిత్రికి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఆమె రాసిన కథను సినిమాగా తీస్తానంటూ ముందుకు వచ్చిన చోటా నిర్మాత అలా చేయాలంటే తన కోరిక తీర్చాలని షరతు పెట్టాడు. ఆమె తిరస్కరించడంతో ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. బాధితురాలు హైదరాబాద్ షీ–టీమ్స్ను ఆశ్రయించింది. సాంకేతిక ఆధారాలతో అతడిని పట్టుకుని గోల్కొండ ఠాణాలో కేసు నమోదు చేయించి, కటకటాల్లోకి పంపినట్లు అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ గురువారం వెల్లడించారు. సిటీ షీ–టీమ్స్కు ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 423 ఫిర్యాదులు అందినట్లు ఆయన పేర్కొన్నారు. 203 మంది నేరుగా, 181 మంది సోషల్మీడియా ద్వారా ఫిర్యాదులు చేసినట్లు వివరించారు. వీటికి సంబంధించి ఆయా ఠాణాల్లో 57 క్రిమినల్ కేసులు, 25 పెట్టీ కేసులు నమోదయ్యాయని, 52 మంది పోకిరీలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని 15 పెట్టీ కేసులు నమోదు చేశామన్నారు. షీ–టీమ్స్కు చిక్కిన వారిలో 191 మంది మేజ ర్లు, 23 మంది మైనర్లు ఉన్నారన్నారు. వేధింపులు బారినప డిన వారు ఎవరైనా నేరుగా భరోస సెంటర్లోని షీ–టీమ్స్ కేంద్రానికి వచ్చి లేదా వాట్సాప్ నం.94906 16555ల ద్వారా ఫిర్యాదు చేయాలని ఏఆర్ శ్రీనివాస్ కోరారు. ఇద్దరికి ఎనిమిది రోజుల చొప్పున జైలు... షీ–టీమ్స్కు చిక్కుతున్న పోకిరీలు, వేధింపురాయుళ్లకు న్యాయస్థానం జైలు శిక్షలు విధిస్తోందని ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. చార్మినార్కు చెందిన సయ్యద్ అబ్దుల్ హుస్సేన్ (68) తన పక్కింట్లో ఉండే మహిళను వేధించాడు. కోరిక తీర్చాలంటూ బ్లాక్మెయిల్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో షీ–టీమ్స్ అతడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచాయి. న్యాయమూర్తి నిందితుడికి ఎనిమిది రోజుల జైలు, రూ.250 జరిమానా విధించింది. చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ సోహైల్ (21) సంతోష్నగర్ చౌరస్తా సమీపంలోని ఇంజినీరింగ్ కాలేజీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని అక్కడి షీ–టీమ్స్ గుర్తించాయి. అతడిని అనుసరించగా... ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడం గమనించారు. ఈ తతంగాన్ని వీడియో రికార్డు చేసిన షీ–టీమ్స్ అతడిని కోర్టులో హాజరుపరచగా ఎనిమిది రోజుల శిక్ష పడింది. సంతోష్నగర్ ప్రాంతానికి చెందిన యువతిని వేధిస్తున్న షేక్ ముఖ్రమ్ అహ్మద్, ఓయూ ఠాణా పరిధిలో మహిళలకు వాట్సాప్ సందేశాలు పంపి బెదిరిస్తున్న ఇ.శ్రీనివాస్లను షీ–టీమ్స్ పట్టుకుని స్థానిక ఠాణాలకు అప్పగించగా వారిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. చదవండి: Mahesh Babu: 'నేను డైరెక్టర్ అయితే ఆ సినిమాను రీక్రియేట్ చేస్తా' -
‘క్రాక్ సినిమా కథ నాదే.. నోటీసులు పంపించినా పట్టించుకోవడం లేదు’
సాక్షి, బంజారాహిల్స్: రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా కథ తనదేనని తనను మోసం చేసిన సినీ నిర్మాతతో పాటు ఇతర యూనిట్ సభ్యులపై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఓ రచయిత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలివీ... అల్వాల్లో నివాసం ఉంటున్న శివ సుబ్రమణ్యమూర్తి అనే వ్యక్తి 2015లో బళ్లెం సినిమా మీడియా డైరెక్టరీ అనే పుస్తకాన్ని రాశారు. ఏడాదిన్నర క్రితం రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో సన్నివేశాలు, కథ, కథనం మొత్తం తన పుస్తకంలో ఉన్నదేనని సదరు నిర్మాణ సంస్థతో పాటు దర్శకుడు, హీరోలకు ఫిలించాంబర్ నుంచి నోటీసులు పంపించినా పట్టించుకోవడం లేదని సుబ్రమణ్యమూర్తి గురువారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా నిర్మాత మధుసూదన్రెడ్డి జూబ్లీహిల్స్లోని ప్రశాసన్నగర్లో నివాసం ఉంటున్న కారణంగా తాను ఇక్కడ ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: యూట్యూబర్ శ్రీకాంత్రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి -
జాతీయస్థాయిలో అవార్డు గ్రహీత.. ఆమెపై అత్యాచారం.. చివరకు..
సాక్షి, న్యూఢిల్లీ: ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రచయిత. ఆయన రచనలకు గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. కానీ ఇందంత ఒకవైపు.. మరోవైపు మాత్రం అతను ఓ యువతి జీవితాన్ని నాశనం చేశాడు. అతడు తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించడం కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన మహిళ(32) .. ఢిల్లీలోని తిమ్మార్పూర్ పోలీసులను ఆశ్రయించింది. ఢిల్లీకి చెందిన కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్టు తెలిపింది. ఈ క్రమంలో పదేళ్ల క్రితం సోషల్ మీడియాలో ద్వారా అతడితో పరిచయం ఏర్పడిందని, అనంతరం వారద్దరూ ప్రేమించున్నట్టు పేర్కొంది. 2013లో తనకు కంటి నొప్పి రావడంతో ఎయిమ్స్ చికిత్స చేపించుకుని తిరిగి వచ్చేసరికి ఆలస్యమైందని తెలిపింది. లేట్ అయినందుకు అతను కోపంతో తనను తీవ్రంగా కొట్టాడని, ఓ వైపు తాను ఏడుస్తున్నా తనపై అత్యాచారం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, తర్వాత రోజు అతను తన వద్దకు వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పినట్టు పేర్కొంది. ఇలా పెళ్లి పేరుతో అతడు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని వాపోయింది. ఇదిలా ఉండగా.. ఇటీవలే నిందితుడి ఫోన్ను బాధితురాలు చెక్ చేయగా అతడికి మరికొంతమంది మహిళలతో సంబంధం ఉన్నట్టు గుర్తించానని పేర్కొంది. దీంతో పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పుకొచ్చింది. ఇది కూడా చదవండి: ఆర్డర్ చేసిన ఫుడ్లో పాము చర్మం...షాక్లో కస్టమర్ -
Satyajit Ray: నవ్యచిత్ర వైతాళికుడు
‘‘ఏమున్నది సార్ గీ సిన్మాల అంతా మా వూరు లెక్కనే వున్నది... మా బతుకులే వున్నయి...’’ సత్యజిత్ రే ‘పథేర్ పాంచాలి’ సినిమా చూసిన తర్వాత కరీంనగర్ జిల్లా ‘పోరండ్ల’ గ్రామ రైతు స్పందన ఇది. ఒక నిజాయతీ కలిగిన వాస్తవిక సినిమాకు ప్రపంచంలో ఎక్కడయినా ఇలాంటి స్పందనే వస్తుందన్నది నిజం. భారతీయ సినిమాకు కళాత్మకతనూ, మానవీయ స్పందనలనూ అందించిన దర్శకుడు రే. తన ముప్పై ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన ‘పథేర్ పాంచాలి’ నుంచి ‘ఆగంతుక్’ వరకు ముప్పై పూర్తి నిడివి సినిమాలు, అనేక డాక్యుమెంటరీ సినిమాలు తీశారు. ఈ రోజుల్లో లాగా ఎలాంటి ఆధునిక ప్రసార మాధ్యమాలూ, సామాజిక మాధ్య మాలూ లేని ఆ కాలంలో రే కు ప్రపంచ ఖ్యాతి లభించింది. 1921లో మే 2న జన్మించిన సత్యజిత్ రే తన జీవితంలోని అత్యధిక సమయం సినీ రంగంలోనే గడిపినప్పటికీ ఆయన... రచయితగా, చిత్రకారుడిగా, టైపోగ్రాఫర్గా, బాల సాహిత్య సృష్టి కర్తగా, సైన్స్ ఫిక్షన్ రచయితగా తనదైన ముద్రతో సృజన రంగంలో పని చేశారు. సినిమా రంగంలో కూడా దర్శకత్వంతో పాటు సంగీతం, సినిమా టోగ్రఫీ, స్క్రిప్ట్, మాటల రచన తానే నిర్వహించారు. మొదట రవిశంకర్ లాంటి వాళ్ళతో సంగీతం చేయించుకున్నా తర్వాత తానే తన సినిమాలన్నింటికీ సంగీతం సమకూర్చుకున్నారు. ఇంకా సన్నివేశాలకు సంబంధించి సంపూర్ణ స్కెచెస్ వేసుకొని, చిత్రీకరణ జరిపేవారు. సాహిత్యానికీ సినిమాకూ వారధిలా నిలిచి భారతీయ సినిమాను పరిపుష్టం చేశారు. టాగూర్, బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ్, తారాశంకర్ బంధోపాధ్యాయ్, ప్రేమ్ చంద్, నరేంద్రనాథ్ లాంటి మహా రచయితల రచనల్ని తెరపైకి ఎక్కించారు రే. అంతేకాదు, పలు సినిమాలకు తన స్వీయ రచనల్ని కూడా ఉపయోగించుకున్నారు. (చదవండి: ఆదర్శ కమ్యూనిస్టుకు జోహార్లు!) 1956లో ‘పథేర్ పాంచాలి’ కాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘బెస్ట్ హ్యూమన్ డాక్యుమెంట్’ అవా ర్డును గెలుచుకొని భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చింది. తర్వాత ‘దేవి’, ‘కాంచన్ జంగా’, ‘చారులత’, ‘తీన్ కన్య’ ‘ఘరె బైరె’, ‘ఆగంతుక్’ లాంటి అనేక విశ్వ విఖ్యాత సిని మాల్ని రూపొందించారు. బహుశా ఆయన సినిమాల్ని ప్రదర్శించని అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ప్రపంచంలో లేవు. ఆయన అందుకోని అవార్డులూ లేవు. కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’, దాదా సాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. ఫ్రాన్స్ దేశానికి చెందిన ‘లెజియన్ ఆఫ్ ఆనర్’, అలాగే ‘ఆస్కార్ జీవిత సాఫల్య పురస్కారం’ లాంటి లెక్కలేనన్ని అంతర్జాతీయ పురస్కారాలూ అందుకున్నారు. భారతీయ సినిమాకు నవ్యచిత్ర వైతాళికుడిగా నిలిచిన సత్యజిత్ రే 1992 ఏప్రిల్ 23న కలకత్తాలోని బెల్లెవీ నర్సింగ్ హోమ్లో తుదిశ్వాస విడిచారు. ఆయన చరిత్ర చిత్రసీమకు మణిహారం. (చదవండి: ‘జై హింద్’ నినాదకర్త మనోడే!) – వారాల ఆనంద్ (మే 2న సత్యజిత్ రే జయంతి) -
Sridhar Bevara: ఆకలినీ.. అవనినీ.. అవమానాలనూ జయించాడు
ఆకలితో జరిగిన యుద్ధంలో ఓడిన ప్రతిసారి తనను తాను రక్షించుకున్నాడు. ఈ క్రమంలో మనసుకు గాయమైనా లక్ష్యం కోసం భరించాడు. తనను వేధిస్తున్న సమాజానికి సరైన సమాధానం చెప్పాలన్న కాంక్షతో అడుగు ముందుకేశాడు. తరుముకొచ్చే అవసరం నుంచి.. సృజనాత్మక ఆలోచన పుట్టుకొచ్చింది. అప్పటి వరకూ అసాధ్యమైన పనిని సులభసాధ్యం చేసే.. సరికొత్త ఆలోచనై మెరిసింది. అదే అతన్ని విజయతీరాలకు చేర్చింది. తన ప్రతిభతో ఆకలినీ.. అవనినీ.. అవమానాలనూ జయించాడు. ప్రతి ఓటమి నుంచి పాఠం నేర్చుకుంటూ.. వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగాడు. ఒకప్పుడు కోడిని చంపి.. చికెన్ డెలివరీ చేసిన అతనే.. ఈ రోజు ప్రపంచ వాణిజ్య విభాగంలో తనకంటూ ఓ పేజీని సృష్టించుకున్నాడు. ఆకలి, ఆవేదనలో నుంచి పుట్టికొచ్చిన అక్షరాలను ఆకళింపు చేసుకుని ప్రపంచస్థాయి రచయితగా ఎదిగాడు. పేదరికంతో మొదలైన అతని జీవన ప్రస్థానం.. నేడు పదుగురికి సాయం చేసే స్థాయికి చేరింది. మేధో శ్రమకే అంకితమైన ఒక అసమాన యాత్రికుని ప్రయాణమిది. ఆ యువకుడి పేరే శ్రీధర్ బెవర. సాక్షి, విశాఖపట్నం: శ్రీధర్ బెవర పుట్టింది శ్రీకాకుళం జిల్లా రాజాం. కుటుంబాన్ని పేదరికం వెక్కిరించడంతో తల్లి శ్రీధర్తో పాటు తన నలుగురు పిల్లలను ఒక్కొక్కరిని ఒక్కో బంధువు ఇంట్లో పెట్టింది. అక్కడైనా తన పిల్లలకు కష్టాలు లేకుండా మూడు పూటలా తిండి దొరుకుతుందనీ.. చక్కగా చదువుకుంటారనీ.! అలా ఒకే గూటి పక్షులను వేర్వేరు ప్రాంతాలకు పంపించేసింది. శ్రీధర్ను గుంటూరులో, శ్రీధర్ అక్క శైలజను వాళ్ల పెదనాన్న ఇంట్లో, అన్నయ్య మురళి, తమ్ముడు గిరిధర్ను విశాఖలోని బంధువుల ఇంటికి అప్పగించింది. శ్రీధర్ గుంటూరులోని పెద్దమ్మ వాళ్ల అబ్బాయి ఇంట్లో ఆశ్రయం పొందారు. పదో తరగతి వరకు అక్కడే కాలం వెళ్లదీశారు. చివరి పరీక్ష రాసి ఇంటికి వచ్చిన రోజున.. ఇక నుంచి ఇక్కడ ఉండొద్దని బంధువులు ఆయనకు తెగేసి చెప్పేశారు. అక్కడే.. కొత్త ఆలోచనలకు బీజం ఏదైనా పనిలో చేరి సమస్యల నుంచి బయటపడాలని భావించాడు శ్రీధర్. విశాఖ డెయిరీలో పాల ప్యాకెట్లు తీసుకుని టీ దుకాణాలకు డెలివరీ బాయ్గా ప్రస్థానం ప్రారంభించారు. కష్టపడుతున్నా.. ఆదాయం రాకపోవడంతో చికెన్ దుకాణంలో మాంసం కొట్టేందుకు పనికి కుదిరాడు. కోడిని చంపడం వంటి దృశ్యాలతో చూసిన శ్రీధర్ బెదిరిపోయి జ్వరం బారిన పడ్డారు. కూటి కోసం ఆ పనిలోనే కొనసాగాడు. ఆ సమయంలోనే కొత్త ఆలోచనలకు బీజం పడింది. అపార్ట్మెంట్లు, ఇంటింటికీ వెళ్లి ముందు రోజే చికెన్ ఆర్డర్ తీసుకునేవాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆర్డర్లు సరఫరా చేసేవాడు. అక్క శైలజ పేరుతో చిన్నపాటి వ్యాపారం ప్రారంభించాడు. మంచి లాభాలొచ్చినా.. రేయింబవళ్లు పని చేయడంతో శ్రీధర్ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా ఆ వ్యాపారానికి కూడా మధ్యలోనే స్వస్తి చెప్పాడు. కుంగదీసిన అన్నయ్య మరణం ఇంతలో అన్నయ్య మురళీధర్ క్యాన్సర్ బారిన పడి 2017లో కన్నుమూశాడు. దీంతో అందరూ ఉన్నా ఒంటరిగా మారిపోయిన శ్రీధర్.. ఆ బాధ నుంచి కోలుకుని అన్నయ్య పేరుతో బీఎంఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. పేద పిల్లలకు విద్యాదానం, ప్రజలకు నిత్యావసరాల పంపిణీ, ఇతర సేవాకార్యక్రమాలు చేపడుతున్నాడు. ఆకలి ముందు చదువు ఓడిపోయింది పదో తరగతి పరీక్షలో మంచి మార్కులతో పాసయ్యారు శ్రీధర్. గుంటూరు నుంచి బయటకు వచ్చిన తర్వాత విశాఖలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్లో చేరారు. ఆకలి కారణంగా చదువులో వెనకబడిపోయాడు. అన్నయ్య మురళి, తమ్ముడు గిరిధర్ కూడా బంధువుల ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ముగ్గురూ కలిసి ఒకే రూమ్లో జీవనం ప్రారంభించారు. అన్నయ్య మురళి తండ్రిగా బాధ్యతను భుజానికెత్తుకున్నారు. అప్పటికే అన్నయ్య మురళి పెద్దింటి అమ్మాయి లక్ష్మీ భారతిని ప్రేమించి.. పెళ్లి చేసుకుని రూమ్కు తీసుకొచ్చేశారు. ఆ ముగ్గురితో పాటు లక్ష్మీభారతి కూడా అదే చిన్న రూమ్లో తలదాచుకుంది. తల్లిలా వారిని లాలించింది. ఆర్థిక సమస్యలు.. ఆకలి బాధలతో చదువుపై దృష్టి సారించలేకపోయారు శ్రీధర్. ఇంటర్లో తప్పారు. దీంతో తను కన్న కలలన్నీ కల్లలయ్యాయ్. తాజ్లో వెయిటర్.. డిగ్రీలో ఫెయిల్ విశాఖలోని తాజ్ హోటల్లో వెయిటర్ ఉద్యోగాలు పడటంతో శ్రీధర్ అక్కడ పనికి చేరాడు. బ్యాంకెట్ వెయిటర్గా 14 గంటల పాటు నిలబడి పనిచేసేవాడు. ఉదయం 10 నుంచి రాత్రి ఒంటి గంట వరకు పని పూర్తి చేసి.. ఆ సమయంలో వాహనాలు లేక 5 కిలోమీటర్లు నడుచుకుంటూ రూమ్కు వెళ్లేవాడు. ఆ సమయంలో పోలీసులు శ్రీధర్ను అదుపులోకి తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. క్రమంగా వెయిటర్గా మంచి గుర్తింపు వచ్చింది. వైజాగ్కు ప్రముఖులు ఎవరొచ్చినా సర్వ్ చేసేందుకు శ్రీధర్నే ఎంపిక చేసే వారు. వెయిటర్గా చేస్తూనే బీకామ్లో చేరాడు. పని ఒత్తిడితో మూడేళ్ల డిగ్రీ పూర్తయ్యే సరికి 15 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. కొత్త జీవితం వైపు అడుగులు ఎదుగు బొదుగూ లేని జీవితంతో పోరాటం చేస్తున్న శ్రీధర్కు అన్నయ్య మురళీ మాటలు కొత్త జీవితం వైపు అడుగులు వేసేలా చేశాయి. అప్పటికే దుబాయ్లో స్థిరపడ్డ మురళీ.. శ్రీధర్ను డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ చేయాలని సూచించాడు. ఆయన మాట ప్రకారం వాటిని పూర్తి చేసిన శ్రీధర్ దుబాయ్ వెళ్లిపోయాడు. అంతే.. అక్కడి నుంచి శ్రీధర్ జీవితం పూర్తిగా మారిపోయింది. చిన్న చిన్న కంపెనీల్లో ఉద్యోగం మొదలు పెట్టిన ఆయన.. ఎల్జీ, పానాసోనిక్ కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. మళ్లీ ఇండియా వచ్చి ఐఐఎం–అహ్మదాబాద్లో అడ్వాన్స్డ్ బిజినెస్ కోర్సు చదివి.. 37 ఏళ్లకే జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగాడు. పానాసోనిక్ మిడిల్ ఈస్ట్–ఆఫ్రికా విభాగం ఇన్చార్జిగా నియమితులయ్యారు. రచయితగా.. రికార్డు.. ఆకలి, ఆవేదన నుంచే అక్షరాలు ధ్వనిస్తాయన్నది అక్షర సత్యమని శ్రీధర్ కవిత్వం వింటే అర్థమవుతుంది. చిన్నతనం నుంచి కవితలు, కథలు రాయడం అలవాటు చేసుకున్న శ్రీధర్.. క్రమంగా మంచి రచయితగా మారారు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా కొన్నేళ్ల కిందట మూమెంట్ ఆఫ్ సిగ్నల్ అనే పుస్తకాన్ని ఇంగ్లిష్లో రచించారు. ఇది అమెజాన్లో బెస్ట్ సెల్లర్గా రికార్డు సృష్టించింది. ప్రపంచంలో ప్రసిద్ధ రచయితలతో పాటు సాహితీ విమర్శకులు.. ఈ పుస్తకానికి ప్రశంసల జల్లు కురిపించారు. నాయకత్వ లక్షణాలపై శ్రీధర్ రాసిన ‘ది రోరింగ్ ల్యాంబ్స్’ వ్యక్తిత్వ వికాస నవల చరిత్ర సృష్టించింది. ఈ–కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ నిర్వహించిన పాపులర్ బుక్స్ ఆఫ్–2021లో శ్రీధర్ ‘ది రోరింగ్ ల్యాంబ్స్’ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. తొమ్మిది విభాగాల్లో ఐదేసి పుస్తకాల చొప్పున పోటీ నిర్వహించింది. ఇందులో ది రోరింగ్ ల్యాంబ్స్ పుస్తకం బిజినెస్ అండ్ ఎకనమిక్స్ విభాగంలో స్థానం దక్కించుకుంది. ఈ పోటీల్లో అన్ని విభాగాల్లోనూ చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ రచయిత శ్రీధర్ కావడం విశేషం. కొన్నేళ్లుగా బిజినెస్ అండ్ ఎకనమిక్స్ విభాగంలో అమెరికాకు చెందిన రచయితల పుస్తకాలే మొదటిస్థానంలో నిలిచేవి. తొలిసారిగా ఓ భారతీయ రచయిత ఆ రికార్డుని తుడిచిపెట్టేసి నంబర్ వన్గా అవతరించారని అమెజాన్ సంస్థ ప్రశంసించింది. అంతే కాదు.. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగానూ శ్రీధర్ తన ప్రస్థానాన్ని సాగిస్తున్నారు. చిన్నప్పటి నుంచి సమస్యలు చుట్టిముట్టినా.. పడిలేచిన కెరటం లా పైకెగిరిన అతని జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిద్దాం. పారిశ్రామికవేత్తగా పయనం తాను పనిచేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి పారిశ్రామికవేత్తగా ప్రయాణం ప్రారంభించాడు శ్రీధర్. అన్నయ్య పేరుతో బీఎంఆర్ ఇన్నోవేషన్స్ అనే ఫైనాన్షియల్ కన్సెల్టెన్సీ కార్పొరేట్ సంస్థను ప్రారంభించాడు. రుణం పొందేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు పడే ఇబ్బందుల నుంచి గట్టెక్కించి.. రుణ మంజూరుకు సహాయం చేసేదే ఈ సంస్థ. పలు దేశాలకు ఈ సంస్థ రుణాలు మంజూరు చేసింది. మన కేంద్ర ప్రభుత్వానికి కూడా సహాయం అందించడం విశేషం. ఇటీవలే గోవా ప్రభుత్వం కన్వెన్షన్ సెంటర్ స్థాపించేందుకు రుణ మంజూరు ప్రక్రియ శ్రీధర్ కంపెనీతోనే జరిగింది. దీంతో శ్రీధర్ను గోవా ప్రభుత్వం స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్కు మెంటర్గా నియమించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇన్వెస్ట్మెంట్ ఇండియా సంస్థతో కలిసి దేశానికి వివిధ పనులకు సంబంధించి రుణాల మంజూరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కూడా శ్రీధర్తో భేటీ అయ్యింది. ఒకప్పుడు ఆకలి తీర్చుకునేందుకు పని దొరుకుతుందని ఎదురు చూడగా... ఇప్పుడు అనేక దేశాలు శ్రీధర్ బెవర కోసం ఎదురు చూస్తున్నాయి. ఇదీ కదా.. అసలైన విజయమంటే.! -
శ్వేత దేశపు నాణేంపై నల్ల జాతి మ(తె)గువ
వర్ణ వివక్షకు కేరాఫ్ అయిన అగ్రరాజ్యంలో.. ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. మొట్టమొదటిసారి ఓ నల్ల జాతి మగువ ముఖచిత్రంతో అమెరికన్ కాయిన్ విడుదల చేశారు. అమెరికన్ ఉమెన్ క్వార్టర్స్ ప్రోగ్రాంలో భాగంగా అమెరికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఆఫ్రో-అమెరికన్ రైటర్ మయా అంజెలు ముఖచిత్రంతో కాయిన్ను విడుదల చేశారు. ఏడేళ్ల వయసులో తల్లి ప్రియుడి చేతిలో అఘాయిత్యానికి గురై.. చావు దెబ్బలు తింది మయా అంజెలు. చివరికి బంధువుల చొరవతో ప్రాణాలతో బయటపడిన ఆ చిన్నారి.. ఆరేళ్లపాటు మూగదానిగా ఉండిపోయింది. ఆ చేదు అనుభవం నుంచి బయటపడేందుకు ఆ చిన్నవయసు నుంచే అక్షరాల్ని ఆశ్రయించింది. కాలక్రమంలో ఆఫ్రో-అమెరికన్ రచయితగా, జాతి-వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలిగా మయా అంజెలుకు ఒక పేరు దక్కింది. ఉద్వేగంగా సాగే ఆమె రచనలు ప్రముఖులెందరినో ప్రభావితం చేశాయి కూడా. ఆమె ఆత్మకథ I Know Why the Caged Bird Sings ద్వారా ఎన్నో సమస్యల గురించి చర్చించారామె. 1993లో బిల్క్లింటన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా స్వయంగా కవిత వినిపించి.. ఆ అరుదైన గౌరవం అందుకున్న తొలి బ్లాక్ లేడీగా గౌరవం అందుకుంది. తన జీవిత కాలంలో 30కి పైగా అత్యున్నత డాక్టరేట్లు అందుకున్న మయా అంజెలు.. 2010లో అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతుల మీదుగా ‘స్వేచ్ఛా’ మెడల్ను సైతం స్వీకరించింది. 2014లో 86 ఏళ్ల వయసులో ఆమె అనారోగ్యంతో కన్నుమూసింది. మయా అంజెలుతో పాటు చైనా సంతతికి చెందిన హాలీవుడ్ నటి అన్నా మే వాంగ్, అమెరికా తొలి మహిళా వ్యోమగామి సాలీ రైడ్ ముఖ చిత్రాల మీదుగా కూడా కాయిన్స్ రిలీజ్ చేసింది అమెరికా మింట్. -
ప్రముఖ రచయిత్రి పుణ్యప్రవాదేవి మృతి
బీచ్రోడు (విశాఖ తూర్పు): ప్రముఖ బాలల సాహిత్య రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పుణ్యప్రవాదేవి (84) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె విశాఖలోని తన నివాసంలో మృతి చెందారు. ఒడియా సాహిత్యానికి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన ప్రముఖ రచయిత చరణ్దాస్ కుమార్తె ఈమె. చదవండి: కష్టపడి ఎస్ఐ అయ్యాడు.. పెళ్లయి కూడా 5 రోజులే.. విధుల్లో చేరేందుకు వెళ్తూ.. కటక్లో 1938లో జన్మించిన పుణ్యప్రవాదేవి బాలల సాహిత్యంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రవాదేవికి నలుగురు పిల్లలు. 2010లో బాల సాహిత్య విభాగంలో లిటిల్ డిటెక్టివ్ కథకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. అలాగే ఒడియా నుంచి సాహిత్యరత్న అవార్డుతో పాటు 1965లో ఆకాశ వాణి పురస్కారం, 1960లో జాతీయ పురస్కారం, ఎన్సీఈఆర్టీ అవార్డులు పొందారు. ఆమె తొలి పిల్లల కథ బాడదో గొల్లగొల్ల (కితకితలు) కాగా, పిలోంకా రామాయణ, శిశుసైనిక, మేఘదూత, టికీ రాజా రచనలు ప్రాముఖ్యత పొందాయి. -
స్వర్ణలత ఈ స్థాయికి ఎదగడం చిన్న విషయం కాదు!
చెవులు వినపడవు. ‘పాపం ఈ పిల్లను ఎవరు చేసుకుంటారు?’ కళ్లు కనిపించవు. ‘అయ్యో. ఎలా బతుకుతుంది’ నడవలేదు. ‘జన్మంతా అవస్థే’ దివ్యాంగులపై జాలి, సానుభూతి రోజులు పోయాయి. వాటిని ఉచితంగా పడేస్తే అదే పదివేలు అని మహిళా దివ్యాంగులు అనుకోవడం లేదు. మేము సాధిస్తాం.. మేము జీవిస్తాం... ఈ జగత్తు మాది కూడా అని ముందుకు సాగుతున్నారు. స్వర్ణలత ఒక ఉదాహరణ. మస్క్యులర్ డిజార్డర్ వల్ల వీల్చైర్కు పరిమితమైనా గాయనిగా, రచయితగా, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిగా, మోటివేషనల్ స్పీకర్గా గుర్తింపు పొందింది. ఆమె స్ఫూర్తిదాయక పరిచయం ఇది. జీవితం ఒక్కోసారి అడుగు ముందుకు పడనివ్వదు. మరోసారి శరీరం కదలిక కోల్పోయి ముందుకు అడుగు పడనివ్వదు. కాని జీవితంలో కాని, శరీరం మొరాయించినప్పుడు కాని మొండి పట్టుదలతో ముందుకు సాగితే దారి కనిపిస్తుంది. గమ్యం కనిపిస్తుంది. గమనంలో తోడు నిలిచేవాళ్లుంటారని తెలిసి వస్తుంది. అచలనంలో జీవితానికి సార్థకత లేదని చలనంలోనే పరమార్థం ఉందని అర్థమవుతుంది. దివ్యాంగులు గతంలో న్యూనతతో ఇంటికి పరిమితమయ్యేవారు. నలుగురిలో వచ్చేవారు కాదు. ఇక ఆ దివ్యాంగులు స్త్రీలైతే మానసిక కుంగుబాటుతో ముడుచుకుపోయేవారు. కాని ఆ రోజులు పోయాయి. ‘మనల్ని మనలాగే మన శారీరక పరిమితులతోనే గౌరవించేలా ఈ సమాజంలో మార్పు తేవాలి. ఒకరిపై ఆధారపడకుండా మన జీవితాన్ని జీవించాలి. నలుగురికీ స్ఫూర్తినివ్వాలి’ అని మహిళా దివ్యాంగులు ముందుకు సాగుతున్నారు. జాలి చూపులు, సానుభూతి మాటలు... ఇవి అక్కర్లేదు... ఈ సమాజంలో దివ్యాంగులు ఒక భాగమని గుర్తించి... ఈ జగత్తులో తమ వాటా చోటును మాకు వదిలిపెట్టి... అందరూ తిరుగాడే చోటుల్లో తాము కూడా అడుగుపెట్టేలా సౌకర్యాలు ఉంచితే చాలు అని అంటున్నారు. పెద్ద ఉద్యోగాలు, డాక్టర్ చదువులు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారు. వీల్చైర్కు పరిమితమైనా ఆలోచనలకు రెక్కలు ఇస్తున్నారు. స్వర్ణలత– మల్టిపుల్ స్ల్కెర్లోసిస్ స్వర్ణలత వేదిక మీదకు వస్తే చాలు కరతాళధ్వనులు వినిపిస్తాయి. ఎందుకు? ఆమె మోటివేషనల్ స్పీకర్. ‘చూడండి... నేను వీల్చైర్లో ఉన్నాను. 80 శాతం నా శరీరంలో కదలిక లేదు. మీరు నూరు శాతం కదల వీలైన శరీరంతో ఆరోగ్యంగా ఉన్నారు. నేను నా పరిమిత కదలికల్లోనే సమాజం కోసం ఇంత చేస్తుంటే మీరు ఎంత చేయాలి?’ అని ఆమె ప్రశ్నిస్తే వింటున్నవారు చప్పట్లు కొడుతూ ఇన్స్పైర్ అవుతారు. కాని స్వర్ణలత ఈ స్థాయికి ఎదగడం చిన్న విషయం కాదు. బెంగళూరులో జన్మించిన స్వర్ణలత చిన్నప్పుడు ఆరోగ్యంగా ఉండేది. బాగా చదువుకుందామనుకుంది. కాని దిగువ మధ్యతరగతి కుటుంబం ఆమెను అడుగు పడనివ్వక కంప్యూటర్స్లో డిప్లమా చాల్లే అని ఆపేసింది. ఆ తర్వాత ఆమె ప్రేమించిన కుర్రాణ్ణి పెళ్లి చేసుకుంటే వెలి వేసి ఇంటికి రాకుండా ఆపేసింది. జీవితం ఇలా నిరోధిస్తుంటే పెళ్లయ్యి పాప పుట్టాక 2009లో ఆమెకు హటాత్తుగా మెడ దిగువల పక్షవాతం వచ్చింది. డాక్టర్లు పరీక్షించి దాని పేరు ‘మల్టిపుల్ స్ల్కెర్లోసిస్ అన్నారు. అంటే మెడ కింద వెన్ను ప్రాంతంలో కండరాల ఇబ్బంది వచ్చి శరీరం చచ్చుబడుతుంది. చిన్న పాప, ఏం చేయాలో తోచని భర్త. కాని స్వర్ణలత ధైర్యం చెప్పింది. ‘ఏం కాదు... పోరాడదాం’ అంది. తనకు ధైర్యం రావాలంటే తనలాంటి వారికి మేలు చేయాలని అనుకుంది. తనలాంటి వారిని గుర్తించి వెంటనే మల్టిపుల్ స్ల్కెర్లోసిస్ వచ్చిన తనలాంటి వారిని గుర్తించేలా ‘స్వర్గ ఫౌండేషన్’ స్థాపించింది స్వర్ణలత. కర్నాటక, తమిళనాడుల్లో ఈ వ్యాధితో బాధ పడేవారి గురించి పని చేయసాగింది. వారికి అందాల్సిన వైద్యం, ఉండవలసిన అవగాహన, కుటుంబ సభ్యులు ఎలా చూసుకోవాలి, వీల్చైర్లో ఉంటూనే జీవితంపై ఆశ కలిగి బతికే ఉపాధి ఎలా పొందాలి... ఇలాంటి విషయాలన్నీ ఈ స్వర్గ ఫౌండేషన్ చూస్తుంది. అంతే కాదు పబ్లిక్ ప్లేసులలో దివ్యాంగుల రాకపోకలకు అనువుగా ఉండేలా ర్యాంప్ల నిర్మాణం చేపట్టేలా సమాజాన్ని, పాలనా వ్యవస్థని అని సెన్సిటైజ్ చేస్తుంది. ‘కోయంబత్తూరులో దాదాపుగా అన్ని పబ్లిక్ ప్లేసుల్లో ర్యాంప్లు వచ్చేలా చూశాం. బడి కాని ఆస్పత్రి కాని దివ్యాంగులు సౌకర్యంగా వెళ్లి రావచ్చు’ అంటుంది స్వర్ణలత. కాని దివ్యాంగుల పట్ల సమాజం ఎంతో మారాల్సి ఉంది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, రెస్టరెంట్లు, థియేటర్లు.. ఎన్నో వారి రాకపోకలకు వీలుగా లేవు. ఈ జగత్తు వారిది కూడా. వారు అందరిలానే అన్ని సౌకర్యాలు పొందుతూ జీవించేలా చూసే బాధ్యత మనది కూడా. ఆ విధంగా ఆలోచిద్దాం. ‘సారథి’లాంటి వాహనం స్వర్ణలత తన ఫౌండేషన్ తరఫున చేసిన మరో మంచి పని ‘సారథి’ పేర ఒక వాహనాన్ని తయారు చేయడం. ఇందులో దివ్యాంగులు తమ వీల్చైర్తో చాలా వీలుగా ప్రవేశించవచ్చు. లోపల సోఫా, బెడ్ ఉంటాయి. అంతేకాదు వేడి నీళ్ల బాత్రూమ్, టాయిలెట్ ఉంటాయి. ఇబ్బంది పడకుండా ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు. ‘ఈ సారథిని ఉపయోగించుకుని ఒక దివ్యాంగుడు మూడేళ్ల తర్వాత తన తల్లిని చూడటానికి వెళ్లాడు. ఒక 90 ఏళ్ల ఆమె ఎన్నేళ్లగానో చూడాలనుకున్న పుణ్యక్షేత్రానికి వెళ్లి వచ్చింది. నిజానికి ఇలాంటి వాహనాలు ప్రతి ఊళ్లో ఉండాలి. ప్రభుత్వాలు ప్రవేశ పెట్టాలి. వీటిని ఫీజుతో, పేదలకు తక్కువ చార్జీలతో ఉపయోగించవచ్చు’ అంటుంది స్వర్ణలత. -
మరో విషాదం: ప్రముఖ రచయిత్రి కన్నుమూత..
సాక్షి, చెన్నై(తమిళనాడు): ప్రముఖ రచయిత్రి వాణీ మోహన్ (80) మరణించారు. ఇటీవల చలిజ్వరం బారిన పడిన ఆమె రక్తంలో చక్కెర శాతం పడిపోవడంతో చెన్నైలోని స్వగృహంలో ఆమె మృతి చెందారు. అమెరికాలో ఉన్న ఆమె కుమారుడు ఆదివారం చెన్నై చేరుకోనున్నారని, అంత్యక్రియలు సోమవారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. పదేళ్ల క్రితం కన్నుమూసిన ఆమె భర్త వఠ్యం మోహన్ రైల్వే ఉన్నతాధికారిగా ఉత్తరాది రాష్ట్రాల్లో విధులు నిర్వహించేవారు. ఈ కాలంలో అక్కడి తెలుగువారితోఅనేక కార్యక్రమాలను ఈమె నిర్వహించేవారు. ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు, విశేషాలను భర్తతో కలిసి గ్రంథస్థం చేశా రు. చెన్నై వచ్చాక ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ స్ఫూర్తితో రచయితగా ఎదిగిన వాణీ మోహన్ రాసిన అనేక కథలు, కవితలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి చెన్నై కేంద్రంలో దశాబ్దాలపాటు అనేక అంశాలపై ఆమె ప్రసంగించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన సొసైటీ సభ్యురాలిగా ఆ భవనాన్ని నిర్మింపజేసిన వైఎస్ శాస్త్రి ఏర్పాటు చేసిన అనేక కార్య క్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. కాగా ఆమె మృతికి అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి కార్యదర్శి వై. రామకృష్ణ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. -
రంగనాథ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ అనువాద రచయిత రంగనాథ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ‘ఓం ణమో’ పుస్తకాన్ని ఆయన తెలుగులోకి అనువదించారు. అందుకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఓం ణమోః నవలను కన్నడంలో శాంతినాథ దేసాయి రాశారు. కర్నూలు జిల్లాకు చెందిన రంగనాథ రామచంద్రరావు హైదరాబాద్లో స్థిరపడ్డారు. చదవండి: హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా.. నేను డ్రగ్స్ టెస్టులకు సిద్ధం.. రాహుల్ సిద్ధమా?: కేటీఆర్ -
ప్రముఖ సామాజిక కార్యకర్త మృతి, సీఎం ఠాక్రే సంతాపం
సాక్షి,ముంబై: సామాజిక కార్యకర్త, పరిశోధకురాలు, రచయిత డాక్టర్ గెయిల్ ఓంవేద్(81)కన్నుమూశారు. సుదీర్ఘ అనారోగ్యంతో ఆమె బుధవారం కన్నుమూశారని భర్త, కార్యకర్త భారత్ పటాంకర్ ప్రకటించారు. గెయిల్ అస్తమయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంతాపం తెలిపారు. వివిధ సామాజిక ఉద్యమాలు, జానపద సంప్రదాయాలు, మహిళల హక్కులపై ఆమె చేసిన కృషి మరువలేనివని ఠాక్రే నివాళులర్పించారు. అటు పలువురు దళిత, మహిళా ఉద్యమకారులు, ఇతర సాహితీవేత్తలు కూడా గెయిల్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. చరిత్రకారుడు రామచంద్ర గుహ, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఎన్సిపి అధ్యక్షుడు శరద్ పవార్ కూడా ఆమెకు నివాళులర్పించారు. రాష్ట్రంలో వామపక్ష ఉద్యమానికి ఎంతో సహాయపడ్డారని సీపీఎం నేత అజిత్ అభ్యంకర్ అన్నారు. అమెరికాలో జన్మించిన గెయిల్ అంబేద్కర్-పూలే ఉద్యమంపై పీహెచ్డీ చేసేందుకు ఇండియాకు వచ్చారు. భారతీయ పౌరురాలిగా మారి సామాజిక కార్యకర్త భరత్ పటాంకర్ను పెళ్లి చేసుకున్నారు. దళిత రాజకీయాలు, మహిళా పోరాటాలు, కుల వ్యతిరేక ఉద్యమంపై అనే పుస్తకాలు రచించారు. ముఖ్యంగా శ్రామిక్ ముక్తీ దళ్ ఏర్పాటు, కుల వ్యతిరేక ఉద్యమంలో విశేష పాత్ర పోషించారు. అలాగే పర్యావరణ సమస్యలపైన కూడా రచనలు చేశారు. కాగా 1941, ఆగస్టు 2వ తేదీన అమెరికాలోని మిన్నసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్లో గెయిల్ జన్మించారు. 1963-64 కాలంలో ఇండియాను సందర్శించిన ఆమె దళిత, కుల వ్యతిరేక ఉద్యమాల ఆమె ఆకర్షితురాలయ్యారు. అలా పీహెచ్డీ నిమిత్తం 1970-71లో ఇండియాకు వచ్చారు. 1976లో భరత్ పటాంకర్ను ఆమె పెళ్లి చేసుకున్నారు. 1983లో భారతీయ పౌరసత్వం సాధించారు. అప్పటినుంచి సతారా జిల్లాలోని కాసేగావ్లో నివాసముంటున్నారు. భర్తతో గెయిల్ (ఫైల్ ఫోటో) భర్తతో కలిసి శ్రామిక్ ముక్తి దళ్ను స్థాపించి అక్కడి మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల ప్రజల అభివృద్ధి, కొంకణ్ ప్రాంతంలో నీటి హక్కుల కోసం సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అలాగే సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం, నార్డిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీల బోర్డ్లో సభ్యురాలిగా ఉన్నారు. ఇటీవలి సంవత్సరాలలో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో వివిధ సమస్యలపై సలహాదారుగా కూడా గెయిల్ పనిచేయడం విశేషం. -
తాలిబన్ల అరాచకాలు: ‘10 ఏళ్లు పురుషుడి వేషంలో’
సాక్షి, వెబ్డెస్క్: అఫ్గనిస్తాన్ మరోసారి తాలిబన్ల వశం అయ్యింది. వారి అరాచక పాలనను తలుచుకుని జనాలు భయంతో బెంబేలెత్తుతున్నారు. వారి రాక్షస పాలనలో మేం బతకలేం అంటూ విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అఫ్గన్ మహిళల మనోవేదన గురించి ఎంత చెప్పినా తక్కువే. తాలిబన్ల దృష్టిలో స్త్రీ అంటే కేవలం శృంగారానికి పనికివచ్చే ఓ వస్తువు. వారికంటూ ఎలాంటి ఆలోచనలు, ఆశయాలు ఉండకూడదు. కఠినమైన షరియా చట్టాలు అమలు చేస్తారు. ‘మా గురించి ఎవరు ఆలోచించడం లేదంటూ’ ఓ అఫ్గన్ యువతి కంటతడిపెట్టుకున్న వీడియో ప్రపంచాన్ని కదిలించింది. అఫ్గన్లో తాలిబన్ల రాజ్యం ప్రారంభం కావడంతో ఓ రచయితకు సంబంధించిన స్టోరీ మరోసారి తెర మీదకు వచ్చింది. ఆ రాక్షసమూక అకృత్యాలకు భయపడి.. విదేశాల్లో శరణార్థిగా బతుకుతున్న ఆ రచయిత్రి తాను అనుభవించిన నరకాన్ని వివరించారు. ఆ వివరాలు.. రచయిత నదియా గులామ్ ప్రస్తుతం స్పెయిన్లోని కాటలోనియాలోఅఫ్గన్ శరణార్థిగా ఉంటున్నారు. ఇక రెండు దశాబ్దాల క్రితం తాలిబన్ల అరాచకాల నుంచి తప్పించుకోవడం కోసం పురుషుడిగా మారువేషం వేసుకుని కాలం వెళ్లదీశారు. ఇక ఆమె జీవితం కూడా అనేక అఫ్గన్ మహిళల మాదిరే దారుణమైన అంతర్యుద్ధం, ఆకలి, తాలిబన్ పాలన పర్యవసానాలకు గుర్తుగా మిగిలిపోయింది. 1985లో జన్మించిన నదియా తాలిబన్ల నుంచి తనను తాను కాపాడుకోవడమే కాకా.. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం దాదాపు 10 ఏళ్ల పాటు పురుషుడిగా మారువేషం వేసుకుని తిరిగింది. ఈ క్రమంలో ఓసారి జరిగిన పేలుళ్లలో నదియా తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో ఓ ఎన్జీఓ నదియాను చేరదీసి.. చికిత్స చేసింది. ఈరోజు ఆమె జీవించి ఉండటానికి కారణం ఆ ఎన్జీవో అంటుంది నదియా. ఆ ఎన్జీవో సాయంతో నదియా అఫ్గన్ విడిచి వెళ్లింది. కానీ ఆమె కుటుంబం మాత్రం అక్కడే ఉండిపోయింది. ఆమె అఫ్గన్ శరణార్థిగా కాటలోనియాలో స్థిరపడిన తర్వాత నదియా తన కథను ప్రపంచానికి తెలియజేయాలనుకుంది. ఈ క్రమంలో ఆమె "ది సీక్రెట్ ఆఫ్ మై టర్బన్" నవలని రాసింది. జర్నలిస్ట్ ఆగ్నెస్ రోట్జర్ సహకారంతో ఆమె ఈ నవలను పూర్తి చేసింది. ఇక నజియా రాసిన నవలకు 2010 ప్రతిష్టాత్మక ప్రుడెన్సీ బెర్ట్రానా ను గెలుచుకోవడమే కాక జాతీయ విమర్శకుల ప్రశంసలను పొందింది. తాలిబన్లు అఫ్గనిస్తాన్ను విడిచిపెట్టలేదని నదియా చాలా కాలం నుంచి హెచ్చిరిస్తూనే ఉన్నారు. అంతేకాక అమెరికా శాంతి అనే "అబద్ధం" చిత్రాన్ని విక్రయించింది అన్నారు నదియా. అంతేకక అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇతర అంతర్జాతీయ శక్తుల వైఖరి అఫ్గనిస్తాన్కు "ద్రోహం కంటే ఎక్కువ కీడు" చేశాయని నదియా ఆరోపించారు. ఈ దేశాలు అఫ్గన్ ప్రజలను ఆయుధాలుగా మార్చారు.. అవినీతితో గుర్తించబడిన ప్రభుత్వాలను ప్రోత్సహించారు.. ఇప్పుడు దేశాన్ని వదిలి వెళ్లారు అని మండిపడ్డారు. ప్రస్తుతం అఫ్గన్లో పరిస్థితి చేయి దాటిపోయిందన్నారు. అఫ్గనిస్తాన్లోని బడోలా ప్రాంతంలో 35 మంది బాలికలు పాఠశాలకు వెళ్లి చదవడానికి సహాయపడే బ్రిడ్జిస్ ఫర్ పీస్ అసోసియేషన్కు నదియా నాయకత్వం వహిస్తున్నారు. -
తెలుగు–తమిళ భీష్మాచార్యుడు
‘‘ఆంధ్రదేశంలో తెలుగు వాళ్లు తమిళనాడుకు వలస పోవడానికి ఎన్నో రాజకీయ, సాంఘిక, మత కారణాలు కలవు. అందులో తురక రాజులు రాజ్యాంగం చేసేట ప్పుడు మన ఆడవాళ్లపై కన్ను పడి ఆశపడే కారణం చేత ఆ రాజుల చేతులో పడి మానాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడక దక్షిణం దిక్కుకు పయనమై వచ్చేస్తిరి. ఆంధ్రదేశం నుండి అలా వచ్చేట ప్పుడు మావాళ్ల అనుభవాలు, పడిన కష్టాలు, మా ముత్తాత, అవ్వ, తాతలు వారి బిడ్డలకు, మనవళ్లు, మనవరాళ్లకు కథలు కథలుగా చెప్పేవారు. ఇట్ట ఆది నుంచి వచ్చిన కథలు మా అవ్వ నాకు చిన్నప్పుడు చెప్పేది. అట్టా ఆ కథను మళ్లీ మళ్లీ ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు. ఉత్తరాన్నుంచి ఎనిమిది వందల ఏళ్ల క్రిందట వలస వచ్చి ఇక్కడ అడవులను నరికి నేలను సాగులోనికి తెచ్చిన మా పెద్దల కథే గోపల్లె’’ అంటూ తమిళ సాహితీ లోకంలో ‘కీరా’ గా సుప్రసిద్ధులైన కీ.రాజనారాయణన్ తమ తెలుగు జాతి మూలాలను గూర్చి ‘గోపల్లె’ నవలకు సంతరించిన ముందుమాటలో విశదం చేశారు. కీ. రా. పూర్తి పేరు రాయంకుల కృష్ణరాజు నారా యణ పెరుమాళ్ రామానుజ నాయకర్. ఎనిమిది శతాబ్దాల క్రిందట ఉత్తరాన ఉన్న ఆంధ్రప్రాంతం నుంచి తమిళనాడు పాండ్య మండలం (కరిచల్కాడు: నల్లరేగడి నేల)కు వలస వెళ్లిన కుటుంబానికి చెందిన వారు. వీరు తూత్తుకూడి జిల్లా కోవిల్పట్టి మండలం, ఇడై చేవల్ గ్రామంలో 1923 సెప్టెంబర్ 16న శ్రీకృష్ణ రామానుజం, లక్ష్మీ అమ్మ దంపతులకు జన్మించారు. 1965 నుంచి రచనా వ్యాసంగం ప్రారంభించి 1976లో ‘గోపల్లె గ్రామం’, దానికి కొనసాగింపుగా ‘గోపల్లె పురత్తు మక్కళ్’ పేరిట రెండో నవలను వెలువరించారు. నాటి గోపల్లె శతాబ్దాల కాలంలో పరిణామం చెందుతూ స్వాతంత్య్రోద్యమ కాలం నాటికి రూపుదిద్దుకున్న విధం ‘గోపల్లె పురత్తు మక్కళ్’ వివరిస్తుంది. దీనికి 1991లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. వర్షం లేక ఎండిన నేలతల్లి కథలను అక్షరీకరిం చడంలో కీరా సిద్ధహస్తుడు. వీరివి ఏడు కథాసంపు టాలు, నాలుగు నవలలు, మూడు వ్యాస సంకల నాలు అచ్చయినాయి. 1982లో వీరు తమిళ మాండ లిక పద నిఘంటువును రూపొందించారు. 1984లో ఆయన ‘‘కరిసై కథైగళ్’’ సంపుటానికి సంపాదకునిగా వ్యవ హరించారు. తమిళనాడు టెక్స్›్టబుక్ కార్పొరేషన్ (టీఎన్టీబీ) దీన్ని ఆంగ్లంలోకి అనువ దింపజేసి హార్పర్ కోల్లిన్స్ వారిచే ముద్రింపజేసింది. ఆ పుస్తకం మార్చి 2021లో వెలుగుచూసింది. ‘గోపల్లె’లో కథా సంవిధానం పఠితకు విశ్రాం తిని కలిగిస్తుంది. విషాదంలో అద్భుత మాయావాద రసం రంగరించి ‘గోపల్లె’ నవలను తీర్చిదిద్దారు. భారతీయ సంస్కృతి, వైదిక విజ్ఞానం, భారతీయ ఆత్మ ఆవిష్కరణ నవల అంతటా పరుచుకొని ఉంటుంది. కథలో అతీతం, వర్తమానం కలిసి నడుస్తూ ఉంటాయి. పాశ్చాత్య సాహితీ విమర్శకులు చెప్పిన ‘మాజికల్ రియలిజం’, మహాభారతంలో వేదవ్యాసుడు ఆవిష్కరించిన అద్భుత రసావిష్కరణ ‘గోపల్లె’లో ఆవిష్కరించటం విశేషం. ‘గోపల్లె’ గ్రామం నవలను నంద్యాల నారాయణ రెడ్డి, ‘గోపల్లె పురత్తు మక్కళ్’ను ఆచార్య శ్రీపాద జయప్రకాశ్ తెలుగులోకి అనువదించారు. 1989లో పాండిచ్చేరి విశ్వవిద్యా లయం తమ ఫోక్ టేల్స్ డాక్యుమెంటేషన్ అండ్ సర్వే సెంటర్ శాఖకు కీరాను డైరెక్టర్గా నియమించి గౌరవించింది. ‘గోపల్లె’ నవలకు శరీరం తమిళమైతే ఆత్మ తెలుగు అన్నారాయన. ‘తెలుగు రాతల్ని (అక్షరాల్ని) చేత్తో తాకితే చాలుబా, అదే నిండా భాగ్యం’ అనే నిండైన తెలుగు భాషాభిమాని. ‘నాయన’, ‘భీష్మా చార్య’ అని తమిళులు ఆప్యాయంగా పిలుచుకున్న రాజనారాయణన్ ఈ మే 17న కన్నుమూశారు. ఆ సాహితీ మూర్తికి ఇదే అశ్రునివాళి. వ్యాసకర్త ప్రముఖ సాహితీవేత్త. డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి మొబైల్: 90787 43851 -
ఐసీయూలో సినీ రచయిత, కేటీఆర్ సాయం!
సాక్షి, హైదరాబాద్: సినీ గేయ రయిత కందికొండ గిరి ఇటీవలే అనారోగ్యానికి గురయ్యాడు. గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం హైదరాబాద్లోని ప్రముఖ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆయన ఒక్కరోజు వైద్యానికే రూ.70 వేలకు పైగా ఖర్చవుతోందట. అతడి ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో కుటుంబ సభ్యులు సాయం కోసం చూస్తున్నారట. ఈ విషయం తెలిసిన కేటీఆర్ ఆయనకు సాయం అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కాగా కందికొండ గిరి బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారక్క పండగల మీద ఎన్నో జానపద పాటలు రాశాడు. దేశముదురు, పోకిరి, ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో వెయ్యికి పైచిలుకు పాటలు రచించాడు. చదవండి: అదంతా మనం చూసే సంస్కారంలో ఉంది: సిరివెన్నెల -
హెచ్ఎంగా పని చేసిన రచయిత మృతి
సాక్షి, చెన్నై: ప్రముఖ రచయిత డాక్టర్ గంగరాజు మోహనరావు(85) శనివారం మృతిచెందారు. ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా, నగరి మండలం, క్షూరికాపురం. పులిచర్ల మండలం, పాకాల ప్రాథమిక పాఠశాల్లో ప్రధానోపాధ్యాయుడిగా పని చేశారు. ప్రస్తుతం చెన్నై తిరునిండ్రవూరు సమీపంలోని ఆవడి పరుత్తిపట్టులో నివసిస్తున్నారు. అలివేలుమంగ శతకం, శ్రీనివాస శతకం, షిర్డీ సాయి శతకం, చందమామ (బాలగేయాలు), గంగరాజు నానీలు, హైకూలు వంటి పలు పుస్తకాలు రాశారు. 1936 నబంబర్ 5న జన్మించిన గంగరాజు మోహనరావు తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. వీరి రచనలను ఆంధ్రప్రభ, విజ్ఞానసుధ, ప్రియదత్త, రమ్యభారతి, సాహితీ కిరణం, బాలమిత్ర, బుజ్జాయి వంటి పలు పత్రికలు ప్రచురించాయి. ఆయన సాహితీ సేవలను గుర్తించిన చెన్నైలోని వేదవిజ్ఞాన వేదిక ఆయన్ను సత్కరించింది. అలాగే మద్రాసు తెలుగు అభ్యుదయ సమాజం, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ, అనేక తెలుగు సంఘాలు సత్కరించాయి. తెలుగుభాషకు, సాహిత్యానికి చేసిన కృషికి 2020 ఫిబ్రవరిలో మైసూరు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థ గౌరవ డాక్టరేట్తో చెన్నైలో సత్కరించింది. ఈయన రాసిన కామాక్షి శతకం చివరిది. చెన్నైలోని పలు తెలుగు సంఘాల ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. చదవండి: Ardha Shathabdam: ఆకట్టుకుంటున్న ‘మెరిసేలే మెరిసేలే’ సాంగ్ -
సమాజం లెక్క తేల్చిన కథల మేష్టారు
ఆయన వృత్తిరీత్యా లెక్కల మాష్టారు. కాని సమాజంలో ప్రతిదానికీ ఒక లెక్క ఉంటుందని, ఒక లెక్కను పెద్దవాళ్లు కలిసి నిర్ణయిస్తారని, ఆ పెద్దవాళ్లకు రెండు రెళ్లు ఆరనీ, కింద వాళ్లకు శేషం సున్నా అనీ ఆయన స్కూల్లో పిల్లలకు కాకుండా కథల్లో పాఠకులకు చెప్పారు. మనుషులు ఈసురోమని ఉంటే అందుకు కారణం ఆ సదరు మనుషులు కారని వెనుక ఎక్కడో ఉండే మనుషులని ఆయన చెప్తారు. తెలుగు కథను ఉన్నతీకరించిన కాళీపట్నం రామారావు 97వ ఏట జీవించి అస్తమించారు. ఆయన రచనలు, ఆయన రచనా పరిశ్రమ ప్రతి తెలుగు ‘ఫ్యామిలీ’కి తెలిసి ఉండాలి. పోస్ట్మేన్ ఇంటికి ఉత్తరాలు తెచ్చి ఇస్తాడు. పోలీసు ఇంటికి రక్షణ కల్పిస్తాడు. ఇంజినీరు ఇల్లు కడతాడు. ప్రభుత్వ అధికారి ఇల్లు నడవడానికి అవసరమైన సంఘపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తాడు. వీరంతా సమాజంతో ఉంటూ సమాజం కోసం పని చేస్తూ సమాజంలో భాగంగా ఉంటారు. కాని ఈ సమాజం ఎలా ఉందో ఎవరు చెప్తారు? కథకుడే చెప్తాడు. సమాజాన్ని చూసి సమాజానికి దానిని తిరిగి చూపిస్తాడు కథకుడు. సమాజం ఎలా ఉందో రాసేవాణ్ణి రచయిత అనొచ్చు. అలా ఎందుకు ఉందో రాసేవాణ్ణి మంచి రచయిత అనొచ్చు. అలా ఉండకుండా ఏమి చేయవచ్చో రాసి పాఠకులను ఆలోచనాశీలురుగా, కర్తవ్యోన్ముఖులుగా చేసే రచయితను గొప్ప రచయిత అనొచ్చు. కాళీపట్నం రామారావు అలాంటి గొప్ప రచయిత. మనం ఏం చేయాలో ముందు నిర్ణయించుకోవడం అందుకు తగ్గట్టుగా జీవితాన్ని నిర్మించుకోవడం అందరూ చేయరు. కాళీపట్నం రామారావు తన వివాహం అయ్యాక, 1947 నాటి కాలంలోనే 80 రూపాయల జీతం వచ్చే స్పోర్ట్స్ డిపోలోని ఉద్యోగానికి రాజీనామా చేశారు. కారణం అది కథలు రాసుకోవడానికి అవసరమైన టైమ్ ఇవ్వదని. 30 రూపాయల జీతం వచ్చే ప్రభుత్వ ఉపాధ్యాయుడి జీతం ఎంచుకున్నాడాయన. తెలుగు కథ తనకు అవసరమై ఆయన జీవితాన్ని రూపుదిద్దుకుందా అనిపిస్తుంది. 1979లో ఆయన రిటైరయ్యారు. అది కూడా కథ చేసుకున్న ఒక ఏర్పాటే. ఎందుకంటే ఆ తర్వాతి సమయమంతా ఆయన తెలుగు కథకే ఇచ్చారు. దాదాపు 30–35 ఏళ్లు తెలుగు కథ ప్రచారానికి, సేకరణకి, భద్రపరచడానికి వెచ్చించారు. దేని నుంచి పొందామో దానికే తిరిగి ఇవ్వడం చేసిన అరుదైన రచయిత కాళీపట్నం రామారావు. శ్రీకాకుళం చైతన్యధార ప్రపంచంలో గొప్ప రచయితలందరూ జీవితంలో రకరకాల పనులు చేసినవారే. శ్రీకాకుళం జిల్లా మురపాక ప్రాంతానికి చెందిన కాళీపట్నం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కుదురుకునేంత వరకూ రకరకాల పనులు చేశారు. టైపిస్ట్గా, డిస్ట్రిక్ట్ కోర్టులో చిరుద్యోగిగా, రేషనింగ్ ఆఫీసులో ఎంక్వయిరీ ఆఫీసరుగా ఇలా రకరకాల పనులు చేశారు. పత్రికల్లో పని చేయాలని ఆయనకు గట్టిగా ఉండేది. మద్రాసు (చెన్నై) వెళ్లి ప్రయత్నించినా జరగలేదు. సాహిత్యం పట్ల ఏర్పడిన ఆసక్తి ఆయనను కథకుడిగా ఉండమని కోరింది. 1943లో ఆయన మొదటి కథ ‘ప్లాట్ఫారమో?’ అచ్చయ్యింది. ఆ తర్వాత ఆయన కొన్ని కథలు రాసినా ఇవి కాదు కదా రాయాల్సింది అని అనిపించింది. ఆలోచన కలిగించనిది కథ ఎలా అవుతుంది అని ఆయన అనుకున్నారు. పాఠకులకు ఆలోచన కలిగించాలంటే రచయితకు చదువు, అవగాహన, జ్ఞానం, హేతువు, సైద్ధాంతిక భూమిక, ప్రాపంచిక దృక్పథం ఇవన్నీ ఉండాలి కదా అని అధ్యయనంలో పడ్డారు. 1955 నుంచి దాదాపు ఎనిమిదేళ్లు కథలు రాయకుండా పూర్తిగా అధ్యయనంలో ఉండిపోయారు. 1964లో ‘తీర్పు’ కథతో అసలైన కాళీపట్నం రామారావు తెలుగు పాఠకలోకానికి తెలిశారు. 1966లో ఆయన రాసిన ‘యజ్ఞం’ కథ తెలుగు సాహిత్యానికి చూపు, ఊపు ఇచ్చింది. ‘కథ ఎందుకు?’, ‘కథ ప్రయోజనం ఏమి?’, ‘కథ నడిచే మార్గం ఎలా ఉండాలి’ ఈ ప్రశ్నలన్నింటికి ఆ కథ ఒక మార్గదర్శిగా నిలిచింది. సామాజిక సమస్యలు, అంతర్గత ఆరాటాలు శరీరం మీద పీడన మనసు మీద పడుతుంది. మనసు పడే వొత్తిడి శరీరానికి హాని కలిగిస్తుంది. వ్యవస్థ గతి వ్యవస్థది మాత్రమే కాదు. ఆ గతిలో సమాజంలోని ప్రతి పౌరుడు భాగం. ఆ గతి మతి తప్పితే ఆ పౌరుడు బాధితుడవుతాడు. ఆ పౌరుడే ఇంటికొస్తే వ్యక్తిగా మారి అంటే తండ్రిగా, భర్తగా, కుమారుడిగా వొత్తిడి ఎదుర్కొంటాడు. ఈ రెంటినీ కాళీపట్నం రామారావు కథగా చేసి తెలుగు పాఠకులకు చూపారు. గుప్పిట విప్పేసినట్టుగా రాయడం ఆయన పద్ధతి కాదు. సూచించినట్టుగా పొరల చాటున దాచినట్టుగా ఆయన పరమసత్యాన్ని నిగూఢపరిచి దానిని తానే కనుగొన్న సంతృప్తిని పాఠకునికి ఇస్తారు. పౌరహితం కోరుతున్నట్టు కనిపించే ఈ సామాజిక వ్యవస్థ నిజానికి మేడిపండు. ఇది పైకి మంచిగా కనిపిస్తూ లోపల పీడితుల రక్తాన్ని తాగుతూ ఉంటుందని ఆయన రాసిన ‘యజ్ఞం’ కథ నాటి సామాజిక, ఆర్థిక మూలాల కఠినత్వాన్ని చూపింది. ఈ కథ ముగింపులో నిస్సహాయుని ఆగ్రహ ప్రకటనగా బాధితుడు తన ఇంటి పిల్లాడి తల నరకడాన్ని రచయిత చూపిస్తాడు. నేటికీ అదే జరుగుతోంది.. బలవంతుడైన పీడకునితో పోరాటానికి దిగితే మనకు ఆపద ఎదురవుతుంది. అప్పుడు మనవాళ్లే వచ్చి మన చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఆ పోరాటం నుంచి విరమింప చేస్తారు. అయితే పోరాటం వొద్దనా? కాదు ఒకరూ ఒకరూ ఒకరూ కాక అందరు కలిసినప్పుడు బలవంతుడు తోక ముడుస్తాడన్న సూచన ఉంది అందులో. ఆ భాష, ఆ సొగసు కాళీపట్నం రామారావు కేవలం ప్రగతిశీల కథ రాసి ఉంటే ఇంత ఖ్యాతి వచ్చి ఉండేది కాదు. ఆయన తాను పుట్టి పెరిగిన శ్రీకాకుళం మీద తన కథలను నిలబెట్టి ఆ స్థానికతే విశ్వజనీయత అనే భావనతో కథలు చెప్పారు. శ్రీకాకుళపు భాషను ఆయన సొగసుగా సంభాషణల్లో దించారు. ముఖ్యం శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రికి మల్లే ఆయన కూడా స్త్రీల పాత్రలకు ఎంతో సజీవమైన సంభాషణలను సమకూర్చారు. ‘నో రూమ్’, ‘ఆర్తి’, ‘చావు’, ‘జీవధార’, ‘భయం’... ఈ కథలన్నీ ఇందుకు ఉదాహరణ. ‘జీవధార’ కథలో పైకి నీటి సమస్య వస్తువుగా కనపడుతుంది. మురికివాడ వాసులకు తాగునీళ్లు ఉండవు. దాపులో ఒక శ్రీమంతుల ఇంటిలో కావల్సినన్ని నీళ్లు. మురికివాడ ఆడవాళ్లు రోజు ఆ శ్రీమంతుల గేటు దగ్గరకు వచ్చి నీళ్లు అడుగుతూ ఉంటారు. ఆ శ్రీమంతులు చీదరించుకుంటూ ఉంటారు. చీదరించుకుంటూ ఉంటే ఆ ఆడవాళ్లు కొన్నాళ్లు పడతారు... మరి కొన్నాళ్లు సహిస్తారు... దప్పికతో ప్రాణం పోతుంటే ఏం చేస్తారు? తిరగబడతారు. అంతమంది తిరగబడితే ఆ శ్రీమంతులు నీళ్లేం ఖర్మ ఏమైనా ఇచ్చి తోక ముడవరూ? బాధితులందరూ కలిసి తిరగబడాలి... పీడితులందరూ కలిసి తిరగబడాలి... మైనార్టీ సమూహాలు అన్నీ కలిసి తిరగబడాలి... అని రచయిత సూచన. ఏదీ ఊరికే రాదు. ‘సాధించుకోవాలి’ ఈ వ్యవస్థ నుంచి. సాధించుకోవడం మెత్తగా సాధ్యం కాదు ఎప్పటికీ. దీపధారి కాళీపట్నం రామారావు ‘విరసం’ (విప్లవ రచయితల సంఘం) ఏర్పడినప్పటి నుంచి దాదాపు 15 ఏళ్లు అందులో క్రియాశీల సభ్యులుగా ఉన్నారు. రావిశాస్త్రి, వరవరరావు, కె.వి.రమణారెడ్డి వంటి ఉద్దండులతో ఆయన కలిసి పని చేశారు. తెలుగునాట విప్లవ కథ విస్తృతం కావడంలో అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి వంటి రచయితలు సిద్ధం కావడానికి మరోవైపు మధ్యతరగతి కథను ముందుకు తీసుకెళ్లడంలో వివిన మూర్తి, కవనశర్మ తదితరులు ముందంజ వేయడానికి కాళీపట్నం రామారావు స్ఫూర్తిగా నిలిచారు. ఆయనకు ‘సాహిత్య అకాడెమీ’ వచ్చినా తిరస్కరించారు. కొత్త కథకులను సిద్ధం చేసేందుకు ఊరూరు తిరిగి వర్క్షాపులు పెట్టారు. కథామెళకువలు చెప్పే వ్యాసాలు రాసి పుస్తకాలు వెలువరించారు. ఈ సమయంలోనే ఆయన ‘కథల మేష్టారు’గా గౌరవం పొందసాగారు. కథానిలయం 1996 ప్రాంతంలో నిజానికి ఎవరైనా సరే విశ్రాంత జీవనం కోరుకునే వయసులో ఆయన ‘కథానిలయం’ అనే బృహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఈ ఆలోచన చెప్పినప్పుడు ముందు హేళన, ఆ తర్వాత సంశయం, ఆ తర్వాత అంగీకారం పొందారు. తెలుగులో వచ్చిన కథలన్నీ ఒక్కచోట చేరాలి అని ఆయన చేసిన ఆలోచన ఇవాళ తెలుగువారికి ఒక విలువైన భాండాగారాన్ని సిద్ధం చేసింది. శ్రీకాకుళంలో ఆయన రెండస్తుల ‘కథా నిలయం’ కట్టడానికి కథాభిమానులు తలా ఒక ఇటుక ఇచ్చారు. ఇందుకోసమై హైదరాబాద్ రవీంద్రభారతిలో పెద్ద కార్యక్రమం చేసి కాళీపట్నంకు ‘లక్ష రూపాయల’ పర్స్ అందజేశారు. తెలుగులో వచ్చిన వీక్లీలు, మంత్లీలు, కథాసంకలనాలు, వాటితో పాటు రచయితల డేటా, వారు రాసిన కథల పట్టిక ఇవన్నీ చాలా పెద్ద పని. కాళీపట్నం తన భుజాల మీద వేసుకు చేశారు. ఆ తర్వాత ఆ ఆలోచన ఆ మొత్తం కథలను డిజిటలైజ్ చేయడం వైపు మళ్లింది. ఇవాళ ‘కథానిలయం’ వెబ్సైట్లో వేలాది కథలు డిజిటలైజ్ అయి ఉన్నాయి. విద్యార్థులకు, అధ్యయనం చేయాలనుకునేవారికి ఆ సైట్ ఒక అతి పెద్దసోర్స్. ఏనాటి కథలో, కథకులో తెలుసుకోవాలంటే ఆ సైట్కు వెళ్లక తప్పదు. మరో భాషకు ఇలాంటి సైట్ ఏమాత్రం లేదు. ఇది తెలుగువారి ఘనత. ఇందుకు కారకులు కాళీపట్నం. నిరంతర అధ్యయన శీలి కాళీపట్నం రామారావు నిరంతర అధ్యయనంలోనే ఉన్నారు. 96 ఏళ్లు వచ్చినా కన్ను కనిపించినంత సేపు చదవడానికే ఇష్టపడ్డారు. శ్రీకాకుళంలో కాళీపట్నం రామారావు తమ కథను చదివి మెచ్చుకుంటే అదే పెద్ద అవార్డుగా యువ కథకులు భావిస్తారు. ఆయన నిరంతరం కొత్త కథకులను ప్రోత్సహిస్తూనే వచ్చారు. 2006లో రాసిన ‘అన్నెమ్మ నాయురాలు’ ఆయన చివరి కథ. తెలుగు కథ పయనంలో కాళీపట్నం అస్తమయం వల్ల ఒక శకం ముగిసింది. అలాంటి రచయిత, కథా కార్యకర్త మరొకరు సిద్ధం కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. తెలుగు కథ ఉన్నంత వరకూ తప్పక కాళీపట్నం ప్రస్తావన, శ్రీకాకుళం ఉనికి ఉంటూనే ఉంటుంది. ఆ మహా కథకునికి నివాళి. కమిటెడ్ రైటర్ కాళీపట్నం రామారావును నిబద్ధ రచయితగా చెబుతారు. నిబద్ధతకు ఒక ఉదాహరణగా చూపుతారు. తన చేతిలో ఉన్న కథను, అక్షరాన్ని దేనికి నిబద్ధం చేయాలో ఎంత మేరకు చేయాలో ఆయన్ను చూసి నేర్చుకోవాలని అంటారు. కనపడిందంతా, తోచిందంతా రాయడం కాళీపట్నం ఏనాడూ చేయలేదు. పొద్దుపోక రాయడం చేయలేదు. కాలక్షేపం కోసం రాయడాన్ని అసలు చేయలేదు. ఒక సత్యాన్ని కనుగొని ఆ సత్యానికి అవసరమైన కథను, పాత్రలను ఎంచుకుని, ఒక ప్రయోజనాన్ని ప్రతిపాదించి, ఒక చూపును ఇవ్వగలిగే కథ రాయగలిగినప్పుడే రాశారు. అందుకే ఆయన ముఖ్యమైన కథలు ఒక డజనుకు మించవు. అయినా సరే అవి వంద కథలకు సమానమైన ఖ్యాతి పొందాయి. – సాక్షి ఫ్యామిలీ -
కారా మాస్టారు కన్నుమూత
-
కారా మాస్టారు కన్నుమూత: సీఎం జగన్ సంతాపం
సాక్షి, శ్రీకాకుళం: కారా మాస్టారుగా ప్రసిద్ధి పొందిన ప్రముఖ రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. కథానిలయం వ్యవస్థాపకులు, కేంద్రసాహిత్య అవార్డు గ్రహీత శ్రీకాకుళంలోని స్వగృహంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు సాహితీలోకం తీవ్ర దిగ్ర్భాంతిలో మునిగిపోయింది. కథా సాహిత్యానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొంటూ రచయితలు, కవులు, కళాకారులు నివాళులర్పించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదంటూ పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కథకు చిరునామాగా, 'కథానిలయం' పేరుతో భావి తరాల కోసం సాహితీ సంపదను కాపాడిన సాహితీ మూర్తి కారా మాస్టారు అంటూ కొనియాడారు. 1924లో శ్రీకాకుళం జిల్లా మురపాకలో జన్మించారు కాళీపట్నం రామారావు. తన దైన శైలిలో రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన ఆయన వేలాది మంది శిష్యులు, అభిమానులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా 1964లో రాసిన యజ్ఞం కథ ఆయన విశేష ఖ్యాతిని తీసుకొచ్చింది. కథా రచయితగా తెలుగు రచనల ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత ఆయనది. ఫ్యూడల్ వ్యవస్థలోని దోపిడికి ‘యజ్ఞం’ అద్దంపడుతుంది. అందుకే ఈ రచన రష్యాలో అనువదింపబడి ప్రపంచ గుర్తింపు పొందింది. భావితరాలను దృష్టిపెట్టుకుని ఫిబ్రవరి 22, 1997లో శ్రీకాకుళంలో కథానిలయం స్థాపించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ద్వారా సమకూరిన డబ్బు, మరికొందరు సాహితీవేత్తల సహకారంతో 800 కథల పుస్తకాలతో ఆరంభమైన ఈ కథా నిలయం లక్ష పుస్తకాలతో అలరారుతుండటం విశేషం. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఆయన సరళమైన రచన శైలితో వేలాది అభిమానులను ఆకట్టుకున్నారు. కుట్ర, రాగమయి, జీవధార, కారా కథలు, రుతుపవనాలు వంటి ఆయన రచనలూ ఆదరణ పొందాయి. సీఎం జగన్ సంతాపం సాహిత్య అకాడమీ గ్రహీత, కారా మాస్టారుగా పేరొందిన కాళీపట్నం రామారావు మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. చిన్న కథలతో, తనదైన కథా శైలితో ఆకట్టుకున్న ఉత్తరాంధ్రలోని సాహిత్యకారుల్లో ఆయన ప్రముఖుడని సీఎం గుర్తు చేశారు. కారా మాస్టారు కుటుంబ సభ్యులకు సీఎం వైఎస్ జగన్ తన సంతాపాన్ని తెలియజేశారు. -
Tripuraneni Gopichand: ఆయన ఎవ్వరినీ నొప్పించేవారు కాదు..
త్రిపురనేని గోపీచంద్.. లక్ష్మమ్మ, పేరంటాలు, ప్రియురాలు చిత్రాలకు దర్శకత్వం వహించారు... పలు చిత్రాలకు సంభాషణలు రచించారు.. అసమర్థుని జీవయాత్ర, పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా... వంటి నవలల ద్వారా సాహితీ లోకానికి సుపరిచితులు... త్రిపురనేని రామస్వామి కుమారుడిగా కాకుండా... త్రిపురనేని గోపీచంద్గా ప్రసిద్ధులయ్యారు.. తండ్రిగా పిల్లలతో ఎలా ఉండేవారో వారి రెండో కుమార్తె రజని సాక్షికి వివరించారు.. నాన్నగారు 1910, సెప్టెంబరు 8 వినాయక చవితి రోజున చౌటుపల్లిలో పుట్టారు. త్రిపురనేని రామస్వామి, పున్నమాంబలు తల్లిదండ్రులు. నాన్నగారికి ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. తాతగారు విప్లవ రచయిత, నాన్నగారు అభ్యుదయ రచయిత. ఇంకా చెప్పాలంటే నాన్నగారి రచనలలో మనోవిశ్లేషణ ఎక్కువగా ఉంటుంది. నాన్నగారి 22వ ఏట శకుంతలాదేవితో వివాహమైంది. అమ్మ ఉన్నవ లక్ష్మీ నారాయణ పంతులు గారి ‘శారదా నికేతనం’లో.. తెలుగులో విద్వాన్ , హిందీలో విశారద చదువుకున్నారు. అమ్మను బాగా చదువుకున్నవారికి ఇవ్వాలనుకున్నారు. అందువల్ల నాన్నగారి చదువు చూసి వివాహం నిశ్చయించారు. నాన్నగారు చాలా ఇష్టపడి ఈ వివాహం చేసుకున్నారు. ఇద్దరిదీ ఇంటలెక్చువల్ కంపానియన్ షిప్. అనుకూలమైన దాంపత్యం. నాన్నగారు అమ్మకు ఇంగ్లీషు పాఠాలు చెప్పారు. అమ్మనాన్నలకు మేం ఆరుగురం పిల్లలం. ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. ప్రమీలా దేవి, రమేశ్బాబు, రజని (నేను), రామ్గోపాల్, నళిని, సాయిచంద్ (సినిమా నటుడు). మా చదువుల గురించి బాగా శ్రద్ధ తీసుకున్నారు. పెద్ద అన్నయ్య రమేశ్ డాక్టరు చదివాడు. ఇంగ్లండ్ కూడా వెళ్లాడు. నాన్నగారు పోయేనాటికి మా చిన్నతమ్ముడు సాయి చంద్ వయస్సు ఆరు సంవత్సరాలు. వాడిని చూస్తుంటే, తన బాల్యం గుర్తుకు వస్తోందనేవారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో కానీ, మా ఇంట్లో సాయి ఒక్కడే నాన్నగారి సినిమా వారసత్వం అందుకున్నాడు. సినిమాలు – ఆకాశవాణి నాన్నగారు గూడవల్లి రామబ్రహ్మం గారి ఆహ్వానం మీద మద్రాసు వెళ్లి, రైతుబిడ్డ చిత్రానికి రచయిత, సహకార దర్శకుడిగా పనిచేశారు. మాయాలోకం, చిత్రానికి కూడా వారి దగ్గరే రచయితగా పనిచేశారు. ఆ తరవాత వచ్చిన గృహప్రవేశం చిత్రానికి కథమాటలుస్క్రీన్ప్లే సమకూర్చారు. ఆ రోజుల్లో ఆ చిత్రం కొత్త తరహాలో రూపొందింది. లక్ష్మమ్మ, పేరంటాలు, ప్రియురాలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. జగ్గయ్యగారిని ప్రియురాలు చిత్రంలో హీరోగా పరిచయం చేశారు. ఆ తరవాత పి.పుల్లయ్యగారు, కె. వి. రెడ్డిగారు నాన్నగారు కలిసి ధర్మదేవత చిత్రానికి స్క్రీన్ప్లే చేశారు. అది పెద్ద హిట్. అక్కడ సినిమాలకు పనిచేస్తున్న రోజుల్లోనే బెజవాడ గోపాలరెడ్డిగారి ఆహ్వానం మీద ‘సినిమాలు వదిలేసి, ఆంధ్ర రాజధానిగా కొత్తగా ఏర్పడిన కర్నూలుకి ఇన్ఫర్మేషన్ డైరెక్టర్గా వచ్చారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాక, ఆలిండియా రేడియోలో గ్రామస్థుల కార్యక్రమం నిర్వహించారు. అదే సమయంలో ‘కలిమి లేములు’, దుక్కిపాటి మధుసూదనరావు గారి చదువుకున్న అమ్మాయిలు చిత్రాలకు... సంభాషణలు రాశారు. మల్లెపువ్వులా ఉండేవారు.. ఉదయం నాలుగు గంటలకు లేచి, కాఫీ తాగేసి, తన పనిలో నిమగ్నమైపోయే వారు. ఎంత పనిలో ఉన్నా కుటుంబాన్ని మాత్రం నిర్లక్ష్యం చేసేవారు కాదు. తెల్లటి పట్టు పంచె, లాల్చీలో నాన్న గారు మల్లెపువ్వులా ఉండేవారు. కర్నూలులో ఉన్న రోజుల్లో షేర్వాణీ వేసుకునేవారు. అప్పుడప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకునేవారు. వస్త్ర ధారణ విషయంలో శ్రద్ధ ఉండేది. ఎక్కడకు వెళ్లినా అమ్మకు, అక్కకు మైసూర్ క్రేప్ సిల్క్ చీరలు తెచ్చేవారు. మేం వేసుకున్న దుస్తులు గమనించేవారు. ఒకసారి అమ్మ మాటల మధ్యలో నాన్నగారితో నా గురించి, ‘రజనికి మీ అందం రాలేదు’ అంది. అందుకు, ‘దానికి జుట్టు, పాదాలు నావే వచ్చాయి కదా’ అన్నారు, ఎంతో ఆప్యాయంగా నా వైపు చూస్తూ. ఆయనకు ఎవ్వరి మనసు నొప్పించటం ఇష్టం ఉండదు. మాతో సన్నిహితంగా... ఎప్పుడైనా మేం ఆడుకుంటే పడిపోతే ఆయనకు నచ్చేది కాదు. చిన్న దెబ్బ వేసి, ‘ఎందుకు పడిపోతూ దెబ్బలు తగిలించుకుంటారు’ అని సున్నితంగా మందలించేవారు. ఆయన మాటల్లో ఎంతో తాత్త్వికత ఉండేది. నాన్నగారితో క్యారమ్ బోర్డు ఆడటం మాకు సరదాగా ఉండేది. నాన్నగారి స్ట్రయికింగ్ చూడాలనిపించేది. ఆడుకునేటప్పుడు తగవులు, అల్లరిచిల్లరిగా కొట్టుకోవటం తెలీదు. వాకింగ్ చేస్తూ, మా వయసుకి తగ్గట్టుగా కథలు, మాటలు చెప్పేవారు. అప్పుడప్పుడు షాపింగ్కి తీసుకువెళ్లేవారు. రాత్రి పూట భోజనాలయ్యాక కాసేపు బయటికి తీసుకువెళ్లి నడిపిస్తూ.. పల్లీలు, పండ్లు కొనేవారు. నాన్నగారి మీద ఆత్మీయతతో కూడిన గౌరవం ఉండేది. మాతో ఎంతో ప్రేమగా ఉండేవారు. శాకాహారులే... తాతగారు శాకాహారులు కావటం వల్ల ఇంట్లో అందరూ శాకాహారమే తినేవారు. నాన్నగారు కొన్నాళ్లు మాంసాహారం తినేవారు. సాయిబాబా భక్తులయ్యాక వెజిటేరియన్ అయిపోయారు. అమ్మ శారదా నికేతనంలో పెరగటం వల్ల ఇంట్లో వంటకాలన్నీ ఇంగువ వాసన వచ్చేవి. చేకోడీలు, మురుకులు వంటివి అమ్మ చాలా బాగా చేసేది. నాన్న తిండి ప్రియులే కానీ, మితంగా తినేవారు. ఒక్కోసారి చేతిలో ఉన్న టిఫిన్ నోటి దాకా కూడా వెళ్లేది కాదు. పెన్నులో నీళ్ళు పొయ్యమనేవారు ఒకరోజున ఒక సంఘటన జరిగింది. ఆ జ్ఞాపకం ఇప్పటికీ మా హృదయంలో తడి ఆరకుండానే ఉంది. చేతితో పెన్ను పట్టుకుని, వంటగదిలోకి వచ్చి, ‘అమ్మా! ఈ పెన్నులో నీళ్లు పొయ్యి’ అన్నారు. ‘నీళ్లా’ అని నవ్వుతుంటే, ‘చాల్లే, ఇంకు ఇవ్వు!’ అన్నారు. నిరంతరం ఏదో ఒకటి రాసుకుంటూ ఉండేవారు. నాన్నగారు రాస్తున్నప్పుడే చదివేస్తూ ఉండేదాన్ని. మేం కొత్త పెన్ను కొనుక్కుని నాన్నగారికి ఇచ్చేవాళ్లం. ఆయన రోజంతా రాసుకుని పాళీ బాగా స్మూత్ అయ్యాక మాకు ఇచ్చేవారు. అప్పుడు ఆ పెన్ను మేం వాడేవాళ్లం. ఇల్లు నిరంతరం కళాకారులు, రచయితలతో సరస్వతీ పీఠంలా ఉండేది. అతిథి మర్యాదలు ఘనంగా జరుగుతుండేవి. మృదుహృదయ సంస్కారం.. ఉద్యోగరీత్యా మేం కర్నూలులో ఉంటున్న రోజుల్లో జరిగిన సంఘటన ఇప్పటికీ మేం మర్చిపోలేం. మా పొరుగు వాళ్లింట్లో ఒక పెద్దాయన గతించారు. ఆయన భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకురావటానికి ఇంటివారు ఒప్పుకోకపోతే, నాన్నగారు ‘మా ఇంటికి తీసుకువచ్చి కార్యక్రమం చేసుకోండి’ అన్నారు. చైనా యుద్ధం జరుగుతున్న సమయంలో నాన్నగారు ఒక నెల జీతం విరాళంగా ఇచ్చేశారు. రావూరి భరద్వాజ నాన్నగారిని ‘అన్నదాత’ అన్నారు. ఆయనకు ఆకాశవాణిలో ఉద్యోగం నాన్నగారే వేయించారు. ఆయనకు ఆ కృతజ్ఞత ఉండిపోయింది. అరుదైన గౌరవం.. తెలుగు సాహిత్య చరిత్రలో నాన్నగారు అందుకున్న అరుదైన గౌరవం ఒకటి ఉంది. నాన్నగారు రాసిన ‘పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా’ నవలకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. ఒక తెలుగు నవలకు ఈ అవార్డు దక్కటం అదే మొదలు. అలాగే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తెలుగు వారి స్టాంపులు విడుదల కావటం కూడా విశేషమే. తాతగారిది, నాన్నగారిది... ఇద్దరివీ విడుదల చేశారు. రచయిత విహారి, నాన్నగారి నవలల గురించి, ‘సాధారణంగా కనిపించే అసాధారణ జ్ఞాన గంగ’ అన్నారు. బాధపడేవారు... అమ్మ నాన్నగారితో సమానంగా సాహితీవేత్త. అమ్మ పరిజ్ఞానమంతా నిరుపయోగం అయిపోతున్నందుకు నాన్న గారు బాధపడినట్లు ఒకచోట రాసుకున్నారు. నాన్నగారు బిఏబియల్ చదివారు. తాతగారు కూడా లా చదివారు. ఇద్దరూ న్యాయవాద వృత్తిలోకి వెళ్లలేదు. తాతగారు 56 సంవత్సరాలకే గతించారు. తాతగారి సాహితీ వారసత్వంతో పాటు జీవన వారసత్వం కూడా వచ్చిందేమో!! నాన్నగారు 52 సంవత్సరాలకే మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. ఆయనకు తెలుసేమో... నాన్నగారు పోవటానికి ముందు రోజు అంటే నవంబరు 1న ‘భార్యా విలాపం’ నవల మొదలు పెడతానన్నారు. మరుసటి రోజు అంటే నవంబరు 2 న రమేశ్ అన్నయ్య మందులు తీసుకుని వచ్చాడు. అప్పుడు నాన్నగారు చేత్తో ఛాతీ మీద రాసుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే డాక్టర్ వచ్చి ఇంజక్షన్ ఇస్తున్నారు. నాన్నగారికి ఏదో తెలిసినట్లుగా, ‘ఈ మధ్యనే మా స్నేహితుడు కృష్ణారావు ఇంజక్షన్ ఇవ్వగానే పోయారు’ అన్నారు.నాన్నగారి మాటలు వింటూనే, డాక్టర్గారు నాన్నగారికి ఇంజక్షన్ ఇచ్చారు. అదేం చిత్రమో తెలియదు కానీ, ఇంజక్షన్ చేసిన ఐదు నిమిషాలకే నాన్న కన్ను మూశారు. అమ్మ ఒంటరిగా విలపించింది. నాన్నగారి మీద బెంగ పెట్టుకుని, ఆయన పోయిన నాలుగు సంవత్సరాలకే అమ్మ కూడా తనువు చాలించింది. మేం కర్నూలులో ఉండగా ఒక జ్యోతిష్కుడు వచ్చి నాన్నగారితో ‘మీకు ఆయుష్షు తక్కువ. మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది’ అని చెప్పారు. ఆ రోజు వరకు జరిగిన సంఘటనలన్నీ యాదృచ్చికమే కావొచ్చు. కాని నాన్నగారి విషయంలో అన్నీ వాస్తవం అయ్యాయి. అందువల్లే ఈ విషయాలు మాకు పదేపదే గుర్తుకు వస్తుంటాయి. మా జీవితాలు ప్రారంభిస్తున్న రోజుల్లోనే అంత గొప్ప తండ్రిని పోగొట్టుకున్నామన్న బాధ ఇప్పటికీ మా మనసులను వెంటాడుతూనే ఉంది. ఇప్పటివరకు మమ్మల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నది నాన్నగారి సాహిత్యమే. ఏ సమస్య వచ్చినా నాన్నగారి పుస్తకాలే మాకు పరిష్కారం చూపిస్తున్నాయి. ఆయనకు పిల్లలుగా పుట్టడం మా అదృష్టంగా భావిస్తాం. గోపీచంద్రుడు అనేవారు... విశ్వనాథ సత్యనారాయణ గారికి నాన్నగారి మీద పుత్ర వాత్సల్యం ఉండేది. ఎంతో ప్రేమగా ‘గోపీచంద్రుడు’ అని పిలిచేవారు. నాన్నగారు పోయినప్పుడు, ‘అతని అకాల మరణమునకు నేను పొందుచున్న దుఃఖమునకు చిహ్నముగా’ అని ఆయన రచించిన ‘గంగూలీ ప్రేమకథ’ నవలను నాన్నగారికి అంకితం చేశారు. నాన్నగారు పోయేటప్పటికి... యమపాశం, చీకటి గదులు, ప్రేమోపహతులు.. మూడు రచనలు అసంపూర్ణంగా ఉండిపోయాయి. అవి అసంపూర్ణంగానే ముద్రితమయ్యాయి. -
కరోనాతో ప్రముఖ రచయిత కన్నుమూత: ప్రధాని దిగ్భ్రాంతి
దిస్పూర్: సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అస్సాం ప్రముఖ రచయిత హోమెన్ బర్గోహెయిన్ (88) కరోనాతో బాధపడుతూ కన్నుమూశారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆయన మృతితో అసోం సాహిత్య లోకం మూగబోయింది. అతడి మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంతాపం ప్రకటించారు. అధికారికంగా అంత్యక్రియలు జరిపించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అసోంకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అస్సాంలోని లక్ష్మీపూర్ జిల్లా దుకువాఖానాలో డిసెంబర్ 7, 1932న హోమెన్ జన్మించారు. అస్సామీలో రచించిన ‘పిటా పుత్రా’ అనే రచనకు 1978లో కేంద్ర సాహిత్య అకాడమీ వరించింది. అయితే 2015లో జరిగిన నిరసనలకు వ్యతిరేకంగా ఆయన ఆ అవార్డు తిరిగి వెనక్కి ఇచ్చేశారు. ‘సౌదర్ నవ్ మెలీ జయ్’, ‘హల్దోయా సొరయే బౌదన్ ఖాయ్’, ‘అస్తరాగ్’, ‘తిమిర్ తీర్థ’, ‘మత్స్యగంధ’, ‘సుబాల’, ‘నిసంగట’, ‘ఆత్మాన్సుకందన్’, ‘గద్యర్ సాధన’, ‘ప్రొగ్యర్ సాధన’ తదితర రచనలు చేశారు. అస్సాం భాషలో ఎంతో సాహిత్య సేవ చేశారు. హోమెన్ భార్య నిరుపమ తములీ కూడా ప్రముఖ రచయిత్రి. ఆమె కూడా ఎన్నో రచనలు చేశారు. హోమెన్ పాత్రికేయుడిగా కూడా పని చేశారు. అసోం సాహిత్య సభకు 2001లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కొన్నాళ్లు అసోం సివిల్స్ సర్వీస్ అధికారిగా కూడా పని చేశారు. చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ చదవండి: కరోనా భయంతో వర్ధమాన గాయని ఆత్మహత్య Shri Homen Borgohain will be remembered for his rich contributions to Assamese literature and journalism. His works reflected diverse aspects of Assamese life and culture. Saddened by his passing away. Condolences to his family and admirers. Om Shanti. — Narendra Modi (@narendramodi) May 12, 2021 একশৰণ নামধৰ্মৰ বিশিষ্ট প্ৰৱৰ্তক মহাপুৰুষ শ্ৰীশ্ৰী দামোদৰদেৱ আছিল অসমৰ নৱবৈষ্ণৱ আন্দোলনৰ এগৰাকী অন্যতম বাটকটীয়া। আজি সেই পুণ্যাত্মাৰ পৱিত্ৰ তিৰোভাৱ তিথিত মোৰ সশ্ৰদ্ধ প্ৰণিপাত জনাইছোঁ। — Himanta Biswa Sarma (@himantabiswa) May 12, 2021 -
కరోనా: ప్రముఖ రచయిత, నటుడు కన్నుమూత
త్రిసూర్: కరోనా మహమ్మారి సినీ రంగంలో పెనువిలయాన్ని సృష్టిస్తోంది. పలువురు సినీ రంగానికి చెందిన కరోనా బారిన పడి అసువులు బాశారు. మలయాళ సినీరంగంలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత, నటుడు మాడంపు కుంజుకుట్టన్ (81) కన్నుమూశారు. ఇటీవల కోవిడ్-19 సంబంధిత లక్షణాలతో త్రిశూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయనకు కరోనా నిర్దారణ అయింది. చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. త్రిస్సూర్ జిల్లాలోని కిరలూర్కు చెందిన మాడంపు శంకరన్ నంబూద్రి (మాడంపు కుంజికుట్టన్) అనేక మలయాళ చిత్రాలకు స్క్రీన్ ప్లే రాశారు. పలు సినిమాల్లో కూడా నటించారు. 2000లో జయరాజ్ దర్శకత్వంలో వచ్చిన కరుణమ్ చిత్రానికి కుంజుకుట్టన్ ఉత్తమ స్క్రిప్ట్ రైటర్గా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. మకాల్కు, గౌరీశంకరం, సఫలం, కరుణం, దేశదానం వంటి సినిమాలకు స్క్రిప్ట్స్ రాశారు. సాహిత్య , సినీ లోకం మడంపు అని ప్రేమగా పిలిచుకునే కుంజుకుట్టన్ 10కి పైగా నవలలు రాశారు. పైత్రికం, వడక్కున్నాథన్, కరుణమ్, దేశదానం, ఆరంతాంపురం సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చదవండి: గౌరీ అమ్మ ఇక లేరు: గవర్నరు, సీఎం సంతాపం -
కరోనాతో ఒకేరోజు ముగ్గురు ప్రముఖులు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తితో సామాన్యులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు కన్నుమూస్తున్నారు. తాజాగా బుధవారం ఒక్కరోజే రాజకీయ, సాహిత్య, మీడియా రంగాలకు చెందిన ముగ్గురు మృతిచెందారు. పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రముఖ రచయిత అనీశ్ దేవ్ (70), మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ఏక్నాథ్ గైక్వాడ్ (81), తెలంగాణకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ శ్రీధర్ ధర్మాసనం తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏక్నాథ్ గైక్వాడ్ మంత్రిగా పని చేశారు. ఒకసారిగా లోక్సభకు ఎన్నికయ్యారు. ఆయన మృతితో కాంగ్రెస్ పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఇక పశ్చిమబెంగాల్కు చెందిన అనీశ్ దేవ్ ప్రముఖ రచయిత. ఆయన 18వ ఏట నుంచే రచనలు చేయడం మొదలుపెట్టారు. బెంగాలీ సాహిత్య రంగంలో గొప్ప సేవలు అందించారు. ఆయనకు బెంగాల్ ప్రభుత్వం 2019లో విద్యాసాగర్ పురస్కారంతో సత్కరించింది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ శ్రీధర్ ధర్మాసనం మా హైదరాబాద్ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. టిమ్స్ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. ఆయన మృతికి సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: నాలుగంటే నాలుగే రోజుల లాక్డౌన్: ఎక్కడంటే.. చదవండి: ఏపీలో కరోనా కట్టడికి అన్ని చర్యలు -
కాల్పుల్లో మరణిస్తే జవాన్లు అమరులా? రచయిత్రి వ్యాఖ్యలు దుమారం
గౌహతి: ఛత్తీస్గడ్లో ఇటీవల మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో 22 మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అసోంకు చెందిన రచయిత్రి శిఖా శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె ఫేసుబుక్లో చేసిన పోస్టు వైరల్గా మారింది. దీనిపై తీవ్ర దుమారం రేపడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ‘జీతాలు తీసుకుని పని చేసే ఉద్యోగులు కాల్పుల్లో మరణిస్తే అమరులా? అని ప్రశ్నించింది. అలాగైతే మిగతా సిబ్బంది కూడా అమరవీరులే అవుతారని రచయిత్రి శిఖాశర్మ పేర్కొన్నారు. గౌహతికి చెందిన ఉమి దేకా బరువా, కంకణ గోస్వామి ఆమె ఫేసుబుక్ పోస్టు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు గౌహతి పోలీసులు శిఖాశర్మపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై ఐపీసీ సెక్షన్ 294 (ఏ, 124 (ఏ), 500, 506, ఐటీ చట్టం 45 కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందగానే రచయిత్రి శిఖాశర్మను డిస్పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. శిఖాశర్మ ఫేస్బుక్లో చేసిన పోస్టు ఇదే.. ‘జీతం పొందేవారు మృతి చెందేవారిని అమరవీరులుగా గుర్తించొద్దు. ఆ విధంగా భావించాలనుకుంటే విద్యుత్ ఉద్యోగులు కూడా ప్రమాదాల్లో మృతి చెందుతారు. వారిని కూడా అమరవీరులుగా ప్రకటించొచ్చు కదా? ప్రజలను భావోద్వేగాలకు గురి చేయొద్దు మీడియా! ’ అని స్థానిక భాషలో ఆమె రాసింది. శిఖా శర్మ ఇటీవల జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసింది కూడా. -
పక్షులు ఆత్మహత్య చేసుకునే వీలుంది.. కానీ
జీవితమే నాటకీయం అంటే అందునా పురుషుడి ప్రతాపం కొద్దీ స్త్రీ జీవితం మరీ నాటకీయం. ఆమె తన స్వేచ్ఛ కోసం పురుషుడి అహాన్ని సంతృప్తి పరచడం కోసం అవసరమయ్యీ అసహాయతతో జీవన నాటకాన్ని రక్తి కట్టించక తప్పదు. ఆ సందర్భాలన్నీ చూడండి మీరు అని వాటిని స్టేజ్ మీదకు తీసుకు వస్తుంది పూర్వ నరేష్. కేవలం స్త్రీల కథలను గొప్ప నాటకాలుగా మలచడమే కాదు డ్రామాలు ప్రసారం చేసే టీవీ చానెల్స్లో వాటితో గొప్ప గుర్తింపును పొందింది కూడా. నేడు ప్రపంచ నాటక దినోత్సవం సందర్భంగా ఈ స్త్రీ దర్శకురాలి పరిచయం, నాటకాల దర్శనం. పూర్వ నరేష్ గురించి తర్వాత చెప్పుకుందాం. మొదట ఆమె రాసిన, పని చేసిన నాటకాలు ఏమిటో చూద్దాం. ఆమె ఒక నాటకం రాసింది. దాని పేరు ‘పింక్ శారీ రివెల్యూషన్’. ఇది బుందేల్ఖండ్లో మగవారి పెత్తందారితనాన్ని, స్త్రీల పట్ల వారి హింసను వ్యతిరేకించడానికి ఎదిరించడానికి ఒక మహిళ– సంపత్ పాల్ ఆధ్వర్యంలో ఏర్పడిన ‘గులాబీ గ్యాంగ్’ను ఆధారం చేసుకుని తయారైన నాటకం. ఈ నాటకం స్త్రీల సమస్యలను, గృహ హింసను చర్చిస్తుంది. అయితే పూర్వనరేష్ అంత వరకే చెప్పి ఆగదు. ఈ నాటకం ఒక దళిత స్త్రీ మీద అత్యాచారాన్ని చూపుతుంది. ఒక దళిత స్త్రీ మీద అత్యాచారం జరిగితే ఆధిపత్య కులాలు ఎలా తిమ్మిని బమ్మిని చేసి ఆ కేసును మాఫీ చేస్తాయో కూడా చూపుతుంది. స్త్రీలు బాధితులు అయితే బాధిత కులాల స్త్రీలు ఇంకా బాధితులని చెప్పే ఈ శక్తిమంతమైన నాటకం పూర్వ నరేష్ మాత్రమే రాయగలదు. వేయగలదు. ఇంకో నాటకం రాసింది. దాని పేరు ‘ఓకే.. టాటా.. బైబై’. ఈ నాటకం హైవేల మీద పడుపువృత్తి చేసుకునే మహిళలది. వచ్చే పోయే వాహనాలను ఆపి వారిని ఆకర్షించి పొట్టపోసుకునే మహిళలు వారితో గడిపి వెళ్లే పురుషులకు ‘ఓకే.. టాటా .. బైబై’ అని చెబుతారు అసలేమీ జరగనట్టుగా. నిజానికి అసలేమీ జరగలేదా? ఆ స్త్రీలు అక్కడ ఎందుకు ఉన్నారు? వారు మాత్రమే ఎందుకు ఉన్నారు? ఆ నేపథ్యం ఉన్నవారు మాత్రమే ఎందుకున్నారు? వారిని ఎవరు అలా ఉండనిస్తున్నారు? వారు ఇతరుల్లా హైవేల మీద కాకుండా ఇళ్లల్లో ఆఫీసుల్లో ఎందుకు లేరో చర్చిస్తుందీ నాటకం. ఇంకో నాటకం ఉంది. దాని పేరు ‘బందిష్ 20– 20,000 హెర్ట్జ్. ఇది ఇద్దరు సీనియర్ (రిటైర్డ్) గాయనీమణుల పాత్రలతో తయారైన నాటకం. ఒక గాయని శాస్త్రీయ గాయని. మరో గాయని దేశీయ గాయని. వీరు చాలా ఏళ్ల తర్వాత ఒక ఉత్సవంలో కలుస్తారు. ఎలా ఉన్నావ్ అంటే ఎలా ఉన్నావ్ అనుకుంటారు. వీళ్లిద్దరూ గొప్ప సంగీతకారులు. కాని వీరి జీవితంలో ఎన్ని అపశృతులు. వీళ్ల కళను మనస్ఫూర్తిగా ప్రదర్శించడానికి ఎన్ని సెన్సార్ షిప్లు. స్త్రీలు ఏ రంగంలో అయినా రాణించడం అంటే పేరు సంపాదించడం అంటే అది ఎంత పెద్ద పేరైనా పరిమితులతోనే సంపాదించారని అర్థం చేసుకోవాలి. పరిమితులే లేకపోతే వారు చూపే ప్రతిభ వేరు. మనిషి చెవి 20 నుంచి 20 వేల హెర్ట్జ్ వరకూ ఉన్న ధ్వని తరంగాలను మాత్రమే వినగలడు. కాని స్త్రీల వ్యధలు 20 హెర్ట్జ్ లోపు 20 వేల హెర్ట్జ్ ఆవల కూడా వినదగినన్ని ఉంటాయని ఈ నాటకం చెబుతుంది. దీనికి ప్రఖ్యాత గాయని శుభా ముగ్దల్ సంగీతం. పూర్వ నరేష్ రాసిన మరో ప్రఖ్యాత నాటకం ‘ఆజ్ రంగ్ హై’. 2010లో రాసిన ఈ నాటకం నేటికీ ఏదో ఒక ఊళ్లో, దేశంలో ప్రదర్శింపబడుతూనే ఉంది. ఇది దేశ విభజన జరిగిన కొత్తల్లో సాగే కథ. ఒక ముస్లిం మొహల్లాలో ఉండే స్త్రీలు మారిన కాలమాన పరిస్థితుల్లో హిందూ ముస్లిం ఐక్యతను నిలబెట్టడం కోసం ప్రయత్నిస్తారు. దేశ విభజన ప్రజల మీద ఎన్ని కష్టాలు తెచ్చినా ఆ కష్టాలన్నింటి కంటే ఎక్కువ కష్టాలు పడింది స్త్రీలే. కుటుంబాలు, మానాలు, ప్రాణాలు అన్నీ వారే నష్టపోయారు. మత విద్వేషం అంతిమంగా స్త్రీ హింసగానే మారుతుందని హెచ్చరించే నాటకం ఇది. ఈ నాటకాలన్నీ రాసిన ప్రదర్శిస్తున్న పూర్వ నరేష్ను కేంద్ర నాటక అకాడెమీ తన యువ పురస్కారంతో 2013లోనే సత్కరించింది. ఇవాళ దేశంలో మహిళా నాటకకర్తల్లో పూర్వ నరేష్ పేరు గౌరవంగా పలికే స్థాయికి ఆమె కృషి కొనసాగుతూ ఉంది. ఎవరు పూర్వ నరేష్? 48 సంవత్సరాల పూర్వ నరేష్ది లక్నో. ఆమె తండ్రి నరేష్ సక్సేనా ఇంజనీర్ అయినా కవిగా ప్రసిద్ధుడు. తల్లి విజయా నరేష్ గాయని. ఇంట్లో ఎప్పుడూ నాటకాలు, కవిత్వం, కథలు... ఈ వాతావరణంలో పెరిగిన పూర్వ ఢిల్లీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాక పూణె వెళ్లి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంది. ఆ తర్వాత బయటకు వచ్చి నాటకాలు వేయడం మొదలెట్టింది. ‘అవును... నేను స్త్రీల గురించి ఎక్కువ రాస్తాను. మాట్లాడతాను. వారి గురించి చేయాల్సింది చాలా ఉంది’ అంటుంది పూర్వ. ఆమె ముంబైలో రెండేళ్ల పాటు నటుడు రజత్ కపూర్ నాటక బృందంలో పని చేసి ఆ తర్వాత సొంతగా 2010లో ‘ఆరంభ్’ అనే నాటక సంస్థ ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా విస్తృతంగా స్త్రీ నాటకాన్ని ప్రచారం చేస్తోంది. ‘నేను విదేశాలలో కూడా మహిళా నాటక కర్తలతో ఎక్కువ కలిసి పని చేయడానికి ఇష్టపడతాను’ అంటుంది పూర్వ. ఇటీవల ఒక ఆస్ట్రేలియన్ మహిళా నాటకకర్త కోరిక మేరకు ‘జతింగ’ అనే నాటకం రాసింది పూర్వ. ఇది అస్సాంలోని ఓ ప్రాంతం. ఇక్కడ పక్షులు మిస్టీరియస్గా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటాయి. ఈ స్థలాన్ని స్త్రీల ట్రాఫికంగ్కు ప్రతీకగా తీసుకుని పూర్వ ఆ నాటకం రాసింది. ‘పక్షులకు ఆత్మహత్య చేసుకునే వీలుంది. కాని వ్యభిచార పంజరంలో చిక్కుకున్న స్త్రీకి ఆ స్వేచ్ఛ కూడా లేదు’ అని చర్చిస్తుందిది. పూర్వ నరేష్ బాగా ప్రయాణాలు చేస్తుంది. ‘జీవితం పుస్తకాల్లో ఉండే పేజీల్లో తెలియదు. పాస్పోర్ట్లో ఉండే పేజీల వల్ల తెలుస్తుంది’ అంటుందామె. అంటే పాస్పోర్ట్ లోపల ఎన్ని స్టాంపులు పడితే అంత బాగా కొత్త వ్యక్తుల ద్వారా లోకం తెలుస్తుందని. పూర్వ నరేష్ తన నాటకాలను ‘జీ’, ‘స్టార్’ టెలివిజన్ల ‘డ్రామా చానెల్స్’ ద్వారా కూడా ప్రచారం చేస్తోంది. స్త్రీల చైతన్యం కోసం నాటకాన్ని సమర్థంగా ఉపయోగిస్తున్న పూర్వకు అభినందనలు తెలపడం మనం నేడు చేయగల సందర్భ శుద్ధి కలిగిన పని అని భావించవచ్చు. – సాక్షి ఫ్యామిలీ -
ఆవ్యక్తి గురించి కథ రాస్తున్నా, ఎగ్జయిటింగ్గా ఉంది: శ్రుతీహాసన్
శ్రుతీహాసన్ మంచి నటి. అది అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ మంచి గాయని. అది కూడా తెలుసు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా. సొంతంగా ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుంటారు. మంచి రచయిత్రి కూడా. కవితలు రాస్తుంటారు. ఇప్పుడు ఏకంగా ఒక సినిమాకి కథ రాస్తున్నారు. ఒక తమిళ సినిమా కోసం కథ రాసే పనిలో ఉన్నారామె. ఈ విషయం గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘చెన్నైకి సంబంధం లేని ఒక వ్యక్తి గురించి ఈ కథ రాస్తున్నాను. మా నాన్నగారు నన్ను రైటర్గా చూడాలనుకునేవారు. చిన్నప్పుడు నేను రాసినవి చూసి పెద్ద రచయిత్రిని అవుతానని అనుకునేవారు. నన్ను సినిమా రైటర్ని చేయాలనుకున్నారు. అందుకే వేసవి సెలవుల్లో రైటింగ్ కోర్సులు కూడా చేశాను. ఇప్పుడు రైటింగ్ మీద బాగా దృష్టి పెట్టాలనుకున్నాను. నా జీవితంలోని ఈ కొత్త అధ్యాయం నాకు ఎగ్జయిటింగ్గా ఉంది’’ అన్నారు. చదవండి: ఇన్స్టాగ్రామ్ రీల్స్..ఇప్పటికే..10 లక్షలకు పైగానే లైక్స్ -
అత్యాచారం ఆరోపణలు.. రైటర్ అరెస్ట్!
ముంబై : సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఓ సినీ రచయితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, మలద్ వెస్ట్కు చెందిన హరీష్ భీమ్సేన్ గడి తానో రైటర్నని, చాలా సినిమాల్లో పని చేశానని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. కొద్దినెలల క్రితం హార్యానాకు చెందిన 27 ఏళ్ల యువతికి హరీష్తో పరిచయం ఏర్పడింది. ( ఎంపీలు, ఎమ్మెలేలకు పోర్న్ వీడియోలతో ఎర!..) ఈ నేపథ్యంలో ఆమెకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని, రెండు వారాల్లో యాక్టింగ్ నేర్పిస్తానని నమ్మబలికాడు. వాలెంటైన్స్ డే రోజున తన ఇంట్లో పార్టీ జరుగుతోందని చెప్పి ఆమెను ముంబైకి పిలిపించాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు జాయింట్ కమిషనర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ను కలిసి అతడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం హరీష్ను అరెస్ట్ చేశారు. -
ఆ పాత్ర నాకు చాలా ఇష్టం: డాలీ సింగ్
టాలెంట్ను ఆదరిస్తారు.. గ్లామర్ను ఆరాధిస్తారు.. ఈ రెండిటినీ సొంతం చేసుకున్న వెబ్ స్టార్ డాలీ సింగ్. ఫన్నీ వీడియోస్తో, ఫ్యాషన్ పోకడలతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను కదిలించింది. ప్రతిభను చాటుకుంటోంది. యూట్యూబ్లో 271కె ఫాలోవర్స్ని, ఇన్స్ట్రాగామ్లో 755కె ఫాలోవర్స్ని సంపాదించుకున్న డాలీ సింగ్ (27).. ‘రాజు కీ మమ్మీ’ అనే పాత్రతో పాపులర్ అయ్యింది. ►డాలీ 1993 సంవత్సరంలో ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో జన్మించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో మాస్టర్స్ చేసింది. ►ఫ్యాషన్ బ్లాగర్గా, కంటెంట్ క్రియేటర్గా, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్గా మల్టీ టాలెంట్ చూపిస్తోంది. యూట్యూబ్లో ‘రాజు కీ మమ్మీ చాట్ షో’లో రాజు కీ మమ్మీ పాత్ర పాపులర్ అయ్యింది. ►ఫ్యాషన్ టెక్నాలజీలో మాస్టర్స్ పూర్తయ్యాక స్టైల్ బ్లాగ్ స్టార్ట్ చేసింది. ఐడివాతో ఇంటర్న్షిప్ తర్వాత.. స్టైలిస్ట్ కావాలనుకొని.. రచయిత (కంటెంట్ డెవలపర్)గా ఐడివాలోనే జాయిన్ అయ్యింది. ►ఇంటర్న్షిప్ చేసే సమయంలోనే ఐడివా ఆన్లైన్ వెబ్సైట్లో స్టైల్ టిప్స్, బ్యూటీ టిప్స్, హెల్త్, వెల్నెస్ మొదలైనవి పోస్ట్ చేసేది డాలీ. ఈ క్రమంలోనే ఆమెకు ఐడివా యూట్యూబ్లో నటించే అవకాశం వచ్చింది. ►సౌత్ ఢిల్లీ గర్ల్స్లో డాలీ సింగ్, కుషా కపిలా ఇద్దరూ ఒకరిని మించి ఒకరు నటించారు. ఈ సిరీస్తో డాలీకి ప్రేక్షకాదరణ ఓ రేంజ్లో పెరిగిపోయింది. ►డాలీ తన టాక్ షో సిరీస్లో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది. ఇందులోనే ఆమె ‘రాజు కీ మమ్మీ’ పాత్రను పోషించింది. ►నెట్ఫ్లిక్స్లో ప్రస్తుతం టాప్ రేటింగ్లో ఉన్న ‘భాగ్ బీని భాగ్’లో ప్రధాన పాత్ర పోషించిన డాలీ.. ఆ సిరీస్తో ఇంటింటా అభిమానులను సంపాదించుకుంది. ఇందులో స్వర భాస్కర్తోపాటు అత్యంత ప్రేక్షకాదరణ పొందిన యూట్యూబర్స్ క్యారీ మినాటి, హార్ష్ బెనివాల్, ప్రజక్త కోలితో వెబ్స్క్రీన్ షేర్ చేసుకుంది డాలీ... ‘రాజు కీ మమ్మీ అచ్చం మా అమ్మలానే ఉంటుంది. మా అమ్మను ప్రేరణగా తీసుకునే క్రియేట్ చేసుకున్నాను. అందుకే ఆ పాత్ర నాకు చాలా ఇష్టం’ అంటుంది డాలీ సింగ్. చదవండి: చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన సల్మాన్ ఖాన్ ఇండస్ట్రీలో నెంబర్ 1 అవుతాడనుకున్నారు.. కానీ.. -
ఒక్కరోజు కూడా పేరు పెట్టి పిలవలేదు..
