
2022 నాటికి 21శాతం ఉద్యోగ ముప్పు
సాక్షి, ముంబై: 2022 సంవత్సరానికి నైపుణ్యతల కొరత కారణంగా కనీసం 21 శాతంమందికి ఉద్యోగ ముప్పు తప్పదని ఫిక్కి తాజా నివేదికలో పేర్కొంది. దేశంలో భవిష్య ఉద్యోగాల భద్రత అంశంపై నిర్వహించిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలను వెల్లడించింది. 132 పేజీల రిపోర్టును శుక్రవారం వెల్లడించింది. దేశంలో జనాభాపరమైన మార్పులు, ప్రపంచీకరణ, భారతీయ పరిశ్రమల ఆధునిక సాంకేతికీకరణ లాంటి వివిధ అంశాలపై ఇదిఆధారపడి ఉంటుందని రిపోర్ట్ చేసింది. నైపుణ్య ఆధారితవిద్య అవసరాన్నినొక్కి చెప్పడంతో పాటు ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు ఇతర పరిశ్రమలు ప్రారంభ దశలోనే ఈ మస్య పరిష్కారానికి మార్గాలు అన్వేషించాలని ఫిక్కి సూచించింది.
నివేదిక ప్రకారం 2022 నాటికి ముఖ్యంగా ఐటీ రంగంలో నిపుణులు అత్యధిక ముప్పు ఎదుర్కొంటారని నివేదించింది. ఈనేపథ్యంలో ఇక్కడ నైపుణ్యాల ఆవశ్యకత చాలా ఉందని పేర్కొంది. 2022 నాటికి 20-30శాతం ఐటీ రంగ నిపుణులు తమ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదంలో పడనున్నారని అంచనా వేసింది. అలాగే వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్, వైర్లెస్ నెట్వర్క్, నిపుణులు, డేటా ఎనలిస్టులు, యాండ్రాయిడ్ డెవలపర్ తదితర కేటగిరీల్లో భవిష్యత్తు ఉద్యోగాలుంటాయని తెలిపింది. అలాగే వస్త్ర, ఆటోమొబైల్ , రిటైల్ వంటి ఇతర రంగాలు కూడా వేగంగా మారతాయని తెలిపింది.
ప్రపంచంలో ఆన్లైన్ ఉద్యోగాల్లో 24శాతంతో భారీ స్థానాన్ని ఆక్రమించిన భారత్లో ఉద్యోగాల కల్పనలో రాబోయే ఏళ్లలో ఆన్లైన్, ఎక్స్పోనెన్షియల్ టెక్నాలజీ రంంలో అగ్రభాగంలోనూ, టెక్నాలజీ ఎగ్రిగేటర్ మోడల్ ఉబెర్ లాంటివి రెండవ కీలక రంగంగా ఉంటుందని తెలిపింది. అంతేకాదు ప్రభుత్వం, విధాన రూపకర్తలు రెండు-మూడు సంవత్సరాల కాలాన్ని ఉపయోగించుకోవాలని ఈ నివేదిక సిఫార్సు చేసింది. జనరల్, టెక్నికల్, వృత్తిపరమైన విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు తీసుకురావాలని, ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని. పరిశ్రమలు వివిధ స్థాయిలలో ఉద్యోగుల శిక్షణ కార్యక్రమాలతోపాటు డిజిటల్ ఎకానమీ పద్ధతులను అలవర్చుకోవాలని కోరింది.