
క్యారమ్స్ ఆడుతున్న ఉద్యోగులు
- పాల్వంచలో టోర్నీ ప్రారంభం
పాల్వంచ: టీఎస్ జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్స్ మహిళలు, పురుష ఉద్యోగుల క్రీడా పోటీలు పాల్వంచలోని టీఆర్సీ ఇండోర్ స్టేడియంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న టోర్నీని కేటీపీఎస్ ఓఅండ్ఎం సీఈ వి.మంగేష్ కుమార్, 5, 6దశల సీఈ పి.రత్నాకర్ ప్రారంభించారు. ఈ పోటీలకు కేటీపీపీ (భూపాల్పల్లి), రామగుండం, విద్యుత్ సౌద(హైదరాబాద్), జూరాల, శ్రీశైలం, కేటీపీఎస్ ఓఅండ్ఎం, కేటీపీఎస్ 5వ దశ, నాగర్జున సాగర్ జట్లు హాజరయ్యాయి. మహిళల విభాగంలో షటిల్ బ్యాట్మింటన్, చెస్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, టెన్నికాయిట్ క్రీడా పోటీలను నిర్వహించారు. పురుషుల విభాగంలో టేబుల్ టెన్నిస్ సింగిల్, డబుల్ కేటగిరీలో ఆడారు. నిత్యం విధి నిర్వహణ ఒత్తిడిలో ఉండే..ఉద్యోగులు క్రీడా పోటీలతో మానసికోల్లాసం పొందారు. వివిధ ప్రాంతాల నుంచి తరలొచ్చిన వారితో..స్టేడియంలో సందడి నెలకొంది. మరో రెండు రోజుల పాటు జరగనున్న పోటీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈలు కె.ఎల్లయ్య, కాలం సంజీవయ్య, జెన్కో స్పోర్ట్స్ ఆఫీసర్ ఎస్.లోహిత్ ఆనంద్, గేమ్స్ సెక్రటరీ వై.వెంకటేశ్వర్లు, ట్రెజరర్ కె.నరసింహ, సభ్యులు వి.హనుమంతరామ, డి.సారయ్య తదితరులు పాల్గొన్నారు.