ప్రముఖ రచయిత వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ మంగళవారం కన్నుమూశారు. ఆయనతో తమ అనుబంధాన్ని రచయితలు భువనచంద్ర, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పంచుకున్నారు. బుల్లబ్బాయ్ నా తోడబుట్టని తమ్ముడు 34 ఏళ్ల పరిచయంలో ఏనాడూ మేం రైటర్స్లా మాట్లాడుకోలేదు. నన్ను ఒక్కరోజు కూడా పేరు పెట్టి పిలవలేదు. నన్ను ‘అన్నయ్యా’ అంటే నేను ‘బుల్లబ్బాయ్’ అనేవాణ్ణి. నిన్న (సోమవారం)నే మాట్లాడుకున్నాం. ‘ఈ ఏడాది ఇంకా కలుసుకోలేదు, కలుద్దాం అన్నయ్యా’ అన్నాడు. సరే అన్నాను. ఇలా కలుసుకున్నాను తమ్ముణ్ణి. మనిషి లేడని ఊహకు కూడా అందటం లేదు. ఏ పేరుతో పిలిస్తే పలుకుతాడో తెలిస్తే బావుండు.. ఆ పేరుతో పిలుస్తాను. మనిషి చక్కగా నిద్రపోతున్నాడు. వెన్నెలకంటి అంటే వస్తాడా, బుల్లబ్బాయ్ అంటే వస్తాడా... ఎలా పిలిచినా రాకుండా అందనంత దూరం వెళ్లిపోయాడు. ‘ఈ రోజు వెళ్లిపోతున్నాను’ అన్నట్లుగా చూస్తున్నాడు. ఎవరైనా కొంతకాలానికి వెళ్లవలసిన వాళ్లమే అని తెలుసు కానీ, ఎందుకో అంతా శూన్యంలా ఉంది. కన్నతల్లి కడుపునుండి నేలతల్లి వొళ్లోకొచ్చి ఆట, పాటలాడి ఎన్నో బంధాలను పేర్చుకుని చేసే ప్రయాణమే కదా జీవితం. మళ్లీ నేలతల్లిని ముద్దాడాడు తమ్ముడు. ఈ ఇద్దరమ్మల ప్రయాణంలో తన శరీరానికి పెట్టుకున్న పేరు ‘వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్’. ఇక లేడు అనే వార్త కలా? నిజమా? అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఏ సభకెళ్లినా, సన్మానాలకెళ్లినా, ఆంధ్రా క్లబ్లో పురస్కారాలకెళ్లినా అందరూ మమ్మల్ని అన్నతమ్ములొచ్చారు అనేవాళ్లు. ‘అన్నయ్యా.. మనిద్దరం నెల్లూరు వెళుతున్నాం. అక్కడ సభ ఉంది. మనిద్దరి పేరు ఇచ్చేశాను’ అనేవాడు. తిరిగొచ్చేటప్పుడు మా కబుర్లు ప్రపంచమంతా తిరిగేవి. మా రెండు గొంతుల్లో ఒక గొంతు మూగబోయింది, మరో గొంతు పక్కన నిలబడి మౌనంగా రోదిస్తోంది. ఆయన పేరు, కీర్తి ప్రతిష్టలు.. అన్నింటినీ ఇక్కడే వదిలి ఈ రోజు నింగిలో కలిసిపోయాడు. పదివేల కోట్లున్నా ఏం చేసుకుంటాం? అనుభవించటానికి పక్కన సరైన మనిషి కావాలి కానీ.. ఆయన కోప్పడటం నేను చూడలేదు, ఏ సభలోనైనా అందరినీ గలగలా నవ్విస్తాడు. ప్రతిరోజూ నవ్వించే ఆ మనిషి ఈ రోజు ఏడిపిస్తున్నాడు (ఏడుస్తూ). మనసులో ఏదో తెలియని వెలితి. ‘ఐ మిస్ యు ఫర్ ఎవర్.. బుల్లబ్బాయ్’. – రచయిత భువనచంద్ర నలుగురం ఒక్కసారే వచ్చాం ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రిగారు 1985లో, నేను 1986 సెప్టెంబర్లో, 1987 జనవరి 1న భువనచంద్ర వచ్చాం. వెన్నెలకంటి కూడా అప్పుడే పరిశ్రమలోకొచ్చారు. దాదాపు నలుగురం ఒకేసారి ఏడాది వ్యవధిలోనే చిత్రపరిశ్రమకు వచ్చాం. వెన్నెలకంటి నాకు అత్యంత ఆత్మీయుడు. మాతో పాటు మా కుటుంబాలు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటాయి. వెన్నెలకంటి చనిపోయిన విషయం తెలియగానే ఆయన శ్రీమతితో మాట్లాడాను. మాట్లాడుతూనే గుండెపోటుతో పోయారట, ఆసుపత్రికి తీసుకెళ్లే సమయం కూడా లేదని చెప్పారామె. డబ్బింగ్ చిత్రాల్లో వండర్స్ క్రియేట్ చేసింది వెన్నెలకంటిగారే. పద్యకవిగా, పాటల కవిగా ప్రసిద్ధి చెందారు. ఆయనతో నాకు ఎన్నో మరపురాని సంఘటనలు ఉన్నాయి. ‘మైనే ప్యార్ కియా’ డబ్బింగ్ చిత్రానికి ఈయన రాసిన మాటలకు ముగ్ధుడైన ఆ హిందీ చిత్ర నిర్మాత తారాచంద్ బర్జాత్యా ఈయనకు పాదాభివందనం చేయటం నాకింకా గుర్తుంది. ఏదేమైనా ఈ రోజు అత్యంత ఆత్మీయుడిని కోల్పోవటం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరావు -
రైటర్ సల్మాన్
లాక్డౌన్లో స్టార్స్ అందరూ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ, కొత్త టాలెంట్ను బయటకు తీస్తున్నారు. సల్మాన్ ఖాన్ వ్యవసాయం మీద దృష్టి పెట్టారు. ఫామ్హౌస్లో వ్యవసాయం చేస్తూ కనిపించారాయన. ఇది కాకుండా రచయితగానూ మారారట సల్మాన్. సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో సల్మాన్ ఓ సినిమా కమిట్ అయ్యారని సమాచారం. ఈ చిత్రకథను బర్జాత్యాతో కలసి రాస్తున్నారట సల్మాన్. గతంలో వీరి కాంబినేషన్లో ‘మైనే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్ హై కౌన్’, ‘హమ్ సాథ్ సాథ్æహై’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రాలు వచ్చాయి. పెళ్లయిన జంట మధ్య ఉండే ప్రయాణాన్ని తాజా సినిమాలో చూపిస్తారట. 2022లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. -
ప్రముఖ సీరియల్ రచయిత ఆత్మహత్య
ముంబై : ప్రముఖ సీరియల్ రచయిత అభిషేక్ మక్వానా ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. సంఘటనా ప్రదేశం నుంచి గుజరాతీలో రాసిన ఓ సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవసరాల కోసం తీసుకున్న అప్పులు చెల్లించలేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు, వాటి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నాడు. దీనిపై ఆయన తమ్ముడు జెనిస్ మాట్లాడుతూ.. ‘‘మా అన్న చనిపోయిన తర్వాత నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. ( మరో ‘మెగా’ చాన్స్ కొట్టేసిన రష్మిక!) అన్న తీసుకున్న అప్పులు తీర్చాలని వారు డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలనుంచి కూడా ఫోన్లు వచ్చాయి. దీంతో నేను ఆయన ఈ మెయిల్స్ చెక్ చేసి చూశాను. మొదట ఈజీ లోన్ యాప్ ద్వారా కొద్ది మొత్తం లోన్ను తీసుకున్నారు. ఆ యాప్ 30 శాతం అధిక వడ్డీని వసూలు చేసేది’’ అని పేర్కొన్నాడు. అభిషేక్ ప్రఖ్యాత సీరియల్ ‘తారక్ మెహ్తాకా ఉల్టా చెస్మా’ రచయితల్లో ఒకరు. -
కరోనాతో సినీ రచయిత కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి మరో టాలెంటెడ్ రచయితని బలి తీసుకుంది. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అకాలమరణం ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపింది. తాజాగా టాలీవుడ్ యువ కథా రచయిత వంశీ రాజేష్ కరోనాతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కరోనాకు చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో గురువారం తుది శ్వాస తీసుకున్నారు. వంశీ రాజేష్ ఆకస్మిక మరణంతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం ప్రకటించారు. (‘అన్నయ్య త్వరగా కోలుకోవాలని స్వామిని గట్టిగా వేడుకున్న’) శ్రీను వైట్ల దర్శకత్వంలో, రవితేజ నటించిన 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాకు రచయితగా ఆయన పనిచేసారు. టాలీవుడ్లో చాలా మంది ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవల కరోనావైరస్తో పోరాడిన హీరో రాజశేఖర్ కోలుకుని ఇంటికి చేరారు. ఇంతలోనే మెగాస్టార్ చిరంజీవి తనకు కోవిడ్-19 పాజిటివ్ నిర్దారణ అయిందని ప్రకటించిన సంగతి తెలిసిందే. Writer #VamsiRajesh died due to Covid-19. He was previously associated with director #SrinuVitla and provided the story for #Raviteja's #AmarAkbarAnthony. A great talent gone too soon..!!! #RIP pic.twitter.com/0xBzXZbrEh — Sreedhar Sri (@SreedharSri4u) November 12, 2020 -
వైకుంఠ ఏకాదశి రోజున..
‘నరసింహా, నరసింహ నాయుడు, ఇంద్ర, గంగోత్రి, బద్రినాథ్’ వంటి హిట్ చిత్రాలకు కథ అందించిన రచయిత చిన్నికృష్ణ తాజాగా రాసిన కథతో తెరకెక్కనున్న చిత్రం ‘వైకుంఠ ఏకాదశి రోజున..’. చిన్నికృష్ణ స్టూడియోస్ సమర్పణలో బిల్వా క్రియేష¯Œ ్స పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా రూపొందనున్న ఈ చిత్రాన్ని చిన్నికృష్ణ, ఆయన తనయుడు ఆకుల చిరంజీవి నిర్మించనున్నారు. హైదరాబాద్లోని చిన్నికృష్ట ఆఫీసులో ఆయన కుమార్తె ఆకుల ఊర్మిళాదేవి జ్యోతి ప్రజ్వలన చేయడం ద్వారా ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా రచయిత–నిర్మాత చిన్నికృష్ణ మాట్లాడుతూ– ‘‘ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య అద్భుతమైన అమృత ఘడియలుగా పెద్దలు నిర్ణయించారు. 1850వ సంవత్సరం నుంచి ఇప్పటివరకూ ఇలాంటి ముహూర్తం రాలేదు. ఇలాంటి అరుదైన ముహూర్తంలో మా సినిమా ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా తెలుగు–కన్నడ వెర్షన్లకు ఒక దర్శకుడు, తమిళం–మలయాళం వెర్షన్లకు ఒక దర్శకుడు, హిందీ వెర్ష¯Œ కు మరో దర్శకుడు పని చేయనున్నారు. ఆయా భాషల్లో ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు నటిస్తారు. వారందరి పేర్లు త్వరలో చెబుతాం. ఫస్టాఫ్ కథ గోవాలో, సెకండాఫ్ కాశీలో జరుగుతుంది. నా ఐదేళ్ల కష్టానికి ఫలితం ఈ కథ. కరోనా వ్యాప్తి తగ్గాక షూటింగ్ మొదలు పెడతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా వెంకట్ ప్రసాద్ చేయనున్నారు. -
ఓ రైటర్ కథ
లాక్ డౌన్ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉపయోగించుకుంటున్నారు. వంటకాలతో ప్రయోగాలు, కొత్త భాషపై పట్టు సాధించడం వంటివి చేస్తున్నారు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఓ షార్ట్ ఫిల్మ్ చేశారు. ‘ఎ రైటర్’ టైటిల్ తో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ ను 24 గంటల్లో చిత్రీకరించారట. గృహ హింస కాన్సెప్ట్తో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. ఇందులో రచయిత పాత్ర చేశారు పాయల్. ‘‘లాక్ డౌన్ వల్ల కెమెరా ముందుకి వెళ్లడం కుదరడం లేదు. ఈ షార్ట్ ఫిల్మ్ చేయడం ఆ బాధను కొంత తగ్గించింది. నా అభిమానులందరికీ ఈ షార్ట్ ఫిల్మ్ అంకితం చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు పాయల్. ఈ షార్ట్ ఫిల్మ్ కి పాయల్ మిత్రుడు సురభ్ దిగ్ర దర్శకత్వం వహించారు. 16 నిమిషాలున్న ఈ ఫిల్మ్ ను యు ట్యూబ్ లో చూడొచ్చు. -
పురుడు పోసిన సినీ రచయిత
పెరంబూరు : కరోనా కాలంలో పురుటి నొప్పులతో బాధ పడుతున్న గర్భిణికి సినీ రచయిత పురుడు పోశారు. వెట్ట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన సంచలన చిత్రం విచారణై చిత్ర రచయిత చంద్రన్. కోవైకు చెందిన ఆటో డ్రైవర్ అయిన ఈయన స్వీయ సంఘటనలతో లాకప్ పేరుతో రాసిన నవలనే వెట్ట్రిమారన్ విచారణై పేరుతో చిత్రంగా రూపొందించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తున్న విషయం తెలిసిందే. చంద్రన్ నివసిస్తున్న కోవై, సింగనల్లూర్ ప్రాంతంలో ఒడిశాకు చెందిన భవన నిర్మాణ కార్మికులు కొందరు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. వారిలో నిండు గర్భిణికి పురుటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు అంబులెన్స్కు ఫోన్ చేశారు. అది రావడం ఆలస్యం కావడంతో ఆటోడ్రైవర్ చంద్రన్కు ఫోన్ చేశారు. ఆయన వెంటనే వచ్చారు. అప్పటికే ఆ మహిళ ప్రసవ వేదనతో బాధపడుతోంది. కరోనా భయంతో ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. చంద్రన్నే ఆ మహిళకు పురుడు పోసి రియల్ హీరో అనిపించుకున్నాడు. -
కమ్యూనిస్టు – డాక్టరు – రచయిత్రి
నాలుగు అగ్నికణాలు కలిసి ఒక తుఫాన్ను సృష్టించాయి. అది 1932 శీతాకాలం. ఉత్తర ప్రదేశ్లోని నలుగురు యువతీ యువకులు కలిసి ‘అంగారే’ (అగ్నికణాలు) పేరుతో ఉర్దూలో పది చిన్న కథలు, నాటికల సంకలనం వేశారు. అది ఆనాటి రాజకీయ, సామాజిక వ్యవస్థపై యువతరం ప్రకటించిన యుద్ధం. దీనికి కేంద్ర బిందువైన రషీద్ జహాన్ కోపోద్రిక్త యువరచయిత్రిగా గుర్తింపు పొందింది. ఏడాది తిరక్కుండా అసెంబ్లీ ఆ పుస్తకాన్ని నిషేధించింది. అగ్నికణాల రషీద్ జహాన్గా పేరుపడ్డ ఆమె నిషేధానికి భయపడలేదు. తన భావాలతో కొందరిని విసిగిస్తూ, రెచ్చగొడుతూ కొత్త తరానికి ప్రేరణ అయ్యింది. అప్పటికి 14 ఏళ్ళ వయసున్న ఇస్మత్ చుగ్తాయ్ ఈమె నుంచే ప్రేరణ పొంది, ఆ తరువాత ప్రముఖ రచయిత్రిగా గుర్తింపు పొందింది. ‘ఆమె నన్ను పూర్తిగా చెడగొట్టింది. ఆమె చాలా ధైర్యస్తురాలు. ఏ విషయమైనా, నిర్భయంగా, బహిరంగంగా మాట్లాడేది. నేను అచ్చం ఆమెలాగానే ఉండాలనుకున్నాను’ అని రషీద్ జహాన్ గురించి ఇస్మత్ చుగ్తాయ్ తన ఆత్మకథలో రాసింది. ప్రగతిశీల భావాలున్న అలీఘడ్లోని ఒక కుటుంబంలో రషీద్ జహాన్ 1905లో జన్మించింది. ఆమె తండ్రి షేక్అబ్దుల్లా స్త్రీల విద్య, విజ్ఞానాల కోసం ‘ఖాతూన్’ అనే ఉర్దూ పత్రికను నడిపేవాడు. చిన్న తనం నుంచి స్త్రీ విద్యే ఊపిరిగా జీవించిన రషీద్ 19 ఏళ్ళ వయసులో సైన్సులో పట్టా పొంది, మరో అయిదేళ్ళకు ఢిల్లీలో వైద్యవిద్యను పూర్తి చేసుకుంది. తొలితరం ఉర్దూ రచయిత్రి మాత్రమే కాదు, తొలితరం స్త్రీ వైద్యురాలిగా కూడా గుర్తింపు పొందింది. అప్పటి వరకు నిషేధించినట్టు చూసిన లైంగిక ఆరోగ్యం, గర్భధారణ, గర్భస్రావం, కుటుంబ నియంత్రణ, స్త్రీల లైంగిక జడత్వం వంటి అంశాలపైన ఆమె రాయడానికి ప్రయత్నించింది. 1933లో భారత కమ్యూనిస్టు పార్టీలో పూర్తికాలపు సభ్యురాలిగా చేరింది. ఆ మరుసటి సంవత్సరం తన సహ రచయిత మహమ్మద్ జఫ్ఫార్ను వివాహం చేసుకుంది. అతను ఇంగ్లాడ్ వెళ్ళి ‘అభ్యుదయ రచయితల సంఘం’(పీడబ్ల్యూఏ) ముసాయిదా ప్రణాళికను పట్టుకొచ్చాడు. ‘అంగార్’ రచయితల భావాలు భారత దేశంలో ఏర్పడిన ‘అభ్యుదయ రచయితల సంఘం’ ప్రణాళికలో ప్రతిధ్వనించాయి. లక్నోలో 1936 లో ప్రేమ్చంద్ అధ్యక్షతన జరిగిన అభ్యుదయ రచయితల సంఘం ప్రథమ మహాసభల నిర్వహణలో రషీద్ కీలక పాత్ర పోషించింది. అమృత్సర్లో కొంత కాలం వైద్యవృత్తిని కొనసాగిస్తూ, అక్కడి కార్మిక వర్గం కోసం పాటుపడింది. ఆ తరువాత డెహ్రాడూన్ వచ్చి అఖిలభారత అభ్యుదయ రచయితల సంఘం (ఏబీపీడబ్ల్యూఏ) కార్యక్రమాలలో పూర్తిగా మునిగిపోయింది. ఆమె పాతిక నుంచి 30 కథలు, 15 నుంచి 20 లఘు నాటికలు రాసినట్టు లెక్క. వాటిలో చాలా మటుకు లభ్యం కావడం లేదు. ‘ఆమె స్త్రీ పాత్రలు లేచి నిలబడ్డాయి. ధిక్కరించాయి. ప్రతిఘటించాయి. అవి సంకల్ప బలం ఉన్న పాత్రలు’ అని సాహిత్య చరిత్రకారిణి మధులికా సింగ్ రాస్తారు. ‘దిల్లీకే షైర్’(ఢిల్లీ యాత్ర) అన్న ఆమె కథ చాలా ప్రశంసలు పొందింది. ‘పర్దే కే పీఛే’(బురఖా వెనుక) అన్న చిన్న నాటిక కూడా ఎంతో పేరు తెచ్చింది. ఇది ‘అంగారే’లో ప్రచురితమైంది. ‘ఇఫ్తారి’, ‘గరీబోంకా భగవాన్’, ‘ఇస్తికార’ వంటి కథలు ద్వంద్వ విలువల కపటత్వాన్ని బహిర్గతం చేశాయి. రక్షిందా జలీల్ రాసిన రషీద్ జహాన్ జీవిత కథకు రాసిన ముందు మాటలో ఆమె మేనల్లుడు, భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసిన సల్మాన్ హైదర్ ఇలా అంటారు: ‘ఆమె కమ్యూనిస్టు సంబంధాలు కలిగి ఉండటం వల్ల ఎక్కడికెళ్లినా మఫ్టీ పోలీసులు వెన్నాడేవారు. ’ స్త్రీ వైద్య నిపుణురాలిగా, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా, ‘చింగారి’ అనే ఉర్దూ సాహిత్య పత్రిక సంపాదకురాలిగా బహుముఖాలుగా కృషి చేసింది. అయినా తనను ‘కామ్రేడ్ రషీద్ జహాన్’ గా పిలిపించుకోవడానికే ఇష్టపడేది. గర్భాశయ క్యాన్సర్కు మాస్కోలో చికిత్స పొందుతూ 1952 లో తుదిశ్వాస విడిచింది. అప్పుడామె వయసు 47 సంవత్సరాలు. ‘కమ్యూనిస్టు– డాక్టరు– రచయిత్రి’ అన్న మూడు మాటలు మాస్కోలోని ఆమె సమాధిపైన శిలాక్షరాలుగా వెలుగుతూనే ఉంటాయి. (మూలం : అబిద్ ఖాన్, అక్షయ చవాన్ వ్యాసం) - డా‘‘ ఎస్.జతిన్ కుమార్ రషీద్ నన్ను పూర్తిగా చెడగొట్టింది. ఏ విషయమైనా, నిర్భయంగా, బహిరంగంగా మాట్లాడేది. నేను అచ్చం ఆమెలాగానే ఉండాలనుకున్నాను. – ఇస్మత్ చుగ్తాయ్ -
సమాజ వ్యక్తిత్వ వికాసం మొగిలయ్య
ఈ దేశంలో సామాన్యుల గరుకు జీవితాలన్నీ మహోన్నత వ్యక్తిత్వాలే. అలాంటి ఎందరెందరో సామాన్యులలో నిలిచిన ఒక సామాజిక పాఠం ఘంటా మొగిలయ్యది. 80 ఏళ్లకుపైగా జీవించి, జనవరి 10న కన్నుమూసిన ఘంటా మొగిలయ్య తన చుట్టుపక్కల సమాజాన్ని తన రెండు చేతులా ఒడిసిపట్టి కాలచక్రం వెంట కదిలాడు. మొగిలయ్యకు 9 ఏళ్లు వచ్చేసరికి తను పుట్టి పెరిగిన కరీంనగర్ జిల్లాలోని ధూళికట్ట వూరును వదిలివెళ్లాడు. తర్వాత దాస్వాడకు ఇల్లరికం వచ్చాడు. మానేరు ఒడ్డున 50 ఏళ్లున్నాడు. మానేరు డ్యామ్ నిర్మిస్తుంటే తన ఊరంతా ముంపునకు గురైతే మళ్లీ తన కుటుంబాన్ని, తన ఊరివారిని వెంటేసుకుని మూడో ప్రవాసానికి వెళ్లాడు. ఇదంతా పంబాల కులంలో పుట్టిన ఒక సాధారణ మనిషి జీవనయానం. తన మనవళ్లు, మనుమరాళ్ల వరకు పదుల సంఖ్యలో అందర్నీ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ఘంటా మొగిలయ్య ఊరు రక్షకునిగా ఎదిగి తన బిడ్డల్ని రాష్ట్రానికి మానవ వనరుగా అందించారు. మొగిలయ్యలో అట్టడుగున పడి కన్పించని చైతన్యం ఉంది. తన కుటుంబాన్ని, తన వూరును కంటిపాపలా కాపాడుకునేందుకు కావాల్సినంత ధిక్కారం మొగిలయ్యకు గుండె నిండా ఉంది. మనుషులంటే బోలెడు ప్రేమ. పంబాలకులం పతన్ దారీగా ఉన్న మొగిలయ్య గ్రామ సప్తదేవతల పూజారిగా జీవి తాన్ని ప్రారంభించి తను ఎదుగుతూ చివరకు జ్ఞాన జ్యోతిని చేతబట్టి నడిచిన వ్యక్తిగా మిగిలిపోయాడు. ధూళికట్టకు, ధూళికట్ట నుంచి తిరిగి మల్లాపూర్కు వచ్చి ఒక బౌద్ధభిక్షువుగా సంచరించి మానేరు నది ఒడ్డున పుట్టి తిరిగి మానేరు నది ఒడ్డుకే చేరాడు. రేపటి పాఠం అడుగుల్లో అడుగులు వేయిస్తూ చిటికెన వేలుతో ఈ ప్రపంచంలోకి నడిపించిన బాపు ఇంటి సింహద్వారం సంకురాతిరి ముగ్గులాగా అమ్మ నుదుటి బొట్టులా మెరిసిన బాపు పాదముద్రలను వదిలి వెళ్ళిపోయిండు బాపూలేని ఇంటికి వెళ్ళిన చక్రపాణీ.. తలుపు తెరిచి చూడు బిడ్డల కోసం అనుభూతుల ముల్లెను మొగిలయ్య దాచి వుంచిండు చూడు ఇదే రేపటి పాఠం.. అదే ప్రపంచం (నేటి మధ్యాహ్నం కరీంనగర్ పీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఘంటా మొగిలయ్య సంస్మరణ సభ) – జూలూరు గౌరీ శంకర్ కవి, ప్రముఖ సామాజిక వ్యాసకర్త -
పుస్తకం రాయడానికి అంతకు మించి ఇంకేం కావాలి!
-
ప్రముఖ మహిళా ఎడిటర్ సంచలన నిర్ణయం
ముంబై: బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు -2019 ను నిరసిస్తూ ప్రముఖ ఉర్దూ జర్నలిస్టు, రచయిత షిరీన్ దాల్వి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ అమానవీయ చట్టానికి నిరసనగా తనకు ప్రదానం చేసిన సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ బిల్లును పాస్ చేయడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని, సెక్యులరిజానికి విరుద్ధమని విమర్శించారు. ఈ పరిణామం తనను తీవ్రమైన విచారానికి, షాక్కు గురించేసిందని షిరీన్ వ్యాఖ్యానించారు. ''అవధ్నామా'’ ఉర్దూ పత్రిక ముంబై ఎడిషన్ ఎడిటర్గా పనిచేసిన ఆమెకు సాహిత్య రంగంలో చేసిన విశేష సేవకు గాను 2011లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అయితే చార్లీ హెబ్డో కార్టూన్ను తిరిగి ముద్రించిన వివాదంలో ఎడిటర్ పదవి నుంచి తప్పుకున్న ఆమె ఉర్దూన్యూస్ ఎక్స్ప్రెస్. కామ్ అనే న్యూస్ వెబ్సైట్ను ప్రారంభించారు. మరోవైపు మహారాష్ట్ర క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి అబ్దుర్ రహమాన్ ముంబై (రాష్ట్ర మానవ హక్కుల కమిషన్) తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం లభించడంతో ఆయన నిరాశ చెందారు. పౌరుల హక్కులకు విఘాతంగా కలిగిస్తుందంటూ బిల్లును ఖండించిన ఆయన తన సర్వీసులకు గుడ్ బై చెబుతున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. కాగా సోమవారం పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించుకన్న నరేంద్ర మోదీ సర్కార్, బుధవారం రాజ్యసభ ఆమోదాన్ని కూడా సాధించింది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన 14 సవరణలు వీగిపోయాయి. సుదీర్ఘ వాదనలు, వాకౌట్లు తరువాత రాజ్యసభ బుధవారం నాడు ఈ బిల్లుకు ఆమోదించింది. దీంతో ప్రజాస్వామ్యానికి ఇది దుర్దినమని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ పరిణామంతో ఈశాన్య రాష్ట్రాలు నిరసనలు, అల్లర్లతో అట్డుడుకుతున్నాయి. ముఖ్యంగా అసోంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు కేంద్రం సైన్యాన్ని రంగంలోకి దించింది. గువహటి, డిబ్రూగర్ ప్రాంతాల్లో ఇప్పటికే కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇంటర్నెట్ సేవలతోపాటు పలు రైళ్ల, విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. -
గ్రేట్ రైటర్ : హేర్తా మూలర్
తాను ఎవరో తెలియని ప్రదేశానికి వెళ్లాలని ఆశపడతారు హేర్తా మూలర్. సాధారణ జనాలకు దూరంగా ఉండాలని కాదు; తాను ఏ జాతి మనిషో నిర్ణయింపబడకుండా ఉండాలని. హేర్తా 1953లో రొమేనియాలో జన్మించిన జర్మన్. కమ్యూనిస్టు ప్రభుత్వం, ముఖ్యంగా నికోలాయ్ చౌషెస్కు నేతృత్వంలోని ప్రభుత్వం సాగించిన హింసాకాండ, సృష్టించిన భయోత్పాతాలను ఒక జర్మన్ మైనారిటీ వ్యక్తిగత కోణంలోంచి చిత్రిస్తారు హేర్తా. ద ల్యాండ్ ఆఫ్ గ్రీన్ ప్లమ్స్, ది అపాయింట్మెంట్, ద హంగర్ ఐంజిల్ ఆమె ప్రసిద్ధ రచనలు. కవిత్వం, వ్యాసాలు రాశారు. ఆమె రచనలు సుమారు ఇరవై భాషల్లోకి అనువాదమైనాయి. చదువు పూర్తయిన తర్వాత కొన్నాళ్లు అనువాదకురాలిగా పనిచేశారు. రహస్య పోలీసులకు సహకరించని కారణంగా ఆ ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఆమె తొలి కథల సంకలనం రొమేనియాలో సెన్సార్ చేయబడింది. కొన్ని కథల ప్రతుల్ని జర్మనీకి రహస్యంగా చేరవేశారు. ‘ఏడవడానికి తగిన ఎన్ని కారణాలైనా ఉండనీ ఏడవొద్దని చెప్పే అలిఖిత చట్టాల్నించి’ తప్పించుకుని ముప్పైల్లో ఉన్నప్పుడు ఆమె తన భర్త, రచయిత రిచర్డ్ వాగ్నర్తో కలిసి జర్మనీకి తరలి వెళ్లారు. అయినా ఆమె రచనల కేంద్రం రొమేనియాలో తను పుట్టిన పల్లెటూరే. ఉద్వాసనకు గురైనవారి జీవితాల్ని చిత్రిస్తున్నందుకుగానూ 2009లో ఆమెను నోబెల్ పురస్కారం వరించింది. -
తెలుగు తెరపై ‘త్రివిక్రమ్’ మాటల మంత్రం
-
తెలుగు తెరపై ‘త్రివిక్రమ్’ మాటల మంత్రం
మాటలతో మంత్రం వేసి...డైలాగులతో ఆలోచింపజేసే అరుదైన విధానం ఆయనకి మాత్రమే సాధ్యం. పాత్రల మధ్య పంచ్ డైలాగులతో నవ్వించాలన్నా....అనుబంధాల గురించి గుండె బరువెక్కే మాటలు రాయాలన్నా అది ఆయన కలానికి మాత్రమే సాధ్యం. ‘తెగిపోయేటప్పుడు దారం బలం తెలుస్తుంది. వెళ్లిపోయేటప్పుడు బంధం విలువ తెలుస్తుంది......మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి..కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. ’లాంటి ఎన్నో డైలాగులు ఆయన గుండె లోతుల్లోంచి రాసుకున్నవే. సినిమా చూస్తున్నంత సేపు మనల్ని కదలించే ఎన్నో సీన్లు...సినిమా అయిపోయాక కూడా ప్రేక్షకుడి మదిలో కదలాడుతూనే ఉంటాయి. అయన డైలాగుల్లో పంచ్ ఉంటుందని అంటారు కానీ, జీవితం ఉంటుందంటారు ఆయన అభిమానులు. ఆయనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన పుట్టినరోజు సందర్భంగా త్రివిక్రమ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.... -
మనుషులను వేటాడే మనిషి
‘రాత్రివేళ అంబులెన్స్ వచ్చి నన్ను పట్టుకుపోయే సందర్భం కోసమని సిద్ధంగా ఉండేందుకు– పడుకోబోయే ముందు నా పాదాలను శుభ్రంగా కడుక్కునే వయస్సులోనూ, స్థితిలోనూ ఉన్నాను’ అనే 61 ఏళ్ళ జెనీనా మాటలతో, ఓల్గా తొకార్చుక్ పోలిష్ నవల ‘డ్రైవ్ యువర్ ప్లవ్ ఓవర్ ద బోన్స్ ఆఫ్ ద డెడ్’ మొదలవుతుంది. జెనీనా ఒకానొకప్పుడు వంతెన నిర్మాణ ఇంజనీరూ, క్రీడాకారిణీ. ‘జాతీయ సరిహద్దులతో నిమిత్తంలేకుండా, ఫోన్ సిగ్నళ్ళు ఇటూ అటూ కూడా అందే’ ఆధునిక పోలండ్ – చెక్ రిపబ్లిక్ సరిహద్దుల్లో ఉన్న పేరుండని గ్రామంలో శీతాకాలం అది. లోకం నుంచి దూరం పాటిస్తూ, జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ, విలియమ్ బ్లేక్ కవిత్వాన్ని అనువదిస్తూ కాలం గడుపుతుంది కథకురాలైన జెనీనా. ఆ వేటాడే సమాజంలో నివసించే శాకాహారైన ఆమెను, ‘అడివిలో ఉండే మతిస్థిమితం లేని ముసలామె’ అనుకుంటారు స్థానికులు. జెనీనాకు, ‘మనుషుల పేర్లు ఉపయోగించడం ఇష్టముండదు. మొదటిసారి, ఒక వ్యక్తిని చూసినప్పుడు తట్టే విశేషణమే నచ్చుతుంది.’ అందుకనే ఊరివారిని తనకు తోచిన పేర్లతోనే పిలుస్తుంది. కీటక శాస్త్రవేత్త అయిన బౌరస్ ఆ పల్లెకు వచ్చి, జెనీనా ఇంట్లో ఉంటాడు. ఒకరోజు– ఆమె పొరుగింట్లో ఉండే ‘ఆడ్బాల్’ వచ్చి, పక్కనే ఉంటుండే వేటగాడైన, ‘బిగ్ ఫుట్’ చనిపోయున్నాడని చెప్తాడు. మృతుడి గొంతుకు జింక ఎముక అడ్డం పడుంటుంది. పక్కనున్న ఫొటోలో, జెనీనా కుక్కలను వేటాడి చంపేసిన వ్యక్తుల మొహాలుంటాయి. ఆ తరువాత, మరికొందరు మధ్యవయస్కులైన వేటగాళ్ళు మరణిస్తారు. అందులో ఒకరి హత్య పురుగులను గొంతులోకి దింపడం ద్వారా జరుగుతుంది. ఆ మరణాలు ఊర్లో అలజడి సృష్టిస్తాయి. ‘సంభవిస్తున్న ఈ విషాద ఘటనలకి కారణం జంతువులే అని నమ్మాలని నేను పోలీసు విభాగానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను’ అని ఆమె రాసిన తరువాత, పల్లెవాసులందరికీ ఆమెకు పిచ్చి అన్న అభిప్రాయం బలపడుతుంది. ‘నా రోగాలెప్పుడు మోసం చేస్తూ నన్ను పట్టుకుంటాయో కూడా తెలియదు... ఒకోసారి రోజులకొద్దీ కొనసాగుతాయి... మందులు, ఇంజెక్షన్లు పని చేయవు’ అనే జెనీనాను, ‘జీవితంలో నీవు చేసినదేమిటి?’ అని ఒక వ్యక్తి అడిగినప్పుడు, ఆమెకు నోటి మాట రాదు. ‘మేము ప్రేమించిన– మా బాల్యం, యవ్వనం గడిచిన జాగాలు ఇక లేవు. వాటి బాహ్యరూపం మాత్రమే భద్రపరచబడి, లోపలేమీ లేని ఈ పెంకులని చూడటం మరీ బాధాకరం. వెళ్ళేందుకు నాకే చోటూ లేదు. ఇది జైలుశిక్ష. నేను చూడగలిగే దిగంతం దీని గోడలే’ అనుకుంటుంది. ఊరంతా జెనీనాయే హంతకురాలన్న నిర్ణయానికి వచ్చి, ఆమెను నిలదీస్తారు. తను జబ్బుపడే వేళయినప్పుడు, తన కుక్కలను వేటాడినవారిని తానే చంపేసేదాన్నని ఒప్పుకుంటుంది. జెనీనా, బౌరస్ కలిసి చెక్ రిపబ్లిక్లో కొత్త జీవితం ప్రారంభిస్తారు. నవల్లో ఉన్న 17 అధ్యాయాలూ, బ్లేక్ కవితల్లో నుంచి తీసుకున్న ఉల్లేఖనాలతోనే మొదలవుతాయి. 2009లో పోలిష్ భాషలో వచ్చిన పుస్తకం–ప్రకృతి, దానిపైన మానవుల ప్రభావం, వేట, దాని క్రూరత్వం వంటి సమకాలీన సాహిత్య సమస్యలకు సరితూగి, పాతదనిపించదు. అధికారం, డబ్బు, పితృస్వామ్యం గురించి మాట్లాడే నవల వచనం– సున్నితమైన హాస్యం నుండి విచారానికీ, దుర్బలత్వానికీ పాదరసంలా మారుతుంటుంది. ఏంటోనియా లాయిడ్ జోన్స్ ఇంగ్లిష్ అనువాదాన్ని రివర్ హెడ్ బుక్స్– ఆగస్టు 2019లో ప్రచురించింది. ఈ మర్మంతో కూడిన నవల కట్టుకథ శీర్షిక, బ్లేక్ ‘ప్రావర్బ్స్ ఆఫ్ హెల్’లో ఒకటి. ఆగెనెస్కియా హాలెండ్ దర్శకత్వంలో ఈ నవల ఆధారంగా 2017లో సినిమా కూడా వచ్చింది. 1962లో జన్మించిన ఓల్గా తొకార్చుక్ తన ఫ్లైట్స్ నవలకుగానూ 2018లో మ్యాన్ బుక్ ఇంటర్నేషనల్ బహుమతి పొందారు. ఇది పొందిన మొట్టమొదటి పోలిష్ రచయిత్రి ఈమె. కార్యకర్త కూడా అయిన తొకార్చుక్ పుస్తకాలన్నీ పోలండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీల చరిత్రకు సంబంధించినవై, పౌరాణిక స్వరంతో వినిపిస్తాయి. 29 భాషల్లోకి అనువదించబడిన రచయిత్రి పుస్తకాలు ఆమె ఎంతోకాలం గడిపిన కోయెడ్జో్క లోయ నేపథ్యంగా రాసినవి. 2018 నోబెల్ పురస్కారాన్ని కూడా ఓల్గాకు ప్రకటించడంతో ఒకే ఏడాది రెండు ప్రధాన అవార్డులు ఆమెను వరించినట్టయింది. అయితే బుకర్ బహుమతి ఒక పుస్తకానికి ఇచ్చేది కాగా నోబెల్ జీవితకాల కృషికి దక్కే గుర్తింపు.2019 నోబెల్ పురస్కారాన్ని ఆస్ట్రియన్ రచయిత పీటర్ హ్యాంకీకి ప్రకటించినప్పుడే, 2018కి గానూ ఓల్గాకు ఇస్తున్నట్టు ప్రకటించారు. గతేడాది నోబెల్ కమిటీ మీద వచ్చిన వివాదాల నేపథ్యంలో అవార్డును ఎవరికీ ప్రకటించలేదు. ఆ వాయిదా పడిన అవార్డును ఇప్పుడు ప్రకటించారు. కృష్ణ వేణ -
పీటర్ హండ్కేకు సాహిత్యంలో నోబెల్
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా రచయిత పీటర్ హండ్కేకు 2019 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్ బహుమతి దక్కింది. భాషా చాతుర్యంతో ప్రభావశీలతతో కూడిన అసమాన కృషితో పాటు మానవ అనుభవం యొక్క విశిష్టతను అన్వేషించినందుకుగాను ఆయనకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం యూరప్లో అత్యంత ప్రభావవంతమైన రచయితల్లో ఒకడిగా పీటర్ హండ్కే ఎదిగారని సాహిత్యంలో నోబెల్ బహుమతి ప్రకటించిన స్వీడిష్ అకాడమీ పేర్కొంది. 2018 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్ ప్రైజ్కు పోలండ్కు చెందిన రచయిత ఓల్గా టొకార్జక్ను ఎంపిక చేశారు. స్వీడన్ వ్యాపారవేత్త, కెమిస్ట్, ఇంజనీర్ ఆల్ఫ్రెడ్ నోబెల్ అభీష్టం మేరకు ఏర్పాటు చేసిన అయిదు అంతర్జాతీయ అవార్డుల్లో సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ ఒకటి. ఇక ఈ ఏడాది వైద్యంలో నోబెల్ ప్రైజ్ శాస్త్రవేత్తలు విలియం కెలిన్, పీటర్ జే రాట్క్లిఫ్, గ్రెగ్ ఎల్ సెమెంజలకు లభించింది. విశ్వం ఆవిర్భావ గుట్టును విప్పినందుకు శాస్త్రవేత్తలు జేమ్స్ పీబల్స్, మైఖేల్ మేయర్, ఖ్వెలోజ్లను ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ వరించింది. మరోవైపు ఇథియం-ఇయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేసినందుకు గాను జాన్ బి గుడ్ఎనఫ్, ఎం స్టాన్లీ విటింగ్హామ్, అఖిర యొషినోలకు కెమిస్ర్టీలో నోబెల్ బహుమతి దక్కింది. నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం ప్రకంటించనుండగా ఎకనమిక్స్లో నోబెల్ ప్రైజ్గా గుర్తింపు పొందిన నోబెల్ మెమోరియల్ ప్రైజ్ ఇన్ ఎకనమిక్ సైన్సెస్ను సోమవారం వెల్లడిస్తారు. -
బిచ్చమెత్తుకుంటున్న కథా రచయిత..
ఆశ ఆవిరైంది.. అవకాశం చిక్కనంది.. జీవితం ఒంటరైంది.. ఫుట్పాతే దిక్కయింది.. బిచ్చమే బతుకయింది...అయినా ఆయనలో ఆత్మస్థైర్యం సన్నగిల్లలేదు. సినిమాలపై ఆసక్తి తగ్గలేదు. ఒక్క చాన్స్ దొరక్కపోతుందా? అనే ఆశతో ఇప్పటికీ ఎదురు చూస్తున్నాడు. సినీ అవకాశం కోసం దాదాపు 55 ఏళ్లుగా నిరీక్షిస్తున్నాడు. ఇప్పటికే 100 కథలు రాశాడు. ఇంకా రాస్తూనే ఉన్నాడు. 72 ఏళ్ల వృద్ధుడి వ్యధ ఇది. ఓ కథా రచయిత జీవిత కథ ఇది. బంజారాహిల్స్: గుంటూరు జిల్లా ఎడ్లపాడు గ్రామానికి చెందిన కొండా రామారావుకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. తానూ వెండితెర మీద వెలిగిపోవాలని కలలు కనేవాడు. అదే ఆశతో 1964 ప్రాంతంలో మద్రాస్ రైలెక్కాడు. కానీ అవకాశాలు రాలేదు. తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్కు తరలిరావడంతో ఆయనా మకాం మార్చాడు. కనీసం చిన్న పాత్ర అయినా చేయాలని జూనియర్ ఆర్టిస్ట్గా చేరాడు. కానీ విఫలమయ్యాడు. ఇక కథలు రాసుకొని రచయితగానైనా రాణించాలని కలం పట్టాడు. ఒకట్రెండు కాదు.. ఏకంగా 100 కథలు రాశాడు. కానీ ఒక్కరూ ఆ కథలు వినలేదు.. అవకాశం ఇవ్వలేదు. పనిమనిషిగా ప్రస్థానం... ఎన్టీఆర్, ఏఎన్నార్, రావుగోపాల్రావు, కైకాల సత్యనారాయణ, రాజబాబులను తెరపై చూస్తూ తానూ అంతటివాడిని కావాలని రామారావు కలలు కన్నాడు. మద్రాస్ వెళ్లాక నాలుగైదు రోజులు పాండీబజార్ ఫుట్పాత్లపై కాలం వెళ్లదీశాడు. ఎన్టీఆర్ ఇల్లు జాడ తెలుసుకొని అక్కడ పని మనిషిగా చేరాడు. సమయం చూసి తన మనసులోని మాటను ఎన్టీఆర్కు చెప్పాలనుకున్నాడు. ఎన్టీఆర్ భార్య బసవతారకం ఓసారి మాటల సందర్భంలో రామారావు ఎందుకొచ్చాడో తెలుసుకొని... ‘సినిమాల్లో చేరాలంటే ఇళ్లల్లో కాదు పనిచేయాల్సింది. స్టూడియోల్లో అవకాశాలు వెతుక్కోవాల’ని సూచించి పంపించింది. అయితే రామారావుకు స్టూడియోల్లోనూ చుక్కెదురైంది. ఇక లాభం లేదని ఏఎన్నార్ ఇంటికి వెళ్లాడు. అక్కడో మూడు రోజులు పని చేసిన తర్వాత అవకాశాలు ఏమాత్రం దక్కవని అర్థమైంది. అప్పటి నటీనటులు జయలలిత, ఆర్.నాగేశ్వర్రావు, గీతాంజలి తదితరుల ఇళ్లలోనూ పనిచేస్తూ అవకాశాల కోసం ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. సినిమాల్లో వేషాల కోసం సరిగ్గా దశాబ్ద కాలం తిరిగినా ఎక్కడా అవకాశం రాలేదు. మద్రాస్ టు హైదరాబాద్ చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు తరలిరావడంతో... రామారావు కూడా ఇందిరానగర్కు మకాం మార్చి జూనియర్ ఆర్టిస్ట్గా చేరాడు. చిన్న చిన్న వేషాలు వేస్తే కడుపుకింత తిండి దొరికేది తప్పితే.. సరైన అవకావం రాలేదు. ఈలోపు భార్య అంజమ్మ చనిపోవడం, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లయి వెళ్లిపోవడంతో రామారావు జీవితం ఒంటరైంది. సినిమా అవకాశాల కోసం తిరగడానికి, కుటుంబ పోషణకు, పిల్లల పెళ్లిళ్లకు ఉన్న కొద్దిపాటి ఆస్తిపాస్తులు అయిపోయాయి. ఇక ఫుట్పాతే ఆయనకు పూలపాన్పు అయింది. అదే ఆయన కథలకు వేదికయింది. తరచూ సినిమాలు చూస్తుంటే ఆ కథలపై వైరాగ్యం పుట్టుకొచ్చిందని, ఈ దిక్కుమాలిన కథలేంటంటూ నిర్వేదానికి గురై తానే ఫుట్పాత్పై కథలకు శ్రీకారం చుట్టానన్నాడు. అయితే వర్షం వచ్చినప్పుడల్లా రాసుకున్న కథలన్నీ తడిసిపోవడం జరిగిందన్నారు. 20 ఏళ్ల కాలంలో వందకు పైగా కథలు రాసి ఉంటానని చెప్పారు. సాంఘీకం, పౌరాణికం, చారిత్రాత్మకం, బయోపిక్స్ ఇలా ఏదైనా సరే అవలీలగా రాసే రామారావు... ఇప్పటికీ ఫిలింనగర్ శంకర్విలాస్ చౌరస్తాలోని ఓ బస్టాప్లో ఉంటున్నాడు. రాత్రి సమయాల్లో కథలు రాస్తూ తన కోరిక నెరవేర్చుకుంటున్నాడు. ఆనందం నాకిప్పుడు ఏ బాధా లేదు. రాత్రి 12గంటల వరకు ప్రశాంతంగా కథలు రాసుకుంటాను. కథా రచనలోనే నాకెంతో ఆనందం ఉంటుంది. ఇవి సినిమా రూపంలో రాకపోయినా... నేను నా కోరికను ఇలా తీర్చుకుంటున్నాను. కథలు సినిమాలకు పనికిరాకపోయినా ఇలాగే రాస్తుంటాను. ప్రతిరోజు రెండు పత్రికలుచదువుతాను. ఆదివారమైతే నాలుగు కొంటాను.ఎప్పటికైనా ఎవరైనా దర్శక నిర్మాతలు నన్ను సంప్రదించకపోతారా? అనే ఆశతో ఎదురుచూస్తున్నాను. ఆకలి ఆకలి తీర్చుకునేందుకు ఫిలింనగర్లోని రాజరాజేశ్వరీ దేవాలయం వద్ద ప్రతిరోజు 3గంటల పాటుకూర్చుంటాను. ఆ సమయంలో కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. వాటిని పుస్తకంలో రాసుకుంటాను. రోజూ రూ.50 మాత్రమే చేతిలో పడ్డాక తిరిగి వెళ్తాను. అవి నా తిండికి సరిపోతాయి. అంతకన్నా ఎక్కువఅవసరం లేదు. -
గ్రేట్ రైటర్; పాట్రిక్ మొజానో
జాన్ పాట్రిక్ మొజానో (Patrick Modiano) ఫ్రాన్స్లో 1945లో జన్మించాడు. తండ్రి ఇటలీ–యూదు మూలాలున్నవాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చీకటి వ్యాపారం చేసేవాడు. తల్లి బెల్జియన్. యూదుల మీద అప్పుడు ఉన్న ఒత్తిడి; నటి అయిన తల్లి ఊళ్లు తిరగాల్సిరావడం; మొజానో పుట్టినతర్వాత తల్లిదండ్రులు విడిపోవడం; ఇలాంటి కారణాల వల్ల మొజానో చిన్నతనంలో అమ్మమ్మ, తాతయ్య దగ్గర పెరిగాడు. దాంతో ఉత్తర బెల్జియంలో మాట్లాడే ఫ్లెమిష్ భాష మాధ్యమంలో తొలుత చదువుకున్నాడు. తరువాత ఫ్రెంచ్లోకి మళ్లాడు. చిన్నప్పుడు తమ్ముడు రూడీతో ఎక్కువ సన్నిహితంగా ఉండేవాడు. రూడీ తొమ్మిదేళ్లప్పుడు జబ్బుచేసి హఠాత్తుగా చనిపోయాడు. రాయడం మొదలుపెట్టిన మొదటి పదిహేనేళ్లు మొజానో రాసిన ప్రతి పుస్తకాన్నీ తమ్ముడికే అంకితం ఇచ్చాడు. 22 ఏళ్లప్పుడు రాసిన ఆయన తొలి నవల రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఒక యూదు గురించి రాసింది. ఆ నవల తండ్రికి అసంతృప్తి కలిగించింది. మార్కెట్లో ఉన్న ప్రతి కాపీని కొనేందుకు ప్రయత్నించాడు. తర్వాత కూడా తండ్రి నుండి ఏ రూపంలోనూ మొజానోకు సహకారం అందలేదు. ఈ నవల తర్వాత్తర్వాత హాలోకాస్ట్ అనంతరం వచ్చిన ఉత్తమ సృజనల్లో ఒకటిగా నిలిచింది. సుమారు ఇరవై నవలలు రాశాడు మొజానో. గతంలోంచి తన మూలాలకు సంబంధించిన ఒక్కో శకలాన్నీ ఏరుకుంటూ తన అస్తిత్వాన్ని రూపించుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకే ఆయన్ని ‘మన కాలపు మార్సెల్ ప్రూస్ట్’ అంటారు. 2014లో నోబెల్ పురస్కారం వరించింది. -
అనగనగా ఓ రచయిత్రి
సాక్షి,సిటీబ్యూరో :తల్లి సరదాగా రాసిన కథలు చదివి స్ఫూర్తి పొందిన ఓ యువతి తనూ అదే మార్గంలో ప్రయాణం మొదలుపెట్టారు. తెలుగు భాషపై పట్టు సాధించి అక్షరాలతో చెలిమి చేశారు. అలా తన మనసులోనిభావాలను కథలు, కవిత్వంగా మలిచి.. పుస్తకాల్లో అచ్చుగా చూసుకుని మురిసిపోయారు. ఆ రచనలు ప్రజాబాహుళ్యంలో ప్రాచుర్యం పొందడంతో పాటు తనకంటూ గుర్తింపు తెచ్చాయి. ఆమే నగరానికి చెందినతంగెళ్ల శ్రీదేవిరెడ్డి. 50కి పైగా కథలు ప్రచురణ రామంతపూర్లో నివాసముంటున్న తక్కెళ్లపల్లి శ్రీదేవిరెడ్డి తల్లి సుజాత కూడా పలు రచనలు చేశారు. అమ్మ నుంచి నేర్చుకున్న కథా నేర్పును శ్రీదేవిరెడ్డి ఒంటబట్టించుకున్నారు. ఈమె బతుకమ్మ, బోనాలు వంటి ప్రత్యేక వేడుకల కోసం రాసిన పాటలు అందరి నోళ్లలో పలుకుతున్నాయి. అంతేకాదు.. కథా వ్యాసాంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారామె. శ్రీదేవి ఇప్పటి దాకా దెయ్యం, దేవుడు పారిపోయాడు, ఇన్నూరు, కావలి బుడ్డమ్మ తదితర 50కి పైగా కథలు రాశారు. ఇవి పలు దినపత్రికల్లో ప్రచురణ కూడా అయ్యాయి. కథలు శ్రీదేవి ఊహల నుంచి పుట్టినవే అయినా.. ప్రతి కథా నిజ జీవితాలను ప్రబింబించడం గమనార్హం. అంతేకాదు.. అచ్చమైన పల్లె జీవన నాటిని ఒడిసిపట్టుకున్న శ్రీదేవిరెడ్డి చక్కని వాడుక పదాలతో రాసిన ‘కాముని పండుగ, ఎల్లగొట్టు’ వంటి కథల్లో వనపర్తి, ఆత్మకూరు, గద్వాల వంటి గ్రామాల్లోని ప్రజలు మాట్లాడే పదాలు, వారి జీవనాన్ని ప్రతిబింబిస్తాయి. శ్రీదేవిరెడ్డి రాజకీయ నేతల పొలిటికల్ క్యాంపెయిన్ పాటలు సైతం రాశారు. వీటిలో వైఎస్సార్సీపీకి, జగన్ వ్యక్తిత్వంపై, పొన్నం ప్రభాకర్ వంటి వారికి రాశారు. ప్రత్యేకహోదాపై రాసిన పాటను ఎంతో గుర్తింపు పొందింది. సినీ కవిత్వంలోనూ దిట్ట ఇటీవల విడుదలైన ‘దొరసాని’ సినిమాలో హీరో.. హీరోయిన్ను చూసిన ప్రతిసారీ ఓ కవిత చెబుతాడు. అవన్నీ శ్రీదేవి రాసినవే కావడం విశేషం. ఈమె ప్రతిభన గుర్తించిన శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ‘వాసిరెడ్డి రంగనాయకమ్మ సార్మక పురస్కారం’తో సత్కరించింది. కళాసంస్కృతి సంస్థ ‘కవితారాణి’, సూర్యచంద్ర సాంస్కృతిక సంఘ సేవా సంస్థ ‘గౌడ కవితారత్న’, హైదరాబాద్ సిటీ కేబుల్ నుంచి ‘బెస్ట్ రైటర్’ వంటి అవార్డులు అందుకున్నారు. ఈ కథలు బాగా ఫేమస్ ‘ప్లాస్టిక్ పూలు, పరమవీర చక్ర, టీజింగ్ రోమియో, అర్థాలే వేరులే, ఎదురింట్లో భామ–ఇంట్లో భామ, ద్వంసగీతం, ఒక ప్రేమకథ, ఎరుపెక్కిన తెల్లగులాబి, మస్కా, అమ్మ, సదువు, ఊహల పల్లకిలో, తనశవమై ఒకరికి వశమై, ప్రేమశకలం, మేఘమాల, ఆ రాత్రి, లవ్లీ మై హీరో, అమ్మకొడుకు, ప్రేమ శకలం, మాతృ హృదయం, నువ్వొస్తావని, వేకువ, మందాకిని’ వంటి కథలు పాఠకులకు బాగా చేరువయ్యాయి. ఇక ‘ఆశ్రమం, పూలు నలుగుతున్నాయి, నాయిన, చారాణ, అమ్మా మల్లెప్పుడొస్తవే!, మొగిలి, ష్.., తాత చెప్పిన కథ, వెన్నెల కురుస్తుందో లేదో!, పాడుబడ్డ బాయి, తగలబడిన వెన్నెల’ వంటి కథలు ఆన్లైన్ కూడా ఎంతో పేరు, ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. అందరికీ చేరువవ్వాలి నాకు చిన్నప్పటి నుంచి కథలు, కవితలు రాయడమంటే చాలా ఇష్టం. నిజ జీవితానికి దగ్గరగా, ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా నా రచనలు ఉంటాయి. కొన్ని సినిమా కథలు కూడా సిద్ధం చేసుకున్నాను. బతుకమ్మ, బోనాలకు గ్రామాల్లో ఉండే వాతావరణాన్ని ప్రపంచానికి తెలిసేలా పాటలు రాశాను.– తంగెళ్ల శ్రీదేవిరెడ్డి, రచయిత్రి -
‘ఇక్కడ రచయితలకు గౌరవం లేదు’
ఎప్పటికైనా దర్శకత్వం వహిస్తా అంటున్నారు ప్రముఖ రచయిత, నటుడు వేల రామమూర్తి. నటనకు అర్హత అంటూ ఏం ఉండదు. ఇంకా చెప్పాలంటే ఎలాంటి శిక్షణ లేకుండా నటుడిగా రాణించడం అన్నది ఒక్క సినిమా రంగంలోనే సాధ్యం అనుకుంటా. వేల రామమూర్తిని చూస్తే అలానే అనిపిస్తుంది. అసలు ఈయన జీవితమే అనూహ్య మలుపులతో సాగి ప్రస్తుతం నటుడి వరకూ వచ్చి ఆగింది. ముందు ముందు మరిన్ని మలుపులు తిరగబోందట. ఆ సంగతులేంటో ఆయన్నే అడిగి తెలుసుకుందాం. ప్రముఖ రచయిత అయిన మీ నేపథ్యం గురించి చెప్పండి? మాది రామనాథపురం జిల్లా, పెరునాడు గ్రామం. చదివింది పీయూసీ. ఆ తరువాత ఒకసారి చెన్నైకి వస్తే, స్థానిక తేనాంపేటలో మిలటరీ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ జరుగుతుండడంతో ప్రయత్నిద్దామని అందులో పాల్గొన్నా ను. అలా యాదృచ్ఛికంగానే ఎంపికయ్యాను. మధ్యప్రదేశ్లోని జంబలపుడిలో సైనికుడిగా పోస్ట్ వేశారు. అక్కడ ఐదేళ్లు పని చేశాను. ఆ తరువాత పోస్టల్ శాఖలో కొంత కాలం పని చేశాను. అయితే నాకు చిన్నతనం నుంచి రచనలంటే ఆసక్తి. దీంతో రచయితగా పలు కథలు రాశాను. అందులో ఒకటి కుట్రపరంపరై. నటుడిగా పరిచయం గురించి? రచయితగా పేరు వచ్చిన తరువాత అనుకోకుండా మదయానై కూట్టం చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. సరే చేసి చూద్దాం అని నటనలోకి దిగాను. ఆ చిత్రంలో నా నటనకు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటూ వరుసగా అవకాశాలు ఇస్తున్నారు. ఒక సైనికుడినైనా నేను నటుడిగా రాణించడం నిజంగా ఆశ్చర్యమే. మీరు రాసిన కుట్రపరంపరై కథను సినిమాగా చేయాలని ప్రఖ్యాత దర్శకులు భారతీరాజా, బాలాలు పోటీ పడ్డారు. ఆ విషయం ఏమైంది? ఆ సమస్య సమసిపోయింది. త్వరలోనే కుట్రపరంపరై కథతో భారీ చిత్రం తెరకెక్కబోతోంది. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. కథా రచయితకు గౌరవం లేదని ఇటీవల నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. మీ స్పందనేంటి? కథా రచయితలకు ఇక్కడ గౌరవం లేదన్నది నిజం. తెలుగు, మలయాళం వంటి భాషల్లో మంచి మంచి కథా చిత్రాలు వస్తున్నాయి. తెలుగులో బాహుబలి వంటి చిత్రాలు ఇక్కడ ఎందుకు రావడం లేదు? ఆ చిత్ర కథా రచయిత విజయేంద్రప్రసాద్ లాంటి వారికి పేరు, ప్రఖ్యాతులు చూడండి. తెలుగు, మలయాళం చిత్రాలు సాధిస్తున్న జాతీయ అవార్డులను మన తమిళ చిత్రాలు ఎందుకు పొందలేకపోతున్నాయి? కథా రచయితలకు తగిన గుర్తింపు లేకపోవడమే. నటుడిగానే కొనసాగుతారా? లేక మరో ఆలోచన ఉందా? నాకు తగ్గ పాత్రలు వస్తున్నాయి. అందుకే నటుడిగా కొనసాగుతున్నాను. దర్శక నిర్మాతలు వైవిధ్యభరిత పాత్రలను ఇస్తున్నారు. అయితే కచ్చితంగా దర్శకుడినవుతాను. నేను రాసుకున్న కథతోనే చిత్రం చేస్తాను. అదీ రామనాథపురం నేపథ్యంలో సాగే కథతోనే చిత్రాన్ని తెరకెక్కిస్తా. తాజాగా మీరు నటించిన మయూరన్ చిత్రంలో పాత్ర గురించి? మయూరన్ చిత్రంలో కళాశాల ప్రిన్సిపల్గా నటించాను. తొలిసారిగా చిత్ర కథానాయకుడి లాంటి పాత్రను ఇందులో చేశాను. ఇంతకు ముందు నటించిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. దర్శకుడు బాలా శిష్యుడు నందన్ సుబ్బరాయన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం 30వ తేదీన తెరపైకి రానుంది. -
ప్రముఖ రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్య
సాక్షి, విశాఖపట్నం: ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యురాలు జగద్ధాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గతంలో లెక్చరర్గా ఆమె పనిచేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో జగద్ధాత్రి పలు రచనలు చేశారు. కవితలు రాశారు. ప్రముఖ రచయిత, సన్నిహితుడు రామతీర్థ ఆకస్మికంగా మృతి చెందడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనైనట్టు తెలుస్తోంది. మానసిక క్షోభతోనే ఆమె తీవ్ర నిర్ణయం తీసుకున్నారని పోలీసులు చెప్తున్నారు. జగద్ధాత్రి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తోటి కవులతో స్నేహంగా ఉండేవారు. ఆమె మృతి పట్ల సాహిత్యలోకం, సోషల్ మీడియాలో సంతాపాలు వ్యక్తమవుతున్నాయి. ‘జగద్దాత్రి అక్కా .. ఎంత పని చేశావ్ ..నిన్ను చూస్తుంటే ఎంత ధైర్యంగా ఉండేది.. దుఃఖం ఆగట్లేదక్కా’ అని ప్రముఖ కవయిత్రి మెర్సీ మార్గరేట్.. జగద్ధాత్రి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. -
కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై...
మహాకవుల పంక్తులకూ పల్లవులకూ స్వరాలు అద్దగలిగిన అంతిమ సంగీతకారుడు నిదుర కొరకు శిరము వాల్చాడు. మానవ మాధుర్యాలనూ జీవన వేదనలనూ కాగితంపై పెట్టగల ప్రతి మహోన్నత కలానికి తోడు నిలిచి, పాటగా మలిచి ప్రజలకు చేర్చిన నాదవాహకుడు అంతిమవాహనాన్ని అధిరోహించాడు. భారతీయతకు, లోకగీతానికి, ఉత్తరాది రాగానికి, నకలు ఎరగని అసలీయతకు ఆనవాలుగా నిలిచిన తేనెబాణీల జాగీర్దారు మధుపంపకాన్ని చాలించి పరుండేందుకు మృత్తికకు చేరాడు. ఖయ్యాం మరణించాడు. పునరావృతం కాలేని ఒక సురుచిరమైన సంగీత చరిత్రను ముగించాడు. కభీ కభీ మేరే ఖయాల్ ఆతా హై కె జైసే తుజ్కో బనాయా గయా హై మేరే లియే... కొందరు పాటను ఎంచుకుంటారు. కొందరిని పాట ఎంచుకుంటుంది. సంగీత ప్రపంచానికి ఖయ్యాం కావాలి. అందుకే అది అతణ్ణి తన దరికి చేర్చుకుంది. పంజాబ్లో పుట్టిన ఖయ్యాం కుటుంబంలో సంగీతం తెలియదు. పాటా తెలియదు. అప్పుడప్పుడే జనాన్ని ఆకర్షిస్తున్న సినిమాలతో ప్రభావితమై జలంధర్ నుంచి ఢిల్లీ చేరాడు ఖయ్యాం హీరో అవుదామని. అతడి ఉద్దేశ్యం సినిమాలు ఢిల్లీలో తయారవుతాయని. ఢిల్లీలో బాబాయి ఉన్నాడు కనుక అక్కడే ఉంటూ హీరో అయిపోవచ్చని. నగరానికి చేరగానే బాబాయి లెంపకాయ తప్ప వేరే ఏమీ దొరకలేదు. ఇంట్లో కుర్రాణ్ణి కూచోబెట్టి ప్రయోజనం లేదని ఆ బాబాయి తనకు తెలిసిన అప్పట్లో ఢిల్లీలో ఉంటున్న, ఇంకా సినిమాల్లోకి రాని సంగీతకారులు హన్స్లాల్–భగత్రామ్ దగ్గరకు తీసుకెళ్లాడు. కుర్రాడు బాగానే ఉన్నాడు హీరో కావాలంటే సంగీతం తెలియాలి నేర్పిస్తాములే అన్నారు వాళ్లు. ఎవరి పాటలు వాళ్లే పాడుకోగల హీరోలు ఉండే ఆ కాలంలో అలా ఖయ్యాం పాటలోకి ప్రవేశించాడు. క్రమంగా హీరో పిచ్చి పోయి పాట పూనకం అబ్బింది. ఢిల్లీలో సంగీతం నేర్చుకున్నాడు. లాహోర్ వెళ్లి అక్కడా నేర్చుకున్నాడు. అసిస్టెంట్ స్థాయికి చేరాక రెండో ప్రపంచయుద్ధ సమయంలో సినిమాలు మూలపడితే వెళ్లి సైన్యంలో చేరాడు. హార్మోనియం వాయించడానికి తప్ప ఈ చేతులు తుపాకీ పట్టడానికి పనికి రావని గ్రహించిన అధికారులు ఇతనిలాగే సైన్యంలో పని చేస్తున్న కవి ఫయాజ్ అహ్మద్ ఫయాజ్తో జత కలిపి ఒక సాంస్కృతిక బృందంగా చేసి– పోండి.. పోయి జనాన్ని సైన్యంలో చేరేందుకు ఉత్సాహపరచండి అనంటే ఆ పనీ చేశాడు. కాని మళ్లీ బొంబాయికే చేరాడు. కొన్నిరోజులు ‘శర్మ’ అనే డూప్లికేట్ పేరుతో మ్యూజిక్ చేశాడు. మూలం నుంచి విడుదలైన నదీపాయ విశాలమయ్యి ప్రవాహమయ్యి జనమైదానం చేరడానికి సమయం పడుతుంది. ఖయ్యాంకు కూడా పట్టింది. అన్ని అడ్డంకులు తొలిగి అతడి పేరుతో తొలి పాట జనానికి చేరింది. ‘ఫుట్పాత్’ సినిమాలో తలత్ మెహమూద్ పాడగా దిలీప్ కుమార్ మీద చిత్రించిన ఈ పాట అతడు ఎగరేసిన తొలి గాలిపటం. ఖయ్యాం షామే గమ్ కీ కసమ్ ఆజ్ గమ్గీన్ హై హమ్ ఆభిజా ఆభిజా ఆజ్ మేరే సనమ్... స్వీట్ లస్సీని పోల్చుకోవడం పంజాబీవాడికి చిటికెలో పని. ఖయ్యాం చల్లలో పస ఉందని అదే పంజాబ్కు చెందిన కవి సాహిర్ లూధియాన్వీ తక్షణమే కనిపెట్టాడు. వెంటనే తాను పాటలు రాస్తున్న రాజ్ కపూర్ సినిమా ‘ఫిర్ సుబ్హా హోగి’కి రికమండ్ చేశాడు. సాధారణంగా రాజ్కపూర్ సినిమా అంటే శంకర్ జైకిషన్లు ప్రత్యక్షం కావాలి. కాని ‘ఫిర్ సుబ్హా హోగి’ సినిమా ప్రఖ్యాత రష్యన్ రచయిత్ దోస్తవ్ స్కీ నవల ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ ఆధారంగా తయారైంది. ‘ఇలాంటి కథకు కాస్త పుస్తకాలు చదివి అర్థం చేసుకోగలవాడు సంగీతం ఇవ్వాలి’ అని సాహిర్ చెప్పి ఇప్పించాడు. ఆ సినిమాకు ఖయ్యాం చేసిన ‘ఓ సుబ్హా కభీతో ఆయేగి’ పాట గంభీరమైనది. బరువైనది. లోతైనది. ఇవాళ్టికి కూడా అలాంటి శుభోదయం కోసం అందరూ ఎదురు చూసేలా చేయగలిగినది. ఆ తర్వాత ఖయ్యాం బండి ఆగలేదు. ‘షోలా ఔర్ షబ్నమ్’ లో రఫీ పాడిన ‘జీత్ హీ లేంగే బాజీ హమ్ తుమ్’ హిట్ మీదుగా ‘షగూన్’లో సూపర్ హిట్ అయిన ‘తుమ్ అప్నా రంజోగమ్’ పాట మీదుగా ‘ఆఖరీ ఖత్’లో ఇంటింటికీ చేరిన లతా పాట ‘బహారో మేరా జీవన్ భీ సవారో’ వరకూ సాగింది. అయితే అప్పటికే ‘బాబీ’ వంటి సినిమాలు విడుదలయ్యి లక్ష్మీకాంత్–ప్యారేలాల్ తుఫాన్ సృష్టిస్తున్నారు. ఆ గాలులను లెక్క చేయకుండా ఖయ్యాంను రెండు సినిమాలు నిలబెట్టాయి. ఒకటి ‘రజియా సుల్తాన్’, రెండు ‘కభీ కభీ’. రెంటికీ కూడా లక్ష్మీకాంత్–ప్యారేలాల్నే దర్శక నిర్మాతలు సైన్ చేశారు. కాని రజియా సుల్తాన్ తీస్తున్న కమాల్ అమ్రోహీకి వాళ్ల బాణీ నచ్చక ఖయ్యాం దగ్గరకు వచ్చాడు. ‘కభీ కభీ’ని తీస్తున్న యశ్చోప్రాను లక్ష్మీకాంత్–ప్యారేలాల్ ట్యూన్ చేసేటట్టయితే నా పాటలు ఇవ్వను అని సాహిర్ లూధియాన్వీ బెదిరించడంతో ఖయ్యాంను తీసుకున్నాడు. రజియా సుల్తాన్లోని ‘అయ్ దిలే నాదాన్’ పాట లతా పాడిన పాటల్లో ఒక గొప్ప పాటగా చెబుతారు. ‘కభీ కభీ’లోని ప్రతి పాటా నేటికీ సెల్ఫోన్లలో రింగ్టోన్గా వినిపిస్తూ ఉంది. ముకేష్ ఆ సినిమాలో పాడిన ‘కభీ కభీ మేరే దిల్ మే’, ‘మై పల్ దో పల్ కా షాయర్ హూ’ పాటలు చాలా పేరు తెచ్చాయి. ఆ తర్వాత యశ్ చోప్రాయే తీసిన ‘నూరి’ కేవలం ఖయ్యాం పాటల బలం వల్ల సూపర్ హిట్ అయ్యింది. అందులోని పాటలు ‘నూరీ నూరీ ఆజరే ఓ మేరె దిల్బర్ ఆజా’, ‘చోరి చోరి కోయీ ఆయే’ కథాస్థలి అయిన కాశ్మీర్ స్వచ్ఛనీటినురగల్లా ఉంటాయి. కాని ఖయ్యాంను అప్పటికీ ఇప్పటికీ బహుశా ఎప్పటికీ తలుచుకునేది ‘ఉమ్రావ్జాన్’ సినిమా కోసమే. రేఖా సినీ జీవితానికి గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఈ సినిమా, కవిగా షహరియార్కు చిరంజీవత్వం తెచ్చి పెట్టిన ఈ సినిమా, గాయనిగా ఆశా భోంస్లేకు ప్రామాణికతను ఖరారు చేసిన సినిమా, ఖయ్యాంకు చెరపలేని కీర్తిని తెచ్చి పెట్టింది. గజల్ అంటే లతా మంగేష్కర్ అనుకునే రోజుల్లో ఆశా భోంస్లే గజల్ బాగా పాడుతుందని ఖయ్యాం ఈ సినిమాతో నిరూపించాడు. ‘ఉమ్రావ్జాన్’లోని ‘ఇన్ ఆంఖొకి మస్తీమే’, ‘దిల్ చీజ్ క్యా హై’... పాటలు కొనసాగుతూనే ఉన్నాయి రసికుల మెహఫిళ్లలో ప్రస్తావనకు వస్తూ. ఖయ్యాం అంటే ఒరిజినల్ సంగీతం. రాసిన పాటకు బాణీ కట్టిన సంగీతం. గొప్ప కవిత్వానికి గొంతు ఇచ్చిన సంగీతం. కైఫీ ఆజ్మీ, జాన్ నిసార్ అఖ్తర్, అలీ సర్దార్ జాఫ్రీ వంటి గొప్ప గొప్ప కవుల కవనం అతని స్పర్శతో ఆరని సువాసనలీనింది. మన హైదరాబాదీ కవి మగ్దూమ్ మొహియుద్దీన్ గజల్ ఒకటి ‘బజార్’ సినిమా వల్ల ఖయ్యాం సంగీతంతో పూలు పూలుగా వికసించింది. ఆ గజల్–ఫిర్ ఛిడీ రాత్ బాత్ ఫూలోంకిరాత్ హై బారాత్ ఫూలోంకి... ఖయ్యాంది 92 ఏళ్ల సంపూర్ణ సార్థక జీవనం. పద్మభూషణ్ ఎత్తుకు ఎదిగిన జీవితం. తాను సంపాదించుకున్న పది కోట్ల రూపాయల ఆస్తిని ఆకలిగొన్న కళాకారుల కోసం అర్పించి స్ఫూర్తివంతంగా నిలిచిన జీవితం. శిక్కుమతానికి చెందినజగ్జిత్ను వివాహం చేసుకొని కుమారుడికి ‘ప్రదీప్ ఖయ్యాం’ అని పేరు పెట్టి సహ మత గౌరవాన్ని నిరూపించిన జీవితం.ఖయ్యాం అనే అందమైన తీరం నావలను బోర్లించేసింది. అవి కదలవు. ఇక ఒడ్డున కూచుని కెరటాల సవ్వడిని వినడం మాత్రమే మనం చేయగలిగింది.కరోగె యాద్తో హర్ బాత్ యాద్ ఆయేగి...– ఖదీర్ -
రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు
‘‘15ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. 50 నుంచి 60 సినిమాలకు రచయితగా పనిచేశా. ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో ‘ఓ బేబీ’ చాలా సంతృప్తినిచ్చింది’’ అన్నారు రచయిత లక్ష్మీభూపాల్. ‘చందమామ, అలా మొదలైంది, నేనే రాజు నేనే మంత్రి, కల్యాణ వైభోగమే’ వంటి సినిమాలకు మాటలు రాశారాయన. రచయితగా తన జర్నీ గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘నేను యాక్సిడెంటల్ రైటర్ని. 1994 నుంచి టీవీ, మీడియా రంగంలో ఉన్నాను. 2004లో నటుడు లక్ష్మీపతిగారి ద్వారా మాటల రచయితగా మారాను. కష్టాలన్నీ ముందే పడ్డాను.. అందుకే సినిమా ప్రయాణం సాఫీగా సాగినట్టుంది(నవ్వుతూ). ఫస్ట్ ‘సోగ్గాడు’ సినిమాకు మాటలు రాశాను. అప్పటినుంచి వరుసగా సినిమాలు రాస్తూనే ఉన్నాను. పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా రాయలేదు. కానీ, పెద్ద బ్యానర్లలో సినిమాలకు రాశాను. నేను అందరికీ ఓపెన్గానే ఉన్నాను. పెద్ద హీరోల సినిమాలు ఎందుకు రావడం లేదో నాకు తెలియదు. బహుశా పంచ్లు, ప్రాసలు రాయనని పిలవట్లేదేమో? ‘ఓ బేబీ’ సినిమా కోసం నేను ప్రత్యేకంగా రాసింది ఏం లేదు. అన్నీ దేవుడు రాయించారనుకుంటాను. మా అమ్మమ్మ, అమ్మ మాట్లాడే మాటల్ని సినిమాలో పెట్టాను. ‘మగాడికి మొగుడులా బతికాను’ అనే మాట మా అమ్మమ్మ నోట్లో నుంచి చాలాసార్లు వచ్చింది. ఈ సినిమాని మా అమ్మమ్మ, అమ్మకు అంకితం చేస్తున్నాను. సమంత, నందినీగార్లు ప్రతి ఫంక్షన్లో నా గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నందుకు థ్యాంక్స్. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దారుణాలు చూసి ‘మొలతాడుకి మోకాలుకి మధ్య కొవ్వు ఎక్కువై కొట్టుకుంటున్నారు’ అనే డైలాగ్ రాశాను. నేను చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం ఫెయిల్యూర్సే ఉన్నాయి. కానీ, రైటర్గా నేనెప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అలా అయ్యుంటే రెండో సినిమా దగ్గరే వెళ్లిపోయేవాణ్ణి. సినిమా నాకు నచ్చితేనే చేస్తాను. నాకే నచ్చకపోతే ప్రేక్షకుడికి నచ్చేలా ఏం రాస్తాను? త్రివిక్రమ్గారి వల్ల రచయితలకు డబ్బు విలువ తెలిసింది. రచయిత దర్శకుడిగా మారడానికి ఫ్రస్ట్రేషనో, రెమ్యూనరేషనో కారణం అవుతున్నాయి. దర్శకుడిగా మారే ఆలోచన ప్రస్తుతానికి నాకు లేదు. నా వద్ద ఓ 24 కథలు ఉన్నాయి. దర్శకుడిగా మారితే తీద్దాం అని ఆరు కథలు పక్కన పెట్టాను. నా తర్వాతి ప్రాజెక్టులు తేజ, నందినీ రెడ్డిగారు చేయబోయే సినిమాలే’’ అన్నారు. -
ఇదిగో ‘శారద’ కుటుంబం..
