
పట్నా: బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు చంపారన్ జిల్లాలో బస్సు రోడ్డుపక్కనున్న లోతైన గుంతలో పడి మంటలు చెలరేగటంతో దాదాపు 20 మంది వరకు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. అయితే, మృతుల సంఖ్య కచ్చితంగా తెలియట్లేదు. 28వ నంబర్ జాతీయ రహదారిపై కొట్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్వా గ్రామ సమీపంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ముజఫర్పూర్ నుంచి ఢిల్లీ వైపు వస్తున్న ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి రోడ్డు పక్కనున్న లోతైన గుంతలో పడింది.
ఆ వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికుల్లో 20 మందికి పైగా చనిపోయినట్లు తూర్పు చంపారన్ కలెక్టర్ ధ్రువీకరించారని మంత్రి దినేష్ చంద్ర యాదవ్ తెలిపారు. బస్సు కిటికీ అద్దాలు పగులగొట్టుకుని గాయాలతో బయటపడిన 11 మందిని వెంటనే ఆస్పత్రికి తరలించామని డీఎస్పీ మురళి మాంఝీ చెప్పారు. అయితే, ఘటన సమయంలో బస్సులో డ్రైవర్, హెల్పర్ కాకుండా 13 మంది మాత్రమే ఉన్నారని స్థానిక టీవీ చానెల్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment