నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సీబీసీఎస్
ఏలూరు (ఆర్ఆర్ పేట): ప్రస్తుత కాలంలో విద్యార్థులు మూస విధానంలో సిలబస్ను బట్టీపట్టి మార్కులు సాధిస్తున్నారని, ఈ విధానానికి స్వస్తి చెప్పి క్రియాశీల విలువలను వెలికితీసి నైపుణ్యాలు పెంచుకునే దిశలో పయనించాలని మద్రాస్ విశ్వవిద్యాలయం ఆంత్రోపాలజీ విభాగాధిపతి సుమతి సూచించారు. స్థానిక సెయింట్ థెరిస్సా మహిళా కళాశాలలో గురువారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. విద్యార్థుల్లో స్వయం నిర్ణయక శక్తిని పెంపొందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యస్థాయిలో ఎంపికకు ఆధారమైన జమ వ్యవస్థ (చాయిస్ బేసిడ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్)ను ప్రవేశపెట్టమని సూచించిందన్నారు.
దీని వల్ల విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, సాంఘిక కార్యక్రమాలపై దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి వినూత్న పద్ధతిని ఆవిష్కరిస్తారన్నారు. సీబీసీఎస్ను విద్యాసంస్థల్లో అమలు చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, ముఖ్యంగా బహుముఖ ప్రజ్ఞాశీలులైన ఉపాధ్యాయులు, అత్యాధునిక ప్రయోగశాలలు, కళాశాలల ప్రాంగణాలు సమకూర్చుకోవాల్సి ఉంటుందన్నారు. నాగార్జున వర్సిటీ ప్రొఫెసర్ జీవీ చలం, ప్రిన్సిపల్ డాక్టర్ పి.మెర్సి, సిస్టర్ మరియట్ట పూదోట, మరియట్ట డిమెల్లో, డాక్టర్ మాథ్యూ శ్రీరంగం,అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.