మంత్రుల కాన్వాయ్కు ప్రమాదం
Published Sat, Dec 24 2016 1:08 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM
జంగారెడ్డిగూడెం / కామవరపుకోట : రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాతల కాన్వాయ్ శుక్రవారం ప్రమాదానికి గురైంది. ఏలూరు నుంచి వస్తుండగా, కామవరపుకోట సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మంత్రులిద్దరూ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కాన్వాయ్ జంగారెడ్డిగూడెం వస్తుండగా, కామవరపుకోట సమీపంలో రోడ్డుకు అడ్డుగా మేకలు రావడంతో ముందుగా వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా వేగం తగ్గించాయి. దీనిని వెనుక వస్తున్న వాహనాల డ్రైవర్లు గమనించలేదు. ఫలితంగా ఎస్కార్ట్ జీపును ఒక కారు ఢీకొంది. వెంటనే దాని వెనుక ఉన్న కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎస్కార్ట్ వాహనంలో ఉన్న ఆరుగురు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. మంత్రులిద్దరూ ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుకనుంచి మరో వాహనం ఢీకొనడంతో వెనుక వైపు ఉన్న డిక్కీ డోరు లోపలికి చొచ్చుకుపోయింది. పలు వాహనాల ముందుభాగాలు దెబ్బతిన్నాయి.
Advertisement
Advertisement