అట్టల కంపెనీలో అగ్నిప్రమాదం
సూళ్లూరుపేట: పట్టణంలోని హోలీక్రాస్ సెంటర్లో నిప్పో కంపెనీకి ఇన్సిలేటర్స్ సరఫరా చేసే అట్టల కంపెనీలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పని చేస్తున్న సమయంలో యంత్రం వద్ద చిన్నపాటి మంటలు చెలరేగాయి. ఆ మంటలను అదుపు చేశామని అనుకోవడంతో అది లోలోపల రగులుతూ పెద్ద మంటలై కిటికిలో నుంచి పొగ రావడంతో హోలీక్రాస్ సెంటర్ ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్న హోమ్గార్డు, లారీ అసోసియేషన్ వాళ్లు చూసి అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం అందించారు.అగ్నిమాపక యంత్రం అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తుండగా మరో వైపు మంటలు వ్యాపించాయి. ఎస్సై జీ గంగాధర్రావు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అపాచి కంపెనీకి చెందిన అగ్నిమాపక యంత్రాన్ని కూడా రప్పించారు. రెండు అగ్నిమాపక యంత్రాలు సుమారు రెండు గంటలసేపు కష్టపడి పనిచేస్తే మంటలు అదుపులోకి వచ్చాయి. సాయంత్రం 7 నుంచి అంటుకున్న మంటలు రాత్రి 9 గంటలకు అదుపులోకి వచ్చాయి. ఈ మేరకు కంపెనీ యజమాని జీ ప్రభాకర్రెడ్డినుంచి సమాచారం తీసుకున్నారు. సుమారు లక్ష రూపాయలు విలువచేసే అట్టలు కాలిపోయాయి. అదే విధంగా మరో లక్ష రూపాయలు విలువ చేసే యంత్రాలు, భవనానికి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.