సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం తథ్యం
Published Sat, Aug 17 2013 5:57 AM | Last Updated on Sat, Aug 11 2018 8:00 PM
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం తథ్యమని ఆ పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం చింతూరులో దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా ప్రజల గుండెల్లో దివంగత సీఎం వైఎస్ఆర్ చిరస్మరణీయంగా నిలిచారని అన్నారు. ఆయన ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో ఏర్పాటైన వైఎస్ఆర్ సీపీని బలీయ శక్తిగా రూపొందించేందుకు, పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు శ్రేణులు కృషి చేయాలని కోరారు. వైఎస్ఆర్ సీపీ ప్రభంజనాన్ని చూసి కాంగ్రెస్, టీడీపీ తట్టుకోలేకపోతున్నాయని, వాటి నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. వైఎస్ఆర్ సీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదనే విషయాన్ని ప్లీనరీ స్పష్టంగా చెప్పిందన్నారు. కేంద్రం తండ్రి పాత్ర పోషించి, ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని పార్టీ కోరుతోందని చెప్పారు.
తెలంగాణలో వైఎస్ఆర్ సీపీ బలహీనపడిందంటూ కాంగ్రెస్-టీడీపీ సాగిస్తున్న దుష్ర్పచారాన్ని పార్టీ శ్రేణులు సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలంతా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చగల సత్తా కేవలం ఆయనకు (జగన్మోహన్ రెడ్డికి) మాత్రమే ఉందని నమ్ముతున్నారని చెప్పారు. వై ఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే.. పోల వరం ముంపు ప్రాంతంలోని రైతులకు ఎకరాకు మూడులక్షల రూపాయలను ఇప్పిస్తుందని, చింతూరు మండలంలోని నేలకోట, వీఆర్పురం మండలంలో దయ్యాలమడుగు ప్రాజెక్టులను పూర్తిచేయిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు తెల్లం వెంకట్రావు (భద్రాచలం), తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట), నాయకులు కడియం రామాచారి, ఎండి.మూసా, మానె రామకృష్ణ, రామలింగారెడ్డి, మన్మధ హరి, జమాల్ఖాన్, సుధాకర్, చిట్టిబాబు, ఆసిఫ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement