
ప్రభుత్వ గ్యారంటీ లేదు
స్టాక్ మార్కెట్లో ఈపీఎఫ్ఓ పెట్టుబడులపై దత్తాత్రేయ వివరణ
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ(ఎంప్లాయూ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్) స్టాక్ మార్కెట్లో పెడుతున్న పెట్టుబడులకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్కెట్ ఒడిదుడుకుల ఆధారంగా ఈ రాబడులు ఉంటాయని, అందుకే ప్రభుత్వం ఈ పెట్టుబడులకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వదని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవని కొన్ని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయని ఆయన రాజ్యసభకు వివరించారు. ఈపీఎఫ్ఓ ఈ ఏడాది ఆగస్టు 6 నుంచి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)ల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తన ఇంక్రిమెంటల్ డిపాజిట్లలో 5 శాతం వరకూ ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేయాలని ఈపీఎఫ్ఓ యోచిస్తోంది.
స్టాక్మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్తో కూడుకున్నదేనని భావించినప్పటికీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ-ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణాయక విభాగం) స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్న ప్రతిపాదనకు పచ్చజెండా ఊపిందని దత్తాత్రేయ వెల్లడించారు. కాగా ఈపీఎఫ్ఓ ఈ ఏడాది ఆగస్టు 6 నుంచి నవంబర్ 30 వరకూ ఈటీఎఫ్ల్లో రూ.3,174 కోట్లు ఇన్వెస్ట్ చేసిందని ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా మంగళవారం పార్లమెంట్కు నివేదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓకు రూ.1.2 లక్షల కోట్ల ఇంక్రిమెంటల్ డిపాజిట్లు వస్తాయని అంచనా. ఈ లెక్క ప్రకారం ఈపీఎఫ్ఓ ఈ ఆర్థిక సంవత్సరంలో ఈటీఎఫ్ల్లో రూ.6,000 కోట్ల ఇన్వెస్ట్ చేయనున్నది.