నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత లేదని, చేతనైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలుపొందాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై. రామయ్య సవాల్ విసిరారు.
భూమా..చేతనైతే రాజీనామా చేసి గెలువు
Published Fri, Oct 28 2016 1:43 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM
– పార్టీలు మారడం, మోసం చేయడం మీ నైజం
– వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై. రామయ్య
కర్నూలు (టౌన్): నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత లేదని, చేతనైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలుపొందాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై. రామయ్య సవాల్ విసిరారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీలు మారడం, నమ్మిని వారిని మోసం చేయడం భూమా నైజమన్నారు. గతంలో తమ వెంట వచ్చిన ఎమ్మెల్యేలతో గతంలో రాజీనామా చేయించి.. గెలిపించుకున్న ఘనత వైఎస్ జగన్హన్రెడ్డిదని గుర్తు చేశారు. ఇప్పుడు 20 మంది ఎమ్మెల్యేలు ఒకపార్టీ జెండాలో గెలిచి మరోపార్టీ చెంత చేరినా..పదవులను పట్టుకోని వేలాడుతున్నారని విమర్శించారు.
టీడీపీ నేతల్లో భయాందోళన..
ప్రభుత్వానికి ధైర్యముంటే కర్నూలులో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని రామయ్య అన్నారు. టీడీపీని ఛీ కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రత్యేక హోదాపై ఇక్కడ కాదు.. ఢిల్లీ లో ధర్నా చేయాలని చెప్పడం టీడీపీ నేతల అవివేకానికి నిదర్శనమన్నారు. వైఎస్ జగన్ నేతృత్వంలో 2015 సంవత్సరం ఆగస్టు 10వ తేదీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు రైలులో ఢిల్లీకి వెళ్లి నిరాహార దీక్షలు చేసిన సంగతి మరిచిపోయారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ చేస్తున్న ఉద్యమానికి ప్రజల్లో విపరీతమైన మద్దతు వస్తున్నందునే భయాందోళనలకు గురై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలకు చీము, నెత్తురు ఉంటే .. హోదాపై విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలకు సమధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడికి బుర్ర లేదని.. హోదాపై జరిగే సమావేశాలకు వెళితే విద్యార్థులపై కేసులు పెడతామని భయపెట్టడం సిగ్గు చేటన్నారు.
ప్రభుత్వానికి చరమ గీతం పాడుదాం..
రైతులు ఆందోళన చేస్తుంటే, వారికి మద్దతు ఇచ్చారని తనపై నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి వేధిస్తున్నారని పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శౌరి విజయకుమారి మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం మంత్రి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్వాక్రా గ్రూపుల సమావేశంలో కుట్టుమిషన్లు ఇస్తామని ఆశ చూపి సాయంత్రం వరకు కూర్చోబెట్టి కనీసం నీళ్లు, భోజనం పెట్టకుండా పంపించారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదులో టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్ రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్, రఘ, బుజ్జి పాల్గొన్నారు.
Advertisement
Advertisement