ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్: నగరంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల గ్రౌండ్ నుంచి సిబ్బంది బయలుదేరి ఆర్టీసీ బస్టాండు, అద్దంకి బస్టాండు, ట్రంకురోడ్డు, మిరియాలపాలెం మీదుగా చర్చి సెంటర్ వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం మానవహారం నిర్వహించారు. సమైక్యాంధ్ర డాక్టర్స్ జేఏసీ జిల్లా కన్వీనర్ డాక్టర్ కే సీతారామయ్య మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని సోనియాగాంధీ అగౌరవపరుస్తోందని మండిపడ్డారు. రాహుల్గాంధీని ప్రధానమంత్రిని చేయడమే ఆమె ఎజెండా అని మండిపడ్డారు.
డాక్టర్ వెంకయ్య మాట్లాడుతూ తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆశయాన్ని కాపాడాలని కోరారు. ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ నల్లూరి రాఘవరావు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచ్ ప్రతినిధులు సీహెచ్ చలమయ్య, కేశవ, కృష్ణారావు, ఆలూరి భాస్కరరావు, జయకిషోర్, రవికుమార్, యామినేని శ్రీధర్, విజయ్కుమార్, నామినేని కిరణ్కుమార్, పోలవరపు హరీష్, వెంకటరావు, నరసింహారావు, హనుమారెడ్డి, మెడికల్ కాలేజీ విద్యార్థుల జేఏసీ కన్వీనర్ రాహుల్ రాథోడ్, నాయకులు పీ వెంకటేశ్వర్లు, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ రాయపాటి జగదీష్, నగర కన్వీనర్ సీహెచ్ అశోక్, నాయకులు జగన్నాథం, మహేష్, నర్సింగ్ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం
Published Sat, Aug 10 2013 4:33 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement
Advertisement