జన కెరటం | ys jagan mohan reddy tour in west godavari | Sakshi
Sakshi News home page

జన కెరటం

Published Wed, Mar 5 2014 3:05 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

జన కెరటం - Sakshi

జన కెరటం

 పాదయూత్రను తలపించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్ షో


 అడుగడుగునా ఆత్మీయ నీరాజనం పలికిన ప్రజలు


 హారతులు పట్టి దీవించిన మహిళలు


 ఏడు నెలల బాబుకు ‘రాజారెడ్డి’పేరు


 స్వార్థ రాజకీయ శక్తులపై నిప్పులు చెరిగిన జననేత


 నిడదవోలు జనభేరి సభకు పోటెత్తిన జనం


 ‘అమ్మ ఒడి’ పథకం అమలు చేస్తామని పునరుద్ఘాటన


 డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ


 అన్నదాతలకు ఆసరాగా నిలుస్తామని.. వృద్ధుల్ని ఆదుకుంటామని వెల్లడి


 వైసీపీలో చేరిన కాంగ్రెస్, టీడీపీ నేతలు
 
 జన కెరటం ఉప్పొంగింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట వెల్లువెత్తి సాగింది. ‘వైఎస్సార్ జనభేరి’ పేరిట ఎన్నికల సమర శంఖారావం పూరించేందుకు ‘పశ్చిమ’లో రెండోరోజు పర్యటించిన జననేతకుఅడుగడుగునా ఆత్మీయ నీరాజనం పలికింది. రోడ్ షోను పాదయూత్ర తరహాలో నడిపించి రాజకీయూల్లో కొత్త అధ్యాయూన్ని లిఖించింది. మంగళవారం ఉదయం నల్లజర్ల మండలం ఘంటావారిగూడెంలో వైఎస్ జగన్ ప్రారంభించిన రోడ్ షో రాత్రి 8.30 గంటల సమయంలో నిడదవోలు పట్టణానికి చేరింది. నిడదవోలు గణేష్ చౌక్‌లో నిర్వహిం చిన జనభేరి సభకు అశేష జనవాహిని తరలిరాగా.. విశ్వసనీయత.. విలువలతో కూడిన రాజకీయూలు మాత్రమే తనకు తెలుసని వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం అహరహం కృషి చేస్తానని.. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా.. సీమాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయ శక్తులపై నిప్పులు చెరిగారు.
 
 సాక్షి, ఏలూరు:
 ‘మండుటెండను లెక్క చేయకుండా.. మొహంలో చిరునవ్వును చెరిగిపోనివ్వకుండా నా కోసం ఎంతోసేపటినుంచి ఎదురుచూస్తున్న అక్కలు.. చెల్లెళ్లు.. తమ్ముళ్లు అన్నయ్యలు.. అవ్వలు.. తాతలకు అండగా నేనుంటా. రాజన్న రాజ్యం రాగానే మీ కష్టాలన్నీ తీరుస్తా’నంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘పశ్చిమ’ జనం గుండెలను తట్టిలేపారు. ‘వైఎస్సార్ జనభేరి’ కార్యక్రమంలో భాగంగా రెండో రోజైన మంగళవారం నల్లజర్ల, దేవరపల్లి, నిడదవోలు మండలాల్లో జననేత రోడ్ షో నిర్వహించారు. నల్లజర్ల మండలం ఘంటావారిగూడెంలో వైఎస్ జగన్ బస చేసిన భవనం వద్దకు ఉదయం 7గంటల నుంచే అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నారు. పలువురు ముఖ్య నేతలు, అభిమానులతో ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. అక్కడి నుంచి ఉదయం 10 గంటలకు రోడ్ షో ప్రారంభం కాగా, అడుగడుగునా ఆయనకు జనం హారతులు పట్టారు. అడుగడుగునా కాన్వాయ్‌కు ఎదురొచ్చి ఆయనను మాట్లాడాల్సిందిగా కోరారు.
 
  వికలాంగులు, చిన్నపిల్లలు, విద్యార్థులు జననేతను పలకరించేందుకు ఉత్సాహం చూపించారు. ప్రతి వీధి, ప్రతి సెంటర్ జనంతో నిండిపోయాయి. అదుపు చేయలేనంతగా ప్రజలు రోడ్లపైకి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రారంభం నుంచే జనం తాకిడి తీవ్రంగా ఉండటంతో రోడ్ షో మెల్లగా ముందుకు సాగింది. కాన్వాయ్ దూబచర్ల రాగా.. అప్పటికే ఎదురుచూస్తున్న మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అవ్వలను, చిన్నారులను వైఎస్ జగన్ ఆప్యాయంగా ముద్దాడారు. ముసుళ్లకుం టలో జనం కష్టాలు విన్నారు. పుల్లలపాడు, నల్లజర్లలో ఆశ, అంగన్‌వాడీ వర్కర్లు న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని, తమను పట్టించుకునేవారే లేరని జననేతకు మొరపెట్టుకున్నారు. ‘మన ప్రభుత్వం వచ్చాక అన్ని సమస్యలను పరిష్కరిస్తా’నని ఆయన భరోసా ఇచ్చారు. నల్లజర్లలో వెల్లువెత్తిన జనవాహినిని ఉద్దేశించి జగన్ కాసేపు ప్రసంగించారు. కొద్ది రోజుల్లోనే రాజన్న రాజ్యం వస్తుందని, ఆ రోజు డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ‘అమ్మ ఒడి పథకంతో మీ పిల్లల భవిష్యత్ బం గారం చేస్తా’నన్నారు.
 
