Published
Tue, Sep 27 2016 12:43 AM
| Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
ఏటూరునాగారం : ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలోని ఆకులవారిఘణపురం సోమవారం జరిగింది. ఎస్సై 2 వెంకటేశ్వర్రావు కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని ఆకులవారిఘణపురంలో తన తల్లితో కలిసి నివాసముంటున్న మడె రాంచందర్(45) తాడ్వాయి మండలం బంజర ఎల్లాపురం గ్రామంలో మూడు ఎకరాల మిరప తోట, రెండు ట్రాక్టర్లను కొనుగోలు చేశాడు. కుటుంబ వ్యవహరాలు, ట్రాక్టర్ల కొనుగోలు వల్ల అప్పులపాలు కావడంతో ఆర్థిక ఇబ్బందులు భరించలేక పురుగుల మందు తాగాడు. బయటికి వెళ్లిన అతడి తల్లి సారక్క తిరిగొచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉండడంతో ఇరుగుపొరుగువారి సాయంతో అతడిని 108లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే క్రమంలోనే మృతిచెందాడు. మృతుడి భార్యం నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిర్వహించాక మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.మృతుడికి కుమారులు మధు, సాయి, కుమార్తె మధుప్రియ ఉన్నారు. ‘కోడిగుడ్లకు పంపించి కానరాని లోకానికి పోతివా బిడ్డా.. కాటికి కాలు చాపిన నన్ను వదిలేసి ఎట్ల పోతివి బిడ్డా’ అంటూ మృతుడి తల్లి సారక్క రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. ఆస్పత్రిలో రోదనలు మిన్నంటాయి.