-
రైలు ఎక్కబోయి జారిపడి.. 'జబర్దస్త్' రైటర్ మృతి
కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు శుక్రవారం రైలు ఎక్కుతూ కాలుజారి కింద పడి ప్రముఖ కామెడీ షో 'జబర్దస్త్' స్క్రిప్ట్ రైటర్, సహాయ నటుడు మృతి చెందాడు. ఆర్పీఎఫ్, రైల్వే ప్రయాణికుల కథనం ప్రకారం.. చుంచుపల్లి మండలంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మేదర మహ్మదీన్ హైదరాబాద్ వెళ్లేందుకు తెల్లవారుజామున భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్కు వచ్చాడు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఈ లాజిక్ ఎలా మిస్సవుతున్నారు?)కాకతీయ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కుతుండగా కాలు జారి ప్లాట్ఫాంకు, రైలుకు మధ్య ఇరుక్కుపోయాడు. అప్పటికే రైలు కదులుతుండగా ప్లాట్ఫాం, రైలు మధ్య శరీరం మూడు, నాలుగు సార్లు తిరిగింది. గమనించిన ఆర్పీఎఫ్ పోలీసులు అతని చేతులు పట్టుకుని పైకి లాగారు. దీంతో మహ్మదీన్ పైకి లేచి నడుచుకుంటూ తనకు ఏమి కాలేదని పేర్కొన్నాడు. అయినా ఆర్పీఎఫ్ పోలీసులు 108 వాహనంలో కొత్తగూడెం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఖమ్మం తరలిస్తుండగా మృతి చెందాడు. కాగా మహ్మదీన్ ప్లాట్ఫాం, రైలుకు మధ్య నలిగిపోయి అతని శరీరంలోని అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు నిర్ధారించారు. శరీరంపై మాత్రం నామమాత్రపు గాయాలే ఉన్నాయి. ప్లాట్ఫాం నుంచి 108 వాహనం వరకు, ఆస్పత్రిలో కూడా నడుచుకుంటూ తిరిగిన వ్యక్తి మృతి చెందడం విస్మయానికి గురిచేసింది. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?) -
రచయితగా మారిన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్!
అల్లరి నరేష్ చిత్రం సుడిగాడు సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన శ్రీ వసంత్. టాలీవుడ్లో పలు సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. తాజాగా విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా సినిమాకు శ్రీ వసంత్ సాంగ్స్, మాటలు రాశారు. నిధిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 14న థియేటర్లలో రిలీజైంది. విజయ్ సేతుపతి నటించిన 50వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహారాజ ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్గా ప్రేక్షకులను అలరిస్తోంది.ఒక మంచి సినిమాకు మాటలు, పాటలు రాయడం సంతోషాన్ని కలిగిస్తుందని శ్రీ వసంత్ తెలిపారు.మహారాజ సినిమాలోని "అమ్మ నీకే నాన్నయ్యనా" అంటూ సాగే పాటలు శ్రీ వసంత్ స్వరాలు పాపులర్ అయ్యాయి. అజనీస్ లోకనాధ్ సంగీతం పాటకు మరో బిగ్ అడ్వాంటేజ్. దీంతో మహారాజ సినిమాకు విడుదలైన రోజే మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అలాగే మహారాజా సినిమాకు రివ్యూస్లోనూ మాటలు, పాటల గురించి కూడా పాజిటివ్గా రాసుకొచ్చారు. శ్రీ వసంత్ స్వీయ డబ్బింగ్ కంపెనీ పోస్ట్ ప్రో మీడియా వర్క్స్లో మాహారాజ సినిమా డబ్బింగ్ పూర్తి చేశారు. -
గ్రామ రాజ్యం బీసీల పరం కావాలి!
తెలంగాణ పల్లెల్లో నేటికినీ కొనసాగుతున్న ఆధిపత్య వర్గాల పెత్తందారీతనాలు నామరూపాలు లేకుండా పోవాలంటే స్థానిక రాజ్యాలు (సంస్థలు) బహుజన వర్గాల చేతుల్లోకి రావాలి. స్థానిక రాజ్యాలైన గ్రామపంచాయతీ, మండల పరిషత్తు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్, కో ఆపరేటివ్ సొసైటీలు, డీసీసీబీలు, డీసీఎంఎస్లు, స్కూలు కమిటీలు, గ్రామ అభివృద్ధి కమిటీలలోకి పెద్దసంఖ్యలో చదువుకున్న బహుజన యువకులు రావాలి.అంటే బీసీ యువత పెద్దఎత్తున స్థానిక గ్రామీణ రాజకీయ రంగంలోకి రావాలి. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి స్థానిక పాలనలో రాజ్యాంగబద్ధంగా ఉన్న రిజర్వేషన్ల స్థానాల్లోకి చదువుకున్న దళిత, గిరిజన, ఆదివాసీ, మైనారిటీ తెగలకు చెందిన యువత రావాలి. ఈ పని జరిగినప్పుడే గ్రామాలలో సామాజిక మార్పులు సాధ్యమవుతాయి.తరతరాలుగా బీసీ వర్గాలకు చెందినవాళ్ళు ఎంబీసీలు, సంచార, అర్థసంచార జాతులు, ఉత్పత్తి కులాలకు చెందినవాళ్ళు సంపద సృష్టికర్తలుగా ఉన్నారు. కానీ రాజకీయ రంగంలోకి మాత్రం రాలేదు. సమాజంలో సగానికిపైగా ఉన్న ఉత్పత్తి కులాలకు చెందినవారి భాగస్వామ్యం స్థానిక సంస్థల్లో లేకపోవడం వల్ల ఆ వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. అత్యధిక జనాభా కలిగిన వెనుకబడిన కులాల సమస్యల పరిష్కారాలు ఆ యా కులాలవారు రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నప్పుడే సాధ్యమవుతుంది.తరతరాలుగా విన్నపాలు, విజ్ఞప్తులు పట్టుకుని గ్రామ పంచాయతీలు, మండల, జడ్పీ కార్యాలయాలు, కలెక్టరేట్ల దగ్గర నుంచి సచివాలయాల వరకు చెప్పులరిగేలా తిరిగిన బహుజన కులాలవాళ్ళు తమ సమస్యల పరిష్కారానికి తామే స్థానిక రాజ్యాల నాయకులు కావటం చాలా మార్పులకు దారితీస్తుంది. ఇది బీసీలకు రాజకీయ న్యాయంగా మాత్రమే కాకుండా మొత్తంగా సామాజిక పరివర్తనగా చూడాలి.గ్రామాలు దేశానికి ఊపిరైతే ఆ గ్రామాలకు ఉత్పత్తి కులాలు, ఉత్పత్తి శక్తులే ప్రాణాలు. బీసీల్లో చదువుకున్న కొత్తతరం తనకున్న పరిశోధనాత్మక ఆలోచనలను గ్రామాభివృద్ధిపై పెడితే ఊహించని అద్భుత ఫలిలాలు వస్తాయి. గ్రామం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తన చుట్టూ ఉన్న సహజ వనరులను ఉపయోగించుకుని సంపద సృష్టించే కేంద్రంగా మారుతుంది. కులవృత్తులు నేడు కునారిల్లుతున్నాయి. అవి అత్యాధునిక రూపం దాల్చితేనే నేటి ప్రపంచానికి అవసరమైన సంపదలను అందించే కేంద్రంగా గ్రామాలను తయారుచేయడం సాధ్యమవుతుంది. ఇదంతా జరగాలంటే స్థానిక సంస్థలపై బహుజనుల అధికారం నెలకొనాలి.జనాభాలో బీసీల సంఖ్యను బట్టి దామాషా ప్రకారం అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలి. ఆ యా బీసీ కులాలవారు అన్ని రంగాల్లో శిరసెత్తుకుని నిలిచేందుకు తమ అస్తిత్వ ఉద్యమాలను కొనసాగించక తప్పదు. దీన్ని కులకోణంగా తప్పుడు విశ్లేషణలు చేసి బడుగుల చైతన్యాన్ని పక్కదారి పట్టించే పనిని ఆధిపత్య వర్గాలు విస్తృతంగా చేస్తూ ఉన్నాయి. కులగణన చేయాలని అస్తిత్వ కోణం నుంచి అడుగుతుంటే అడ్డుతగులుతూ కులగణన చేస్తే దేశ సమగ్రత దెబ్బతింటుదన్న వాదనలు తీసుకువస్తున్నారు.బీసీలు సంపూర్ణ రాజకీయ సాధికారత సాధించకుండా సమాజ వికాసం సంపూర్ణం కాదు. ఈ విషయాన్ని మరుగున పరుస్తూ బీసీల అస్తిత్వమే లేకుండా చేసేందుకు ఆధిపత్య వర్గాలు పనిచేయటం కొత్తేమీ కాదు. బడుగులకు విద్యా, ఉద్యోగ విషయాలలో రిజర్వేషన్లు ఇచ్చేందుకు మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేసే సమయంలో ఆధిపత్య వర్గాలు సృష్టించిన అలజడులు అన్నీ ఇన్నీ కావు. అన్ని పార్టీలలోని ఆధిపత్యవర్గాలు తెరవెనుకనుంచి చేసిన కుట్రలన్నీ చరిత్రలో పదిలంగా రికార్డయ్యే ఉన్నాయి.ఇపుడు బీసీల కులగణన చేయమంటే సమాజం కులాల పేరున విడిపోయి అల్లకల్లోలం అవుతుందన్న వాదనలు ఆధిపత్య వర్గాలు ముందుకు తెస్తున్నాయి. తెలంగాణ ప్రజలు స్వీయరాజకీయ అస్తిత్వం కోణం నుంచి 14 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం నిర్వహించి రాష్ట్ర సాధనలో విజయం సాధించి ప్రపంచ అస్తిత్వ ఉద్యమాలలో నిలిచారు. స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజలు ఇపుడు బహుజన స్వీయరాజకీయ అస్తిత్వాన్ని సాధించుకోవాలి. ఇది సాధించినప్పుడే స్వరాష్ట్రం సాధించుకున్న లక్ష్యం పరిపూర్ణమవుతుంది.ఈ దిశలోనే స్థానిక సంస్థల్లో బీసీలకు తమ జనాభా ఎంతో అంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. 2023 ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ను కాంగ్రెస్ విడుదల చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తానని వాగ్దానం చేసింది. జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సందర్భంగా బడుగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.రాహుల్ గాంధీ, కులగణన చేస్తామని దేశమంతా చెబుతున్నారు. కులగణన చేసి స్థానిక సంస్థల్లో ‘మేమెంతో మా వాటా అంత రిజర్వేషన్లు ఇవ్వాల’నీ, ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బీసీలు బెర్రగీసి అడుగుతున్నారు. ఈ విషయంలో బీసీలపై కాంగ్రెస్కు ఉన్నది అసలు ప్రేమా లేక ఓట్ల కోసం చేసిన వాగ్దానమా బట్టబయలు కావల్సి ఉంది. ఏం జరుగబోతుందోనని 2 కోట్ల మంది బీసీలు ఎదురు చూస్తున్నారు.– అభిప్రాయం: జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త కవి, రచయిత -
ఆంగ్ల ఆధ్యాత్మికవాది
ఒక మనిషి ఇంత రాయగలడా అని ఆశ్చర్యానికి గురిచేసే రచయిత జి.కె. చెస్టర్టన్. ఇరవయ్యో శతాబ్దపు ఈ సుప్రసిద్ధ ఆంగ్ల రచయితకు ఇది 150వ జయంతి సంవత్సరం. 1874 మే 29న లండన్లో జన్మించిన గిల్బర్ట్ కీత్ చెస్టర్టన్ నవలలు, కథలు, నాటికలు, కవితలు, సాహిత్య విమర్శ, కళా విమర్శ, చరిత్ర, వ్యాసాలతో సుమారు 80 పుస్తకాలను వెలువరించారు. ‘నెపోలియన్ ఆఫ్ నాటింగ్ హిల్’, ‘ద మ్యాన్ హూ వజ్ థర్స్డే’ ఆయన గొప్ప నవలలు. ‘ది ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్’ పత్రికకు ఏకంగా 30 ఏళ్లపాటు; ‘డైలీ న్యూస్’కు 13 ఏళ్లపాటు వీక్లీ కాలమ్స్ రాశారు. మొత్తంగా సుమారు 4,000 వ్యాసాలు! ఆరడుగుల నాలుగు అంగుళాల ఎత్తు, 130 కిలోల బరువుండే ఈ భారీకాయుడు స్టేషన్లలో కూడా రాసేవారు. రాతలో ఎంతగా మునిగిపోయేవాడంటే, ప్రతిసారీ ఎక్కాల్సిన రైలును మిస్సయ్యేవారు. పలు కార్యక్రమాల్లో తలమునకలుగా ఉంటూ, తర్వాత ఏం చేయాలో మరిచిపోయేవారు. ఒకసారైతే, ‘హార్బరో మార్కెట్లో ఉన్నాను. నేనెక్కడ ఉండాల్సింది?’ అని భార్యకు టెలిగ్రామ్ పంపారు. భర్త అన్ని వ్యవహారాలనూ చూసుకునే ఫ్రాన్సెస్ ‘ఇంటికి వచ్చెయ్యండి’ అని జవాబిచ్చారు.‘ఆయన ప్రతిదాని గురించి ఎంతో కొంత, అలాగే దాన్ని అందరికంటే మెరుగ్గా చెప్పారు’ అంటారు చెస్టర్టన్ భావజాలాన్ని ప్రచారం చేయడానికి నెలకొల్పిన ‘అమెరికన్ చెస్టర్టన్ సొసైటీ’ సహవ్యవస్థాపకుడు డేల్ అహ్లిక్విస్ట్. క్రైస్తవ మతంలోని థీమ్స్, సింబాలిజం చెస్టర్టన్ రచనల్లో ఎక్కువగా కనబడతాయి. క్రైస్తవంలోని ప్రేమ, కారుణ్యం వైపు ఎందరినో ఆయన ఆకర్షించారు. నాస్తికుడైన బ్రిటిష్ రచయిత సి.ఎస్.లూయిస్ను తిరిగి క్రైస్తవుడిగా మారేట్టుగా చెస్టర్టన్ రచనలే ప్రభావం చూపాయి. సతతం విశ్వాసిగా మసలుకోవడమే కాక, ఎంతోమందిని విశ్వాసం వైపు మళ్లించడం, శత్రువులను కూడా ద్వేషించకపోవడం వంటి అంశాలను చూపుతూ చెస్టర్టన్ బీటిఫికేషన్కు యోగ్యమైన కారణాలున్నాయని వాదిస్తారు క్యాథలిక్ రచయిత జోసెఫ్ పియర్సీ. భిన్న భావజాలానికి చెందిన జార్జ్ బెర్నార్డ్ షా, హెచ్.జి.వెల్స్, బెర్ట్రాండ్ రసెల్ లాంటి రచయితలతో విభేదిస్తూ చెస్టర్టన్ తీవ్రమైన వాదాలు జరిపేవారు. అయినా వాళ్ల స్నేహం చెడలేదు. శత్రువును కూడా ప్రేమించమనే భావనే ఆయన్ని అలా మసలుకునేట్టు చేసింది. ఆయన ఈ ప్రేమగుణంలోంచి పుట్టిందే ప్రీస్ట్ డిటెక్టివ్ ‘ఫాదర్ బ్రౌన్’ పాత్ర. శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా కేసులను పరిశీలించే షెర్లాక్ హోమ్స్లా కాకుండా అనుమానం, ఆధ్యాత్మిక అవగాహనల ఊతంతో నేరస్థుల మనసుల్లోకి చొచ్చుకెళ్లి వారిని పట్టుకుంటాడు ఫాదర్ బ్రౌన్. చెస్టర్టన్ పారిశ్రామికీకరణను వ్యతిరేకించారు. ధార్మిక జీవితాన్ని ప్రవచించారు. ఐరిష్ జాతీయోద్యమానికి ఊతమిచ్చారు. ఐరిష్ ప్రజలు ఇంగ్లిష్వారికి భిన్నమైనవారనీ, వారు తమవైన సంప్రదాయాలను కాపాడుకుంటూ తమ సొంత దేశంలో సొంత విధానంలో స్వతంత్ర పాలనకు అర్హులనీ వాదించారు. అయితే, ఆయన్ని ఇరవయ్యో శతాబ్దపు విలువైన థింకర్గా పరిగణించడానికి ఒక కారణం– ‘డిస్ట్రిబ్యూటిజం’ (పంపిణీవాదం)ను ఆయన ఎత్తుకున్న తీరు! చెస్టర్టన్ సోదరుడు సీసిల్, అతడి స్నేహితుడు హిలైర్ బెల్లోక్ ‘డిస్ట్రిబ్యూటిజం’ ఆర్థిక తత్వాన్ని వృద్ధి చేశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో సీసిల్ చనిపోయాక చెస్టర్టన్ దీనికి ప్రధాన ప్రచారకర్తగా మారడమే కాక, ప్రధానంగా ఈ భావధార ప్రచారం కోసం ‘జీకేస్ వీక్లీ’ నడిపారు. నియంత్రణ లేని క్యాపిటలిజం, సోషలిజాలకు భిన్నమైన మూడో పంథాగా ఉంటూ, ఆస్తులు, రాజకీయాధికారాల పంపిణీ జరగాలంటుంది ఈ వాదం. ‘మూడు ఎకరాలు – ఆవు’ అనేది వీరి స్లోగన్.సూత్రప్రాయంగా జాతీయవాదానికి చెస్టర్టన్ వ్యతిరేకి కాకపోయినా, తన మూలాలను విస్మరించే జాతీయవాదానికి అర్థం లేదంటారు. అందుకే భారత జాతీయోద్యమాన్ని ‘అది భారతీయమూ కాదు, అంత జాతీయమూ కాదు’ అని నిరసించారు. 1909లో ‘ది ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్’లో చెస్టర్టన్ రాసిన ఒక వ్యాసం మహాత్మా గాంధీ మీద ‘పిడుగుపాటు’లా పడింది. వెంటనే దానికి చిన్న పరిచయం రాస్తూ ‘ఇండియన్ ఒపీనియన్’లో పునర్ముద్రింపజేశారు. ‘వాళ్ల దేశానికి మన పార్లమెంట్ కావాలి, మన జ్యుడీషియరీ కావాలి, మన పత్రికలు కావాలి, మన సైన్స్ కావాలి. భారత జాతీయవాదులు ఇవన్నీ కోరుకోవడమంటే వాళ్లు ఇంగ్లిష్వారిలా ఉండాలనుకుంటున్నారు’ అన్నారు చెస్టర్టన్. అది సహేతుకమని గాంధీజీ బలపరుస్తూ, ‘స్వతంత్రంగా ఉండాలంటే ఇండియా తనకు తానుగా ఉండాలి, బ్రిటన్లా మారకూడదు. అదే పనిగా అనుకరిస్తే మన దేశం హిందుస్థాన్ కాదు, ఇంగ్లిషిస్థాన్ అవుతుంది’ అని రాశారు.విస్తృతిలో, భావధారలో తెలుగు సాహిత్య శిఖరం విశ్వనాథను కొంతవరకూ స్ఫురింపజేసే చెస్టర్టన్కు రావాల్సినంత కీర్తి రాలేదన్నది కొందరి వాదన. ఇరవయ్యో శతాబ్దపు గొప్ప రచయిత, ఆలోచనాపరుడు అయినా చెస్టర్టన్ విస్మరణకు గురికావడానికి ఆయన అన్ని రకాలుగా రాయడమే కారణమన్నది దీనికి వివరణ. ‘ఒక్కమాటలో రచయితలు ఫలానా వర్గంలోకి ఇట్టే ఒదగకపోతే వాళ్లు చీలికల్లోంచి కిందికి జారిపోయే ప్రమాదం ఉంది’ అంటారు అహ్లిక్విస్ట్. అయినా ఆయన్ని తలకెత్తుకునేవాళ్లు ఉంటూనే ఉన్నారు. చెస్టర్టన్ను ఎడ్గార్ అలెన్ పోతో పోల్చారు బోర్హెస్. ‘చెస్టర్టన్కు ప్రపంచం తగినంత కృతజ్ఞత చూపలే’దని అన్నారు జార్జ్ బెర్నార్డ్ షా. అయితే జాన్ పైపర్ వ్యాఖ్యానం చెస్టర్టన్కు తగిన నివాళి: ‘చెస్టర్టన్ కోసం నేను దేవుడికి కృతజ్ఞత చెబుతాను’ అన్నారాయన. -
కేంద్రంపై యూకే రచయిత నిటాషా సంచలన ఆరోపణలు
లండన్: భారత సంతతికి చెందిన యూకే ప్రొఫెసర్, రచయిత నిటాషా కౌల్కు భారత ప్రభుత్వం ఎంట్రీ నిరాకరించింది. కర్ణాటక ప్రభుత్వ ఆహ్వానం మేరకు బెంగళూరు ఎయిర్పోర్టులో దిగిన తనను ఇమిగ్రేషన్ సిబ్బంది అడ్డుకున్నారని ఆమె తెలిపారు. అనంతరం తిరిగి తనను లండన్ పంపేశారని, అడిగితే నీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదని చెప్పారన్నారు. ఈ విషయాలన్నింటిని ఆమె తాజాగా ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. ‘‘ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలు’ అనే అంశంపై మాట్లాడేందుకు కర్ణాటక ప్రభత్వం నన్ను ఆహ్వానించింది. కానీ కేంద్ర ప్రభుత్వం నన్ను ఎయిర్పోర్టులోనే ఆపేసి తిరిగి లండన్ పంపించివేసింది. నా వద్ద అవసరమైన డాక్యుమెంట్లన్నీ ఉన్నాయి. గతంలో ఆర్ఎస్ఎస్పై విమర్శలు చేసినందుకే నన్ను వెనక్కిపంపుతున్నట్లు అధికారులు అనధికారికంగా నాతో చెప్పారు. లండన్ నుంచి 24 గంటల పాటు ప్రయాణించి బెంగళూరు వస్తే మళ్లీ 24 గంటలు అటు ఇటు తిప్పి నన్ను ఎయిర్పోర్టులోనే ఉంచారు. కనీసం ఆహారం, మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. పడుకోవడానికి కొద్దిగా స్థలం చూపించారు. అక్కడ కూడా కనీసం దిండు ఇవ్వలేదు. సీసీ కెమరా పర్యవేక్షణలో ఉంచారు. నేను ఎన్నోసార్లు భారత్ వచ్చాను. నాకు దేశంలోకి అనుమతి లేనట్లు కనీసం ముందుగా కూడా చెప్పలేదు. కర్ణాటక ప్రభుత్వమే నాకు టికెట్లు ఇచ్చింది’అని కౌల్ ఎక్స్లో తెలిపారు. ఇదీ చదవండి.. భారత సంతతి కంప్యూటర్ ఇంజినీర్కు ప్రతిష్టాత్మక అవార్డు -
ఫస్ట్–రేట్ రచయిత
సెకండ్–రేట్ రచయితల్లో తాను మొదటి వరుసలో ఉంటానని చెప్పుకొన్నాడట సోమర్సెట్ మామ్. ఆయన దృష్టిలో బాల్జాక్, డికెన్ ్స, టాల్స్టాయ్, దోస్తోవ్స్కీ ప్రపంచం చూసిన నలుగురు గొప్ప నవలాకారులు. పాఠకులను సాహిత్యం వైపు ఆకర్షించడమే కొందరు రచయితల విలువైన కాంట్రిబ్యూషన్ అవుతుంది. ఇక్కడ కూడా మామ్ మొదటి వరుసలో ఉంటారు. ఆంగ్ల అనువాద కథలతో పరిచయం ఉండే తెలుగు పాఠకులకు దాదాపుగా తగిలే మొదటిపేరు విలియమ్ సోమర్సెట్ మామ్. అత్యధిక కాపీల అమ్మకం, అత్యంత పేరు, అత్యధిక సంపాదనలతో చాలా విధాలుగా ఒక కమర్షియల్ రచయిత కూడా కలలు కనలేని జీవితాన్ని మామ్ అనుభవించాడు. హాలీవుడ్ సినిమాలకు పనిచేశాడు, దేశదేశాలు తిరిగాడు, అత్యంత ప్రముఖులతో విలాసవంతమైన టూర్లు, డిన్నర్లల్లో పాల్గొన్నాడు. తన గురించి మామ్ ఏమని చెప్పుకొన్నా, ఆయన ‘ద మూన్ అండ్ సిక్స్పెన్ ్స’, ‘ద పేంటెడ్ వీల్’, ‘కేక్స్ అండ్ ఎయిల్’, ‘ద రేజర్స్ ఎడ్జ్’ గొప్ప నవలలుగా పేరొందాయి. ఇక మామ్ మాస్టర్పీస్గా చెప్పే ‘ఆఫ్ హ్యూమన్ బాండేజ్’ ప్రపంచ గొప్ప నవలల్లో ఒకటిగా నిలిచిపోయింది. నూటికి పైగా కథలు, పదులకొద్దీ నాటకాలు, నవలలు... ఎంత విస్తృతంగా రాశాడో అంత ఆదరణ పొందిన మామ్కు ఇది నూటా యాభయ్యో జయంతి సంవత్సరం. మామ్ జీవితంలోనూ ఒక రచనకు కావాల్సినంత డ్రామా, కన్నీళ్లు, కష్టాలు, ట్విస్టులు ఉన్నాయి. గొప్ప ఆంగ్ల రచయితల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఆంగ్లాన్ని చిన్నతనంలో సాటి విద్యార్థులు హేళన చేసేవారు. కారణం, జన్మకు ఆంగ్లేయుడు అయినా, పుట్టింది ఫ్రెంచ్ గడ్డ మీద. అలా ఫ్రెంచ్ ఆయన మొదటి భాష అయింది. ఫ్రెంచ్ గడ్డ మీద పుట్టిన అందరూ ఫ్రెంచ్వాళ్లే అవుతారనీ, తప్పక మిలిటరీలో చేరాల్సిందేననీ శాసనం వచ్చినప్పుడు ఆ స్థానీయతను తప్పించుకోవడానికి మామ్ కుటుంబం ఫ్రాన్ ్సలోని బ్రిటిష్ దౌత్య కార్యాలయాన్ని ఆశ్రయించింది. అందులోనే మామ్కు జన్మనిచ్చింది(1874 జనవరి 25) వాళ్ల తల్లి. అలా బ్రిటన్ ఎంబసీలో జన్మించడం వల్ల మామ్ బ్రిటనీయత స్థిరపడిపోయింది. వాళ్ల గ్రేట్–అంకుల్ గుర్తుగా పెట్టిన సోమర్సెట్ అనే మధ్యపేరు ఆయనకు నచ్చలేదు. ఇంట్లో విల్లీ అని పిలిచేవాళ్లు. మామ్కు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడే తల్లి క్షయవ్యాధితో చనిపోయింది. ఆ లోటు ఆయనకు ఎప్పుడూ తీరలేదు. ‘అది ఎప్పడూ పూర్తిగా మానని గాయం’గానే ఉండిపోయింది. వృద్ధుడయ్యాక కూడా తల్లి ఫొటోను మంచం పక్కనే ఉంచుకునేవాడు. ఆ తర్వాత రెండేళ్లకే తండ్రి చనిపోవడం మరో దెబ్బ. అప్పుడు బ్రిటన్ లోని చిన్నాన్న దగ్గరికి వచ్చాడు. ఆ కొత్త ఇల్లు, వాతావరణం బాగున్నప్పటికీ, తల్లిదండ్రులు లేని చింత, కొత్త సమాజంలో కలవలేకపోవడం, సిగ్గరి కావడం వంటి కారణాల వల్ల ఇట్టే మాట్లాడేవాడు కాదు. అది క్రమంగా నత్తిగా మారి జీవితాంతం ఆయనతో ఉండిపోయింది. తాత, తండ్రి న్యాయవాదులు అయినప్పటికీ మామ్ ఆ బాటలోకి పోకపోవడానికి ఈ నత్తి కూడా ఒక కారణం. డాక్టర్ కాబోయి యాక్టర్ అవడంలా కాకుండా, నిజంగానే డాక్టరీ చదివినా దాని జోలికి పోకుండా రంగస్థలంలో ప్రాక్టీస్ చేశాడు మామ్. నాటకాలతో ముందు ప్రజాదరణ పొందినా తర్వాత నవలలు, కథల మీద మాత్రమే దృష్టిసారించాలని నిశ్చయించుకున్నాడు. ఒక చదవదగ్గ కథకు మెటీరియల్ రాకపోతే తానెవరి సమక్షంలోనూ గంటసేపు కూడా గడపనని అనేవాడు. ఆయనకు ఏదైనా కథావస్తువే. దానికి తగినట్టే ఆయన జీవితం కూడా అనుభవాల పుట్ట. యువకుడిగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ సీక్రెట్ ఇంటెలిజెన్ ్స సర్వీస్ కోసం కొన్నాళ్లు స్విట్జర్లాండ్లో గూఢచారిగా పనిచేశాడు. ఫ్రెంచ్ నాటక రచయిత అన్నది అప్పుడు ఆయన కవర్. తర్వాత, రష్యాలోనూ బోల్షివిక్కులకు వ్యతిరేకంగా, జర్మన్ నిఘా నెట్వర్క్ మీద సమాచారాన్ని పంపాడు. మెన్షివిక్కులకు మద్దతు ఇవ్వాలన్నది బ్రిటన్ ఆలోచన. జర్మనీలో చదువుకున్నందువల్ల మామ్కు జర్మన్ వచ్చు. ఈసారి అమెరికా పబ్లిషర్ అనేది కవర్. అయితే ఈ అనుభవాలను రచనలుగా తెచ్చాడుగానీ అధికార రహస్యాల చట్టాన్ని ఇవి ఉల్లంఘిస్తుండటంతో చాలావాటిని కాల్చేశాడు. అయినా గూఢచర్య కథలు రాసిన తొలి గూఢచార రచయిత మామ్ అయ్యాడు. జేమ్స్ బాండ్ సిరీస్ రాయడానికి ఇయాన్ ఫ్లెమింగ్కు ప్రేరణగా నిలిచాడు. కానీ గూఢచర్యంలో పనిరోజులు ఒకేవిధంగా ఉండి విసుగు పుట్టిస్తాయనీ, చాలా రోజులు నిరర్థకమనీ వ్యాఖ్యానించాడు. ఇటీవల వచ్చిన మలయాళ సినిమా ‘కాదల్’లో హోమోసెక్సువల్ అయినప్పటికీ హీరోకు ఒక కూతురు ఉంటుంది. దాంపత్య బంధపు ఒత్తిడి అది. మామ్ కూడా లైంగిక ధోరణి రీత్యా హోమోసెక్సువల్. పదేళ్ల వివాహ బంధంతో ఆయనకు ఒక కూతురు. కానీ తర్వాత వివాహం నుంచి విముక్తం అయ్యి స్నేహితులతో స్వేచ్ఛాజీవితం గడిపాడు. తల్లి దూరమవడం మొదలు తన జీవితంలోని అపసవ్యతలన్నింటి కారణంగా, జీవితాంతం దేవుడి మీద అవిశ్వాసిగా ఉన్న మామ్ తన ఆత్మకథాత్మక నవలను చివరి దశలో చదువుకున్నా కన్నీళ్లు కార్చకుండా పూర్తిచేసేవాడు కాదు. ఇంకేది కలిపినా డిజైన్ పాడవుతుందని తెలిసినప్పుడు ఆర్టిస్ట్ ఇక దాన్ని వదిలేసినట్టుగా, తాను రచయితగా సంతృప్తికర దశలో ఉన్నప్పుడే జీవితాన్ని చాలించాలని మామ్ ఆశపడ్డాడు. అన్నింటి విషయంలో జరిగినట్టుగానే ప్రకృతికి ఆయన విషయంలో వేరే లెక్ఖుంది. కోరుకున్న ముప్పై సంవత్సరాల తర్వాత, అన్ని వృద్ధాప్యపు సమస్యలతో పాటు 91 ఏళ్ల నిండుతనం కూడా ఇచ్చిగానీ ఆయన్ని సాగనంపలేదు. -
టాలీవుడ్ అగ్ర నిర్మాతపై అసభ్యకర కామెంట్స్.. ప్రముఖ సినీ రచయితపై కేసు.!
