
'కాపులకు వెయ్యికోట్లు అన్నావ్..ఏమైంది బాబు'
కుల రాజకీయాలు చేయటంలో చంద్రబాబు నాయుడు ఘనుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ : కుల రాజకీయాలు చేయటంలో చంద్రబాబు నాయుడు ఘనుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో ప్రెస్మీట్లో మాట్లాడుతూ 'చేనేతకు, కాపులకు వెయ్యేసి కోట్లు ఇస్తామన్నారు...ఏమైంది చంద్రబాబు. కాపులను బీసీల్లో చేరుస్తామన్నారు.
బీసీలకు నమ్మకం కలిగించి చేస్తామన్నారు అది ఏమైంది. ఇప్పుడు కాపులను బీసీల్లో చేర్పించడానికి ఎవరు అడ్డు తగిలారు. చంద్రబాబు కుల రాజకీయాలు ఆడటంలో నేర్పరి...గతంలో ఎస్సీ వర్గీకరణలోనూ ఇదే చేశారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఇలాగే చేస్తారు. హామీ ఇస్తారు, మళ్లీ దీనిపై కోర్టులకు వెళ్లేలా చంద్రబాబే చేస్తారు. ఇలాంటి వాటిలో సిద్ధహస్తుడు. ఇవాళ కాపులను బీసీల్లో చేర్చే విషయంలోనూ ఇదే చేస్తారు. దీని కోసం అన్నీ సిద్ధంగా పెట్టుకున్నారు' అన్నారు.