అసలే ఎండలు.. ఆపై విద్యుత్ కోతలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు.
నగరంలో విద్యుత్ సాంకేతిక సమస్యలు
పెరిగిపోతున్న ఎండ వేడిమి
అల్లాడిపోతున్న నగరవాసులు
విజయవాడ : అసలే ఎండలు.. ఆపై విద్యుత్ కోతలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా కొద్దిరోజులుగా నగరంలో ఆకసిక్మంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. ఎండ వేడిమికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు కాలిపోవడం వల్లే ఈ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే బుధ, గురువారాల్లో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు నరకయాతన అనుభవించారు. బుధవారం రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు సింగ్నగర్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు పడ్డారు. అర్ధరాత్రి సరఫరా లేక ఎండ వేడిమి, దోమల బెడదతో జనం విలవిల్లాడిపోయారు.
అలాగే, గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న లైలా భవనం సమీపంలోని ఇండోర్ స్టేడియంలో సాంకేతిక సమస్య ఎదురైంది. 33 కేవీ అండర్ గ్రౌండ్లైను వైర్లు కాలిపోయాయి. దీంతో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఐదారు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయి సూర్యారావుపేట, బందర్రోడ్డు తదితర ప్రాంతాల్లోని ప్రజలు నానా అగచాట్లు పడ్డారు. అనంతరం విద్యుత్ అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి రెండు ప్రాంతాల్లో సరఫరాను పునరుద్ధరించారు.