
శంషాబాద్: భర్త ప్రవర్తనతో విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడిన సాప్ట్వేర్ ఇంజనీర్ లావణ్య లహరి కేసులో మరో నలుగురు నిందితులను ఆర్జీఐఏ పోలీసులు రిమాండ్కు తరలించారు. పట్టణంలోని సీఎస్కే విల్లాలో పైలట్ వెంకటేశ్వర్రావుతో కలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన భార్య లావణ్య లహరి నివాసముండేది. భర్త చెడుతిరుగుళ్లతో ఆమె మనస్తాపం చెందింది. అదేవిధంగా వెంకటేశ్వర్రావు భార్యను మానసినంగా వేధిస్తుండేవాడు. ఈనేపథ్యంలో గతనెల 25న సూసైడ్నోట్ రాసిన లావణ్య లహరి సెల్ఫీ వీడియో తీసి బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. (లావణ్య ఆత్మహత్య కేసులో కొత్త కోణం)
లావణ్య ఆత్మహత్యకు కారణమైన ఆమె భర్త వెంకటేశ్వర్రావుతో పాటు అత్తమామలతో పాటు ఆడపడుచు, మరో బంధువుపైనా బంధువులు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆర్జీఐఏ పోలీసులు సోమవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా అద్దంకితో పాటు వరిమడుగు గ్రామంలో తలదాచుకున్న అత్త రమాదేవి, ఆడపడుచులు కృష్ణవేణి, లక్ష్మీకుమారితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసి ఆర్జీఐఏ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈమేరకు వారిని మంగళవారం రిమాండ్కు తరలించారు. వెంకటేశ్వర్రావు తండ్రి సుబ్బారావు పరారీలో ఉన్నాడు. అయితే, ఈ కేసులో ఇప్పటికే పోలీసులు లావణ్య లహరి భర్త వెంకటేశ్వర్రావును రిమాండుకు తరలించారు.