న్యూఢిల్లీ: సమైక్యాంధ్రకు మద్దతుగా పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకోవాలని సీమాంధ్ర ఎంపీలు నిర్ణయించారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఈరోజు ఉదయం ఎంపీ లగడపాటి రాజగోపాల్ నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చించినట్లు తెలుస్తోంది.
భేటీ అనంతరం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా పార్లమెంట్లో కేవలం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని అడ్డుకుంటామని తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ఎంపీలు హర్షకుమార్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఎస్పీవై రెడ్డి, కనుమూరి బాపిరాజు తదితరులు హాజరయ్యారు.