
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం భారీ షాకిచ్చింది. ఇకపై ఉద్యోగులపై ఇచ్చే ఓవర్ టైం అలవెన్సును నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు పర్సనల్ మినిస్ట్రీ ఒక ఉత్తర్వు చేసింది. దీని ప్రకారం కార్యనిర్వాహక సిబ్బంది మినహా ఇతర ఉద్యోగులకు చెల్లించే ఓవర్ టైం అలవెన్సును రద్దు చేసింది. ఏడవ పే కమిషన్ సిఫారసులకనుగుణంగా ఈ చర్య తీసుకుంది. దీని ప్రకారం, అన్ని మంత్రివర్గ విభాగాలతో పాటు భారత ప్రభుత్వ అటాచ్డ్, సబార్డినేట్ కార్యాలయాలలో ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆపరేషనల్ స్టాఫ్ జాబితాను తయారు చేయవలసిందిగా సంబంధిత విభాగాలను కోరింది.
అత్యవసరమైన సమయంలో అతని/ఆమె సీనియర్ అధికారి సంబంధిత ఉద్యోగి (లు)ను నిర్దేశించినప్పుడు మాత్రమే ఓటీఏ చెల్లించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. కార్యనిర్వాహక సిబ్బంది అంటే నాన్ మినిస్ట్రీరియల్ గెజిటెడ్ సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగులు, విద్యుత్ లేదా యాంత్రిక పరికరాల సహాయంతో పనిచేసే ఉద్యోగులు. అలాగే బయోమెట్రిక్ హాజరు ప్రకారం ఓవర్ టైం భత్యం మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ ఓవర్ టైం అలవెన్స్ లేదా ఓటీ రేటును సవరించేది లేదని ప్రభుత్వం నిర్ణయించింది. 1991 లో జారీ చేసిన ఆర్డర్ ప్రకారమే ఈ చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment