శుభకార్యానికి వెళ్తుండగా.. | man dies of road accident | Sakshi
Sakshi News home page

శుభకార్యానికి వెళ్తుండగా..

Published Wed, Apr 5 2017 10:51 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

శుభకార్యానికి వెళ్తుండగా.. - Sakshi

శుభకార్యానికి వెళ్తుండగా..

- వెంటాడిన మృత్యువు
- రోడ్డు ప్రమాదంలో వాయిద్య కళాకారుడి దుర్మరణం
- పండుగ పూట విషాదం

తలుపుల : శుభకార్యాల్లో వాయిద్యాన్ని వాయిస్తూ.. వచ్చిన సొమ్ముతో జీవనం సాగించే ఓ వాయిద్య కళాకారుడిని మృత్యువు వెంటాడింది. సీతారాముల కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని పొరుగూరిలో జరిగే కార్యక్రమంలో వాయిద్యాన్ని వాయించేందుకు బయలుదేరగా.. మార్గమధ్యంలోనే మృత్యువు కబళించి, కాటికి పంపింది. పండుగ పూట విషాదం మిగిల్చిన ఈ ఘటన తలుపుల మండలంలో బుధవారం జరిగింది. ఎస్‌ఐ చంద్రశేఖర్‌ కథనం ప్రకారం..

జరిగిందెలాగంటే...
తలుపుల మండలం నూతనకాల్వకు చెందిన వాయిద్యకళాకారుడు జయరాం(47) సహా మరికొందరు ఓబులరెడ్డిపల్లెకు చెందిన మరో ఎనిమిది మంది వైఎస్సార్‌ జిల్లా భూమయ్యగారిపల్లెలో జరగనున్న సీతారాముల కల్యాణంలో బ్యాండు వాయించేందుకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఓదులపల్లి సమీపానికి రాగానే ఆటో అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో జయరాం తలకు బలమైన దెబ్బలు తగిలి అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మిగిలిన వారిలో బాబాఫకృద్దీన్‌, మహేశ్‌, రాజు గాయపడ్డారు.

మిగిలిన వారు అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే 108లో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించగా, జయరాం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. ఘటనపై ఎస్‌ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి భార్య యశోదమ్మ, కుమారులు విజయ్‌కుమార్‌, అనిల్‌కుమార్‌ ఉన్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement