
వెంటిలేటర్పై ఉన్న చిన్నారి జ్ఞానసాయి
– పరీక్షలు నిర్వహించిన వైద్యులు
ములకలచెరువు: కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన చిన్నారి జ్ఞానసాయి సోమవారం స్పృహలోకి వచ్చింది. గత శనివారం చెన్నై గ్లోబల్ హాస్పిటల్లో చిన్నారికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం చిన్నారి స్పృహలోకి వచ్చింది. చిన్నారి ఆరోగ్య పరిస్థితి వివరాలు అక్కడి వైద్య బృందం వెల్లడించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలానికి చెందిన ఈ తొమ్మిదేళ్ల చిన్నారికి కాలేయం పూర్తిగా దెబ్బతినడంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్య బాధ్యత తీసుకుంది. కాగా చిన్నారి స్పృహలోకి రావడంతో వైద్యులు రక్త, యూరిన్ తదితర పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించి వివరాలు మంగళవారం వెల్లడించనున్నట్లు వైద్యులు తెలిపారన్నారు. పూర్తిగా చిన్నారి కోలుకునేంతవరకు సుమారుగా వారం రోజుల పాటు ఐసీయూలో పెట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. చిన్నారి తండ్రి రమణప్ప సైతం ఐసీయూలో ఉన్నారు. రమణప్ప తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు వైద్యులు తెలిపారన్నారు. అక్కడి వైద్యులు రమణప్ప పరిస్థితి గమనించి కుమార్తే జ్ఞానసాయిని చూపించడంతో కొద్దిగా మానసిక ఒత్తిడి నుంచి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. 24 గంటల తర్వాత రమణప్పను నార్మల్ వార్డుకు మార్చనున్నారు. ప్రస్తుతానికి ఇద్దరు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.