
సాక్షి, ముంబై : మహరాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది.కులాంతర వివాహం చేసుకున్న యువ జంటపై స్వయంగా అమ్మాయి తరపు బంధువులే కిరోసిన్ పోసి నిప్పంటించారు. సంఘటన మహారాష్ట్ర అహ్మద్నగర్ జిల్లాలోని నిగోజ్ గ్రామంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మే 1వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
మంగేష్ రాన్సింగ్(23),రుక్మిణి(19) కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు. అయితే కులాలు వేరుకావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. చివరకు మంగేష్ తల్లిదండ్రుల సమక్షంలో గత అక్టోబరులో వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవలే మంగేష్తో రుక్మిణికి గొడవ జరిగింది. దీంతో ఆమె ఏప్రిల్ 30న తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. రుక్మిణిని తీసుకెళ్లేందుకు మంగేష్ మే 1న అత్తగారింటికి వచ్చాడు. ఇదే అదనుగా భావించిన రుక్మిణి బంధువులు మంగేష్ను తీవ్రంగా చితకబాదారు. అనంతరం కన్నకూతురు అన్న కనికరం కూడా ఒక గదిలో బంధించి తాళం వేసి మరీ ఈ దంపతులపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. అయితే వీరి అరుపులను గమనించిన పొరుగువారు వారిని ఆసుపత్రికి తరలించారు.
50 శాతం త్రీవ గాయాలతో ప్రస్తుతం మంగేష్ శరీరం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కానీ మృత్యువుతో పోరాడిన రుక్మిణి మాత్రం చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూసింది. ఈ ఘటనకు సంబంధించి బాధితుల వాంగ్మూలం ఆధారంగా రుక్మిణి తండ్రి రమా భర్టియా మరో ఇద్దరు బంధువులు సురేంద్ర భర్టియా, జ్ఞాన్శ్యామ్ సరోజ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తండ్రి రమా భర్టియా పరారీలో ఉండగా, సురేంద్ర, జ్ఞాన్శ్యామ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని స్థానిక పోలీసు అధికారి వెల్లడించారు.