సాక్షి, తెనాలి(గుంటూరు) : తెనాలిలోని ఓ బ్యాంకు శాఖ...కంప్యూటర్లోకి చూస్తున్న ఉద్యోగి, కౌంటరు దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తి, తన వెనుక తదేకంగా చూస్తుండటాన్ని కళ్లజోడులోంచి గమనించాడు. వెనక్కి చూస్తే, గోడకు తగిలించిన 2018 క్యాలెండర్ కనిపించింది. అందులో కనిపిస్తున్న ఫొటోను చూస్తున్న ఆ వ్యక్తి, ‘సార్ ఆ క్యాలెండరు ఇవ్వగలరా’ అంటూ అభ్యర్థించాడు. ‘దానికేం...పాతదే కదా!’ అంటూ తీసిచ్చాడు. అపురూపంగా పట్టుకుని తీసుకెళుతున్న అతడిని ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు. మరో రెండురోజులకు ఇంటికొచ్చిన అతడి సోదరుడి కోసమని మరొకటి సంపాదిద్దామని, క్యాలెండరులోని ఫోను నెంబర్లను సంప్రదించారు. ‘పోయినేడాది క్యాలెండరు ఎందుకండీ...ఎవరు మీరు?’ అన్న ప్రశ్నకు, ‘మా నాన్న శారద ఫొటో కోసమండీ’ అన్న సమాధానం...! వినగానే సంబ్రమాశ్చర్యం...! శారద మరణతో ఆయన కుటుంబం జాడ ఎవరికీ తెలీదు. గత 64 ఏళ్లుగా సాహితీ ప్రపంచానికి ప్రశ్న మినహా ఇప్పటికీ సమాధానం లేదు. కేవలం క్యాలెండరులోని శారద బొమ్మతో ఇప్పటికి వెలుగులోకి వచ్చారు. ఆ వివరాలతో ప్రత్యేక కథనం. శారద (ఎస్.నటరాజన్) గురించి... ‘వాస్తవానికి వీసమెత్తు మారకుండా, మారినట్టు కనిపించే కుంభకోణమే ఈ శతాబ్దంలోని విశిష్టత. ఆపడానికి ఇష్టంలేని యుద్ధానికి సంవత్సరాల తరబడి సమాలోచనలు..దూరపుకొండలైన ‘శాంతి’కి సంతకాల సంరంభం..స్వంతాన కథ లేనివాడికి పాతపత్రికలు శరణ్యం...సరుకు లేని పత్రిక్కి మెరిసే ముఖచిత్రం...’ ఇలాంటి మాటలతో సాహిత్య విస్ఫోటనం చేసిన శారద అసలు పేరు ఎస్.నటరాజన్. పూర్తిపేరు సుబ్రమ్మణ్యయ్యరు నట రాజన్. తెలుగు సాహిత్యంలో కొత్త వెలుగులు కురిపించిన తమిళ నటరాజన్ కవి, కథకుడు, నవలా రచయిత, నాటక రచయిత, వ్యాస రచయిత, లిఖిత పత్రికా సంపాదకుడు. 1937లో బతుకుదెరువు కోసం తండ్రితో కలిసి తెనాలి చేరిన నటరాజన్, హోటల్ కార్మికుడిగా చాలీచాలని సంపాదనతో తండ్రిని సాకుతూ జీవితం ఆరంభించారు. పదిహేనేళ్ల వయసులో తండ్రి పోవటంతో క్షోభతో మూర్ఛరోగానికి గురయ్యాడు. హోటల్ వృత్తిలో వుంటూనే తెలుగు నేర్చాడు. నాటి తెలంగాణ పోరాటం, ఆర్థికమాంద్యం, సామాజిక సంక్షోభాలు, కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలతో ఆయన సాహిత్య సృజన వేయిరేకులై వికసించింది. భౌతికజీవితం 30 ఏళ్లయితే సాహిత్యజీవితం ఏడేళ్లు మాత్రమే. ఆ వ్యవధిలోనే శారద కలంపేరుతో నూరుకు పైగా కథలు, ఆరేడు నవలలూ రాశారు. ఆయన రచనలు ‘మంచీచెడూ’, ‘అపస్వరాలు’, ‘ఏది సత్యం’ సంచలనం రేకెత్తించాయి. దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తూ శారద కన్నుమూశారు. తెనాలిలోనే స్థిరనివాసం.. తెనాలిలోని పాండురంగపేటలో 1955 ఆగస్టు 17న శారద కన్నుమూశారు. భార్య అన్నపూర్ణ. నిండు గర్భిణి. అప్పటికే ఇద్దరు కొడుకులున్నారు. భర్త పోయిన నెలరోజులకు జన్మించిన ఆడశిశువుకు తన భర్త పేరిట ‘శారద’గా నామకరణం చేశారు. ఊహ తెలీని చిన్న కొడుకు రాధాకృష్ణమూర్తిని ఇక్కడే తెలిసినావిడకు దత్తతనిచ్చారు. శారద రచనలు, అసంపూర్తి రచనలు, ఉత్తరాలతో సహా ఆయన స్నేహితుడైన ఆలూరి భుజంగరావుకు అప్పగించారు. భర్త ఉన్నపుడే దుర్భర దారిద్య్రంలో మగ్గిన ఆ కుటుంబం, ఆయన పోయాక ఎలా వుంటుందో చెప్పేదేముంది? పెద్దకొడుకు సుబ్రహ్మణ్యం, కుమార్తె శారదతో పట్టణం వదిలి వెళ్లిపోయారు. కట్చేస్తే...ప్రస్తుతం అన్నపూర్ణ భౌతికంగా లేరు. పెద్దకొడుకు నందిరాజు సుబ్రహ్మణ్యం తిరుపతిలో వుంటున్నారు. రెండో కుమారుడు నూతలపాటి రాధాకృష్ణమూర్తి తెనాలిలో నివసిస్తున్నారు. జంపని చక్కెర ఫ్యాక్టరీలో ఉద్యోగిగా చేస్తూ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. చివరి బిడ్డ కడమేరి శారద కూడా చిన్న అన్నయ్యకు దగ్గరగా తెనాలిలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. సోదరుడు రాధాకృష్ణమూర్తి రెండో కుమార్తె శ్రీలక్ష్మికి తన కొడుకు రఘుబాబుతో వివాహం చేసి అన్నాచెల్లెలు వియ్యంకులయ్యారు. శారద బిడ్డల సంతానం, అంటే మనుమ సంతానం ప్రైవేటు/ ప్రభుత్వ ఉద్యోగాల్లో సెటిలయ్యారు. కష్టాలకు దూరంగా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. జీవనం కోసం నందిరాజు ఉమామహేశ్వరరావును అన్నపూర్ణ రెండో వివాహం చేసుకున్నారు. పోలీసు ఉద్యోగం, హోటల్ వ్యాపారంతో సహా జీవనోపాధి కోసం ఆయన రకరకాల పనులు చేశారు. కొంతకాలం ప్రకాశం జిల్లా కామేపల్లి, గుంటూరు జిల్లా రేపల్లె, తర్వాత తెలంగాణలో వుండిపోయారు. ‘రెండో పెళ్లితో ‘మొదటి భర్త శారదతో కథ సమాప్తం’...అన్నట్టుగా మా తల్లిగారు గతంలోని విషయాలేవీ ప్రస్తావించేవారు కాదు...తమ్ముడిని తెనాలిలో దత్తత ఇచ్చినట్టు ఊహ ఉన్నందున వయసుకొచ్చాక, వెతుక్కుంటూ తెనాలి వచ్చి కలుసుకున్నా’నని సుబ్రహ్మణ్యం చెప్పారు. అప్పుడప్పుడు కలుస్తుంటాం.. ‘భర్త పోవటంతో మా తల్లిగారు ఆర్థికంగా నానా బాధలు పడ్డారు. బంధువులు పట్టించుకోలేదు. పెద్దమ్మ భర్త గంగానమ్మగుడి దగ్గర కొబ్బరికాయల కొట్ల బజారులో హోటల్ పెట్టించారు. అప్పుడప్పుడు సరుకులు ఇస్తుండేవారు. వేరే పెళ్లిచేసుకున్నాక అవికూడా మానేశారు..విధిలేని స్థితిలోనే తల్లిగారు ఊరొదిలి వెళ్లారు’ అని సుబ్రహ్మణ్యం చెప్పారు. ఆయన్ను చేసుకోవటంతో శారద తరపు అందరితోనూ సంబంధాలు బంద్ అయ్యాయి. రాకపోకలు, పలకరింపులు లేకుండా ఒంటరిగాళ్లమయ్యామని చెప్పారు. పెద్దయ్యాక ఎవరి బతుకులు వారివి అయ్యాయి. తల్లి కాలం చేయటంతో ఎవరితో ఏ సంబంధాలు లేకుండా ఈ ముగ్గురు తరచూ కలుసుకుంటూ బంధుత్వం కూడా కలుపుకొని ఆత్మీయంగా ఉంటున్నారు. ‘మగపిల్లలు చదువుల్లేకుండా తిరుగుతుంటే చెడిపోతారు...ఎవరికైనా ఇస్తే బాగుపడతాడని దత్తతనిచ్చా’నని అమ్మ చెప్పిందనీ, పెద్దవాడిని పెద్దగా చదివించే శక్తి లేకుండా పోయిందని నాకు చెప్పి ఏడ్చేది’ అని తల్లి గురించి కుమార్తె శారద గుర్తుచేసుకున్నారు. -
ట్రంప్ అత్యాచారం చేశారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా ఉన్న సమయంలో అమ్మాయిలతో వ్యవహారాలు చాలా నడిపాడని, లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఇప్పటికే చాలా ఉన్నాయి. తాజాగా రచయిత్రి ఈ జీన్ కరోల్ కూడా 1995 సమయంలో ట్రంప్ తనపై అత్యాచారం చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఆమె తన జీవితంలోని అనుభవాల్ని న్యూయార్క్ మ్యాగ్జైన్ కవర్ స్టోరీలో రాస్తూ ఈ ఆరోపణలు చేశారు. మన్హట్టన్లో బెర్గ్డోర్ఫ్ డిపార్ట్మెంట్ స్టోర్లో తనను కలిసిన ట్రంప్ గర్ల్ ఫ్రెండ్కి ఒక గౌను కొన్నానని, అది వేసుకొని చూస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుందంటూ కోరారని వెల్లడించారు. అందుకు అంగీకరించి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లగా ట్రంప్ తనపై అత్యాచారం చేశారని పేర్కొన్నారు. కరోల్ తాను రాసిన కొత్త పుస్తకం వాట్ డూ వి నీడ్ మెన్ ఫర్ పుస్తకం నుంచి కొన్ని భాగాలతో ఈ కథనం రాశారు. ఈ పుస్తకం విడుదల కావల్సింది. ఈ కథనంపై ట్రంప్ స్పందించారు. అసలు కరోల్ని తన జీవితంలో ఎప్పుడూ కలవలేదని ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. కరోల్ తన పుస్తకం అమ్మకాలు పెంచుకోవడానికే ఈ కట్టు కథ అల్లి వదిలిందన్నారు. ఆధారాలు లేకుండా న్యూయార్క్ మ్యాగజైన్ ఇలాంటి కథనాన్ని ఎలా ప్రచురిస్తుందని నిలదీశారు. అంత పెద్ద స్టోర్లో కెమెరాలు ఉండవా? సేల్స్ అటెండర్స్ ఉంటారు కదా? డ్రెస్సింగ్ రూమ్లో అత్యాచారం ఎలా సాధ్యం ? బెర్గ్దోర్ఫ్ గుడ్మ్యాన్ స్టోర్ వాళ్లు ఎలాంటి వీడియోలు లేవని ధ్రువీకరించారు. ఎందుకు లేవంటే అలాంటి ఘటనే జరగలేదని ఆ ప్రకటనలో వెల్లడించారు. ట్రంప్ అధికారం పీఠం ఎక్కిన దగ్గర్నుంచి కనీసం 20 మంది మహిళలు ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. -
గ్రేట్ రైటర్.. డాంటే
భాషలో గొప్ప విప్లవం తెచ్చాడు డాంటే (1265–1321). మధ్యయుగాల యూరప్ రచయితలు లాటిన్లో రాసేవారు. దానికి భిన్నంగా ప్రాంతీయ భాషలకు పట్టం కట్టాలన్న కవి డాంటే. డివైన్ కామెడీని తను మాట్లాడే తుస్కన్ మాండలీకంలో రాశాడు. డాంటే అడుగుజాడలో మరెందరో కవులు నడవడంతో ఈ భాషే తర్వాతర్వాత ఇటలీకి ప్రామాణిక భాష అయింది. డాంటేను సుప్రీమ్ పొయెట్ అంటారు. డివైన్ కామెడీ దీర్ఘకావ్యం ప్రపంచ సాహిత్యంలోనే ఎన్నదగిన రచనగా మన్నన పొందింది. స్వర్గం, నరకాల గురించిన ఆయన చిత్రణ పాశ్చాత్య కవులూ, కళాకారులూ ఎంతోమందిని ప్రభావితం చేసింది. డాంటే జన్మించింది ఫ్లారెన్స్లో. ఇటలీలోని ఈ నగరం అప్పుడు స్వతంత్ర రిపబ్లిక్. పోప్ అధికారాలు నియంత్రించబడి, తమకు రోమ్ నుండి ఎక్కువ స్వేచ్ఛ కావాలని కోరుకున్న రాజకీయ వర్గం(వైట్ గెల్ఫ్స్)లో డాంటే ఉన్నాడు. పోప్కు మద్దతుగా ఉన్న వర్గం (బ్లాక్ గెల్ఫ్స్) పైచేయి సాధించినప్పుడు డాంటేకు దేశ బహిష్కార శిక్ష విధించబడింది. దీని ప్రకారం ఫ్లారెన్స్లో అడుగుపెడితే సజీవ దహనం చేస్తారు. తర్వాతి రాజకీయ పరిణామాల్లో ఈ బహిష్కృతులకు కొందరికి క్షమాభిక్ష లభించినా షరతులకు అంగీకరించని కారణంగా డాంటే దానికి నోచుకోలేదు. తన జన్మభూమిలో అడుగు పెట్టకుండానే రవెన్నా (ఇటలీలోని మరో నగరం)లో మరణించాడు. ఆయన మరణానంతరం తప్పు తెలుసుకున్న పాలకులు ఫ్లారెన్స్లో ఒక సమాధి నిర్మించారు, డాంటే దేహం లేకుండానే. ‘మమ్మల్ని వదిలివెళ్లిన ఆయన ఆత్మ తిరిగొస్తుంది’ అని ఆయన వాక్యమే చెక్కించి. 700 ఏళ్ల క్రితం జరిగిన తప్పుకు ఫ్లారెన్స్ మున్సిపాలిటీ 2008లో క్షమాపణ ప్రకటించింది. -
సెర్వాంటేజ్
గ్రేట్ రైటర్ స్పానిష్ భాషలో అత్యంత గొప్ప రచయిత మిగెల్ డె సెర్వాంటేజ్ (1547–1616). ఆయన ప్రభావం ఎంత గొప్పదంటే, స్పానిష్ను సెర్వాంటేజ్ భాష అనుకునేంత. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ దగ్గరలో జన్మించాడు సెర్వాంటేజ్. వాళ్ల నాన్న క్షురక వైద్యుడు. ఆ కాలంలో క్షురకులు చిన్న చిన్న వైద్యాలు కూడా చేసేవాళ్లు. ఆ కాలపు అందరు యువకుల్లాగే గొప్ప భవిష్యత్ వెతుక్కుంటూ రోమ్ వెళ్లాడు సెర్వాంటేజ్. గుమస్తాగా, సైనికుడిగా పనిచేశాడు. ఓ సందర్భంలో సముద్ర దొంగలకు చిక్కి ఐదేళ్లపాటు నిర్బంధం అనుభవించాడు. అనేక యుద్ధాల్లో పాల్గొన్నాడు. ఎడమచేయిని కోల్పోయాడు. (రాయడం ద్వారా) కుడిచేతికి కీర్తిని మిగల్చడం కోసం ఎడమచేతిని నష్టపోయానని సరదాగా చెప్పుకున్నాడు. ఈ అనుభవాలన్నీ ఆయన రచనా వ్యాసంగానికి ముడిసరుకు అయ్యాయి. స్పెయిన్కు తిరిగి వచ్చిన తర్వాత, మధ్య తరగతి జీవితం బతికాడు. 1605లో రాసిన డాన్ కిహోటి ఆయనకు ప్రసిద్ధిని తెచ్చిపెట్టింది. ఆ వ్యంగ్య నవల తర్వాత్తర్వాత సుమారు 140 భాషల్లోకి అనువాదమైంది. అత్యంత ఎక్కువ భాషల్లోకి అనువాదమైన పుస్తకాల్లో ఇదీ ఒకటి. నాటకాలూ, కథలూ, ఇతర నవలలూ రాశాడు. జీవితంలోని అబద్ధాన్ని నిరసించడమూ, మనస్తత్వానికి పట్టం కట్టడమూ ఆయన రచనల్లో కనబడుతుంది. సెర్వాంటేజ్ ‘కుక్కల సంభాషణ’ కథంటే సిగ్మండ్ ఫ్రాయిడ్కు చాలా ఇష్టం. దాన్ని మూలంలో చదవడానికి ఫ్రాయిడ్ స్పానిష్ నేర్చుకున్నాడు. సెర్వాంటేజ్, ఆ కాలపు మరో గొప్ప రచయిత షేక్స్పియర్ ఇద్దరూ 1616లో ఒకేరోజు సమాధి కావడం విశేషం. -
గ్రేట్ రైటర్.. డోరిస్ లెస్సింగ్
నోబెల్ పురస్కారం పొందిన అత్యంత పెద్దవయసు రచయిత డోరిస్ లెస్సింగ్ (1919–2013). 2007లో ఈ గౌరవం దక్కినప్పుడు ఆమె వయసు 88 ఏళ్లు. ఆమె రచనా ప్రస్థానం కూడా అంతే సుదీర్ఘమైనది. జీవితకాలంలో సుమారు 30 నవలలూ, 20 కథా సంకలనాలూ, రెండు కవితా సంపుటాలూ వెలువరించారు. ద గ్రాస్ ఈజ్ సింగింగ్, ద గోల్డెన్ నోట్బుక్, ద గుడ్ టెర్రరిస్ట్ ఆమె నవలల్లో కొన్ని. ఐదు భాగాల సైన్స్ ఫిక్షన్ నవలల సిరీస్ కెనోపాస్ ఇన్ ఆర్గోస్ పేరుతో రాశారు. చిల్డ్రెన్ ఆఫ్ వయొలెన్స్ పేరుతో ఐదు నవలల అర్ధ ఆత్మకథాత్మక సిరీస్ రాశారు. యుద్ధానంతరం ఇంగ్లండ్లో ఊపిరాడక వాళ్ల నాన్న ఇరాన్ వెళ్లిపోయాడు. అక్కడే జన్మించింది డోరిస్. తర్వాత ఆయన జింబాబ్వేకు పోయి అక్కడ వ్యవసాయం చేశాడు. పదమూడేళ్ల తర్వాత బడికి పోవడం మానేసి తనే సొంతంగా చదువుకోవడం మొదలుపెట్టింది డోరిస్. పదిహేనేళ్లనుంచే నర్సు, టెలిఫోన్ ఆపరేటర్ లాంటి చిన్న పనులు చేస్తూ రాయడం ప్రారంభించింది. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా నిలబడటంతో ఆమె పుస్తకాలు జింబాబ్వేలో నిషేధానికి గురైనాయి. తర్వాత డోరిస్ బ్రిటన్లో స్థిరపడింది. కమ్యూనిస్టూ, వర్ణ వివక్ష వ్యతిరేకీ అయినందున ఆమె మీద బ్రిటన్ గూఢచారుల నిరంతర నిఘా ఉండేది. అణ్వాయుధాల వ్యతిరేకి. హంగెరీ మీద సోవియట్ రష్యా దురాక్రమణ తర్వాత కమ్యూనిస్టు పార్టీకి దూరం జరిగింది. ఓ సందర్భంలో– కొత్త రచయితలు ప్రచురణకు ఎదుర్కొనే ఇబ్బందులను ప్రత్యక్షంగా చూపడానికి ఆమె తన రెండు కొత్త నవలలను జేన్ సోమర్స్ కలంపేరుతో ప్రచురణకర్తలకు పంపారు. ఊహించినట్టుగానే అవి ముందు తిరస్కరణకు గురయ్యాయి. -
మొన్న ప్రేమ.. నిన్న పెళ్లి.. నేడు విడాకులు
బంజారాహిల్స్:ప్రేమించానని బాసలు చేశాడు. ఆపై సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి అందినకాడికి దండుకున్నాడు. పెళ్లిమాట ఎత్తేసరికి ముఖం చాటేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా జైలుకు పోతానేమోనన్న భయంతో గుడిలో తాళికట్టాడు. తీరా కాపురం దగ్గరికి వచ్చేసరికి పెళ్లి జరిగిన మొదటి రాత్రే చెప్పాపెట్టకుండా పరారయ్యాడు. ఇదేమిటని బాధితురాలు నిలదీస్తే నువ్వు నాకొద్దు అంటూ పెళ్లి చేసుకున్న మరుసటి రోజే విడాకులు తీసుకుంటానని చెప్పాడు. దీంతో ఖిన్నురాలైన బాధితురాలు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. వైజాగ్ ఎంవీపీ కాలనీలో నివసించే యర్రంశెట్టి రమణగౌతం (28) బుల్లితెరతో పాటు వెండితెరకు కథలు రాస్తూ ఫిలింనగర్లో గత ఆరేళ్లుగా అద్దెకుంటున్నాడు. చాలా బుల్లితెర కథలు రాసి పేరు తెచ్చుకున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎన్బీటీనగర్లో నివసించే యువతి (23) వెండితెర మీద వెలిగిపోవాలని సినిమాలపై మోజుతో స్టూడియోల చుట్టూ తిరుగుతున్న సమయంలో ఆమెకు రమణగౌతంతో పరిచయం ఏర్పడింది. సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ ఆమెను ప్రేమలోకి లాగాడు. 2016లో ఏర్పడిన వీరి పరిచయం తర్వాత ప్రేమకు, ఆ తర్వాత సహజీవనానికి దారి తీసింది. ఆమెకు ఉద్యోగ అవకాశాలు రావడంతో దుబాయ్, సింగపూర్, బెహ్రాన్ దేశాలకు వెళ్లింది. అక్కడ సంపాదించిన డబ్బును పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రమణగౌతంకు పంపించేది. 2017 ఫిబ్రవరిలో ఇద్దరూ ఉంగరాలు కూడా మార్చుకున్నారు. అయితే ఇటీవల పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తేగా ససేమిరా అన్నాడు. దీంతో మే 24న ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు సమాచారం అందుకొని రమణగౌతంను స్టేషన్కు పిలిపించారు. సహజీవనం చేయడంతో పెళ్లి చేసుకోవాలని వారు సూచించడంతో మే 26న బంజారాహిల్స్లోని ఓగుడిలో తాళికట్టాడు. అదే రోజు రాత్రి సిగరెట్ తాగి వస్తానని బయటికి వచ్చి అటు నుంచి అటే ఉడాయించాడు. ఆ తెల్లవారి ఫోన్ చేసి నువ్వు నాకు వద్దు విడాకులు తీసుకుందామని చెప్పాడు. దీంతో ఆమె షాక్తిని తన భర్త కనిపించడం లేదంటూ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మోసగించాడని రమణపై చర్యలు తీసుకోవాలంటూ కోరింది. -
మార్గరెట్ మిషల్
గ్రేట్ రైటర్ నాలుగేళ్లు పాత్రికేయురాలిగా పనిచేశారు మార్గరెట్ మిషల్ (1900–1949). ఆమె రాసే కథనాలు వర్ణనాత్మకంగా ఉండేవి. అయితే కాలినొప్పి వల్ల ఉద్యోగం మానేయాల్సివచ్చి, పూర్తిస్థాయి భార్యగా ఉండిపోదామనుకున్నారు. ఆ సమయంలో మార్గరెట్ భర్త ఆమె మనసు మళ్లించడానికి పుస్తకాలు తెచ్చిచ్చేవాడు. చిన్నతనం నుంచే చదువరి అయిన మార్గరెట్ గుట్టల కొద్దీ పుస్తకాలు చదివేది. వెయ్యి పుస్తకాలు చదివే బదులు నువ్వే ఒకటి ఎందుకు రాయకూడదూ అన్నాడోరోజు భర్త. అలా మొదలుపెట్టిన నవల ‘గాన్ విత్ ద విండ్’. మార్గరెట్ మిషెల్ తండ్రి తరఫు, తల్లి తరఫు తాతలు స్కాట్లాండ్, ఐర్లాండ్ నుండి అమెరికాకు బతకడానికి పోయినవాళ్లు. బ్రిటన్తో అమెరికా స్వాతంత్య్రం కోసం పోరాడినవాళ్లు. అమెరికా దక్షిణాది రాష్ట్రాల్లో నివాసం ఏర్పరుచుకున్నవాళ్లు. ఉత్తరాది రాష్ట్రాలకు భిన్నంగా ఇక్కడ పరిశ్రమల కన్నా వ్యవసాయానికి ప్రాధాన్యం. కుటుంబ వ్యవస్థలు బలంగా ఉంటాయి. బానిసత్వం అంగీకార విలువ. 1860ల్లో మొదలైన అమెరికా అంతర్యుద్ధంలో ‘యూనియన్’ నుంచి విడిపోయేందుకు పోరాటం చేసి ఓడిపోయాయి. ఈ నేపథ్యంలో 1936లో రాసిన గాన్ విత్ ద విండ్ మహాభారతమంత విస్తృతమైనది. ఇది కేవలం చరిత్రే కాదు, మనుషుల స్వభావాలను వడగట్టి రూపుదిద్దిన పాత్రల వల్ల నవలే ఒక చరిత్రైపోయింది. మూడు కోట్ల కాపీలు అమ్ముడుపోయాయి. బైబిల్ తర్వాత అమెరికన్లకు బాగా నచ్చిన పుస్తకంగా దీనికో సందర్భంలో ఓటు వేశారు. అదే పేరుతో సినిమాగా కూడా వచ్చి క్లాసిక్గా నిలిచింది. మిషెల్ జీవించివుండగా ప్రచురించిన ఏకైక నవల అదే(దీన్ని ‘చివరికి మిగిలింది’ పేరిట ఎం.వి.రమణారెడ్డి సంక్షిప్తంగా తెలుగులోకి అనువదించారు). ఒక తాగుబోతు వేగంగా నడుపుతున్న వాహనంతో ఢీకొట్టడంతో ప్రమాదవశాత్తూ 48వ ఏటే మరణించారు. కౌమారబాలికగా రాసిన కొన్ని రచనలను ఆమె మరణానంతరం ప్రచురించారు. -
లేడీ బాండ్
ఈ రెండు నెలల్లో రజనీ ఎవరెవరి బ్యాక్గ్రౌండ్ను తవ్వుతున్నారో తెలుసు కునేందుకు ఆమెలా కొందరు గూఢచర్యం చేశారు కానీ.. రజనీ చిరునవ్వు నవ్వేందుకు తప్ప నోరు మెదపనేలేదు. చివరి విడత ఎన్నికల తర్వాత ఈ లేడీ బాండ్ తనకు అనువైన విశ్రాంతి విడిది కోసం రహస్యాన్వేషణ ప్రారంభించవచ్చు. ఇంగ్లండ్ రచయిత్రి అగాథా క్రీస్టీ నవలల్లో ‘మిస్ మార్పుల్’ అనే కల్పిత పాత్ర ఉంటుంది. మిస్ మార్పుల్ పెద్దావిడ. అవివాహిత. ‘సెయింట్ మేరీ మీద్’ అనే గ్రామంలో నివసిస్తుంటుంది. అదీ కల్పిత గ్రామమే. మార్పుల్ గూఢచారి. తొలిసారి ఆమె పాత్ర లండన్ నుంచి వెలువడే ‘ది రాయల్ మ్యాగజీన్’ 1927 డిసెంబరు సంచికలో వచ్చిన ‘ది ట్యూస్డే నైట్ క్లబ్’ ఒక చిన్న కథలో కనిపిస్తుంది. తర్వాత 1930లో క్రీస్టీ రాసిన ‘ది మర్డర్ ఎట్ ద వికారేజ్’ నవలలో కీలకమైన పాత్రగా కథను నడిపిస్తుంది. క్రీస్టీ ఇప్పుడు లేరు. నాలుగు దశాబ్దాల క్రితమే చనిపోయారు. మిస్ మార్పుల్ ఇప్పటికీ ఉంది. బహుశా ఎప్పటికీ! ప్రస్తుతం మిస్ మార్పుల్.. మన దగ్గర రజనీ పండిత్ రూపంలో ముంబైలో ఉంది! భారతదేపు తొలితరం ప్రైవేట్ మహిళా డిటెక్టివ్ రజని. అపరాధ పరిశోధనలో మాత్రమే కాదు, అంతుచిక్కని వ్యూహాలను ఛేదించడంలోనూ రజని ఎక్స్పర్ట్. ఎన్నో హత్యల్ని సాల్వ్ చేశారు. అపార్థాలతో నలిగిపోతున్న ఎందరో దంపతుల జీవితాలను చక్కబరిచారు. పేరున్న కంపెనీల్లో జరిగే విద్రోహాలను కనిపెట్టారు. ఇవన్నీ చేయడం కోసం ఆమె అనేక వేషాలు వేశారు. పనిమనిషిగా, చూపులేని మనిషిగా, గర్భిణిగా, మందమతిగా.. ఇలా అనేకం. అన్నీ కూడా తెర వెనుక ఉన్నదానిని, జరుగుతున్నదానిని బయటికి లాగేందుకే. కొన్నిసార్లు పరిస్థితులు ప్రాణాంతకం అయ్యేవి. అయినా ఆమె ధైర్యం వీడలేదు. ధైర్యం కాదు. తెగింపు అది. మిస్ మార్పుల్ లానే రజనీ కూడా అవివాహితగానే ఉండిపోయారు. ప్రస్తుతం ఆమెకు 57 ఏళ్లు. క్రీస్టీ పాత్ర మిస్ మార్పుల్తో రజనీని పోల్చడం ఎందుకంటే గూఢచర్యంలో ఆ పాత్రకు సరిసాటిగా రజనీ జీవితం నిరంతరం గుట్టు మట్లను వెలికి తీయడంలోనే గడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఇంకా బిజీ. ఎన్నికల స్కెడ్యూలు మొదలైనప్పటి నుంచీ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల గురించి ఆరా తియ్యడానికీ, ఆ అభ్యర్థులకు పోటీగా నిలబడిన ప్రత్యర్థుల బలాలను, బలహీనతలను కూపీ లాగడానికి రజనీని ఆశ్రయిస్తూనే ఉన్నాయి. చివరి దశ ఎన్నికల పోలింగ్.. వచ్చే ఆదివారంతో పూర్తవుతోంది కనుక రజనీ తయారు చేయబోయే రసహ్య నివేదికలు కూడా ఈ ఒకటీ రెండ్రోజుల్లో ఒక కొలిక్కి వచ్చేస్తాయి. ‘‘ఆ తర్వాత కొంతకాలం ఏదైనా ఒక అజ్ఞాత ప్రదేశంలో ఏకాంతంగా గడిపేందుకు వెళ్లొస్తాను’’ అంటున్నారు రజనీ పండిత్. -
ఇ.ఎం.ఫార్స్టర్
ట్రివియా: ‘ద పారిస్ రెవ్యూ’ తన తొలి సంచిక (1953)లో ‘ద ఆర్ట్ ఆఫ్ ఫిక్షన్’ పేరిట వేసిన తొలి ఇంటర్వ్యూ ఇ.ఎం.ఫార్స్టర్ది. సాహిత్య చరిత్రలో అదొక గొప్ప సందర్భం. ఇంకే పత్రికైనా ఇలా కాకుండా మరోలా రచయితతో మాట్లాడలేని పరిస్థితిని ఆ సీరిస్ కలగజేసింది. ఎడ్వర్డ్ మోర్గాన్ ఫార్స్టర్ (1879–1970) ఇంగ్లండ్లో జన్మించాడు. తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. రెండేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. కానీ వారసత్వంగా వచ్చిన సంపద వల్ల పెంపకానికి ఏ ఇబ్బందీ కలగలేదు. పైగా రాసుకోవడానికి కావాల్సినంత స్వేచ్ఛ దొరికింది. ‘ఎ రూమ్ విత్ ఎ వ్యూ’, ‘హోవార్డ్స్ ఎండ్’ లాంటి నవలలూ కథలూ వ్యాసాలూ విరివిగా రాశాడు. ఆంగ్ల రచయితలు, మేధావులు తాత్విక, నైతిక అంశాలను చర్చించుకునేందుకు ఒకచోట కలిసేవారు. అదే తర్వాత బ్లూమ్స్బరీ గ్రూప్గా ప్రసిద్ధి పొందింది. వర్జీనియా వూల్ఫ్ ఇందులో మరో సభ్యురాలు. వ్యక్తిగత సంబంధాలు, ఆనందాల మీద వీరికి పట్టింపు ఎక్కువ. దేశం, స్నేహితుడు– ఈ రెండింటిలో ఎవరినైనా మోసం చేయాల్సిన సందర్భం వస్తే గనక దేశాన్ని మోసం చేసే ధైర్యం నాకుంటుందని నమ్ముతానంటాడు ఫార్స్టర్. ఆయన పెళ్లి చేసుకోలేదు. స్నేహితులకు స్వలింగ సంపర్కుడని తెలుసు. బీబీసీకి పనిచేశాడు. యుద్ధ వ్యతిరేకి. బ్రిటిష్ ప్రభుత్వం ప్రదానం చేసే నైట్హుడ్ను తిరస్కరించాడు. దేవాస్ సంస్థానం మహారాజు మూడో తుకోజీరావుకు వ్యక్తిగత కార్యదర్శిగా భారతదేశంలో పనిచేశాడు. ఆ అనుభవాల సారంతో ప్రాచ్య పాశ్చాత్య సంబంధాలను చిత్రించిన ‘ఎ ప్యాసేజ్ టు ఇండియా’ (1924) ఫార్స్టర్ను తలుచుకోగానే గుర్తొచ్చే నవల. ఆయనకు ఎక్కువ పేరు తెచ్చినది కూడా. హైదరాబాద్, హిమాయత్నగర్లోని ‘ఉర్దూ హాల్’ నిర్మాణానికి ఫార్స్టర్ భూరి విరాళం ఇచ్చివుండటం ఆయన్ని మనకు సన్నిహితం చేసే మరో అంశం. -
గ్రేట్ రైటర్; సర్ ఆర్థర్ కోనన్ డాయిల్
మెడిసిన్ పూర్తై, డాక్టరుగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పేషెంట్లు రాక ఈగలు తోలుకునేవాడు సర్ ఆర్థర్ కోనన్ డాయిల్ (1859–1930). ఈ ఖాళీ సమయం ఆయనలోని రచయితకు కలిసొచ్చేది. ప్రిస్క్రిప్షన్స్ బదులు పాత్రల ట్రీట్మెంట్ రాసుకునేవాడు. కొంతకాలం కంటి డాక్టర్ అవుదామని ఆప్తాల్మాలజీ చదవాలని వియన్నా వెళ్లాడు. ఐస్ స్కేటింగ్, మద్యం సేవించడం మాత్రం నేర్చుకుని వచ్చాడు. ఈసారీ భూతద్దంలో చూసినా ఒక్క పేషెంటూ రాలేదు. సరిగ్గా ఈ సమయంలోనే భూతద్దం పట్టుకునే పాత్రే ఆయన మనసులో రూపొందింది. తనకు చదువు చెప్పిన యూనివర్సిటీ టీచర్ను ఊహిస్తూ దానికి ప్రాణం పోశాడు. అదే షెర్లాక్ హోమ్స్. ఫోరెన్సిక్ సైన్స్, లాజికల్ రీజనింగ్ బలాలుగా డిటెక్టివ్ సాహిత్యాన్ని మలుపు తిప్పిన పాత్ర. బ్రిటన్ సాంస్కృతిక వారసత్వంలో నిలిచిపోయిన పాత్ర. ఆయన ఒక మనిషే అని నమ్మేంత ఫ్యాన్ క్లబ్స్ ఏర్పడిన పాత్ర. హోమ్స్, డాక్టర్ వాట్సన్ పాత్రలుగా రాసిన ‘ఎ స్టడీ ఇన్ స్కార్లెట్’ డాయిల్ కెరియర్ను మలుపు తిప్పింది. డాక్టర్ వాట్సన్ పాత్రే పాఠకుడికి కథ చెబుతుంది. ప్రచురణకర్తలు ఆయన రాతల కోసం ఎగబడటం మొదలైంది. అయితే, చరిత్రాధ్యయనం మీద ఇంతకంటే మెండైన ఆసక్తి ఉన్న డాయిల్కు పదే పదే హోమ్స్ పాత్రతో రాయాలంటే చిర్రెత్తేది. అందుకే ఎవరూ ముందుకురాకుండా పారితోషికం విపరీతంగా పెంచేశాడు. అయినా చెల్లించడానికి సిద్ధపడేవారు. ఆ కాలంలో అత్యధిక పారితోషికం అందుకున్న రచయితల్లో ఆయన ఒకడు. వైద్యుడిగా ఆయన ఫెయిల్ అయివుండవచ్చుగానీ వైద్య రచయితగా ఫెయిల్ కాలేదు. మెడికల్ వ్యాసాలు రాశాడు. టీకాల మీద ఉన్న అపోహల్ని పోగొడుతూ వాటికి పూర్తి మద్దతు ప్రకటించాడు. తన మతవిశ్వాసాన్ని వదులుకొని సంశయవాదిగా మిగిలిపోయాడు. ఆయన ఫస్ట్క్లాస్ మ్యాచులు ఆడిన క్రికెటర్. ఫుట్బాల్, బాక్సింగ్, గోల్ఫ్లోనూ చెప్పుకోదగిన ప్రవేశం ఉంది. చారిత్రక నవలలు, లెక్కకు మిక్కిలి కథలు రాసి వాటికి కూడా అంతే గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ డాయిల్ను పాఠకలోకం ప్రధానంగా షెర్లాక్ హోమ్స్ సృష్టికర్తగానే గుర్తుంచుకుంది. -
బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి
సాక్షి, విశాఖపట్నం/పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, జర్నలిజం, నాటకం, నవల, టీవీ, సినిమా, అన్నిటికీ మించి రేడియో ఇన్ని ప్లాట్పారాల మీద రాణించడం గొప్ప విషయమని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి కొనియాడారు. మారుతీరావు 80 జన్మదినం సందర్భంగా విశాఖలో విశాఖ రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో జరిగిన ‘గొల్లపూడి.. అశీతిపర్వం’కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘వందేళ్ల కథకు వందనం’పై ఆయన మాట్లాడారు. మారుతీరావు అనేక రంగాల్లో రాణిస్తూ, నిష్ణాతులతో కలిసి పనిచేశారన్నారు. గొప్పవారితో పనిచేసిన అనుభవం, ప్రావీణ్యం ఆయనను చాలా ఉన్నత స్థాయికి చేర్చాయన్నారు. అమెరికా, లండన్ వంటి దేశాల నుంచేగాక ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారూ ఆయన వద్దకు వచ్చి ఇంటర్వ్యూలు తీసుకున్నారన్నారు. గొల్లపూడి గొప్ప మేధావి అని, ఆయన ప్రతిమాట సందర్భోచితంగా ఉంటుందని పేర్కొన్నారు. కథా సాహిత్యంలో తనకు చిన్న స్థానం కల్పించినందుకు గొల్లపూడికి రుణపడి ఉంటానని చెప్పారుగొల్లపూడి రచనలు సమాజానికి అవసరంగొల్లపూడి మారుతీరావు రచనలు నేటి సమాజానికి చాలా అవసరమని విశాఖ రసజ్ఞ వేదిక అధ్యక్షుడు డాక్టర్ గండికోట రఘురామారావు అన్నారు. గొల్లపూడి 80వ జన్మదిన వేడుకలను నిర్వహించడం సంస్థ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. ఉదయం జరిగిన సాహితీ గోష్టిని డాక్టర్ బి.వి.సూర్యారావు నిర్వహించగా.. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి హాజరై గొల్లపూడి సంపాదకత్వంలో వెలువడిన వందేళ్ల కథకు వందనాలు గురించి మాట్లాడారు. గొల్లపూడి కంటే ముందు ఆయన రచనలు తనకు పరిచయమయ్యాయని చెప్పారు. జర్నలిజమే తమను ఇన్నేళ్ల పాటు కలిపి ఉంచిందన్నారు. డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు మాట్లాడుతూ గొల్లపూడి తెరంగేట్రం ముందు, తర్వాత జరిగిన సినిమారంగ విశేషాలను వివరించారు. టీవీలు లేని కాలంలో గొల్లపూడి రేడియో నాటికలు వినడానికి లక్షలాది మంది శ్రోతలు ఆదివారం, గురువారం ఎదురు చూసేవారని గుర్తు చేశారు. యండమూరి వీరేంద్రనాథ్ వంటి పలువురు రచయితలుగా మారడానికి గొల్లపూడి మారుతీరావే స్ఫూర్తి అని తెలిపారు. డాక్టర్ పేరి రవికుమార్ మాట్లాడుతూ స్వాతి వీక్లీలో సీరియల్గా వచ్చిన ‘రుణం’నవల ఎందుకు ప్రజాదరణ పొందిందో వివరించారు. సినీ రచయిత డాక్టర్ వెన్నెలకంటి.. గొల్లపూడి జీవనకాలమ్ గురించి మాట్లాడారు. 40 ఏళ్లుగా ఈ కాలమ్ వారం వారం చదువుతున్న తెలుగు పాఠకుల్ని మళ్లీవారం కోసం ఎదురు చూసేలా రాయడం గొల్లపూడికే దక్కిందన్నారు. ప్రముఖ రచయిత ద్విభాష్యం రాజేశ్వరరావు మాట్లాడుతూ గొల్లపూడిలా బతకడం ఒక కళ, ఒక అదృష్టం, డబ్బుతో కొలవలేని ఐశ్వర్యమని కొనియాడారు. బులుసు ప్రభాకరశర్మ మాట్లాడుతూ చలం తెలుగు మ్యూజింగ్స్ తరువాత గొల్లపూడి ఆంగ్ల మ్యూజింగ్స్కు ప్రాచుర్యం ఎందుకొచ్చిందో వివరించారు. మధ్యాహ్నం సభలో చివరిగా మాట్లాడిన డాక్టర్ గుమ్మనగారి బాల శ్రీనివాసమూర్తి గొల్లపూడి ఆత్మకథ అమ్మకడుపు చల్లగా ఎంత గొప్ప రచనకాకపోతే 9వ ప్రచురణకు నోచుకుంటుందని వివరించారు. ఈ సభా కార్యక్రమానికి ముందు శ్రీరామనవమి సందర్భంగా హిడెన్ స్ప్రౌట్స్ సంస్థకు చెందిన ప్రత్యేక అవసరాల పిల్లలు దశావతారాలు నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. నా బర్త్డేని చిరస్మరణీయం చేశారు.. తనకు జరిగిన సన్మానం అనంతరం గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ తన 80వ పుట్టిన రోజును విశాఖ రసజ్ఞ వేదిక చిరస్మరణీయం చేసిందన్నారు. కొద్దిరోజులుగా అపోలో ఆస్పత్రిలో అనారోగ్యంతో ఉన్న తనకు ఏప్రిల్ 14 అంటేనే భయంగా ఉండేదని, ఆ రోజు తాను విశాఖ వెళ్తానోలేదో ఆందోళన చెందేవాడినని చెప్పారు. ‘ఒక దశలో ఆ రోజు తలచుకుంటే పానిక్ అయ్యే వాడిని. నిద్రపట్టేది కాదు.. ఆరోజు హాజరు కాగలనా? అని అనిపించేది. నిన్న మధ్యాహ్నం వరకు అపోలోలోనే ఉన్నాను. రెండు రోజులపాటు ఆరోగ్యం బాగు పడాలని కాకుండా 14కి విశాఖ వెళ్లేలా చూడండని వైద్యులను కోరేవాడిని. ఇప్పుడు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించినందుకు ఆనందంగాను, గర్వంగాను ఉంది’అని వివరించారు. తన జీవితంలో కన్నీళ్లు లేవని, అయితే తన కుమారుడు శ్రీనివాస్ మరణం తనను కలచివేసిందని చెప్పారు. సినిమాల్లో తన భార్యగా ఎక్కువసార్లు నటించిన అన్నపూర్ణ ఎలా ఏడవొచ్చో గ్లిజరిన్ రాసుకోవడం ద్వారా చెప్పేదన్నారు. 80 ఏళ్లలో 67 సంవత్సరాలు రాస్తున్నానని, కొన్ని గొప్పగా రాశానని తెలిపారు. ‘సాయంకాలమైంది’ సాయంత్రం ప్రారంభమైన ‘సాయంకాలమైంది’సభను డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఫైర్ సర్వీసెస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కె.సత్యనారాయణ.. గొల్లపూడి..అశీతి పర్వం (జన్మదిన ప్రత్యేక సంచిక)ను ఆవిష్కరించారు. తన రచనలతో కరుడుగట్టిన ఖైదీల మనసులను మార్చగలిగిన మారుతీరావు జన్మదిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించడంతో తన జన్మ ధన్యమైందన్నారు. ప్రత్యేక సంచిక తొలి ప్రతిని మావూరి వెంకటరమణ స్వీకరించారు. గౌరవ అతిథులు డాక్టర్ ఎస్.వి.ఆదినారాయణ రేడియో నాటిక మొదటి భాగాన్ని, డాక్టర్ ఎస్.విజయకుమార్ రేడియో నాటిక రెండో భాగాన్ని ఆవిష్కరించగా.. తొలి ప్రతులను వి.హర్షవర్థన్ స్వీకరించారు. డాక్టర్ ఆదినారాయణ గొల్లపూడిని ప్రశంసించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాల మధ్య గొల్లపూడి మారుతీరావును అతిథులు ఘనంగా సత్కరించారు. అనంతరం గొల్లపూడి రచించిన సాయంకాలమైంది నవలపై డాక్టర్ ప్రయాగ సుబ్రహ్మణ్యం చేసిన ప్రసంగం సాహితీ ప్రియులను ఆకట్టుకుంది. గొల్లపూడి సినిమాలపై రాంభట్ల నృసింహశర్మ తనదైన హాస్య ధోరణిలో మాట్లాడారు. ప్రముఖ రచయిత, నటుడు రావి కొండలరావు.. గొల్లపూడితో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. తామిద్దరూ నటించిన కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్ర వేసిన గొల్లపూడి నటనను వివరించారు. సభ ముగిసిన అనంతరం గొల్లపూడి రచించిన ‘కళ్లు’నాటికను బాదంగీర్ సాయి ఆధ్వర్యంలో మాతృశ్రీ కళానికేతన్ వారు వి.సంగమేశ్వరరావు దర్శకత్వంలో ప్రదర్శించారు. జీవీఆర్ఎం గోపాల్ వందన సమర్పణలో విచ్చేసిన సాహితీ ప్రియులకు, నాటక ప్రియులకు, గొల్లపూడి అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
గ్రేట్ రైటర్; మో యాన్
మాట్లాడొద్దు, అని అర్థం చైనీస్లో మో యాన్ అంటే. దాన్నే కలంపేరుగా స్వీకరించాడు ‘మోయాన్’. అసలు పేరు గ్వాన్ మోయే. 1955లో రైతుకుటుంబంలో జన్మించాడు. చైనాలో ఉన్న విప్లవ రాజకీయాల నేపథ్యంలో మనసులో ఉన్నది బయటపెట్దొద్దు, అని తల్లిదండ్రులు వారించేవారట. అయినా మాట్లాడకూడని అంశాలే మాట్లాడుతూ రచయితగా అవతరించాడు. సాంస్కృతిక విప్లవ కాలంలో కార్మికుడిగా పనిచేశాడు. సైన్యంలో పనిచేశాడు. ఆయన రచనల్లో సామాజిక వాస్తవికతతోపాటు మాంత్రిక వాస్తవికత కూడా కనబడుతుంది. చరిత్ర, వర్తమానం, జానపద గాథలు ఒక కలలాంటి స్థితిలో కలగలిసిపోతాయి. ఆదర్శవాదంలో కూడా మనిషి దురాశ, అవినీతిని వ్యంగ్యంగా చిత్రించాడు. రెడ్ సొర్గమ్ క్లాన్, ద గార్లిక్ బాలాడ్స్, ద రిపబ్లిక్ ఆఫ్ వైన్, లైఫ్ అండ్ డెత్ ఆర్ వేరింగ్ మి ఔట్ ఆయన నవలలు. నవలికలు, కథలు కూడా విస్తృతంగా రాశాడు. పద సంపదను పరిమితం చేస్తుందన్న కారణంగా టైప్ చేయడం కన్నా చేత్తో రాయడానికే ఇష్టపడతాడు. దేశాల మధ్య ఉన్న హద్దులను దాటేందుకు సాహిత్యమే మార్గం అంటాడు. 2012లో ఆయన్ని నోబెల్ బహుమతి వరించింది. ఈ పురస్కారం దక్కిన తొలి చైనా నివాస రచయిత. కమ్యూనిస్టు పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయన్న కారణంగా ఆయన్ని విమర్శించేవాళ్లూ ఉన్నారు. -
ఇసాక్ బేబెల్
సైనికులు, కార్మికులు, వేశ్యలు, నటులు, సంపన్నులు, ఇలా అన్ని రకాల మనుషులతో స్నేహం చేసేవాడు ఇసాక్ బేబెల్ (1894–1940). రష్యాలోని ఒడెస్సా పట్టణంలో జన్మించాడు. దేశవాళీ మపాసా పుట్టడానికి ఇది అనువైన చోటు అంటాడాయనే. దీని నేపథ్యంలో ఇక్కడి యూదు రౌడీలు పాత్రలుగా ‘ది ఒడెస్సా టేల్స్’ రాశాడు. ఒక యూదుడిగా యిడ్డిష్, హీబ్రూ బాగా తెలిసిన బేబెల్కు ఫ్రెంచి కూడా అంతే బాగా వచ్చు. తొలి కథల్ని ఫ్రెంచిలోనే రాశాడు. యౌవనంలో గోర్కీ సలహాతో యుద్ధవార్తల విలేఖరిగా పనిచేశాడు. యుద్ధం మనుషుల్ని ఎలా చితగ్గొడుతుందో ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు. యూదుల పట్ల చూపే వివక్షకు సొంత, పరాయి సైన్యానికి ఏం తేడా లేదని గ్రహించాడు. ఆ అనుభవాలతోనే 1920లో ‘రెడ్ కావల్రీ’ కథలు రాశాడు. తొలిసారిగా యుద్ధపు చీకటిని రష్యన్ పాఠకుల సామూహిక అనుభవంలోకి తెచ్చాడు. వాక్యాల్లో కచ్చితత్వం, సరైన పదాల కోసం వెతుకులాట ఆయన నిబద్ధత. అయితే, గూఢాచారి అన్న ఆరోపణ మీద 1939లో అరెస్ట్ అయ్యాడు. ఆయన పేరును అన్ని రికార్డుల్లోంచి తొలగించి, ఎక్కడా వేదికల మీద ఉచ్చరించకుండా ‘నాన్పెర్సన్’(నిర్వ్యక్తి) చేశారు. 1940 జనవరిలో కాల్చి చంపడానికి స్టాలిన్ అనుమతించిన 346 మందిలో ఇసాక్ బేబెల్ ఒకరు.కాల్చి చంపిన 14 ఏళ్ల తరువాత, కృశ్చేవ్ ప్రభుత్వం ఆయన్ని అధికారికంగా నిరపరాధిగా గుర్తించింది. వ్యక్తిగా మరణించినా రచయితగా బేబెల్ పునరుజ్జీవం పొందాడు. -
సాయుధ పోరులో అగ్గిబరాటై
సాక్షి, భీమదేవరపల్లి(హుస్నాబాద్): బూర్జువా పాలకులపై తుపాకీ ఎక్కుపెట్టి రాజీలేని పోరుసల్పిన ధీరత్వం...గోండు బిడ్డల ధీనత్వాన్ని ఆర్తిగా కవితల్లో ఆవిష్కరించే భావోద్వేగం... అయన జీవితమనే నాణానికి బొమ్మాబొరుసులు. తూటాలకు ఎదురొడ్డి సాయుధ పోరులో అగ్గిబరాటై కదం తొక్కి, అన్నార్తుల అక్రందనలకు అక్షర రూపమిచ్చిన ఆ శైలి స్ఫూర్తిమంతం. ఏక కాలంలో రచయిత, ఉద్యమకారుడిగా విశేష గుర్తింపు పొందిన సవ్యసాచి మాణిక్యాపూర్ ముద్దు బిడ్డ సాహు శనిగరం వెంకటేశ్వర్లు వర్ధంతి నేడు(శనివారం). వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్లో 1955 అక్టోబర్ 2న శనిగరం స్వామి–అయోధ్యలకు వెంకటేశ్వర్లు( సాహూ) జన్మించాడు. ప్రాథమిక విద్యను స్వగ్రామంలో అభ్యసించిన ఆయన ఉన్నత విద్య కోసం హుజురాబాద్కు, డిగ్రీ కోసం జమ్మికుంటకు వెళ్లాడు. హుజురాబాద్లో చదువుకున్న రోజుల్లో 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు. గో టు విలేజ్ క్యాంపస్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లోనే గ్రామాల్లో భూస్వాములు చేస్తున్న ఆగడాలు, పేదలు పడుతున్న కష్టాలు అతనిని విప్లవోద్యమం వైపు అడుగులేసేలా చేశాయి. ఆ క్రమంలోనే ‘గో టు విలేజ్ క్యాంపస్’ పేరిటా మాణిక్యాపూర్లో 20 రోజులపాటు దాదాపుగా వందలాది మందికి ఉద్యమ శిక్షణ తరగతులను నిర్వహించాడు సాహూ. మావోయిస్ట్ కీలక నేత గణపతితో పాటు నల్లా ఆదిరెడ్డి, శీలం నరేష్ లాంటి మావోయిస్ట్ అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.. - సాహూ, అతని భార్య శోభ అతని కలం పేరును సాహూగా పెట్టుకున్నాడు. ఉద్యమంలో క్రియశీలక పాత్ర పోషిస్తూ మావోయిస్టు కేంద్ర కమిటీ స్థాయి వరకు వెళ్లి అదిలాబాద్ అడువుల్లో అరెస్ట్ అయ్యాడు. అనేక ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన సాహూ జైలు నుంచి విడుదలయ్యాడు. అకస్మాత్తుగా మార్చి 16, 1993న గుండె పోటుతో మృతి చెందాడు సాహూ రచనలు... కన్నీటి కథ–నీటి కథ, పెండ్లి కావాలి, ఖాయిదా, ఐదు రూపాయాల కథ, భూమి కోసం, జెండా కథ, ఆకలి నిర్ణయం, కిసింగార్ వెంతా, అమరుల రక్తం వృథా కాదు, రక్తపింజెర, మరట్ తుడుం పాయానా, మనుషుల్ని తినే వాళ్లం కోసం, ఒక తల్లి, పిల్ల రక్కసులు, రగల్ జెండా, విహంగ వీక్షణం, జాగీరిగాల్లు తదితర కథలు, కవితలు రాశాడు. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి... మరుగున పడిన కొమురం భీం జీవిత చరిత్రను బాహ్య ప్రపంచానికి అందిచడంతోపాటుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి అమరుడైన ఆయన ఆశయాలను ప్రభుత్వం నెరవేర్చాల్సిన అవసరంఉంది. ఆయన విగ్రహాన్ని కరీంనగర్లోగాని, వరంగల్లో గాని ప్రతిష్ఠించాలని ఆయన స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు. -
వండిన కథలు కావు
వండుకోవడానికి సరుకులే లేవు..ఇక ఆకలి కడుపున మెదడేం వండుద్ది?కాదు.. విషయం అది కాదు!నిజానికి కడుపు నిండితే.. మెదడు ఖాళీగా ఉంటుంది!కడుపు ఖాళీగా ఉంటే మెదడు నిండుగా ఉంటుంది!భారతి రచయిత్రి కాదు.. కథా వస్తువు!ఇంకా గట్టిగా చెప్పాలంటే కథా దినుసు!ఎంత బాగా వండుతుందో.. కానీ వండినట్టే ఉండదు!ఊర్లో నిలువెత్తు అద్దం తీసుకుని తిరిగినట్టు ఉంటుంది!అవును.. ఇవి వండిన కథలు కాదు..రోమాంచిత వాస్తవాలు! మట్టి పాత్రలే ఉన్న ఇళ్లలో ఇత్తడి బిందె.. బంగారపు బిందె కన్నా గొప్పది. ఆ బిందెను కొనుక్కోవడం వాళ్ల జీవన కల. రెక్కల కష్టం పెట్టుబడిగా సంపాదించుకున్న ఆస్తి. ఇలాంటి అపురూపాలకు, జీవనసారానికి అక్షరాలతో విలువగడ్తుంది ఎండపల్లి భారతి. చదువు అయిదవ తరగతే. అయితేనేం.. ఆమె రచనకు ప్రమాణం.. వందేళ్ల జీవిత అనుభవం.. అంతే లోతైన పరిశీలన. అందుకే ఆమె కథల్లో మనుషులు కదులుతారు. భావోద్వేగాలు కనపడ్తాయి. ఆమె పరిచయం ఎండపల్లి భారతి.. పుట్టింది, పెరిగింది.. చిత్తూరు జిల్లా, నిమ్మనపల్లి మండలంలోని దిగువ బురుజు. తండ్రి వెంకటరమణ, తల్లి ఎల్లమ్మ. వాళ్లకు భారతి ఏకైక సంతానం. ఆమెకు అయిదేళ్లున్నప్పుడే భారతి తల్లి టీబీతో చనిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకే తండ్రీ పోయాడు. అమ్మమ్మ, తాత ఇంట్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. దాంతో చదువు ముందుకు సాగలేదు. అమ్మమ్మ, తాతకు తోడుగా పొలంలో పని చేసేది భారతి. ఆమెకు పన్నెండేళ్లు వచ్చేసరికి ఉన్న ఊళ్లోనే సంబంధం చూసి పెళ్లి చేసేసింది పెద్దమ్మ. భర్త శ్రీనివాసులు. మెట్టినింటికీ కూలి పనే ఆర్థిక ఆధారం. భర్తతోపాటు తనూ కూలీకి వెళ్లేది. కుటుంబ బాధ్యతల బరువు ఆమె భుజాల మీదున్నా.. చదువు పట్ల ఆసక్తి ఆవిరి కానివ్వలేదు. తన పిల్లలను బాగా చదివించాలని నిర్ణయించుకుంది. ఇద్దరు ఆడపిల్లలు, ఒక పిల్లాడు. ఆడపిల్లలకు ధైర్యం, అబ్బాయికి ఆపోజిట్ జెండర్ను గౌరవించడం నేర్పింది. పెద్దమ్మాయి విజయ కుమారి ఎమ్మే బీఈడీ. ప్రస్తుతం డిఎస్సీకి ప్రిపేర్ అవుతోంది. రెండో అమ్మాయి స్వరూప డిగ్రీ ఫైనలియర్. అబ్బాయి సోమశేఖర్ డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. కథలు రాయి ‘‘ఏం రాయాలి?’’ ‘‘ఇప్పటి దాకా నువ్వు చూసిన జీవితం రాయి భారతీ’’ అన్నారు కిరణ్ కుమారి, సావెం రమేశ్. రాసింది. ‘సావు బియ్యం’ అనే పేరుతో. స్పష్టమైన వ్యక్తీకరణ. అద్భుతమైన మాండలీకం. చక్కటి పద సంపద. అబ్బుర పడ్డారు వాళ్లు. అక్షర దోషాలను సరిచేసి.. మరిన్ని రాయమని ప్రోత్సహించారు. రాస్తోంది భారతి.. ఏ ఒక్కరి జీవితాన్నో కాదు.. మొత్తం సమాజ సరళినే. ఆమె రాసిన కథలన్నిటినీ టైప్ చేసి పలు పత్రికలకు పంపించింది కిరణ్ కుమారి. అలా పత్రికల్లో అచ్చయిన కథలన్నిటితో ఓ సంకలం తెస్తే కూడా బాగుంటుందని భారతికి సలహా ఇచ్చింది ఆమె. పుస్తకం అంటే మాటలా? కనీసం యాభై వేలన్నా కావాలి. రెక్కలు ముక్కలు చేసుకున్నది కూటికి, పిల్లల చదువులకే చాలడం లేదనే చింత తొలుస్తున్నా.. పుస్తకం తేవాలనే కాంక్షా బలంగానే నాటుకుంది భారతిలో. అనుకున్నది సాధించేదాకా నిద్రపోని పట్టుదల ఆమెది. ఆ ఉత్సాహానికి ఊతంలా పదిహేను వేల రూపాయలు సహాయం చేసింది కిరణ్ కుమారి. చిత్రకారిణి కూడా అయిన ఆమె.. భారతి కథలకు చక్కటి బొమ్మలనూ గీసింది. మిగిలిన డబ్బును అప్పుగా తెచ్చి ‘ఎదారి బతుకులు’ అనే కథా సంకలనాన్ని ముద్రించింది భారతి. వెయ్యి కాపీలు చేతుల మీదే అమ్ముడు పోయాయి. రెండునెల్లకే మొదటి ముద్రణ ఖాళీ అయిపోయింది. ఈ సంకలనం అమెరికాకూ చేరింది. తానా సభల్లో సందడి చేసింది. ఇప్పుడు ఈ పుస్తకం రెండో ముద్రణ బాధ్యతను హెచ్బీటీ చేపట్టింది ఎంతో ఇష్టంగా. త్వరలోనే లాంచ్ కానుంది. నవోదయం భారతిలోని రచయిత్రిని ప్రపంచానికి చూపించిన కిరణ్ కుమారి, సావెం రమేశ్.. ఇద్దరూ వెలుగు ప్రాజెక్ట్ ఆఫీసర్లు. డ్వాక్రా గ్రూపు సభ్యుల్లో కాస్త చదవగలిగిన, రాయగలిగిన పన్నెండు మంది మహిళలతో ‘నవోదయం’ అనే ఓ మాస పత్రికను మొదలుపెట్టించారు. వాళ్లలో ఒకరే ఎండపల్లి భారతి. తనకు వచ్చిన ఈ కొత్త గుర్తింపు ఘనతను ఆ ఇద్దరికే ఇస్తుంది భారతి. ‘‘ ముఖ్యంగా కిరణ్ కుమారి మేడమ్.. నాకు ఫ్రెండ్, గైడ్.. అన్నీ’’ అంటుంది. నవోదయం.. భారతికే కాదు మిగిలిన పదకొండు మంది మహిళలకూ కొత్త గుర్తింపును ఇచ్చింది. వాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచింది. ‘‘ఏదో రాస్తారట.. ’’ అని పెదవి విరిచిన వాళ్లే ఈ గ్రామీణ మహిళా విలేకర్లు రాస్తున్న వార్తలను కుతూహలంగా చదువుతున్నారు. బైక్, కారు నడుపుతున్న భారతిని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. పేపర్, పెన్నుతోనే కొంగుముడి ఆవులు.. సేద్యం.. అక్షరం.. ఇవే భారతి పనులు.. వ్యాపకాలూ. పేపర్, పెన్నూ ఆమె కొంగుతో ముడిపడే ఉంటాయి. ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడు పేపర్ తీసి రాస్తుంది.. ఆవులు మేపేందుకు వెళ్లినా.. పొలం పనులు చేస్తున్నా! అలాంటి తలపోతకే ఆ తర్వాత కథా రూపం ఇస్తుంది. ‘‘డబ్బు కూడబెట్టే కంటే అక్షరం కూడబెడితే ముందు తరాల వాళ్లకు ఎంతోకొంత లాభం. జీవితం తెలుసుకుంటారు. నేను చూసింది.. విన్నది.. అనుభవించిందే రాస్తాను. ఊహించి రాయలేను. మనుషులే నాకు ఇన్స్పిరేషన్. తాతా, అవ్వ వయసున్న వాళ్లతో ఎక్కువగా మాట్లాడ్తాను. వాళ్ల అనుభవాలే నా కథా వస్తువులు. నా కథలను చదివి ఫస్ట్ మా పిల్లలు నవ్వారు.. ఇట్లా మన మాండలికంలో రాస్తే.. ఎవరు చదువుతారు? అని. పుస్తకంగా వచ్చి.. అమ్ముడు పోయేసరికి ఇప్పుడు గొప్పగానే చూస్తున్నారు (నవ్వుతూ). డెబ్బై కథలు రాశా. వ్యవసాయదారుల సాదక బాధకాలనూ కథలుగా రాసి పుస్తకంగా తేవాలనుంది. ఇప్పటికే ఓ పది రైతు కథలు రాశా’’ అని చెప్పింది భారతి. భవిష్యత్ కన్నా వర్తమానంలో బతకడమే ఇష్టపడే భారతి షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కూడా. ఇప్పటివరకు అయిదు షార్ట్ ఫిల్ములు తీసింది. జాతీయ స్థాయి సమావేశాల్లో వాటిని ప్రదర్శించింది కూడా. ‘‘సమాజానికి ఎంతో సేవ చేసిన వాళ్లెందరో సమాజానికి తెలియకుండానే పోయారు. నేనేం చేశానని నాకు ఈ గుర్తింపు? అనిపిస్తుంటుంది’’ అని అంటుంది భారతి. మహిళల మీద జరుగుతున్న దాడులపై స్పందిస్తూ ‘‘చుట్టూ నిప్పు పెట్టి జాగ్రత్తలు చెబితే ఎలా కుదురుతుంది? ఆ నిప్పును ఆర్పే పనే కాదు.. ఇంకెప్పుడూ ఎవరు నిప్పు పెట్టకుండా చూసే బాధ్యతను మనం తీసుకోవాలి. అప్పుడే ఆడవాళ్లు క్షేమంగా ఉంటారు’’ అంటుంది భారతి. – సరస్వతి రమ -
గ్రేట్ రైటర్; నగై కఫూ
నవల ఏదో రాయాలని కూర్చునే ఒక మహిళ ఎలాంటి దుస్తులు ధరిస్తుందో చూడకుండా ఆమెలాంటి ఒక పాత్రను సృష్టించలేను అంటాడు నగై కఫూ (1879–1959). ఇంతటి సూక్ష్మ వివరాల మీద కూడా కఫూకు ఎంతో పట్టింపు. అందుకే ఎంతో శోధించిన అంశాలను కూడా వాటికి తాను సాక్షిగానో, పరిశీలకుడిగానో లేని కారణంగా రాయకుండా వదిలేసేవాడు. అంతటి చిత్తశుద్ధి కారణంగానే కఫూ ఆధునిక జపాన్ సాహిత్యంలో గొప్ప రచయితగా పేరొందాడు. స్ట్రేంజ్ టేల్ ఫ్రమ్ ఈస్ట్ ఆఫ్ ద రివర్, గీశా ఇన్ రైవల్రీ, అమెరికన్ స్టోరీస్, ద రివర్ సుమిద, డ్యూరింగ్ ద రెయిన్స్, ఫ్లవర్స్ ఇన్ ద షేడ్, డ్వార్ఫ్ బాంబూ, ప్లెజర్ ఆయన రచనలు. రచన అనేది రాసేవాడి వ్యక్తిత్వంగా కఫూ భావిస్తాడు. వ్యక్తిత్వం వెల్లడి కానిదానిమీద ఆయనకు ఆసక్తి లేదు. తెలిసిన సబ్జెక్టును మళ్లీ మళ్లీ రాయడం మీద ఆయనకు అయిష్టత లేదు. సమాజం వల్ల ద్వితీయ శ్రేణి పౌరులుగా తిరస్కరించబడి జీవితంతో పోరాడే వాళ్లు అందుకే ఆయన రచనల్లో తిరిగి తిరిగి దర్శనమిస్తారు. కేవలం రాజకీయ ముఖం మాత్రమే చూపే వార్తాపత్రికలను రోజుల తరబడి చదవకుండా గడిపేవాడు. తీవ్ర భావోద్వేగంలో కాకుండా ఆలోచనాయుత స్థితి నెలకొన్నాకే రాయాలనీ, సహానుభూతి లేని అంశాలను స్పృశించకూడదనీ ఆయన పెట్టుకున్న నియమాలు. -
గ్రేట్ రైటర్; నత్సుమే సోసెకి
ఆధునిక జపాన్ సాహిత్యంలో అత్యంత గొప్ప రచయిత నత్సుమే సోసెకి(1867–1916). వెయ్యి యెన్ల నోటు మీద కూడా ఆయన చిత్రాన్ని ముద్రించారు. కొకొరో, బాచన్, ఐ యామ్ ఎ క్యాట్, ‘లైట్ అండ్ డార్క్నెస్’(అసంపూర్ణం) ఆయన ప్రసిద్ధ నవలలు. అదివరకే ఐదుగురు పిల్లలున్న వయసు ముదిరిన తల్లిదండ్రులకు అక్కర్లేని సంతానంగా జన్మించాడు నత్సుమే. నత్సుమే కిన్నోసుకే. సంతానం లేని దంపతులకు దత్తత వెళ్లాడు. కానీ వాళ్లు విడిపోవడంతో తొమ్మిదేళ్లప్పుడు మళ్లీ సొంతింటికి తిరిగి వచ్చాడు. తల్లినీ, ఇద్దరు అన్నలనూ చిన్నవయసులోనే కోల్పోయాడు. ఒంటరితనం, అభద్రత తెలియకుండానే అతడిని చుట్టుకున్నాయి. చైనీస్ సాహిత్యం మీది మక్కువతో తానూ రచయిత కావాలని కలగన్నాడు. కానీ ఇంట్లో వాళ్లు ఇదీ అక్కర్లేదన్నారు. దాంతో సోసెకి(మొండివాడు) అన్న మారుపేరు స్వీకరించాడు. విస్తృతంగా సాహిత్యాన్ని అధ్యయనం చేసిన సోసెకి– హైకూలు, సాహిత్య వ్యాసాలతో కెరియర్ ఆరంభించాడు. అతి సామాన్యుడి ఆర్థిక ఇక్కట్ల నుంచి ఆధునిక పరిశ్రమల విపరిణామాల దాకా తన రచనల్లో చర్చించాడు. హైకూలాంటి నవల జరుగుతున్న పరిణామాలను రచయిత మార్చలేడు. విరూపమూ, బాధాకరమూ అయిన జీవితాన్ని ఒక దృష్టికోణంతో చూడటం మొదలుపెట్టడం ద్వారా జీవితాన్ని అర్థవంతం చేయగలం అంటాడు సోసెకి. దీనికి రచయితకు కావాల్సినవల్లా ఉద్వేగమూ, ప్రత్యేకమైన రుచీ. -
కన్యాదానం ఇవ్వను
రెండు రోజులుగా ట్విట్టర్లో ఒక విశేషం వైరల్ అవుతోంది. అస్మితాఘోష్ అనే యువతి ఈ మధ్య ఒక పెళ్లికి వెళ్లింది. బెంగాలీ పెళ్లే అది. పెళ్లి తంతును మహిళా పూజారులు నిర్వహించారు! అది ఆ అమ్మాయికి సంతోషంగా అనిపించింది. అస్మిత ఫెమినిస్ట్. గాయని. రచయిత్రి. ఆధునిక భావాలు ఉన్న అమ్మాయి కనుక సహజంగానే ఆమెకు పెళ్లి వేదికపై మహిళా పురోహితులు కనిపించడం సంతోషాన్నిచ్చే సంగతి అయింది. మంత్రోచ్చాటనగా వధువును ఆ పురోహితులు పరిచయం చేసిన విధానం కూడా అస్మితను ఆకట్టుకుంది. మొదట వాళ్లు తల్లి పేరు చెప్పారు. తర్వాత తండ్రి పేరు చెప్పారు. ఆ తల్లిదండ్రుల కూతురే ఈ వధువు అని చెప్పారు. తల్లి పేరు ముందు చెప్పడం అస్మితను ముగ్ధురాలిని చేసింది. కన్యాదానం దగ్గరికి వచ్చేసరికి ఆ తండ్రి.. ‘‘నేను కన్యాదానం ఇవ్వను’’ అనేశారు! అస్మిత్ పోస్ట్ చేసిన ఫొటోలో లేరు కానీ, పెళ్లికొచ్చిన అతిథులు ఆ మాటకు నివ్వెరపోయారు. ‘‘అవును. నేను కన్యాదానం చేయబోవడం లేదు. నా కూతురు ఆస్తి కాదు. దానం ఇవ్వడానికి’’ అన్నారు. ఇది కూడా అస్మితకు నచ్చింది. వెంటనే వధూవరులున్న ఒక ఫొటోను ఎంపిక చేసుకుని, ఫొటోతో పాటు వివరాలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘అయామ్ సో ఇప్రెస్డ్’ అని కామెంట్ కూడా పెట్టింది. ఫిబ్రవరి నాలుగున పోస్ట్ పెడితే ఇప్పటికింకా నిరవధికంగా లైక్లు వస్తూనే ఉన్నాయి. దాదాపు అందరి అభిప్రాయం ఒక్కటే. ‘మెల్లిమెల్లిగా సంప్రదాయాలను, ఆచారాలను మార్చుకుంటూ వస్తున్నాం. ఇది మంచి విషయం’ అని. అషీమా అనే అమ్మాయి.. ‘ఇది ఏ గ్రహంలో జరిగింది? అందమైన మనుషులు’ అని ట్వీట్ చేసింది. దేవిప్రసాద్ మిశ్రా అనే అతను ‘దిస్ ఈజ్ ఎక్స్లెంట్. థ్యాంక్యూ ఫర్ షేరింగ్’ అని కామెంట్ ఇచ్చాడు. విమల్ అరోరా ‘ప్రోగ్రెసివ్’ అన్నాడు. రమేశ్ చంద్ర అనే యువకుడు ‘వెరీ బ్రేవ్ ఆఫ్ దెమ్! ఆదర్శప్రాయం’ అని ట్వీట్ పెట్టాడు. దీనిని బట్టి యువతరం ఆలోచనా ధోరణి అధునాతనం అవుతోందని తెలుస్తోంది. పూర్వ ఆచారాలను వారేమీ పూర్తిగా నిరాకరించడం లేదు. వాటిలోని అంతరార్థాలు తెలిశాక, అవి నచ్చకపోతే తిరస్కరిస్తున్నారు. ఇలాంటి ఘటనే, పశ్చిమబెంగాల్లోనే ఇటీవల ఒకటి జరిగింది. వధువు ‘కనకాంజలి’ అనే ఆచారాన్ని పెళ్లి పీటల మీదే తిరస్కరించింది. వధువు గుప్పెట నిండా బియ్యం తీసుకుని తలపై పోసుకుంటూ, ‘‘నా తల్లిదండ్రుల రుణాన్ని తీర్చేశాను’’ అని చెప్పడమే కనకాంజలి ఆచారంలోని పరమార్థం. అయితే ఆ వధువు.. ‘‘తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీరేదీ, తీర్చుకోగలిగిందీ కాదు. కనుక నేను ఆ మంత్రాన్ని జపించలేను’’ అని ధైర్యంగా పురోహితులతో చెప్పడం అనేక మంది అభినందనలకు కారణమైంది. అస్మితా ఘోష్ను కూడా ఇప్పుడు మనం అభినందించాలి. ఆమే కనుక ట్వీట్లో తను వెళ్లిన పెళ్లిలోని ప్రత్యేకతల గురించి చెప్పకుంటే ఆ ప్రత్యేకతలు అక్కడితో ఆగిపోయేవి. -
పద్మ అవార్డును నిరాకరించిన సీఎం సోదరి
న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సోదరి, ప్రముఖ రచయిత్రి గీతా మెహతాకు పద్మ శ్రీ ప్రకటించారు. అయితే ఈ అవార్డును తిరస్కరిస్తున్నట్లు తెలిపారు గీతా మెహతా. ఈ విషయం గురించి గీతా మాట్లాడుతూ.. ‘ భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు నన్ను అర్హురాలిగా భావించినందుకు నేను చాలా గర్వ పడుతున్నాను. కానీ ఈ అవార్డును తిరస్కరిస్తున్నందుకు నన్ను క్షమించాలి’ అన్నారు. ఇందుకు గల కారణాన్ని కూడా తెలిపారు గీత. ‘త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో నేను ఈ అవార్డును స్వీకరిస్తే ప్రభుత్వం ఇబ్బంది పడే అవకాశం ఉంది. నేను అవార్డు స్వీకరించడం నాకు, ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. అందుకే ఈ అవార్డును తిరస్కరిస్తున్నాను. ఇందుకు నన్ను క్షమించాలి’ అన్నారు. గీతా మెహతా ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి అయిన బిజు పట్నాయక్ కుమార్తె. ఆల్ప్రెడ్ ఎ.నోఫ్ పబ్లిషింగ్ హౌస్ అధిపతి సోనీ మెహతాను వివాహమాడారు. ఆమె రాసిన పుస్తకాలు 21 భాషలలో అనువాదమయ్యాయి. -
గ్రేట్ రైటర్..భారతీ ముఖర్జీ
కోల్కతాలోని బెంగాలీ కుటుంబంలో జన్మించారు భారతీ ముఖర్జీ(1940–2017). ఒకే కాంపౌండులో సుమారు యాభై మంది నివసించేంత పెద్ద ఉమ్మడి కుటుంబం వాళ్లది. పన్నెండు వేల మంది భారతీయులు మాత్రమే అమెరికాలో ఉంటున్న కాలంలో అమెరికాలో స్థిరపడిన తొలితరం భారతీయుల్లో భారతీ ముఖర్జీ ఒకరు. అమెరికా కంటే ముందు ఆమె కొన్నేళ్లు కెనడాలో జీవించారు. సహజంగానే ఇరు దేశాల మధ్యన సాంస్కృతిక తేడాలు, వర్ణ వివక్ష, భయాందోళనలు ఆమె రచనల్లోకి ప్రవేశించాయి. పరదేశంలోని పరాయితనం ఒకవైపూ, తిరిగి మాతృదేశానికి వచ్చినప్పుడు గుర్తించలేనంతగా జరిగిన మార్పులు మరోవైపూ ఆమె పాత్రలు అనుభవిస్తాయి. భారతీయ స్త్రీగా అధిగమించాల్సిన అవరోధాలు ఉండనే ఉన్నాయి. ‘ఒక మరణం, మరెన్నో పునర్జన్మలు’. ‘జాస్మిన్’, ‘ద టైగర్స్ డాటర్’, ‘వైఫ్’ ఆమె ప్రసిద్ధ నవలలు. తనను తాను అమెరికా రచయితగానే భావించుకున్న భారతీ ముఖర్జీ, అమెరికా బహుళత్వంలో తానూ భాగమంటారు. 1985లో సిక్కు ఉగ్రవాదులు పేల్చిన విమాన బాంబులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల ఆత్మఘోష నేపథ్యంలో సాగే ‘ద మేనేజ్మెంట్ ఆఫ్ గ్రీఫ్’ కథ ఎన్నో అమెరికా కథాసంకలనాల్లో చోటు చేసుకుంది. కెనడా రచయిత క్లార్క్ బ్లెయిజ్ను ఆమె వివాహమాడారు. ఇద్దరూ కలిసి ‘డేస్ అండ్ నైట్స్ ఇన్ కోల్కతా’ రాశారు. -
మృదుస్పర్శ ఎరిగినవాడు
గ్రేట్ రైటర్ మనిషి స్వతహాగా బలహీనుడని నమ్ముతాడు డాజై ఒసాము (1909–1948). ఎదుటివాడి బలహీనతను ఎరిగి, మృదువుగా స్పందించడం ద్వారా వారికి సాంత్వన అందించగలమని చెబుతాడు. దీనికోసం ఆయన ఎన్నుకున్న ఒక మార్గం, జీవితపు కర్కశత్వానికి బలైపోయిన బలహీన పాత్రలను సృష్టించి, వాటిపట్ల పాఠకుల్లో ప్రగాఢమైన సానుభూతిని రేకెత్తించడం. ఈ మృదుస్పర్శ లేనివాడే ఆయన ఉద్దేశంలో దుష్టుడు. ఈ స్పర్శ లేదనిపించినప్పుడు ఆయన ఇతరుల రచనలను తిరగరాయడానికి కూడా వెనుకాడలేదు. అలాగే, రాయడం అంటే నిజాయితీ అని కూడా డాజై విశ్వాసం. వ్యక్తిగత జీవితాన్ని అత్యంత పారదర్శకంగా కనబరిచే ఆత్మకథాత్మక నవలలుగా ఆయన ‘ద సెట్టింగ్ సన్’, ‘నో లాంగర్ హ్యూమన్’ జపాన్లో కొనియాడబడుతున్నాయి. అప్రయత్నంగా రాసే రచయితగా, అతి చిన్న విషయాలను గురించి పట్టించుకునే రచయితగా కూడా ఆయనకు పేరు. అయితే, కేవలం వాస్తవాన్ని ప్రతిబింబించడం పట్ల కూడా డాజైకి అభ్యంతరాలున్నాయి. ఎదుటివారిలో ఆర్ద్రతను మేల్కొల్పని వాస్తవికవాదాన్ని నిరసించాడు. వాస్తవం కన్నా సత్యం వైపు మొగ్గుచూపాడు. మనిషిగా బతకడంలో సంఘర్షణ ఎదుర్కొని, మద్యానికి బానిసై, అనారోగ్యం పాలై, సంబంధాలను చెడగొట్టుకుని, 39వ పుట్టినరోజు ఇంకా ఆరు రోజులుందనగా సహచరితో కలిసి కాలువలో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికి ఆయన తలపెట్టి పూర్తిచేయకుండా వదిలేసిన నవలిక పేరు ‘గుడ్బై’. -
నవల రాయడం పెళ్లి లాంటిది
గ్రేట్ రైటర్ హీబ్రూ నుంచి అత్యధికంగా అనువాదమైన రచయితల్లో మొదట చెప్పగలిగే పేరు ఏమస్ ఓజ్. ఇజ్రాయెల్కు వలస వచ్చిన లేదా మూలాలను వెతుక్కుంటూ తిరిగి వచ్చిన యూదు తల్లిదండ్రులకు 1939లో జన్మించాడు. అతడి పన్నెండో ఏట తల్లి డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మీద ఒక తిరుగుబాటుగా సామూహిక వ్యవసాయ క్షేత్రాలైన కిబుట్స్కు వెళ్లిపోయాడు. అక్కడే జీవితంలో చాలాభాగం గడిపాడు. ఓజ్ అంటే స్ట్రెంత్. తన బలం రాయడంలో ఉందని గ్రహించిన తర్వాత రాయడాన్ని సీరియస్గా తీసుకున్నాడు. నవలలు, కథలు, వ్యాసాలు విరివిగా రాశాడు. కవిత రాయడమంటే ఎఫైర్– వన్ నైట్ స్టాండ్ లాంటిదనీ, కథ రాయడం రొమాన్స్– ఒక బంధం, కానీ నవల రాయడమంటే పెళ్లి చేసుకోవడం– దానికోసం త్యాగాలు చేయాలి, రాజీ పడాలీ అంటాడు. తనతో తాను నూటికి నూరు శాతం ఏకీభవించే అంశాలైతే, అలా అరుదుగా జరిగినప్పటికీ, వాటిని వ్యాసాలుగా రాస్తాననీ; ఒక అంశం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయదలిచినప్పుడు కథకుగానీ నవలకుగానీ పూనుకుంటాననీ చెబుతాడు. అలాగని రచయితేమీ దేవుడు కాదు, ఎలాగైనా పాత్రల్ని ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ పోవడానికి; ఒకసారంటూ వాటికి ప్రాణం పోశాక వాటిని రచయితైనా నిలువరించలేడని చెబుతాడు. ఇజ్రాయెల్లో జన్మించినవాడిగా వాస్తవం నుంచి పారిపోలేననీ, ఒక అన్యాయం పట్ల తిరుగుబాటుగా తాను రాస్తాననీ అంటాడు. తక్కువ విస్తృతి ఉన్నప్పటికీ హీబ్రూలోనే రాయడానికి కారణం, అది తాను నవ్వే, శపించే, కలలుగనే భాష కాబట్టి, అంటాడు. ఒకవేళ దేశం వదిలి పెట్టాల్సివచ్చినా భాషను వదులుకోనని చెబుతాడు. ఇజ్రాయెల్, పాలస్తీనా సంఘర్షణను న్యాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న న్యాయ పోరాటంగా చూస్తాడు. అదే ట్రాజెడీ అనీ, ఇద్దరూ భూమిని పంచుకుని పరస్పరం సహకరించుకోవడం మినహా మార్గం లేదనీ చెబుతాడు. పీస్ నౌ మూవ్మెంట్ ఆద్యుల్లో ఒకడైన ఏమస్ ఓజ్ మొన్న 2018 డిసెంబర్ 28న మరణించాడు. -
ప్రముఖ రచయిత నోముల సత్యనారాయణ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భాషా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో తనదైన ముద్రవేసిన బహు భాషా కోవిదుడు, రచయిత డాక్టర్ నోముల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సత్యనారాయణ కుటుంబసభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బహుభాషావేత్త, ప్రముఖ రచయిత అయిన నోముల సత్యనారాయణకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నల్లగొండలోని రవీంద్రనగర్కు చెందిన ఆయన ఇంగ్లిష్ లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. కథ, నవల, కవిత్వం, విమర్శ లాంటి సాహిత్య ప్రక్రియల్లో ఆయనకు విశేషమైన పరిచయం ఉంది. ‘అన్ టోల్డ్ లెసన్’ అనే పుస్తకాన్ని రచించిన సత్యనారాయణకు నల్లగొండలో నడిచే గ్రంథాలయంగా పేరుంది. ఆయన కుటుంబ సభ్యులు నోముల సాహితీ సమితిని స్థాపించి.. ఏటా ఉత్తమ కథలకు పురస్కారాలు అందజేస్తున్నారు. -
రాణులు అద్దంలో హీనులైనప్పుడు...
ఆమా, ఈఫీ, జోయ్స్, సిసీ– ఆఫ్రికన్ యువతులు. బెల్జియమ్లో ఉన్న అంట్వెర్ప్– ‘బ్లాక్ సిస్టర్స్ స్ట్రీట్’లో, ఒక అపార్ట్ట్మెంట్లో ఉండి వ్యభిచారం చేస్తుంటారు. ‘వారిలో ముగ్గురు, తమ శరీరాలని కిటికీల్లోంచి ప్రదర్శించడం కోసం తయారవుతుండగా’ నవల ప్రారంభం అవుతుంది. వారితోపాటుండే సిసీ కనబడకుండా పోతుంది. ఆమా, తన 8 ఏళ్ళ వయస్సునుండీ పాస్టరైన సవతి తండ్రి బలాత్కారానికి గురవుతూ వచ్చినది. ఈఫీ 16 ఏళ్ళప్పుడే గర్భవతి అయినది. జోయ్స్ చిన్నపిల్లగా ఉన్నప్పుడు జాంజావీడ్ సైనికులు ఆమెను మానభంగం చేస్తారు. ‘ఆన్ బ్లాక్ సిస్టర్స్ స్ట్రీట్’ నవల్లో ఉన్న ప్రతి అధ్యాయం, ఒక యువతి కథే అయినా ప్రధాన భాగం– సిసీ మీదే కేంద్రీకరించినది. ‘పుస్తకాలు పట్టుకో. అప్పుడు ఆకాశమే నీ ఎల్ల’ అంటూ విద్యకున్న ప్రాముఖ్యతను తల్లిదండ్రులు ఆమెకు నేర్పిస్తారు. బిజినెస్ డిగ్రీ ఉండి కూడా ఉద్యోగం దొరకదు. తన ‘జీవితాన్ని కడిగేసే రంగురంగుల ప్రవచనం’ ఎక్కడుందో కనుక్కోలేకపోతుంది సిసీ. ‘చీలమండ ద్వారా జీవితాన్ని దొరకబుచ్చుకుని, దాని ముఖం మీద వెక్కిరించడానికి’ అంట్వెర్ప్లో ‘విండో గర్ల్’గా తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని వస్తుంది. వీరందరినీ బెల్జియమ్ తెచ్చిన డెలె డబ్బున్నవాడు, నిర్దయుడు. ప్రతి యువతి మీదా 30,000 యూరోలు ఖర్చుపెడతాడు. విటులని సంతోషపెడ్తూ, వారా డబ్బుని వాయిదాల మీద చెల్లించాలి. వారి నకిలీ పాస్పోర్టులను తన వద్దే పెట్టుకుంటాడు అతను. యువతులు ‘మాడమ్’ సంరక్షణలో ఉంటారు. ‘బంగారం రంగు నైలాన్ స్కర్ట్ తొడుక్కుని వేశ్యలా కనిపించు’ అని మాడమ్ సిసీకి చెప్తుంది. మొదటి క్లయింట్ టాయ్లెట్లో ఎదురుపడ్డప్పుడు, ఆమె పడిన బాధను రచయిత్రి చికా ఉనిగ్వే వర్ణిస్తారు: ‘సిసీ తన్ని తానే కన్నీళ్ళతో బాప్టిజం చేసుకుంది. అవి కమిలి, వేడిగా ఆమె చెంపలమీదగా కారాయి. నోటికి ఉప్పగా అనిపించాయి’. బెల్జియమ్లో, మొదటి రోజు జామ్ తింటూ, రాణిననుకున్న సిసీ, ‘ఇంక అద్దంలో నన్ను నేను చూసుకోలేను’ అనే దశకి వస్తుంది. ఆమె– లుక్ అనే బెల్జియన్ బ్యాంకర్ని కలుసుకుంటుంది. వేశ్యాగృహం నుండి బయటపడే మార్గం చెప్తానంటాడతను. అపార్టుమెంటు నుండి పారిపోయి, డెలెకి చెల్లించే డబ్బు ఆపేసి, లుక్తో కొత్త జీవితం మొదలు పెడదామనుకున్న సిసీ నిర్ణయం ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఆమె లుక్ ఇంటికి వెళ్ళినప్పుడు, అతను ఇంట్లో ఉండడు. తాముండే అపార్టుమెంట్లోనే ‘మాడమ్’తో పాటుండే ‘సెగెన్’ కనిపిస్తాడక్కడ. అతను సిసీ తలను సుత్తితో పగలగొడతాడు. ఆ హత్య చేయించినది డెలెయే. ఆ తరువాత, సిసీ గురించి విచారపడుతూ, అపార్టుమెంటును తప్ప తమ అనుభూతులను/అనుభవాలను మిగతావారితో పంచుకోని తక్కిన ముగ్గురూ, తమ తమ వివరాలను చెప్పుకుంటారు. ఉనిగ్వే ప్రతీ కథనాన్నీ స్వల్పభేదంతో చూపుతారు. లైంగిక దాడుల బాధితురాళ్ళే వేశ్యలుగా మారడానికి ప్రధాన అభ్యర్థులు అన్న సంగతిని యీ కథ నొక్కి చెప్తుంది. పుస్తకంలో–ఇంగ్లిష్తో ఇగ్బో భాష (నైజీరియాలోని ఇగ్బో ప్రజలు మాట్లాడే భాష) కలిసిన కొన్ని వాక్యాలు అనువదించబడినప్పటికీ, భాష ప్రధానంగా– పాత్రలు మాట్లాడే చిట్టిపొట్టి ఇంగ్లిష్ పదాలతోనే ఉంటుంది. యీ చీకటి లోకపు యువతులు సమర్థులూ, తెలివైనవారుగానూ, పురుషులు– తాగుబోతులూ, హంతకులూ, రేపిస్టులూ, బలహీనమైనవారుగానూ చిత్రిస్తారు రచయిత్రి. లైంగిక అత్యాచారాల య«థార్థం గురించిన కాల్పనిక కథ ఇది. వ్యభిచార వృత్తి వివరాలుంటాయి. ఆఫ్రికన్ యువతులు యూరప్లో వేశ్యావృత్తిలోకి దిగే కారణాల గురించి విశదంగా రాస్తారు ఉనిగ్వే. సెక్స్ పరిశ్రమ గురించిన కథనం హాస్యంతో కూడినది. డచ్ నుంచి ఇంగ్లిష్లోకి అనువదించబడిన ఈ నవలని, రాండమ్ హౌస్ 2011లో ప్రచురించింది. కృష్ణ వేణి -
గ్రేట్ రైటర్
బ్రిటిష్ ఇండియాలో ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్గా జన్మించాడు ‘ఆర్వెల్’. పెద్దయ్యాక ఎప్పటికైనా రచయిత కావాలని ఉండేది. కానీ రాయడమంటే యాతన, తనను తాను నిర్వీర్యుణ్ని చేసుకునే ప్రక్రియ. అందుకే లోలోపలి రచయితను విదిల్చుకోవడానికి ప్రయత్నించాడు. కానీ వల్లకాలేదు. తన రాతలతో తల్లిదండ్రులకు చీకాకుగా మారకూడదని కలంపేరు ‘జార్జ్ ఆర్వెల్’(1903–1950) అని పెట్టుకున్నాడు. ‘యానిమల్ ఫామ్’, ‘1984’ ఆయన సుప్రసిద్ధ రచనలు.ఆయుధాల చరిత్రే నాగరికత చరిత్ర అన్న ఆర్వెల్, ప్రపంచాన్ని నాశనం చేసే అణుబాంబును వ్యతిరేకించాడు. స్టాలిన్ను నిరసించాడు. ఆయన రచనలన్నీ రాజకీయ కోణంలో రాసినవే. కళకూ, రాజకీయాలకూ సంబంధం లేదనడం కూడా రాజకీయమే అంటాడు. కానీ దాన్ని కళాత్మక స్థాయికి తీసుకెళ్లడం తెలియాలంటాడు. ‘కోల్డ్ వార్’, ‘బిగ్ బ్రదర్’ లాంటి ఆయన పుట్టించిన పదబంధాలు సాహిత్యంలోంచి రాజకీయ పరిభాషలోకీ ప్రవేశించగలిగాయి.ఆర్వెల్కు చక్కగా కాచిన టీ ఇష్టం. ఘాటైన పొగాకుతో తానే చుట్టుకునే సిగరెట్లు ఇష్టం. పెంపుడు జంతువులు ఇష్టం. ప్రకృతన్నా ప్రాణం. స్నేహితుల దగ్గర నోరు మెదపక పోవడం, కొత్తవారితో అరమరికలు లేకుండా మాట్లాడటం ఆయన స్వభావం. క్షయవ్యాధితో 47 ఏళ్లకే మరణించిన ఆర్వెల్ తన అవసరాలను చాలా పరిమితం చేసుకుని, ‘మన కాలపు సన్యాసి’ అనిపించుకున్నాడు. -
ప్రముఖ రచయిత్రి ప్రమీలాదేవి మృతి
గౌతంనగర్: ప్రముఖ రచయిత్రి డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి(75) గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యమున్న ప్రమీలాదేవి సుమారు 40 పుస్తకాలు రచించారు. ‘పద సాహిత్య పరిషత్’ అనే సంస్థను స్థాపించి సాహిత్య సేవలందించారు. అన్నమాచార్య కీర్తనలపై పీహెచ్డీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది జులైలో మధ్యప్రదేశ్లో జరిగిన అఖిల భారతీయ రాష్ట్ర భాషా సమ్మేళనంలో సరస్వతీ సన్మాన్ అవార్డు అందుకున్నారు. సర్దార్పటేల్నగర్లోని శ్మశానవాటికలో జరిగిన ఆమె అంత్యక్రియలకు ప్రముఖ కవయిత్రులు ముక్తావి భారతి, ఆకెళ్ల విజయలక్ష్మి, తమిరస జానకి, గోల్లమూరి పద్మావతి తదితరులు హాజరై నివాళులర్పించారు. -
గ్రేట్ రైటర్: డి.హెచ్.లారెన్స్
డేవిడ్ హెర్బర్ట్ లారెన్స్ (1885–1930) ఆంగ్ల కవి, రచయిత. ఇంగ్లండ్లోని కార్మికుల ఇంట్లో పుట్టిన లారెన్స్ తన హృదయంలో నిలుపుకొన్న గ్రామసీమల గురించి రాశాడు. వాటిల్లో తీవ్రస్వరంతో లైంగికత, జీవశక్తి, ఉద్వేగ సంబంధ ఆరోగ్యం వ్యక్తమయ్యాయి. ఈ కారణంగా వివాదాస్పద రచయితగా ముద్రపడ్డాడు. తనకున్న విశేషమైన ప్రజ్ఞను బూతుచిత్తరువులు రాయడం కోసం వృథా చేసినవాడిగా అపఖ్యాతి పాలయ్యాడు. ఈ దాడిని తట్టుకోలేక స్వచ్ఛంద దేశ బహిష్కారం విధించుకున్నాడు. ఆరేళ్లు పెద్దదైన, ముగ్గురు పిల్లల తల్లి ఫ్రీడా వీక్లీతో కలిసి జర్మనీ పారిపోయాడు. ఇద్దరూ కలిసి ఆస్ట్రేలియా, ఇటలీ, శ్రీలంక, అమెరికా, మెక్సికో లాంటి దేశాలు తిరుగుతూ తమ విహారేచ్ఛను సంతృప్తిపరుచుకున్నారు. అయితే జర్మనీ, ఫ్రాన్స్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పుడు బ్రిటిష్ ఏజెంట్గా అనుమానాలు ఎదుర్కొన్నాడు. తల్లితో గాఢమైన అనుబంధం కలిగిన లారెన్స్, కేన్సర్తో ఆమె మరణించినప్పుడు కదిలిపోయాడు. ఆ సంవత్సరమంతా అనారోగ్య సంవత్సరంగానే గడిపాడు. నిమోనియా, మలేరియాతో తానూ చాలాసార్లు బాధపడ్డాడు. హోమోసెక్సువాలిటీ ఆలోచనలు కలిగినట్టుగా కనిపిస్తాడు. పైకి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గొప్పవాళ్లందరికీ అటువైపు మొగ్గుంటుంది అని వ్యాఖ్యానించాడు. అయితే లారెన్స్ విషయంలో ఒక ఆకర్షణగా అది కనబడినా, లైంగిక సంబంధం దాకా పోయినట్టుగా ఆధారాలు లేవు. క్షయ వ్యాధి కారణంగా 45 ఏళ్ల వయసులో మరణించాకగానీ లారెన్స్ రచనా విశిష్టతను సాహిత్యలోకం అంచనా కట్టలేకపోయింది. ‘సన్స్ అండ్ లవర్స్’, ‘ద రెయిన్బో’, ‘లేడీ ఛాటర్లీస్ లవర్’, ‘విమెన్ ఇన్ లవ్’ ఆయన ప్రసిద్ధ రచనలు. -
#మీటూ: ప్రముఖ నటుడిపై రేప్ ఆరోపణలు
సాక్షి, ముంబై: బాలీవుడ్లో ‘మీటూ’ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సినీ, మీడియా రంగాల్లో వరసగా ఒక్కొక్కరు తమ భయంకరమైన అనుభవాలను సోషల్మీడియా వేదికగా వెలుగులోకి తీసుకొస్తున్నారు. తాజాగా ప్రముఖ రచయిత, ప్రొడ్యూసర్ వింటా నందా తన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా ఈ కీచక పర్వంలో మరిన్ని చీకటి కోణాల్ని బహిర్గతం చేశారు. హృదయ విదారకమైన అనుభవాన్ని రెండు దశాబ్దాల తన మూగ వేదనను షేర్ చేశారు. ఇపుడు చాలామంది మహిళలు లైంగిక వేధింపులపై బయటికి వస్తున్నారు. 19ఏళ్లుగా నేను ఈ సమయంకోసం వేచి చూస్తున్నాను అంటూ ఫేస్బుక్లో భయంకరమైన విషయాలను వెల్లడించారు. సుదీర్ఘమైన తన ఫేస్బుక్ పోస్ట్లో అత్యంత సంస్కారవంతుడుగా పేరొందిన వ్యక్తి సినీ, టీవీ టెలివిజన్ నటుడు అలోక్నాథ్ తనపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడని వింటా నందా ఆరోపించారు. తనతో బలవంతంగా మద్యం తాగించి మరీ అలోక్నాథ్ రేప్ చేశాడని 20 ఏళ్ల సంఘటనను గుర్తు చేసుకున్నారు. అంతేకాదు 90వ దశకంలో టెలివిజన్ స్టార్గా వెలుగు వెలిగిన ఆయన అప్పటి టీవీ షో తారా (ఈ షో రచయిత, ప్రొడ్యూసర్ వింటా నందా) ప్రధాన నటిని కూడా లైంగికంగా వేధించాడనీ, దీనిపై ఫిర్యాదు చేసినందుకుగాను ఆమెను షో నుంచి తొలగించారన్నారు. ఆయనొక తాగుబోతు, దుర్మార్గుడు కానీ ప్రముఖ సంస్కారవంతమైన నటుడిగా చలామణీ అయ్యాడని పేర్కొన్నారు. ఇన్నాళ్లు తాను మౌనంగా ఉండడం వల్ల పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి. తాను మరింత నష్టపోయానంటూ ఆమె నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టారు. లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తున్న బాధిత మహిళలను అభినందించిన వింటా ఇదే సరైన సమయం మీరు ఎదుర్కొన్న వేధింపులపై గొంతెత్తి అరవండి. వేటగాడి చేతుల్లో చిక్కి బాధపడుతున్న బాధిత మహిళలందరూ మౌనాన్ని వీడాలని పిలుపునిచ్చారు. అలోక్నాథ్కు నోటీసులు మరోవైపు ఈ ఆరోపణలపై స్పందించిన సినీ, టీవీ ఆర్టిస్టుల సంఘం (సీఐఎన్టీఏఏ) అలోక్నాథ్కు నోటీసులు జారీ చేసింది. వింటా నందా ఆరోపణలపై వివరణ యివ్వాల్సిందిగా కోరింది. -
అలెగ్జాండర్ సోల్జెనిత్సిన్
అలెగ్జాండర్ సోల్జెనిత్సిన్ (1918–2008) రష్యన్ నవలా రచయిత, కథకుడు, చరిత్రకారుడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన సోల్జెనిత్సిన్ తల్లి పెంపకంలో పెరిగాడు. సోవియట్ ప్రభుత్వాన్నీ, కమ్యూనిజాన్నీ నిశితంగా విమర్శించాడు. ప్రభుత్వ బలవంతపు కార్మిక క్యాంపుల వ్యవస్థ ‘గులాగ్’ వైపు మిగతా ప్రపంచం దృష్టిసారించేట్టు చేశాడు. సైన్యంలో పనిచేసిన సోల్జెనిత్సిన్, జర్మన్ మహిళలపై రెడ్ ఆర్మీ చేసిన దురాగతాలను ‘ప్రష్యన్ నైట్స్’ కవితలో వర్ణిస్తాడు. ‘మనమేమైనా మంచివాళ్లమా?’ అని కూడా ‘ద గులాగ్ ఆర్కిపెలగో’లో ప్రశ్నిస్తాడు. ‘బాస్’ (స్టాలిన్)ను విమర్శించడం, సోవియట్ వ్యతిరేక ప్రచారం చేయడం కారణాలతో ఆయనకు కారాగార శిక్ష పడింది. జైల్లో ఏది దొరికితే దానిమీదే రాశాడు. ఆయన కొన్ని రచనలు కృశ్చేవ్ హయాంలో మాత్రమే ప్రచురణకు నోచుకున్నాయి. కృశ్చేవ్ పదవీచ్యుతుడైన తర్వాత సోల్జెనిత్సిన్ మళ్లీ తన సృజన స్వేచ్ఛ కోల్పోయాడు. 1970లో నోబెల్ బహుమతి వరించినప్పటికీ, దేశం విడిచి వెళ్తే తిరిగి రానివ్వరేమో అన్న భయంతో స్వీకరించడానికి వెళ్లలేదు. అయినా నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం ఆయన్ని దేశం నుంచి బహిష్కరించింది. సోవియట్ రష్యా పతనం తర్వాత ఇరవయ్యేళ్లకు 1994లో మాత్రమే తిరిగి మాతృదేశంలో పాదం మోపగలిగాడు. 89వ ఏట చనిపోయేవరకు అక్కడే నివసించాడు. ‘వన్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇవాన్ డెనిసోవిచ్’, ‘ఆగస్ట్ 1914’, ‘కేన్సర్ వార్డ్’ ఆయన ప్రసిద్ధ రచనలు. -
లూ షన్
గ్రామీణుల నోటిగాథలు, పౌరాణిక పాత్రలతో కూడిన కథలు, దయ్యాల కథలు ఆసక్తిగా వినేవాడు లూ షన్ (1881–1936) చిన్నతనంలో. అసలు పేరు ఝో షురెన్. భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ సంపద తరిగిపోవడమూ, ఒక కేసులో తండ్రికి శిక్ష పడి జైలు పాలై, ఆనక మరణించడమూ, చిన్న ఉద్యోగంలో కుదురుకోవడానికి కుటుంబ ప్రతిష్ట అడ్డుపడటమూ లాంటి కారణాలతో ఇంటిపరువు తీయకుండా ఉండేందుకు కలంపేరు వైపు మొగ్గాడు. హన్ చైనీయులు విధిగా ఉంచుకునే ముందంతా గుండుతో వెనకాలి పొడవాటి జడను కత్తిరించుకున్నాడు. బోధనారంగంలో పనిచేశాడు. డాక్టర్ కావాలనుకుని వైద్యం చదవలేకపోయినందువల్ల, కనీసం సాహిత్య వైద్యునిగా మారాలనుకున్నాడు. ఆయన ‘ఎ మాడ్మాన్స్ డైరీ’ని చైనా మొదటి ఆధునిక కథగా చెబుతారు. ‘కాల్ టు ఆర్మ్స్’, ‘వాండెరింగ్’ ఆయన కథా సంకలనాలు. మావో జెడాంగ్ ఎంతో అభిమానించిన రచయిత. సామ్యవాద భావనలవైపు మొగ్గు ఉన్నప్పటికీ కమ్యూనిస్టు పార్టీలో చేరలేదు. చైనా ఆధునిక సాహిత్యంలో దిగ్గజంగా పేరొందిన లూ షన్ విమర్శకుడు, సంపాదకుడు, అనువాదకుడుగానూ సేవలందించాడు. శృంగార సంబంధాల వల్ల చెడిన కుటుంబ బంధాలు, అధిక మద్యం, క్షయ ఆయన్ని మృత్యువు వైపు త్వరగా నడిపించాయి. -
గ్రేట్ రైటర్ : వి.ఎస్.నైపాల్
గణించదగిన నా విలువేమైనా ఉంటే అదంతా నా పుస్తకాల్లో ఉంది. నా పుస్తకాల మొత్తం నేను, అన్నారు వి.ఎస్.నైపాల్గా సుపరిచితులైన సర్ విద్యాధర్ సూరజ్ప్రసాద్ నైపాల్ (1932–2018). ట్రినిడాడ్లో స్థిరపడిన భారతీయ కుటుంబపు రెండో తరంలో జన్మించాడు నైపాల్. చిన్నతనంనుంచే ‘రచయిత’ అనే మాటకు ఉండే ఆకర్షణ ఆయన్ని పట్టేసింది. దానికి తగ్గట్టుగానే యాభై ఏళ్లలో ఫిక్షన్, నాన్ ఫిక్షన్ ముప్పై పుస్తకాలు వెలువరించారు. ఇండియా, ఆఫ్రికా, ఇస్లాం సమాజం, ఉత్తర దక్షిణ అమెరికాల గురించి విస్తృతంగా రాశారు. ట్రినిడాడ్లో వాళ్ల నాన్న జీవితాన్ని చిత్రించిన ‘ఎ హౌజ్ ఫర్ మిస్టర్ బిశ్వాస్’ ఆయనకు బాగా పేరు తెచ్చింది. ఈ నవలతో రచయితగా తన అప్రెంటిస్షిప్ ముగిసిందని సరదాగా వ్యాఖ్యానించారు. ‘ది ఎనిగ్మా ఆఫ్ ఎరైవల్’ ట్రినిడాడ్ నుంచి వెళ్లిన నైపాల్ ఇంగ్లండ్ జీవితాన్ని చిత్రిస్తుంది. ‘ఇండియా: ఎ వూండెడ్ సివిలైజేషన్’, ‘ఎ ఫ్లాగ్ ఆన్ ది ఐలాండ్’, ‘గెరిల్లాస్’, ‘హాఫ్ ఎ లైఫ్’, ‘ఏరియా ఆఫ్ డార్క్నెస్’, ‘ద రైటర్ అండ్ ద వరల్డ్’ ఆయన ఇతర రచనల్లో కొన్ని. 2001లో నోబెల్ గౌరవం పొందిన నైపాల్ మొన్న ఆగస్టు 11న మరణించారు. -
గ్రేట్ రైటర్ ; జేమ్స్ జాయిస్
ఇరవయ్యో శతాబ్దపు అత్యంత ప్రభావశీల రచయితల్లో ఒకరిగా గుర్తింపు పొందారు జేమ్స్ జాయిస్ (1882–1941). చైతన్య స్రవంతి శైలిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన రచయిత. అత్యంత సంక్లిష్టమైన రచనా విధానానికి సాక్ష్యాలుగా ఆయన నవలలు ‘యులెసీస్’, ‘ఎ పొర్ట్రెయిట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ట్ యాజ్ ఎ యంగ్మాన్’ (దీన్ని ‘యువకళాకారుని ఆత్మగీతం’ పేరుతో చింతపట్ల సుదర్శన్ తెలుగులోకి అనువదించారు), ‘ఫినెగన్స్ వేక్’ నిలుస్తాయి. ఐర్లాండ్లోని మధ్య తరగతి కుటుంబంలో పది మంది పిల్లల్లో పెద్దవాడిగా జన్మించాడు జాయ్స్. తండ్రి తాగుడు వ్యసనం వల్లా, ఆర్థిక ఎగుడుదిగుళ్ల వల్లా ఇబ్బంది పడ్డాడు. మెడిసిన్ మధ్యలో వదిలేశాడు. ఇరవై ఏళ్ల వయసులోనే యూరప్ వలస వెళ్లాడు. ట్రియస్ట్(ఇటలీ), రోమ్ (ఇటలీ), పారిస్(ఫ్రాన్స్), జ్యూరిక్ (స్విట్జర్లాండ్) నగరాల్లో బతికాడు. అయినప్పటికీ ఆయన ఆత్మ డుబ్లిన్(ఐర్లాండ్ రాజధాని) కోసం కొట్టుకులాడేది. డుబ్లిన్ నడిబొడ్డుకు గనక చేరుకుంటే, ప్రపంచంలోని అన్ని నగరాల నడిబొడ్డుకు చేరుకున్నట్టే అని వ్యాఖ్యానించాడు. దానికి తగ్గట్టే ఆయన కథాసంపుటి పేరు ‘డుబ్లినర్స్’. చేంబర్ మ్యూజిక్, గ్యాస్ ఫ్రమ్ ఎ బర్నర్ ఆయన కవితాసంపుటాలు. మతాన్ని పూర్తిగా నిరాకరించిన జాయ్స్, తల్లి మరణశయ్య మీద ఉన్నప్పుడు సైతం ప్రార్థన చేయడానికి సిద్ధపడలేదు. -
గ్రేట్ రైటర్ ; యసునారి కవబాత
ఆధునిక జపాన్ సాహిత్యంలో కొత్త సంవేదనలను చిత్రించిన రచయిత యసునారి కవబాత (1899–1972). సంప్రదాయ జపాన్ సాహిత్యానికి భిన్నంగా కొత్తదోవన నడిచిన రచయితల్లో కవబాత ఒకరు. నాలుగేళ్లప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన కవబాత నానమ్మ, తాతయ్య దగ్గర పెరిగాడు. ఏడేళ్లప్పుడు నానమ్మనూ, పదకొండేళ్లప్పుడు తాతయ్యనూ కోల్పోయాడు. ఈ దూరపుతనం కవబాత రచనలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆయన పాత్రలు తమ చుట్టూ గోడ కట్టుకుని ఒంటరితనంలో ఉన్నట్టుగా ప్రవర్తిస్తాయి. ‘ద డాన్సింగ్ గర్ల్ ఆఫ్ ఇజు’, ‘ద స్కేర్లెట్ గ్యాంగ్ ఆఫ్ అసాకుస’, ‘స్నో కంట్రీ’, ‘థౌజండ్ క్రేన్స్’, ‘ద సౌండ్ ఆఫ్ ద మౌంటెన్’, ‘ద హౌజ్ ఆఫ్ ద స్లీపింగ్ బ్యూటీస్’, ‘ద మాస్టర్ ఆఫ్ గో’ ఆయన నవలల్లో కొన్ని. ‘పామ్ ఆఫ్ ద హేండ్ స్టోరీస్’ ఆయన కథాసంపుటి. 1968లో నోబెల్ పురస్కారం అందుకున్నారు. ఆ గౌరవం పొందిన తొలి జపాన్ రచయిత అయ్యారు. వృద్ధాప్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం మాత్రం సాహితీ ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురిచేసింది. పార్కిన్సన్స్ డిసీజ్ వల్ల కలిగిన నిరాశ; స్నేహితుడు, సహ రచయిత యూకియో మిషిమా ఆత్మహత్య వల్ల కలిగిన షాక్ ఆయన్ని ఆత్మహత్యకు పురిగొల్పాయంటారు. ప్రమాదవశాత్తూ గ్యాస్ లీకై చనిపోయాడనే వాదనా ఉంది. అయితే, కవబాత జీవిత చరిత్ర రాసినాయన మాత్రం మిషిమా ఆత్మ, కవబాతను వందల రాత్రుళ్లపాటు వెంటాడిందని చెబుతారు.