  ఆలస్యమవుతున్నందున ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నానని, అన్యధా భావించవద్దని విజ్ఞప్తి చేసి అక్కడి నుంచి ముందుకు కదిలారు. తెలుగుదేశం పార్టీకి చెందిన అయ్యవరం సర్పంచ్ మానూరి వెంకన్న, ప్రకాశరావుపాలెం మండల టీడీపీ బీసీ సెల్ నాయకులు శనగల సతీష్‌గౌడ్ ఈ సందర్భంగా వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అచ్చన్నపాలెంలో 18ఏళ్ల చెవిటి, మూగ యువ తి ఉర్ల స్వప్న తనకు పింఛన్ రావడం లేదని సైగలతో వైఎస్ జగన్‌కు తన గోడు వెళ్లబోసుకుంది. ఆమెకు అర్థమయ్యేలా చేతి సైగలతో సంభాషించారు. పింఛన్ ఎందుకు రావడం లేదని వైఎస్ జగన్ ప్రశ్నించగా, తనకు తెలియదని ఆ యువతి సమాధానమిచ్చింది. ఆ సమయంలో ఆ పరిసరాల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.
 
  మన ప్రభుత్వం రాగానే నీలాంటి చెల్లెమ్మలకు రూ.వెరుు్య పింఛన్ అందిస్తానని ఆయన ఆ యువతి కన్నీళ్లు తుడిచారు. కాన్వాయ్ దేవరపల్లి మండలం సూర్యనారాయణపురం మీదుగా యర్నగూడెం సెంటర్‌కు చేరుకోగా, అక్కడ ఏఎంసీ మాజీ చైర్మన్ ఎన్.రాజేంద్రబాబు తన అనుచరులతో వైసీపీలో చేరారు. గ్రామానికి చెందిన కొయ్యరాజు, స్వర్ణ దంపతుల ఏడు నెలల బాబుకు రాజారెడ్డి అని వైఎస్ జగన్ నామకరణం చేశారు. అక్కడి బస్టాండ్ వద్ద గల వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అనంతరం త్యాజంపూడి చేరుకున్నారు. అమ్మేపల్లి, కోరుమామిడి, తాడిమళ్ల, కాటకోటేశ్వరం, సూరాపురం, తిమ్మరాజపాలెం మీదుగా నిడదవోలు చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, హర్షవర్దన్ విద్యాసంస్థల చైర్మన్, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి దేశెట్టి కేశవ హరిప్రసాద్ వైసీపీలో చేరారు.
 
  అనంతరం నిడదవోలు గణేష్ చౌక్‌కు చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డికి అశేషంగా తరలివచ్చిన ప్రజలు కేరింతల నడుమ ఘన స్వాగతం పలికారు. అక్కడి జనసంద్రాన్ని ఉద్దేశించి దాదాపు 30 నిమిషాలపాటు జగన్‌మోహన్‌రెడ్డి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. నమ్మించి వంచించిన పార్టీలకు, పాలకులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నేర్పిన విశ్వసనీయత.. విలువలకు కట్టుబడి ఉంటానని చెప్పారు.  వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమానికి అవసరమైన అన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. సభానంతరం చింతల పూడి బయలుదేరి వెళ్లిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాత్రి అక్కడే బస చేశారు.
 
  నేడు చింతలపూడి నుంచి ఖమ్మం జిల్లాలోకి రోడ్‌షో
 చింతలపూడి, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం చింతల పూడి నుంచి రోడ్‌షో ద్వారా ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించనున్నారు. నిడదవోలు జనభేరి సభ అనంతరం గోపాలపురం, జంగారెడ్డిగూడెం మీదుగా రోడ్‌షో ద్వారా మంగళవారం రాత్రి జగన్‌మోహన్‌రెడ్డి చింతలపూడి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త మద్దాల రాజేష్‌కుమార్ గృహంలో రాత్రి బస చేశారు. బుధవారం ఉదయం చింతలపూడి నుంచి మల్లాయగూడెం, పోతునూరు, రాఘవాపురం, లింగగూడెం మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ ఖమ్మం జిల్లాకు వెళతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement