
రిషితేశ్వరి కేసుపై విచారణ కమిటీ నివేదిక
గుంటూరు:నాగార్జున యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రిషితేశ్వరి కేసుకు సంబంధించిన నివేదికను విచారణ కమిటీ శనివారం ఏపీ ప్రభుత్వానికి అందజేసింది. తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను సర్క్యులేట్ చేయడం వల్లే రిషితేశ్వరి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికలో స్పష్టమైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు వర్శిటీలో కుల సంఘాలు, వాటి కార్యాలయాలు ఉండటం కూడా ఆమె ఆత్మహత్యపై ప్రభావం చూపినట్లు సమాచారం.
ప్రభుత్వానికి నివేదిక అందిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి గంటా శ్రీనివాసరావులు చర్చించారు. దీనిపై గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. రిషితేశ్వరి ఘటనపై చంద్రబాబుతో చర్చించామని.. నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి మరణం తరువాత ఏపీలో ర్యాగింగ్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తానని తాను చంద్రబాబుకు తెలిపినట్లు పేర్కొన్నారు. ర్యాగింగ్ పై అన్ని యూనివర్శిటీలు, కళాశాలల్లో అవగాహన పెంచే చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.