
సౌమ్యుడు, స్నేహశీలి వైఎస్ వివేకానందరెడ్డి
రైల్వేకోడూరు రూరల్: సౌమ్యుడు, స్నేహశీలి వైఎస్ వివేకానందరెడ్డి అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. రైల్వేకోడూరు పట్టణంలోని వైఎస్సార్ అతిథి గృహంలో శనివారం ఎమ్మెల్యే కొరముట్ల ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
జిల్లాలో కేడర్ను బలపరచడానికే..
ఈ సందర్భంగా ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పార్టీ కేడర్ను మరింత బలపరచడానికి వైఎస్ వివేకానందరెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం నిర్ణయించిందని తెలిపారు. నియోజకవర్గ అ«భివృద్ధిలో వైఎస్ వివేకానందరెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారన్న నమ్మకం అందరిలో ఉందన్నారు.
వైఎస్ ఫ్యామిలీకి ఓటు వేసే సువర్ణావకాశం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలోని వారికి ఓటు వేసే సువర్ణావకాశం మనకు దక్కడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కొరముట్ల అన్నారు.
తప్పుడు కేసులకు భయపడవద్దు: వివేకా
అధికార పార్టీకి తప్పుడు కేసులు పెట్టే అలవాటు పరిపాటి అయిందని, తాము అండగా ఉంటామని ఎవరూ భయపడవద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. అందరి అభిప్రాయంతోనే తనను అధిష్టానం ఎంపిక చేసిందని తెలిపారు.
తప్పుడు కేసులతో ఎంపీపీ పదవిని పోగొట్టారు– బాబుల్ రెడ్డి
తప్పుడు కేసులు పెట్టి తనను జైలుకు పంపి ఎంపీపీ పదవిని పోగొట్టారని ముద్దా వెంకటసుబ్బారెడ్డి అలియాస్ బాబుల్రెడ్డి తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడమని పేర్కొన్నారు.
కొల్లంకు ఘన స్వాగతం
కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉన్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ కొల్లం బ్రహ్మానందరెడ్డి శనివారం సమావేశానికి హాజరయ్యారు. ఆయనకు పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు మారెళ్ల రాజేశ్వరి, పట్టణ కన్వీనర్ సీహెచ్ రమేష్, ఉప కన్వీనర్ రౌఫ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నందాబాలా, ఆర్వీ.రమణ, మహేష్, కోడూరు, చిట్వేలి, పుల్లంపేట, పెనగలూరు, ఓబులవారిపల్లె మండల కన్వీనర్లు సుధాకర్ రాజు, చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, ముస్తాఖ్, నరసింహారెడ్డి, వత్తలూరు సాయికిషోర్రెడ్డి, మైనార్టీ నాయకులు ఆదాం సాహేబ్, ఎస్ఎండీ రఫి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్, జిల్లా మైనార్టీ నాయకులు ఎన్.మస్తాన్, నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎం.నాగేంద్ర, క్షత్రియ నాయకులు పాల్గొన్నారు.