సినీ మాటల రచయిత రాజసింహపై కేసు నమోదైంది. ప్రముఖ నిర్మాత కూచిబొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కథల విషయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన వివాదమే కారణమని తెలుస్తోంది. రాజాసింహ తన కుటుంబ సభ్యులకు అసభ్యకరమైన, బెదిరింపు సందేశాలు పంపిస్తున్నట్లు వివేకానంద ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టను అగౌరవపర్చేలా సామాజిక మాధ్యమాల్లోనూ సందేశాలు పెట్టాడని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా దర్శకుడు రాఘవేంద్రరావు, వైవీఎస్ చౌదరి, ఠాగూర్ మధు లాంటి వారిని సైతం దూషిస్తూ సందే శాలు పెట్టాడని కూచిబొట్ల గురువారం పోలీసులను ఆశ్రయించారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు. అసలు రాజాసింహ ఎవరు? ఇదిలా ఉండగా.. రాజసింహ తడినాడ దాదాపు 60 సినిమాలకు పైగా రచయితగా పనిచేశాడు. అల్లు అర్జున్ నటించిన ‘రుద్రమదేవి’ సినిమాకి డైలాగ్ రైటర్గా పని చేశారు. ఆ సినిమాలో అల్లు అర్జున్ పోషించిన ‘గోన గన్నా రెడ్డి’ పాత్రకి రాజసింహ రాసిన డైలాగులకి చాలా మంచి గుర్తింపు వచ్చింది. అదే క్రేజ్తో దర్శకుడిగా మారిన రాజసింహ.. యంగ్ హీరో సందీప్ కిషన్తో 'ఒక అమ్మాయి తప్ప' అనే సినిమా చేశాడు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో రాజసింహకి సినిమా అవకాశాలు తగ్గాయి. అయితే పర్సనల్ లైఫ్లో ఇబ్బందుల కారణంగా రాజసింహ గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పటినుంచి రాజసింహ బయట పెద్దగా కనిపించడం లేదు. -
అయోధ్యలో శ్రీరాముణ్ణి కీర్తించనున్న దివ్యాంగ కవి
ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ముందుగానే అయోధ్యలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈనెల 14న అయోధ్యలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి దివ్యాంగ కవి అక్బర్ తాజ్ను జగద్గురు సంత్ రామభద్రాచార్య ఆహ్వానించారు. అక్బర్ తాజ్ మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలోని హప్లా-దీప్లా గ్రామానికి చెందిన దివ్యాంగ కవి. ఆయన కవితలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా అక్బర్ తాజ్ శ్రీరాముని గుణగణాలను కీర్తిస్తూ పలు రచనలు చేశారు. శ్రీరాముడు అందరికీ చెందినవాడని అక్బర్ తాజ్ చెబుతుంటారు. 44 ఏళ్ల అక్బర్ తాజ్ దృష్టిలోపంతో బాధపడుతున్నారు. బ్రెయిలీ లిపిని కూడా అక్బర్ తాజ్ నేర్చుకోలేదు. అయినప్పటికీ అక్బర్ తాజ్ తన మనసులోని భావాలను ఇతరుల చేత రాయిస్తుంటారు. ఆయన దేశవ్యాప్తంగా పలు వేదికలపై తన హిందీ, ఉర్దూ రచనలను వినిపించారు. రామునిపై ఆయన చేసిన రచనలు ఆయనకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. జనవరి 22న రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు తనను ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని అక్బర్ తెలిపారు. -
Tanuja Chandra: చీకటి వెలుగుల దారుల్లో...
కథలు ఆకాశం నుంచి నేలకు దిగి రావు. ఈ నేలలో అనేక కథలు దాగున్నాయి. వాటి జాడలు వెదుక్కుంటూ వెళ్లడమే సృజనకారుల పని. బంధువులను వెదుక్కుంటూ ఉత్తర్ప్రదేశ్లోని మారుమూల గ్రామాలకు వెళ్లిన రైటర్, డైరెక్టర్ తనూజ చంద్ర తనకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకుంది. మహిళలు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలపై డాక్యుమెంటరీలు తీయాలని నిర్ణయించుకుంది... తనూజ చంద్ర తల్లి కామ్నా చంద్ర రైటర్, సోదరుడు విక్రమ్ చంద్ర రైటర్, సోదరి అనుపమ చోప్రా ఫిల్మ్ క్రిటిక్. రెండు ముక్కల్లో చెప్పుకోవాలంటే ఇంటి నిండా సృజనాత్మక వాతావరణం కొలువై ఉండేది. టీవీ సిరీస్ జమీన్ ఆస్మాన్(1996)తో డైరెక్టర్గా వినోదరంగంలోకి అడుగుపెట్టింది తనూజ. మహేష్భట్ ‘జఖ్మ్’ సినిమాకు స్క్రీన్ప్లే రాసి మంచి పేరు తెచ్చుకుంది. సంజయ్ దత్, కాజోల్ జంటగా నటించిన ‘దుష్మన్’ సినిమాతో బాలీవుడ్లో డైరెక్టర్గా తొలి అడుగు వేసింది. ‘నేను కమర్షియల్ డైరెక్టర్ని మాత్రమే’ అనే ధోరణిలో కాకుండా మహిళల జీవితానికి సంబంధించిన సమస్త కోణాలను సినిమా, ఓటీటీ మాధ్యమాలపై ఆవిష్కరిస్తోంది తనూజ. ‘ఊహాల్లో నుంచి మహిళలకు సంబంధించిన కథలను అల్లడం కంటే వారి దగ్గరకు వెళ్లి మాట్లాడితే నిజమైన కథలు వస్తాయి’ అంటున్న తనూజ స్క్రిప్ట్ మేకింగ్ కోసం రైటింగ్ రూమ్కు మాత్రమే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఎంతోమంది మహిళలతో మాట్లాడింది. ఆ క్రమంలో తనకు ఏదైనా ఆలోచన వస్తే అది స్క్రిప్ట్గా రూపొందుతుంది. వెండితెరపై రాణిస్తున్న వారు షార్ట్ ఫిల్మ్స్పై పెద్దగా దృష్టి పెట్టరు. తనూజకు మాత్రం ఎలాంటి పట్టింపులు లేవు. పెద్ద డైరెక్టర్గా పేరు వచ్చిన తరువాత కూడా రొమాంటిక్ డ్రామా షార్ట్ ఫిల్మ్ ‘సిల్వత్’ తీసింది. ‘ఏ మాన్సూన్ డేట్’ అనే షార్ట్ ఫిల్మ్కు కూడా విశ్లేషకుల నుంచి ప్రశంసలు లభించాయి. అయిదు సంవత్సరాల క్రితం ఉత్తర్ప్రదేశ్లోని లహ్ర అనే గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లింది తనూజ. అక్కడ తనకు ఇద్దరు మేనత్తలు ఉన్నారు. ఇద్దరూ భర్తను కోల్పోయి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఆంటీ రాధ సరదా మనిషి. శాంతస్వభావి. ఎంత పెద్ద కష్టానికైనా అడ్జస్టైపోతుంది. సుధా ఆంటీ మాత్రం రాధ ఆంటీకి పూర్తి భిన్నం. ఒకరకంగా చెప్పాలంటే ఫైర్బ్రాండ్. చాలా స్క్రిక్ట్. పర్ఫెక్షన్కు ప్రాధాన్యత ఇస్తుంది. ఎక్కడ తేడా వచ్చినా గొడవకు దిగుతుంది. ఒకరి వయసు 93. మరొకరి వయసు 83. వేరు వేరు ప్రపంచాలకు చెందిన ఇద్దరికీ తమ మనస్తత్వాల మూలంగా ఎప్పుడూ గొడవలు రాలేదు. వీరి జీవితాన్ని గురించి లోతుగా తెలుసుకున్న తరువాత ‘ఆంటీ సుధా ఆంటీ రాధ’కు శ్రీకారం చుట్టింది తనూజ. నలభై ఎనిమిది నిమిషాల ఈ డాక్యుమెంటరీలో హాయిగా నవ్వుకునే సన్నివేశాలే కాదు కంట తడి పెట్టించే సన్నివేశాలు కూడా ఉన్నాయి. ‘సాధారణ ప్రజలు అనే మాట వింటుంటాం. అయితే వారి జీవితాలలోకి తొంగి చూస్తే అసాధారణ సన్నివేశాలు, సాహసాలు కనిపిస్తాయి’ అంటున్న తనూజకు ఇది తొలి డాక్యుమెంటరీ ఫిల్మ్. కట్ చేస్తే... ‘వెడ్డింగ్.కాన్’ అనే సరికొత్త డాక్యుమెంటరీ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తనూజ. పెళ్లి చేసుకుంటానని ఎంతోమంది మహిళలకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు కాజేశాడు ప్రజిత్. రకరకాల మారుపేర్లతో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా మోసాలకు పాల్పడేవాడు. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, పశ్చిమబెంగాల్...మొదలైన రాష్ట్రాల్లో ఎంతోమంది మహిళలను మోసం చేశాడు. థానేలోని ధోకాలీ ప్రాంతానికి చెందిన ఒక బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో ప్రజిత్ మోసం వెలుగులోకి వచ్చింది. థానే పోలీసులు ప్రజిత్ను అరెస్ట్ చేశారు. ‘వెడ్డింగ్.కాన్’ డాక్యుమెంటరీ ప్రజిత్లాంటి ఎంతోమంది మోసగాళ్ల మోసాలకు అద్దం పడుతుంది. ‘మ్యాట్రిమోనియల్ మోసాల ద్వారా నష్టపోయిన మహిళలు ఎందరో ఉన్నారు. అయితే చాలామంది పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడానికి ఇష్టపడడం లేదు. దీనికి కారణం తాము తప్పు చేశాం అనే భావన. నలుగురు నవ్వుతారేమో అనుకోవడం. ఇది నన్ను చాలా బాధ పెట్టింది’ అంటుంది తనూజ చంద్ర. అయితే ‘వెడ్డింగ్.కాన్’ బాధిత మహిళలకు ధైర్యాన్ని ఇస్తుంది, న్యాయం కోసం పోరాటం చేసే స్ఫూర్తిని అందిస్తుంది అనడంలో సందేహం లేదు. గమనాన్ని మార్చింది బంధువులను వెదుక్కుంటూ ఉత్తర్ప్రదేశ్లోని మారుమూల గ్రామాలకు వెళ్లినప్పుడు సాధారణ జీవితాల్లోని అసాధారణ దృశ్యాలు కనిపించాయి. ఎంతో మంది మహిళలతో మాట్లాడిన తరువాత...మహిళల గురించి ఓటీటీ మాధ్యమం ద్వారా సీరియస్గా చెప్పాల్సిన కథలు ఎన్నో ఉన్నాయి అనిపించింది. ఆంటీ సుధా ఆంటి రాధ నా గమనాన్ని మార్చింది అని చెప్పవచ్చు. – తనూజ చంద్ర, రైటర్, డైరెక్టర్ -
Chandrika Tandon: తేజో చంద్రిక
ఆరోజు... ‘అలాగే’ అని తల ఆడించి ఉంటే ‘పవర్ఫుల్ ఉమన్’గా ప్రపంచవ్యాప్తంగా చంద్రిక పేరు తెచ్చుకునేది కాదు. ‘ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ఈ ఊళ్లో ఒక్కరోజు కూడా ఉండలేను’ అని భయపడి ఉండే ఉద్యోగజీవితంలోకి వచ్చేది కాదు. తనను తాను నిరూపించుకునేది కాదు. ‘లాయర్ కావాలనుకున్నాను. ఈ ఉద్యోగం ఏమిటి’ అని నిట్టూర్చి ఉంటే చంద్రిక కొత్త శిఖరాలు అధిరోహించేది కాదు. ‘ఉద్యోగ జీవితానికే టైమ్ లేదు. ఇక సంగీతానికి స్థానం ఎక్కడ’ అని సర్దుకుపోయి ఉంటే సంగీత ప్రపంచంలో తనదైన పేరు తెచ్చుకునేది కాదు. ప్రపంచ గుర్తింపు పొందిన బిజినెస్ లీడర్, గ్రామీ–నామినేట్ ఆర్టిస్ట్గా, దాతగా ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తుంది చంద్రిక.... ‘అవసరం లేదు’ ఒక మాటలో తేల్చేసింది అమ్మ. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీలో చేరాలనుకుంటున్న చంద్రికకు ఆ మాట శరాఘాతం అయింది. ‘ఆ కాలేజీలో తక్కువమంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. అంతా అబ్బాయిలే’ అన్నది అమ్మ. చంద్రిక చాలా సేపు అమ్మతో వాదించినా ఫలితం కనిపించలేదు. ఇంట్లోనే నిరాహార దీక్ష చేసింది. దీంతో చంద్రిక మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదవడానికి తల్లి ఒప్పుకోక తప్పింది కాదు. మూడు సంవత్సరాల కాలేజీ జీవితం చంద్రిక జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. సంగీతప్రపంచంతో అనుబంధానికి, సింగర్గా పేరు తెచ్చుకోవడానికి కారణం అయింది. డిగ్రీలో చేరడమే కష్టం అనుకున్న చంద్రిక ఆ తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ చేరడం పెద్ద విజయం. నిజానికి చంద్రికకు బిజినెస్ ప్రపంచంపై పెద్దగా ఆసక్తి లేదు. తాతలాగే లాయర్ కావాలనుకుంది. అయితే ప్రొఫెసర్ స్వామినాథన్ సూచన మేరకు బిజినెస్ స్కూల్లో చేరింది. మొదటి కొన్నిరోజులు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే సొంత ఊరు దాటి అంత దూరం రావడం అదే మొదటిసారి. ఆ ఒంటరితనానికి దూరం కావడానికి సంగీతానికి దగ్గరైంది. చంద్రిక తొలి ఉద్యోగం సిటీబ్యాంక్లో. బ్యాంకర్ కావాలని కలలో కూడా అనుకోని చంద్రికకు ఇది వింతగా అనిపించింది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం లెబనాన్లోని బీరుట్ వెళ్లింది. యుద్ధానికి సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో అక్కడకు వెళ్లింది. అక్కడ అయిదు నెలల పాటు ఉంది. సిటీబ్యాంక్ తరువాత వేరే సంస్థల నుంచి చంద్రికకు అవకాశాలు రావడం మొదలైంది. అలా అమెరికాలోకి అడుగు పెట్టింది. ఉద్యోగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు ఇష్టమైన సంగీతప్రపంచాన్ని మాత్రం చంద్రిక విడిచి బయటికి రాలేదు. ఎన్నో ఆల్బమ్స్ ద్వారా సక్సెస్ఫుల్ మ్యూజిషియన్గా తనను తాను నిరూపించుకుంది. సెకండ్ ఆల్బమ్ ‘సోల్ కాల్’ గ్రామీ అవార్డ్–బెస్ట్ కాంటెంపరరీ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో నామినేట్ అయింది. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ మకెంజీకి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ పార్ట్నర్గా అరుదైన ఘనత సాధించింది. అడ్వైజరీ సంస్థ ‘టాండన్ క్యాపిటల్స్ అసోసియేషన్స్’ ప్రారంభించి సూపర్ సక్సెస్ అయింది. ఈ ప్రయాణంలో చంద్రికకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. కుటుంబజీవితం, వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకోవడం కూడా అందులో ఒకటి. అయితే ప్రతి సవాలును అధిగమిస్తూ ముందుకు వెళ్లింది. సవాలు ముందుకు వచ్చినా, ఒత్తిడి తలలో దూరినా తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం సంగీతం. పాటలు వినడం, పాడడం తనకు ఎంతో ఇష్టం. అదే తన బలం. తాజాగా ‘అమ్మూస్ ట్రెజరర్స్’ ఆల్బమ్తో ముందుకు వచ్చింది చంద్రిక. ఇది పిల్లలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఆల్బమ్. -
బిగ్బాస్ 7: సడన్గా హౌస్లో నుంచి వెళ్లిపోయిన కంటెస్టెంట్!
