
సాక్షి, న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం యూనిటెక్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. యూనిటెక్ వ్యవహారంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) నిర్ణయాన్ని తప్పుపట్టిన అత్యున్నత ధర్మాసనం బుధవారం ఈ కేసును విచారించింది. సంస్థను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలన్న ఎన్సీఎల్టీ ఆదేశాలపై స్టే విధించింది. గృహ కొనుగోలుదారులు, ఇతర ఇన్వెస్టర్ల ప్రయోజనాలకోసం ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను జనవరి 12కి వాయిదా వేసింది.
యూనిటెక్ స్వాధీనంపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి, ఎన్సీఎల్టీ భారీ షాకిచ్చింది. ఎన్సీఎల్టీ ఆదేశాలపై సంక్షోభంలో చిక్కుకున్న యూనిటెక్ను ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీంతో ఎన్సీఎల్టీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ యూనిటెక్ సుప్రీంను ఆశ్రయించింది. యూనిటెక్ పిటీషన్ మంగళవారం విచారణకు స్వీకరించిన సుప్రీం ఎన్సీఎల్టీ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసును నేటికి వాయిదా వేసింది.
కాగా నిధుల స్వాహా, నిర్వహణ లోపాల అభియోగాలపై యూనిటెక్ బోర్డులోని మొత్తం ఎనిమిది మంది డైరెక్టర్లను సస్పెండ్ చేస్తూ ఎన్సీఎల్టీ డిసెంబర్ 8 ఆదేశాలు జారీచేసింది. అలాగే రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం కొత్తగా పది మంది డైరెక్టర్లను నామినేట్ చేయాలని కేంద్రాన్నిఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలను డిసెంబర్ 20లోగా అందించాలని సూచించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment