
సాక్షి, ఇడుపులపాయ : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చక్రయ్యపేట మండలంలోని వీరన్నగట్టుపల్లిలో గల గండి వీరాంజనేయస్వామి క్షేత్రాన్ని శనివారం దర్శించారు. ఆలయ పూజారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. వైఎస్సార్ కడప జిల్లా నుంచే ఇతర కాకుండా జిల్లాల నుంచి కూడా అభిమానులు వైఎస్ జగన్తో పాటు ఆలయానికి తరలిరావడంతో పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆంజనేయస్వామిని దర్శించుని వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబ సమేతంగా వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ప్రజాసంకల్పయాత్ర ప్రారంభానికి ముందు వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని, అమీన్ పీర్ దర్గాను దర్శించిన సంగతి తెలిసిందే. అయితే 14 నెలల పాటు కొనసాగిన పాదయాత్ర విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆయన మొక్కులు చెల్లించుకునేందుకు సంకల్పించుకున్నారు. గురువారం అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లిన వైఎస్ జగన్.. సామాన్య భక్తునిలా క్యూ లైన్లో వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. వైఎస్ జగన్ శుక్రవారం అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి ఆచారం ప్రకారం వైఎస్ జగన్ చాదర్ సమర్పించారు. కాగా, మరికాసేపట్లో వైఎస్ జగన్ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించనున్నారు.