
కృష్ణవేణి మృతదేహం
కావలి అర్బన్: ప్రకాశం జిల్లాకు చెందిన మిట్ల కృష్ణవేణి (32) దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన స్థానిక శివరామ సుబ్బయ్య కాలనీ సమీపంలోని అడవిలో గురువారం వెలుగులోకి వచ్చింది. రెండో పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. అడవిలో మహిళ మృతదేహం ఉందని పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ జీఎల్ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బుధవారం రాత్రి గుర్తుతెలియని కొందరు బొంతరాయితో మహిళ తల వెనుక భాగంలో మోది ఆమెను చీరతో ఉరేయడంతో మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
మృతదేహం వద్ద బ్యాగ్ ఉంది. అందులో బ్యాంక్ పాస్పుస్తకం, ఫోన్, చిల్లర నగదు, ఇతర వస్తువులున్నాయి. పాస్పుస్తకం ఆధారంగా ఆమెది ప్రకాశం జిల్లా పొదిలి సమీపంలోని కొనకనమిట్ల గ్రామంగా గుర్తించారు. కృష్ణవేణి భర్త పేరు శ్రీనివాసులురెడ్డి. మృతదేహాన్ని పోస్ట్మార్టంకోసం స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment