
జలదంకి: భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ముందు భార్య తన పిల్లలతో కలిసి ఆందోళనకు దిగింది. ఈ ఘటన మండలంలోని గట్టుపల్లిలో శనివారం జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. గట్టుపల్లికి చెందిన సయ్యద్ అల్లాభక్షుకు కావలి తుఫాన్నగర్కు చెందిన సభానాతో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఐదేళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. అనంతరం వీరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో సభానా కావలిలోని పుట్టింటికి పిల్లలతో సహా వెళ్లిపోయింది.
అనంతరం భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే రెండేళ్ల క్రితం అల్లాభక్షు ఆత్మకూరుకు చెందిన తస్మితను పెళ్లి చేసుకుని గట్టుపల్లిలో ఉంటున్నాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న సభానా తన ఇద్దరి పిల్లలతో కలిసి శనివారం భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. దీంతో రెండో భార్య తస్మితను అల్లాభక్షు తండ్రి ఇంటి వద్దకు తీసుకెళ్లాడు. అల్లాభక్షు మాత్రం తాను రెండో పెళ్లి చేసుకోలేదని, తనకు అనారోగ్య సమస్య ఉందని, దీంతో తనకు తోడుగా ఉంటుందని తస్మితతో సహజీవనం చేస్తున్నట్లు చెబుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment