
వర్ధరాజస్వామి దేవాలయంలో మొక్కలు నాటుతున్న మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
- దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి
జగదేవ్పూర్: సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లి దేశ చరిత్రలో నిలుస్తుందని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో వారు పర్యటించి, డబల్బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఎర్రవల్లి ఇళ్లు పేదోళ్ల విల్లాలంటూ కొనియాడారు.
గత 67 ఏళ్లలో దేశంలో ఎక్కడా జరుగని అభివృద్ధి సీఎం కేసీఆర్ హయాంలో జరుగుతోందన్నారు. డబుల్బెడ్రూం పథకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. హైదరాబాద్కు రెండు లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరయ్యాయని, రూరల్ ఏరియాలో రెండు లక్షల 65 వేల ఇళ్లు మంజూరుకు ప్రణాళిక తయారైందని , త్వరలోనే టెండర్లు పూర్తి చేయనున్నట్లు చెప్పారు.
మల్లన్నసాగర్ బాధితులను ఆదుకుంటాం
మల్లన్నసాగర్ బాధితులు అందోళన చెందవద్దని, ప్రభుత్వ తరపున ఆదుకుంటామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి పక్షాలు ముంపు గ్రామాల ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు. రైతులు ఏ జీఓ ప్రకారం నష్టపరిహారం కోరినా అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో గడా అధికారి హన్మంతరావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎలక్షన్రెడ్డి, సర్పంచ్లు భాగ్య, బాల్రెడ్డి, జెడ్పీటీసీ రాంచంద్రం, ఎంపీటీసీ భాగ్యమ్మ, వీడీసీ అధ్యక్షుడు కిష్టారెడ్డి, ఉపాధ్యక్షుడు కృష్ణ, గౌరవ అధ్యక్షులు బాల్రాజు పాల్గొన్నారు.
వర్ధరాజస్వామి ఆలయానికి పూర్వవైభవం తెస్తాం
వర్ధరాజస్వామి దేవాలయానికి పూర్వ వైభవనం తీసుకవస్తామని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆదివారం వర్ధరాజ్పూర్ గ్రామంలోని వర్ధరాజస్వామి దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. రెండో కంచిగా పేరొందిన వర్ధరాజస్వామి ఆలయాన్ని రాష్ట్రంలో నంబర్ వన్ దేవాలయంగా తీర్చిదిద్దుతామన్నారు.
అనంతరం ఆర్చకులు మంత్రికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. మంత్రి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎర్రవల్లి లెజండ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని హనుమాన్, వర్ధరాజస్వామి దేవాలయ ఆవరణల్లో మొక్కలు నాటారు.