
ఎస్బీఐ చార్జీల నుంచి ఇలా తప్పించుకోండి..
మినిమం బ్యాలెన్స్ను ప్రతి నెలా మెయింటెన్ చేయలేక అవస్థలు పడుతున్న ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) శుభవార్త చెప్పింది.
సాక్షి, న్యూఢిల్లీ : మినిమం బ్యాలెన్స్ను ప్రతి నెలా మెయింటెన్ చేయలేక అవస్థలు పడుతున్న ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, స్మాల్, బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులను మెయింటెన్స్ రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు శనివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
ఎస్బీఐ తాజా నిర్ణయంతో 13 కోట్ల మంది ఖాతాదారులు లాభపడనున్నారు. ఎస్బీఐకు మొత్తం 43 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. నెలవారీ రుసుము బాధ నుంచి ఉపశమనం పొందాలనుకునే వారికి మరో ఆప్షన్ కూడా ఇచ్చింది ఎస్బీఐ. సేవింగ్స్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయలేని వారు తమ ఖాతాలను బేసిక్స్ సేవింగ్స్ అకౌంట్కు మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పింది.
బేసిక్ సేవింగ్స్ అకౌంట్ అంటే..
పేదవారిని ఉద్దేశించి ప్రారంభించనదే ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ అకౌంట్. మామూలు సేవింగ్స్ ఖాతాలా బేసిక్ సేవింగ్స్ అకౌంట్ నుంచి నెలకు నాలుగు సార్ల కంటే ఎక్కువగా డబ్బును డ్రా(బ్యాంకులో డ్రా, ఏటీఎం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్) చేయకూడదు. ఒక వేళ చేస్తే ఒక్కసారికి రూ.50+ ట్యాక్స్లు(ఎస్బీఐలో డ్రా చేస్తే), రూ. 10+ట్యాక్స్(ఎస్బీఐ ఏటీఎంలో డ్రా చేస్తే), రూ.20+ట్యాక్స్(వేరే బ్యాంకుల ఏటీఎంలో డ్రా చేస్తే) రుసుము చెల్లించాల్సివుంటుంది.