
సాక్షి, నల్గొండ : జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భీభత్సం సృష్టించారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బాంబులు, బీరుసీసాలతో దాడులు చేసుకుని సామాన్య జనాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం నాయకుని తండాలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జరిగిన ఓ గొడవ టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వివాదానికి దారితీసింది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు బాంబులతో, బీరుసీసాలతో దాడులు చేసుకున్నారు.
ఈ దాడిలో తండాలోని దాదాపు 20 ఇళ్లు ధ్వంసం కాగా కొన్ని మోటార్ బైకులు కూడా పాడయ్యాయి. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ గొడవల నేపథ్యంలో తండాలో ఉండలేక, పలువురు ఇళ్లు విడిచి పారిపోతున్నారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి.

Comments
Please login to add a commentAdd a comment