బిగ్బాస్ షో.. లోనికి వెళ్లడమే కంటెస్టెంట్ల చేతిలో ఉంటుంది. బయటకు రావడమనేది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. వారి ఆట నచ్చినంతవరకు కంటెస్టెంట్లను ముందుకు నడిపిస్తూ ఉంటారు. నచ్చని మరుక్షణం ఓట్లు వేయడం మానేసి ఎలిమినేట్ చేస్తారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం బిగ్బాస్ స్వయంగా కంటెస్టెంట్లను అవతలకు పంపించి వేస్తూ ఉంటాడు. ఒక షో.. రెండు ఇళ్లు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, హౌస్లో ఉండలేకపోతున్నామని పోరు పెడితే ఉన్నపళంగా గేట్లు ఎత్తి వెళ్లిపోమంటాడు. ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. తాజాగా తమిళ బిగ్బాస్ 7వ సీజన్లోనూ ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ 1వ తేదీన తమిళ బిగ్బాస్ 7 ప్రారంభమైంది. ఈ షోలో రెండు హౌస్లు ఉన్నాయి. ఒకటి పెద్దది, రెండవది చిన్న ఇల్లు. నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లను చిన్న ఇంట్లో పెట్టి వారితో పనులు చేయిస్తారు. చిన్న ఇంట్లో ఉన్నవారు ఏ టాస్కుల్లోనూ పాల్గొనడానికి వీల్లేదు. ఆరోగ్యం సహకరించడం లేదంటూ.. రచయిత, నటుడు బావ చెల్లదురై గతవారం నామినేషన్లో ఉండటంతో తనకు కూడా వంట చేయడం, క్లీనింగ్ వంటి పనులు తప్పలేదు. ఈ క్రమంలో ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. ఇదే విషయాన్ని బిగ్బాస్కు చెప్తూ తనను పంపించేయమని వేడుకున్నాడు చెల్లదురై. తన శారీరక, మానసిక ఆరోగ్యం బాగోలేదని, ఇంట్లో నుంచి వెళ్లిపోతానని మొర పెట్టుకున్నాడు. తండ్రిలా చూసుకున్నారు, కానీ.. బాగా ఆలోచించుకుని సమాధానం చెప్పమని బిగ్బాస్ అన్నప్పటికీ తాను వెళ్లిపోవాలన్న మాటకే కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నాడు. 'నేను ఇక్కడ ఇండలేను. ఇంకా ఆలోచించడానికేం లేదు. కంటెస్టెంట్లు నన్ను తండ్రిలా చూసుకున్నారు. కానీ నాకు ఆరోగ్యం సహకరించడం లేదు. ప్లీజ్, వెళ్లిపోతాను' అని అభ్యర్థించాడు. దీంతో బిగ్బాస్ తన కోరిక మేరకు బావ చెల్లదురైని ఇంటి నుంచి పంపించేశాడు. Bava Chelladurai walks out of the show.#BiggBossTamil7 pic.twitter.com/FmVG8sdHM4 — Bigg Boss Follower (@BBFollower7) October 9, 2023 చదవండి: బతుకమ్మ ఆడిన హీరోయిన్స్.. నెట్టింట వీడియో వైరల్ -
డేటింగ్లో స్టార్ హీరోయిన్.. ముచ్చటగా మూడోసారి!
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆమె ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2010లో టీన్ పట్టి సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్రద్ధా.. లవ్ కా ది ఎండ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2013లో విడుదలైన ఆషికి- 2 చిత్రంలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ కూడా లభించింది. శ్రద్దా సినిమాల్లో నటించడంతో పాటు మంచి సింగర్ కూడా. తన సినిమాల్లో చాలా పాటలు పాడింది. (ఇది చదవండి: ప్రతి తండ్రికి ఈ పాట అంకితం: మహేశ్ బాబు ప్రశంసలు) అయితే తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరలవుతోంది. గతంలో ఆషికి-2 నటుడు ఆదిత్య రాయ్కపూర్తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చూసి.. ఆఫ్ స్క్రీన్లోనూ రిలేషన్లో ఉన్నారని అప్పట్లో టాక్ వినిపించింది. ఆ తర్వాత ప్రముఖ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో చెట్టాపట్టాలేసుకుని పలు పార్టీలకు హాజరైంది. ఆ సమయంలో శ్రద్దా కపూర్పై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. తాజాగా శ్రద్ధా కపూర్ అతనితో డేటింగ్లో ఉందన్న వార్త బీటౌన్లో హాట్టాపిక్గా మారింది. తు జూతీ మైన్ మక్కర్' చిత్రానికి సహ రచయితగా పనిచేసిన రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ డేటింగ్ చేస్తోందని బీ టౌన్ టాక్. అయితే ఈ రూమర్స్పై ఇప్పటివరకు అధికారికంగా ఎవరూ స్పందించలేదు. అయితే ఈ జోడీ రిలేషన్లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు. నెటిజన్స్ సైతం న్యూ లవ్ బర్డ్స్ ఇన్ బాలీవుడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో శ్రద్ధా కపూర్కు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'నా భార్య అర్థం చేసుకుంటది.. నువ్వు నా మాట విను'.. ప్రశాంత్పై శివాజీ ఎమోషనల్!) కాగా.. తూ ఝూతీ మైన్ మక్కర్ చిత్రం 2023లో విడుదలైంది. లవ్ ఫిల్మ్స్, టి-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించిన ఈ సినిమాకు లవ్ రంజన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, శ్రద్ధా కపూర్, డింపుల్ కపాడియా, అనుభవ్ సింగ్ బస్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. అమర్ అక్బర్ ఆంథోనీ రచయిత కన్నుమూత!
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ రచయిత ప్రయాగ్ రాజ్ మరణించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం బాంద్రాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఆదిత్య వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వయసు 88 కాగా.. అమితాబ్ బచ్చన్ బ్లాక్ బస్టర్ హిట్స్ అమర్ అక్బర్ ఆంథోనీ, నసీబ్, కూలీ చిత్రాలకు పనిచేశారు. ఆయన మృతిపట్ల అమితాబ్తో పాటు అనిల్ కపూర్ సంతాపం ప్రకటించారు. అమితాూబ్ బచ్చన్ నసీబ్, సుహాగ్, కూలీ, మర్డ్ చిత్రాలకు కథను అందించిన ప్రయాగ్ రాజ్.. రచయితగా 100కి పైగా చిత్రాలకు పనిచేశారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!) రాజేష్ ఖన్నా రోటీ, ధర్మేంద్ర-జీతేంద్రల ధరమ్ వీర్, అమర్ అక్బర్ ఆంథోనీ చిత్రాలకు స్క్రీన్ప్లేకు సహకారం అందించడమే కాకుండా బచ్చన్, రజనీకాంత్, కమల్ హాసన్ నటించిన "గెరఫ్తార్" కూడా ఆయనే రాశారు. రచయితగా అతని చివరి చిత్రం దివంగత ఎస్ రామనాథన్ దర్శకత్వం వహించిన "జమానత్". అయితే ఈ చిత్రం విడుదల కాలేదు. కాగా.. ఆదివారం ఉదయం దాదర్లోని శివాజీ పార్క్ శ్మశానవాటికలో రాజ్ అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరై నివాళులర్పించారు. I'm truly saddened by the loss of the late Prayag Raj. Working with him on "Hifazat" was a privilege. May his soul rest in peace.🙏🏻 pic.twitter.com/Al4RP7poFb — Anil Kapoor (@AnilKapoor) September 24, 2023 Sorry to hear about the passing away of writer director actor Prayag Raj. RIP pic.twitter.com/OZN2P7xQeH — Azmi Shabana (@AzmiShabana) September 23, 2023 -
ఐదేళ్ల ప్రాయం నుంచే సంగీతంలో శిక్షణ.. స్టార్ సింగర్గా గుర్తింపు
అమ్మమ్మ నోటి నుంచి భక్తి భావనతో వినిపించే కీర్తనలు, గురుద్వారాలో విన్న కీర్తనలు బనత్ నోటి నుంచి తీయగా వినిపించేవి. బనత్ కౌర్ బగ్గాకు చిన్నప్పటి నుంచే సంగీతంతో చక్కని స్నేహం ఉంది. స్కూల్ ఫంక్షన్లలో, ఫ్యామిలీ ఫంక్షన్లలో తన పాట తప్పకుండా ఉండాల్సిందే. అయిదు సంవత్సరాల వయసులోనే హార్మోనియం వాయించి శ్రోతలను అబ్బురపరిచింది. లా స్టూడెంట్గా ఉన్నప్పుడు డెబ్యూ సింగిల్ ‘మూన్’ వచ్చింది. పంజాబీ నేపథ్యం ఉన్న బనత్ హిందీ, పంజాబీ పాటలకు తనదైన మెరుపు ఇస్తుంది. సింగర్–సాంగ్ రైటర్గా పేరు తెచ్చుకున్న బనత్ కౌర్ బగ్గా పాప్ అండ్ రాక్, నియో క్లాసికల్ అండ్ ఫోక్లో మంచి పేరు తెచ్చుకుంది. తీరికవేళల్లో చక్కటి కవిత్వాన్ని ఆస్వాదించడం తనకు ఇష్టం. కొన్నిసార్లు మ్యూజిక్ కంటే కవిత్వ పంక్తులు రాసుకోవడం అంటేనే ఇష్టం. పిల్లల కోసం ముంబైలో ‘క్లాస్రూమ్’ పేరుతో మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేసింది బనత్ కౌర్ బగ్గా. -
జర్నలిస్టు రచయిత
ప్రపంచంలోని గొప్ప రచయితల్లో కొంతమంది వృత్తిరీత్యా జర్నలిస్టులుగా పనిచేశారు. ఒక రచయిత జర్నలిస్టు అయితే తన రోజువారీ ‘స్టోరీ’లకు కథనబలాన్ని ఇవ్వగలడు. కానీ తమలోని రచయితనూ, జర్నలిస్టునూ వేరుగా ఉంచుకోవడానికే చాలామంది ప్రయత్నించారు. అనివార్యంగా ఆ రెండు పాత్రలూ కలిసిపోయే సందర్భాలు రావొచ్చు. అయితే, పూర్తి స్పృహతో తనలోని రచయితతో జర్నలిస్టును మేళవించినవాడు ట్రూమన్ కపోటి. ఆ మేళన ఫలితంగా నాన్–ఫిక్షన్ నవల ఉద్భవించింది. సాహిత్యానికి ఒక కొత్త ప్రక్రియను ‘పరిచయం’ చేసిన ట్రూమన్ కపోటి (30 సెప్టెంబర్ 1924 – 25 ఆగస్ట్ 1984) శతజయంతి సంవత్సరానికి ప్రారంభం ఇది. యూఎస్లోని లూసియానా రాష్ట్రంలో జన్మించిన ట్రూమన్ కపోటీ ఐదేళ్లప్పుడే బడికి నిఘంటువు మోసుకెళ్లేవాడు. ఎనిమిదేళ్ల వయసులోనే రచయిత అవుతాననుకున్నాడు. చాలామందికి జీవితం సగం ముగిసేదాకా తమకు ఏం కావాలో తెలీదు. కానీ తాను ఆ కోవలోకి చెందని ప్రత్యేక జీవినని కపోటికి తెలుసు. ‘ద న్యూయార్కర్’ సహా ఇతర పత్రికలకు పనిచేస్తూనే, కథలు రాశాడు. ఇరవైల్లోకి వచ్చేనాటికే ఆయన సెలబ్రిటీ. ‘ఆధునిక సాహిత్యపు ఆశాదీపం’ అని మెచ్చుకున్నాడు సోమర్సెట్ మామ్. ‘బ్రేక్ఫాస్ట్ ఎట్ టిఫనీస్’ (1958) నవలికతో కపోటి పేరు మార్మోగిపోయింది. రోజూ కనబడే చంద్రుడు కొన్నాళ్లుగా వార్తల్లో ఉన్నాడు. 1959లో రష్యా చంద్రుడి మీద దిగింది. అదే ఏడాది అమెరికాలో పెరోల్లో ఉన్న ఇద్దరు నేరస్థులు కాన్సాస్లోని ఒక ధనిక రైతును దోచుకోవడానికి పథకం వేశారు. ఇంట్లోకి ప్రవేశించి, యజమాని, ఆయన భార్య, వాళ్ల ఇద్దరు కౌమార కూతుళ్లను బంధించారు. తీరా నగదు రూపంలో ఏమీ దొరకదు. కేవలం సాక్ష్యంగా మిగిలిపోతారని నలుగురినీ హత్య చేశారు. అది అమెరికాలో పెను సంచలనం సృష్టించిన నేరవార్తల్లో ఒకటి. దాని ఆధారంగా ఆరేళ్ల పరిశోధన అనంతరం ‘ఇన్ కోల్డ్ బ్లడ్’ (1965) రాశాడు కపోటి. దీనికి వాడిన కథనాత్మక పాత్రికేయ టెక్నిక్ను ‘నాన్ఫిక్షన్ నవల’ అన్నాడు. జర్నలిజం, కథనం కలిసి కొత్త కళారూపానికి దారి తీయగలదని భావించాడు. సృష్టించే సామర్థ్యం ఉన్నప్పుడు, వాస్తవ కథనం కోసం శ్రమ పడటం దేనికి అన్న వైఖరి కొందరు రచయితల్లో ఉంటుంది. సీరియస్ రచయితల కళాత్మక స్థాయికి జర్నలిజం తగనిది అన్న అభిప్రాయమూ ఉండకపోదు. ఇదంతా కాదన్నా, ఒక మనిషి వ్యక్తిత్వాన్ని వడగట్టి రచనలోకి తేవడం అంటే చాలా రకాలుగా సిద్ధపడాలి. ‘బ్రేక్ఫాస్ట్ ఎట్ టిఫనీస్’ తన క్యారెక్టర్నే పెట్టి రాశాడని ఒకావిడ 8 లక్షల డాలర్లకు తెచ్చిన (విఫల) దావాను ఎదుర్కొన్న చేదు అనుభవం అప్పటికే కపోటికి ఉంది. పైగా, ఎంత నిజజీవిత కథనానికైనా ఊహాశక్తి లేకపోతే ప్రాణం పోయలేము. ‘లిటెరరీ ఫొటోగ్రాఫర్’లా సూక్ష్మాంశాలను మనసులోకి ఎక్కించుకోవాలి. ‘హ్యూమన్ టేప్ రికార్డర్’లా మారాలి. మరి విషయ సేకరణ ఎట్లా? తలుపులు తట్టడం సరే, వాళ్ల మనసులను మీటడం ఎలా? కపోటి ముందు ఆ ప్రాంతానికి వెళ్లి, అక్కడ కొన్నాళ్లు ఉన్నాడు. ఒక ఇంటర్వ్యూలా మాట్లాడితే అసౌకర్యం కాబట్టి, టేప్ రికార్డర్లు ఉపయోగించలేదు. వెళ్లేముందు ఒక సాధన చేశాడు: స్నేహితుడు ఓ పుస్తకంలోని పేజీలను చదివి వినిపిస్తాడు. దాన్ని కపోటి విని, తిరిగి రాసేవాడు. ‘దాదాపు 95 శాతం కచ్చితత్వం’ సాధించాడు. ఇన్ని చేసినా వార్తా కథనాలకు కాలం చెల్లిపోయే ప్రమాదం ఎక్కువ. వాస్తవ ఘటన ఒక తార్కిక ముగింపునకు వస్తే తప్ప రచనను ముగించలేం. ఈ సందర్భంలో తార్కిక ముగింపు అంటే, నేరస్థుల ఉరిశిక్ష అమలు కావడమే. రచయిత ఆ క్షణం కోసం ఎదురుచూడాలి. ‘ఇది హింస,’ అంటాడు కపోటి. ఆఖరికి 6,000 పేజీల నోట్సుతో– హంతకులు, బాధితులు, గ్రామీణ సమాజపు మనుషులు– మూడు కోణాల్లో చిత్రించిన 340 పేజీల ‘ఇన్ కోల్డ్ బ్లడ్’ తక్షణ బెస్ట్ సెల్లర్గా, కపోటి అత్యుత్తమ రచనగా సాహిత్య చరిత్రలో నిలిచిపోయింది. నాన్–ఫిక్షన్ నవల అనే ప్రక్రియను తాను పరిచయం చేయడం అనడం కంటే, అప్పటికే ఉన్నదాన్ని తాను అత్యున్నత స్థితికి తీసుకెళ్లానని మాత్రమే అనేవాడు కపోటి. చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో, బంధువుల ఇంట్లో పెరిగాడు కపోటి. ఎప్పుడూ వ్యాకులతతో ఉండేవాడు. ఆయన ఒంటరితనంలో స్నేహపు సెలయేరు పొరుగున ఉండే హార్పర్ లీ. అనంతర కాలంలో ‘టు కిల్ ఎ మాకింగ్బర్డ్’ నవలా రచయిత్రి. అందులోని ‘డిల్’ పాత్రను ఆమె కపోటి నమూనాగా తీర్చిదిద్దారు. కపోటి రచన ‘అదర్ వాయిసెస్, అదర్ రూమ్స్’లో ఇడాబెల్ పాత్రకు లీ ప్రేరణగా నిలిచారు. వారి బాల్య స్నేహం చివరిదాకా కొనసాగింది. ‘ఇన్ కోల్డ్ బ్లడ్’ క్షేత్రస్థాయి పరిశోధనలో లీ సహాయం చేశారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలు సాధించడంలో. హోమోసెక్సువల్ అని ప్రకటించుకున్న కపోటి, దాని తాలూకు తిరస్కరణను ఎదుర్కొన్నాడు. ఆ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. తన జీవితాన్ని పునర్నిర్మించుకునే అవకాశమే ఉంటే, వ్యాకులత లేకుండా చూసుకుంటానన్నాడు. ‘ఒక కథను ఎంత సహజంగా చెప్పవచ్చో ఆ రూపాన్ని రచయిత కనుక్కున్నాడనేదానికి పరీక్ష ఏమిటంటే– ఆ కథ చదివాక, నువ్వు దాన్ని ఇంకోలా ఊహించగలుగుతున్నావా లేక అది నీ ఊహను నెమ్మదించేలా చేసి, అదే సంపూర్ణమూ, అంతిమమూ అనిపిస్తోందా? ఒక నారింజ ఫలాన్ని ప్రకృతి సరిగ్గా ఎలా చేసిందో అలా’ అన్నాడు కపోటి. సాహిత్య జీవితం గురించి సరేగానీ, అరవై ఏళ్లు నిండకుండానే కన్నుమూసిన కపోటి జీవితం సంపూర్ణ ఫలమేనా అంటే చెప్పడం కష్టం! -
సాంగ్ రైటర్ కమ్ సింగర్..స్ఫూర్తినిచ్చే పాటలతో అలరిస్తుంది!
టీనేజ్లో న్యూయార్క్కు వెళ్లిన రవీనా అరోరా సింగర్, సాంగ్ రైటర్గా మంచి పేరు తెచ్చుకుంది ‘స్వీట్ టైమ్’ ‘టెంప్టేషన్’ ‘హానీ’ పాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక లైవ్ షోలలో పాశ్చాత్య ప్రేక్షకులను హిందీ సాంగ్స్తో అలరిస్తుంటుంది. స్టేజీ మీద ఉన్నట్టుండీ...‘వుయ్ ఆర్ గోయింగ్ టు సింగ్ ఇన్ హిందీ నౌ’ అని ప్రకటిస్తుంది. ఆడిటోరియమ్ కేకలతో నిండిపోతున్న సమయంలో ‘ఏక్, దో, తీన్, చార్, చలోనా, మేరె సాత్’ అంటూ హిందీ పాట అందుకుంటుంది. 60,70లలోని హిందీ చిత్రాల పాటలను పాడుతూ కూడా ఈతరం కుర్రకారును ఆకట్టుకుంటుంది. ‘సంగీతంలో భిన్న ధోరణులను అన్వేషించడం ఇష్టం’ అంటున్న అరోరాకు లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలా స్వరం ఇష్టం. భావగర్భితమైన పాట ఇష్టం. రవీనా పాటలు ‘ఆహా, ఒహో’లకు పరిమితమైన పసందైన పాటలు కాదు. ఎన్నో సామాజిక సమస్యలు ఆమె పాటలో భాగమై ఉంటాయి. ‘ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా, తమను తాము ప్రేమించుకునేలా, తమను తాము స్పష్టంగా అర్థం చేసుకునేలా, ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేలా నా పాట ఉండాలనుకుంటాను’ అంటోంది రవీనా అరోరా. (చదవండి: దర్శకురాలు కావాలనుకుంది..కానీ తండ్రి హఠాన్మరణం ఆమెను) -
అరుదైన పత్రికా రచయిత తుర్లపాటి కుటుంబరావు
సాక్షి: జర్నలిజంలో పది, ఇరవై ఏళ్లపాటు కొనసాగడమే కష్టం. అలాగే జర్నలిస్టుగా జీవితం ఆరంభించి, కన్ను మూసే వరకు అదే వృత్తిలో ఉంటూ పత్రికలలో వ్యాసాలు రాయడం దాదాపు అసాధ్యం. అందరికీ ఆ అవకాశం లభించదు. అలాంటిది తుర్ల పాటి కుటుంబరావు డెబ్భై ఏళ్లపాటు జర్నలిస్టుగా కొనసాగగలిగారు. ఏభై ఏళ్లపాటు ‘వార్తలలో వ్యక్తి’ పేరుతో ఒక శీర్షిక నిర్వహించగలగడం గొప్ప విషయం. ఒక వ్యాస శీర్షికను ఏభై ఏళ్లు నడపమంటే తేలికైన పని కాదు. కాని తుర్లపాటి వల్ల అది సాధ్యపడింది. ఆంధ్రజ్యోతి, ఆ తర్వాత ‘వార్త’ దినపత్రికలలో ‘వార్తలలోని వ్యక్తి’ కాలమ్ను నిర్వహించేవారు. ఇంత సుదీర్ఘ కాలం జర్నలిస్టుగా ఉండి ఒక సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేకపోవడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. పాత్రికేయుడిగానే కాకుండా, ‘ఉపన్యాస కేసరి’ అని పిలిపించుకున్న ఏకైక జర్నలిస్ట్ తుర్ల పాటి. 18 వేల ప్రసంగాలు చేసి గిన్నిస్ బుక్ రికార్డులలోకి ఎక్కారు. అదే సమయంలో పలు పుస్తకాలు రచించారు. ‘జాతి నిర్మాతలు’, ‘1857 విప్లవ వీరులు’ వంటి పలు పుస్తకాలు వీరు రచించినవే. ఆంధ్ర యూనివర్శిటీ నుంచి ‘కళా ప్రపూర్ణ’, ‘ముట్నూరి కృష్ణారావు అవార్డు', ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావు చేతుల మీదుగా ‘నేషనల్ సిటిజన్స్ అవార్డు’, అమెరికాలోని బయోగ్రాఫికల్ సంస్థ వారి ‘ఇంటర్నేషనల్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ వంటి అవార్డులు దక్కాయి. తుర్లపాటి కుటుంబరావు 1933 ఆగస్టు పదో తేదీన జన్మించారు. కృష్ణా జిల్లా గన్నవరం, విజయవాడల్లో చదువుకున్నారు. 14 ఏళ్ల వయసులోనే పత్రికా రంగంలోకి రావడం ఒక ప్రత్యేకత. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుకు చెందిన ‘ప్రజా పత్రిక’లో ఆయన చేరి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. 1959లో ఆంధ్రజ్యోతి దిన పత్రికలో సహాయ సంపాదకుడిగా ఆరంభమైన ఆయన జర్నలిస్ట్ ప్రస్థానం జీవితాంతం కొనసాగింది. 18 మంది ముఖ్య మంత్రులతో ఆయనకు సంబంధాలు, మంచి పరిచయాలు ఉండేవి. అలాగే సినీ రంగంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు తదితరులకు ఈయనంటే ఇష్టం. వారి గురించిన వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా రాశారు. వారికి బిరుదులు ఇచ్చి విజయవాడలో సత్కార, సన్మాన కార్యక్రమాలు నిర్వహించేవారు. ఉదాహరణకు ఏఎన్నార్కు ‘నట సామ్రాట్’ అనే బిరుదును ఖాయం చేసి ప్రదానం చేసింది ఈయనే. ‘నంది’ అవార్డులను సినిమావారికి ప్రవేశపెట్టాలని కోరుతూ, అవి వచ్చేందుకు తుర్లపాటి విశేష కృషి చేశారు. జాతీయ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడిగా, జ్యోతిచిత్ర సినిమా పత్రిక సంపాదకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. రాజకీయ, సినీ రంగం రెండిటిలోనూ ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించగలగడం అందరికీ కుదరదు. సాహిత్య, సంగీతాభిలాషి అయిన ఆయన అభ్యుదయవాది కూడా. ప్రముఖ కూచిపూడి నర్తకి కృష్ణకుమారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. రాష్ట్ర స్థాయి నేతలతోనే కాదు... పలువురు జాతీయ స్థాయి నాయకులతో కూడా ఆయన సంబంధాలు, ఉత్తరప్రత్యుత్తరాలు నెరపేవారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, అంబేడ్కర్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వంటివారితో తరచు ఇంటరాక్ట్ అయ్యేవారు. ఇక ఇంది రాగాంధీ, మొరార్జీ దేశాయ్, జగ్జీవన్ రామ్, రాజీవ్ గాంధీ వంటి వారు ఏపీకి వచ్చినప్పుడు, వారి ఉపన్యాసాలకు అనువాదకులుగా ఉండేవారు. నెహ్రూపై ఉన్న అభిమానంతో ఆయన తన కుమారుడికి ఆ పేరే పెట్టుకోవడం విశేషం. ప్రేమ వివాహానికి గుర్తుగా కుటుంబ రావు తమ కుమార్తెకు ‘ప్రేమ జ్యోతి’ అని పేరు పెట్టారు. చతురోక్తులతో ప్రసంగాలు చేయడం ఆయన విశిష్టత. ఆయా సందర్భాలను బట్టి ఆయా ప్రముఖుల చరిత్రను, వర్తమానాన్ని కలిపి, జీవిత విశేషాలతో ఆ కాలమ్ రాసి పాఠకులను ఆకట్టుకునేవారు. ఇన్ని గొప్పదనాలు ఉన్నవి కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది. తెలుగు జర్న లిస్టులలో ఆ గౌరవం పొందింది ఈయన ఒక్కరే కావడం విశేషం. వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ (నేడు తుర్లపాటి కుటుంబరావు జయంతి) -
అనన్య సామాన్య స్వతంత్రం
అనన్య బిర్లాకు చెందిన సూక్ష్మరుణ కంపెనీ (ఎంఎఫ్ఐ) స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ దేశంలో రెండో అతి పెద్ద ‘ఎంఎఫ్ఐ’గా గుర్తింపు పొందనుంది. ఎంటర్ప్రెన్యూర్గా గెలుపు జెండా ఎగరేసిన అనన్య బిర్లా సింగర్, రైటర్, యాక్టర్, సోషల్ యాక్టివిస్ట్... ఏకంగా అయిదు సింగిల్స్లో డబుల్ ప్లాటినమ్ స్టేటస్ను సొంతం చేసుకుంది. అనన్య గానప్రతిభ గురించి చెప్పుకోవడానికి ఇదొక మచ్చుతునక మాత్రమే. ‘లెట్ దేర్ బి లవ్’ ‘ఎవ్రీ బడీ లాస్ట్’ పాటలతో అమెరికన్ నేషనల్ టాప్ 40 పాప్ రేడియో షో జాబితాలో చోటు సాధించిన ఫస్ట్ ఇండియన్ ఆర్టిస్ట్గా ఘనత సాధించింది. అనన్యకు చిన్నవయసు నుంచే సంగీతం అంటే ఇష్టం. పదకొండు సంవత్సరాల వయసులో సంతూర్ ప్లే చేయడం నేర్చుకుంది. ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్ కోసం ‘యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్’లో చేరిన అనన్య డిగ్రీ పూర్తి కాకుండానే చదువు మానేసింది. యూనివర్శిటీలో చదువు సంగతి ఎలా ఉన్నా సంగీతంలో మాత్రం ఎటు చూసినా అనన్య పేరు వినిపించేది. పాడడంతో పాటు కవితలు, పాటలు కూడా రాసేది. గిటార్ ప్లే చేయడం నేర్చుకుంది. ‘లివిన్ ది లైఫ్’ తన డెబ్యూ సింగిల్. యూట్యూబ్లో 14 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. మ్యూజిక్ చార్ట్స్లో టాప్లో నిలిచింది. కునాల్ కోహ్లీ స్పై థ్రిల్లర్ ‘శ్లోక్’లో నటిగా ఆకట్టుకుంది. ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు సంగీత, సాహిత్య కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేది అనన్య. ఆందోళన, కుంగుబాటుతో సతమతం అవుతున్న యువత కోసం స్టూడెంట్ హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన తరువాత మానసిక సమస్యలతో బాధపడే వారికి సహాయం అందించడానికి ‘ఎంపవర్’ అనే సంస్థను ఏర్పాటు చేసింది. కోవిడ్ సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి 24“7 ఫ్రీ హెల్ప్లైన్ను ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్లైన్ ద్వారా వేలాది మంది ప్రజలకు మేలు జరిగింది. అమెరికాకు చెందిన ప్రసిద్ధ మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘నేషనల్ అలయెన్స్ ఆన్ మెంటల్ ఇల్నెస్’ అంబాసిడర్గా నియమితురాలైంది. ‘అనన్య బిర్లా ఫౌండేషన్’తో సేవాకార్యక్రమా లను విస్తృతం చేసింది. సంగీతం అంటే అపారమైన అనురక్తి ఉన్న అనన్య వ్యాపారరంగంలో తొలి అడుగు వేసినప్పుడు... ‘అనన్య లోకం వేరు. ఆమె ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించడం కష్టం’ అనే గుసగుసలు వినిపించాయి. అప్పటి వరకు అనన్య పేరు పక్కన సంగీతానికి సంబంధించిన విశేషణాలు కనిపించేవి. తరువాత స్వతంత్ర మైక్రోఫిన్, ఫౌండర్ అనేది ఆమె పేరు పక్కన కనిపించడం మొదలైంది. గ్రామీణ ప్రాంతాలలో మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి ‘స్వతంత్ర’ను ఏర్పాటు చేశారు. తన నాయకత్వ లక్షణాలతో ‘స్వతంత్ర’ను అగ్రగామిగా నిలిపింది అనన్య. బెస్ట్ స్టార్టప్లకు ఇచ్చే ‘గోల్డ్ అవార్డ్’ను గెలుచుకుంది. 2016లో గ్లోబల్ లగ్జరీ ఇ–కామర్స్ ప్లాట్ఫామ్ ఇకై ఏషియాకు సీయీవోగా బాధ్యతలు చేపట్టింది. ఫోర్బ్స్ ఆసియాస్ ఉమెన్ జాబితాలో అనన్య పేరు చోటు చేసుకుంది. ‘స్వతంత్ర’ వ్యవస్థాకురాలిగా అనన్య ఆఫీస్ గదికే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో పర్యటించేది. ఇండోర్లో ఒక పేదింటి మహిళ ‘స్వతంత్ర’ సహకారంతో ఇల్లు కట్టుకోగలిగింది. ఆమెతో మాట్లాడినప్పుడు అనన్యకు ఎంతో సంతోషంగా అనిపించింది. అనన్య అపురూప విజయాలు చూసినప్పుడు ‘ఏ పని చేసే వాళ్లు ఆ పని చేస్తే మంచిది’ ‘రెండు పడవల మీద కాలు వద్దు’ లాంటి మాటలు, సామెతలు బిత్తర పోతాయి. పనిమీద అనురక్తి, అంకితభావం ఉంటే ఒక రంగానికి చెందిన వారు మరో రంగంలో విజయం సాధించవచ్చు అని చెప్పడానికి అనన్య బిర్లాలాంటి వాళ్లు పెద్ద ఉదాహరణ. పెద్దింటి అమ్మాయి పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా కూతురు అయిన అనన్య బిర్లా బాల్యం నియమ నిబంధనలు, రక్షణ వలయాల మ«ధ్య గడిచింది. చిన్నప్పుడే అనన్యకు బాడీగార్డ్ ఉండేవాడు. మిగతా అమ్మాయిల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఆడుకోవడానికి లేదు. ఈ రూల్స్తో తనకు ఊపిరి ఆడేది కాదు. ఒత్తిడికి గురయ్యేది. ఇంత ఒత్తిడిలోనూ తనదైన కలలు కనేది. ‘అసలు నేనేమిటి?’ అనే ప్రశ్నకు ఆమెకు సంగీతంలో జవాబు దొరికింది. సంగీతం తనలోని ఒంటరితనాన్ని పోగొట్టడమే కాదు ఆత్మబలాన్ని ఇచ్చింది. ‘పెద్దింటి అమ్మాయి’ అనే పేరు కంటే స్వేచ్ఛాప్రపంచాన్నే అనన్య ఇష్టపడేది. ‘పెద్ద యూనివర్శిటీలో పెద్ద చదువు చదవాలి. పెద్దింటి కుటుంబానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి... ఇలా నా గురించి అనుకునేవారు. అయితే నా ఆలోచనలు దీనికి భిన్నంగా ఉండేవి. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచేది. అయితే తల్లిదండ్రులు మాత్రం నాకు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉన్నారు. నా అభిప్రాయాలకు విలువ ఇచ్చారు’ అంటుంది అనన్య. -
గుంత ఉంటేనే మంచిది!
మొగులు మీద చక్కలు ఎల్లినయి. వాడకట్టుల దీపాలు ఎల్గినయి. ట్రాఫిక్తోని తొవ్వలు మెస్ల రాకుంటున్నయి. జెనంతోని సిన్మ తేటర్లు చీమల పుట్ట లెక్కున్నయి. పొద్దు మీకింది. ఇంటికి పోబుద్ది గాని సర్కార్ జీతగాల్లు హోటల్ల గూసోని ముచ్చట బెడ్తున్నరు. గుడికాడ బిచ్చపోల్లు బిచ్చమడుక్కుంటున్నరు. ఒక్కపారే సిటీ బస్సులు సొల్పుత బోతున్నయి. ఎప్పటి తీర్గనే చౌరస్త కాడ్కి బోయిన. గాడ రవి పాన్ డబ్బ ఉన్నది. గది మా దోస్తుల అడ్డ. గాడ పాన్లు దినెటోల్లు పాన్లు దింటరు. సిగిలేట్లు దాగెటోల్లు సిగిలేట్లు దాగుతరు. పాన్ డబ్బకు జెర్రంత దూరంల ఛాయ్ బండి ఉన్నది. గాడ ఛాయ్ దాగెటోల్లు పాన్లు, సిగిలేట్ల కోసం పాన్ డబ్బ కాడ్కి వొస్తుంటరు. పొద్దు మీకంగనే మా దోస్తులు పాన్ డబ్బ కాడ జమైతరు. సిగిలేట్లు దాక్కుంట, పాన్లు దినుకుంట ముచ్చట బెడుతుంటరు. గా దాని మీద గీ దాని మీద అనకుంట అన్నిటి మీద గాల్లు ముచ్చట బెడుతుంటరు. గని ఎక్వ రాజకీయాల మీదనే మాట్లాడు తుంటరు. రాజకీయాల మీద మాట్లాడుకుంట నువ్వెంత అంటె నువ్వెంత అనుకుంట మాటలతోనే కొట్లాడుతుంటరు. గా దినం నేను బోక ముందు గాల్లు ఏం మాట్లాడుకుండ్రో నా కెర్క లేదు. గని నేను బోయినంక గాల్లు గీ తీర్గ ముచ్చట బెట్టిండ్రు. ‘‘మా వాడకట్టుల గుంత బడ్డది’’ అని యాద్గిరి అన్నడు. ‘‘గుంత బడ్తె ఏమైంది?’’ అని సత్నారి అడిగిండు. ‘‘గుంతల బడి మోటర్ సైకిల్లు, స్కూటర్లు కరాబ్ గాబట్టినయి.’’ ‘‘జెనంకు ఏం గాలేదా?’’ ‘‘ఎవలన్న గుంతల బడ్తె కాల్లు, చేతులు ఇర్గబట్టినయి. వాన బడెతల్కె గా గుంత నీల్లతోని నిండింది.’’ ‘‘నీల్ల తోని నిండితె ఏమైంది?’’ ‘‘గుంత నీల్లతోని నిండ బట్కె దోమలొచ్చినయి. గవ్వి మమ్ములను కుట్టి కుట్టి సంపబట్టినయి.’’ ‘‘గుంతను పూడ్పిచ్చెతంద్కు మీరు కోషిస్ జెయ్యలేదా?’’ ‘‘ఎందుకు జెయ్యలేదు. చేసినం.’’ ‘‘ఏం జేసిండ్రు?’’ ‘‘సక్కగ మా ఎమ్మెల్యె తాన్కి బోయినం.’’ ‘‘పోయి ఏం జెప్పిండ్రు?’’ ‘‘మా వాడకట్టుల గుంతబడ్డది. గా దాంట్ల ఎవలన్న బడితె కాల్లు చేతులు ఇర్గుతున్నయి. గుంతను పూడ్పియ్యండ్రి అని అన్నం.’’ ‘‘గాయిన ఏమన్నడు?’’ ‘‘కాల్లు చేతులు ఇర్గితె ఏం జేస్తున్నరు అని అడిగిండు.’’ ‘‘మీరేం జెప్పిండ్రు?’’ ‘‘డాక్టర్ తాన్కి బోయి పట్టి గట్టిచ్చుకుంటున్నం అని జెప్పినం.’’ ‘‘చెప్తె గాయినేమన్నడు?’’ ‘‘పట్టిగట్టినందుకు డాక్టర్కు ఫీజు ఇస్తున్నారా లేదా అని అడిగిండు.’’ ‘‘మీరేమన్నరు?’’ ‘‘ఇస్తున్నం అని జెప్పినం.’’ ‘‘గాయినేమన్నడు?’’ ‘‘మీరు ఫీజు ఇయ్య బట్కె డాక్టర్ బత్కుతున్నడు అని గాయిన అన్నడు.’’ ‘‘గుంతల బడె బట్కె మోటర్ సైకిల్లు, స్కూటర్లు కరాబైతున్నయని మా ఎమ్మెల్యెకు జెప్పినం.’’ ‘‘చెప్తె గాయినేమన్నడు?’’ ‘‘స్కూటర్లు కరాబైతె ఏం జేస్తరు అని గాయిన అడిగిండు.’’ ‘‘సక్కగ మెకానిక్ తాన్కి బోతం అని జెప్పినం.’’ ‘‘మెకానిక్ తాన్కి బోయి స్కూటర్లు, మోటర్ సైకిల్లు బాగ జేపిచ్చుకొని ఏం జేస్తరు?’’ ‘‘బాగ జేసినందుకు మెకానిక్కు రూపాయలిస్తం.’’ ‘‘మీరు రూపాయలియ్యబట్కెనే మెకానిక్ బత్కుతున్నాడు.’’ ‘‘వాన బడె బట్కె గుంత నీల్లతోని నిండింది.’’ ‘‘నీల్లతోని నిండితె ఏమైతది?’’ ‘‘దోమలొచ్చినయి. గవ్వి మమ్ములను కుట్టి కుట్టి సంపు తున్నయి. దోమలు కుట్టె బట్కె రోగాలొస్తున్నయి.’’ ‘‘రోగాలొస్తె మీరేం జేస్తున్నరు?’’ ‘‘డాక్టర్ల తాన్కి బోతున్నం.’’ ‘‘డాక్టర్లు మీకు ఇలాజ్ జేస్తున్నరు. ఇలాజ్ జేసినందుకు గాల్లకు ఫీజు ఇస్తున్నరు. గాల్లు మీకు మందులు రాస్తున్నరు. మందుల దుక్నంల మీరు మందులు గొంటున్నరు. మీరు ఫీజు ఇయ్యబట్కె డాక్టర్లు, మందులు గొన బట్కె మందుల దుక్నపోల్లు బత్కుతున్నరు. గుంత జెయ్య బట్కె మెకానిక్లు, డాక్టర్లు, మందుల దుక్నపోల్లు బత్కుతున్నరు. గుంతను పూడ్పిస్తె గింత మంది పొట్ట గొట్టినట్లు గాదా?’’ అని మా ఎమ్మెల్యె అడిగిండు: ‘గుంతలు లేని వాడకట్టులల్ల గుంతలు తోడ్పిస్తమని జెప్పిండు.’ అని యాద్గిరి అన్నడు. ‘‘మొన్న కేటీఆర్ పుట్టిన దినాన కొంతమంది టమాటలు పంచి పెట్టిండ్రు.’’ ‘‘టమాటలు పంచి పెట్టుడు అంటె బంగారంను పంచి పెట్టుడే.’’ ‘‘దమ్ముంటె కాంగ్రెస్ గాల్ల సీఎం క్యాండిడేట్ ఎవలో ముందుగాలే జెప్పాలె అని కేసీఆర్ అన్నడు.’’ ‘‘దమ్ముంటె బీఆర్ఎస్ సిట్టింగ్లందర్కి ఎమ్మెల్యె టికిట్ ఇయ్యాలని రేవంత్ రెడ్డి అన్నడు.’’ గీ తీర్గ మా దోస్తులు ముచ్చట బెట్టిండ్రు. తెలిదేవర భానుమూర్తి, రచయిత సీనియర్ జర్నలిస్ట్ - 99591 50491 -
రచన ఏదైనా ప్రశ్నించడమే లక్ష్యం!
జావేద్ అఖ్తర్ ప్రతిభా వంతమయిన కవి, వక్త, స్క్రీన్ ప్లే రచయిత. సూటిగా తన భావాల్ని ఎలాంటి వెరపూ, బెదురూ లేకుండా ప్రక టిస్తున్న సామాజిక గొంతుక ఆయనది. ఇవ్వాళ మన దేశంలో అత్యంత ప్రభావవంతమైన స్వతంత్ర లౌకిక స్వరం, జావేద్ అఖ్తర్. భావుకుడు, ప్రగతిశీల వాది అయిన జావేద్ అఖ్తర్ ఏడు తరాల సాహిత్య చైతన్యమున్న కుటుంబంలో జన్మించారు. తన కవిత్వం మత తత్వానికి, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా రాశారు. జాతీయ సమైక్యత, స్త్రీల హక్కుల కోసం మాట్లా డారు, రాశారు. తప్పు దోవ పట్టిన యువతను ద్దేశించి జావేద్ రాసిన గీతాన్ని 1995లో కేంద్ర మానవ వనరుల శాఖ యువతకోసం ‘జాతీయ గీతం’గా ప్రకటించింది. గ్వాలియర్లో పుట్టిన జావేద్ లక్నో అలీగఢ్, భోపాల్లలో ఎదిగారు. బాంబే చేరిన తర్వాత ఆయన పరిధి బాగా విస్తారమయింది. జావేద్ తన మిత్రుడు సలీం ఖాన్తో కలిసి రాసిన స్క్రీన్ ప్లేలు 70వ దశకం మధ్య నుండి ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. దాంతో వారికి మొట్ట మొదటి విజయ వంతమయిన సినిమా రాసే అవకాశం వచ్చింది. ‘హాథీ మేరె సాథీ’. అది సూపర్ హిట్ కావడంతో ఆ జంట హిందీ సినీ రంగంలో హాట్ కేక్గా మారింది. ‘సీతా ఔర్ గీతా’ చిత్రానికి పనిచేసే సమయంలో జావేద్కు ‘హనీ ఇరానీ’తో అయిన పరిచయం పెళ్లిదాకా వెళ్ళింది. వారిద్దరికీ జోయా, ఫర్హాన్లు జన్మించారు. 1979లో తన మొదటి కవిత రాశారు జావేద్. ఇంచుమించు అదే కాలంలో ‘షబానా ఆజ్మీ’తో పరిచయం సాన్నిహిత్యంగా మారింది. 1995లో ఆయన మొట్ట మొదటి కవితా సంకలనం ‘తర్కశ్’ వెలువడింది. మొదటి సంకలనమే కవిత్వాభిమా నుల నుంచీ, విమర్శకుల నుంచీ ప్రశంసను అందు కుంది. అంతేకాదు మన దేశంలో మొదటి ఆడియో బుక్గా కూడా ప్రాచుర్యం పొందింది. 1983లో హనీ ఇరానీ, జావేద్ విడిపోయారు. కానీ స్నేహంగానే ఉన్నారు. సలీం–జావేద్ జంటగా ‘అందాజ్’, ‘యాదోంకీ బారాత్’, ‘జంజీర్’, ‘దీవార్’, ‘షోలే’, ‘డాన్’, ‘త్రిశూల్’ లాంటి సూపర్ డూపర్ హిట్ సిని మాలకు స్క్రిప్టు రాశారు. వాళ్ళు రాసిన 24 సినిమా స్క్రిప్టుల్లో 20 హిట్లు. ఆ తర్వాత ఆ జంట విడి పోయింది. 1981లో సలీం, జావేద్ల జంట విడి పోయాక జావేద్ అఖ్తర్ చాలా సినిమాలకు స్క్రిప్ట్ రచన చేశారు. వాటిల్లో ‘సాగర్’, ‘మిస్టర్ ఇండియా’, ‘బెతాబ్’, ‘లక్ష్య’ లాంటి విజయవంత మయిన సినిమాలు ఉన్నాయి. తర్వాత జావేద్ అఖ్తర్ ఫిలిం గీతాలవైపు కదిలారు. అలాగే గొప్ప కవితలూ రాశారు. ఆయన రాసిన కవితలు, గజల్స్ సూటిగా మనసుకు హత్తు కుంటాయి. ‘లావా’ కవితా సంపుటి 2012లో వెలువడింది. దీనికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. ఈ రెండు సంకలనాల్లోంచి ఎంపిక చేసిన కవితల సమాహారమే ‘ఇన్ ఆదర్ వర్డ్స్.’ అందులో ఆయన కాలాన్ని గురించి.. కాలమంటే ఏమిటి, /అలుపూ విరామమూ లేకుండా /సాగిపోతున్నది /అదట్లా ప్రయాణించ కుండా ఉండి వుంటే అదెక్కడుండేది / ఎక్కడో ఒక చోట ఉండేది కదా... అంటూ గొప్ప తాత్వికతతో రాశారు. ఆయన కవిత్వమంతా ఆయన ఆత్మ నుండి ఒక ప్రవాహంలా సాగుతుంది. హృదయపు లోతుల నుండి పెల్లుబుకుతుంది. వర్తమాన అవ్యవస్థ గురించి తనకోపమూ, తన తాత్వికత, వేదన, దుఃఖం, ప్రశ్న–జవాబు ఇట్లా అనేకానేక స్థితులు ఆవిష్కరించారు. ఇందులో వర్తమాన మత ఛాందసవాదం గురించి ఖండిస్తూ రాశారు, మాట్లా డారు. ఇక పార్లమెంట్ సభ్యుడిగా ముందుండి మేధో హక్కుల గురించి, కాపీ రైట్ చట్టం గురించీ పోరాడి సాధించారు. ప్రశ్నించడమే తన తత్వమని అనేక సందర్భాల్లో నిరూపించారు. వ్యాసకర్త సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత (జావేద్ అఖ్తర్కు నేడు సినారె పురస్కార ప్రదానం) -
కవి రాజేశంకు సినారె పురస్కారం!
మంచిర్యాల: మండలంలోని ఆవుడం గ్రామానికి చెందిన ప్రముఖ కవి, విమర్శకుడు, జిల్లా రచయితల వేదిక అధ్యక్షుడు తోకల రాజేశం డాక్టర్ సీ.నారాయణరెడ్డి రాష్ట్ర స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 30న జడ్చర్లలో జరిగే కార్యక్రమంలో మహాకవి సినారె కళాపీఠం పురస్కారం ప్రదానం చేస్తారు. పద్య, వచన, కవిత్వంతోపాటు సాహిత్య విమర్శ రంగంలోనూ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు కళాపీఠం అధ్యక్షుడు మల్లెకేడి రాములు, సమన్వయకర్త డాక్టర్ పోరెడ్డి రంగయ్య ప్రకటించారు. రాజేశం 2006లో తెలుగు బాల శతకం, 2010లో చమట చుక్కలు, 2013లో పాతాళగరిగే, 2017లో అడవిదీపాలు, మంచిర్యాల జి ల్లా సాహిత్య చరిత్ర అనే గ్రంథాలను ముద్రించారు. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. -
ప్రముఖ రచయిత శ్రీరమణ కన్నుమూత
మణికొండ: ప్రముఖ కథకుడు, వ్యంగ్య వ్యాసరచయిత, సినిమాగా వచ్చిన మిథునం కథా రచయిత, సీనియర్ జర్నలిస్టు శ్రీరమణ (71) బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్ ఫ్లోటిల్లా గెటెడ్ కమ్యూనిటీలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య జానకి, ఇద్దరు కుమారులు చైత్ర, వంశీకృష్ణ ఉన్నారు. ఆయన అంత్యక్రియలు గురువారం మహాప్రస్థానంలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.1952 సెపె్టంబర్ 21న ఏపీలోని గుంటూరు జిల్లా వేమూరు మండలం వరహాపురం అగ్రహారంలో అనసూయ, సుబ్బారావు దంపతులకు జని్మంచిన శ్రీరమణ అసలుపేరు కామరాజ రామారావు. కానీ ఆయన రచయిత శ్రీరమణగానే అందరికీసుపరిచితం.ఏపీ సీఎం జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ శ్రీరమణ మృతిపట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన రాసిన కథలు మానవత్వం, విలువలతో కూడి ఉంటాయని జగన్ గుర్తుచేసుకున్నారు. -
నిశ్శబ్దంగా ఉంటే ఆయనేం శ్రీరమణ? ..ఒక్కసారిగా గిర్రున కన్నీళ్లు..
నేను పదవతరగతిలో ఉన్నప్పుడో, ఇంటర్ మీడియట్ లో ఉన్నప్పుడో సరిగా గుర్తు లేదు కానీ ఆంధ్రజ్యోతి లో ఓక పుస్తక ప్రకటన వచ్చింది . నవోదయ పబ్లిషర్స్ వారిది. "శ్రీ రమణ రంగుల రాట్నం. చమత్కారాలు, మిరియాలు, అల్లం బెల్లం, మురబ్బాలూ" అని. అప్పటికి నాకు శ్రీరమణ ఎవరో తెలీదు. ముళ్ళపూడి వెంకట రమణే శ్రీరమణ అని అనుకునేవాడిని. నాకు బాపుగారు తెలుసు. బాపు గారు ఏ రమణకి బొమ్మవేసినా ఆ రమణ శ్రీముళ్ళపూడి రమణే అయి ఉంటారని ఒక లెక్క తెలుసు. నాకు ఆ పత్రికా ప్రకటనలోని అల్లం బెల్లం మురబ్బాలు కావాలి అనిపించింది. మా రఘుగాడి ధన సహకారంతో అనుకుంటా ఆ పుస్తకాన్ని పోస్ట్ లో తెప్పించుకున్నాను. అట్ట పైన, అట్ట లోపలా అంతటా ఎంత బావుంటుందో ఆ పుస్తకం. రమణ గారి రాతల చమత్కారం, బాపు గారి బొమ్మల మహధ్భాగ్యం. రీచర్చీ కాలర్లు, చేయి జారిన అదృష్టరేఖలు, కథలూ-కజ్జికాయలు, మెంతికూర చింతామణి, ఉత్తరగ్రహణం, మూడు ప్రింట్లు ఆరు ఆటలూ, విద్యాలయాల్లో పిడకల వేట, కిటికీ పక్క సీటు, పొట్టలో చుక్క, కార్తీకంలో కవిత్వ సమారాధన, గళ్ళ నుడికట్టు చీర ఇట్లా ఒకటా రెండా ఎన్నెన్నో శీర్షికల మకుటాలతో ఆ వ్యాసాలు చక్కిలిగింతల హాస్యాలు పలికాయి. మొన్నటికి మొన్న ఒకానొక రచయిత్రి గురించి అనుకుంటూ " ఈ రచయిత్రి పెట్టే చివరి సిరాచుక్క అంధ్ర సరస్వతి నొసట కస్తూరి చుక్క" అని ఎప్పుడు అవుతుందో కదా దేముడూ అని శ్రీరమణ భాషలో దండం పెట్టుకున్నా కూడా . పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో కొనుక్కున్న, చదువుకున్న శ్రీరమణ గారిని ఈ రోజుకూ చదువుకోవడం, వాటిని గుర్తుగా తలుచుకోవడం అనేది మన గొప్ప కాదు. శ్రీరమణ గారే అన్నట్టు "గింజకు జీవశక్తి ఉంటే అది ఎక్కడ పడేసినా పోదు" తెలుగు పాఠకుడికి బుర్ర ఉన్నంత కాలం అందులో జీవశక్తి ఉన్న గింజలు మాత్రమే బ్రతికి ఉంటాయి. శ్రీరమణ గారి నుడి ,ఆయన పలుకు అటువంటిది. అది పురాజన్మలో శ్రీ మహావిష్ణువు చేతి బంగారు మురుగు. కలం రూపం ధరించి, రమణ అనే కలం పేరు దాల్చి కొంతకాలం ఇక్కడికి వచ్చింది. ఈ రోజు అది వెనక్కి మరలి శ్రీహరి చేతినే చేరింది. నా ఇంటర్ మీడియట్ రోజులు, చదువు దినాలు గడిచి, అలా అలా నడిచి ఒకచోట వచ్చి నిలబడ్దాను. ఇదిగో ఇప్పుడు నేనున్న నా ఇంటి నుంచి రెండో మలుపు దగ్గర సరాసరి కాస్త డౌన్ దిగితే శ్రీరమణ గారి ఇల్లు. వారానికి రెండు మూడు సార్లు ఆయన్ని కలిసి బోలెడన్ని కబుర్లు గడిచేవి. ఫోన్ లో కాలక్షేపాలు నడిచేవి. వారి ఇంటికి వెళితే శ్రీమతి జానకి గారి కాఫీ ఆతిథ్యాలు. మా ఆవిడ ఎప్పుడయినా ఏదయినా పనిమీద ఊరికి వెడితే మొహమాటపడకుండా తమ ఇంటికి వచ్చి భోజనం చెయ్యమనేవారు. నేను ఓ యెస్, తప్పకుండా వస్తా అనేవాడ్ని, రాకుండా అలానే మొహమాటపడేవాడ్ని. కాస్త సాహిత్యం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా మా ఇంటికి వస్తే వారిని పిలుచుకుని మా మేనమామ గారి ఇంటికి వెళ్ళినంత చనువైన దర్జాతో ఆయన ఇంటికి తీసుకు వెళ్ళి కబుర్లు పెట్టించేవాడిని. ఆయనకు నేనంటే వాత్సల్యం ఉండేది. నా పుట్టినరోజు పండగ నాడు ఉదయాన్నే ఆయన కాళ్లకు దండం పెట్టుకుని వారి ఆశీస్సులు తీసుకునేవాడిని. నా తొలి పుస్తకం రాగానే దగ్గరి వారని, పెద్ద దిక్కని, ఆయన వద్దకు వెళ్ళి పుస్తకాన్ని అందించాను. ఆయన ఆ పుస్తకం సలక్షణీయతను ముచ్చటగా రెపరెపలాడించి, నా భుజం మీద చేయి వేసి బాపు గారు ఈ రోజు ఉండి, ఈ పుస్తకం చూసి ఉంటే ఎంత పొంగిపోయి ఉండేవారో తెలుసా? అని నా కళ్ళలో చిన్న తడిని తెప్పించారు. తెల్లవారుఝామున వాకింగ్ కని నాలుగు గంటలకు లేచి నడుస్తూ అక్కడ మలుపు తిరుగుతానా, నా కళ్ళు శ్రీరమణ గారి ఇంటి గేటుకు అంటుకు పోయి ఉంటాయి. ఎన్నిసార్లు బిగుతైన ఆ గేటు కిర్రుకిర్రులని పలకరించి ఉంటాను? ఆ ఇంట్లో ఒక కుక్క ఉండేది అది ఎవరు వచ్చినా తెగ అరుస్తూ గోల చేసేది. గత రెండు, రెండున్నర సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. కరోనా రోజుల్లో రమణ గారు వారి పెద్దబ్బాయి ఇంటికి వెళ్ళిపోయారు. నేను రోజూ ఉదయపు నడకలో ఆ ఇంటివైపు చూస్తాను. రమణ గారు వచ్చి ఉంటారేమోనని ఆశ. కలిసి బోల్డని కబుర్లు చెప్పుకోవచ్చని కోరిక. ఆయన ఆరోగ్యం చాలా కాలంగా బావుండటం లేదని కబురు తెలుసు నాకు.అయినా ఆయన దగ్గరికి వెళ్లలేక పోయా. ఎప్పుడు కలిసినా కూర్చుని మాట్లాడే ఆయనని మంచం మీద చూడ్డం నాకు ఇష్టం లేకుండా ఉండింది. రమణగారు నాతో ఒక పుస్తకం గురించి చెప్పేవారు దాని శీర్షిక " సింహాల మధ్య నేను" అని గొప్పగొప్ప వారి మధ్య గడిపిన ఒక వ్యక్తి జ్ఞాపకాల సమాహారం ఆ పుస్తకం. అట్లాంటి పుస్తకం నేను ఒకటి వ్రాస్తానండి. ఎంత గొప్పవారి మధ్య గడిపాననుకున్నారు నేను అని చెప్పుకుని పొంగిపోయేవారు ఆయన. శ్రీరమణ గారూ, నేనూ మీ వంటి ఒక సింహం సాన్నిహిత్యంలో గడిపాను సర్. మిమ్మల్ని గుహలో చూడటమే నాకు తెలుసు. మంచం మీద దుప్పటి కప్పుకున్న సింహన్ని ఈ కళ్ళతో చూడలేక పోయాను సర్. అందుకే ప్రతి రోజూ మీరు తిరిగి వచ్చే రోజుకోసం మీ ఇంటివైపు చూపులను అట్టిపెట్టేవాడ్ని. నేను చిన్నతనం రోజులనుంచి చదువుకున్న శ్రీరమణ గారిని 2002 ఆ ప్రాంతాల్లో ఆంధ్రజ్యోతిలో మొదటిసారిగా కలిసాను. మునుపు కాలంలో మూతపడ్డ ఆంధ్రజ్యోతిని అప్పుడు కొత్తగా మళ్ళీ మొదలెట్టారు. నాకు ఆ పత్రికలో శ్రీ రమణగారు ఉద్యోగం చేస్తూ ఉన్నారని తెలీదు. నేను కార్టూనిస్ట్ శంకర్ ని కలవడానికి అక్కడికి వెళ్ళాను. శంకర్ కూచునే దగ్గరలోనే రమణగారి సీటు. నేను ఆయన్ని చూస్తూనే ఆయన దగ్గరికి వెళ్ళి "మీరెవరో నాకు బాగా తెలుసు అనిపిస్తుంది. కాని తెలీదు, మీరు ఎవరు సార్" అని అడిగా. ఆయన నవ్వుతూ ఆయన ఎవరో చెప్పారు. నేను థ్రిల్ అయిపోయా, ఈయనేనా నా బాల్య స్నేహితుడు. ఈయన రచనలనేగా నవ్వులు నవ్వులుగా చదువుకున్నది . ఈ రోజు కళ్ళ ఎదురుగా నా ముందు ... ఆ రోజు కలిసిన మహూర్త బలం గొప్పది. ఇక ప్రతి రోజూ ఆయన్ని కలిసేవాడిని. అప్పుడు నా ఉద్యోగం ఆంధ్రప్రభలో పతంజలి గారితో, ఉదయం పూట ఆయనతో ఎన్నెన్ని కబుర్లు నవ్వులు గోల. సాయంత్రం కాగానే శ్రీరమణ గారి తో ముచట్లు. ఎట్లాంటి రోజులవి. ఎంత బంగారు సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు అవి ! వెలిగిన రోజులవి. ఒక సాయంత్రం శ్రీరమణ గారి కలిస్తే నవ్వుతూ అన్నారు కదా" మీ గురువు గారిని కాస్త మమ్మల్ని క్షమించి దయ చూడమనవచ్చు కదా మీరు" "ఏమీ సర్? ఏవయ్యింది," "నేనిలా అన్నానని మీరు ఆయనతో చెప్పండి చాలు" నేను మరుసటి రోజు పతంజలి గారిని కలిసి శ్రీరమణ గారు ఇలా అన్నారు, ఏమిటి సర్ విషయం అని అడిగా. "నిన్న ఒక ఎడిటోరియల్ వ్రాసాను మిత్రమా" అన్నారు పతంజలి గారు. అది తెచ్చుకుని చదివా. నాకు గుర్తున్నంతరకు దానిపేరు "ఒక చిరునవ్వు, ఒక వెక్కిరింత, ఒక లేమి" అటువంటి ఒక సాహితీ చురక వ్రాయలన్నా, దానిని పుచ్చుకుని సిగ మల్లెగా దరించాలన్నా, సరస్వతీ దేవి అద్దంలో తనను చూసుకుంటూ వ్వే వ్వే వ్వే అనుకొడమే. లేరిక అటువంటి సాహితీవేత్తలు. రారిక ఆ మత్తేభాలు, శార్దూలాలూ. బాపు రమణల గురించి కానీ , ఆ కాలం సాహితీ జనం గురించి కాని, ఎన్ని కబుర్లు, ఎన్ని విశేషాలు ఆయన దగ్గర ఉండేవో! ఫలానా కథ గురించి చెప్పాలన్నా, ఫలానా సాహితీ విశేషం గురించి ముచ్చటించాలన్నా, ఆనాటి సినిమా తెర వెనుక ముచట్ల వంటి అల్లం మురబ్బా ఘాటు నుండి శార్వరి నుండి శార్వరి దాక ఎన్ని విశేషాల లోతుల్లోకి మునకలు వేయించేవారో! శార్వరి నుండి అంటే నాకు గుర్తుకు వచ్చింది , రమణగారు మీరు నాకు విశ్వనాథ వారి నవల సెట్టు బాకి ఉన్నారు. మాట దక్కించుకోకుండా ఎలా వెల్లిపోయారు మీరు? మా ఇద్దరికి ఉన్న మరో పిచ్చి స్టేషనరీ. రంగు రంగు కాగితాలు పెన్నులు పెన్సిల్లు, క్లిప్పులు. తాను మదరాసు లో ఉన్నప్పుడు కొన్న సరంజామా గురించి చక్కగా వినిపించేవారు. ఆయనకు గుర్తు వచ్చినప్పుడల్లా నా పైలట్ ఎలాబో పెన్నును అడిగి తీసుకుని దాన్ని అలా ఇలా తిప్పి చూసేవారు. జాగ్రత్తగా ఉంచుకొండి దీన్ని, చాలా ఖరీదైన పెన్ను కదా ఇలా చొక్కా జేబుకు తగిలించుకు తిరగవద్దు, అని హెచ్చరించేవారు. పదేళ్ల క్రితమే దాని ధర పన్నెండు వేల రూపాయలు. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ. అన్నం పెట్టే విద్యకు సంబంధించిన టూల్స్ ని ఇలా భక్తి గా కొనుక్కునే నా గుణం పై ఆయనకు చాలా మక్కువగా అనిపించేది. మేము చివరిసారిగా కలవడానికి ముందు ఇంటికి పిలిచి ఒక మంచి తోలు బ్యాగు కానుకగా ఇచ్చారు. ’"నాకు దీని క్వాలిటీ బాగా నచ్చిందండి, రెండు తీసుకున్నా. నాకొకటి, మీకొకటి. ఇప్పుడు అవన్నీ తలుచుకున్న కొద్ది బాధగా ఉంటుంది. మనమేం పుణ్యం పెట్టి పుట్టాం ఇంత అభిమానం, ప్రేమ పొందడానికి. నేను స్కూటర్ కొన్న కొత్తలో కార్టూనిస్ట్ జయదేవ్ గారూ, నేనూ ఒక పత్రికలో కలిసి పని చేసేవాళ్లం. నాకు ఆయన్ని స్కూటర్ మీద ఎక్కించుకుని తిరగాలని చాలా కోరిగ్గా ఉండేది. ఆయనకు నా డ్రయివింగ్ మీద అపనమ్మకం కాబోలు. ఎపుడు రమ్మన్నా, మీరు పదండి అన్వర్, నేను మీ వెనుకే నడుచుకుంటూ వస్తా గా అని నవ్వేవాడు. నేను కారు కొనబోతున్న కొత్తలో కార్ల గురించి శ్రీరమణ కబుర్లు పెట్టేవాణ్ణి. ఆయనా చాలా విషయాలు చెప్పేవారు కార్ల గురించి , బెజవాడలో నవత డ్రయివింగ్ స్కూలు వారి గురించి, వారితో స్నేహం, బాపు గారు వ్రాసి ఇచ్చిన లోగో గురించి. సర్, నేను కారు కొన్నాకా నా కారు ఎక్కుతారా మనం కలిసి తిరుగుదామా అనేవాడ్ని, తప్పకుండా అండి అని ఆయనా భరోసా ఇచ్చారు. కానీ మేము ఇద్దరమూ వేరే కార్లు ఎక్కి తిరిగాము కానీ, మా కారు మాత్రం ఎక్కి తిరగలా. అది ఎందుకో కుదరలా. ఒకసారి ఒక ప్రయాణం ప్రపోజల్ పెట్టారు. ఏవండీ ఓడ ఎక్కి శ్రీలంక వెళ్లి వద్దామా? ప్రయాణం భలే బావుంటుంది. మీరు వస్తాను అంటే మీకు కూడా టికెట్ బుక్ చేపిస్తా అన్నారు . అయితే ఓడ కన్నా ముందే కరోనా వచ్చింది. ప్రయాణం మునకేసింది.ఆయన హాస్యమూ, చురకా రెండూ పదునైనవి దానికి ఎటువంటి మినహాయింపులు ఉండేవి కావు. ఫలానా ఆయన ఈయనకు బాగా దగ్గరివారు అనుకుంటామా ,ఆ దగ్గరి వారిపైన అయినా ఒక చురక వేయవలసి వస్తే వేయడమే కానీ మన పర అని ఏమి ఉండేవి కావు. బాపు గారి దగ్గర ఉండి ఉండి రమణ గారికి కూడా బొమ్మల లోతుపాతులు కొంతమేరకు తెలుసు . పిచ్చి బొమ్మ, వంకర, బొమ్మ, బొమ్మ తక్కువ బొమ్మ, మేధావి బొమ్మ ల మీద ఆయనకు బాగా చిన్న చూపు. ఇదంతా దొంగ బొమ్మల సంగతి. అలా అని ఆయనతో పికాసో గురించో, లక్ష్మాగౌడ్ గురించో, తోట వైకుంఠం గురించో మాట్లాడి చూడండి. పులకించి పోతూ చెబుతారు. ఒకసారి ఒక పత్రికాఫీసులో మేమిద్దరం కబుర్లు చెబుతూ కూచున్నామా, స్కానింగ్ డిపార్ట్మెంట్ నుండో , ఆర్ట్ డిపార్ట్మెంట్ నుండో ఒకాయన వచ్చి "సర్ ఆర్టిస్ట్ బొమ్మ వేసి ఇంటికి వెల్లిపోయారు, అయితే బొమ్మ ఏది పై భాగమో, ఏది కింది భాగమో అర్థం అవడం లేదు. మీరు కాస్త చెప్పండి అన్నారు. ఆయన ఆ బొమ్మని ఎత్తి పట్టుకుని " ఈ బొమ్మని ఇలాగే ఎడిట్ పేజీలో ఆర్టికల్ కి ఉపయోగించుకోండి, ఇదే బొమ్మని కుడివైపుకు తిప్పి ఎడిట్ పేజిలోనే ఆ చివర ఒక కవిత వస్తుంది కదా, దానికి వాడుకోండి. బొమ్మని ఎడమ వైపుకు తిప్పి పెట్టుకుని ఆదివారం అనుబంధంలో కథకు ఇలస్ట్రేషన్ గా పెట్టుకోండి. ఇక ఈ రోజు మన కార్టూనిస్ట్ రాకపోతే ఆ కార్టూన్ ప్లేస్ లో ఈ బొమ్మని తలకిందులు చేసి పెట్టుకుంటే సరిపోతుంది" మొహంలో కోపం, విసుగు, చిరాకు ఏమీ లేకుండా ఆయన అలా కూల్ గా చెబుతుంటే , మనం పేపరాఫీసు పైకప్పు ఎగిరి పోయేలా నవ్వుతూ ఉంటే ఏం మర్యాద? రమణ గారు ఒక రచయితకు ముందు మాట వ్రాస్తూ ఇలా అన్నారు" మనం ఒక పుస్తకం అచ్చుకి ఇస్తున్నాము అంటే దాని అర్థం , ఒక వెదురు పొదను సమూలంగా నాశనం చేస్తున్నామని . ఒక వెదురు పొద పచ్చగా బ్రతకాలా? లేదా మీ పుస్తకం బయటికి రావాలా అనేది మీ విజ్ఞత కే వదిలేస్తున్నా.చెప్పాగా, ఆయనకు నేనంటే వాత్సల్యం ఉండేది. లక్షల రూపాయల పనులని ఆయన నాకు ఇప్పించారు. ఆయన వ్రాసిన ఒక పుస్తకానికి నేను బొమ్మలు వేసి ఋణం కొద్దిగా మాత్రమే తీర్చుకున్నాను. ఆయన వెంకట సత్య స్టాలిన్ పుస్తకానికి బొమ్మలు వేద్దామని నాకు చాలా కోరిగ్గా ఉండేది. శ్రీరమణ గారికి ఉన్న అభిమానుల్లో ఒక పెద్ద అభిమాని చిత్రకారులు శ్రీ మోహన్ గారు. ముచ్చట పడి ఆయన వెంకట సత్య స్టాలిన్ కి బొమ్మలు వేస్తానని చెప్పి వేసి పెట్టారు. నిజానికి ఆ బొమ్మలు ఏమీ బాగో ఉండవు. ఆ దగ్గర శ్రీరమణ గారు హెల్ప్ లెస్. అయితే శ్రీ మోహన్ గారు, శ్రీరమణ గారు చిలకల పందిరి అని ఒక సూపర్ డూపర్ హిట్ శీర్షిక నడిపారు. ఆ రచన, ఆ బొమ్మలు బంగారం మరియూ తావే. మోహన్ గారన్నా, ఆయన వచనం అన్నా, ఆయన రేఖలు అన్నా శ్రీరమణగారికి కూడా చాలా ముచ్చట. ఆ మధ్య పాత పుస్తకాలు వెదుకుతుండగా ఆయన సోడా నాయుడు కథకి గోపి గారు వేసిన నలుపూ తెలుపు బొమ్మ నా కంటపడింది. ఎంత అందం . కథంత అందం ఆబొమ్మది. పత్రికాఫీసుల్లో పని చేసారు కదా ఆయనకు చాలా చాలామంది చిత్రకారులతో పరిచయం , చాలా దగ్గరితనం ఉండేది . అయితే ఆయన రచనలకు బాపు గారు తెచ్చిన అందం ఎవరూ తేలేదు, తేలేరు కూడా. వ్యక్తిగతంగా , వృత్తిగతంగా కూడా ఆయనకు ఇష్టమైన చిత్రకారులు బాపు కాకుండా మోహన్ గారు గిరిధర్ గౌడ్ గారు మాత్రమే నని నాకు తెలుసు. ఈ రోజు ఉదయం శ్రీరమణ గారిని చివరి చూపుగా పలకరించడానికి ప్లోటిల్లా అపార్ట్మెంట్ కి వెళ్ళాము నేను, కవి నాయుడు గారు. రమణ గారు అద్దాల పెట్టె లో పడుకుని ఉన్నారు. అలా మాటడకుండా, నిశ్శబ్దంగా ఉంటే ఆయనేం శ్రీరమణ? నా కంటి అద్దాల లోపల నీరు గిర్రున తిరిగింది, అద్దాలు తీసు కళ్ళు తుడుచుకునే పని చేయలేదు. ఆ గాజు పెట్టె లో నిలువెల్లా ఆయన నాకు కనపడుతున్నారు. ఏదో లోపం, ఏదో తప్పు జరిగింది, నేనేదో మరిచిపోయా. కొంత కాలం క్రితం ఒకసారి మా ఇద్దరి మాటల్లో మనం ఎవరి ఇంటికయినా వెడుతూ వారికి ఏమీ పట్టుకు వెడితే బావుంటుంది? మనం ఖర్చు పెట్టే రూపాయ ఎట్లా వృధా పోకుండా ఉండాలి? ఆ ఇంట్లో వాళ్లకు షుగర్ ఉంటే ఎలా? ఈ పూలు, బొకేలు అవీ పట్టుకు పోతారు కదా, పూలు ఎట్లాగూ వాడిపోతాయి కదా ,దానికి డబ్బులు దండగ కదా అని శ్రీరమణ గారితో మాటలు పెట్టుకున్నాను . దానికింత గొడవెందుకండి? ఏదయినా పట్టుకు వెళ్ళొచ్చు. ఆ ఇంట్లో వయసు పెద్ద వాళ్ళే ఉండి , వారికి షుగర్ ఉంటే మాత్రమేం? తీసుకు వెళ్ళిన స్వీట్లు వాళ్ళ ఇంట్లో పిల్లలు తింటారు, పిల్లలు లేకపోతే పక్కింటి వారికో, లేదా వారి పనివారికో పంచుతారు.పూల బొకేలు ఇస్తే డబ్బులు దండగ ఏమీ కాదు. పూల గుత్తిని చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందండి . వాంగో సన్ ప్లవర్స్ పెయింటింగ్ లాగా, దాని రంగులు, రెక్కలు చూస్తూ గడపవచ్చు కదా. అప్పుడు ఇంటికి ఇంటికి వచ్చిన వారెవరైనా ఎక్కడిది పూలగుత్తి, ఏమిటి విశేషం అని అడిగితే " మమ్మల్ని చూడ్డానికి ఇంటికి అన్వర్ గారు వచ్చి వెళ్లారు , మా కోసం పూలు పట్టుకు వచ్చారు" అని సంతోషంగా చెప్పుకుంటారు కదా. శ్రీరమణ గారు ఈ రోజు మీకొక పూల మాల తేవాల్సింది నేను. తేనందుకు మీరు ఫీల్ అయ్యేది ఏమీ లేదు. సింహాల మధ్య తిరిగి ఉండి కూడా నేను మర్యాద తెలీని శిష్యుడిగా మిగిలిపోలా! ఇపుడు ఏం చేసేది? బుద్ది లేని జన్మ. థూ! ఒకసారి నేను ఒక కథ చదివాను . వేలూరి శివరామశాస్త్రి గారిది. కథ పేరు 'తల్లి లేని పిల్ల"ఆ కథలో ఇలా ఉంటుంది "చిట్టెమ్మ మేకల మంద నడుమ కూచుంది . చుట్టూ పది పన్నెండు దుత్తలు, ఐదారుచెంబులూ. చిట్టెమ్మ కొడుకు రాఘువులు మేకపాలతో ఒక చిన్న గుంట అలికి దానిలోనూ, ఒక చిన్న రాతి తొట్టిలోనూ కుక్కలకూ, కుక్క పిల్లలకూ మేకపాలు పోస్తున్నాడు. రాఘువులు తండ్రి నాగాయ మంద చివర నించుని మేకలని పరీక్ష చేసి పళ్ళు కదిలిన వానికి క్షౌరం చేసి చక్రాంకితాలు వేశాడు. కొన్ని మేకల డెక్కల నడుమ ముళ్ళు లాగాడు. ఒక మేకవి కాలిమీది వెంట్రుకలు లిక్కితో కోసి నెత్తురు కంటచూసి- 'ఓరే నాయనా! ఉప్పుపెట్టి రుద్దు" అని పురమాయించాడు" నాగాయ తన కొడుకును పురమాయిస్తే పురమాయించాడు కానీ, నాకు అనుమానాలు, ఎందుకుని ఈ చక్రాంకితాలు, అదీనూ పళ్ళుకదిలినవాటికే ఎందుకు? లిక్కి దూసి మేక నెత్తురు పరీక్ష చెయ్యడం అదేవిటి? సరే ఉప్పు రాయడం ఎందుకో కాస్త అంచనాకు అందిందనుకో. ఎవరిని అడిగితే వీటికి సమాధానం దొరకాలి? అపుడు నాకు ప్రతి ప్రశ్నకు సమాధానంగా శ్రీరమణ గారు ఉండేవారు. మహానుభావుడు కేవలం ఆధునిక సాహిత్యాన్ని, ప్రాచీన వాగ్మయాన్ని చదువుకున్న మనిషే కాదు. జీవితాన్ని పరిశీలనగా చూసిన వాడు కూడా . పల్లెలో పుట్టి పెరిగినవాడు, అన్నీ తెలుసు. తెలిసిన వాటిని విప్పి చెప్పే హృదయం ఉంది. ఇలా ఉన్న హృదయాలన్ని మూసుకుపోయి ఇప్పుడు మనసు లేని మనస్సుల , మనుష్యుల మధ్య బ్రతకడం ఎంత కష్టమో, చికాకో సింహాల మధ్య తిరిగిన మీకు ఏమి తెలుస్తుంది ? చెప్పినా ఏమి అర్థమవుతుంది. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి దిన పత్రిక -
తప్పును అంగీకరిస్తున్నా.. దయచేసి క్షమించండి: ఆదిపురుష్ రైటర్
భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్’ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. రామాయణం ఇతీహాసం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతీసనన్ జానకిగా నటించారు. సాంకేతికపరంగా ఈ చిత్రం మెప్పించినా.. కంటెంట్ పరంగా మేకర్స్ చేసిన పొరపాట్లతో కొన్ని సన్నివేశాలు రామాయణానికి విరుద్ధంగా తీర్చిదిద్దారనే విమర్శలు వచ్చాయి. మరోవైపు పలు వివాదాలు కూడా ఈ చిత్రాన్ని చుట్టుముట్టాయి. అయితే తాజాగా ఈ చిత్ర డైలాగ్ రైటర్ మనోజ్ ముంతశిర్ క్షమాపణలు కోరారు. సోషల్ మీడియా వేదికగా తాము చేసిన తప్పును అంగీకరిస్తున్నట్లు పోస్ట్ చేశారు. (ఇది చదవండి: సరిగ్గా 127 ఏళ్ల క్రితం.. భారత్లో అడుగు పెట్టిన 'సినిమా' ) మనోజ్ ముంతశిర్ తన ఇన్స్టాలో రాస్తూ.. ' ఆదిపురుష్ సినిమా వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. అందువల్ల నా రెండు చేతులు జోడించి.. మీ అందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. ప్రభు బజరంగ్ బలి మమ్మల్ని ఐక్యంగా ఉంచి.. మన పవిత్రమైన సనాతన, గొప్ప దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించుగాక.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. జూన్ 16న థియేటర్లలోకి వచ్చిన ఆదిపురుష్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. విజువల ఎఫెక్ట్స్ మినహాయిస్తే.. ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అంతేకాకుండా ఈ చిత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. దీంతో రచయిత మనోజ్ ముంతశిర్ సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కోరారు. (ఇది చదవండి: 15 ఏళ్లలో 11వ సినిమా.. బెడ్ షేర్ చేసుకుని ఉండుంటే..: నటి) View this post on Instagram A post shared by Manoj Muntashir Shukla (@manojmuntashir) -
'ఆదిపురుష్' రైటర్కు బెదిరింపులు.. చంపేస్తామని!
'ఆదిపురుష్' మూవీ విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. సినిమా రిజల్ట్ ఏంటనేది పక్కనబెడితే.. రైటర్ మనోజ్ ముంతాషిర్ గత కొన్నిరోజుల నుంచి హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ఆయన్ని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ విషయం సినీ వర్గాలు, అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకీ అసలేం జరుగుతోంది? మాట మార్చడమే కారణమా? 'ఆదిపురుష్' సినిమాని రామాయణం ఆధారంగా తీశారు. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు. అయితే ఒరిజినల్ స్టోరీతో పోల్చి చూస్తే.. ఇందులో కొన్ని సీన్స్ కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకొందరు ట్రోల్స్ చేశారు. ఈ విషయమై తాజాగా స్పందించిన రైటర్ మనోజ్.. తాము తీసింది రామాయణం కాదని, కేవలం స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పుకొచ్చారు. Mumbai Police provides security to dialogue writer of #Adipurush, Manoj Muntashir after he sought a security cover citing a threat to his life. Police say that they are investigating the matter. (File photo) pic.twitter.com/1WiWiOhclo — ANI (@ANI) June 19, 2023 (ఇదీ చదవండి: రావణుడు లుక్పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. అందుకే ఇలా!) ఫ్యాన్స్ కి మండింది! అయితే 'ఆదిపురుష్' రిలీజ్ కి ముందు ఒకలా మాట్లాడిన రైటర్ మనోజ్.. థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత మాట మార్చడం అభిమానులకు నచ్చలేదు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ వరకు పర్వాలేదు గానీ ఓ వ్యక్తి మాత్రం చంపేస్తా అంటూ సదరు రైటర్ ఇంటికి లెటర్ పంపించాడు. దీంతో ఇతడు పోలీసులను ఆశ్రయించాడు. వాళ్లు ఇతడికి స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆ లేఖ ఎవరు పంపించారనేది దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పుకొచ్చారు. హద్దులు దాటుతున్న అభిమానం ఓ సినిమా నచ్చడం, నచ్చకపోవడం వ్యక్తిగత అభిప్రాయం. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని షేర్ చేయడం వరకు ఓకే. కానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం ఏదైనా సినిమాలో చిన్న సీన్ నచ్చకపోయినా సరే మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. 'ఆదిపురుష్' రైటర్ విషయంలోనూ జరిగిందిదే అనిపిస్తోంది. ఏదేమైనా సరే ఈ సోషల్ మీడియా వల్ల విపరీత పోకడలు కనిపిస్తుండటం భయం కలిగిస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి మాత్రం!)