
న్యూఢిల్లీ: జీఎస్టీ ఎగవేతలను నిరోధించేందుకు సోదాలు, స్వాధీనాలతో పాటు అరెస్ట్లు తదితర అంశాలను చూసేందుకు జీఎస్టీ కమిషనర్ (ఇన్వెస్టిగేషన్) కార్యాలయాన్ని కేంద్ర రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసింది. తొలి కమిషనర్గా నీరజ్ ప్రసాద్ నియమితులయ్యారు. వ్యాపారులు కొత్త పన్ను చట్టానికి మళ్లేందుకు, అలవాటు పడేందుకు కొంత కాలం చూసీ, చూడనట్టు వ్యవహరించిన కేంద్రం ఇప్పుడు తీవ్ర చర్యలకు రంగం సిద్ధం చేసింది.
జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడాది దాటిపోవడం, పన్ను వసూళ్లల్లో ఏమంత వృద్ధి లేకపోవడంతో... ఎగవేతలను గుర్తించడం ద్వారా పన్ను వసూళ్లను పెంచడంపై దృష్టి సారించాలని కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం నిర్ణయించింది. ఇందులో భాగంగానే జీఎస్టీ కమిషనర్ కార్యాలయం ఏర్పాటయిందని... విధాన, న్యాయపరమైన అంశాలు, సోదాలు, స్వాధీనాలు, అరెస్ట్లు, విచారణ, ఎక్సైజ్ చట్టం, సేవా పన్నుకు సంబంధించిన అంశాలను కమిషనర్ చూస్తారని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ జారీ చేసిన సూచనల్లో పేర్కొంది.