
వైఎస్ జగన్ బెయిలుపై విడుదల
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి ఈ సాయంత్రం చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి ఈ సాయంత్రం చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నాంపల్లిలోని ప్రత్యేక సీబీఐ కోర్టు జగన్కు నిన్న సాయంత్రం బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కోర్టు కోరిన షూరిటీలు సమర్పించిన తరువాత జగన్ విడుదల ఉత్తర్వులపై న్యాయమూర్తి దుర్గాప్రసాద్రావు మంగళవారం సంతకం చేశారు. కోర్టు సిబ్బంది ఆ ఉత్తర్వులను చంచల్గూడ జైలు అధికారులకు అందజేశారు. కోర్టు ఆదేశాలను పరిశీలన తర్వాత జైలు అధికారులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విడుదల చేశారు.
గతంలో ఉన్న విధంగా ప్రభుత్వం బులెట్ ప్రూఫ్ వాహనాన్ని, భద్రతా సిబ్బందిని సమకూర్చింది. జగన్ విడుదల సందర్భంగా జైలు వద్దకు భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. జైలు వద్ద కోలాహలంగా ఉంది. చంచల్గూడ జైలు పరిసరాలన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. జగన్ బయటకు రాగానే అభిమానుల ఆనందానికి హద్దులులేకుండా పోయింది. జైలు నుంచి బయటకు వచ్చిన జగన్ నవ్వుతూ ప్రజలకు అభివాదం చేశారు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటకీ అభిమానులను అదుపు చేయడం కష్టమైపోయింది.