over time
-
సునీతకు ట్రంప్ సొంత డబ్బు ఇస్తానని ఎందుకు ప్రకటించారు?
వాషింగ్టన్: అంతరిక్షంలో 9 నెలలపాటు చిక్కుకుపోయి.. ఎట్టకేలకు నాసా-స్పేస్ఎక్స్ ప్రయోగం ద్వారా తిరిగి భూమ్మీదకు రాగలిగారు బచ్ విల్మోర్, సునీతా విలియమ్స్లు. బైడెన్ హయాంలో వాళ్లను వెనక్కి రప్పించడంలో నాసా విఫలం కాగా.. ఆ పనిని తాము చేశామంటూ ట్రంప్ ప్రభుత్వం గర్వంగా ప్రకటించుకుంది. అయితే వాళ్లకు చెల్లించాల్సిన జీతభత్యాలపై విమర్శలు రావడంతో స్వయంగా అమెరికా అధ్యక్షుడే స్పందించాల్సి వచ్చింది.వ్యోమగాములు సునీతా విలియమ్స్(Sunita Williams), బచ్ విల్మోర్లు అంతరిక్షంలో అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు గడిపారని.. అందుకుగానూ వాళ్లకు జీతభత్యాలేవీ అందలేదని పాత్రికేయులు తాజాగా ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ఆయన.. అవసరమైతే తన సొంత డబ్బును వాళ్లకు చెల్లిస్తానంటూ ప్రకటించారు. ఈ క్రమంలోనే వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకురావడానికి సహాయపడిన స్పేస్ ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్కు కృతజ్ఞతలు తెలిపారు.నాసా ఎంత జీతం ఇస్తోందంటే.. నాసా ఉద్యోగులు ఫెడరల్ ఉద్యోగుల కిందకు వస్తారు. శాలరీలు, అలవెన్స్లు.. ఇలాంటి వాటి విషయంలో వ్యోమగాములు భూమ్మీద విధుల్లో ఉన్నప్పుడు, అలాగే అంతరిక్ష ప్రయోగాల టైంలో నాసా ఒకేలా చూస్తుంది. ఈ లెక్కన ఐఎస్ఎస్లో సునీత, విల్మోర్లకు ఒకే తరహా జీతాలు ఉంటాయి. అదనంగా వాళ్లకు చెల్లించేది ఏదైనా ఉంటే.. అది డెయిలీ స్టైఫండ్ కొంత మాత్రమేనని(రోజుకి 4 డాలర్లు.. మన కరెన్సీలో రూ.347) మాత్రమేనని నాసా వ్యోమగామి ఒకరు వెల్లడించారు. కాబట్టి.. 287 రోజులు అంతరిక్షంలో గడిపిన సునీతా విలియమ్స్కు శాలరీ ప్రత్యేకంగా నాసా ఏమీ చెల్లించదు. కాకుంటే.. ఇరువురికి డెయిలీ స్టైఫండ్ కింద 1,148 డాలర్లు(లక్ష రూపాయలు) చెల్లిస్తారంతే.ఇప్పుడు వాళ్లకు వచ్చేది ఎంతంటే..అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(NASA)లో బచ్ విల్మోర్, సునీతా విలియమ్స్లు జీఎస్(General Schedule)-15 పే గ్రేడ్ ఉద్యోగులుగా ఉన్నారు. నాసాలో అత్యధిక జీతం అందుకునే ఉద్యోగులు ఈ గ్రేడ్ కిందకే వస్తారు. వీళ్లకు ఏడాదికి 1,25,133 - $1,62,672 డాలర్ల జీతం (మన కరెన్సీలో Rs 1.08 కోట్ల నుంచి Rs 1.41 కోట్ల దాకా) ఉంటుంది. ఈ 9 నెలలు ఐఎస్ఎస్లో గడిపినందుకు రూ.81 లక్షల నుంచి రూ.కోటి 5 లక్షల దాకా ఇద్దరికీ అందుతుంది. అది డెయిలీ స్టైఫండ్ కలిపి చూస్తే రూ.82 లక్షల నుంచి రూ.కోటి 6 లక్షల దాకా ఉండొచ్చు. అయితే..నాసా డ్యూటీ అవర్స్ 8 గంటలు మాత్రమే. కానీ, అనివార్య పరిస్థితుల్లో ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన సునీత, విల్మోర్లు అదనపు పని గంటలు చేయాల్సి వచ్చింది. అయితే ఫెడరల్ ఉద్యోగుల మార్గదర్శకాల ప్రకారం.. వాళ్లకు ఆ అదనపు పని గంటలకుగానూ ఎలాంటి జీతం చెల్లించడానికి వీల్లేదు. దీనిపై విమర్శలు రావడం మొదలైంది. అందుకే ట్రంప్ ఆ సమయాన్ని ఓవర్ టైం కింద చెల్లిస్తానని ఇప్పుడు ప్రకటించారు.కిందటి ఏడాది జూన్లో నాసా మిషన్ కింద సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి వెళ్లారు. సాంకేతిక సమస్యలతో అక్కడే ఉండిపోవాల్సి రాగా.. నాసా క్రూ 10 మిషన్ ప్రయోగం ద్వారా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయోగంలో భాగంగా.. మార్చి 19వ తేదీ తెల్లవారుజామున స్పేస్ఎక్స్ డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ వాళ్లతో పాటు మరో ఇద్దరు వ్యోమగాములను కూడా సేఫ్గా భూమ్మీదకు తీసుకొచ్చింది. -
ఎక్కువ పనిచేస్తే.. హెచ్చరించే డ్రోన్!
టోక్యో: ఆఫీసులో కునుకు తీస్తున్నారంటే అది గవర్నమెంట్ ఆఫీసై ఉంటుందంటూ చమత్కరిస్తారు. ఇందులో నిజం కూడా లేకపోలేదు. మనదేశంలో ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా ఆఫీసర్లు కునుకు తీస్తున్న, ముచ్చట్లు చెప్పుకుంటున్న దృశ్యాలు కనిపిస్తాయి. అయితే జపాన్ మాత్రం ఇందుకు భిన్నం. అక్కడ వారికి పనే ప్రపంచం. కనీసం నిరసన తెలపాలన్నా కూడా అక్కడివారు ఆందోళనలకు బదులుగా ఎక్కువ పనిచేసి, నిరసన తెలుపుతారట. దీంతో అక్కడి ప్రభుత్వం కార్యాలయాల నుంచి ఉద్యోగులను ఇంటికి పంపడానికి డ్రోన్లను రంగంలోకి దించింది. టైం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆఫీసులోనే ఉంటూ పనిచేస్తుంటే ఈ డ్రోన్ పసిగట్టేస్తుంది. డ్రోన్ కెమెరాల ద్వారా ఉన్నతాధికారులు పరిశీలించి, సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటున్నారు. జపాన్ చట్టాల ప్రకారం ఓ ఉద్యోగి నెలలో 100 గంటలకు మించి పని చేయకూడదు. కానీ జపాన్ మాత్రం తీవ్రమైన ‘కరోషి’ సమస్యతో బాధపడుతోందట. కరోషీ అంటే పనిచేస్తూ ఆఫీస్లోనే చనిపోవడం. దీనికి పరిష్కారంగానే డ్రోన్లను రంగంలోకి దించి, ఉద్యోగులను వేళకు ఇంటికి పంపేస్తున్నారు. -
పాతికేళ్లుగా ఓటీ ఎగ్గొట్టారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఊహించని షాక్ తగిలింది. ట్రంప్పై ఆయన మాజీ డ్రైవర్ సోమవారం ఓ దావా వేశాడు. వెట్టిచాకిరీ చేయించుకుని తనకు సరైన వేతనం చెల్లించలేదని పిటిషన్లో సదరు వ్యక్తి ఆరోపించాడు. పైగా ఓటీ వేతనం ఎగ్గొట్టారని ఆరోపిస్తూ... 2 లక్షల డాలర్లు చెల్లించాల్సిందేనని ట్రంప్ను డిమాండ్ చేస్తున్నాడు. వాషింగ్టన్: ట్రంప్ దగ్గర నోయెల్ సింట్రోన్(59) ఇరవై ఏళ్లుగా డ్రైవర్గా విధులు నిర్వహించారు. 2016లో ట్రంప్ అధ్యక్షుడిగా నామినేషన్ వేశాక.. ఆయన దగ్గర నోయెల్ పని మానేశారు. అయితే ఆ ఇరవై ఏళ్ల కాలంలో ట్రంప్ తనకు ఏనాడూ ఓటీ సొమ్మును చెల్లించలేదని, ట్రంప్ కుటుంబం మొత్తం తనతో వెట్టిచాకిరీ చేయించుకుందని ఆరోపిస్తున్నారు. పైగా న్యూయార్క్ చట్టాలను ఉల్లంఘించి అధిక గంటలు పని చేయించుకున్నారని.. ఓటీ జీతం చెల్లించలేదని నోయెల్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఓటీ వేతనం కింద 2 లక్షల డాలర్లు.. కోర్టు ఖర్చులు, అటార్నీ ఫీజు అన్నీ కలుపుకుని మొత్తం 3,50,000 డాలర్లు చెల్లించాలంటూ ట్రంప్పై నోయెల్ దావా వేశారు. ఈ వ్యవహారంపై ట్రంప్ కంపెనీల కార్యదర్శి ఒకరు స్పందిస్తూ.. ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. కోర్టులోనే వ్యవహారం తేల్చుకుంటామని వారు చెబుతున్నారు. తెలంగాణలో ట్రంప్ ఫ్యాన్.. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ !
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం భారీ షాకిచ్చింది. ఇకపై ఉద్యోగులపై ఇచ్చే ఓవర్ టైం అలవెన్సును నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు పర్సనల్ మినిస్ట్రీ ఒక ఉత్తర్వు చేసింది. దీని ప్రకారం కార్యనిర్వాహక సిబ్బంది మినహా ఇతర ఉద్యోగులకు చెల్లించే ఓవర్ టైం అలవెన్సును రద్దు చేసింది. ఏడవ పే కమిషన్ సిఫారసులకనుగుణంగా ఈ చర్య తీసుకుంది. దీని ప్రకారం, అన్ని మంత్రివర్గ విభాగాలతో పాటు భారత ప్రభుత్వ అటాచ్డ్, సబార్డినేట్ కార్యాలయాలలో ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆపరేషనల్ స్టాఫ్ జాబితాను తయారు చేయవలసిందిగా సంబంధిత విభాగాలను కోరింది. అత్యవసరమైన సమయంలో అతని/ఆమె సీనియర్ అధికారి సంబంధిత ఉద్యోగి (లు)ను నిర్దేశించినప్పుడు మాత్రమే ఓటీఏ చెల్లించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. కార్యనిర్వాహక సిబ్బంది అంటే నాన్ మినిస్ట్రీరియల్ గెజిటెడ్ సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగులు, విద్యుత్ లేదా యాంత్రిక పరికరాల సహాయంతో పనిచేసే ఉద్యోగులు. అలాగే బయోమెట్రిక్ హాజరు ప్రకారం ఓవర్ టైం భత్యం మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ ఓవర్ టైం అలవెన్స్ లేదా ఓటీ రేటును సవరించేది లేదని ప్రభుత్వం నిర్ణయించింది. 1991 లో జారీ చేసిన ఆర్డర్ ప్రకారమే ఈ చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది. -
డ్యూటీ కన్నా ఓటీ పైనే ప్రేమ
గంట పనికి మరో గంట వేతనం అదనం సింగరేణి సంస్థపై పెరుగుతున్న ఆర్థిక భారం గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణి సంస్థలో సాధారణంగా నిర్వహించే డ్యూటీ కన్నా ఆ తర్వాత వచ్చే ఓవర్టైమ్ (ఓటీ) పైనే కొందరు ఉద్యోగులు ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల అదనంగా వేతనాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో కంపెనీపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. భూగర్భ గనులు, ఓపెన్కాస్ట్ ప్రాజెక్టుల్లో యంత్రాలు పనిచేసే చోట, వర్క్షాపులు, సంబంధిత విభాగాల్లో ఓటీ డ్యూటీలు ఎక్కువగా ఉంటున్నాయనేది స్పష్టమవుతోంది. గనుల్లో ఏదైనా యంత్రం నిలిచిపోతే మరమ్మతు పేరుతో ఉన్న సమయాన్ని సదరు టెక్నీషియన్లు వెచ్చిస్తున్నారు. అయితే తిరిగి ఆ యంత్రానికి అవసరమైన పరికరాన్ని తీసుకెళ్లి బిగిస్తేనే అది నడుస్తుంది. ఆ తర్వాతనే అది బొగ్గు ఉత్పత్తిలో భాగస్వామ్యమవుతుంది. అయితే నిలిచిపోయిన యంత్రాలకు తక్కువ సమయంలో మరమ్మతు చేయాల్సి ఉన్నప్పటికీ కొందరు టెక్నీషియన్లు కావాలనే కాలక్షేపం చేస్తూ తన డ్యూటీ సమయం అయిపోయిందని వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో సంబంధిత సెక్షన్ సూపర్వైజర్లు, అధికారులు సదరు టెక్నీషియన్ను బతిమిలాడి యంత్ర మరమ్మతులు పూర్తిచేయడానికి ఓవర్టైమ్ కేటాయిస్తున్నారు. ఇందుకోసమే వేచిచూసే వారు ఆ యంత్రానికి మరమ్మతులు చేపట్టి ఓవర్టైమ్ పొందుతున్నట్లు తెలుస్తోంది. గంట సమయం అదనంగా పనిచేస్తే రెండు గంటల ఓవర్టైమ్ వేతనాన్ని యాజమాన్యం చెల్లిస్తోంది. దీంతో సాధారణ డ్యూటీ కన్నా ఓటీ పనులపైనే దృష్టి పెడుతున్నట్లు గుర్తించిన యాజమాన్యం ఓటీల సంఖ్యను తగ్గించి డ్యూటీ సమయంలోనే యంత్రాల మరమ్మతులు చేయించేలా ఆయా గనులు, ఓసీపీల అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఓటీలను ఇవ్వడాన్ని ప్రోత్సహిం చకూడదని క్షేత్రస్థాయి అధికారులకు సూచించినట్లు తెలిసింది. అయితే యంత్రాలు మరమ్మతులకు గురైనపుడు అవసరమైన స్పేర్పార్ట్స్ అందుబాటులో ఉంచాల్సిన యాజమాన్యం అలా చేయకపోవడం వల్లనే ఓటీలలో పనిచేయాల్సి వస్తున్నదనే వాదన సైతం వినిపిస్తోంది. ఈ విధానంపై పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరిగితేనే ఓటీల సంఖ్య తగ్గే అవకాశం ఉందని సీనియర్లు పేర్కొంటున్నారు.