
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసులో సైకో కిల్లర్ శ్రీనివాస్రెడ్డికి ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాతో మాట్లాడారు. హాజీపూర్ వరుస హత్యల కేసులో శ్రీనివాస్రెడ్డి దోషిగా తేలాడని, ముగ్గురు బాలికలను అతను అత్యాచారం చేసి హత్య చేసినట్టు కోర్టు నిర్ధారించిందిన సీపీ భగవత్ చెప్పారు.
అభంశుభం తెలియని బాలికలను శ్రీనివాస్రెడ్డి టార్గెట్గా చేసుకున్నాడని, స్కూలు నుంచి ఇంటికి వెళుతున్న బాలికలకు తన బైక్ మీద లిఫ్ట్ ఇస్తానని నమ్మించి తీసుకెళ్లేవాడని, తన వ్యవసాయ బావి వద్దకు వారిని తీసుకెళ్లి.. అత్యాచారం చేసి, హత్య చేసేవాడని వివరించారు. అతని వ్యవసాయ బావి వద్ద దొరికిన బాధిత బాలిక స్కూల్ బ్యాగ్ ఆధారంగా ఈ వరుస హత్యల కేసు మిస్టరీని ఛేదించామని, ఈ కేసు విచారణలో సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదిక కీలక పాత్ర పోషించాయని, ఈ ఆధారాలతోనే శ్రీనివాస్రెడ్డిని దోషిగా నిరూపించామని తెలిపారు. కర్నూలులో ఓ మహిళను హత్య చేసిన కేసులోనూ శ్రీనివాస్రెడ్డి దోషి అని సీపీ భగవత్ చెప్పారు.