
సాక్షి,ముంబై: భారీ నష్టాల్లోంచి తేరుకుని బుధవారం లాభాల్లోకి అడుగుపెట్టిన దలాల్ స్ట్రీట్కు నేడు (గురువారం) వాల్స్ట్రీట్ సెగ తగిలింది. దీంతో ఆరంభంలోనే కీలక సూచీలు భారీగా కుప్పకూలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1000 పాయింట్లు నష్టంతో 34వేల కిందికి, నిఫ్టీ 300 పాయింట్లు క్షీనించి10,200 స్థాయి కిందికి దిగజారాయి. దీంతో కేవలం 5 నిమిషాల్లో సుమారు రూ.4లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. బీఎస్ఇ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కసారిగా 134.38 లక్షలకోట్ల రూపాయలకు పడిపోయింది.
మార్కెట్లో దాదాపు 175 స్టాక్స్ 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, భారతీ ఎయిర్ టెల్, బాంబేడైయింగ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , దీపక్ ఫెర్టిలైజర్స్, ఫినోలెక్స్,హెచ్ఏఎల్ తదితర కంపెనీలు ఇందులో ఉన్నాయి. మరోవైపు డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 26పైసలు క్షీణించి రూ.74.47 పైసలతో జీవన కాల గరిష్ఠానికి చేరింది.
ఆసియా మార్కెట్లు, అమెరికా మార్కెట్లు బాగా నష్టపోవడం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ కుదించింది. ఈ రెండు దేశాలూ వచ్చే ఏడాదిలో వాణిజ్య వివాద ప్రభావాలను చవిచూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఎస్ అండ్ పి 500 3.29 శాతం నాన్డాక్ కాంపోజిట్ ఇండెక్స్ 4.08 శాతం, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ క్యాజువల్ 2.2 శాతం నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో తైవాన్ సూచీ 5.21 శాతం, జపాన్ నిక్కి 3.7 శాతం, కొరియాకు చెందిన కోస్పి 2.9 శాతం షాంఘై కాంపోజిట్ 2.4 శాతం క్షీణించాయి.
Comments
Please login to add a commentAdd a comment